హిడ్మా ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్ కౌంటర్ బూటకమంటూ జాతీయ మానవహక్కుల పరిరక్షణ సంఘం (ఎన్ హెచ్ ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. హిడ్మా ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ హెచ్ ఆర్సీని విజయ్ కిరణ్ అనే న్యాయవాది ఆశ్రయించారు. హిడ్మాది ఫేక్ ఎన్ కౌంటర్ అని తన ఫిర్యాదులో పేర్కొన్న న్యాయవాది హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని కోరారు.   ఎన్‌హెచ్‌ఆర్‌సి మార్గదర్శకాల మేరకు   ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదనీ. తటస్థ అధికారుల ద్వారా దర్యాప్తు జరగలేదనీ ఆయన పేర్కొన్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ లో నిజానిజాలు తెలియాల్సి ఉందని పేర్కొన్న విజయ్ కిరణ్..   హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వాస్తవ సమాచారం  ప్రజలకు వెల్లడించాలన్నారు.  మావోయిస్టులైనా, పోలీసులైనా ఎవరు చేసినా  చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం నేరమేనని పేర్కొన్న ఆయన  హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు.  

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఉన్నత స్థాయి సలహామండలి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ లక్ష్యంగా సీఎం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా చర్యలు ఆరంభమయ్యాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మేరకు 2047 నాటికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అందుకే ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు పది మందితో ఉన్నత స్థాయి సలహా మండలిని నియమించింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 24) అధికారిక ప్రకటన వెలువడింది. అత్య‌ధికంగా ప్ర‌జ‌ల అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్న 10 వ్యాధుల‌కు సంబం ధించి ఒక్కో వ్యాధికి అడ్వ‌యిజ‌రీ గ్రూపు ఏర్పాటు చేశారు.  ఆధునిక సాంకేతిక‌తో మెరుగైన వైద్య సేవ‌ల్ని అందించ‌డానికి గేట్స్ ఫౌండేష‌న్, టాటా ఎండి, ఐఐటి చెన్నై స్వ‌స్థి వంటి సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో   ప్ర‌ణాళిక‌లు అమ‌ల‌వుతున్నాయి. వీటితో పాటు ప‌లు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వం స్పాన్సర్ చేస్తున్న ఆరోగ్య ప‌థ‌కాలూ నడుస్తున్న సంగతి తెలిసిందే.   ఈ ప్ర‌ణాళిక‌ల అమ‌లు, ఫ‌లితాలను స‌మీక్షిస్తూ ఆరోగ్యాంధ్ర సాధ‌న దిశ‌గా ఒక స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించ‌డానికి 10 మంది అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన సలహామండలి ఏర్పాటైంది.  ఈ సలహా మండలి   విజ‌న్-2047 మేర‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పూర్తి ఆరోగ్యం, ఆహ్లాదం క‌ల్పిం చేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌ చేస్తుంది. అలాగే   మాతాశిశు ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ, అసంక్ర‌మిక‌ వ్యాధుల నిర్మూల‌న‌కు అవ‌స‌ర‌మైన  మార్గాల‌ను సూచిస్తుంది.  ఇంకా వివిధ వివిధ ప‌ధ‌కాల  స‌మ‌ న్వ‌యం కోసం  చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్నిసూచిస్తుంది. అలాగే  రాష్ట్రాన్ని జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో గ్లోబ‌ల్ హెల్త్‌ హ‌బ్ గా రూపొందించ‌డానికి అవసరమై సూచనలు, సలహాలు ఇస్తుంది. ఈ సలహామండలి మొదటి సమావేశం డిసెంబర్ లో జరగనుంది. ఆ తొలి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు.  

సజావుగా ఎస్ఐఆర్.. 99శాతం పూర్తి!

దేశంలోని తొమ్మది రాష్ట్రాలు, మూడు యూనియన్ టెరిటరీలలో  ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా, వేగంగా సాగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (నవంబర్ 24) ప్రకటించింది. ఇప్పటి వరకూ ఎస్ఐఆర్ లో భాగంగా ఈ తొమ్మది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 99 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయ్యిందని పేర్కొంది.  ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలలో ఉన్న 50.97 కోట్ల మంది ఓటర్లలో 50.50 కోట్ల మంది  ఓటర్లకు పాక్షికంగా పూరించిన ఫారాలను జారీ చేసినట్లు  ఎస్ఐఆర్ బులిటిన్ పేర్కొంది.  ఈ నెల 4న మొదలైన  రెండో దశ ఎస్ఐఆర్ వచ్చే నెల 2 వరకూ సాగుతుంది.   రెండో దశ ఎస్ఐఆర్ లో భాగంగా ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలయిన పుదుచ్చేరి, అండమాన్ ,నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఎస్ఐఆర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా  తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.   అదే ఏడాది ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తయ్యింది. 

టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు నోటీసులు.. ఎందుకంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సీఐడీ నోటీసులు పంపింది.  శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు.   2023 ఏప్రిల్‌ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లు చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేసిన సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల   పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే..  హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది.  కేసు దర్యాప్తు జరుగుతుండగా విచారణకు వస్తున్న ఫిర్యాది దారు, టీటీడీ  ఏవీఎస్‌వో సతీశ్‌ కుమార్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి టీటీడీ అప్పటి  వీజీవో గిరిధర్‌, ఏవీఎస్‌వో పద్మనాభంను  సీఐడీ అధికారులు సోమవారం (నవంబర్ 24) ప్రశ్నించారు.  ఇప్పుడు తాజాగా భూమనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు.  

స్కూళ్లలో ఇక ప్రతి శుక్రవారం విలువల పిరియడ్

సమష్టి కుటుంబాలతో పాటే కుటుంబ విలువలూ మాయమైపోతున్న కాలం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో  రాజకీయంగా అత్యంత ప్రభావమంతమైన కుటుంబాలలో కూడా అన్నా చెళ్లెళ్లు, తల్లీ కొడుకులు వేరుపడటం చూశాం. కుటుంబ విలువలకు తిలోదకాలిచ్చి మరీ విమర్శలతో రోడ్డున పడటం చూశాం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో సమాజంలో నైతిక విలువలను కాపాడాలంటే ముందుగా కుటుంబ విలువలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల గురించి ఇసుమంతైనా అవగాహన లేని నేటి విద్యార్థులకు కుటుంబ విలువల పట్ల సరైన బోధన అవసరం. అలాగే వాటిపై అవగాహన పెరగాల్సిన అవస్యకత ఎంతైనా ఉంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సరిగ్గా ఆ విషయంపైనే దృష్టి పెట్టారు.  ఏపీలో విద్యార్థులకు విలువలు, మరీ ముఖ్యంగా కుటుంబ విలువల గురించి బోధన అవసరం అని భావించారు. అందుకే ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును ఆ పనికి నియోగించారు. ఈ విషయాన్ని  చాగంటి కోటేశ్వరరావు స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సోమవారం (నవంబర్ 24) చాగంటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  చంద్రబాబు కుటుంబ విలువలు, కుటుంబ నీతికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారని చాగంటి అన్నారు. ఒక వ్యక్తి కుటుంబం, తల్లిదండ్రులు, తోబుట్టువులకు విలువనిస్తేనే.. సమాజ విలువలను అవగాహన చేసుకోగలు గుతాడని చంద్రబాబు చెప్పారన్నారు.  కుటుంబ విలువలు నైతిక విలువల గురించి పిల్లలకు బోధించాలని తనకు సూచించారన్నారు.  కుటుంబ విలువల గురించి చంద్రబాబులో నిజాయితీతో కూడిన ఆందోళన ఉందన్న చాగంటి ఆయన తనకు అప్పగించిన పనిని బాధ్యతతో నెరవేరుస్తానని చెప్పారు.   వాస్తవమే.. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు మాత్రమే లక్ష్యం కాకూడదు.. సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి. ఇప్పుడు అదే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో  ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారు మంత్రి నారా లోకేష్.  రాష్ట్ర వ్యాప్తంగా   నైతిక విలువల విద్యా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు.   ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను నైతిక విలువలతో బలోపేతం చేయాలని సంకల్పించారు. ఆ బాధ్య తను ప్రవచనకారుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు అప్పగించారు.  విలువలను విద్యలో భాగం చేసేందుకు పాఠ్య పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో నైతిక విలువల విద్యా సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే విజయవాడలో సోమవారం (నవంబర్ 24)  తొలి సదస్సు జరిగింది.  విలువలు అనేవి మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఉండాలని చాగంటి ఈ సందర్భంగా ఉద్బోధించారు.  విద్యార్థులకు ఈ విషయాన్ని పాఠశాల స్థాయి నుంచే బోధించాల్సిన అవసరం ఉంది.   చాగంటి ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏ పనైనా పిల్లలు చేయాలని భావించినప్పుడు ఆ విషయాన్ని తల్లికి ముందుగా చెప్పాలి. అలా చెప్పలేమనుకున్న పని అసలు చేయనేకూడదు. ఇది విద్యార్థులకు చాగంటి చెప్పిన తొలి నైతిక సూత్రం.  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలి. ఒక్క విద్య మాత్రమే కాదు  నైతికతతో , రుజువర్తనతో సమాజంలో మార్పు వస్తుంది.    ఇప్పటికే  విద్యార్థులలో మార్పు వస్తున్నది. విద్యా మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకువచ్చిన సంస్కరణలు విద్యార్థులను బాధ్యత దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. గుంటూరు జిల్లా నర సరావుపేటలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సొంతంగా  రోజూ 10 నిమిషాలు స్కూల్ శుభ్రం అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. అలాగే  తిరుపతి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యా ర్థులే స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించి స్టీల్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. విజయ నగరం జిల్లాలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో  విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టంబర్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 700 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో విద్యార్థులు ప్రతి ఆదివారం స్థానిక వృద్ధాశ్రమానికి వెళ్లి, వృద్ధులతో గడుపుతున్నారు.   ఇక త్వరలో  1 నుంచి 12వ తరగతి వరకూ చాగంటి మార్గదర్శకత్వంలో విడుదల కానున్న నైతిక విలు వల పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిరియడ్ నైతిక విలువల బోధనకు కేటాయించనున్నారు.  విద్యార్థులలో నైతిక విలువలపై అవగాహన పెంపోందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. 

గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

హైదరాబాద్  శాలిబండ ప్రాంతంలోని గోమతి ఎలక్ట్రానిక్స్ లో సోమవారం (నవంబర్ 24) రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన భారీ అగ్నిప్రమాదంలో షాపులో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. షాపులోని వస్తువులు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు.  రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.  షాప్‌లో ఉన్న ఏసీలు, వాషింగ్ మిషన్లలోని కంప్రెసర్లు ఒకదాని వెంట ఒకటి పేలిపోవడంతో పెద్ద స్థాయిలో శబ్దాలు  వచ్చాయి. దీంతో స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ  సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా చార్మినార్– చాంద్రాయణగుట్ట ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.  ఈ ప్రమాదంలో  షాప్‌లో పనిచేస్తున్న సిబ్బంది కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే సమీప ఆసుప త్రులకు తరలించారు మంటలు పెద్ద ఎత్తున  వ్యాపించడంతో పక్కన ఉన్న భవనాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ పరిసరాలలో నివసిస్తున్న వారిని తాత్కా లికంగా ఖాళీ చేయించారు.  అగ్నిప్రమాదానికి గల కారణం ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే భారీ నష్టం వాటిల్లింది. ఇక షాపులోని పేలుడు ధాటికి రోడ్డుపై ఆ సమయంలో వెడుతున్న ఒక కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆ కారు డ్రైవర్ మృతి చెందాడు. ఇక కారులో ఉన్నవారు గాయపడ్డారు.   ఇలా ఉండగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది నాలుగో  అగ్నిప్రమాదమని అంటున్నారు. ఇలా గోమతి ఎలక్ట్రానిక్స్ లో తరచూ అగ్నిప్రమాదాలు జరగడానికి కారణాలపై లోతైన దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  

నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ హ్యాక్

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త దందాకు తెరలేపారు.  సెలబ్రె టీలను మాత్రమే టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఫోను హ్యాక్ చేయడమే కాకుండా ఏకంగా డబ్బులు   వసూలు చేస్తున్నారు.   ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆమె పేరుతో అనుచిత మెసేజ్‌లు పంపడమే కాకుండా తెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి అర్జంటుగా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తూ.... వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా సోషల్ మీడియాలో బయటపెట్టారు. తన మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యిందని, ఆమె నెంబర్‌ తో వచ్చే కాల్స్‌ లేదా మెసేజ్‌లకు ఎవరూ   స్పందించవద్దని, అలాంటి విన్నపాలు వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించారు. అనంతరం రకుల్ ప్రీతిసింగ్ తన ఫోన్ హ్యాక్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రకుల్ పేరును దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటనతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు చేస్తున్న కొత్త రకాల ఉచ్చులు మరోసారి బయటపడ్డాయి.

ఐ బొమ్మ రవి.. ఐదేళ్లలో వంద కోట్ల సంపాదన!

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం పైరసీ రవి ఒక్కడే చేసినట్లు విచారణలో బయటపడింది.  ఈ పైరసీ ద్వారా రవి ఐదేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు  సంపాదించినట్లు గుర్తించారు. సినిమాలను కొనుగోలు చేసి వాటిని తన ఐబొమ్మలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. తనకున్న వెబ్ డిజైనింగ్ టెక్నాలజీతో కొత్త కొత్త రూపంలో డిజైనింగ్ చేసి ఆ మేరకు డబ్బులు సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది. అలాగే   ఐ బొమ్మ లో సినిమా చూసే అందరి   రవి తస్కరించి ఆ మేరకు ప్రమోషన్స్ నిర్వహించు కున్నట్లు తేలింది.  తన దగ్గర 55 లక్షల మంది సంబంధించిన డేటా ఉందని చెప్పి బెట్టింగ్ గేమింగ్,  మ్యాట్రిమోనీ డాట్ కామ్ ల నుంచి యాడ్స్ రూపంలో కూడా సొమ్ములు సంపాదించినట్లు పోలీసులు కనుగోన్నారు.   పైరసీ వెబ్‌సైట్‌  ఐబొమ్మ  వ్యవహారంలో అరెస్టైన రవిని ఐదు రోజుల పాటు కస్టడీలో విచారించిన సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అక్కడ నుంచి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ ఐదు రోజుల విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రవి బ్యాంకు ఖాతాల్లో దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగాయనీ, అతడికి మొత్తం 36 బ్యాంకు ఖాతులు ఉన్నట్లు గుర్తించారు.  .విచారణలో రవి టెలిగ్రామ్‌ ఛానళ్ల ద్వారా సినిమాల కొనుగోలు– అమ్మకం జరిపినట్టు బయటపడింది. యాప్స్‌ ద్వారానే బేరసారాలు జరిపి, డాలర్ల రూపంలో  వ్యక్తులకు చెల్లింపులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేసిన సినిమాలను ఐబొమ్మలో అప్‌లోడ్ చేసి కొన్ని గంటల్లోనే భారీ ఆదాయం ఆర్జించినట్టు వెలుగులోకి వచ్చింది.  ఐబొమ్మలో సినిమా ఓపెన్‌ చేయగానే వినియోగదారులు 15 వరుస యాడ్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా రవి సిస్టమ్‌ను రూపొందించినట్టు  తేలింది. మ్యాట్రీమోని, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌తో పాటు,  పలు ప్రకటనలకు లింకులు ఇచ్చి కోట్లలో ఆదాయం సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీకే ఫైళ్ల ద్వారా బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్‌ చేసి  మనీ సర్క్యులేషన్‌ చేసినట్టు గుర్తించారు.అభ్యంతరకర లావాదేవీలను దాచేందుకు రవి ఐడీఎఫ్ సీ  బ్యాంక్ ఖాతాను వినియోగించగా, అందులో వచ్చిన నిధులను యూఎస్డిటి రూపంలో క్రిప్టో కరెన్సీకి మార్చినట్టు కూడా అధికారులు కనుగొన్నారు. రవి స్నేహితుడు నిఖిల్‌కు భారీగా డబ్బులు బదిలీ చేసిన వివరాలు బయటపడ్డాయి. రవి  అతడి స్నేహితుడు కలిసి వెబ్‌సైట్ ఆపరేషన్స్, డొమైన్ నెట్‌వర్క్స్, ఐపీ మాస్కింగ్, వీపీఎన్ హైడింగ్, డేటా స్క్రాంబ్లింగ్ వంటి టెక్నికల్ కార్యకలాపాలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. నిర్మాతలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా మరిన్ని కేసుల్లో పీటీ వారెంట్ దాఖలైంది.   రవిని మరోసారి విచారించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు సిద్ధమవుతున్నారు.ఇలా ఐబొమ్మ కేసుపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ మీడియా మంగళవారం (నవంబర్ 26) మీడియాతో మాట్లాడతారు.  

మహిళల కబడ్డీ వరల్డ్ కప్.. విజేత భారత్

భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో చైనీస్ తైపీ జట్టుపై భారత్ 35–28 తేడాతో  విజయం ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలవడం వరుసగా ఇది రెండో సారి. ఈ టోర్నమెంట్ ఆద్యంతం భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. తొలుత   గ్రూప్ మ్యాచ్‌లన్నీ అలవోకగా గెలిచిన భారత మహిళల జట్టు సెమీఫైనల్‌లో ఇరాన్‌పై 33–21 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు, చైనీస్ తైపీ కూడా తమ గ్రూపులో అజేయంగా నిలిచి, సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. సెమీస్ వరకూ అజేయంగా నిలిచి సమ ఉజ్జీలుగా భారత్, చైనీస్ తైపీ జట్టు ఫైనల్ లో తలపడ్డాయి. అయితే భారత మహిళల జట్టు చైనీస్ తైపీ జట్టుపై కూడా సునాయాస విజయాన్ని సాధించింది. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ చాంపియన్ ట్రోఫీని ముద్దాడి ప్రపంచ కప్ ను నిలబెట్టుకుంది.    ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి.   భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టును ఓడించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 35-28 పాయింట్ల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ విజేతగా నిలవడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత అంకిత భావాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. ఈ విజయం అనేక మంది యువతులను కబడ్డీ ఆడే దిశగా ప్రోత్సహిస్తుందని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ,  భారత జట్టుకు అభినందనలు తెలిపారు. పట్టుదల, సత్తా ఈ అద్భుత విజయాన్ని సాధించిపెట్టాయన్నారు. భారత మహిళల జట్టు ప్రపంచకప్ ను వరుసగా రెండు సార్లు గెలవడం దేశానికి గర్వించదగ్గ విషయం అని ఎక్స్ లో పేర్కొన్నారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు.  అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు తెలిపారు.   మన మహిళల కబడ్డీ జట్టు వరుసగా రెండోసారి మహిళా కబడ్డీ ప్రపంచకప్‌ను గెలవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమన్న లోకేష్,  జట్టులో ఉన్న  క్రమశిక్షణ, పట్టుదల,   ప్రతిభకు ఇది నిదర్శనమన్నారు.  ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశ ప్రతిష్టను ఉన్నత స్థాయికి చేర్చిన మన క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

చెవిరెడ్డికి మళ్లీ అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను హుటాహుటిన  విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం (నవంబర్ 24) ఛెస్ట్ పెయిన్ అంటూ కంప్లైంట్ చేయడంతో ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స  అందించారు. గతంలో కూడా పలు మార్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు ఆరోగ్యం బాలేదంటూ చెప్పడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తరువాత తిరిగి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో తనను ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా చేర్చి చికిత్స అందించాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి ఆందోళనకు గురై అస్వస్థతకు గురై ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను జప్తే చేయవద్దనీ, తాను ఎంత కాలం కావాలంటే అంత కాలం జైలులో ఉంటానంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి శనివారం (నవంబర్ 22)న ఏసీబీ కోర్టులో న్యాయవాదికి మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే.  వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట‌యిన చెవిరెడ్డిని పోలీసులు శనివారం (నవంబర్  22) ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా కోర్టు ఆయ‌న‌కు మ‌రో 14 రోజ‌లు పాటు రిమాండ్ విధించింది.   ఈ స‌మ‌యంలో చెవిరెడ్డి న్యాయాధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ, త‌న‌పై అన‌వ‌స‌రంగా కేసు న‌మోదు చేశార‌ని.. ఇది రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌న్నారు. అయితే.. అవ‌న్నీ తాను నీతి, నిజాయితీతో సంపాయించుకున్న ఆస్తుల‌ని.. ఒక్క‌రూపాయి కూడా అవినీతి లేద‌ని  వీటిని జ‌ప్తు చేయ‌డం  ధ‌ర్మం కాద‌ంటూ వేడుకున్నారు.  కావాలంటే  కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నాళ్ల‌యినా త‌న‌ను జైల్లో పెట్టుకోవ‌చ్చ‌న్నారు. అయితే ఆస్తులను మాత్రం జప్తు చేయవద్దంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.  అయితే, ఈ విష‌యం త‌మ ప‌రిధిలో లేద‌ని, సిట్ అధికారులు ఆస్తుల జప్తుకు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని   కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆస్తుల జప్తు ఆందోళనతోనే చెవిరెడ్డి అనారోగ్యానికి గురై ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు.  

అర్థ‌రాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స‌జ్జ‌నార్.. ఏం చేశారు? ఎక్కడికెళ్లారంటే?

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదివారం (నవంబర్ 23) అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో ఎక్క గస్తీ తిరిగారు. ముఖ్యంగా లంగర్ హౌజ్, టోలీ చౌకీ ప్రాంతాలలో ఆయన పెట్రోల్ వాహనంలో తిరిగారు.  సైరన్ లాంటి ఆర్బాటాలేం లేకుండా పెట్రోల్ వాహనంలో తిరుగుతూ,  లంగ‌ర్ హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లో నివాసం ఉంటున్న రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్న రౌడీ షీటర్లను లేపి మరీ వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు.   మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడమే కాకుండా, నేర ప్ర‌వృత్తి వీడి సన్మార్గంలోకి రావాల‌ని హిత‌వు ప‌లికారు.  సౌత్ వెస్ట్ జోన్‌లో నగర సీపీ  సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము మూడు గంటల వరకూ లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నిత ప్రదేశాలలో గస్తీ తిరుగుతూ పరిశీలించారు.  టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లి  నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. అలాగే పెట్రో లింగ్ సిబ్బంది అప్రమత్తతను కూడా పరిశీలించారు.  అలాగే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టౌలీచోకీ పీఎస్ లో స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను  పరిశీలించారు.  ఈ సందర్భంగా సజ్జనార్  రాత్రి వేళల్లో పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకే తాను పెట్రోలింగ్ వాహనంలో ఇలా ఆకస్మిక పర్యటన చేసినట్లు తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బందిలో బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యత పెరిగేందుకు దోహదం చేస్తాయన్నారు. విజిబుల్ పోలిసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయనీ సందర్భంగా పోలీసు సిబ్బందికి సూచించారు.   

బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు

ప్రముఖ  బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఈ రోజు తుదిశ్వాస విడిచారు.  అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులు ఆయన భౌతిక కాయానికినివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి   షోలోలే ధర్మేంద్ర సహ నటుడు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ సహా పలువురు ప్రముఖ  నివాళులర్పించారు.   షోలే సహా 300కు పైగా చిత్రాల్లో  నటించిన ధర్మేంద్ర ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,  పద్మభూషణ్ సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.  హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా పేరుపొందిన ధర్మేంద్ర మృతిలో సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజుల కిందటే బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ధర్మేంద్ర ఈ ఉదయం మరణించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ధర్మేంద్ర డిసెంబర్ 8, 1935లో పంజాబ్ లో జన్మించాడు. 1960లో వచ్చిన దిల్ భీ తేరా హమ్ భీ తేరే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 65 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో 300కుపైగా సినిమాల్లో నటించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది. అలాగే 1997 సంవత్సరంలో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ధర్మేంద్ర భార్య, అలనాటి డ్రీమ్ గర్ల హేమమాలిని రాజ్యసభ మాజీ సభ్యురాలు. ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ లు కూడా సినీ నటులే. అలాగే ధర్మేంద్ర కుమార్తెలు ఇషా కూడా సినీ రంగంలోనే ఉన్నారు. 

ఒకే రోజు పాతిక బ్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.. అమరావతి వేగం అనూహ్యం కదా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగం వాయువేగాన్ని మించి సాగుతోంది. తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మలచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాజధాని కేంద్రంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా భారీగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల వేగం పెరిగేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా ఆర్బీఐ రీజనల్ బ్యాంక్ సహా పాతిక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అమరావతిలో ఏర్పాటు కానున్నాయి. ఆయా బ్యాంకులకు ఇప్పటికే స్థలాలు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ దిశగా మరో  కీలక ముందడుగు పడనుంది. ఆర్బీఐ సహా  పాతిక, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణానికి ఒకే రోజు శంకుస్థాపన జరగనుంది. ఈ నెల 28న జగరగున్న ఈ బ్యాంకుల భవనాల నిర్మాణానికి జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  రాజధానిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే పలు  బ్యాంకులు తమ స్థలాలను సిద్ధం చేసుకుని నిర్మాణాలకు రెడీ అయ్యాయి.ఈ బ్యాంకుల ఏర్పాటుతో అమరావతి రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు. బ్యాంకుల ఏర్పాటుతో అమరావతికి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.  

మారిపోతాం..లొంగిపోతాం.. ముందు కూంబింగ్ ఆపండి.. మావోయిస్టుల లేఖ

మావోయిస్టులు ఆయుధాలు విసర్జించి లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంపై మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంలకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం విశ్వభూషణ్ సాహు, ఛత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయిలకు రాసిన ఆ లేఖలో మావోయిస్టులు లొంగిపోతాం, మారిపోతాం.. ముందు మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన కూంబింగ్ ను నిలిపివేయండి అంటూ విజ్ణప్తి చేశారు. లొంగుబాటుపై ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని ఆ లేఖలో పేర్కొంది. ముఖ్యంగా ఇటీవల పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజ్  ఎన్ కౌంటర్ తరువాత పార్టీ పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని పేర్కొంది. కూంబింగ్ ఆపివేతస్తే ఆయధ విరమణపై ఒక స్పష్టమైన తేదీని ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది.  ఇప్పటికే ఈ విషయమై పార్టీ  జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూంబింగ్ ఆపివేస్తే లొంగిపోతాం, ఆయుధాలను వదిలేస్తామంటూ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి  బేగం ఖలీదా జియా  ఆదివారం (నవంబర్ 23) రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో భాధపడుతున్నారని తెలిపారు.   ప్రస్తుతం ఆమెకు ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో జరుగుతున్న చికిత్సను   అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి నిపుణులు   వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కాగా బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలూ  పెద్ద సంఖ్యలో ఆమో చికిత్స పొందుతున్న ఆస్పత్రివర్దకు చేరుకున్నారు.  

సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్  సోమవారం (నవంబర్ 24) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ఇలా ఉండగా సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఆ పదవిలో  2027 ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్  స్వస్థలంహర్యానా. హర్యానా నుంచి సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్.

కాలుష్య వ్యతిరేక ర్యాలీలో హిడ్మా అనుకూల పోస్టర్లు, నినాదాలు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో ఇటీవల ఏపీలో  ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని  ఇండియా గేట్ వద్ద ఆదివారం (నవంబర్ 24) సాయంత్రం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా హిడ్మాకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు.  కాగా అనుమతి లేకుండా ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొందరు నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రై ప్రయోగించారు. దీంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా పోలీసులపై నిరసనకారులు  పెప్పర్ స్ప్రే ప్రయోగించడం చాలా అసాధారణమైన ఘట‌నగా ఢిల్లీ డీసీపీ  తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 15 మంది నిరసనకారులను అదుపులోనికి తీసుకున్నారు.   కాలుష్య వ్యతిరేక నిరసనలలో హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లపై కూడా విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.  

మనవడి మృతిని తట్టుకోలేక అమ్మమ్మ మృతి

మనవడు మరణించాడన్న వార్త వినగానే అమ్మమ్మ ఒక్కసారిగా కూప్ప కూలి పడిపోయి మృతి చెందిన ఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  స్నేహితులతో కలిసి సరదాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వా రావుపేటకు సరిహద్దులో కామయ్యపాలెం  సమీపంలోని  సంఘం వాగులో  ఈతకు వెళ్లిన పదవ తరగతి విద్యార్థి పదిహేనేళ్ల యశ్వంత్‌  ఆ వాగులో మునిగి మరణించాడు.   మనవడి ఆకస్మిక మరణ వార్త విన్న యశ్వంత్‌ అమ్మమ్మ వెంకటమ్మ (60) తీవ్ర విషాదంలో మునిగిపోయి, రోదిస్తూ  ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.  ఒకే రోజు ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించడంతో అశ్వారావుపేటలో విషాద ఛాయలు ముసురుకు న్నాయి. 

బెంగుళూరు దోపిడీ కేసులో ముగ్గురు హైదరాబాద్ లో అరెస్టు

బెంగళూరులో జరిగిన భారీ దోపిడీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.  బెంగళూరులో జరిగిన 7.1 కోట్ల దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ లో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో పట్టుబడ్డ ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా  బెంగు ళూరు పోలీసుల ప్రత్యేక బృందం హైదరాబాద్‌ వచ్చి ఈ అరెస్టులు చేసింది. దోపిడి తర్వాత ముగ్గురు నిందితులు బెంగళూరు నుంచి కారులో  నేరుగా హైద రాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరిన తర్వాత ఈ ముగ్గురు నిందితులు నాంపల్లి ప్రాంతంలోని ఒక లాడ్జ్‌లో బస చేశారు. ఈ సమాచారంతో బెంగుళూరు పోలీసులు సిసిఎస్ హైదరాబాద్ బృందం సహకారంతో లాడ్జ్ పరిసరాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు చేరుకునేలోపే ముగ్గురు నిందితులు లాడ్జ్‌ను విడిచి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 58లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.  అరెస్టు చేసిన వారిని బెంగళూరు తరలించారు.