కాన్ఫిడెన్స్‌ పెరగాలా... నిటారుగా కూర్చోండి చాలు!

ఆత్మవిశ్వాసం పెరగడానికి చాలా చిట్కాలే వినిపిస్తూ ఉంటాయి. వినడానికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ, పాటించడం దగ్గరకి వచ్చేసరికి తాతలు దిగి వస్తారు. దాంతో చిట్కాలన్నింటినీ మూటగట్టి... ఉసూరుమంటూ పనిచేసుకుపోతాం. కానీ ఇప్పుడు మనం వినబోయే చిట్కా పాటించడానికి తేలికే కాదు, దీంతో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు పరిశోధకులు. కొంతమందిని చూడండి... వాళ్లు నిటారుగా నడుస్తారు, కూర్చున్నా కూడా నిటారుగానే కూర్చుంటారు. వాళ్లని చూసి- ‘అబ్బో వీళ్ల మీద వీళ్లకి ఎంత నమ్మకమో’ అన్న ఫీలింగ్‌ తెలియకుండానే కలుగుతుంది. నిటారుగా కూర్చుంటే ఎవరిలో అయినా ఆత్మవిశ్వాసం పెరుగుతుందా! అనే అనుమానం వచ్చింది అమెరికాలో కొంతమంది పరిశోధకులకి. దాంతో వాళ్లు ఓ ప్రయోగం చేసి చూశారు.ఈ ప్రయోగంలో భాగంగా 71 మందిని ఎన్నుకొన్నారు. ‘ఒక ఉద్యోగం చేసేందుకు మీలో ఉన్న మూడు పాజిటివ్‌ లక్షణాలు, మూడు నెగెటివ్‌ లక్షణాలు ఒక పేపరు మీద రాయండి,’ అని అడిగారు. అయితే ఇలా రాసే సమయంలో ఓ సగం మంది నిటారుగా కూర్చుని రాయాలనీ, మిగతావాళ్లు చేరగిలబడి రాయాలనీ సూచించారు. నిటారుగా కూర్చుని రాసినవాళ్లు తమలో ఉన్న పాజిటివ్‌ లక్షణాలను చాలా బాగా ప్రజెంట్‌ చేయగలిగారు. అదే సమయంలో నెగెటివ్‌ లక్షణాలు అసలు పెద్ద విషయమే కాదన్న అభిప్రాయం కలిగేలా రాసుకొచ్చారు. ఇక చేరగిలబడి కూర్చున్నవారి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తమలో ఉన్న పాజిటివ్ లక్షణాలను కూడా చాలా సాధారణంగా రాసుకొచ్చారు. ఇక నెగెటివ్‌ లక్షణాలను గొప్ప సమస్యలుగా చిత్రీకరించారు. విచిత్రం ఏమిటంటే... నిటారుగా కూర్చున్నప్పుడు తమ కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చిన విషయం వాళ్లకి కూడా తెలియలేదు. కానీ వాళ్ల చేతల్లో మాత్రం గొప్ప మార్పు కనిపించింది. అదండీ విషయం! ఈ చిన్న చిట్కా కనుక పాటిస్తే... పరీక్షలు రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూలో జవాబులు చెప్పడం వరకూ ఎలాంటి సందర్భంలో అయినా మనలో కాన్ఫిడెన్స్‌ రెట్టింపు అవుతుందని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల... మన ఆలోచనల్లో స్పష్టత వస్తుందనీ, అదే కాన్ఫిడెన్సుకి దారితీస్తుందనీ చెబుతున్నారు. - నిర్జర.

సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే ఈ పనులు చేయండి..!

సెల్ఫ్ కాన్పిడెన్స్.. ఏ పనిలో అయినా విజయం సాధించడానికి మొదటి సూత్రం ఇదే..  ఒక వక్తికి తన మీద తనకు స్పష్టమైన నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయాన్ని చాలా సులువుగా సాధించగలుగుతాడు. అయితే ఈ సెల్ఫ్ కాన్పిడెన్స్ అనేది అనుకోగానే వచ్చేది.  ఇది జీవితంలో అలవాట్ల ద్వారా, వ్యక్తిత్వం ద్వారా ఏర్పడేది.  కానీ కొన్ని పనులు చేయడం ద్వారా ప్రతి వ్యక్తి తమ సెల్ఫ్ కాన్పిడెన్స్ ను పెంచుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. పాజిటివ్ ఆలోచనలు.. మంచి అయినా, చెడు అయినా మొదట ఆలోచనలే మనిషి మీద ప్రభావం చూపిస్తాయి.  పాజిటివ్ ఆలోచనలు ఉన్నవారికి వారి జీవితంలో తాము చేసే పనులలో కూడా పాజిటివ్ వైఖరి ఉంటుంది. తమ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా వారి ఆలోచనలే ప్రేరేపిస్తాయి. సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. లక్ష్యాలు.. పెద్ద  పెద్ద లక్ష్యాలు నిర్థేశించుకుంటేనే గొప్పవాళ్లు కాగలం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.  కొందరు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తుంటారు. అయితే గొప్ప కలలు కనడంలో, గొప్ప స్థాయికి వెళ్లాలని అనుకోవడంలో తప్పు లేదు.. కానీ చిన్న చిన్న లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని సాధిస్తూ వెళితే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం.. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా సరే లక్ష్యాలు సాధించాల్సిందే.. అనుకున్న పనులు చేయాల్సిందే అనే మొండితనం ఎప్పటికైనా తీవ్ర నష్టం కలిగిస్తుంది.  అందుకే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి.  ఆరోగ్యం బాగుంటే ఎంత కష్టమైన పనులైనా ఉత్సాహంగా చేయగలుగుతారు. నేర్చుకోవాలి.. అంతా తెలుసు అనేది అహంకారం అవుతుంది.  ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకున్నప్పుడే ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. విషయాన్ని కూడా ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇది లక్ష్యాల పట్ల ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. బలహీనతలు.. బలహీనతలు కప్పిపుచ్చుకోవడం చాలా మంది చేసే పని. కానీ బలహీనతలపై దృష్టి పెట్టాలి. వాటిని అధిగమించాలి. అలాగే బలాలను కూడా గుర్తు  చేసుకోవాలి.  బలాల ద్వారా సాధించిన విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఓటమి.. జీవితంలో ఓటమి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదురవుతుంది.  విజయమే కావాలి అనే మెంటాలిటీ మనిషిని సెక్యురిటీ జోన్ లో ఉంచుతుంది.  కానీ ఓటమిని కూడా అంగీకరించగలిగేవారికి జీవితంలో  కాన్పిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ప్రతి వైఫల్యం గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.  వ్యక్తిత్వ పరంగా బలంగా మార్చుతుంది. పరిచయాలు.. సెల్ఫ్ కాన్సిడెన్స్ మెరుగ్గా ఉండాలంటే నెగిటివ్ గా ఆలోచించకుండా ఉండటమే కాదు.. నెగిటివ్ మాటలు మాట్లాడే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి.  నెగిటివ్ గా మాట్లాడేవారు ప్రతి ప్రయత్నంలో వెనక్కు లాగే మాటలే మాట్లాడతారు.  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. భయం.. దేనికీ భయపడకూడదు. సమస్యలు ఏవైనా వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని పెంచుకోవాలి.   ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.                                      *రూపశ్రీ.

ఈ ప్రదేశంలో ఉంటే కష్టాలు తప్పవు!

గొప్ప తత్వవేత్త చాణక్యుడి నీతి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికీ ఆయన విధానాలను ప్రజలు అనుసరిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో నివసించడం ఇబ్బందులను ఆహ్వానిస్తుంది అని చాణక్యుడు తన నీతిలో వివరించాడు.ఎలాంటి ప్రదేశాల్లో ఉంటే కష్టాలు ఎదుర్కొవల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్ర పుటల్లో గొప్ప తత్వవేత్త చాణక్యుడి పేరు అందరికీ తెలుసు.  చాలా మంది విజయవంతమైన వ్యక్తులు చాణక్యుడి సూత్రాల రహస్యాన్ని అర్థం చేసుకున్నారు లేదా ఆ సూత్రాలతో తమ జీవితాలను గడుపుతున్నారు. చాణక్యుడు ఏకంగా మొత్తం మౌర్య వంశాన్ని స్థాపించాడు. గొప్ప నాయకులు కూడా ఆయన దౌత్యాన్ని అనుసరిస్తారు.చాణక్యుడు తన విధానాల నుండి చాలా విషయాలు చెప్పాడు. అందులో తాను నివసించాల్సిన ప్రదేశం గురించి చెప్పాడు. ఏదో ఒక ప్రదేశాన్ని ముందుగానే విడిచిపెట్టడం మంచిదని, దానిని విడిచిపెట్టడంలోనే జీవితంలో విజయానికి మూల మంత్రం ఉందని చాణక్యుడు సూచించాడు. జీవితంలో విజయం సాధించడానికి ఏ ప్రదేశం నుండి వెంటనే బయలుదేరాలి. ఏ ప్రదేశంలో నివసించాలి అనే దాని గురించి చాణక్యుడి తత్వం ఏమి చెబుతుందో తెలుసుకుందాం. చాణక్య విధానం: యస్మిన్దేశే న సమ్మనో న వృత్తిర్న చ బాన్ధవః । న చ విద్యాగమః కశ్చిత్తం దేశం పరివర్జయేత్ చాణక్యుడి విధానం ప్రకారం గౌరవం లేని చోట నిలబడకూడదని చెప్పాడు. ఉద్యోగం లేని, స్నేహితులు, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులు నివసించని ప్రదేశాన్ని వదిలివేయండి.చాణక్యుడు ఈ విషయాన్ని మరింత విశదీకరించాడు. జ్ఞానాన్ని పొందడానికి వనరు లేని చోట స్థిరపడకూడదని, ఆ స్థలాన్ని కూడా త్యాగం చేయాలని చెప్పాడు. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ఎటువంటి ఏర్పాట్లు లేని ప్రదేశంలో స్థిరపడకూడదని చాణక్యుడి తత్వం చెబుతుంది . కాబట్టి ఎవరైనా ఈ వ్యవస్థలు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి, ఎందుకంటే ఒకరు తమ స్వంత జీవితాన్ని గడపడం లేదా ఒకరిని పోషించడం, ఒకరి కుటుంబాన్ని పోషించుకోవడం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. ఒక స్నేహితుడు, బంధువు లేదా సహాయకుడు జీవించి ఉండకపోతే, విపత్తు సంభవించినప్పుడు మీరు ఎవరి నుండి సహాయం తీసుకోలేరు. ఎందుకంటే మీకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. విద్య విషయానికొస్తే, మంచి విద్య ఒక వ్యక్తి యొక్క మంచి ప్రవర్తన, పిల్లల భవిష్యత్తును రూపొందిస్తుంది. చదువులేనప్పుడు ఆ ఊళ్లో పిల్లల చదువులు ఎలా పూర్తిచేస్తాం? అలాంటి చోట నివసిస్తూ పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. అందుకే ఈ వనరులన్నీ లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదని చాణక్యుడు చెప్పారు.

ప్రస్తుత సమాజాన్ని తప్పుదోవలో నడుపుతున్నది ఎవరు?

ప్రస్తుతసమాజాన్ని వ్యాపారసంస్కృతి నిర్దేశిస్తున్నది. వ్యాపారంలో ప్రచారం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతం వ్యాపార ప్రచారం ఇరవై నాలుగు గంటలూ ప్రతి నట్టింటా వికృతరూపంలో నర్తనమాడుతోంది. పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనుభవించగల సౌఖ్యాలు ప్రతివాడికీ ప్రతి వయసు నుంచీ తెలుస్తున్నాయి. ఆ సౌఖ్యాల సాధనకు ఏకైక మార్గం డబ్బు సంపాదన. దాంతో వ్యక్తి అభివృద్ధిని డబ్బు సంపాదనతో కొలవటం తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు డబ్బు సంపాదించకపోతే పనికి రానివాడన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ప్రతివాడి జీవితలక్ష్యం ఎలాగోలాగ, వీలైన రీతిలో డబ్బు సంపాదించటమే అన్నది స్థిరమైపోయింది. సమాజం అవినీతిమయమై విలువలు తరగటంలో ప్రధానంగా తోడ్పడిన అంశం ఇది. డబ్బు మీద ఆశను కల్పించి, పెంచటంలో పాశ్చాత్య ప్రచారసంస్థలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. ప్రేమప్రచారం సమర్థంగా జరిగింది. యువతీ యువకులు కలిస్తే ప్రేమించి తీరాలన్న అభిప్రాయం ఏర్పడింది. కాలేజీలకు వెళ్ళేది ప్రేమించటం కోసమేనన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. టూత్ పేస్టుతో పళ్ళు తోముకుంటే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఓ మోటర్ సైకిల్ కొంటే, ఇతరుడితో ఉన్న అమ్మాయి, వాడిని వదిలి వీడి దగ్గరకు వచ్చేస్తుంది. ఓ షేవింగ్ లోషన్ వాడగానే అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఇంకో మౌత్ ఫ్రెష్నర్ ఉపయోగిస్తే అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చి పడిపోతారు. ఇంకేదో సువాసన ద్రవ్యం వాడితే అమ్మాయిలు వెర్రెక్కి వెంటపడతారు. మరింకేదో కంపెనీ కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మాయిలు నిజంగానే పడిపోతుంటారు. ఈ ప్రచారం వల్ల, అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంతగా చులకన అభిప్రాయం కలుగుతుందో ఆలోచిస్తే, ఈ తరానికి మనం చేస్తున్న అన్యాయం అర్థమౌతుంది. అలాగే, ఓ అమ్మాయి "మిస్ యూనివర్స్" గా ఎన్నికై, సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించింది. ఆమె మిగతావారందరికీ ఆదర్శమైంది. ప్రతి వారూ అందంగా ఉండాలని పోటీలు మొదలుపెట్టారు. విదేశీ కాస్మెటిక్ కంపెనీలకు లాభం. విదేశీ ఎక్సర్ సైజ్ పరికరాల తయారీదారులకు లాభాలు. ఇక అమ్మాయిలు ఉన్నది అబ్బాయిలను ఆకర్షించేందుకే అన్న ప్రచారం పుట్టినప్పటి నుంచీ ఉగ్గు పాలతో అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓ క్రీమ్ వాడగానే అబ్బాయిలు వెంటపడతారు. ఓ హెయిర్ షాంపూ వాడితే ముగ్ధులైపోతారు. కంపెనీ ఐస్ క్రీమ్ అసభ్యంగా తింటూంటే కుర్రాళ్ళు సర్వం మరచిపోతారు.  ముఖం మీద మొటిమలు ఉంటే అబ్బాయిలు మెచ్చరు. కాబట్టి ఓ కంపెనీ మొటిమల మందు వాడితే ఇక అబ్బాయిలు క్యూలు కడతారు. ఇంకేదో పౌడరు, మరింకేదో అందాన్ని పెంచే వస్తువు.... కానీ అన్నీ అబ్బాయిలను ఆకర్షించేందుకే. ఐతే వీటన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పరీక్షల్లో పాసవాలి. మార్కులు రావాలి. అప్పుడు కార్లు కొనవచ్చు, అమ్మాయిల్ని వెంట తిప్పుకోవచ్చు. ఇదీ ప్రస్తుతసమాజం ఆలోచిస్తున్న దిశ.  పైన చెప్పుకున్నవి అన్ని గమనిస్తే వ్యాపార సామ్రాజ్యాలు చాలావరకు ప్రస్తుత సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.                                     ◆నిశ్శబ్ద.

ఈ భారతీయ మహారాణికి భయపడి మొఘలులు తమ ముక్కులు తామే కోసుకున్నారు..!

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్.  1504లో కాబూల్ లో రాజ్యాన్ని స్థాపించాడు. భారతీయ చరిత్రలో మొఘలుల పాత్ర చాలానే ఉంది.  ఈ మొఘల్ వంశానికి చెందిన  షాజహాన్ మొఘల్ రాజుగా కాకుండా తాజ్మహాల్ స్థాపకుడిగా అందరికీ సుపరిచితుడు.  అయితే షాజహాన్ కాలంలో మొఘలులను మట్టికరిపించి వారి ముక్కులు వారే కోసుకునేలా చేసిన మహారాణి ఒకరు ఉన్నారు.  ఆమె రాణి కర్ణావతి.  భారతదేశంలో ఎంతో మంది రాణులు తమ శౌర్యంతో, యుద్ద నైపుణ్యంతో చరిత్రలో తమకంటూ పేరు చిరస్మరణీయం చేసుకున్నారు. కానీ చాలామందికి తెలియని వారు రాణి కర్ణావతి.  మొఘలులకు ముచ్చెమటలు పట్టించి, వారిని మోకాళ్ల మీద నిలబెట్టించి  వారి ముక్కు వారే కోసుకునేలా చేసిన రాణి కర్ణావతి గురించి తెలుసుకుంటే.. రాణి కర్ణావతి గర్వ్హాల్ రాజ్యానికి చెందినవారు.   ఈమె గర్వ్హాల్ రాజపుత్ర రాజు అయిన మహిపతి షా భార్య.  మహిపతి షా గర్వ్హాల్ రాజ్యాన్ని పాలించేవాడు.  గర్వ్హాల్ రాజ్యం బంగారు,  వజ్రాల గనులతో నిండి ఉండేది.  దీంతో అప్పటి మొఘల్ రాజు అయిన షాజహాన్ దృష్టి గర్వ్హాల్ రాజ్యం మీద పడింది. కానీ మహిపతి షా మీద దాడికి వెళ్లలేక పోయాడు. అయితే కొద్దికాలానికే మహిపతి షా మరణించాడు. అప్పటికి  మహిపతి షా,  రాణి కర్ణావతిల కుమారుడు పృధ్వీపతి షా కు  7 ఏళ్లు. ఆ పిల్లాడినే రాజుగా చేసి తానే రాజ్యాన్ని నడిపిస్తుండేవారు కర్ణావతి.  అయితే  ఓ మహిళ రాజ్యాన్ని పాలిస్తోందనే విషయం తెలుసుకుని గర్వ్హాల్ రాజ్యాన్ని తమ కింద విలీనం చేసి బ్రతకమని షాజహాన్ కబురు పంపాడు.  దీనికి రాణి కర్ణావతి ఒప్పుకోలేదు. దీంతో షాజహాన్ గర్వ్హాల్ రాజ్యం మీదకు తన సైన్యాన్ని పంపాడు. 1640లో చక్రవర్తి  షాజహాన్ ఆదేశాల మేరకు నజబత్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సైన్యం గర్వ్హాల్ పై దాడి చేసింది.  ఈ దాడిని ఎదుర్కోవడానికి రాణి కర్ణావతి నడుం బిగించింది. షాజహాన్ సైన్యం మీద తిరగబడింది. రాణి కర్ణావతి యుద్ద కౌశలం,  ఆమె శౌర్యం ముందు మొఘలులు చేతులెత్తేశారు.  రాణి కర్ణావతి ముందు లొంగిపోయారు.  చాలామంది మొఘల్ సైన్యం ఆమెకు బందీలుగా చిక్కారు. రాణి కర్ణావతి తనకు చిక్కిన మొఘలు సైన్యాన్ని తేలిగ్గా వదల్లేదు.  తమ ముక్కులను తామే కోసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారి తలలు నరికేస్తానని చెప్పారు. ప్రాణాలు అయినా దక్కుతాయనే ఆశతో మొఘలు సైనికులు తమ కత్తులతో తామే తమ ముక్కులు కోసుకున్నారు. మొఘల్ సేనాపతి నజబత్ ఖాన్ కూడా ముక్కు కోసుకున్నాడు. కానీ తిరుగు ప్రయాణంలో జరిగిన అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. షాజహాన్ ఇదంతా భరించలేక ఉత్తరాఖండ్ పై దాడి ప్రకటించాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మొఘలులు రాణి కర్ణావతిని ఓడించలేకపోయారు. చివరకు రెండు సైన్యాల మధ్య ఒప్పందం జరగడంతో ఈ గొడవ ముగిసిందని చరిత్ర చెబుతోంది. ఇలా శత్రువుల ముక్కులు కోసుకునే చేయడంలో రాణి కర్ణావతి ముక్కలు కత్తిరించే రాణిగా చరిత్రలో చెప్పబడింది.                                                   *రూపశ్రీ.

మనిషి ఎలా జీవించాలంటే...

మనిషి జీవించే విధానం ఎలా ఉండాలో మనిషే నిర్ణయించుకోవాలి. పూలు ఎక్కడున్నా సువాసన వ్యాపించినట్లు  మనం ఎక్కడ ఉన్నా మన వ్యక్తిత్వం పరిమళిస్తూ ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన పనులు అన్నీ సువాసన సంభరితంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, రోడ్డుపై నడుస్తున్నా, తరగతి గదిలో కూచొన్నా, మన కింద పని చేస్తున్న వారికి ఆజ్ఞలు ఇస్తున్నా.. మనపై అధికారుల ఆజ్ఞల్ని వింటున్నా... అసలు మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా - బతికి ఉన్నంత కాలం... తోటివారు మన గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన విశాల హృదయం గురించి 'భేష్' అనుకోవాలి. అలా ప్రవర్తించాలి. గర్వం లేకుండా, ఇతరులను హీనంగా చూడకుండా నలుగురికీ తలలో నాలుకలా... నలుగురితో కలగలిసి పోతూ... ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ... మన కర్తవ్యం నిర్వహణ చేస్తూ... ముందుకు సాగడమే మానవ జీవిత సార్థకత అంటే! కమ్మని మామిడి చిగుళ్ళు తినే కోకిలకు ఏ మిడిసిపాటూ ఉండదు. కానీ బురదనీళ్ళు తాగే కప్ప మాత్రం బెకబెకమంటూ ఒకటే గొడవ చేస్తుంది. "కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తే, కాకః కాకః పికః పికః"  అంటే… 'కాకి నల్లగా ఉంటుంది. మరి కోకిల? అది కూడా నల్లగానే ఉంటుంది. మరి ఏమిటి రెండింటికి తేడా? వసంతకాలం రానీయండి అవి రెండూ గొంతు విప్పితే - కాకి కాకేనని, కోకిల కోకిలేనని తేలిపోతుంది! అదే విధంగా  మనమంతా... మనుష్యులమంతా... పైకి ఒక్కలాగే ఉంటాం. కానీ కాలం గడిచేకొద్దీ... పుట్టి పెరిగే కొద్దీ... పెరిగి ఎదిగే కొద్దీ మరణం సమీపించే కొద్దీ... మనం సుమధుర సంగీతాన్ని అందించామా, బెకబెకమంటూ అరుస్తున్నామా... అన్నది మనమే తేల్చుకోవాలి. ఒకసారి ఒక కొంగా, హంసా మాట్లాడుకుంటున్నాయి. హంసను చూసి కొంగ ఇలా అడిగింది: "కళ్ళు, కాళ్ళు, ముక్కు ఎర్రగా ఉన్నాయ్ ఎవరోయ్ నువ్వు?” "నేను హంసను”. “ఎక్కడి నుండి వస్తున్నావు" "మానససరోవరం నుంచి” “అక్కడ ఏమేం ఉంటాయేమిటి?” "స్వర్ణ కమలాలు, అమృతం, రత్నాలు, పారిజాతాలు... ఇంకా ఎన్నో మనోహరమైనవి, లోకానికి ఉపకరించేవి. ఉంటాయి" "ఇంతేనా! నత్తగుల్లలు ఉండవా?". "ఉండవు" అందట హంస అది విన్న కొంగ వేళాకోళంగా నవ్వుకొంటూ వెళ్ళి పోయిందట. ఇప్పుడు మనకు మనమే నిర్ధారించుకోవాలి - హంసలా బతకాలనుకొంటున్నామా? కొంగలా ఇతరుల్ని వేళాకోళమాడి.. నత్తగుల్లలే గొప్పవని భ్రమపడాలనుకొంటున్నామా!                                          *నిశ్శబ్ద. 

సొంతింటి కోసం స్కెచ్ ఇలా!! 

  ప్రతి ఒక్కరికి సొంతం ఇల్లు అనేది ఒక కలలాగా ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి జీవితకాలం కష్టడేవాళ్ళు చాలామంది ఉంటారు. వెనుక తరాల ఆస్తిపాస్తులు, పెద్ద పెద్ద సంపాదన ఏమాత్రం లేనివాళ్లకు అయితే సొంతిల్లు అనేది అందని ద్రాక్షలాగా ఉంటుంది. ఏళ్లకేళ్ళు అద్దె ఇళ్లలో బ్రతికేస్తూ అసంతృప్తిని భరిస్తున్నవాళ్ళు ఎంతోమంది ఉందనే ఉంటారు. నిజానికి పేద, బడుగు వర్గాల వారికి ప్రభుత్వాలు భూములు మంజూరు చేసినా, ఇళ్ల నిర్మాణం కోసం లోన్లు ఇచ్చినా అవన్ని కూడా అందుకుంటున్న జనాభా శాతం చాలా తక్కువ. అందువల్ల సొంతింటి కల మీద ఆశలు వదిలేసుకుంటూ కొందరు, మనసులో బాధపడుతూ మరికొందరూ అసంతృప్తిగా బ్రతికేస్తున్నారు.కాసింత మెరుగైన సంపాదన ఉంటే సొంతం ఇల్లు అనేది పెద్ద ఘనకార్యం కాదని, అందులోనూ పట్టణాల్లో ఇలాంటి కల తీర్చుకోవడం కష్టమని అసలు అనిపించదు. కావాల్సిందల్లా కాస్త ప్రణాళిక మాత్రమే. పొదుపు సూత్రంలో ప్రణాళిక!! కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అనేది అందరికీ తెలిసిన విషయమే!! అయితే ప్రతి నెలా సంపాదన, పొదుపుగా ఇల్లు ఎలా నెట్టుకురావచ్చు?? ఖర్చులు, మిగులు ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుని, అనవసరమైన ఖర్చుల వెంట వెళ్లకపోతే పొదుపు కూడా బాగానే చేయచ్చు.  పెళ్లి తరువాత?? చాలామందికి పెళ్లి తరువాత చిన్నగా బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. రెండు చేతుల సంపాదన ఉంటే పర్లేదు కానీ ఒక్కరి సంపాదనతో నగరాల్లో నెట్టుకురావడం కష్టమే. ఇద్దరి సంపాదన ఉన్నవాళ్లు అయితే చక్కగా లోన్ తీసుకుని  ప్లాట్ కొనేసి సెటిల్ అయిపోతారు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వస్తుంది. అదే పిల్లల బాధ్యత. పెళ్లయ్యాక చాలామంది మొదట సెటిల్ అయ్యాక పిల్లలు అనేది ఇందుకే. పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ళ ఖర్చులు, ఆ తరువాత చదువులు, ఫీజ్ లు ఇలా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు ఇంటికి పునాది వేసినట్టు ఇంటి కలకు కూడా పెళ్లికి ముందే ఓ ప్రణాళిక వేయడం ఉత్తమం. బ్యాంక్ లతో భళా!! ఇప్పట్లో చాలావరకు బ్యాంక్ లు లోన్లు ఇచ్చేస్తున్నాయి. వాళ్లకు కావాల్సిందల్లా ఉద్యోగం సరిగ్గా ఉందా?? లేదా?? నెలసరి ఆదాయం పెట్టుకున్న లోన్ కు తగ్గట్టు కట్టేలా ఉందా లేదా అన్నది మాత్రమే. ఇలా లోన్ తీసుకోవడం నుండి నెలవారీ చెల్లింపులు సక్రమంగా కట్టేస్తూ ఉంటే ఎలాంటి సమస్యా ఈ లోన్ల వల్ల రాదు. చాలామందికి లోన్ అప్లై చేసుకోవడం ఇల్లు కొనుక్కోవడం తెలుస్తూనే ఉంటుంది కానీ  నెలసరి చెల్లింపులు సక్రమంగా కట్టకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అభిరుచితో కొత్తగా!! చాలమందికి  ఉద్యోగ వేతనం సరిపడినంత ఉండదు. అయినా వాళ్ళు అందులో కొనసాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రస్తుత కాలంలో కేవలం ఆ ఉద్యోగంతో సంపాదిస్తూనే తృప్తిపడిపోయి ఆగిపోకుండా అభిరుచిని బట్టి పార్ట్ టైమ్ లేదా స్వీయ అభిరుచితో తమదైన సంపాదనను ఎలాంటి సమస్య లేకుండా చేతుల్లో అందుకోవచ్చు. కేవలం రెండు లేదా మూడు గంటల పనితో సుమారు పదివేల రూపాయల వరకు స్అంపడించే అవకాశాలు బోలెడు ఉంటున్నాయి. ఇవి మాత్రమే కాకుండా స్వంతంగా ఉద్యోగం లేని సమయాల్లో తమలో ఉన్న నైపుణ్యంతో వ్యాపారాలు చేస్తూ షేర్ మార్కెట్ మీద అవగాహనతో పెట్టుబడులు పెడుతూ కూడా గొప్పగా సంపాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మార్గాలు అనుసరిస్తే ఎవరితో ఉన్న అభిరుచే వారికి బోలెడు అవకాశాలు తెచ్చిపెడుతుంది. మీ నిర్ణయం మీ చేతుల్లో!! చాలామంది ఇల్లు, స్థలం వంటివి కొనుగోలు చేయాలి అంటే ఎంతో మంది అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రాంతాన్ని బట్టి ఉండే ధరల విషయంలో ఈ అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిదే అయితే ఇల్లు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం మాత్రం వేరే ఎవరి చేతుల్లో పెట్టకూడదు. ఈ కాలంలో అయితే అపార్ట్మెంట్లు ఎంతో సులువుగానే లభిస్తున్నాయి కూడా. ముఖ్యంగా కాసింత ఓపిక ఉంటే యూట్యూబ్ లాంటి చోట్ల ఉన్న ఆసక్తిని అప్లోడ్ చేస్తూ కూడా బోలెడు సంపాదించవచ్చు.  కాబట్టి ఇన్ని విధాలుగా ఆలోచిస్తే ఇన్ని ఆలోచనల్ని ఒక ప్రణాళికలో చేరిస్తే సొంతిల్లు నిజం కానిదేమీ కాదు. ◆ వెంకటేష్ పువ్వాడ  

పదే పదే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? దాని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాకవుతారు!!

టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.  బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది. ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది . ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.                                                       *నిశ్శబ్ద.

వర్షాకాలంలో దోమల బెడద తగ్గాలంటే ఈ టిప్స్ పాటించాలి..!

వర్షాకాలం ఇంటి పరిసరాలు చాలా చిత్తడిగా ఉంటాయి.  ఇలాంటి ప్రాంతాలు దోమలు పెరగడానికి అనువుగా ఉంటాయి.  విపరీతమైన దోమల కారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు,  మలేరియా,  చికెన్ గున్యా వంటి జ్వరాలు వస్తాయి.  అయితే ఇంటి పరిసరాలలో అసలు దోమలు ఉండకూడదంటే ఈ కింద చెప్పుకునే చిట్కాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఇలా చేస్తేనే ఈ వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా తమను తాము మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు. ఇంటి పరిసరాలలో ఉండే పూల కుండీలు,  బకెట్లు,  పాత టైర్లు వంటి వాటిలో వర్షం నీరు చేరుతూ ఉంటుంది.  ఇలాంటి వాటిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. నీరు అలాగే నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ దోమల ఉదృతి పెరుగుతుంది.  కాబట్టి ఇంటి పరిసరాలు పొడిగా, నీటితో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో  ఉన్న నీటి కాలువలు,  డ్రైనేజీ సిస్టం, నీరు నిల్వ చేసే సొంపు వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి.  వర్షం కారణంగా వీటిలో కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు అడ్డు పడి నీరు నిలుస్తూ ఉంటుంది.  ఇవి కూడా దోమలకు ఆవాసాలుగా మారతాయి. నీటి కాలువలు, డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడూ నీరు పారుతూ ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లినా,  ఇంటి చుట్టుప్రక్కల దోమల ఉదృతి ఎక్కువగా ఉన్నా దోమ కాటుకు గురి కాకుండా, చర్మాన్ని సంరక్షించగల లోషన్ లు, క్రీములు, స్ప్రే లు  ఉపయోగించాలి. ఇవే కాదు నిమ్మ, యూకలిప్టస్ నూనె వంటి సారాలతో కూడిన స్ప్రే లు దోమలను దరిదాపుల్లోకి రానివ్వవు. వీటిని వినియోగించాలి. ఇంట్లో నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె, నిమ్మ,  టీట్రీ వంటి నూనెలను ఉపయోగించాలి. ఆయిల్ డిఫ్యూజర్ లను ఉపయోగించాలి.  ఇవి దోమలను ఇంట్లో నుండి తరిమికొట్టడంలో సహాయపడతాయి. పైపెచ్చు ఇల్లంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లోనే దోమలు ఎక్కువగా వస్తుంటాయి.   ఈ సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లు ఆన్ లో ఉంచాలి.  గాలి ఉదృతి కారణంగా దోమలు సరిగా ఎగరలేక ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. ముఖ్యంగా పడకగదులలో ఫ్యాన్లు ఆన్ లో ఉంచితే పడుకునే సమయానికి దోమలు అక్కడి నుండి వెళ్లిపోతాయి. దోమల బెడద తప్పించుకోవడానికి ఇంట్లో వేప,  సాంబ్రాణి వంటి హానికరం కాని వాటితో ఇంట్లో ధూపం వెయ్యాలి.  ఇవి ఒకవైపు దోమలను తరిమికొట్టడంలోనూ, మరొకవైపు వాటి వాసన కారణంగా ఇంట్లో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ సహాయపడతాయి. ఇంటి బాల్కనీ,  ఇంటి ఆరుబయట ప్రాంతంలో సిట్రోనెల్లా,  లావెండర్,  బంతి పువ్వులు, నిమ్మగడ్డి వంటి మొక్కలను పెంచాలి.  ఈ మొక్కల సువాసన కారణంగా దోమలు ఆ దరిదాపుల్లో ఉండవు. ముఖ్యంగా ఇంటి తలుపులకు,  కిటికీలకు నెట్ కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  దీనివల్ల ఇంట్లోకి తాజా గాలి వస్తూనే దోమలు రాకుండా ఉంటాయి.                                         *రూపశ్రీ.

కొత్తకొత్తగా…అడుగులెయ్యండి!!

ఈకాలంలో అందరికి శరీరం మీద శ్రద్ధ పెరిగిందనే చెప్పుకోవాలి. ట్రెండింగ్ లో ఉన్న దేన్నీ వదలరు. తినే తిండి నుండి, తాగే ద్రవపదార్థాలు, సమయం, ప్లానింగ్, ఇంకా వ్యాయామాలు, జిమ్ లో కసరత్తులు ఇలా బోలెడు ఫాలో అవుతుంటారు. ఎంత బిజీ లైఫ్లో మునిగిపోయిన కనీసం వారానికి ఒకసారి అయినా ఔటింగ్ వెళ్లడం, స్నేహితులను కలవడం, ఎంజాయ్ చేయడం. ఇలాంటివన్నీ బోలెడు ఫాలో అవుతుంటారు.  ఇవన్నీ కూడా మనిషిని శారీరకంగానూ మరియు మానసికంగానూ దృఢంగా ఉంచేవే!! అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ముఖ్యంగా బాచ్లర్స్ వీటిని ఫాలో అవ్వగలరు. వాళ్లకున్న ఫ్రీడమ్ అలాంటిదే మరి. కానీ పెళ్ళైనవాళ్ళు అన్నిటినీ ఫాలో అవ్వాలన్నా ఎన్నో కారణాలు కనిపిస్తుంటాయి. వాటిలో నిజానికి కుటుంబం మరియు కుటుంబంతో కలసిపోయిన బాండింగ్ మొదలైనవి చిన్న అడ్డంకులుగా కనిపిస్తాయి. కానీ వాటిని బయటకు చెప్పలేరు. అందుకే చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మారినా అలవాట్లు మాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇదిగో ఇలా చేస్తే కచ్చితంగా కొత్తగా మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.  టైం ప్లానింగ్!! ఇది కేవలం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం నుండి రాత్రి పడుకునేవరకు  ప్రతిదీ ఒక సమయం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుకున్న సమయానికి ఏది పూర్తవకుండా ఇబ్బంది పెడుతుంది. కానీ దాన్ని అట్లాగే వదిలెయ్యకూడదు. ఒక పని అనుకున్న సమయం కంటే ఓ అరగంట ఆలస్యం అయినా సరే దాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఉంటే దాన్ని ఆ అరగంట సమయం ఎక్స్ట్రా తీసుకోకుండా కరెక్ట్ టైమ్ కు పూర్తిచేసే రోజు తప్పకుండా వస్తుంది. అంటే ఇదొక సాధనలాగా జరిగే ప్రక్రియ. సమయ ప్రణాళిక అనుకోగానే మొదట్లోనే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోదు. అందువల్ల కరెక్ట్ గా సెట్ అవట్లేదని నిరుత్సాహపడి దాన్ని వదిలేయకండి. ఈ సమయ ప్రణాళిక మీ నుండి మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఎంతో మేలు  చేస్తుంది. ముఖ్యంగా పిల్లల జీవితం గొప్పగా సాగేందుకు సహాయపడుతుంది. ప్రాధాన్యతలు!!  ప్రతి ఒక్కరి సమయ ప్రణాళికలో కొన్ని ప్రాధాన్యత ఎక్కువ ఉన్నవి, కొన్ని తక్కువ ఉన్నవి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం అందరూ పొరపాటు చేస్తారు. ఏదైనా ఆఫీస్ పని లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినపుడు శారీరక మరియు వ్యక్తిగత సమయాలను కుదించి వాటికి కేటాయిస్తారు. అయితే తిరిగి వాటిని భర్తీ చేయడం ఎలా అనే విషయాన్ని పట్టించుకోరు. కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యమే కానీ శరీరాన్ని, మూడ్స్ ను డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. వృత్తి పరమైన ప్రాధాన్యతల్లో పడి శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించకూడదు. ప్రణాళిక వేసుకున్నాకా ప్రతి ఒక్కటీ ముఖ్యమైనదే అని, అన్నిటికి సమప్రధాన్యత, ప్రతి పనిని ఒకే విధమైన శ్రద్ధా భక్తులతో చేయాలి. అప్పుడే మీ ప్రణాళికలకు, ఆలోచనలకు సార్థకత.  ప్రోద్బలం, ప్రోత్సాహం!! కుటుంబ సభ్యుల నుండి ఎదో ఒక విధంగా ఏదో ఒక పనిదగ్గర ఇబ్బంది ఎదురవుతూ ఉంటే సింపుల్ గా కుటుంబ సభ్యులలో ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను ఆ పని వైపు ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు కూడా వారిలో ప్రత్యేకత ఉందని గమనించి తమకంటూ ఓ గుర్తింపు వైపు సాగిపోతారు. ఇలా చేయడం వల్ల ఇతరుల సమయాన్ని గౌరవించే అలవాటు కలుగుతుంది. అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఒకరికొకరు చర్చించుకుని సమయాన్ని ఎంతో సరదాగా గడపవచ్చు. నిజానికి  ఎప్పుడూ వెన్నెల ఉంటే దాన్ని అంతగా ఇష్టపడేవాళ్ళా?? లేదు కదా!! ఇది కూడా అంతే మనుషులు ఎప్పుడూ బంధించుకున్నట్టు ఉంటే ఆ బంధంలో కొత్తదనం కనిపించదు. చివరగా చెబుతున్నా ఎంతో ముఖ్యమైన మాట. మొదట బద్ధకాన్ని వదిలి జీవితాన్ని కొత్తగా మలచుకోవాలి అనే ఆలోచనతో ఆగిపోకుండా అటువైపు అడుగులు వేయాలి. అప్పుడే కొత్తదనం కిలకిలా నవ్వుతుంది జీవితంలో. ◆ వెంకటేష్ పువ్వాడ  

బ్రేక్ తీసుకుంటారా?

కొంచెం బోర్ కొడితే చాలు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఇంట్లోనూ, బయట, ఉద్యోగంలో, సహా ఉద్యోగులతో, చుట్టాలు ఇంకా చుట్టుపక్కల గందరగోళ వాతావరణం వల్ల మనసు చాలా చికాకు పడుతుంది. "అబ్బా!! ఎక్కడికైనా పారిపోదాం బాస్" అని ఏదో ఒక మూమెంట్ లో ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు, అనుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి నుండి అలా అనుకోకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?? మనసు చికాకు పడకుండా ఉంటే చాలు అలా అనుకోకుండా హమ్మయ్య అనేసుకుంటాం. ఈ గందరగోళం నుండి తప్పించుకోవడం ఎలా అనే ప్రశ్న ఏదైతే ఉందో అది మనిషిని మళ్ళీ ఆలోచనల్లోకి నెడుతుంది. కానీ వీటన్నిని దూరంగా తరిమెయ్యడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే బ్రేక్ తీసుకోవడం. బ్రేక్ తీసుకోవడం ఏంటి అంటే…… చేసే పనులు నుండి చిన్నపాటి విరామం కావాలి మనిషికి. నిజానికి ఈ కాలంలో మనిషికి శారీరక శ్రమ అంటూ ఎక్కువ లేదు. ఊపిరి ఆడనివ్వని ట్రాఫిక్ జాముల్లో ప్రయాణం చేయడం, ఆఫీసుల్లో గంటల కొద్దీ సిస్టం ల ముందు కూర్చుని ఉండటం మాత్రమే శరీరానికి పని. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంది కాబట్టే బ్రేక్ అవసరం.  ఎలా ??..... ఇలా….. బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడం ఎలా అని అనుకుంటారు అందరూ. కొత్తదనం ఎప్పుడూ మనిషిని కొన్ని ఇర్రిటేషన్స్ నుండి బయటకు తీసుకొస్తుంది. అందుకే అక్కడక్కడే ఉక్కిరిబిక్కిలో ముంచే ప్రాంతాల్లో నుండి కాస్త దూరం వెళ్తుండాలి అప్పుడప్పుడు. ఇంట్లోనే ఒకే గదిలో 24 గంటలు ఉండాలంటే చెప్పలేనంత చిరాకు కలుగుతుంది. తప్పనిసరిగా అలా ఉండాల్సి వస్తే రోజు రోజుకు అది ఒత్తిడికి దారి తీస్తుంది. అలాంటిదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాకపోతే గదుల లాంటి నుండి బయటపడగానే ప్రయాణం, ఆఫీసు, తోటి ఉద్యోగులు, అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి మళ్ళీ ఇల్లు, ఇంట్లో గదిలో నిద్ర. కొందరికి అలా నిద్రపోవడం కూడా చెప్పరానంత అసహనం కలుగుతూ ఉంటుంది. అందుకే బ్రేక్ కావాలి.  ఎటు వెళ్ళాలి?? కొత్తదనం అనేది మనిషిలోకి కొత్త ఎనర్జీని పాస్ చేస్తుంది. కొత్తదనం అంటే కొత్త బట్టలు కట్టుకుని మెరిసిపోవడం కాదు, మన పరిధిలో ఉన్న ఆలోచనలను మార్చేసుకోవడం కాదు. తాత్కాలిక ఉపశమనం అనేమాట వినే ఉంటారు కదా. టెంపరరీ రిలాక్సేషన్ అనేది మనిషి ఎప్పటికప్పుడు రీఛార్జి అవ్వడానికి సహాయపడుతుంది.  విహారాయత్రలు మనిషికి మానసికంగా ఊరట ఇవ్వడంలో పర్ఫెక్ట్ గా సహాయపడతాయి. ప్రకృతికి దగ్గరగా పీస్ ఫుల్ గా!! ఈ టెక్నాలజీ ప్రపంచం గురించి ఎంతన్నా చెప్పండి. అక్కడ కలిగే మానసికపరమైన ఒత్తిడిని తొక్కేసి మనిషిని తిరిగి ఉత్సాహవంతుడిగా చేసేది ప్రకృతి మాత్రమే. అదే గొప్ప మెడిసిన్. పచ్చదనం, చల్లని గాలి, చెట్ల నీడలు, మట్టి దారులు, పువ్వులు, పక్షుల కిలకిలలు, నీటి ప్రవాహాలు ఎంత గొప్ప ఊరట లభిస్తుందో  మాటల్లో చెప్పలేం.  అవి మాత్రమే కాకుండా ఆసక్తికర ప్రదేశాలు, చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎంతో అద్భుతం. నిజానికి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కడైనా ఉన్నాయంటే అవన్నీ ప్రకృతికి నిలయమైన పంచభూతాలు పుష్కలంగా ఉన్న చోటులోనే ఉంటాయి. అడవులు, కొండల మధ్య అలరారుతూ జటాయి. రిలాక్సేషన్!! రోజూ అవే రోడ్ లలో పడి ప్రయాణిస్తూ, అదే ఆఫీసులో నలిగిపోతూ, కుటుంబ బాధ్యతలను మోస్తూ మానసిక ఒత్తిడిలో మునిగి తేలుతున్నవాళ్ళు నచ్చిన ప్రాంతానికో, కొత్త ప్రదేశాలకో అపుడపుడు పోతుండాలి. అందుకోసమే బ్రేక్ తీసుకోవాలి.  రిలాక్స్ అయిపోవాలి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

అవసరమైన పని మాత్రమే చేయడం ఎందుకు ముఖ్యం?

మన దైనందిన జీవితంలో ప్రతీ ఒక్కరికీ అవసరాలు వుంటాయి. కానీ- ఏవి అవసరం ఏవి అనవసరం అనే విషయం తెలుసుకోలేక సందిగ్ధంలో పడిపోయి వాటికోసం కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చాలా మంది.  ఇలా సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల  మనకు లభించేది ఏదీ వుండదు అవకాశాలు చేయి జరిపోవడం, కాలం గడిచిపోవడం. ఇవి రెండూ నష్టాలు తప్ప ఏమాత్రం వారికి కొంచెం కూడా ఉపయోగకరం కాదు. ఎప్పుడైనా సరే మనం ఒక పనిని ప్రారంభించేటప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అసలు మనకు ఈ పని ద్వారా ప్రయోజనం వుందా లేదా అనే విషయం ఆలోచించాలి. అలాగే చాలామంది అప్పటికప్పుడు కలిగే ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. ఇలా తాత్కాలిక ప్రయోజనాలు కోసం మనం పనులు ప్రారంభించకూడదు. మనం ఇలాంటి పనులు చెయ్యటం ద్వారా ప్రయోజనం లేదు. కాని కాలక్షేపం కోసం చేస్తున్నాను అని అనుకుంటే ఆ పని చెయ్యడం అంత సమంజసం కాదు. మనకు ప్రయోజనం లేని ఏ పనికోసమైనా కూడా మన కాలాన్ని వృధాగా ఖర్చుపెట్టకూడదు. కాలం అంటే జీవితం, కాలాన్ని వృధా చేస్తున్నామంటే మన జీవితాన్ని మనం చేజేతులా వృథా చేసుకుంటున్నట్లే, మనకు జీవితంలో ఉన్నతమైన స్థానం కావాలి అంటే మన జీవితంలో అధిక సమయాన్ని మన విజయానికి దోహదపడే అంశాలపైనే కేటాయించాలి.  అనవసర విషయాల కోసం సమయాన్ని కేటాయించటం ద్వారా అవసరమైన విషయాలు మరుగున పడిపోతాయి. అంటే అంత ప్రాముఖ్యత లేని పనులు చేస్తూ జీవితంలో మంచి స్థానానికి వెళ్లాల్సిన మనం, అవకాశాలు ఉన్నా వాటిని గుర్తించక  విజయానికి దూరంగా వుండడం జరుగుతుంది. అందుకే ముందుగానే మనకు ఏది అవసరమో నిర్ణయించుకొని దానికోసం మన జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. తద్వారా విజయ సాధనకు దగ్గరగా వుంటాము. విజయం చేరువ కావాలంటే దాఞ్జకోసం సమయాన్ని ఎక్కువ కేటాయించడమే ఉన్నతమైన మార్గం.  సాధారణంగా మన దైనందిన జీవితంలో కొన్ని సాధారణ విషయాలు వుంటాయి. ఇవేమీ పెద్ద ప్రాముఖ్యం లేని విషయాలులే అనుకుని, అలాంటి సాధారణ విషయాలను విస్మరిస్తే అవే కొంతకాలానికి అవే అత్యవసరమైనవిగా మారవచ్చు. అందువల్ల దైనందిన విషయాలే కదా అని తాత్సారం చెయ్యకూడదు. ఫలానా పనులు చెయ్యాలని నిర్ణయించుకునే ముందు ఆ పనులకు ప్రాధాన్యతా క్రమాలను ఇవ్వగలిగితే అవి సునాయాసంగానే జరుగుతాయి.  ప్రాధాన్యతా క్రమం అంటే మనం ఒక పనిని చెయ్యాలనుకుంటున్నామని అనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలంటే, ఆ పని అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం వుందా లేదా? అది ముఖ్యంగా నిర్వహించాలా లేదా? లేకపోతే ఈ పని చెయ్యటం మంచిదా కాదా? ఈ పనిని ఎవరికైనా అప్పగించవచ్చా లేదా? దీనిని వెంటనే చెయ్యకపోతే నష్టం ఏమైనా వుందా లేదా అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే మనం మన కాలాన్ని వృధా చేయకుండా విజయసాధనకు దగ్గరవ్వగలుగుతాము. మనకు ఏది అవసరం, ఏది అనవసరమో నిర్ణయించుకోగలగటంపైనే సమయ పాలన అనేది ఆధారపడుతుంది. అయితే కొన్ని విషయాలు తాత్కాలికంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోయినా భవిష్యత్తులో తప్పక గొప్ప పలితాన్ని ఇస్తాయి. అలాంటి వాటిని గురించి ఆలోచించి తప్పక మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవడంలో సఫలమైనట్టు.                                       ◆నిశ్శబ్ద.

భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఏం చేయాలి?

రెండు విభిన్న మనస్తత్వాలు కలిసి జీవితం సాగించడం అంటే అది చాలా క్లిష్టమైన సమస్యే. కానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసి ఇద్దరూ కలసి బ్రతికేలా చేస్తుంది. అయితే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరితో మరొకరు గొడవ పడుతూ ఉంటారు.  అలాంటిది వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య గొడవ రావడం అనేది చాలా సాధారణ విషయం.  గొడవ లేని భార్యాభర్తల బంధం అసలు ఉండదని చెప్పవచ్చు. కానీ గొడవ పడిన ప్రతి భార్యాభర్త విడిపోవడం అనే  ఆప్షన్ వరకు వెళ్లరు.  ఇప్పటి జనరేషన్ లో మాత్రం గొడవలు వర్షాకాలంలో వర్షం కురిసినట్టు ఎడాపెడా జరుగుతూనే ఉంటాయి.  ఇలాంటి వారు విడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.  గొడవ జరిగినా సరే.. భార్యాభర్తలు విడిపోని పరిస్థితి రాకూడదు అంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలి? గొడవ జరిగేటప్పుడు అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది శ్రద్దగా వినాలి. అవతలి వాళ్లు ఫిర్యాదులు చేస్తూ ఉండవచ్చు.  సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కానీ అవతలి వాళ్లు చెప్పేది వినాలి.  వారు చెప్పేది నచ్చకపోతే అప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వగుండా ప్రశాంతంగా రియాక్ట్ అవ్వాలి. మీ వైపు ఏదైనా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. భాగస్వామికి క్షమాపణ చెప్పే విషయంలో ఎప్పుడూ అహం చూపించకూడదు.  ఒకవేళ భాగస్వామి ముందు చెప్పలేనంత కోపం వస్తే ఆ కోపాన్ని బయటకు వ్యక్తం చేయకుండా సింపుల్ గా నెంబర్స్ కౌంట్ చేయాలి. కోపం కంట్రోల్ లోకి వచ్చే వరకు ఇలా నెంబర్స్ కౌంట్ చేయడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది.  కోపం కాస్తో కూస్తూ తగ్గుతుంది. ఏం చేయకూడదు? భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు కేకలు వేయకూడదు.  అలాగే అరవకూడదు.  గొడవను కూడా ప్రశాంతంగా మెల్లిగా మాట్లాడుతున్నట్టే పడాలి. అలా చేస్తే మీరు దేనికి బాధపడుతున్నారనే విషయాన్ని అవతలి వారు కూడా బాగా అర్థం చేసుకుంటారు. మీ మీద తిరిగి కోపం చేసుకోరు. భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవల్లో పొరపాటున కూడా ఇరు కుటుంబ సభ్యుల గురించి,  వారి వ్యక్తిగత విషయాల గురించి ఎత్తి చూపి మాట్లాడి విమర్శించకూడదు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఇద్దరి గురించే ఉండాలి. గొడవ జరిగేటప్పుడు ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడకూడదు. ఇది ఒకరి మీద మరొకరికి ఉండే మంచి అభిప్రాయం పోయేలా చేస్తుంది. కొన్ని సార్లు ఇలా చెడుగా మాట్లాడటం అనేది శాశ్వతంగా బంధం తెగిపోవడానికి కారణం అవుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక విషయం గురించి గొడవ జరిగి అది పరిష్కారం అయిన తరువాత తిరిగి  అదే విషయం గురించి మళ్లీ గొడవ పడకూడదు.  ఇది ఇద్దరి మధ్య బంధాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మర్యాద ఉండాలి.. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నట్టే గొడవలు కూడా వస్తాయి.  అయితే భార్యాభర్తలు ఇలా గొడవ పడే విషయంలో కూడా మర్యాద మరచిపోకూడదు. ఇద్దరి మధ్య ఒక  ఒప్పందం ఉండాలి. ఎప్పుడూ మూడవ వ్యక్తి ముందు గొడవ పడకూడదు. గొడవలు జరిగేటప్పుడు ఒకరిని మరొకరు కించపరుచుకోకూడదు. వేళ్లు చూపించి మాట్లాడటం, వెక్కిరించి మాట్లాడటం,  లోపాలను లేవనెత్తడం, చేతకాని వ్యక్తులనే అర్థం వచ్చేలా దూషించడం చేయకూడదు. ఇవన్నీ ముందే కూర్చొని మాట్లాడుకుని ఒప్పందం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే భార్యాభర్తల మధ్య  గొడవలు రావడం కూడా తగ్గుతుంది.  ఒకవేళ వచ్చినా భార్యాభర్తలు కొద్దిసేపటికే మాములుగా మారిపోతారు.                                             *రూపశ్రీ.

పిల్లలకు చదువు మీద ఏకాగ్రత ఉండట్లేదా? ఈ ఒక్క పని  చేస్తే చురుగ్గా ఉంటారు..!

పిల్లలు చక్కగా చదువుకోవాలన్నది ప్రతి తల్లిదండ్రి కోరిక. అందుకే పిల్లలున్న ప్రతి ఇంట్లో పిల్లల చదువుపట్ల ఆందోళన పడే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదని ఎప్పుడూ పిల్లలను వేపుకు తింటూ ఉంటారు కూడా. పిల్లలు తల్లిదండ్రుల బాధ పడలేక పుస్తకం ముందు అయితే కూర్చొంటారు కానీ వారికి పుస్తకం మీద దృష్టి ఉండదు.  ఒకవేళ చదువుకోవాలని దృష్టి పెట్టినా వారికి ఏకాగ్రత నిలవదు.  పిల్లలకు ఏకాగ్రత నిలవడం లేదని తల్లిదండ్రులు లైట్ తీసుకోలేరు.  అలాగని ఏం చేయాలో వారికి అర్థం కాదు.   కానీ ఒకే ఒక్క పని చేయడం వల్ల పిల్లలు తిరిగి చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. చదువులో చురుగ్గా ఉండగలుగుతారు.  అదేంటో తెలుసుకుంటే.. పిల్లలు చదువు మీద దృష్టి పెట్టాలన్నా.. చదువులో చురుగ్గా ఉండాలన్నా,  విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలన్నా, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలన్నా ధ్యానం చక్కగా సహాయపడుతుంది. పిల్లలు ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..  పిల్లలు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.  ఇలా క్రమం తప్పకుండా ధ్యానం  చేసినప్పుడు పిల్లల దృష్టి,  ఏకాగ్రత మెరుగుపడుతుంది.  పిల్లలు ధ్యానం చేయడం మొదలు పెట్టిన కొన్ని రోజులకే పిల్లలు  చదువుపై బాగా దృష్టి పెట్టడం గమనించవచ్చు. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ధ్యానం ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మెరుగ్గా పని చేయడం,  మెరుగ్గా చదువుకోవడం సాధ్యమవుతుంది.  సమయాన్ని మెరుగైన రీతిలో నిర్వహించుకోగలుగుతారు. ధాన్యం చేసే పిల్లలు సమయపాలన నిర్వహించడంలో ఎప్పుడూ మెరుగ్గా ఉంటారు.  దీని వల్ల చదువులో చురుగ్గా ఉంటారు. ధ్యానం చేయడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేరింగ్  పెరుగుతాయి.  ఆత్మవిశ్వాసం,  కృతజ్ఞతా భావం మొదలైనవి పెంపొందుతాయి. ఇది చదువులపై సానుకూల ప్రభావం చూపుతుంది. ధ్యానం  IQ స్థాయిని మెరుగుపరుస్తుంది. పరీక్షల సమయంలో మెరుగ్గా ఉండాలంటే  ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది. ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ధ్యానం చేయడం ద్వారా మీరు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠాలు వినడం నుండి,  ఏదైనా నేర్చుకోవడం, ఏదైనా పని చేయడం వరకు ప్రతి విషయంలో చాలా శ్రద్దగా ఓపికగా ఉండగలుగుతారు. ఇది వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.                                            *రూపశ్రీ.

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు

చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు * రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. * చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి . * పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. * గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.  

భారతదేశానికి పన్ను విధానాన్ని తీసుకొచ్చింది ఈ మహానుభావుడే..!

  నెలలవారీ జీతం తీసుకునే వ్యక్తి నుండి ఎవైనా వస్తువులు కొనుగోలు చేయడం, పెద్ద మొత్తం నగదు బహుమతులు, ఇల్లు, కారు సహా చాలా రకాల వస్తువులపై ఇప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తోంది.  భారతదేశంలో అసలు ఈ పన్ను చెల్లించే విధానం ఎప్పుడు అమలు అయ్యింది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో పన్ను విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు జేమ్స్ విల్సన్.  ఈయన స్కాటిష్ వ్యాపారవేత్త, మరియు ఆర్థికవేత్త కూడా. 1860 లో ఈస్టిండియా కంపెనీ పాలనలో భారతదేశంలో మొదటిసారిగా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా జూలై 24,  1860లో పన్నును అమలు చేశారు. అందుకే జూలై 24ను ఆదాయ పన్ను దినోత్సవంగా జరుపుకుంటారు. కేవలం పన్నును మాత్రమే కాకుండా జేమ్స్ విల్సన్ బ్రిటీష్ వారపత్రికను కూడా స్థాపించాడు. వార్తాపత్రికతో పాటూ జేమ్స్ విల్సన్ స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను కూడా భారతదేశంలో స్థాపించాడు. అంతకు ముందు ఈ బ్యాంక్ చార్టర్డ్  బ్యాంక్ పేరుతో  ఆస్ట్రేలియా, చైనా, భారతదేశంలో ఉండేవి. కానీ ఈ మూడు బ్యాంకులు 1969 సంవత్సరంలో స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో విలీనం చేయబడ్డాయి. పన్ను విధానాన్ని,  వారపత్రికను,  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను స్థాపించిన జేమ్స్ విల్సన్ మొదట్లో టోపిల తయారీదారుగా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ ఆ తరువాత ఆర్థిక శాస్త్రాన్ని ఇష్టపడ్డాడు. ఈ కారణంగా ఆర్థిక రంగంలో తన వృత్తిని కొనసాగించాడు.  1859లో బారతదేశానికి వచ్చాడు. 1859లో భారతదేశానికి వచ్చిన జేమ్స్ విల్సన్ బ్రిటీష్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాడు.  1860లో భారతదేశంలో మొదటి ఆంగ్ల మోడల్ పన్ను బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇందులో లైసెన్స్ పన్ను, పొగాకు పన్ను కూడా ఉన్నాయి.                                  *రూపశ్రీ.  

వంటల్లో నుండి ఇంటి క్లీనింగ్ వరకు.. బేకింగ్ సోడా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే..!

బేకింగ్ సోడా.. బేకింగ్ పౌడర్ అని రెండు రకాలు ఉంటాయి.  వీటిలో బేకింగ్ సోడాను సాధారణంగా వంటల్లోనూ, బేకింగ్ పౌడర్ ను కేకులు, బేకింగ్ ఆహారాలలోనూ ఉపయోగిస్తారు. అయితే బేకింగ్ సోడాను కేవలంలో వంటల్లో మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాల కోసం వాడుతుంటారు.  దీన్ని వంటింటి నుంచి ఇల్లు క్లీన్ చేయడం వరకు బోలెడు రకాలుగా ఉపయోగిస్తారు.  ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే.. బేకింగ్ సోడాను ఇంట్లో కర్టెన్ల నుండి  సోఫా కవర్ లు,  కార్పెట్ లు, దిండు కవర్ లు, దుప్పట్లు ఇలా చాలా రకాల క్లాత్ లను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.  ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.  మురికి బాగా వదలడమే కాకుండా క్లాత్ లు మాసిన వాసన పూర్తీగా వదులుతాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి స్టవ్ శుభ్రం చేసుకోవచ్చు. ఇది స్టవ్ మీద పేరుకున్న మొండి జిడ్డును, గ్రీజు వంటి పదార్థాన్ని చాలా సులభంగా తొలగిస్తుంది. స్టవ్ కొత్త దానిలా మెరుస్తుంది కూడా. వెనిగర్,  బేకింగ్ సోడా రెండింటిని మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి.  దీన్ని స్టవ్,  ఓవెన్,  ఇతర జిడ్డు ప్రాంతాలలో స్ప్రే చేయాలి.  ఆ తరువాత తడి గుడ్డ సహాయంతో శుభ్రంగా తుడిచి తరువాత పొడి బట్టతో నీట్ గా తుడుచుకోవాలి. వంటగదిలోనూ, బాత్రూమ్ లలోనూ, హాల్ లో సింక్ దగ్గరా కుళాయిలు తరచుగా తుప్పు పడుతూ ఉంటాయి. ఈ తుప్పును, తుప్పు మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని తుప్పు పట్టిన కుళాయి మీద స్ప్రే చేసి ఆ తరువాత క్లాత్ తో శుభ్రం చేస్తే తుప్పు వదిలిపోతుంది.  బేకింగ్ సోడాతో కలిపి ఉపయోగించడానికి వెనిగర్ అందుబాటులో లేకపోతే నిమ్మరసం అయినా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం బేకింగ్ సోడా, వెనిగర్ ను ఒక గిన్నెలో వేసి ఆ తరువాత దాన్ని కుళాయికి అప్లై చేయాలి.  కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రస్సులు,  చీరల మీద మరకలు పడినట్లైతే వాటిని తొలగించడానికి   బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాను మరకల మీద వేసి  కొద్దిసేపటి తరువాత శుభ్రం చేయాలి. తరువాత దాన్ని సాధారణంగా సర్ఫ్ లేదా వాషింగ్ మెషీన్ లో వాష్ చేయాలి. బాత్రూమ్ మూలలలోనూ,  బాత్రూమ్ లో ఇతర ప్రాంతాలలోనూ మురికి ఎక్కువగా ఉంటే దానికి బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది.  బేకింగ్ సోడా, వెనిగర్ ను మిక్స్ చేసి బాత్రూమ్ లో స్ప్రే చేయాలి.  కొద్దిసేపు అలాగే వదిలేసి ఆ తరువాత బ్రష్ సహాయంతో మూలలు క్లీన్ చేయాలి.  మురికి మొత్తం బాగా వదులుతుంది.                                         *రూపశ్రీ.

పిల్లల ప్రపంచం మాయమైపోతోంది!!

పిల్లల్ని తోటలో పువ్వులుగా అభివర్ణిస్తాడు ప్రముఖ విద్యా సంస్కర్త ఫ్రెడరిక్ ప్రోబెల్. ఆయన పిల్లల కోసం ఎంతో కృషి చేశాడు. వారి కోసం కిండర్ గార్డెన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. పిల్లల తోట అని దాని అర్థం.పిల్లల ప్రపంచం ఒక తోట అయితే పిల్లలు మొక్కలకు పూచే పువ్వుల లాంటి వారు. వారు ఎంతో సున్నితమైనవారు, వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. నిజానికి దీని ఆధారంగా రూపొందినదే ప్లే స్కూల్ అని కూడా చెప్పవచ్చు.  కానీ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇలాంటి పిల్లల ప్రపంచం. కిండర్ గార్డెన్ లో చెప్పిన ఆడుకోవడం ద్వారా నేర్చుకోవడం అనే పద్ధతిని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఉపయోగిస్తున్నారు. ఎంతసేపు వాళ్ళను పుస్తకాలకు కట్టేసి చదివించినవే చదివించి, వాటిని బట్టి పట్టించి పిల్లల్ని ఒక కృత్రిమ జీవితంలో పెద్దలే నాటుతున్నారు. ఏది పిల్లల ప్రపంచం?? నిజానికి బాల్యం ఎంతో అందమైనది. ఒక వయసొచ్చాక ఆ బాల్యాన్ని చూసి సంతోషపడి వాటిని చాలా గొప్ప జ్ఞాపకాలుగా చేసుకోవడం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు రేపటి రోజున తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటే వాళ్లకు కనిపించేది ఏమిటి?? పుస్తకాలు, బట్టి పట్టిన గంటలు, తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన కాఠిన్యం, ఉపాధ్యాయుల ముఖాలలో ఎరుపు, ఇంకా వారి చేతి బెత్తం దెబ్బలు. ఇవేనా??  ఒకప్పుడు పిల్లల ప్రపంచం ఎలా ఉండేది?? బాల్యాన్ని గురించి వర్ణించాలంటే ఆ బాల్యాన్ని రుచిచూసిన వారికే సాధ్యం అని అనిపిస్తుంది. స్వేచ్ఛగా బుల్లి గువ్వలా ఎలాంటి సమస్య లేకుండా ఇల్లంతా దొగ్గాడుతూ మొదలై అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యల దగ్గర కథలు వింటూ, నీళ్లతోనూ, మట్టితోనూ, ప్రకృతికి దగ్గరగా పెరుగుతూ ఓ పచ్చని మొక్కలాగే ఆహ్లాదంగా అనిపిస్తారు.  కానీ ఇప్పుడు!! మట్టిలో ఆడటం, నీళ్లలో తడవడం, తుళ్లుకుంటూ బయట తిరుగుతూ ఆడటం మొదలైనవన్నీ ఒక అసహ్యపు చర్యగా చూస్తారు. ఇంకా పాఠ్యపుస్తలను మాత్రమే చదవడం నిజమైన జ్ఞానం అనే భ్రమలో ఉన్నారు. బయట ప్రపంచం ఏమీ తెలియకుండా పెంచుతారు. ఇలా బయట ప్రపంచానికి దూరంగా పెంచడం వల్ల పిల్లలకు సంపాదించడం,ఉద్యోగాలు చేయడం తప్ప ఇంకేమీ తెలియకుండా పోతుంది.   అమాయకపు నవ్వులు, అల్లరి చేష్టలు, ఆటలు, పాటలు, ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ తన శైశవ గీతిలో చెప్పినట్టు మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లరా!! అంటూ సంతోషంగా చూసుకోవడానికి ఇప్పటితరానికి బాల్యమనేది మధురంగా ఉందా?? ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవులు, శుభకార్యాలు వంటి వాటికి సొంత ఊళ్లకు వెళ్లడానికి, బంధువులు, స్నేహితులలో కలవడానికి చాలామంది తల్లిదండ్రులు చెప్పుకుంటున్న సమర్థింపు "పిల్లలకు స్కూల్ పోతుంది" అని. వేసవిలో అటు ఇటు పంపకుండా ఎదో ఒక కోర్స్ లోనో, లేదా తదుపరి తరగతులకు స్పెషల్ కోచింగ్ లలో తోసేయడమో ఇలా పిల్లలకు ఎలాంటి సరదాలు, సంతోషాలు అనేవి ఏమీ లేకుండా చిన్నతనం నుండే వాళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్, ias, ips అంటూ ఎన్నెన్నో ఆలోచనలు నాటి చివరకు విలువలు లేని జీవితాన్ని వాళ్లకు అప్పగిస్తున్నారు. విలువలు అంటే పుస్తకాల నుండి నేర్చుకునేవి కాదని, అవి జీవితాలను, సమాజాన్ని, బయట ప్రపంచాన్ని చూస్తూ నేర్చుకోవడం అని. కింద పడి దెబ్బ తగిలితే ఇంకోసారి పడకూడదు అనే జాగ్రత్త పిల్లలకు అర్థమవుతుందని పెద్దలు తెలుసుకోవాలి. అంతేకానీ పిల్లలు కిందపడకుండా వాళ్ళను ఎత్తుకునే తిప్పడం వల్ల వాళ్లకు నడవడం ఎలాగో తెలియకుండా పోతుంది. అందుకే చాలామందికి జీవించడం ఎలాగో తెలియకుండా పోతోంది. మాయమైపోతున్న పిల్లల ప్రపంచాన్ని ఏ డాక్యుమెంటరీలలో, కార్టూన్ చానల్స్ లో పిల్లలకు చూపించకుండా వారిని వారిగా ఎదగనిస్తే పిల్లల జీవితాలు పచ్చగా ఉంటాయి.                                ◆ వెంకటేష్ పువ్వాడ.

సాలీడు ఆధారంగా ఓ అద్భుత కథ!

నేనేగనక దేవుడినయితే నా సృష్టి రహస్యాలను కనుగొనడానికి శాస్త్రజ్ఞులకు కొంత అవకాశమిస్తాను అంటారు విశ్వవిఖ్యాత చైనీస్ రచయిత లిన్ యూటాంగ్. ఆయన ఇంకా ఇలా అంటారు. నా అంతట నేను వారికి అట్టే సహాయమందివ్వక పోయినా, వారు చేసే కృషిలో మాత్రం అడ్డం రాను. ఒకటి రెండు శతాబ్దాల పరిశోధన ద్వారా వారేమీ కనుక్కుంటారనేది శ్రద్ధగా గమనిస్తుంటాను. శాస్త్రజ్ఞుడి దృష్టి సాలీడువంటి సామాన్య పురుగు మీదికి మళ్లిందనుకుందాం. అది ఎట్లా నిర్మింపబడిందీ, ఏ రసాయనాల ప్రభావం చేత అది ఆ విధంగా చరిస్తున్నదీ, మొదలైన విషయాలన్నీ అతడు తన పరిశోధన ద్వారా తెలియజేస్తాడు. నిర్మాణం యాంత్రికంగా జరిగిందనే విషయంలో ఎవరికీ సందేహ ముండనక్కరలేదు. అతడు సత్యమే ప్రకటించాడని అనవచ్చు. శాస్త్రజ్ఞుడి అన్వేషణ అతడ్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. సాలీడు దవడలు, జీర్ణప్రక్రియ ఎలాంటివో, అది తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నీ కనిపెడతాడు. సాలీడు నుండి వెలువడే మెత్తటి సన్నని దారం వంటిది ఎలా ఉత్పత్తి అవుతుందో, గాలి తగిలినప్పుడు కూడా అది అది ఎందుకు ఎండిపోదో కనిపెట్టవలసి వుంటుంది. ఈ ఆన్వేషణలో మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతాయి. తాను అల్లినగూడులో తానే చిక్కుకోకుండా వుంటానికి సాలీడు కాళ్ళల్లో బంకని నిరోధించే శక్తి ఏమున్నదనేది అంతుబట్టదు. ఇలా మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతై. ఈ లోగా కాన్సర్ వ్యాధిని పరిశోధిస్తున్న సంస్థ ఏదో అనుకోకుండా, ఈ బంక నిరోధక శక్తి ఎలా ఉద్భవిస్తుందనే విషయాన్ని కనుగొని, అలాంటి కృత్రిమ రసాయనాన్ని తాను ఉత్పత్తి చేస్తున్నానని ప్రకటిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. కానీ శాస్త్రజ్ఞుడికి ఇపుడొక ప్రధానమైన సమస్య ఎదురవుతుంది. తల్లి యొక్క శిక్షణ లేకుండానే పిల్లసాలీడు గూడు అల్లుకోడం ఎలా సాధ్యం? ఇది పుట్టుకతో వస్తుందా తల్లిని చూచి నేర్చుకుంటుందా, పుట్టగానే తల్లినుండి వేరుచేస్తే నేర్వగలదా అనే తర్కవితర్కాలలో పడిపోతాడు. అప్పుడు శాస్త్రజ్ఞుడు దేవుడితో ముఖాముఖి సంభాషించ కోరుతాడు. "శాస్త్రజ్ఞుడి కోరికపై, సాలీడు మెదడులో దానికి అవసరమైన విజ్ఞానమంతా స్మృతిరూపంలో ఎలా నిక్షిప్తం చేసిందీ దేవుడు విశదీకరించవచ్చు. అటు తర్వాత సంభాషణ ఈ రూపంలో వుండచ్చునని అంటాడు లిని యూటాంగ్.   "జీవరసాయనిక శాస్త్రాధారంగా సాలీడు జీన్స్ ఎలా ప్రవర్తిల్లేదీ నీకు తెలియజేశాను కదా శాస్త్రజ్ఞా” అంటాడు దేవుడు. "తెలియజేశారు భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "సాలీడు ప్రవర్తనను యాంత్రిక సరళిలో వివరించాను కదా?” "కృతజ్ఞుణ్ణి” భగవాన్ అంటాడు శాస్త్రజ్ఞుడు. "తృప్తి కలిగిందా నాయనా?” అని అడుగుతాడు.  "ధన్యుణ్ణి " అంటాడు శాస్త్రజ్ఞుడు. "అంతా అర్థమైనట్లే కదా?” అని మళ్ళీ అడుగుతాడు దేవుడు.  "అందుకు సందేహమా స్వామీ? ఏ రసాయనిక మిశ్రమం వలన, ఏ పదార్థాల ద్వారా ఈ ప్రపంచం నిర్మించబడినదో తెలుసుకోగలిగితే ఈ సమస్తాన్ని అర్థం చేసుకోవచ్చని నా నిశ్చితాభిప్రాయం” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదలావుంచి ఈ అద్భుతమంతా ఏమైవుంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శాస్త్రజ్ఞా?" అని అడుగుతాడు దేవుడు. "మీ సృజనాశక్తికి అచ్చెరువొందుతూనే వున్నాను, భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదికాదు శాస్త్రజ్ఞ, ఇదంతా ఎలా సంభవిస్తున్నదీ, ఏ పదార్థాలు, రసాయనాలు ఇందులో ప్రయోగించారు అనే వివరణ కొంత కనుగొన్నావు. నేను మరికొంత తెలియజేశాననుకో, కానీ అసలీ విధంగా ఎందుకు జరుగుతున్నది దీని అంతరార్థం ఏమైవుంటుంది. ప్రయోజనమేమిటి అనే విషయం నీకు నేను చెప్పలేద సుమా. ఎలా సంభవిస్తున్నదనే ప్రశ్న వేరు. మొదటి ప్రశ్న అలాగే వుండిపోయింది. కదా నాయనా." అంటాడు దేవుడు. శాస్త్రజ్ఞుడి కళ్ళల్లో నీళ్ళు నిండినై, గద్గద స్వరంతో "చెప్పండి స్వామి. ఇదంతా ఏమిటి? ఈ సృష్టి ప్రయోజనమేమిటి? ఎందుకదంతా?" అని ఆక్రందించాడు. “రసాయనిక సూత్రాలద్వారా అది కనుగొనలేవు బాబూ. కాని “ఎందుకు?” అనే ప్రశ్నకు నువు సమాధానం కనుగొనలేనంత కాలం సాలీడు జన్మ రహస్యాన్ని చేదించలేవు నాయనా!". "నిజమే ప్రభూ" అంటూ శాస్త్రజ్ఞుడు వినమ్రుడైనాడు. రచయిత కథనిలా అంతం చేస్తే ముచ్చటగా వుంటుందంటారు వాళ్ళంతా. చెమటలతో శాస్త్రజ్ఞుడు నిద్ర మేల్కొన్నాడు. ఏడు రోజులపాటు నోట మాటలేకుండా, స్పృహ లేకుండా పడివున్న తన భర్త కళ్ళు తెరవడం చూచి భార్య చాలా సంతోషించింది. ఆ రోజు ఇంత పథ్యం పెట్టింది. అతడు మాత్రం ఎక్కడైనా సాలీడు కనిపిస్తే అంతదూరం పరుగెడతాడు. సాలీడును గురించి అతడి కేర్పడ్డ ఈ తీవ్రమైన భయం నయమయ్యే రోగం కాదని వైద్యులు తేల్చి చెప్పారు.”                                 ◆నిశ్శబ్ద.