ఇదీ ఎర్త్‌ డే కథ

    1969 జనవరి 28: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఒక చమురుబావి నుంచి ముడిచమురు పొంగి పొర్లడం మొదలైంది. పదిరోజుల పాటు జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు లక్ష బ్యారెల్స్ చమురు నీటిపాలైంది. నీటిలో చమురు కలవడం వల్ల వేలాది సముద్ర పక్షులు చనిపోయాయి. ఇక నీటిలో ఉన్న ప్రాణులకి జరిగిన నష్టానికైతే లెక్కే లేదు. సహజంగానే ఈ వార్త సంచలనం సృష్టించింది. ‘ఇంధనం కోసం చేసే ప్రయత్నాలలో ఇవన్నీ మామూలే!’ అంటూ జనం ఎవరి పని వాళ్లు చూసుకున్నారు. కానీ కొంతమందిలో మాత్రం ఈ ఘటన భయం కలిగించింది. పర్యావరణం పట్ల మనం ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నమా! అన్న ఆలోచన రేకెత్తించింది. ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ ఉద్యమం నిర్మించే ప్రయత్నం జరిగింది. అదే ‘ఎర్త్‌ డే’.   1970లో అప్పటి అమెరికన్‌ సెనెటర్‌ Gaylord Nelson నేతృత్వంలో ఈ ఎర్త్‌ డే అనే ఉద్యమం మొదలైంది. ఆ ఏడాది ఏప్రిల్‌ 22న దాదాపు రెండుకోట్ల మంది ఊరేగింపులలోపాల్గొని పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. అప్పటి నుంచి ఏటా ఎర్త్‌ డేను నిర్వహిస్తూనే ఉన్నారు.   అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో పర్యావరణం గురించి పోరాడటం ఏమంత తేలిక కాదు. ఎందుకంటే పర్యావరణానికి హాని కలగకుండా భౌతికమైన అభివృద్ధి సాధ్యంకాదు. అందుకే అక్కడి ప్రభుత్వాలు కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలకి, పారిశ్రామిక అభివృద్ధి కారణం కాదంటూ వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పర్యావరణం గురించి చిన్నాచితకా ఉద్యమాలు మొదలైనా... వాటి మాట ప్రభుత్వం ముందు నిలబడదు. కానీ అలాంటి చిన్నా చితకా ఉద్యమాలన్నీ ఏకమయ్యే అవకాశం కల్పించింది ‘ఎర్త్‌ డే’. ఫలితంగా ప్రభుత్వం సైతం తల వంచి పర్యావరణాన్నీ, వన్య ప్రాణులనీ కాపాడేందుకు చట్టాలు చేయక తప్పలేదు.   ఒక చిన్న ఆందోళనగా మొదలైన ‘ఎర్త్‌ డే’ ఉద్యమం ఇప్పుడు వందకు పైగా దేశాల్లో ప్రభావం చూపుతోంది. క్రితం ఏడాది ఎర్త్‌ డే రోజున ఇండియా సహా 120 దేశాలు Paris Climate Agreement మీద సంతకం చేశాయంటే... ఉద్యమం ఫలిస్తున్నట్లేగా! గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేస్తూ కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించడమే ఈ Paris Climate Agreement ఉద్దేశం.   ఎర్త్‌ డే రోజున ఉద్యమకారులు ఎలాగూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడతారు. కోట్ల కొద్దీ చెట్లని నాటుతూ ఉంటారు. కానీ ఈ ఉద్యమంతో సంబంధం లేనివారు కూడా ఎంతోకొంత పర్యావరణం మీద శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ‘ఒక్కడినే ఏం చేయగలను?’ అనుకోవడానికి లేదనీ... పర్యావరణం మీద ప్రతి ఒక్కరి చర్యా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. చిన్నచిన్న దూరాలకి సైకిల్‌ లేదా నడక మీద ఆధారపడటం, చెట్లు నాటడం, రీసైకిల్డ్‌ వస్తువులని ప్రోత్సహించడం, విద్యుత్తుని వృధా చేయకపోవడం, అనవసరమైన ప్రింట్‌ఔట్స్‌ తీసుకోకపోవడం, శాకాహారం వైపు మొగ్గు చూపడం... లాంటి సవాలక్ష ఉపాయాలన్నీ పర్యావరణాన్ని ఎంతోకొంత కాపాడేవే! ఇవే కనుక పాటిస్తే ప్రతిరోజూ ఎర్త్‌ డేనే!   - నిర్జర.  

శామ్ గురించి వింటే... జీవితం మారిపోతుంది!

  కష్టాలు మనుషులకి కాకపోతే మానులకి వస్తాయా! అంటాం. కానీ చిన్నపాటి కష్టం వస్తే చాలు తల్లడిల్లిపోతాం. మనసుని ఎలా సముదాయించుకోవాలో, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో తెలియక తలకిందులైపోతాం. కానీ కొందరుంటారు. ఎంతటి కష్టం వచ్చినా, నిబ్బరంగా అడుగు ముందుకు వేస్తారు. తమకి తాము ధైర్యం చెప్పుకొంటూనే... తోటివారికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. అలాంటివాడే ‘శామ్ బెర్స్స్’ (Sam Berns).   శామ్ పుట్టగానే అతను మిగతా పిల్లల్లాగే సాధారణమైనవాడని అనుకున్నారు తల్లిదండ్రులు. ఒకవేళ చిన్నాచితకా ఆరోగ్య సమస్య వచ్చినా తాము తీర్చేయవచ్చనుకున్నారు. ఎందుకంటే శామ్ తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల వైద్యులే! కానీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకీ సమాధానం ఉంటుందనుకోవడం అత్యాశే కదా! శామ్కి రెండేళ్లు వచ్చేసరికి అతను progeria అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తేలింది.   Progeria చాలా అసాధారణమైన వ్యాధి. ప్రతి 40 లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జన్యువులలో కలిగే ఒక అసాధారణ మార్పు వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకినవారు పదేళ్లకే ముసలివాడిలా మారిపోతారు. పసివయసులోనే బట్టతల వచ్చేస్తుంది, చర్మం ముడతలు పడుతుంది, ఎముకలు పెళుసుబారిపోతాయి, శరీరం వంగిపోతుంది, గుండె వంటి అవయవాలన్నీ బలహీనపడిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే Progeriaతో 90 ఏళ్ల ముసలివారు పడే బాధలన్నీ పసివయసులోనే అనుభవిస్తారు.   శామ్కి ఊహ తెలిసేసరికి తన కష్టమేమిటో అర్థమైపోయింది. కానీ ఆ కష్టంతో జీవించడం ఎలాగో అలవాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘progeria వల్ల నేను చాలా పనులు చేయలేకపోవచ్చు. కానీ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా! చేయలేని విషయాల గురించే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే... చేరుకోదగిన లక్ష్యాలని కూడా మనం కోల్పోతాం,’ అంటాడు శామ్. అందుకనే తనేం చేయగలడో, వాటన్నింటినీ సాధించే ప్రయత్నం చేశాడు. చదువుకోవడం, సంగీతం నేర్చుకోవడం, డాన్స్ చేయడం, యాత్రలకి వెళ్లడం.. ఇలా తన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే ప్రయత్నం చేశాడు.   శామ్ సానుకూల దృక్పథం అతనివరకే పరిమితం కాలేదు. తనకి ఉన్న అరుదైన వ్యాధి గురించి ప్రపంచం మొత్తానికీ చాటాలని అనుకున్నాడు. ఆ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, ఆ వ్యాధి కలిగినవారిలో ఆశని నింపడం కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. శామ్ తల్లిదండ్రులు అప్పటికే Progeria Research Foundation అనే సంస్థని ఏర్పాటే చేశారు. ఆ సంస్థకి ఒక బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయాడు శామ్.   శామ్ పుణ్యమా అని Progeria అనే వ్యాధి గురించి ప్రపంచానికి తెలియడం మొదలైంది. కేవలం Progeriaనే కాదు, ఎలాంటి కష్టంతో అయినా కలిసి జీవించడం ఎలాగో శామ్ని చూసి జనం ప్రేరణ పొందసాగారు. 2013లో HBO శామ్ వ్యక్తిత్వం గురించి Life According to Sam పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. అదే ఏడాది TED అనే సంస్థ శామ్తో ఒక ఆన్లైన్ ఉపన్యాసం ఇప్పించింది. ఈ వీడియోని రెండుకోట్ల మందికి పైగా చూశారంటే శామ్ ప్రభావం ఏపాటిదో అర్థమైపోతుంది.   TED ఉపన్యాసంలో జీవితం గురించి తన అభిప్రాయాన్ని మూడు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేశాడు శామ్. ఒకటి – మన గురించి మనం తక్కువగా ఆలోచించుకుంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా, చేయదగిన పనుల మీద దృష్టి పెట్టడం, రెండు – మనల్ని అర్థం చేసుకునే ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులని మన చుట్టూ ఉంచుకోవడం, మూడు – ఎట్టిపరిస్థితుల్లోనూ జీవితాన్ని ముందుకు సాగించడం. అది ఒకో అడుగే కావచ్చు, చిన్నపాటి అడుగే కావచ్చు. కానీ ముందుకు సాగుతూ ఉండటమే!   TED ఉపన్యాసంలో శామ్ తను ఓ గొప్ప శాస్త్రవేత్తని కావాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ కొద్ది నెలలకే అతను చనిపోయాడు. బహుశా తను ఎక్కువకాలం బతకనని శామ్కి కూడా తెలుసేమో! ఎందుకంటే Progeria వచ్చినవారు సాధారణంగా 13 ఏళ్లకి మించి బతకరు. కానీ ఆ తలపుకి శామ్ లొంగలేదు. 17 ఏళ్ల వరకు నిబ్బరంగా బతికేశాడు. ప్రతి రోజునీ తనదిగా చేసుకుంటూ సాగిపోయాడు. అందుకే శామ్ ఈ లోకంలో లేకపోయినా... తన గురించి విన్నవారందరికీ స్ఫూర్తినిచ్చే జీవితాన్నిచ్చి వెళ్లాడు. - నిర్జర.

మనుషులు నాలుగు రకాలు – మీరే రకం!

దేవుడు భూలోకం మీద సృష్టిని ఇంచుమించుగా పూర్తిచేశాడు. ఇక అక్కడిని మనిషిని పంపాల్సి ఉంది. మనిషంటే పరిపూర్ణుడై ఉండాలి. భూమిని కాపాడుకుంటూ, నాగరికతను ముందుకు తీసుకువెళ్లేవాడై ఉండాలి. అందుకోసం తన దగ్గర ఉండే కొంతమంది దేవదూతలనే మనుషులుగా పుట్టించాలనుకున్నాడు.   ఇలా దేవుడు సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోవడం చూసి ఓ దేవదూత నిదానంగా ఆయన దగ్గరకు చేరుకున్నాడు. ‘చాలా రోజులుగా మీరేదో పనిలో నిమగ్నమవ్వడాన్ని గమనిస్తున్నాను. అదేమిటో తెలుసుకోవచ్చా!’ అని అడిగాడు దేవదూత. అప్పుడు దేవుడు ఓపికగా తన మనసులోని మాటను చెప్పాడు, భూమి గురించి నిదానంగా వివరించాడు. ‘వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మీరు భూమిని ఎలా సృష్టిస్తున్నారు? అందులో ఎలాంటి జీవుల ఉంటాయి? భూమి లోపలికి తవ్వితే ఏం కనిపిస్తుంది? భూమి మీదకి నేను కూడా వెళ్లగలనా?’ అంటూ రకరకాల ప్రశ్నలతో దేవుడిని ముంచెత్తాడు దేవదూత.   దేవదూత మాటలకు దేవుడు చిరునవ్వుతో...’ఇంత ఆసక్తిగా అడుగుతున్నావు కాబట్టి, నిన్నే మనిషిగా మార్చి భూమి మీదకు పంపుతాను. తెలియని ప్రతి విషయం గురించి ఆసక్తిగా తెలుసుకునే అలవాటు నీలో కనిపిస్తోంది. కాబట్టి నువ్వు శాస్త్రవేత్తగా మారతావు. నీ తరహా మనుషులంతా భూమిని కొత్తకొత్త ఆవిష్కరణలతో సుఖమయం చేస్తారు,’ అంటూ అతగాడిని భూమి మీదకు పంపాడు.   ఇదంతా పక్కనే ఉన్న మరో దేవదూత గమనించాడు...’అతణ్ని మీరు భూమి మీదకు ఎందుకు పంపారు? దేవదూత ఓ సాధారణ జీవిగా మారిపోతే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అసలు భూమిని సృష్టించడంలో మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఊదరగొట్టేశాడు.   రెండో దేవదూత మాటలకు దేవుడు చిరునవ్వుతో...’నీకు మనిషి బయట ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కంటే, మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది. నీలోకి నువ్వు తొంగిచూసుకునే గుణం కనిపిస్తోంది. కాబట్టి నువ్వు గొప్ప వేదాంతిగా మారతావు. నీ తరహా మనుషులు రకరకాల సిద్ధాంతాలతో సమాజాన్ని నిర్మిస్తారు,’ అంటూ అతగాడిని భూమి మీదకు పంపాడు.   భూమి గురించి తెలిసి ఒక దేవదూత, ఎవరూ లేని సమయం చూసి దేవుడి దగ్గరకు చేరుకున్నాడు. ‘భగవాన్‌! మీరేదో కొత్త లోకాన్ని సృష్టించారని తెలిసింది. ఇన్ని రోజులుగా నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. కానీ ఏమీ దక్కలేదు. నాకు ఆ భూలోకం ఇప్పించండి. నా దర్పం ఏమిటో చూపిస్తా!’ అని వేడుకున్నాడు.   మూడో దేవదూత మాటలకు దేవుడు కాసేపు ఆలోచించాడు. ఆవిష్కరణలను చేసేవాడు, ఆధ్మాత్మిక లోతుని చూసేవాడు భూలోకానికి చేరిపోయారు. కానీ అధికారం చలాయించేవారు కూడా ఒకరుండాలి కదా! అందుకని తన దగ్గరకు వచ్చిన మూడో దేవదూతని భూమి మీదకు పంపాడు. అతనూ, అతని తరహా మనుషులూ నాయకులుగా, రాజకీయవేత్తలుగా సాటివారి మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారని వరమిచ్చాడు.   దేవుడు భూమిని సృష్టించాడనీ, దాని మీదకు దేవదూతలను పంపుతున్నాడనే వార్త దేవలోకంమంతా పాకిపోయింది. ఎవరికివారు తమని ఆ కొత్త, అందమైన లోకం మీదకు పంపమని దేవుని చుట్టూ చేరసాగారు. వారి తాకిడితో దేవునికి సైతం చిరాకేసింది. ఇంతలో ఓ దేవదూత ఆయన దగ్గరకి చేరి ‘ప్రభూ! మీరు వీరందరి కోరికలతో విసిగిపోతున్నట్లున్నారు. నేను మీకు ఏమన్నా సాయం చేయగలనా? మీ చిరాకు తగ్గేందుకు ఏమన్నా సేవ చేయగలనా?’ అంటూ అడిగాడు.   నాలుగో దేవదూత మాటలు విన్న దేవునికి ముచ్చటవేసింది. ‘నేను భౌతికమైన అభివృద్ధి కోసం శాస్త్రవేత్తలని పంపాను. మనసుని శోధించేందుకు వేదాంతులని పంపాను. పెత్తనం చెలాయించేందుకు నాయకులను పంపాను. కానీ తోటివారి గురించి ఆలోచించి... వారి బాధలో సాయపడి, వారి కన్నీటిని తుడిచే మనుషులు కూడా ఉండాలి కదా! అందుకు ఇతనే సరైనవాడు’ అనుకున్నాడు. వెంటనే ఆ దైవదూతని భూమ్మీదకు పంపాడు. మరి! పైన పేర్కొన్న నాలుగు రకాలవారిలో మనం ఏ కోవకి చెందుతామో! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

LEARN TO BE HAPPY

  A happy life is what all of us are looking for. Psychologists claim that they can help us lead one. Let’s see what they have in store for us. They recommend some simple changes to our lives that will bring happiness to us. The first thing they suggest is to find something to flow into. Flow is a concept in Psychology that is described as involving in an activity that makes one forget the world around him or her. It could be anything. Dancing, swimming, creative writing or simply reading a book.   In the modern world where there is a severe lack of time for anything, we have forgotten to smile. Psychologists remind us of this simple gesture and recommend smiling often. Smile even when you don’t feel like it. Research reveals that even a fake smile has the potential to make you feel good instantly. Scientists go further ahead and explain the scientific connection between smiling and happiness.   It is said that when you smile, your facial muscles flex releasing more blood to the frontal lobes of your brain. This triggers the release of dopamine – a chemical that is responsible for feeling pleasure.   Psychology says an easy way of staying happy is accepting your mistakes. As humans we are bound to make mistakes and its okay. Accepting your mistakes will help you forgive yourself and also improve your image with other people. People will like you for owning up and being honest.   Knowing when to say no is the key to a happy life. People who lead a happy life will tell you that the secret lies in rejecting people things and behaviours that stress you out. If you try to oblige to every situation and person, you will end up being very unhappy. Give yourself the importance you deserve and don’t be afraid to say no to toxic people and situations. Life is as happy as you make it.  - KRUTI BEESAM    

ఈ ఫొటోలో మీకు ఏ రంగులు కనిపిస్తున్నాయి?

  ఇంగ్లండుకి చెందిన ‘రోమన్ ఒరిజినల్స్’ సంస్థ 2015లో ఒక ఫ్రాక్ను విడుదల చేసింది. ఎవరో ఆ ఫ్రాక్ను తొడుక్కొని సరదాగా ఫొటో దిగి ఫేస్బుక్లో పెట్టారు. అప్పటి నుంచీ మొదలైంది రచ్చ! ఆ ఫ్రాక్ బంగారం, తెలుపు చారల్లో ఉందని కొందరంటే... కాదు కాదు! అది నలుపు, నీలం రంగుల్లో ఉందని మరికొందరు వాదించారు. నిజానికి ఈ ఫ్రాక్ను నలుపు, నీలం రంగుల్లోనే తయారుచేశారని తర్వాత కాలంలో తేలింది.   The Dress పేరుతో సదరు ఫ్రాక్ సంచలనం సృష్టించింది. ఈ ప్రచారం పుణ్యమా అని ‘రోమన్ ఒరిజినల్స్’ ఈ తరహా దుస్తులను తెగ అమ్ముకొని విపరీతంగా లాభాలను సంపాదించింది. కానీ ఒకే తరహా డ్రస్ ఇద్దరు మనుషులకు రెండు రకాలుగా ఎందుకు కనిపిస్తుందన్న ప్రశ్న గత రెండేళ్లుగా శాస్త్రవేత్తలను కదిలించింది. దీని గురించి రకరకాల చర్చలు నడిచాయి. కానీ ఆ ప్రశ్నకి ఇప్పుడు జవాబు తెలిసిపోయిందంటున్నారు.   న్యూయార్కుకి చెందిన ‘వాలిస్’ అనే సైకాలజిస్టు The Dress వెనుక ఉన్న రహస్యాన్ని ఛేధించానని చెబుతున్నారు. మనం నిద్రపోయే తీరుకీ, the dressలో కనిపిస్తున్న రంగులకీ మధ్య పొంతన ఉందని వాలిస్ అంటున్నారు. మనలో కొందరు ఉదయాన్నే లేచి రాత్రిళ్లు త్వరగా పడుకుంటారు. మరికొందరేమో బారెడు పొద్దెక్కాక లేచి మళ్లీ తెల్లవారేదాకా మెలకువగా ఉంటారు. పగటి వేళలు చురుగ్గా ఉండేవారేమో సూర్యకాంతికి ఎక్కువగా అలవాటుపడుతుంటారు. రాత్రివేళ మెలకువగా ఉండేవారేమో కృత్రిమమైన కాంతికి అలవాటుపడతారు. పగటివేళ కాంతి బంగారు వర్ణంలో ఉంటుంది. రాత్రివేళ కృత్రిమమైన వెలుతురు ఎక్కువగా నీలం రంగుని వెదజల్లుతుంది.   The Dress నిజానికి నీలం, నలుపు రంగుల్లోనే కనిపిస్తుంది. కానీ పగటి కాంతికి అలవాటుపడినవారు... అది చీకట్లో తీసిన ఫొటోగా భావించి, దానికి పగటికాంతిని (బంగారు రంగుని) జోడిస్తారట. ఇదంతా మనకి తెలియకుండానే మన మెదడు చేసే సర్దుబాటు! దీనివల్ల The Dress బంగారు, తెలుపు వర్ణంలో కనిపించేస్తుంది. దాదాపు 13 వేలమందికి ఈ ఫొటోను చూపించి, నిద్రకు సంబంధించి వారి అలవాట్లను గమనించి తేల్చిన విషయమిది! అంటే మన కంటికి కనిపించేదంతా నిజమేనని ‘గుడ్డి’గా వాదించేయడానికి లేదన్నమాట! - నిర్జర.  

THE WAY TO A HAPPY LIFE

  Who doesn’t want to live a happy life? Does everyone know the secret to one? Today, let us discover the countless ways of making life happy. It could be simple things that we are missing out on because of our busy schedules. Sometimes it feels as if a happy life is lost between meetings, deadlines and endless traffic jams. To find it, you just have to change your life a little. You may not have realized, but there is a strong connection between your food, sleep and mood. To be in a good mood you must ensure that you eat well and sleep enough. Starving for long hours and sleeping too less can make you irritable.   Anger management is obviously a crucial aspect of being and staying happy. The secret is to never go to bed with anger in your mind. It has been proven bottled up anger can make you frustrated and then one thing may lead to another. To avoid stagnant bad mood just ensure you vent it out before you go to bed.   A lot of things work in your favour even if you fake a feeling. If you are feeling low, for instance, force yourself to act cheerful and see how your mood changes in a few minutes. Make yourself believe that you are happy and nothing is bothering you.   Eating something to improve your mood is not a good idea. This will only add to your calories. Besides, the effect the food has is only temporary. Look for a method that is healthy and whose effects are long lasting. Always remember that being happy has less to do with your personality type and more to with your desire. So, next time you feel low you know how to cheer yourself up. - KRUTI BEESAM  

పిల్లలు అబద్ధం చెబుతుంటే!

  ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే... విశ్వాసం పెరిగితే   నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు.   కారణాన్ని గ్రహించండి   ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది.   వయసుని బట్టి అబద్ధం   ‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు.   విలువలు తెలిస్తే సరి   నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది?   సమయం కేటాయించాలి   పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది.   అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. - నిర్జర.

నాయకుడంటే రాముడిలా ఉండాలి

  రామాయణం జరిగి వేల సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈలోగా మనిషి మారాడు. అతని నాగరికత మారింది. కానీ రామాయణంలో కనిపించే మౌలిక సూత్రాలు తరతరాలని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. రాముడు సీతను వదిలేయకుండా ఉండాల్సిందా? వాలిని చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాడు? అన్న అంశాలలో వాదులాటలని పక్కన పెడితే, మంచి విషయాలు నేర్చుకునేందుకే రామాయణంలో చాలా సందర్భాలే కనిపిస్తాయి. సమర్ధుడైన నాయకత్వం అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్పువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియుఁజేకుఱు వారిచేతనే ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే దవిలి యొనర్పవే? జలధి దాటి సూరారులద్రుంచి భాస్కరా! రాజు నేర్పరి అయితే ఎలాంటివారితో అయినా పనులని చక్కపెట్టుకోగలడు. రాముడు తన కార్యాన్ని వానరులతోనే సాధించగలిగాడు కదా అంటాడు మారయ కవి భాస్కర శతకంలో! నాయకుడు సమర్థుడైతే ఎవరితో అయినా, ఎంతటి లక్ష్యాన్నయినా సాధించగలడు అనేందుకు రాముడే గొప్ప ఉదాహరణ. విద్యను ఆచరణలో పెట్టాలి విద్యని నేర్చుకోవడం కష్టమే... కానీ ఆచరణలో ఉపయోగపడాలి కదా! రాజ్యాన్ని పాలించేవాడు యుద్ధవిద్యలు నేర్చుకోవడమే కాదు... అవసరం అయినప్పుడు రణరంగంలో తన సత్తా చూపించేందుకూ సిద్ధంగా ఉండాలి. అందుకే రాముడు తన కులగురువైన వశిష్టుని వద్ద సకల విద్యలనూ నేర్చుకోగానే... ఆతణ్ని యుద్ధానికి తీసుకువెళ్లేందుకు విశ్వామిత్రుడు తొందరపడ్డాడు. తనతోపాటుగా రాముని అడవులకు తీసుకువెళ్లి... అక్కడ ఒక పక్కన అతనితో రాక్షసుల మీద యుద్ధం చేయిస్తూనే, మరో పక్క యుద్ధంలో తనకు తెలిసిన మెళకువలు కూడా నేర్పాడు. ఇంతకు మించిన field trip ఉంటుందా! అనువుగాని చోట ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అన్న మాట ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. అనువుగాని చోట అధికులమనరాదు అంటూ ఇదే విషయాన్ని వేమన ఎప్పుడోనే చెప్పాడు. ఇందుకు గొప్ప ఉదాహరణ రాముడు శివధనుస్సుని విరిచిన సందర్భమే! తనకు వరప్రసాదంగా లభించిన శివధనుస్సుని రాముడు పాడుచేశాడన్న కోపంతో పరశురాముడు, రాముని మీద కాలు దువ్వుతాడు. అతణ్ని రెచ్చగొడుతూ పరుషంగా మాట్లాడతాడు. కానీ రాముడు కూడా అవతార పురుషుడే అని పరశురాముడు తనంతట తానుగా గ్రహించేవరకూ... రాముడు తన సహనాన్ని కోల్పోలేదు. కలుపుకొంటూ పోవాలి సీతమ్మ జాడ కనిపించకపోయాక... రాముడు ఆమెను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో సుగ్రీవుడనే వానరరాజుతో స్నేహం చేశాడు. చివరికి వారిసాయంతోనే సీతమ్మను సాధించాడు. తను దేవుడు కదా, వానరుల సాయం కోరడం ఏమిటి అని రాముడు ఆలోచించలేదు. దారిలో తన కార్యసాధనకు తోడుగా నిలిచేవారందరినీ కలుపుకొంటూ పోయాడంతే! మరి రావణాసురుడో... తనకు మంచి చెప్పినందుకు తమ్ముడైన విభీషణుని సైతం దూరం చేసుకున్నాడు. చివరికి అతను అందించిన రహస్యం కారణంగానే చావుని కొనితెచ్చుకొన్నాడు. ధర్మాన్ని పాటించాడు సమాజంలోని ప్రజలంతా కలిసి జీవించేందుకు కొన్ని నిబంధనలను ఏర్పరుచుకుంటారు. దానినే ధర్మం అని పిలుచుకుంటాము. ధర్మం కాలానుగుణంగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు తండ్రి మాటను జవదాటకపోవడం రాముని కాలంలోని ధర్మం! అది ఈ కాలంలో వర్తిస్తుందా అంటే చెప్పడం కష్టం. రాముడు తన ధర్మాన్ని నూటికి నూరుపాళ్లూ పాటించాడంటారు పెద్దలు. అందుకే ఆయన పాలనను రామరాజ్యంగా కలకాలం గుర్తుంచుకున్నారు. రామాయణాన్ని కేవలం ఒక ఇతిహాసంగా కాకుండా, మంచిచెడులను తెలిపే గ్రంథంగా మరోసారి చదివితే ఇలాంటి విషయాలు ఎన్నో తటస్థపడతాయి. మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి. - నిర్జర.

యువతకి ఆదర్శం... ఈ రేవంత్‌

ఎల్‌.వి. రేవంత్‌... నిన్నటి దాకా ఈ పేరు వినని వారు కూడా ‘ఎవరా ఈ కుర్రవాడు’ అంటూ గూగుల్‌ చేస్తున్న పేరు. దేశంలోని ప్రతి పత్రికలోనూ ఇప్పుడు రేవంత్ ఒక న్యూస్‌ ఐటం. ఎందుకంటే తెలుగువారికి దుర్బేధ్యం అనుకునే ఇండియన్‌ ఐడిల్‌ కోటను తన పాటతో బద్దలుకొట్టిన విజేత రేవంత్‌. కేవలం తెలుగువాడన్న కారణంగా రేవంత్‌ను మనం అభిమానించడం లేదు.... అందుకు చాలా కారణాలే ఉన్నాయి.   ఊహించని నేపథ్యం హీరో కడుపులో ఉండగానే తండ్రి చనిపోతాడు. మేనమామల ఆసరాతో అతను పెరుగుతాడు. ఎవరి మీదా ఆధారపకుండా విజయాలను సాధిస్తాడు. ఇదీ మనం తరచూ వినే సినిమా కథ. కానీ రేవంత్‌ జీవితంలో ఆ సినిమా కష్టాలే నిజమయ్యాయి! కాకపోతే అతని ఉమ్మడి కుటుంబం రక్షగా ఉండటం ఓ అనుకోని అదృష్టం.   ఎంతటి శ్రమకైనా సిద్ధం రేవంత్‌కి చిన్నప్పటి నుంచే పాటలంటే ఇష్టం. పాటలపోటీల్లో పాల్గొని తనని తాను మెరుగుపర్చుకోవాలనీ, తనేమిటో నిరూపించుకోవాలనీ తపించేవాడు. కానీ అందుకోసం డబ్బులు ఖర్చవుతాయిగా! ఆ డబ్బుల కోసం రేవంత్‌ పగలు పేపర్‌బాయ్‌లా పనిచేశాడు, సాయంత్రం హోటల్‌ సర్వర్‌గా ఒళ్లు వంచాడు. అలా తన కాళ్ల మీద తనే పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.   అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు రేవంత్‌ కోరుకున్నట్లుగా పాటల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన ప్రతిసారీ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. మాటీవీ ‘సూపర్‌ సింగర్స్’, ఈటీవీ ‘సప్తస్వరాలు’ లాంటి ప్రతి కార్యక్రమంలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే మర్యాదరామన్న సినిమాలో తొలిసారిగా పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక తిరిగి చూసుకోలేదు. చేతికి అంది వస్తున్న ఒకో సినిమాతోనూ గాయకుడిగా స్థిరమైన స్థానం సాధించాడు. బాహుబలిలో పాడిన ‘మనోహరీ’ పాటతో ప్రేక్షకులని దాసోహం చేసుకున్నాడు.   ప్చ్‌ తృప్తి లేదు! రేవంత్‌కు పాటంటే ఎంత ఇష్టమో... పాటల పోటీలంటే అంతే ఇష్టం. వాటిలో సోనీ టీవీ నిర్వహించే ‘ఇండియన్‌ ఐడిల్’ గురించి చెప్పేదేముంది! మన దేశంలోనే అది అత్యున్నత పోటీ. కొడితే ఆ కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు రేవంత్‌. అందుకోసం ముంబైకి మకాం మార్చాలి. ఇప్పుడిప్పుడే వస్తున్న అవకాశాలని కొన్నాళ్లు వదులుకోవాలి. కానీ తన కలను నెరవేర్చుకునేందుకు రేవంత్‌ ఎంతటి రిస్క్‌ అయినా తీసుకునేందుకు సిద్ధపడిపోయాడు.   బలహీనతలు ఉంటాయి, కానీ... ఒకో మనిషికీ ఒకో బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఉంది కదా అని అసలు ప్రయత్నమే విరమించుకుంటే ఇక విజయం దక్కే అవకాశం ఏముంటుంది? రేవంత్‌కి హిందీ పెద్దగా రాదు. ఆ కారణంగానే ఇండియన్ ఐడిల్స్ పోటీలో తోటి అభ్యర్థుల అతణ్ని హేళన చేసేవారు. కానీ రేవంత్ వెనక్కి తగ్గలేదు. తనకు హిందీ రాదని నిజాయితీగా ఒప్పుకొంటూనే... సంగీతమే తన శ్వాస, భాష అని చెప్పుకొచ్చాడు. రేవంత్‌లోని ఆ నిజాయితీ న్యాయనిర్ణేతలని సైతం మెప్పించింది. చిట్టి చివరికి సింహాసనాన్ని దక్కించింది!!   రేవంత్‌కు అహం తక్కువని అతని స్నేహితులు చెబుతుంటారు. నిరంతరం శ్రమించే తత్వం ఎక్కువని అతని సన్నిహితులు పేర్కొంటారు. మొత్తానికి రేవంత్‌ పాటలకే కాదు యువతకు కూడా ఒక ఐడల్‌గా (ఆదర్శం) చెప్పుకోవచ్చన్నమాట!   - నిర్జర.

ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజు సందడే!

  ఏప్రిల్‌ 1వ తేదీ వచ్చిందంటే ఏప్రిల్‌ ఫూల్స్‌ డేనే గుర్తుకువస్తుంది. ఏదో ఆడతూ పాడుతూ అవతలివారిని ఏడిపించే ఈ రోజు వెనక బోలెడు కథ ఉంది. వేర్వేరు దేశాలలో ఆ వేడుకలని జరుపుకొనే తీరులోనూ వైవిధ్యం కనిపిస్తుంది.   పసలేని వాదన ఒకప్పుడు ఆంగ్ల సంవత్సరం మార్చి 25న మొదలయ్యేది. ఆ సంవత్సర వేడుకలు వారం పాటు, అంటే ఏప్రిల్‌ 1 వరకూ జరిగేవి. కానీ 1582లో గ్రెగోరియన్‌ కేలెండర్‌ అమలులోకి రావడంతో కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పుని అనుసరించకుండా ఏప్రిల్‌ 1న కొత్త సంవత్సరాన్ని ఆచరించేవారిని ఏప్రిల్‌ ఫూల్‌ అని పిలుస్తారనేది చాలా పాత వాదన. కానీ 15వ శతాబ్దానికి ముందే ఇలాంటి ఆచారాలు ఉండేవని తెలుస్తోంది. 13వ శతాబ్దంలో వచ్చిన పుస్తకాలలో కూడా ఏప్రిల్‌ ఫూల్‌ ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఇది అనాదిగా వస్తున్న ఆచారమే అనుకోవచ్చు.   ఒకో దేశంలో ఒకోలా ఏప్రిల్‌ ఫూల్‌ రోజున అవతలివారిని ఏదో ఒక విషయంలో దారిమళ్లించి వెధవాయిలని చేయడం సహజమే! కాకపోతే కొన్ని దేశాలలో ఇదే ఆచారాన్ని కాస్త విభిన్నంగా పాటిస్తారు.   - ఫ్రాన్స్‌లో చేప ఆకారంలో ఉన్న ఒక కాగితాన్ని అవతలివారికి తెలియకుండా వీపు మీద అంటిస్తారు. దీనిని ఏప్రిల్‌ ఫిష్‌ అంటారు. - పోర్చుగల్‌ దేశంలో ఒకరి మీద ఒకరు పిండి చల్లుకుంటారు. - డెన్మార్కులో ఏప్రిల్‌ 1వతో పాటు మే 1న కూడా అవతలివారిని వెర్రివెంగళాయిలను చేసే ప్రయత్నం చేస్తారు. - ఐర్లాండులో ‘ఏప్రిల్‌ ఫూల్‌’ కోసం అనే ఉత్తరాన్ని కవరులో ఉంచి ఒకరి నుంచి వేరొకరికి అందిస్తూ ఉంటారు. - ఇంగ్లండులో ఏప్రిల్‌ 1 మధ్యాహ్నం వరకే ఫూల్‌ చేయవచ్చు. ఆ తరువాత ఎవరినన్నా ఫూల్‌ చేయాలని ప్రయత్నిస్తే మనల్నే ఫూల్స్‌గా జమకడతారు.   మీడియా హడావుడి:  ఏప్రిల్‌ ఫూల్‌ రోజున జరిగే సందడిని జనాలకి చేరవేడమే కాదు.... ఆ రోజు తామే స్వయంగా జనాల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేసే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని మీడియా సంస్థలు. లేని వార్తను ఉన్నట్లుగా, జరగనిదానిని జరిగినట్లుగా ప్రచురించి జనాల్ని ఫూల్స్ చేస్తుంటాయి. ఇవి ఒకోసారి వివాదాస్పదం అవుతుంటాయి కూడా! ఉదాహరణకి 1957లో బీబీసీ టీవీ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పూల తీగలను పెంచినట్లే తినే నూడిల్స్‌ (spaghetti) కాసే చెట్లని కూడా పెంచవచ్చని ఆ కథనంలోని సారాంశం. అప్పట్లో నూడిల్స్ తయారీ గురించి అంతగా అవగాహన లేని బ్రిటన్‌వాసులు ఈ వార్త నిజమేనని నమ్మి... సదరు చెట్లను ఎలా పెంచాలా అని పరిశోధన మొదలుపెట్టేశారు. మీడియా ద్వారా అతి పెద్ద ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ అని ఇప్పటికీ ఆ ఘటనను తల్చుకుంటారు.   ఇవీ ఏప్రిల్‌ ఫూల్స్ విశేషాలు! ఏప్రిల్‌ ఫూల్‌ హద్దులో ఉంటే ఆరోగ్యకరమైన హాస్యానికి దారితీస్తుందనీ, హద్దులు దాటితే అవతలివారి మనోభావాలని దెబ్బతీస్తుందనీ పెద్దలు చెబుతున్నారు. ఆ హద్దులేవో పాటిస్తే పోలా! - నిర్జర.

5 లక్షల తలరాతలు మార్చేసిన మహిళ

  డా॥ కిరణ్ మార్టిన్ పిల్లల వైద్యురాలు. ఓసారి ఆమె దక్షిణ దిల్లీలోని ఓ మురికివాడలోకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ ఆమె మురికివాడల్లోకీ, అందులోని పూరిగుడిసెలలోకీ అడుగుపెట్టనే లేదు. దాంతో అక్కడ తనకి కనిపించిన దృశ్యానికి కిరణ్కు మతిపోయినంత పనయ్యింది. మురికివాడల్లోని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారు. గుడిసెలలో ఇంతెత్తున చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలోనే పసిపిల్లలు ఆడుకుంటున్నారు. వారు తాగే నీరు పరమ మురికిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం సంగతి చెప్పేదేముంది? వాడవాడంతా కలరాతో బాధపడుతోంది. ఆ మహమ్మారిని తప్పించుకునే పరిస్థితి కానీ, కలరా సోకిన తరువాత వైద్యం చేయించుకునే స్తోమత కానీ వారికి లేవు.     మురికివాడలో పరిస్థితిని చూసి కిరణ్ చలించిపోయారు. తను వారికి ఉచితంగా వైద్యం చేయాలని అనుకున్నారు. వెంటనే ఓ చెట్టు కింద కలరా రోగులకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకరిద్దరి సహకారంతో ఆ మురికివాడలోనే ఒక చిన్న ఇంట్లో క్లినిక్ను తెరిచారు. మరో అడుగు ముందుకు వేసి ఆ మురికివాడలోని జీవితాలను బాగుచేసేందుకు ‘ఆశా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇదంతా 1990 నాటి పరిస్థితి. ఆ తరువాత ‘ఆశా’ దిల్లీ మురికివాడల తీరునే మార్చివేసింది. అదంతా మరో కథ!       ఆశా ప్రారంభంలోనే డా॥ కిరణ్ మురికివాడల్లోని ఆడవారిని భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటివరకూ ఎంతోమంది తియ్యటి మాటలు విని మోసపోయిన వారు... ఆమెను అంతగా నమ్మలేదు. క్రమేపీ కిరణ్ అంకితభావం, నిస్వార్థంగా వైద్యం చేస్తున్న విధానం చూసి దగ్గరయ్యారు. తాగే నీరు అన్న మాటే ఎరగని ఆ వాడలో కిరణ్ మంచినీటిని ఏర్పాటు చేయడంతో ఆమెకు అనుసరించేంత నమ్మకం ఏర్పడింది. ఆడవారి సంగతి అలా ఉంచితే మగవారు మాత్రం కిరణ్కు సహకరించలేదు సరికదా... ఆమెను వేధించే ప్రయత్నం చేశారు. కిరణ్ వారిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయేవారు. పైగా మగవారిలోని అభద్రతా భావాన్ని తొలగించేందుకు,  ‘ఆశా’ సమావేశాలకి వారిని కూడా ఆహ్వానించేవారు. అలాంటి వ్యక్తిత్వానికి లొంగనివారుంటారా! ఇప్పుడు దిల్లీలోని మురికివాడల్లో ‘ఆశా’ గురించి తెలియనివారు ఉండరు. ఆశాలో శిక్షణ పొందిన కార్యకర్తలు సాధారణ అనారోగ్యాలన్నింటికీ చికిత్స చేసేందుకు సన్నద్ధంగా ఉంటారు. వాడవాడలా క్వాలిఫైడ్ వైద్యులు, నర్సులతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆశా కేవలం దక్షిణ దిల్లీలోని ఒక మురికివాడకే పరిమితమైన సంస్థ కాదు! దిల్లీ అంతటా 60 మురికివాడల్లో ఉన్న ఐదు లక్షలమంది జనాలని ప్రభావితం చేసే ఓ ఉద్యమం. అందుకే ఆశా ఆవిర్భవించిన తరువాత దిల్లీ మురికివాడల్లో శిశు మరణాలు, అంటువ్యాధులు, పోషకాహార లోపాలు వంటి సవాలక్ష ఆరోగ్య సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి.     ఆశా కేవలం పేదల అనారోగ్యాన్ని దూరం చేసేందుకే ప్రయత్నించదు. ఆ అనారోగ్యానికి కారణమైన నిరక్షరాస్యత, పేదరికాలను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. సేవింగ్స్ ఖాతాలను ఎలా తెరవాలి? బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఎలా? వ్యాపారం కోసం ఎలాంటి రణాలు లభిస్తాయి? లాంటి విషయాల మీద అవగాహన కల్పించడం ద్వారా కొందరి ఆదాయం అమాంతం పదిరెట్లు పెరిగిపోయిందట! ఇక మురికివాడల్లోని తెలివైన కుర్రకారుకి ఉన్నత విద్యావకాశాలు కల్పించడం మరో ఎత్తు. ఇలా దాదాపు 1200 మంది మురికివాడ విద్యార్థులు దిల్లీ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో అడుగుపెట్టగలిగారు. ఇదీ కిరణ్ కథ! ‘నేను ఒక్కదాన్ని. ఆడమనిషిని. మురికవాడల్లో అంతా మొరటుజనాలు, మురికి మనుషులు.’ అని కిరణ్ అనుకొని ఉంటే..... - నిర్జర.

ఉగాది పండుగే ఒక జీవితపాఠం!

  మన పండుగలని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి- పూజలు, పిండివంటలతో హడావుడిగా సాగే భౌతికమైన ఆచారం, రెండు- ఆ పండుగ ద్వారా పెద్దలు మనకి చెప్పదలచిన జీవితసారం. మొదటి సందర్భాన్ని మనం పాటించినా పాటించకపోయినా రెండో సందర్భాన్ని మాత్రం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా ఉగాది నుంచి కూడా ఏమైనా మంచి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తే, ఉగాది అణువణువూ ఏదో ఒక జీవితపాఠం కనిపిస్తూనే ఉంటుంది.   తైలాభ్యంగనం – ఉగాది రోజున లేవగానే నువ్వులనూనెతో స్నానం చేయాలని చెబుతారు పెద్దలు. ఒంటికి నువ్వులనూనెని పట్టించి, ఆపై సున్నిపిండితో నలుగుపెట్టుకుని స్నానం చేయడం వల్ల ప్రతి స్వేదరంథ్రమూ శుభ్రపడుతుంది. ఏ పండుగలో చేసినా చేయకున్నా ఉగాదినాడు మాత్రం ఈ ఆచారం పాటించితీరాలంటారు. ఉగాది మన సంవత్సరపు ఆరంభం కాబట్టి, ఆ రోజుని శుచిగా మొదలుపెట్టాలన్నది ఈ నియమం వెనుక సూచన కావచ్చు. శరీరం క్షణభంగురమే కావచ్చు! కానీ ఉన్న ఆ కాస్త కాలమూ దానిని ఆరోగ్యంగా, శుచిగా కాపాడుకోవాల్సిందే! మనసుని పరిశుద్ధంగా, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందే!   కాలమే దైవం – హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు. కానీ ఉగాది రోజున కాలమే దైవం. కొన్ని సందర్భాలలో కాలాన్ని కేవలం ‘సమయం’గా కాకుండా ఈ ప్రకృతిలోని సమన్వయాన్ని నెలకొల్పే శక్తిగా (రుతం) వేదాంతులు భావిస్తూ ఉంటారు. అంత లోతుల్లోకి వెళ్లకున్నా... జీవితంలో కాలం విలువని తెలియచేసే సందర్భంగా, కాలాన్ని విభజించే లెక్కగా ఉగాదిని చూడవచ్చు.   తీపిచేదుల కలయిక – జీవితమంటే కష్టసుఖాల కలయిక. వీటితో పాటు సంతోషం, కోపం, బాధ, వైరాగ్యం, గర్వం, వినయం... వంటి సవాలక్ష భావాలన్నీ మనిషిని పలకరిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అదుపులో ఉంచుకోవాలని, ఎటువంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కోవాలనీ సూచించేదే ఉగాది పచ్చడి. అందుకే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే ఆరురుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినందే పండుగకి అర్థం లేదంటారు పెద్దలు.   పంచాంగ శ్రవణం – మన ప్రాచీనుల ఖగోళశాస్త్రానికి కాస్త నమ్మకాన్ని జోడిస్తే అదే పంచాంగం. రాబోయే సంవత్సరంలో రాజకీయం, వ్యవసాయం, వాతావరణం వంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంచనా ఎలాగూ ఉంటుంది! ఇక వ్యక్తిగతంగా ఆదాయవ్యయాలు, అవమానం రాజపూజ్యం వంటి వివరాలూ కనిపిస్తాయి. వీటిపట్ల నమ్మకం ఉన్నా లేకున్నా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలనీ, ఏ సందర్భంలోనూ వినయాన్ని కోల్పోకూడదనీ పెద్దల సూచనగా భావించవచ్చు.   పరోపకారం – ఉగాది రోజున చలివేంద్ర పెడితే బోలెడు పుణ్యమని చెబుతారు. అలా కుదరకున్నా కనీసం నీటితో నిండిన కుండని దానం చేయమన్నారు. ఇక ఉగాదినాడు చెప్పులు, గొడుగు దానం చేసినా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఎండాకాలంలో తోటివారికి నీరు, చెప్పులు, గొడుగులు అందించడాన్ని మించిన సాయం ఏముటుంది! మన స్తోమతను అనుసరించి కాలానుగుణంగా తోటివారికి సాయపడేందుకు సిద్ధపడాలన్న ఆశయం ఈ ఆచారంలో కనిపిస్తుంది.     - నిర్జర.

వెలుగుల భవిష్యత్తు కోసం గంటసేపు చీకటి - EARTH HOUR

  ప్రపంచం విద్యుత్తు మీద విపరీతంగా ఆధారపడుతోందనీ, ఆ విద్యుత్తుని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ, విద్యుత్ పరికరాల వల్లా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని పరిశోధనలు రుజువు చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2004లో World wildlife fund (WWF) ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. కానీ ఏం చేస్తే తాము చెప్పదల్చుకున్న విషయం ప్రజల్లోకి వెళ్తుందో ఆ సంస్థకి తెలియలేదు. చివరికి 2007లో ‘EARTH HOUR’ అనే ప్రచారం చేపట్టింది. ఒక గంటపాటు విద్యుత్ వాడకం లేకుండా చేయడమే ఈ ఎర్త్ అవర్ లక్ష్యం.   ఇలా 2007 మార్చి 31న సిడ్నీలో (ఆస్ట్రేలియా) సాగిన ఎర్త్ అవర్ కార్యక్రమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రయోగానికి తిరుగులేకుండా పోయింది. 2008లో ఈ కార్యక్రమంలో 35 దేశాలలోని 400 నగరాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయంటే ఈ ఆలోచన ఎంత విజయవంతమైందో తెలిసిపోతుంది. అది మొదలు ఏటా ఎర్త్ అవర్కు ప్రచారం, ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నాయి. నేషనల్ జాగ్రఫిక్, గూగుల్ వంటి సంస్థలు ఒకొక్కటిగా ఎర్త్ అవర్ను ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నాయి.     ఎర్త్ అవర్ వల్ల ఓ గంట పాటు విద్యుత్తు వాడకం తగ్గుతుంది. దీని వల్ల కొన్ని టన్నుల కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్ గాల్లోకి చేరకుండా ఆపినవారవుతాం. అంతేకాదు! ఎర్త్ అవర్ని పాటించడం వల్ల ప్రజల్లో పర్యావరణం పట్ల స్పృహ పెరుగుతోందని తేలింది. ఒక అంచనా ప్రకారం ఎర్త్ అవర్ తర్వాత, ప్రజల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే తపన ఓ నాలుగు శాతం పెరిగిందట. చాలా సంస్థలు విద్యుత్తు పొదుపుని ఎర్త్ అవర్కే పరిమితం చేయకుండా... దీర్ఘకాలికంగా విద్యుత్తుని పొదుపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయట.   ఒక గంటసేపు విద్యుత్తు వాడకాన్ని తగ్గిస్తే ఏం ఒరుగుతుంది అని పెదవి విరిచేవారూ లేకపోలేదు. ఎర్త్ అవర్కు వ్యతిరేకంగా వీరు వినిపించే వాదనలూ లేకపోలేవు. ఎర్త్ అవర్ సమయంలో లైట్ల బదులు కొవ్వొత్తులను వెలిగించడం వల్ల వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ సంగతి ఏంటి అని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచాన్ని చీకటిలో మగ్గించే ఎర్త్ అవర్ సమయంలో నేరాలు, ప్రమాదాలు ఎక్కువయే ప్రమాదం ఉందని ఎత్తి చూపుతున్నారు.     ఎన్ని విమర్శలు ఎదురైనా ఎర్త్ అవర్ వెనుక ఉన్న ఉద్దేశం ఉన్నతమైనదే అని చాలామంది అభిప్రాయం. అందుకే ప్రభుత్వాలు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈఫిల్ టవర్, బకింగ్హామ్ ప్యాలెస్, ఒపెరా హౌస్ వంటి ప్రముఖ పర్యటక స్థలాలన్నీ ఎర్త్ అవర్లో పాలు పంచుకుంటున్నాయి. మన దేశంలోనూ ఎర్త్ అవర్కు ఏటా ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది రాష్ట్రపతి భవన్లో సైతం ఎర్త్ అవర్ను పాటించారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ను మార్చి 25 రాత్రి 8:30 నుంచి 9:30 వరకూ జరుపుకోవాలని WWF పిలుపునిస్తోంది. మరి ఈ పిలుపుని అందుకునేదెవరో. ఎవరో దాకా ఎందుకు! మనమే ఓ గంటపాటు ఇంట్లో వీలైనన్ని విద్యుత్ పరికరాలను నిలిపివేస్తే సరి! - నిర్జర.      

పర్యావరణం కాపాడాలా? పిల్లల్ని బయట ఆడుకోనివ్వండి...

  పర్యావరణం నాశనం అయిపోతోంది! చెట్లని అనవసరంగా నరికేస్తున్నాము! మనిషి ప్రకృతిని కాపాడుకోలేక పోతున్నాడు! ఇలాంటి మాటలని మనం ప్రతి రోజూ వింటూనే ఉన్నాము. కానీ దీనికి విరుగుడు ఏమిన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన జవాబులు లభించడం లేదు. జనంలో చిత్తశుద్ధి లేకపోతే ఎవరు ఎంత మోగినా కూడా ప్రయోజనం ఉండదు కదా! కానీ ఇందుకో ఉపాయం ఉందంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.   కెనడాలోని Okanagan విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యావరణానికీ, బాల్యానికీ మధ్య సంబంధం ఉందేమో అని కనుగొనే ప్రయత్నం చేశారు. దీని కోసం వారు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యూనివర్సిటీ విద్యార్థులని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో చిన్నప్పుడు ఆరుబయట ఆడుకున్నవారిలో 87 శాతం తాము ఇప్పటికీ ప్రకృతిని ప్రేమిస్తున్నమని చెప్పుకొచ్చారు. ఇక వీరిలో ఒక 84 శాతం మంది తాము ప్రకృతిని రక్షించుకునేందుకే ప్రయత్నిస్తామని వెల్లడించారు. అనవసరంగా చెట్లని కొట్టేయక పోవడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలను వాడకపోవడం, రీసైకిల్డ్‌ వస్తువులను వాడటం, విద్యుత్తును వృధా చేయకపోవడం వంటి చర్యల ద్వారా తాము ఎప్పుడూ ప్రకృతికి చేటు చేయకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.   ఇంతకుముందు పిల్లలు ఆరుబయట ఆడుకునేందుకు పెద్దలు అంగీకరించేవారు. బడిలో కూడా విశాలమైన ఆటస్థలాలు ఉండేవి. పైగా స్కౌటింగ్‌, ఎన్‌సీసీ, సమ్మర్‌ క్యాంప్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను బయట తిప్పేవారు. కానీ ఇప్పటి ఆటలు, చదువు అన్నీ ఇంటికే పరిమితం అయిపోతున్నాయి. ఇవి పిల్లల మానసిక, శారీరిక వికాసాన్ని దెబ్బతీస్తాయని ఇంతకుముందే అనేక పరిశోధనలు వెల్లడించాయి. పర్యావరణం పట్ల కూడా వారికి ప్రేమ లేకుండా పోతుందని తాజా పరిశోధన తేల్చి చెబుతోంది. కాబట్టి... పిల్లలని కనుక ఆరుబయట ఆడుకోనిస్తే వారిలో పర్యావరణం పట్ల సృహ ఏర్పడుతుందనీ, అది వారి ఆలోచనా విధానం మీద ప్రభావం చూపుతుందనీ చెబుతున్నారు.   - నిర్జర.

పిల్లలు హాయిగా పడుకోవాలంటే!

  పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం అనేది కనిపించని వేదన. దాని వల్ల అటు పిల్లలూ ఇబ్బంది పడతారు, వారితో పాటుగా పెద్దలూ బాధపడతారు. పిల్లలలో నిద్రలేమి, భవిష్యత్తులో కూడా వారిలో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా Stephanie Zandieh అనే నిపుణుడు కొన్ని సలహాలను అందిస్తున్నారు. ముఖ్యంగా 1- 5 ఏళ్లలోపు పిల్లలకి ఈ సలహాలు దివ్యంగా పనిచేస్తాయంటున్నారు.   - పిల్లలు నిద్రపోయేందుకు ఓ సమయాన్ని అలవాటు చేయాలి. అంతేకానీ నిద్రపోతే వారే అలసిపోయి పడుకుంటారులే అనుకోవద్దు. నిజానికి అలసిపోయి పడుకునే పిల్లలు నిద్ర మధ్యలో లేచే సందర్భాలు ఎక్కువగా ఉంటాయట!!!   - పిల్లలు నిద్రపోయేటప్పుడు తమ పక్కన ఏదన్నా బొమ్మనో, బొంతనో ఉంచుకోవడాన్ని గమనించవచ్చు. ఇది మంచి అలవాటే అంటున్నారు నిపుణులు. ఇలా ఏదో ఒక వస్తువుతో వారి అనుబంధం వల్ల, పిల్లలు ఒక సురక్షితమైన భావనలో ఉంటారట. తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు.   - పిల్లవాడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా ఒకే తరహా వాతావరణాన్ని కొనసాగించండి. నిద్రపోయే ముందర స్నానం చేయించడమో, కథలు చదివి వినిపించడమో, జోలపాటలు పాడటమో చేస్తూ ఉండటం వల్ల.... పిల్లవాడు నిద్రలోకి జారుకుటాడు.   - పిల్లవాడి పక్కని కానీ, అతను పడుకునే ప్రదేశాన్ని కానీ, అక్కడి వెలుతురిని కానీ తరచూ మార్చడం అంత మంచిది కాదు.   - పిల్లవాడు తనంతట తానుగా నిద్రలోకి జారుకునేలా అలవాటు చేయడం మంచిది. దానివల్ల రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచిన తరువాత తనంతట తానుగా మళ్లీ నిద్రపోగలడు. లేకపోతే మీరు అతణ్ని గమనించుకుని మళ్లీ నిద్రపుచ్చేదాకా ఇబ్బందిపడుతూనే ఉంటాడు.   - పిల్లలు వేరే గదిలో పడుకుంటే, వారిని రాత్రి మధ్యలో అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండటం మంచిది. పిల్లలు ఉలిక్కిపడి లేచినట్లు అనిపిస్తే, బద్ధకించకుండా లేచి వారి దగ్గరకి వెళ్లాల్సిందే! అవసరం వచ్చినప్పుడు మీరు వారి పక్కనే ఉంటారనే భద్రతా భావం వారికి ప్రశాంతతని కలిగిస్తుంది.   - పిల్లలని వేరే గదిలో ఉంచడం అన్న మార్పుని ఒక్కసారిగా చేయడం మంచిది కాదు. ముందు పిల్లవాడు తనంతట తానుగా పడుకునే అలవాటు చేయాలి. ఆ తరువాత మీరు అతని కనుచూపు మేరలో ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించాలి. అవసరం అయినప్పుడు మీరు తన పక్కనే ఉంటారన్న భద్రతని అందించాలి. అప్పుడు మాత్రమే అతణ్ని వేరే చోట పడుకోపెట్టే ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే అతని నిద్ర దెబ్బతినడం సంగతి అటుంచితే తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య లేనిపోని దూరాలు ఏర్పడతాయి. - నిర్జర.    

నరేష్‌ని చూసి నేర్చుకోవాల్సిందే!

కష్టాలు ఒకోమనిషిని ఒకో తీరులో పలకరిస్తాయి. కొంతమంది ఆ కష్టాలకి కుంగిపోయి వాటినే నెమరేసుకుంటూ నిలబడిపోతారు. మరికొందరు మాత్రం అవి జీవితంలో మరో మార్గాన్ని చూపిస్తున్నాయన్న సూచనను అందుకుంటారు. అందుకనే వాళ్లు విజేతలుగా నిలిచిపోతారు. అలాంటి ఓ జీవితమే ‘నాగ నరేష్ కరుటుర’ అనే కుర్రవాడిది.   నాగనరేష్‌ది పశ్చిమగోదావరి జిల్లాలోని తీపర్రు అనే పల్లెటూరు. నరేష్‌ అందరిలాంటి కుర్రాడే. ఇంకామాట్లాడితే స్తోమతలో అందరికంటే చిన్నవాడు. అతని తండ్రి ఓ సాధారణ లారీ డ్రైవరు, తల్లి గృహిణి. చదువులో నరేష్ ఎప్పుడూ ముందే ఉండేవాడు. తీపర్రులో అలా ఆడుతూపాడుతూ చదువుతున్న నరేష్‌ ఓసారి అనుకోని ప్రమాదానికి లోనయ్యాడు. సంక్రాంతి పండగని ఊరికి వెళ్లే ప్రయత్నంలో, నరేష్‌ ఓ లారీ మీద నుంచి కిందపడిపోయాడు.   ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ... అదేమీ ప్రాణాంతకం కాదు! కానీ వైద్యుల నిర్లక్ష్యం మాత్రం అతనికి ప్రాణాంతకంగా మారింది. ప్రమాదంలో గాయపడిన నరేష్‌కు ఓ చిన్న బ్యాండేజీ కట్టి పంపేశారు వైద్యులు. ఆ గాయం లోలోపలే కుళ్లిపోయి చివరికి అతని రెండు కాళ్లనీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క పేదరికం, మరో పక్క వైకల్యం. ఇంకరైతే ఈ పరిస్థితికి క్రుంగిపోయేవారేమో! కానీ నరేష్‌ మాత్రం తనకి కాళ్లు లేవన్న కారణంతో వెనక్కి తగ్గకూడదని అనుకున్నాడు. దానికి తోడు నరేష్‌కు తగిన వైద్యం కోసమని తండ్రి తణుకు పట్నానికి మకాం మార్చాడు. తీపర్రులోనే ఉంటే నరేష్ చదువు పదోతరగతితోనే ఆగిపోయేది. కానీ తనకి కాళ్లు పోవడం వల్లే తణుకులోని మిషనరీ స్కూల్లో చదివే అవకాశం వచ్చిందంటాడు నరేష్‌.   తణుకులో చదువుకునే సమయంలోనే నరేష్‌కి ఉన్నత చదువులకి అవకాశం ఇచ్చే JEE పరీక్ష గురించి తెలిసింది. అంతే! తన దృష్టినంతా JEE ఎంట్రెన్స్‌ పరీక్షల మీద కేంద్రీకరించాడు. ఆ పరీక్షలలో జాతీయస్థాయిలోనే వికలాంగుల కోటాలో నాలుగో ర్యాంకుని సంపాదించాడు. దాంతోపాటే మద్రాసు ఐఐటీలో సీటునీ సంపాదించాడు. నరేష్‌ గురించి విన్న జయపూర్‌ హాస్పిటల్‌వాళ్లు అతని చదువుకి అయ్యే ఫీజులని భరించేందుకు సిద్ధపడ్డారు. మద్రాసు ఐఐటీలోని అతని సహవిద్యార్థులు నరేష్‌ కోసం ఓ బ్యాటరీ కుర్చీని కొనిపెట్టారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు నరేష్. ఐఐటీ కోర్సుని సమర్థంగా పూర్తిచేశాడు. గూగుల్‌ బెంగళూరు క్యాంపస్‌లో ఉద్యోగాన్ని సాధించాడు.   ఏం జరిగినా అంతా మన మంచికే అనీ, తన చుట్టూ ఉన్న మనుషులంతా మంచివారేననీ నరేష్‌ నమ్మకం. పరిస్థితులన్నీ అతని నమ్మకాన్ని బలపరిచేలాగానే సాగాయి. రైళ్లో అతనితో పాటు ప్రయాణించినవారు కూడా నరేష్ పట్టుదలని చూసి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమే మరి! మన దృక్పథం ఎలా ఉంటుందో... ప్రపంచం కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తుందన్నది పెద్దల మాట కదా. సాధించలేను అనుకుంటే ఎన్ని సులువులు చేతికందినా ముందుకు వెళ్లలేము. సాధించి తీరాలి అనుకుంటే ప్రతి అడుగూ అవకాశం దిశగానే పడుతుంది.   - నిర్జర.

పెళ్లి సందడి కోసం... ఎంత అప్పుకైనా సిద్ధం

టాటా కేపిటల్, ఖాతాదారులకు రుణాలను అందించే సంస్థ. చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాలతో పాటుగా పెళ్లి కూడా జేబులని గుల్లచేసే సందర్భమే అని ఈ సంస్థ గ్రహించింది. మన దేశంలో పెళ్లి ఖర్చుల పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతోందట. ఇక అనధికారికంగా సాగే ఖర్చులు, కట్నాల గురించి చెప్పేదేముంది. అందుకే పెళ్లిళ్లకి కూడా అప్పులు ఇస్తాం అంటూ టాటా కేపిటల్‌, బజాజ్ ఫిన్‌సర్వ వంటి సంస్థలు ముందుకువస్తున్నాయి. పెళ్లి కోసం 25 లక్షల వరకూ అప్పులు ఇస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే టాటా కేపిటల్‌ సంస్థ పెళ్లి ఖర్చుల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2,500 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.   - నూటికి 74 శాతం మంది పెళ్లి ఖర్చుల బడ్జట్ పది లక్షల వరకూ పెట్టవచ్చన్న అంచనాలో ఉన్నారు.  - 27 శాతం మంది పెళ్లి కోసం అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామన్న పశ్చాత్తాపంలో ఉన్నారు. - ఒకప్పుడు పెళ్లంటే బంధువులకి మర్యాదలు చేయడం, బాజాభజంత్రీలు, హనీమూన్‌కి వెళ్లడం వంటి ఖర్చులకే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. కానీ ఇప్పటి తరంలో దాదాపు 66 శాతం మంది వివాహ దుస్తులు, ఆభరణాలు, మేకప్‌ వంటి ఆడంబరాలకే అధిక ప్రాధాన్యత అని చెప్పేశారు. - టాటా కేపిటల్‌వారి గుండెల అదిరిపోయేలా 44 శాతం మంది అసలు పెళ్లిళ్లకి అప్పులు ఇస్తారన్న విషయమే తమకు తెలియదని చెప్పారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఒకవేళ రుణం దొరుకుతుంటే... దానిని అందిపుచ్చుకునేందుకు 58 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. - 30 ఏళ్లలోపు వారు ఆర్భాటంగా పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. 30 ఏళ్లు పైబడినవారు మాత్రం ఏదో నామమాత్రంగా పెళ్లిసాగిపోతే చాలు అనుకుంటున్నారట. - 50 శాతం మంది మగవారు ఓ ఐదు లక్షల రూపాయలలోపు ఖర్చుతో పెళ్లి ముగించేయాలని అనుకుంటున్నారు. కానీ ఆడవారిలో 32 శాతం మాత్రమే ఇలా తక్కువ ఖర్చులో పెళ్లి జరిగేందుకు ఇష్టపడుతున్నారు. - తమ పెళ్లి ధూంధాంగా 30 లక్షల వరకూ ఖర్చుతో సాగాలని ఒ 22 శాతం మంది మగవారు కోరుకుంటున్నారు. ఆడవారిలోనేమో ఆర్భాటంగా పెళ్లి జరగాలని కోరుకునేవారి సంఖ్య 36 శాతంగా ఉంది. - తీరా పెళ్లి చేసుకుని పద్దులన్నీ చూసుకున్నాక, జరిగిన ఖర్చులని చూసి లబోదిబోమంటున్నారు కుర్రకారు. కనీసం మూడోవంతు మంది యువతులు, తమ పెళ్లి ఖర్చులు అనుకున్నదానికన్నా పదిలక్షలు ఎక్కువగా తేలాయని బాధపడ్డారట.   - నిర్జర.

ఈ మహిళల విజయంతో కళ్లు చెదిరిపోవాల్సిందే!

  కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... అంటూ మంచి భార్యకి ఉండాల్సిన లక్షణాలు చెబుతాయి ధార్మిక గ్రంథాలు. కానీ స్త్రీ అంటే కేవలం భార్యేనా? కుటుంబాన్ని చక్కదిద్దడంలోనే ఆమె జీవితానికి సార్థకత దక్కుతుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఆరుగురు విజయగాథలను గర్వంగా చెప్పుకుందాం...   సుచీ ముఖర్జీ - ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. బయటకు వెళ్లే ఓపిక లేకనో, ధరలు తక్కువనో.. కారణం ఏదైతేనేం! అంతా ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలా గుర్గావ్కి చెందిన ‘సుచీ ముఖర్జీ’ కూడా ఆన్లైన్ ద్వారా తనకి నచ్చిన బట్టలు కొనాలనుకున్నారు. ప్చ్!! ఎన్ని దుస్తులు చూసినా ఆమెకి నచ్చలేదు. అందరికీ నచ్చేలా కేవలం దుస్తుల కోసమే ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఎవరో దాకా ఎందుకు... తనే limeroad.com పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. ఈ ఆలోచన ఏమేమరకు ఫలితాన్ని ఇచ్చిందో అనుకుంటున్నారా! ఒక్కసారి limeroad.comలోకి వెళ్లి చూడండి. కళ్లు చెదిరిపోతాయి.   మిథాలీ టండన్ - నగర జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పగలంతా సమస్యలతో నలిగేవారు సాయంవేళకి కాస్తోకూస్తో మందుపుచ్చుకోవడం అలవాటైపోయింది. ఇక శనాదివారాలు వస్తే చాలు.... వీకెండ్ పార్టీలలో పాల్గొని తీరాల్సిన పరిస్థితి. కానీ పొద్దున్నే లేచి ఆఫిసులకి పరుగులు తీసేదెలా! మద్యం మత్తులో నిస్సత్తువగా, తలనొప్పిగా ఉండే శరీరాన్ని ఉరుకెత్తించేదెలా! ఈ సమస్యకు పరిష్కారం కనుగొని దాన్ని ఓ వ్యాపారచిట్కాగా మార్చేశారు ‘మిథాలీ టండన్’. Morning Fresh పేరుతో హ్యాంగోవర్ తగ్గించే డ్రింక్ను ఉత్పత్తి చేస్తూ... మందుబాబులకు పరిష్కారాన్నీ, తనకి విజయాన్నీ సాధించారు. కావాలంటే drinkmorningfresh.com చూడండి.   రష్మీ దాగా - IIM అహ్మదాబాద్లో చదువుకున్న రష్మీ దాగా, బెంగళూరులో కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగపు ఒత్తిడిలో పడి అప్పుడప్పుడూ రష్మీ బయటనుంచి భోజనం ఆర్డరు చేసేవారు. ఆ భోజనంతో ఆమెకి ఆకలి తీరేదేమో కానీ తృప్తి మాత్రం కలిగేది కాదు. ఎప్పుడూ ఒకటేరకం కూరలు, ఏదో అమ్ముకోవడం కోసం వండినట్లుగా యాంత్రికంగా తోచే రుచి... దీంతో ఇంటి భోజనంలా ఎప్పడికప్పుడు రుచికరంగా, వైవిధ్యంగా ఉండే ఆహారాన్ని అందచేస్తే ఎంత బాగుండో అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలుచేసేశారు. ఫలితం ఆమె స్థాపించిన హోం డెలివరీ ఆహారం ఇప్పుడు నాలుగు నగరాలలో దొరుకుతోంది. (freshmenu.com)   కోమల్ అగర్వాల్ - సెల్ఫోన్ లేని నరమానవుడు కనిపించడం అరుదు. మరి అలాంటి సెల్ఫోనుకి అవసరమయ్యే సదుపాయాలని కొనుక్కోవాలంటే ఒకోటీ ఒకో కంపెనీది కనిపిస్తుంది. దీనికి విరుగుడుగా పవర్బ్యాంక్ల దగ్గర నుంచీ చార్జర్ల వరకూ ఒకే చోట అందిస్తే ఎలా ఉంటుంది అనిపించింది కోమల్ అగర్వాల్ అనే అమ్మాయికి. ఫలితం ‘పెబుల్స్’ బ్రాండ్ ఆవిర్భావం. ఇప్పుడు పెబుల్స్ ఓ వంద కోట్ల సంస్థ.   రిచా కౌర్ - ఆడవారి లోదుస్తులు అనగానే అదేదో అసభ్యమైన పదంలా తోస్తుంది. ఆరోగ్యం కోసమో, సౌకర్యం కోసమో మంచి లోదుస్తులు తీసుకోవాలంటే దేశీయంగా ఉత్త పనికిమాలిన సరుకు లభిస్తుంది. ఈ పరిమితులను దాటాలనుకున్నారు ‘రిచా కౌర్’. మన దేశంలోనే మహిళలకు ఆంతర్జాతీయ స్థాయి లోదుస్తులకు ఓ బ్రాండ్ రూపొందించే ప్రయత్నం చేశారు. అదే Zivme. ఆ బ్రాండ్ ఎంత విజయవంతం అయ్యిందో చూడాలంటే zivame.com/లోకి వెళ్లాల్సిందే!   సైరీ చాహల్ ¬- సైరీ చాహల్ అవకాశాలను అందిపుచ్చుకునే ఓ వ్యాపారవేత్త. అందుకనే ఇంటర్నెట్ మొదలైన రోజుల్లోనే ఓ వెబ్సైటుని ప్రారంభించి లాభాలను సాధించారు. తన సంగతి సరే! కానీ ప్రతిభ ఉన్నా ఇంటిపనులలో సతమతం అయిపోయే స్త్రీల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది సైరీకి. అంతే! SHEROS పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ప్రతిభకు తగిన ఉపాధిని కల్పించడంలో వేలాదిమంది స్త్రీలకు SHEROS సంస్థ ఓ మాధ్యమంగా నిలుస్తోంది (sheros.in). (బిజినెస్ ఇన్సైడర్ సౌజన్యంతో) - నిర్జర.    

ఆకతాయిల పనిపట్టే – 1090

  2012లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మహిళలలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయి తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెబుతూ భోరున ఏడ్చేసింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటే బాగుండు అని అనిపించింది అఖిలేష్కి. వెంటనే నవనీత్ సకేరా అనే ఒక పోలీసు ఉన్నతాధికారిని పిలిపించి పరిస్థితిని వివరించారు. అలా వారిద్దరి మధ్యా పుట్టిన ఆలోచనే – 1090.   ఉత్తర్ప్రదేశ్లో ఆడపిల్లలని ఫోన్లో వేధించే సందర్భాలు చాలా ఎక్కువ. సాధారణంగా అమ్మాయిలు రీచార్జి కోసం ఏదన్నా దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ వారి నెంబర్లను నోట్ చేస్తారు కదా! అలా నోట్ చేసిన నెంబర్లను దుకాణదారులు ఆకతాయిలకు అమ్ముతారట. అమ్మాయి బాగా అందంగా ఉంటే ఆ నెంబరుకి 500 రూపాయల వరకూ చార్జ్ చేస్తారు. ఇలా ‘కొనుక్కున్న’ నెంబర్లకి ఏదో రాంగ్ కాల్ అన్నంత అమాయకంగా ఫోన్ చేయడంతో వేధింపు మొదలవుతుంది. అది క్రమేపీ స్త్రీలను ఉచ్చులోకి దింపేందుకో, వారిని లైంగికంగా వేధించడానికో దారి తీస్తుంది. ఇలా నెంబర్లని ‘కొనుక్కునే’ స్తోమత లేని ఆకతాయిలు మరో విధంగా ఆడవారి నెంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తారు. దీనికోసం వరుసగా నెంబర్లకి డయల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తమకి ఓ ఆడగొంతు వినిపించిందో... ఇక అప్పటి నుంచీ ఆ నెంబరుని వేటాడటం మొదలుపెడతారు.     తమని ఫోన్లో ఆకతాయిలు వేధిస్తుంటే ఏం చేయాలో ఉత్తర్ప్రదేశ్ ఆడవారికి తోచేది కాదు. పోనీ పోలీస్ కంప్లయింట్ ఇద్దామంటే... అది ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం, నేరస్తులకు శిక్ష పడుతుందా అన్న అనుమానం వారిని వేధించేవి. కానీ ఇప్పుడు 1090కి ఫోన్ చేస్తే చాలు, వారి సమస్యని ఓ కాల్ సెంటరులోని వ్యక్తులు నమోదు చేసుకుంటారు. తరువాత ఏ నెంబరు నుంచైతే వారు వేధింపులను ఎదుర్కొంటున్నారో, ఆ నెంబరుకి ఫోన్ చేస్తారు. ‘మీ నుంచి వేధింపు కాల్స్ వస్తున్నట్లుగా మాకు ఫిర్యాదు అందింది. తీరు మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది,’ అంటూ హెచ్చరిస్తారు.   వేధింపులని ఆపమంటూ పోలీసుల నుంచి ఫోన్ రాగానే రకరకాల స్పందనలు వినిపిస్తాయి. తమకేమీ తెలియదని కొందరు బుకాయిస్తారు, ఆ అమ్మాయంటే తమకి ఇష్టమని మరికొందరు వాదిస్తారు, తప్పయిపోయింది క్షమించమంటూ ఇంకొందరు వేడుకుంటారు. మొత్తానికి చాలా సందర్భాలలో 1090 నుంచి వచ్చే హెచ్చరికతో వేధింపులు ఆగిపోతాయి. అలా కాకుండా ఇంకా వేధింపులు కొనసాగితే మాత్రం సదరు ఆకతాయిలను వారి కుటుంబసభ్యులతో సహా పిలిపించి కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. ఇకమీదట వేధింపులకు పాల్పడనని భగవద్గీత మీద ప్రమాణం చేయించుకుంటారు. మరికొందరు ముదర్లు ఉంటారు. ఈ కౌన్సిలింగ్ స్థాయి దాటిన తరువాత కూడా వేధింపులను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన సందర్భాలలో వారి మీద కేసు నమోదు చేసి ‘మామగారింటికి’ పంపిస్తారు.     1090 హెల్ప్లైన్ ఏదో కంటితుడుపు చర్యగా మొదలుపెట్టిన వ్యవస్థ కాదు. దీని కోసం బోలెడంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేకమైన కార్యాలయం ఉంది. ఇంతేకాకుండా 1090 గురించి వాడవాడలా తెలిసేందుకు బోలెడు ప్రచారమూ చేస్తుంటారు. ఫలితం! 2012 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకూ 6.81 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆకతాయిలు వేధిస్తున్నారంటూ వచ్చే ఆరోపణల దగ్గర్నుంచీ సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపుకి గురవుతున్నాం అని వచ్చే ఫిర్యాదుల వరకూ ఉన్నాయి. వీటిలో దాదాపు 98% ఫిర్యాదులను పరిష్కరించడం విశేషం! ప్రస్తుతానికి ఉత్తర్ప్రదేశ్లోని ఆడవారు తమకి ఏదన్నా ఇబ్బంది ఎదురైతే ‘దస్ నబ్బే’ (1090)కి ఫోన్ చేస్తే సరి అని ధీమాగా ఉన్నారు. అంతకంటే మరేం కావాలి!!! - నిర్జర.