చెల్లెలు పక్కన ఉంటే ఆ లైఫే వేరబ్బా..

  రాఖీ పండుగ వచ్చిందంటే... మన దేశంలో తెగ సందడి కనిపిస్తుంది. చిట్టి చెల్లెళ్లు, తల్లిలాంటి అక్కయ్యలు కట్టే రాఖీ కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతకీ ఇంట్లో ఒక సోదరి ఉంటే ఆ విలువే వేరనుకోండి. కానీ ఆ విలువకి రుజువు ఏమన్నా ఉందేమో అని తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. మరి ఆ పరిశోధన ఏమిటో, అందులో ఏమని బయటపడిందో మీరే చూడండి!   మన జీవితంలో 10 నుంచి 14 ఏళ్లలోపు వయసు చాలా కీలకం అంటూ ఉంటారు. బాల్య దశ నుంచి టీనేజిలోకి అడుగుపెట్టే ఆ క్రమంలో మన వ్యక్తిత్వం ఎంతో మార్పుకి లోనవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి చిన్న విషయమూ మన మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి లోనుకావడం, భయందోళనలకు గురికావడం, ఆత్మన్యూనతకి లోనుకావడం, లేనిపోని గొడవల్లో తలదూర్చడం.... లాంటి సమస్యలు ఈ వయసు కుర్రకారుని వేధిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు.   తాము ఎంచుకున్న విషయాన్ని పరిశోధించేందుకు 10-14 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఓ 395 కుటుంబాలను ఎంచుకొన్నారు. సదరు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ల జీవనశైలి ఎలా ఉంది? వాళ్లకి అక్కయ్యలు కానీ చెల్లెళ్లు కానీ ఉన్నారా? లాంటి సవాలక్ష విషయాలన్నింటినీ సేకరించారు. ఓ ఏడాది గడిచిన తర్వాత ఇదే పిల్లలని మరోమారు పరిశీలించి చూశారు.   ఆశ్చర్యకరంగా ఇంట్లో అక్కయ్యకానీ, చెల్లెలు కానీ ఉన్న కుర్రకారు చాలా సంతోషంగా కనిపించారట. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటూ, ఎలాంటి ఆందోళననైనా అధిగమిస్తూ ఉన్నారట. ఇంట్లో ఒక అక్కో చెల్లో ఉంటే చాలు! వాళ్లు బాగా చిన్నవారైనా, పెద్దవారైనా కూడా ఇంట్లోని మగపిల్లవాడి మీద వాళ్ల సానుకూల ప్రభావం ఉన్నట్లు తేలింది.   ఇంట్లో అక్కో, చెల్లో ఉంటే మనసు సంతోషంగా ఉండటమే కాదు... వ్యక్తిత్వం కూడా దృఢంగా ఉంటుందని తేలింది. తోటివారికి సాయపడాలని అనుకోవడం, బడిలో పిల్లలతో మంచిగా మెలగడం, మంచి పనులు చేయడంలో ముందు ఉండటం... లాంటి స్వభావాలు అక్కా లేదా చెల్లి ఉన్న పిల్లలలో కనిపించాయట. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రభావం కంటే సోదరీమణుల ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.   అయితే ఇంట్లో కేవలం అక్కా లేదా చెల్లి ఉంటే సరిపోదు, వాళ్లతో సఖ్యత కూడా ఉండాలి కదా! అన్న అనుమానం రావచ్చు. నిజమే! అలా ఇంట్లో అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య సఖ్యత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒకవేళ వారిద్దరూ భిన్నధృవాలలాగా ఉన్నా, కనీసం వారి మధ్య మాటామంతీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే మొహమొహాలు చూసుకోని బంధాలకంటే చిన్నాచితకా కొట్లాటలతో సాగే బాంధవ్యమే మున్ముందు నిలిచే అవకాశం ఉందట.   - నిర్జర.

అది తింటే వయసు ఆగిపోతుంది

  మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్ కంప్యూటర్కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా మతిమరపు రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకోసారి అల్జీమర్స్ వంటి సమస్యలకి కూడా దారితీస్తుంది. కానీ మెదడులోని కణాలు నిర్వీర్యం అయిపోకుండా ఇప్పుడు ఓ ఉపాయం దొరికేసింది అంటున్నారు పరిశోధకులు. ల్యూటెన్ (Lutein). ఈ పదార్థం గురించి మనం పెద్దగా విని ఉండం కదా! ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు వంటి అతికొద్ది పదార్థాలలో కనిపించే ఒక ముఖ్యమైన పోషకం ఈ ల్యూటెన్.   ఇప్పటివరకూ ఈ ల్యూటెన్ మన కళ్లకి చాలా మంచిదని చెబుతూ వస్తున్నారు. క్యారెట్లు తినడం వల్ల కళ్లకి మంచిదని పెద్దలు చెప్పడానికి.... అందులో విటమిన్ Aతో పాటుగా ల్యూటెన్ ఉండటమే కారణం. ఈ ల్యూటెన్ వల్ల మెదడుకి కూడా ఏమన్నా మేలు జరుగుతుందా అన్న ఆలోచన వచ్చింది పరిశోధకులకి. దాంతో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిని ఓ 60 మందిని ఎన్నుకొన్నారు. ల్యూటెన్ మన కంట్లోని కణాలలో పోగవుతూ ఉంటుంది. దాంతో కంట్లో ల్యూటెన్ నిల్వలు అధికంగా ఉండేవారి మెదడు ఏ మేరకు చురుగ్గా ఉంటోందో గమనించే ప్రయత్నం చేశారు.   ఆశ్చర్యంగా ల్యూటెన్ ఎక్కువగా ఉన్నవారి మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని గమనించారు. అభ్యర్థుల మెదడుకి ఎలక్ట్రోడ్లను తగిలించి చూసినప్పుడు, ల్యూటెన్ అధికంగా ఉండేవారిలో ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తక్కువ ల్యూటెన్ ఉన్న పెద్దవాళ్ల మెదడు, వయసులో ఉన్నవారితో సమానంగా స్పందిస్తోందని గ్రహించారు. మెదుడ మీద ల్యూటెన్ ప్రభావం తేలిపోవడంతో.... మెదడుకి సంబంధించి అనేక సమస్యలకు ల్యూటెన్ని మందుగా ఇచ్చే ప్రయత్నాలు మొదలవుతాయని ఆశిస్తున్నారు.   వీలైనంతవరకూ ల్యూటెన్ అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, చిలగడదుంప, టమాటా, క్యారెట్, గుడ్లు, బొప్పాయి, బీన్స్... లాంటి పదార్థాలు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడమని చెబుతున్నారు. మన శరీరానికి స్వతహాగా ల్యూటెన్ని తయారుచేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి, అది అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ కాస్త జాగ్రత్తా కనుక తీసుకుంటే.... వయసు ఎంతగా మీదపడినా మెదడు మాత్రం భద్రంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. - నిర్జర.  

ఆత్మహత్యలకు దారితీస్తున్న సీరియల్

  ఇప్పటి సినిమాలు చూసి కుర్రవాళ్లు చెడిపోతున్నారని అంటారు పెద్దలు. ఇప్పటి సీరియల్స్ ఇంట్లో విషాన్ని నింపేస్తున్నాయి అంటున్నారు పిల్లలు. మనకి రోజూ కనిపించేదే తీస్తున్నాం కదా! అని తప్పుకుంటున్నారు నిర్మాతలు. ఇంతకీ మీడియా ప్రభావం మన మీద ఉందా? అనే ప్రశ్నకి దిమ్మతిరిగిపోయే జవాబు ఒకటి వినిపిస్తోంది. అదే 13 Reasons Why. ఒక టీనేజీ అమ్మాయి తన స్కూళ్లో అనుకోని సమస్యలని ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యే సరైన మార్గం అని అనుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటుంది కూడా! కానీ చనిపోబోయే ముందు ఓ 13 వీడియో క్యాసెట్ల ద్వారా తన బాధనంతా వెళ్లగక్కుతుంది. తన మనసుని నొప్పించి తన చావుకి కారణమైనవారికి ఆ 13 క్యాసెట్లనీ పంపుతుంది. ఇదీ క్లుప్తంగా ’13 Reasons Why’ అనే నవలలోని కథ. ఇప్పుడు అదే నవలను Netflix అనే సంస్థ ఒక సీరియల్గా రూపొందించింది. ఈ ఏడాది మార్చిలో సీరియల్ మొదలవగానే విపరీతమైన జనాదరణ లభించింది. సీరియల్ అద్భుతంగా ఉందనీ, కుర్రకారు ప్రవర్తనకు దగ్గరగా ఉందనీ జనం విరగబడి చూడటం మొదలుపెట్టారు. కానీ ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ అది కుర్రకారు మీద ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆరోపణలు మొదలయ్యాయి.   నిజంగానే 13 Reasons Whyతో ఆత్మహత్యలు పెరిగి ఉంటాయా? అన్న అనుమానం వచ్చింది పరిశోధకులకి. దాంతో ఇంటర్నెట్లో ఆత్మహత్యల గురించి వెతికేవారి సంఖ్య పెరిగిందో లేదో గమనించాలనుకున్నారు. ఆశ్చర్యంగా ఈ సీరియల్ మొదలైన దగ్గర్నుంచీ ఆత్మహత్యల గురించి సమాచారం కోరుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. ఇలా కాస్తో కూస్తో కాదు, దాదాపు 20 శాతం ఎక్కువ మంది ఆత్మహత్యల గురించి విచారించడం మొదలుపెట్టారట. ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? మనల్ని మనం చంపుకోవడం ఎలా? లాంటి ప్రశ్నలు ఇంటర్నెట్లో ఎక్కువయిపోయాయి.   ఆత్మహత్య గురించి సెర్చ్ చేసినవారంతా ఆత్మహత్యకు పాల్పడరు కదా! అన్న వాదన రావచ్చు. కానీ వారిలో అలాంటి ఆలోచన ఒకటి మొదలయినట్లేగా! పైగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, అప్పటికే మానసికమైన సమస్యలు ఉన్నవారు.... ఇలాంటి సీరియల్స్ చూస్తే, ఆత్మహత్య చేసుకుంటే దరిద్రం వదలిపోతుంది అన్న నిర్ణయానికి వచ్చేసే ప్రమాదం ఉన్నట్లే. దానికి రుజువుగా, ఈ సీరియల్ మొదలైన దగ్గర నుంచీ... ఆత్మహత్య చేసుకోవాలనే తలపుతో సైక్రియాట్రిస్టుల దగ్గరకి పరుగులు పెట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందట.   ఆత్మహత్య అనేది క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి దృశ్యాలు కనిపించకుండా మీడియా జాగ్రత్త పడాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకునే విధానాన్ని చూపించడం, ఆత్మహత్యే ప్రధాన అంశంగా ప్రోగ్రాంలు రూపొందించడం చేయకూడదని చెబుతోంది. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప మరో మాట లేకుండా ఏకంగా ఓ సీరియల్నే రూపొందించేశారు. పైగా అది సూపర్హిట్ కావడంతో... దాన్ని పొడిగించేందుకు సిద్ధపడిపోతున్నారు. - నిర్జర.      

మందుతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా!

  వీకెండ్ వచ్చిందంటే చాలు... బార్లన్నీ కిటకిటలాడిపోతుంటాయి. లోటాల కొద్దీ మద్యాన్ని జుర్రుకునేందుకు మందుబాబులు సిద్ధపడిపోతుంటారు. అంతవరకూ సరే! ఓ రెండు పెగ్గులు లోపలకి వెళ్లిన తర్వాత వీళ్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తూచా తప్పకుండా నెమరేసుకోవడం చూస్తుంటాం. ‘సుందరం మాస్టార్!’ అంటూ పక్కవాళ్లని చితకబాదేయడమూ చూస్తుంటాం. దీనికి కారణం ఏమిటంటారు!   ఇంగ్లండులోని ఎక్సెటర్ విశ్వవిద్యాలంలోని పరిశోధకులు... మద్యపానానికీ, జ్ఞాపకశక్తికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరీక్షించాలని అనుకున్నారు. ఇందుకోసం వారు మద్యం అలవాటు ఉన్న ఓ 88 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ కొన్ని కొత్త పదాలను నేర్పించారు. ఇలా కొత్త పదాలు నేర్చుకున్న తర్వాత, వారిని రెండు బృందాలుగా విభజించారు. వీరిలో కొందరు, తగిన మోతాదులో మద్యం తాగవచ్చని చెప్పారు. మరికొందరు మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.   రెండోరోజు కూడా ఇదే తరహాలో ప్రయోగం జరిగింది. కొత్త పదాలను నేర్పించడం. అలా నేర్చుకున్న తర్వాత కొందరు మద్యం తాగేందుకు అనుమతించడం. ఇలా రెండు రోజుల తర్వాత... వారిలో ఎంతమంది కొత్త పదాలను, ఎంత నైపుణ్యంతో నేర్చుకున్నారో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా మద్యానికి దూరంగా ఉన్నవారికంటే, మద్యం పుచ్చుకున్నవారే ఎక్కువ పదాలను గుర్తుచేసుకున్నారట.   వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు! కానీ దీని వెనుక శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మద్యం తాగేటప్పుడు మన మెదడు పనిచేసే తీరు మారిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి సమాచారమూ తలకి ఎక్కదు. దాంతో అంతకుముందు నేర్చుకున్న సమాచారాన్నే మరింత పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు! మెదుడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోకేంపస్ కూడా తన దృష్టిని దీర్ఘకాలిక జ్ఞాపకాల మీద కేంద్రీకరిస్తుంది. అలాగని జ్ఞాపకశక్తిని తిరగీతోడేందుకు మద్యం జోలికి పోదామనుకునేవారు... మందుతో పాటుగా వచ్చే అనారోగ్యాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పైగా మద్యం మోతాదు దాటితే, అసలు మెదడే పూర్తిగా మొద్దుబారి అసలుకే ఎసరు తప్పదు మరి! - నిర్జర.    

ఆడవాళ్లకి నిజంగా ఏం కావాలి?

  అనగనగా ఆర్ధర్ అని ఒక రాజు ఉండేవాడు. యువకుడు, అందగాడు, తెలివైనవాడు అయిన ఆ రాజంటే, రాజ్యంలో అందరికీ ఇష్టమే. అలాంటి ఆర్ధర్కి అనుకోని కష్టం ఎదురైంది. ఆర్థర్కంటే గొప్ప చక్రవర్తి ఒకరు, ఆర్థర్ రాజ్యం మీద దాడిచేశాడు. అతని మహాసైన్యం ముందు ఆర్థర్ పరాక్రమం ఏమాత్రం నిలవలేదు. ఆ చక్రవర్తి సైనికులు ఆర్థర్ని బంధించి తమ చక్రవర్తి ఎదుట ప్రవేశపెట్టారు.   ఆర్థర్ని ఓడించిన చక్రవర్తి కూడా సామాన్యుడు కాడు. సైనికబలంతో పాటుగా అపారమైన మేథస్సు అతని సొంతం. తన ముందు సంకెళ్లతో నిలబడి ఉన్న ఆర్థర్ ప్రతిభ అతనికి తెలియంది కాదు. ‘‘నీ సామర్థ్యం తెలిసినవాడిని కనుక నీకు మరణశిక్ష విధించాలనుకోవడం లేదు. అయితే ఇందుకు ఒక షరతు. నన్ను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న వేధిస్తోంది. నువ్వు కనుక ఆ ప్రశ్నకి బదులు చెప్పగలిగితే నీ రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగించేస్తాను. మరోసారి ఈ రాజ్యం వంక కన్నెత్తి కూడా చూడను. కానీ ఒక్క ఏడాదిలో కనుక నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే, నీకు మరణదండను తప్పదు.’’ అని ఆర్థర్కి ఒక షరతు పెట్టాడు ఆ చక్రవర్తి.   చక్రవర్తి మాటలు విన్న ఆర్థర్కు చెప్పలేనంత సంతోషం కలిగింది. ‘‘ఇంతకీ మీ ప్రశ్న ఏమిటో చెప్పారు కాదు?’’ అని ఉత్సాహంగా అడిగాడు.   ‘‘ఆడవాళ్లు నిజంగా కోరుకునేది ఏమిటి? అన్నదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. దీనికి ఎలాంటి సందేహానికీ తావు లేనటువంటి సమాధానం నాకు కావాలి.’’ అని సెలవిచ్చాడు చక్రవర్తి.   ‘ఓస్ ఇంతే కదా! దీనికి ఏడాది సమయం ఎందుకు. ఒక్క రోజులో సమాధానం చెప్పేయగలను,’ అనుకున్నాడు ఆర్థర్. కానీ తన అంతఃపురానికి వెళ్లి ఎంతగా ఆలోచించినా తగిన సమాధానం తట్టనేలేదు. డబ్బు, హోదా, బంగారం, సంతానం, భవంతులు, ఆరోగ్యం.... ఇలా ఏ ఒక్కదాన్ని ఎంచుకున్నా మిగతావి లోటుగా కనిపిస్తున్నాయి. తనకు దక్కిన ప్రశ్నకు జవాబు కోసం ఆర్థర్ రాజ్యంలో తనకి తెలిసిన ప్రతి ఒక్కరినీ కదిపి చూశాడు. తన మంత్రులను, సామంతులను, స్నేహితులను, పండితులను అందరినీ అడిగి చూశాడు. ప్చ్! ఎవ్వరి దగ్గరా అతనికి తృప్తి కలిగించే జవాబు దక్కనే లేదు. ఇంతలో ‘ఈ రాజధాని శివార్లలో ఒక మంత్రగత్తె ఉంది. ఆమె దగ్గర ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం లభిస్తుందని చెబుతారు. కానీ మన సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆమె కోరినంత మూల్యం చెల్లించి తీరాలి,’ అని విన్నాడు ఆర్థర్.   ఆ మంత్రగత్తెను కలవడం ఆర్థర్కు ఇష్టం లేదు. కానీ ఏం చేసేది! అతనికి విధించిన గడువు మరొక్క రోజులో ముగిసిపోనుంది. దాంతో ఇక చివరి అస్త్రంగా మంత్రగత్తె దగ్గరకి వెళ్లక తప్పలేదు. ఆర్థర్ సందేహాన్ని విన్న మంత్రగత్తె తనకి జవాబు తెలిసినట్లుగా ఓ చిరునవ్వు నవ్వింది. ‘‘నీ ప్రశ్నకి నేను జవాబు చెబుతాను. మరి నాకు కావల్సినది నువ్వు ఇస్తావా!’’ అని అడిగింది. ఆర్థర్కి సరే అనక తప్పలేదు.   ‘‘ఆడది తన జీవితం మీద తనకే అధికారం ఉండాలని అనుకుంటుంది. ఆ గౌరవం ఆమెకి దక్కని రోజున, నువ్వు ఆమెకి ఏమిచ్చినా దండగే! తన వ్యక్తిత్వానికి విలువ లేని చోట ఆమెకి ఏమిచ్చినా... తన మనసులో లోటుని పూడ్చలేవు.,’’ అని చెప్పింది మంత్రగత్తె.   మంత్రగత్తె చెప్పిన జవాబు ఆర్థర్కి చాలాబాగా నచ్చింది. ‘‘నీ జవాబు చాలా బాగుంది. ఇది తప్పకుండా ఆ చక్రవర్తిని తృప్తి పరుస్తుంది. మరి ఇందుకు బదులుగా నీకేం కావాలి?’’ అని అడిగాడు ఆర్థర్.   ‘‘మరేం లేదు! నీ జీవితంలో ఎందరో స్త్రీలు ఉంటారు. తల్లి, భార్య, చెల్లి, కూతురు.... ఇలా ఎందరో ఆడవారితో నీ జీవితాన్ని పంచుకుంటావు. నేను ఇందాక చెప్పిన జవాబుని వారికి అన్వయించు చాలు. వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందని, తనదైన మనసు ఉంటుందని గుర్తించి గౌరవించు. హద్దులు దాటి వారి జీవితాలను కూడా నువ్వే శాసించాలని ప్రయత్నించవద్దు. ఇదే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం,’’ అని చెప్పింది. (ప్రచారంలో ఉన్న జానపద కథ ఆధారంగా) - నిర్జర.      

తెలంగాణను కుదిపేస్తున్న కెల్విన్‌ ఎవరు!

  డైరక్టర్‌ – పూరీ జగన్నాథ్‌, హీరో – రవితేజ, హీరోయిన్‌ – చార్మి, విలన్‌ – సుబ్బరాజు, ఆర్ట్‌ డైరక్టర్ – చిన్నా, కెమెరామెన్ – శ్యామ్ కె. నాయుడు, ఇతర నటులు – ముమైత్‌ఖాన్, తరుణ్‌, నవదీప్‌... ఇదంతా ఏదో రాబోయే సినిమా బృందం కాదు. సినిమారంగానికే సినిమా చూపిస్తున్న డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నవారి పేర్లు. మా బిడ్డ ముత్యం అని తల్లులు చెబుతున్నా, సిగిరెట్‌ కూడా ముట్టుకోనని వారే చెబుతున్నా... మొత్తానికి ఎక్కడో ఏదో గోల్‌మాల్ జరిగిందన్న విషయంలో మాత్రం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇలా వీరందరూ అడ్డంగా బుక్కయి పోవడానికి కారణం, ఒక వ్యక్తితో వారికి ఉన్న దగ్గర సంబంధాలే. అతనే కాల్విన్‌! ఇంతకీ ఎవరీ కాల్విన్‌?   కెల్విన్ లేదా కాల్విన్‌గా రోజూ వార్తల్లో నిలుస్తున్న సదరు వ్యక్తి పూర్తి పేరు Calvin Mascarenhas. ఓల్డ్‌ బోయినపల్లిలో గుట్టుగా జీవించే కుటుంబం ఇతనిది. తండ్రి ఒక రిటైర్డ్‌ ఉద్యోగి, తల్లి ఇంకా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఒక తమ్ముడు. చుట్టుపక్కల వారి దృష్టిలో అదో గౌరవప్రదమైన కుటుంబం. ఆ వీధిలోవారికి కెల్విన్‌ అన్నా కూడా మంచి అభిప్రాయమే ఉంది. కొంతమంది స్నేహితులతో రావడం, సందు చివర కాసేపు ఓ దమ్ములాగి తన ఇంటికి వెళ్లిపోవడం.... ఇదే కెల్విన్‌ గురించి వారికి తెలిసింది. అతని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ శబ్దంతోనే, కెల్విన్ వీధిలోకి వస్తున్నట్లు తెలిసేది.   కెల్విన్‌ చాలా నిదానస్తుడని పేరు. అతను ఇంత పెద్ద డ్రగ్స్‌ రాకెట్‌లో ఇరుక్కున్నాడంటే... బోయినపల్లిలో ఎవ్వరూ ఇప్పటికీ నమ్మేందుకు సిద్ధంగా లేరు. అంతదాకా ఎందుకు! కెల్విన్‌ తండ్రి సైతం ‘మా పిల్లవాడు తన పని తాను చేసుకుపోయే మనిషి. బుద్ధిగా చదువుకునే కుర్రాడు,’ అంటూ వాపోయారు. నిజంగానే కెల్విన్ BBM, MBA లాంటి ఉన్నత విద్య చదివినట్లు తెలుస్తోంది. కానీ పరిస్థితులు వేరే విషయాలు కూడా చెబుతున్నాయి.   కెల్విన్‌ను ఇంతకముందే 2013లో ఓసారి డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ జులై 2న అతన్ని అరెస్టు చేసినప్పుడు కూడా కెల్విన్‌ దగ్గర పెద్ద మోతాదులో నిషేధిత డ్రగ్స్‌ దొరికాయి. అతనికి ఈ దందాలో తోడ్పడుతున్న అబ్దుల్‌ వాహెద్‌, అబ్దుల్‌ ఖుద్దుస్‌ అనే వ్యక్తులు కూడా పట్టుబడిపోయారు. ఏదో రొటీన్‌ విచారణలో భాగంగా వీరి సెల్‌ఫోన్‌ రికార్డులని పరిశీలించిన పోలీసుల దిమ్మ తిరిగిపోయింది   ఈవెంట్‌ మేనేజర్‌ ముసుగులో కెల్విన్ సినిమాతారలు, హై ఫై సొసైటీలోని యువతకు దగ్గరయ్యేవాడని తేలింది. నిదానంగా వారికి డ్రగ్స్ అలవాటు చేసేవాడు. ఇక ఆ తర్వాత ఎంతటివారైనా కెల్విన్‌ వెంటపడాల్సిందే! ప్రస్తుతం సిట్‌ విచారణలో పాల్గొన్న కొందరు తారలతో కెల్విన్‌కు వందలాది ఫోన్ సంభాషణలు జరిగేవంటే.... అతని వెంట వాళ్లు ఎంతగా వెంపర్లాడేవారో తెలుస్తోంది.   సరే! సినిమాతారలకి ఉండే సమస్యలు, వారుండే ప్రపంచం వేరనుకుందాం. కానీ కెల్విన్‌ విషయంలో ప్రభుత్వం ఇంత సీరియస్‌గా ముందుకు వెళ్లడానికి మరో కారణం ఉంది. అదే చిన్నపిల్లలకు సైతం డ్రగ్స్‌ను అలవాటు చేయడం. పట్టుమని 13 ఏళ్లయినా లేని స్కూల్‌ పిల్లలకు కెల్విన్‌ బ్యాచ్‌ డ్రగ్స్ అలవాటు చేసేది. ఆన్‌లైన్లో కావల్సినంత మొత్తంలో డ్రగ్స్ తెప్పించుకొని, వాటిని రిటైల్‌గా అమ్మేవారు. ఈ దందా కోసం, పసిపిల్లలకి ఐస్‌క్రీం మీద డ్రగ్స్ పూసి అలవాటు చేసిన సందర్భాలు కూడా కనిపించాయి.   నిజానికి డ్రగ్స్‌ అనేది ఒక ఊబిలాంటిది. తెలిసో తెలియకో ఒకసారి డ్రగ్స్ రుచి చూసినవారు, మళ్లీమళ్లీ దాని రుచి కోసం తపించిపోతారు. వాళ్ల మెదడు తీరే మారిపోతుంది. డ్రగ్స్‌ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడిపోతారు. వాటిని సంపాదించేందుకు డబ్బు కావాలయ్యే! ఆ డబ్బు కోసం తామే స్వయంగా డ్రగ్స్ అమ్మే వ్యాపారంలోకి దిగిపోతారు. కెల్విన్‌ కూడా ఇలా ఊబిలోకి దిగబడిపోయాడని జాలిపడేవారు ఉన్నారు. కెల్విన్‌ తలదన్నే ఎందరో డ్రగ్స్ వ్యాపారులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని హెచ్చరించేవారూ ఉన్నారు. కానీ మన సమాజంలోకి డ్రగ్స్‌ ఎంతగా చొచ్చుకుపోయే చెప్పే గాయంగా కెల్విన్ గుర్తుండిపోతాడు. - నిర్జర

చంద్రుడి మీదే అడుగుపెట్టాం... ఇక జీవితం ఒక లెక్కా!

  1969 జులై 21. అప్పటివరకూ మనిషి సాగించిన ప్రగతి ఒక ఎత్తు. ఆనాడు జరిగిన అద్భుతం ఒక ఎత్తు. అవును. ఆ రోజు మనిషి చంద్రుని జయించాడు. అమెరికాకు చెందిన నీల్ ఆర్మస్ట్రాంగ్ ఆ రోజు మనిషి మీద తొలి అడుగు మోపాడు. అపోలో 11 అనే వ్యోమనౌక ద్వారా చంద్రుని మీదకు చేరుకున్న ఆర్మస్ట్రాంగ్ అక్కడ రెండున్నర గంటలు గడిపాడు.   అంతరిక్షంలోకి వెళ్లాలన్న మనిషి కోరిక ఈనాటిది కాదు. అతని ఊహ తెలిసినప్పటి నుంచీ మనిషి దృష్టి ఆకాశం వైపే ఉండేది. అక్కడి నక్షత్రాలని గమనిస్తూ, సూర్యోదయాన్ని చూస్తూ అతను కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. భూమి మీద నాగరికత ఏర్పరుచుకున్న మనిషి, నిదానంగా ఆకాశాన్ని కూడా జయించాలని అనుకున్నాడు. 1957లో రష్యా స్పుత్నిక్ పేరుతో అంతరిక్షంలోకి మొట్టమొదటి ఉపగ్రహాన్ని పంపింది. ఇక అప్పటి నుంచి చంద్రుడి మీదకు ఎప్పుడెప్పుడు చేరుకోవాలా అన్న ఆలోచన మొదలైంది. ఒక రకంగా రష్యా, అమెరికాల మధ్య ఉన్న కోల్డ్ వార్ కూడా, ఎవరు త్వరగా చంద్రుని మీదకు చేరుకుంటారా అన్న పోటీకి కారణం అయ్యింది.   నిజంగా చంద్రుడు చేరుకోగలడా! చేరకుని అక్కడ కాలు మోపగలడా! కాలు మోపాక బతికి బట్టకట్టగలడా! లాంటి సవాలక్ష ప్రశ్నలు మనల్ని వేధించాయి. మనిషి కనుక చంద్రుని చేరుకుంటే మహాప్రళయం జరుగుతుందన్న శాపాలూ వినిపించాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి చేరుకోవాలన్న తపనతో 1967లో అపోలో 1 ను అట్టహాసంగా బయల్దేరదీశారు. కానీ ఏం పొరపాటు జరిగిందో ఏమో... ఆ వ్యోమనౌక నేల మీదే కాలిపోయింది. అందులో ఉన్న ముగ్గురు వ్యోమగాములూ కాలిబూడిదైపోయారు. అపోలో 1 వైఫల్యం తర్వాత  చంద్రుడి మీదకి వెళ్లడం అసాధ్యం అన్న వాదనలకు బలం పెరిగిపోయింది. కానీ మనిషి ఊరుకోలేదు. మళ్లీ చనిపోయే ప్రమాదం ఉందని తెలిసినా వెనకడుగు వేయలేదు. నీల్ ఆర్మస్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాములు చంద్రుని మీదకి కాలు దువ్వేందుకు బయల్దేరారు. నిజానికి అపోలో 11 బయల్దేరే సమయంలో కూడా ఒక పొరపాటు జరిగింది. దాంతో అపోలో 11 కూడా ఆకాశంలో భస్మం అయిపోవడం ఖాయమనీ, ఒకవేళ చంద్రుని మీదకు వెళ్లినా తిరిగి భూమి మీదకు చేరుకోలేదని అంతా భయపడ్డారు. కానీ ఈసారి అదృష్టం మనిషి పట్టుదలకు తలవంచింది. వ్యోమగాములు క్షేమంగా వెళ్లి విజయంతో తిరిగి వచ్చారు. ఆ విజయాన్ని నమ్మడానికి చాలామందికి చాలాకాలమే పట్టింది. కొందరు ఇప్పటికీ మనిషి చంద్రుడి మీదకు చేరుకోలేదనీ, అవన్నీ సినిమా సెట్టింగులనీ వాదించేవారూ ఉన్నారు. నమ్మకం ఎంత బలమైనదో, అనుమానమూ అంతే బలమైనది కదా!   ఏదేమైనా, చాలామంది దృష్టిలో చంద్రుడి మీద మనిషి కాలు మోపిన క్షణం ఓ మైలురాయి మాత్రమే కాదు... మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలదన్న నమ్మకానికి రుజువు. అందుకే నీల్ ఆర్మస్ట్రాంగ్ సైతం ‘ఇది నాకు చిన్న అడుగే కావచ్చు. కానీ మానవాళికి గొప్ప విజయం,’ అన్నాడు. ఇప్పటికీ ఎవరన్నా నిరాశలో ఉన్నప్పుడు- ‘చంద్రుడి మీదకే అడుగుపెట్టాం, ఈ సమస్య ఒక లెక్కా!’ అన్న సమాధానం కొత్త స్ఫూర్తిని అందిస్తుంది. - నిర్జర.

మందు తాగిన గంట తర్వాత

  మందు తాగాక ఓ పదినిమిషాల్లోనే మనిషికి మత్తు తెలిసిపోతుంది. మనసుకి మత్తు తెలుస్తోంది అంటే, మన రక్తంలో ఆల్కహాల్ నిల్వలు పెరిగిపోయాయని అర్థం. ఇలా ఓ గంటా గంటన్నర గడిచిన తర్వాత శరీరంలోని ప్రతి అవయవమూ ప్రభావితం అవుతుంది. అదెలాగంటే...   కిడ్నీలు   మద్యానికి diuretic అనే స్వభావం ఉంది. అంటే మన ఒంట్లోని నీటిని నిలవ ఉంచకుండా బయటకు పంపేస్తుందన్నమాట. దీనివల్ల నీటిలో పాటుగా శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు కూడా మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మనిషి నీరసించిపోతాడు. అతని మెదడులోని నీటిశాతం కూడా తగ్గిపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది.   మెదడు   ఆల్కహాల్ మెదడు మీద చాలా తీవ్రంగా పనిచేస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. అలాంటి స్థితిలో మనిషి ఎంతటి ఉన్మాదానికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉంటాడు. మెదడులోని వేర్వేరు వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడుతుంది. మందు తాగిన వెంటనే కొందరు వాంతులు చేసుకోవడానికి కారణం ఇదే!   లివర్ (కాలేయం)   లివర్ ఒంట్లోని చెడు పదార్థాలను వేరుచేసే ఫిల్టర్లాగా పనిచేస్తుంది. అందుకే శరీరంలోకి మద్యం చేరగానే లివర్ మీదే ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి క్రమేపీదాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకోసారి లివర్ పూర్తిగా దెబ్బతినేదాకా ఈ వ్యాధి ఉందని బయటపడదు. వ్యాధిని గుర్తించే సమయానికి అది చేతులు దాటిపోయి ఉండవచ్చు!   ఊపిరితిత్తులు   మన ఊపిరి తీసుకునేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఊపిరితిత్తులు చాలా జాగ్రత్తగా పనిచేస్తాయి. కానీ రక్తంలోని అల్కహాల్ మోతాదు దాటినప్పుడు ఈ పనితీరు మందగిస్తుంది. ఫలితంగా పొలమారడం, వాంతులు లాంటి సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తులలోని కఫం పేరుకుపోయి న్యుమోనియా వంటి రోగాలకు దారితీయవచ్చు.   జీర్ణవ్యవస్థ   మద్యం మన పేగులలోని పైపూతని దెబ్బతీస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్, అల్సర్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు కూడా సరిగ్గా ఒంటికి పట్టవు.   పాంక్రియాస్   మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని చూసుకునే అవయవం పాంక్రియాస్. మద్యం మోతాదు మించినప్పుడు ఈ పాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని షుగర్ నిల్వలు ఒక్కసారిగా పడిపోతాయి. చేతులు వణకడం, చెమటలు పట్టడం, కళ్లు అదేపనిగా తిరగడం లాంటి సమస్యలు ఇలా వచ్చేవే! ఆలస్యం చేస్తే మెదడు కూడా దెబ్బతింటుంది.   నాడీవ్యవస్థ   మందు పుచ్చుకున్న కాసేపటికి చేతులూకాళ్లూ తిమ్మర్లు ఎక్కడం, మాట తడబడటం, తూలిపోవడం లాంటి లక్షణాలు గ్రహించవచ్చు. ఇదంతా కూడా మన నాడీవ్యవస్థ మీద ఆల్కహాల్ చూపే ప్రభావమే! మందు తాగాక ఎట్టిపరిస్థితుల్లోనూ బండి నడపకూడదని చెప్పేది కూడా ఇందుకే! - నిర్జర.    

ఇంట్లో దుమ్ముతో... లావైపోతారు!

  రోజంతా నానాకష్టాల పడే మధ్యతరగతి జీవులు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి సేదతీరుదామా అనుకుంటారు. ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో కూలబడి వేడివేడి టీ తాగుతూ.... ఇల్లే కదా స్వర్గసీమ! అని మురిసిపోతారు. కానీ అజాగ్రత్తగా ఉంటే ఆ ఇల్లే నరకంగా మారిపోతుందని హెచ్చరస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా...   ఇల్లన్నాక రకరకాల వస్తువులు, వాటి నుంచి పేరుకునే దుమ్ము సహజమే. కానీ ఈమధ్యకాలంలో మనం వాడే వస్తువులన్నీ ప్రమాదకరమైన రసాయనాలతో తయారవుతున్నవే కదా! దోమల్ని చంపే మందులు, మంటలు వ్యాపించకుండా వాడే పైపూత, నాన్స్టిక్ వంటపాత్రలు... ఒకటేమిటి షాంపూ దగ్గర నుంచి ప్లాస్టిక్ దాకా అన్నీ రసాయనాలే! ఈ రసాయనాలలో Endocrine-disrupting chemicals (EDC) అనే పదార్థాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు.   ఈ EDCలు మనలోని హార్మోనులని దెబ్బతీస్తాయి. ఫలితంగా కేన్సర్, ఎదుగుదలలో లోపాలు, నరాల బలహీనత, అబార్షన్ వంటి సమసస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే చాలా సంస్థలు తమ ఉత్పత్తులలో ఈ తరహా రసాయనాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఈ EDCలతో మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు కణాలు పెరిగిపోతాయేమో అన్న అనుమానం పరిశోధకులకి మొదలైంది.   EDCలకీ కొవ్వు కణాలకీ మధ్య సంబంధాన్ని తేల్చపారేసేందుకు కొన్ని ఇళ్లలో దుమ్ముని సేకరించారు. ఇలా సేకరించిన శాంపిల్స్లో రసాయనాలు ఏ తీరున ఉన్నాయి, అవి కొవ్వు కణాల మీద ఎంత ప్రభావం చూపుతున్నాయి అని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా దాదాపు 90 శాతం ఇళ్లలో కనిపించిన ధూళికణాలు, మన శరీరంలోని కొవ్వుని ప్రభావితం చేస్తున్నాయని తేలింది. కొవ్వు కణాలు త్వరగా వృద్ధి చెందడానికీ, ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికీ ఇవి కారణం అవుతున్నాయట!   ఇంట్లో అనవసరమైన సామాను పోగుచేయకూడదనీ, ఒకవేళ తీసుకున్నా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలనీ ఈ పరిశోధనతో తేలిపోయింది. సామాను కొనేటప్పుడు కూడా చవకగా దొరుకుతోందనో, సులువుగా పని జరిగిపోతోందనో కాకుండా... నాణ్యత ఉన్న వస్తువునే తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువుల నుంచి వచ్చే EDC మన ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలలోకి చాలా తేలికగా ప్రవేశిస్తాయట. ఇక ఆ తర్వాత జరిగే కథ ఇప్పటికే తెలిసిపోయింది కదా! - నిర్జర.

యాంటిబయాటిక్స్‌తో గుండెపోటు!

ఒకప్పుడు ఏదన్నా దగ్గో, జ్వరమో వస్తే చిన్నపాటి మందులతో వాటికి చికిత్స చేసే ప్రయత్నం చేసేవారు. మరీ ప్రాణాల మీదకి వస్తోంది అన్న సందర్భంలోనే యాంటిబయాటిక్‌ మందులను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు... రోగంతో రెండ్రోజులు కూడా పడుకునే ఓపిక జనానికి లేదు. చిన్నాచితకా అనారోగ్యాలకి యాంటిబయాటిక్స్ వాడేస్తున్నారు. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు! బాక్టీరియా అంటే కేవలం చెడు చేసేది మాత్రమే కాదు. పాలని పెరుగుగా మార్చే సూక్ష్మజీవులు కూడా బాక్టీరియా కిందకే వస్తాయి. అలాంటి మంచి బాక్టీరియా మన శరీరంలోనూ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది ఈ ఇలాంటి మంచి బాక్టీరియానే! దీనినే gut bacteria అంటారు. యాంటీబయాటిక్‌ మందుల వల్ల ఈ మంచి బాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. ఇంతకీ దీనికి గుండెపోటుకీ సంబంధం ఏమిటంటారా! జర్మనీకి చెందిన పరిశోధకులు- గుండెజబ్బులు ఉన్నవారిలో ఇతరత్రా లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో కనుగొనే ప్రయత్నం చేశారు. గుండె సమస్యలు ఉన్నవారి పేగులలో gut bacteria ఏమంత బాగోలేదని తేలింది. పైగా ఉన్న కాస్త బాక్టీరియా కూడా పేగులలోంచి బయటకు వెళ్లిపోతోందని బయటపడింది. ఇలా జీర్ణవ్యవస్థలోని బాక్టీరియా తగ్గేకొద్దీ గుండెజబ్బు తీవ్రత కూడా పెరుగుతున్నట్లు గమనించారు. మన పేగులలో ఉండే Blautia, Faecali తరహా బాక్టీరియా కేవలం ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే కాకుండా... శరీరంలో వాపుని తగ్గించే ప్రయత్నం చేస్తాయట! దాంతో గుండె ధమనులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ యాంటీబయాటిక్స్ వాడటం, పొగ తాగడం, తరచూ క్లోరిన్‌ నీళ్లు తాగడం లాంటి అలవాట్లతో పేగులలోని gut bacteria దెబ్బతిని తీవ్ర అనారోగ్యాలకి దారితీస్తుంది. అదీ విషయం! కాబట్టి ఇక మీదట ఆహారాన్ని జీర్ణం చేసుకునే విషయంలో తరచూ సమస్యలు వస్తుంటే... అదేదో చిన్నపాటి ఇబ్బందిగా కొట్టిపారేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మన జీర్ణశక్తికీ ఆరోగ్యానికి ఖచ్చితమైన సంబంధం ఉంటుందన్న విషయాన్ని గ్రహించమంటున్నారు. పోషకాహారాన్ని తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, అనవరసంగా యాంటీబయాటిక్స్‌ను వాడకపోవడం ద్వారా పొట్టని పదిలంగా కాపాడుకోమంటున్నారు.   - నిర్జర.

ఆత్మ ఉందని శాస్త్రవేత్తలు కనుక్కొన్నారా?

  మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అన్న విషయం మీదే మతాలన్నీ ఆధారపడి ఉన్నాయంటారు. అందుకనే ఈ విషయం మీద బోల్డు చర్చలు, వాదనలు సాగుతుంటాయి. కొంతమంది మరో అడుగు ముందుకు వేసి ఫలానా దేశంలో ఆత్మ బరువు ఎంత ఉందో లెక్కకట్టారనీ, ఫలానా చోట ఆత్మని ఫొటో తీశారనీ చెబుతూ ఉంటారు. ఇలాగే రెండేళ్ల క్రితం కొందరు జర్మనీ శాస్త్రవేత్తలు ఆత్మ ఉందని నిరూపించారన్న వార్త గుప్పుమంది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ వార్తే కనిపించింది. ఇండియాటుడే లాంటి పత్రికలు సైతం ఈ వార్తని ప్రచురించాయి. ఈ వార్త ప్రకారం జర్మనీలోని టెక్నిసే విశ్వవిద్యాలయంలో Dr Berthold Ackermann అనే శాస్త్రవేత్త పనిచేస్తున్నారు.   ఈయన ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు శరీరం వేరు, ఆత్మ వేరు అని కనుగొనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయోగం కోసం 900 మందికి పైగా కార్యకర్తలను ఎన్నుకొన్నారట. వీరిలో ఆస్తికులు, నాస్తికులు, హిందువులు, ముస్లింలు.. అన్న బేధాలు లేకుండా అన్నిరకాల వారూ ఉన్నారు. పరిశోధన కోసం ఎన్నుకొన్న అభ్యర్థులందరినీ తాత్కాలిక కోమాకి గురిచేశారు. ఒక ఇరవై నిమిషాల తర్వాత వారిలో తిరిగి కదలికలను తీసుకువచ్చారు. మరణానికి దగ్గరగా ఉన్న ఆ పరిస్థితిలో వారు ఎలాంటి అనుభూతికి లోనయ్యారో తెలియచేయమని చెప్పారు. ఆశ్చర్యంగా అభ్యర్థులంతా కూడా తాము ఒకేరకమైన అనుభూతులు పొందామని చెప్పారు.   తాము శరీరం నుంచి వేరైనట్లుగా తోచడం, ఆకాశంలో తేలిపోతూ ఉండటం, అంతులేని ప్రశాంతత, అప్పటిదాకా ఉన్న భయాందోళనలన్నీ చెరిగిపోవడం, గాలిలో కరిగిపోతున్నట్లుగా అనిపించడం... లాంటి అనుభూతులన్నీ అభ్యర్థులకి కలిగాయట. తాము ఒక కాంతిపుంజం ముందు నిలబడిన భావన కూడా కలిగిందట! మతాలకు అతీతంగా, నాస్తికులకు సైతం ఇలాంటి అనుభవాలు కలిగాయట!   ఈ వార్త World News Daily Report అనే వెబ్సైటులో కనిపించగానే సంచలనంగా మారిపోయింది. వెంటనే ప్రపంచంలోని జాతీయ పత్రికలన్నీ ఈ వార్తని ప్రచురించేశాయి. ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదన్నది చాలామంది వాదన. కానీ వార్తలో పేర్కొన్న ‘ఆత్మానుభూతులు’ మనం ఈ మధ్యకాలంలో చదువుతున్న ఆధ్యాత్మిక పుస్తకాలను దగ్గరగా ఉండటంతో... ఈ వార్త నిజమే అని ఒప్పుకునేవారూ ఉన్నారు. పరిశోధన జరిగిందో లేదో కానీ, జరిగితే ఇదే బయటపడుతుందని ఆస్తికుల వాదన! - నిర్జర.    

పేకాట మాన్పించే మందులు వచ్చేస్తున్నాయి!

  కొంతమందిని చూడండి! ఒక పద్ధతి అనుకుని దాని ప్రకారమే జీవించేస్తుంటారు. ఆ పద్ధతికి ఓ అడుగు అటూ ఇటూ ఒక్క అడుగైనా వేసేందుకు సిద్ధపడరు. మరికొందరు ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్ల తీరుని ఊహించడం కష్టం. మనిషి మనిషికీ మధ్య ఈ తేడాలేంటి. ఒకరు దూకుడుగా ఉంటే, మరికొందరు అతిజాగ్రత్తగా ఎందుకు ప్రవర్తిస్తారు? కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు, ఈ ప్రశ్నకి జవాబు కనుక్కొనే ప్రయత్నం చేశారు. ఈ జవాబు చాలా సమస్యలకి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు.   దూకుడుగానో, పద్ధతిగానో ప్రవర్తించే సమయంలో మన మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనించే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం కొన్ని ఎలుకలకి ల్యాబొరేటరీలో ఓ పరీక్ష పెట్టారు. వాటికి ఐపాడ్ మీద రెండు దృశ్యాలని చూపించారు. మొదటి దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు, దానికి వెంటనే ఓ స్వీట్ ఇచ్చారు. రెండో దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు కూడా దానికి స్వీట్ ఇచ్చేవారు... కాకపోతే అది ఇవ్వడంలో కాస్త అనిశ్చితి ఉండేది. అంటే స్వీట్ దక్కుతుంది కానీ... దాన్ని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఎలుకలు ఉండేవన్నమాట!   సహజంగానే కొన్నిరకాల ఎలుకలు వెంటనే స్వీట్ తినేందుకు ఇష్టపడి ఎప్పుడూ మొదటి దృశ్యాన్నే ఎన్నుకొనేవి. మిగతా ఎలుకలు స్వీట్ ఎప్పుడు దక్కినా ఫర్వాలేదు అనుకుంటూ రెండో దృశ్యాన్ని ఎన్నుకొనేవి. ఇలా అనిశ్చితికి సిద్ధంగా ఉండే ఎలుకలలోని మెదడు పనితీరు భిన్నంగా ఉన్నట్లు గ్రహించారు. వీరి మెదడులోని orbitofrontal cortex అనే వ్యవస్థ పనితీరు కాస్త నిదానంగా ఉంది. దాంతో ఎదుర్కోబోయే అనిశ్చితిని అవి ఊహించ లేకపోయాయి. ఇక అనిశ్చితికి సిద్ధపడే ఎలుకల మెదడులో gephyrin అనే ప్రొటీను కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది.   మనిషికీ మనిషికీ మెదడులో ఉండే తేడాల వల్లే వారి ప్రవర్తనలో మార్పులు ఉంటాయని తేలిపోయింది. దాంతో మున్ముందు ప్రవర్తనకి సంబంధించి ఎలాంటి సమస్యనైనా మందులతో నివారించవచ్చని ఆశిస్తున్నారు. ఆటిజం వంటి అనేక సమస్యలకి ఈ మందుతో నివారణ సాధ్యమంటున్నారు. అంతేకాదు! పేకాట ఆడేవారిలో అనిశ్చితిని ఇష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక నిరంతరం పద్ధతిగా ఉండాలనుకునేవారిలో చాదస్తం ఎక్కువగా కనిపిస్తుంది. Gephyrin ప్రొటీనులో మార్పులు తీసుకురావడం వల్ల పేకాట, చాదస్తంలాంటి సమస్యలని కూడా మందులతో నివారించవచ్చునట! - నిర్జర.    

ఉన్నవాడో లేనివాడో... మొహం చూస్తే తెలిసిపోతుంది

‘Face is the index of the mind’ అంటూ ఉంటారు పెద్దలు. మన మొహం చూస్తే, మనసులో ఏముందో చెప్పేయవచ్చన్నది వారి భావన. కానీ ఒకరి మొహం చూసీచూడగానే... ఇతను ఉన్నవాడనో, లేనివాడనో చెప్పేయవచ్చా! మొహంలో ఎలాంటి భావనా కనిపించకపోయినా, అతని అంతస్తుని పసిగట్టవచ్చా! అంటే భేషుగ్గా అంటున్నారు పరిశోధకులు. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు... మొహాన్ని చూసి మనిషి ఆస్తిపరుడా, కాదా అన్న విషయాన్ని ఎంతవరకు పసిగడతామో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 60వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ, లక్షకు పైగా డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ ఫొటోలు తీశారు. ఈ ఫొటో తీసే సమయంలో వారి మొహంలో చిరునవ్వూ, బాధా, కోపం లాంటి ఏ భావమూ లేకుండా ఉండేట్లు జాగ్రత్తపడ్డారు.   పరిశోధకులు తాము తీసిన ఫొటోలని కొందరు వాలంటీర్లకు చూపించారు. విచిత్రంగా సగానికి పైగా సందర్భాలలోనే అవతలి మనిషి పేదా, గొప్పా అన్న విషయాన్ని ఇట్టే పసిగట్టేశారట. ఎదుట ఉన్నది ఆడామగా, తెల్లవాడా నల్లవాడా అన్న బేధాలేవీ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు. చూసీ చూడగానే ఠక్కున ఫొటోలోని వ్యక్తి ఆర్థిక పరిస్థితిని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా... ఇదంతా కూడా మన మెదడుకి ఉన్న సామర్థ్యమే అంటున్నారు. మొహాలని పసిగట్టడంలో మన మెదడు మహా దిట్ట అట. ఆఖరికి మబ్బులని చూసినా కూడా, వాటిని ఏదో ఒక మొహంతో పోల్చుకోగలదు. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా, విరక్తిగా ఉన్నారా అన్నది కూడా దానికి తెలిసిపోతుంటుంది. అదే సూత్రంతో వాళ్లు పేదా గొప్పా అన్నది అంచనా వేసేస్తుంది.   అనారోగ్యం, కుటుంబ కష్టాలు దీర్ఘకాలం ఉండకపోవచ్చు. కానీ పేదరికంలో పుట్టినవారు దాని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఆ పేదరికం కలిగించే అసంతృప్తి, బాధ వారిని వేధిస్తుంది. ఒక మనిషి సుదీర్ఘకాలం సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా... కొన్నాళ్లకి ఆ భావం అతని మొహం మీద స్థిరపడిపోతుందట! అంటే ఓ వయసు వచ్చిన తర్వాత మనం ఏ భావమూ లేకుండా ఉన్నా కూడా, మన పరిస్థితి అన్నది అవతలి మనిషికి తెలిసిపోతుందన్నమాట!   మన ఆర్థిక పరిస్థితి అవతలివారికి తెలియడం వల్ల నష్టం ఏమిటి? అన్న అనుమానం రావచ్చుగాక! ఏ ఉద్యోగానికో, పెళ్లిచూపులకో, అప్పు కోసమో వెళ్లినప్పుడు... సహజంగానే అవతలి వ్యక్తికి మన మీద తెలియకుండానే ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన పేదరికం మరింత శాపంగా పరిగణిస్తుంది. పరిశోధకులు దీనికి నివారణోపాయాన్ని చెప్పలేదు కానీ... జీవితంలో ఎలాంటి సమస్యనయినా చిరునవ్వుతో ఎదిరించే ధైర్యం, ఉన్నదానిలో తృప్తిగా ఉండే తత్వం ఉంటే మన మొహంలో ఎలాంటి పేదరికమూ కనిపించకపోవచ్చు. - నిర్జర.    

ఈ బీరు తాగితే ఆరోగ్యమట!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట మనం లక్షసార్లు వినే ఉంటాము. కాకపోతే మోతాదులో పుచ్చుకుంటే మద్యం వల్ల ఉపయోగం ఉంటుందని కొందరు నమ్ముతుంటారు. అప్పుడప్పుడూ ఓ గుటక వేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తుంటారు. మొత్తానికి మద్యం తాగేవాళ్లు సర్వకాల సర్వావస్థల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మందుబాబులకి ఇప్పుడు ఓ శుభవార్త! ప్రోబయాటిక్‌ అన్న పదం ఇప్పుడు చాలా సందర్భాలలో వినిపిస్తోంది. శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవులనే మనం ప్రోబయాటిక్స్‌ అంటున్నాము. రోగంతో పాటుగా శరీరానికి కూడా హాని తలపెట్టే యాంటీబయాటిక్‌ మందుల కంటే, ఇప్పుడు ప్రోబయాటిక్‌ మందులకే వైద్యులు ప్రాధాన్యతని ఇస్తున్నారు. మున్ముందు ఆహారపదార్థాలకి కూడా ఈ ప్రోబయాటిక్స్‌ను కలిపి తినే రోజులు రానున్నాయి. ఇంత మంచి ప్రోబయాటిక్స్‌ను బీరులో ఎందుకు కలపకూడదన్న ఆలోచన వచ్చింది సింగపూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకి. కానీ బీరులో ప్రోబయాటిక్స్‌ బతకడం దాదాపు అసాధ్యం! బీరులో ఉండే ‘హాప్‌ యాసిడ్స్‌’ అనే రసాయనాలతో ప్రోబయాటిక్స్‌ మనుగడ సాగించడం అసాధ్యం. అందుకని దాదాపు తొమ్మిదినెలలపాటు శ్రమించి ప్రోబయాటిక్స్‌కు అనుకూలంగా ఉండే బీరు తయారీ విధానాన్ని కనుగొన్నారు. బీరు తయారీలో మార్పు తేవడం ద్వారా సగం పని పూర్తయింది. ఇక అందులోకి ఎలాంటి ప్రోబయాటిక్స్ అనుకూలమో గమనించే ప్రయత్నం చేశారు. Lactobacillus paracasei (L26) అనే పదార్థమైతే బాగుంటుందని తేల్చారు. పాలల్లో కనిపించే లాక్టిక్‌ యాసిడ్‌లో ఒక రకమే ఈ L26. మన పేగులలో కనిపించే ఈ ప్రోబయాటిక్‌ శరీరంలోని హానికారక రసాయనాలకి (toxins) విరుగుడుగా పనిచేస్తుందట. వైరస్‌ను ఎదుర్కోవడంలో, రోగనిరోధకశక్తిని పెంపొందించడలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని తేలింది. ఇక ఇలాంటి ప్రోబయాటిక్ ఉన్న బీరు తాగితే ఆరోగ్యం గ్యారెంటీ అంటున్నారు. ఈ బీరుని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఏదన్నా సంస్థ ముందుకు వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.   - నిర్జర.

కామెడీ సినిమాలతో చావుని జయించాడు

  నార్మన్ కజిన్స్- ఈ పేరు చాలామంది విని ఉండకపోవచ్చు! కానీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పరిచయం ఉన్నవారు ఎక్కడో అక్కడ, ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి వినే ఉంటారు. మనిషిలో సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోవాలంటే... నార్మన్ జీవితమే ఓ ఉదాహరణ!   నార్మన్ ఓ జర్నలిస్ట్. అమెరికాలోని ఓ ప్రముఖ పత్రికలో చేరి, క్రమక్రమంగా దాని మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగిన సమర్థుడు. ప్రపంచశాంతి కోసం పాటుపడినవాడు. జపాను మీద అమెరికా అణుదాడి చేసినప్పుడు, నిర్భయంగా తన నిరసనను వ్యక్తపరిచిన వ్యక్తి. నార్మన్ వ్యక్తిగత జీవితమూ, వృత్తి జీవితమూ చాలా అద్భుతంగా సాగిపోతున్న కాలంలో ఓ పిడుగులాంటి వార్త వినిపించింది.   1964లో నార్మన్కి 49 ఏళ్ల వయసు ఉండగా... అతనికి Ankylosing spondylitis అనే అరుదైన వ్యాధి ఉందని తేల్చారు. అప్పట్లో ఈ వ్యాధి వచ్చినవారు బతికేందుకు అవకాశం చాలా తక్కువగా ఉండేదట. ఈ వ్యాధి సోకి ప్రతి 500 మందిలో ఒక్కరు మాత్రమే బతికే అదృష్టం ఉంటుందట. మరికొద్ది రోజులలో నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి ‘చివరగా’ పూర్తిచేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే పూర్తిచేసుకోమంటూ.... వైద్యులు నార్మన్కు సూచించారు.   ఒకపక్క తాను అతి త్వరలో చనిపోబోతున్నానన్న విషాధం. మరోపక్క ఆ వ్యాధి కలిగిస్తున్న అంతులేని బాధ. దాంతో నార్మన్కు ఏం చేయాలో పాలుపోలేదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఓ ఆలోచన వచ్చింది. రోగం, బాధ కలిసి ఉన్నప్పుడు- ఆరోగ్యం, సంతోషం కూడా కలిసి ఉండాలి కదా! తను బాధగా ఉంటే రోగం నయం కాకపోవచ్చు. కానీ సంతోషంగా ఉంటే ఏదన్నా అద్భుతం జరగవచ్చు కదా! ఆ ఆలోచన రాగానే నార్మన్ ఓ నిర్ణయానికి వచ్చాడు.   నార్మన్ వెంటనే హాస్పిటల్లోంచి బయటకు వచ్చేశాడు. ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. తను పోగుచేసుకున్న సంపాదనతో ఓ ప్రొజెక్టరు కొన్నాడు. ఇక అంతే! ఆ ప్రొజెక్టరులో కామెడీ సినిమాలు వేసుకోవడం, అదే పనిగా నవ్వడం- ఇదే దినచర్యగా పెట్టుకొన్నాడు. వాటికి తోడు రోగనిరోధశక్తిని పెరిగేందుకు పుష్కలంగా C విటమిన్ పుచ్చుకున్నాడు.   ఫలితం! ఎవ్వరూ నమ్మలేని విధంగా నార్మన్ మామూలు మనిషి అయిపోయాడు. కొద్ది రోజుల్లో చనిపోతావని చెప్పిన వైద్యుల మాటలని తారుమారు చేస్తూ మరో 26 ఏళ్లు బతికాడు. ఆ తర్వాత కాలంలో సంతోషంగా ఉండటం వల్లా, నవ్వు వల్లా ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో చెబుతూ బోలెడు పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. నవ్వుతో immunoglobulin A, T lymphocytes వంటి రోగనిరోధకశక్తిని పెంపొందించే కణాలు వృద్ధి చెందుతాయని తేలింది. నవ్వుతో శరీరంలో ఉండే వైరస్, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని బయటపడింది.   నార్మన్ తన అనుభవంతో Anatomy of an Illness అనే పుస్తకాన్ని రాశాడు. సానుకూల దృక్పథంతో, చిరునవ్వుతో తాను చావుని ఎలా జయించాడో అందులో చెప్పుకొచ్చాడు. వ్యక్తిత్వ వికాస రంగంలో ఆ పుస్తకం ఇప్పటికీ ఓ సంచలనమే! - నిర్జర.      

పొట్టిగా ఉండేవారిలో బట్టతల ఎందుకు?

  మీరో విషయాన్ని గమనించారా! తెల్లగా, పొట్టిగా ఉండేవారిలో బట్టతల కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కావాలంటే మరోసారి కళ్లుమూసుకుని మీ పరిచయస్తులందరినీ గుర్తుచేసుకుని చూడండి. ఇదేమీ మూఢనమ్మకం కాదండోయ్. జన్యు పరిశోధకులు తేల్చి చెబుతున్న విషయం.   బట్టతల అనేది జన్యుపరంగా వచ్చే సమస్య అని తెలుసు. కానీ బట్టతలని కలిగించే జన్యువులు ఇతరత్రా లక్షణాలు కూడా ఏమన్నా చూపించగలవా? అన్న అనుమానం వచ్చింది కొందరు జర్మనీ శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడవుగా చిన్నవయసులోనే బట్టతల వచ్చేసిన ఓ 11వేల మంది జన్యువులనీ, అసలు బట్టతలే లేని ఓ 12వేల మంది జన్యువులనీ పరిశీలించి చూశారు. వీరంతా కూడా ఒక్కదేశానికి చెందినవారు కాదు. ఏడు వేర్వేరు దేశాలకి చెందిన అభ్యర్థులు!   అభ్యర్థులందరి జన్యువులనీ పరిశీలించిన మీదట... బట్టతల ఉన్నవారిలో ఓ 63 జన్యువులు భిన్నంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు! ఈ జన్యువుల ఇతరత్రా లక్షణాలకు కూడా కారణం అవుతున్నట్లు బయటపడింది. బట్టతల కలిగించే జన్యువులు... తెల్లటి చర్మానికీ, తక్కువ ఎత్తుకీ, కొన్ని రకాల కేన్సర్లకీ కూడా కారణం అవుతున్నట్లు గమనించారు. ముఖ్యంగా వీరిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గ్రహించారు. అలాగే బట్టతలని కలిగించే జన్యువులతోనే గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే కనిపించింది!   తెల్లటి చర్మం ఉన్నవారిలో బట్టతల రావడానికి కారణం లేకపోలేదు. తెల్లగా ఉన్నవారిలో సూర్యకాంతి నుంచి విటమిన్ ‘డి’ని సంగ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తల మీద ఉన్న చర్మం కూడా ఆ పని చేసేందుకు వీలుగా, నెత్తిన వెంట్రుకలు పలచబడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తెల్లగా ఉండేవారి బట్టతల ఓ సోలార్ ప్యానెల్లాగా పనిచేస్తుందన్నమాట! కానీ గుండెజబ్బులు, ప్రొస్టేట్ కేన్సర్లాంటి ఇతరత్రా సమస్యలకీ బట్టతలకీ మధ్య కారణం ఏమిటో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.   శతాబ్దాల తరబడి రకరకాల జన్యు పరివర్తనాలు (gene mutations) ఏర్పడటం సహజం. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమందికి కొన్ని రకాల జన్యువుల సంక్రమిస్తూ ఉంటాయి. వీటితో కొన్ని లాభాలూ ఉంటాయి, కొన్ని నష్టాలూ ఉంటాయి. నాకు బట్టతల ఉంది కాబట్టి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని బాధపడాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే... ఈ ప్రమాదాన్ని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. - నిర్జర.  

ఖాళీకడుపు మీద ఇవి అస్సలు తినకూడదట!

  ఉదయం లేవగానే కడుపు నకనకలాడిపోతుంటుంది. ఏదో ఒకటి పొట్టలో పడకపోతే, మనసంతా చిరాగ్గా మారిపోతుంది. కానీ ఆకలి తీర్చుకునే ధ్యాసలో ఏదిపడితే అది తినేస్తే మాత్రం... ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు. అలా ఖాళీ కడుపుకి దూరంగా ఉంచాల్సిన పదార్థాలు కొన్నింటిని సూచిస్తున్నారు...   ఆరటిపళ్లు   ఉదయాన్నే తినేందుకు ఏదీ కనిపించకపోతే ఓ అరటిపండుని నమిలిపారేస్తాం. అరటిపండులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖాళీకడుపున జీర్ణమయ్యే ఈ మెగ్నీషియం గుండె, నాడీవ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట!   మసాలాలు   ఉదయాన్నే వేడివేడి సమోసానో, నోరూరించే పరోటా కుర్మానో తినేస్తుంటారు. ఖాళీ కడుపు మీద ఇలా పచ్చిమిర్చి, మసాలాలు దట్టించిన ఆహారం తినడం వల్ల పేగులు దెబ్బతిని అల్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పైగా ఇలాంటి ఘాటైన పదార్థాల వల్ల జీర్ణరసాలు ఎక్కువగా ఊరి అసెడిటీకి కూడా దారితీస్తాయట.   టీ – కాఫీ   కాఫీ,టీలలో ఉండే కెఫిన్ వల్ల తాగిన వెంటనే కాస్త ఉత్సాహంగా ఉంటే ఉండవచ్చుగాక! కానీ ఖాళీ కడుపున ఇవి పుచ్చుకుంటే మాత్రం అజీర్ణం తప్పదంటున్నారు. అంతేకాదు! పరగడుపున తాగే టీ, కాఫీలు బైల్ అనే రసాయనం ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయట. దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చునంటున్నారు. కాబట్టి టీ, కాఫీలు అలవాటు ఉన్నవారు... అల్పాహారం తిన్న తరువాతనో, ఓ గ్లాసుడు మంచినీరు తాగిన తర్వాతనో మాత్రమే వాటిని పుచ్చుకోవాలని సూచిస్తున్నారు.   తీపిపదార్థాలు   పరగడుపున చాక్లెట్లు, స్వీట్స్, జ్యూసులు, కూల్డ్రింక్స్ వంటి తీపిపదార్ధాలు తీసుకోవడం అంటే లివర్ నెత్తిన ఇంత విషం పోయడమే అంటున్నారు. మద్యం తాగడం వల్ల లివర్ మీద ఎంత భారం పడుతుందో... ఖాళీ కడుపున తీపి తినడం వల్ల కూడా అంతే ప్రమాదమట!   టమాటాలు   చూస్తూ చూస్తూ ఎవరూ పరగడుపున టమాటాలు తినరనుకోండి. కానీ చపాతీలలోకో, సలాడ్లలో భాగంగానో పచ్చి టమాటాలు తినే అలవాటు మాత్రం చాలామందికి ఉంటుంది. టమాటాలలో ఉండే ‘టేనిక్ యాసిడ్’ అనే రసాయనం జీర్ణవ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందట!   పచ్చికూరలు   ఉదయం లేవగానే దోసెలు,పూరీలులాంటి నూనెపదార్థాల బదులు చక్కగా పచ్చికూరలు తినవచ్చు కదా! అన్న ఆలోచన రావడం మంచిదే. కానీ మన శరీరం పచ్చి ఆహారాన్ని తినే అలవాటు నుంచి దూరమై చాలా శతాబ్దాలే గడిచిపోయింది కదా! అలాంటి శరీరంలోకి ఇప్పుడ అకస్మాత్తుగా ఖాళీకడుపున పచ్చికూరలు వేస్తే... వాటిలోని పీచు పదార్థాలతో పేగులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదంటున్నారు. కాబట్టి జీర్ణవ్యవస్థ బాగోలేనివారు పరగడుపున ఈ పచ్చికూరలకి దూరంగా ఉండమని సూచిస్తున్నారు.   ఇవే కాదు- పుల్లటి పళ్లు, మద్యం, బేకరీ పదార్థాలు కూడా పరగడుపున మంచిది కాదని సూచిస్తున్నారు. - నిర్జర.      

99 వేల రూపాయల సంఘం

ఒకానొక సమయంలో ఓ గొప్ప జమీందారు ఉండేవాడు. నౌకర్లూ, చాకర్లూ, పొలాలూ, వాహనాలూ, భవనాలూ... ఇలా అన్నిరకాల సంపదలూ ఆ జమీందారు దగ్గర ఉన్నాయి. కానీ ఏం లాభం! అతని మనసులో ప్రశాంతత లేదు, అతని జీవితంలో సంతోషం లేదు. ఓ రోజు ఎప్పటిలాగే జమీందారు దిగాలుగా తన తోటలో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక పనివాడు తోటలో ఉత్సాహంగా పనిచేయడం అతని కంటపడింది. ఆ పనివాడి ఒంటి మీద సరైన బట్ట లేదు. అయినా ఆడుతూపాడుతూ పనిచేస్తున్న అతన్ని చూసి జమీందారుకి ఆశ్చర్యం వేసింది. ‘ఇంత సంపద ఉన్న నేనే నిస్సారంగా జీవితాన్ని గడిపేస్తుంటే... ఈ పేదవాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు?’ అనిపించింది. జమీందారుగారు తన మనసులో మాటని వెంటనే దివాన్జీతో పంచుకున్నాడు. దానికి దివాను- ‘ఆ పేదవాడు ఎందుకంత సంతోషంగా ఉన్నాడో... అతని సంతోషాన్ని దూరం చేసే ఉపాయం ఏమిటో నాకు తెలుసు. మీరు ఒక్క 99 వేలు ఇచ్చారంటే... నేను మీకో విచిత్రం చూపిస్తాను,’ అన్నాడు. దివాన్జీ మాట మీద నమ్మికతో జమీందారు ఓ 99 వేలు అతని చేతిలో పెట్టారు. ఆ రోజు రాత్రి పేదవాడి ఇంటి ముందర 99 వేల రూపాయలున్న మూటని గుట్టుచప్పుడు కాకుండా పెట్టాడు దివాన్జీ! మర్నాడు ఉదయమే లేచి ఆ డబ్బుని చూసిన పేదవాడి సంబరానికి అంతులేకుండా పోయింది. ఈ దెబ్బతో తాను లక్షాధికారిని అయిపోయానని మురుసుకున్నాడు. కానీ లెక్కపెట్టి చూస్తే ఏముంది! ఆ డబ్బు సరిగ్గా 99 వేలే ఉంది. ఈ డబ్బుని ఎవరు అందించారో కానీ, ఎటూ కాకుండా ఇచ్చారేమిటా అని సందేహపడ్డాడు. ఇంకొక్క వేయి రూపాయలు ఉంటే తాను లక్షాధికారిని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. ‘ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది! ఈ నెల కాస్త కష్టపడి పనిచేశానంటే ఓ వేయి రూపాయలు మిగుల్చుకుని ఆ లోటుని పూర్తిచేయవచ్చు. ఆ తర్వాత లక్షరూపాయలని ఏం చేయాలా అని ఆలోచించవచ్చు!’ అని అనుకున్నాడు. మర్నాటి నుంచి ఆ పేదవాడి తీరు మారిపోయింది. ఆ వేయి రూపాయల లోటుని పూడ్చడమే అతని ధ్యేయంగా మారిపోయింది. పనిలోంచి పాట దూరమైపోయింది, మొహంలో స్పష్టంగా చింత కనిపిస్తోంది. ఆ వేయి రూపాయలని పూడ్చేందుకు తన భార్యాబిడ్డలను కూడా పనికి పంపడం మొదలుపెట్టాడు. కానీ అదేం చిత్రమో కానీ... నెల పూర్తయినా కూడా వేయి రూపాయల లోటు నిండలేదు సరికదా.... ఏదో ఒక ఖర్చు పేరుతో ఉన్న డబ్బులోంచి కొంత కరిగిపోయింది. దాంతో లోటు మరింత లోతుకి చేరుకుంది. ఇలా నెల, రెండు నెలలు కాదు... ఆరు నెలలు గడిచిపోయాయి- కానీ లోటుని పూడ్చడం పేదవాడి వల్లకాలేదు. దాంతో అతని చింత కూడా పెరిగిపోసాగింది. పైగా ఎవరన్నా ఆ డబ్బు కోసం తిరిగివస్తారేమో అన్న భయమూ మొదలైంది. ఇప్పుడు మనిషిలో నవ్వు లేదు, పనిలో జీవం లేదు... మొత్తంగా అతని జీవితంలో సంతోషమే లేదు! ఒకరోజు జమీందారుగారు ఏదో పనిమీద తోటకి వచ్చినప్పుడు, ఆయన కంటికి ఈ పేదవాడు కనిపించాడు. ఆనాడు సంతోషానికి నిర్వచనంగా చూసిన మనిషికీ, ఆ రోజున దుఃఖానికి ప్రతిరూపంగా కనిపించి వ్యక్తికీ ఏమాత్రమూ పొంతన లేదయ్యే! ఇదంతా దివాన్జీ పన్నిన ఉపాయపు ఫలితమే అని అర్థమైంది. వెంటనే దివాన్జీని పిలిపించి విషయాన్ని వాకబు చేశాడు. దివాన్జీ, జమీందారుకి జరిగిన విషయమంతా చెప్పాడు. ‘ప్రభూ! ఇప్పుడతను 99వేల రూపాయల సంఘంలో సభ్యుడు! అందుకే అతనికి ఆ చింత!’ అన్నాడు దివాన్జీ. ‘99వేల రూపాయల సంఘమా! అదేంటి?’ అని ఆశ్చర్యంగా అడిగాడు జమీందారు. ‘తనకి ఉన్నదానితో సంతృప్తి పడకుండా, ఆ ఉన్నది చేజారిపోతుందేమో అని భయపడుతూ, ఉన్నదానికి మరింత జోడించాలనే తపనతో వ్యాకులపడుతూ... జీవితాన్ని చేజార్చుకునేవారంతా ఈ 99వేల రూపాయల సంఘంలోని సభ్యులే!’ అని చెప్పుకొచ్చాడు. ‘అంటే ఇప్పుడు మనం కూడా ఆ సంఘంలోని సభ్యులమే అంటారా!’ అని అడిగాడు జమీందారు. ‘అందులో సందేహమేముంది ప్రభూ! లేకపోతే మీ మనసులో ఎప్పుడూ ఎడతెగని చింత ఎందుకు ఉంటుంది?’ అని సెలవిచ్చాడు దివాన్జీ. అప్పటి నుంచి జమీందారు తనకి ఉన్నదాంతో సంతృప్తి చెందడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంతో అతని జీవితంలోకి సంతోషం కూడా ప్రవేశించింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

Sylvester Stallone – అతని జీవితమే ఓ సినిమా!

  అనగనగా ఓ హీరో! అతను నానాకష్టాలూ పడతాడు. ఆ కష్టాలు చూసినవారెవ్వరికైనా ‘ఇంతకంటే దారుణమైన జీవితం ఉంటుందా!’ అన్న అనుమానం వచ్చేస్తుంది. కానీ మన హీరోకి మాత్రం అలాంటి అనుమానం ఏమీ ఉండదు. ప్రతి కష్టాన్నీ అతను నిబ్బరంగా ఎదుర్కొంటాడు, చివరికి తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాంటి హీరోలు వెండితెర మీదే కాదు... మన మధ్యన కూడా కొందరున్నారు. కావాలంటే చూడండి!   సిల్వస్టర్ స్టలోన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసులో కూడా హాలీవుడ్లో హంగామా సృష్టిస్తున్న టాప్ హీరో. కానీ ఈ స్థాయికి చేరుకునేందుకు అతను సాగించిన ప్రయాణం అసమాన్యం. స్టలోన్ తండ్రి అమెరికాలో స్థిరపడిన ఇటాలియన్, తల్లి రష్యన్. స్టలోన్ పుట్టుకతోనే దురదృష్టం తోడుగా లోకంలోకి అడుగుపెట్టాడు. అతన్ని తల్లి గర్భం నుంచి బయటకు తీసేందుకు పటకారు (forceps) ఉపయోగించాల్సి వచ్చింది. దాని వల్ల అతని మొహంలోని ఒక నరం దెబ్బతిని పక్షవాతం వచ్చేసింది. అతని పెదాలు, నాలుక, దవడలోని కొంత భాగం సరిగా పనిచేయకుండా పోయింది. స్టాలిన్ కష్టాలకు ఇది ఒక ఆరంభం మాత్రమే!   స్టలోన్కు తొమ్మిదేళ్ల వయసు ఉండగా... అతని తల్లిదండ్రులు విడిపోయారు. అతని ఆలనాపాలనా తల్లే చూసుకోసాగింది. కానీ స్టలోన్ చదువులో చురుగ్గా లేకపోవడంతో, తల్లి అతన్ని ఒక సెలూన్లో ఉద్యోగానికి పెట్టింది. కానీ ఆ ఉద్యగం అతన్ని మరింత పేదరికంలోకి నెట్టేసింది. స్టలోన్కు 24 ఏళ్లు వచ్చేసరికి ఏ ఉద్యోగమూ లేకుండా పోయింది. అతను ఉంటున్న అపార్టుమెంట్ అద్దెని కూడా కట్టలేని పరిస్థితి. దాంతో ఓ రోజున కట్టుబట్టలతో సహా ఆ అపార్టుమెంటు నుంచి బయటపడక తప్పలేదు. తలదాచుకోవడానికి ఆరడుగుల అండ కూడా దొరక్కపోవడంతో... న్యూయార్కులోని బస్టాండులోనే మూడు వారాలు గడిపాడట స్టలోన్.   ఆ సమయంలో స్టలోన్కు ఒక వరంలాంటి శాపం దక్కింది. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్న అతడికి ఒక పోర్న్ ఫిల్మ్ (అశ్లీల చిత్రం)లో చిన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకుగాను అతనికి 200 డాలర్లు ఇస్తామని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేదు, తల దాచుకోవడానికి నెత్తి మీద నీడ లేదు. అలాంటి సమయంలో స్టలోన్కు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ అవకాశంతో స్టలోన్ జీవితమైతే మారిపోలేదు కానీ చిన్నాచితకా వేషాలు దొరకడం మొదలైంది.   ఒకరోజు స్టలోన్ టీవీలో బాక్సింగ్ పోటీ చూస్తున్నాడు. అందులో మహమ్మద్ ఆలీ, చక్ వెప్నర్ అనే బాక్సర్లు హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఆ పోటీ చూసిన స్టలోన్ మనసులో ఓ ఆలోచన మెదిలింది. బాక్సింగ్ పోటీ నేపథ్యంలో ఒక సినిమా కథని ఎందుకు రాయకూడదనిపించింది. వెంటనే తన రూమ్కి వెళ్లి మూడు రోజుల పాటు ఏకధాటిగా కూర్చుని ఒక కథని అల్లాడు. అదే Rocky! తను రాసిన స్క్రిప్ట్ను తీసుకుని స్టలోన్ ప్రొడ్యూసర్ల దగ్గరకి బయల్దేరాడు.   స్టలోన్ రాసిన కథ చాలామందికి నచ్చింది. కానీ ఆ కథలో ప్రధాన పాత్రని తనే పోషిస్తానని స్టలోన్ చెప్పడంతో ఎవ్వరూ సినిమా తీసేందుకు ధైర్యం చేయలేదు. చివరికి ఒక నిర్మాత ఆ కథని 3,50,000 డాలర్లకి కొనేందుకు ఒప్పుకొన్నాడు. అంత భారీ ఆఫర్ వచ్చినా కూడా స్టలోన్ తన పంతం వీడలేదు. అందులో రాకీ పాత్ర తను పోషించాల్సిందే అని పట్టుపట్టాడు. ఇక చేసేదేమీ లేక స్టలోన్కు కేవలం 35,000 డాలర్లు ముట్టచెప్పి అతనితో ఆ పాత్ర చేయించారు.   రాకీ విడుదల తర్వాత స్టలోన్ ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. అందులో అతని అద్భుతమైన నటనకీ, రచనకీ ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. కేవలం పదకొండు లక్షల డాలర్లతో తీసిన ఆ చిత్రం 22 కోట్ల డాలర్లను వసూలు చేసింది. ఆ ఒక్క సినిమాకే ఆరు సీక్వెల్స్ తీశారంటే హాలీవుడ్లో దాని ప్రభావం ఏపాటిదో అర్థమవుతుంది. ఆ సీక్వెల్స్తో పాటుగా Rambo, Cliffhanger లాంటి 70కి పైగా చిత్రాలతో స్టలోన్ హాలీవుడ్ చరిత్రలోనే తనదైన అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు.   స్టలోన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి ఇష్టమైన కుక్కపిల్లని 50 డాలర్లకు అమ్మేశాడట. కానీ రాకీ సినిమా కోసం తనకి 35,000 డాలర్లు ముట్టగానే వెంటనే ఆ కుక్కని తిరిగి కొనేందుకు బయల్దేరాడు. ఆ కుక్కని కొనుక్కొన్న వ్యక్తి తరచూ బార్కి వస్తాడని తెలియడంతో మూడురోజులపాటు అతని కోసం కాపుకాశాడు. చివరికి అతను కనిపించనైతే కనిపించాడు కానీ... ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ‘ఆఖరికి 3,000 డాలర్లు చెల్లించి నానా తిట్లూ తిన్న తర్వాత నాకు ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు అతను ఒప్పుకున్నాడు’ అని స్టలోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హుమ్! స్టలోన్ తను కోల్పోయినవి కూడా తిరిగి సాధించుకున్నాడన్నమాట. నిజమైన విజయం అంటే అంతే కదా!!! - నిర్జర.