భయం నిజమై తీరుతుంది

అదో చిన్న ఊరు. అందులో ఒకాయన సమోసాలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఉదయం అంతా సమోసాల కోసం కావల్సిన సామగ్రిని తయారుచేయడం. మధ్యాహ్నం నుంచి వేడివేడి సమోసాలు తయారుచేయడం. ఇదే అతనికి తెలిసిన పని. ఇలా చేసిన సమోసాలు... అలా చిటికెలో అమ్ముడుపోయేవి. ఆ సమోసాల కోసం ఊళ్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. పొరుగూరి నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ సమోసాల రుచి చూడకుండా వెళ్లేవారు కాదు. రోజురోజుకీ సమోసాల వ్యాపారం పెరుగుతోందే కానీ ఏ రోజూ తగ్గడం అంటూ ఉండేది కాదు. జోరు వానలో అయినా, మండు వేసవిలో అయినా... వేడి వేడి సమోసాలు ఇట్టే అమ్ముడుపోయేవి.   సమోసాల వ్యాపారికి ఒకే ఒక్క పిల్లవాడు ఉండేవాడు. తన వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో ఆ పిల్లవాడిని పట్నం పంపించి చదువు చెప్పించాడు. తను మాత్రం ఒంటరిగా ఆ పల్లెటూర్లో జీవితాన్ని గడిపేసేవాడు. ఉదయాన లేవడం దగ్గర నుంచీ, రాత్రికి పడుకోవడం దాకా అతని జీవితం అంతా సమోసాల చుట్టూనే తరిగేది. వార్తాపత్రికలు చదవడానికి కానీ, టీవీ చూడ్డానికి కానీ ఎలాంటి అవకాశమూ చిక్కేది కాదు.   అలా సమోసాల వ్యాపారం అంతకంతకూ పెరగసాగింది. చిన్న బండి కాస్తా ఓ దుకాణంగా మారింది. తనకు సాయంగా ఉండేందుకు మరో మనిషి ఉంటే బాగుండు అనిపించింది వ్యాపారికి. మరో పెద్ద దుకాణం కూడా తీసుకోవాలని తోచింది. తన ఆలోచనలన్నింటినీ కొడుకుతో పంచుకున్నాడు వ్యాపారి. వ్యాపారి మాటలు వింటూనే కొడుకు ఉద్రేకపడిపోయాడు...    ‘అసలు ప్రపంచం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో నీకు తెలుసా! స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ముడిచమురు ధర కూడా పడిపోయింది. అమెరికాని నాశనం చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో అదనంగా పెట్టుబడి పెట్టడం అవివేకం. ఉన్న వ్యాపారంలోనే ఇంకా ఎక్కువ మిగుల్చుకోవడం ఎలాగా అని ఆలోచించు’ అని ఉపదేశం చేశాడు కొడుకు.   కొడుకు చెప్పిన మాటలు విన్న వ్యాపారి మనసులో భయం మొదలైంది. తన కొడుకు చదువకున్నవాడు, తెలివైనవాడు, అన్నీ తెలిసినవాడు.... అతను చేసిన సూచన నిజమే కాబోసని అనిపించింది. అంతే విస్తరణ సంగతి పక్కన పెట్టి, ఉన్న వ్యాపారంలో మరింత లాభం ఎలా సంపాదించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నాసిరకం ఉల్లిపాయలతో సమోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటే నూనెని పదే పదే వాడసాగాడు. సమోసాని కూరతో కాకుండా కారంతో నింపేశాడు. రేటు కూడా అమాంతంగా పెంచేశాడు.   వ్యాపారి ధోరణి మారిన కొద్దీ జనం కూడా పల్చబడసాగారు. సమోసాలు మిగిలిపోతున్నాయి. వాటిని మర్నాడు అమ్మే ప్రయత్నాలు కూడా మొదలవడంతో జనం అటువైపుగా రావడమే మానేశారు. చూస్తూచూస్తుండగా వ్యాపారం కాస్తా దివాళా తీసింది. ఈలోగా కొడుకు మళ్లీ పట్నం నుంచి వచ్చాడు. ‘నిజమేరా కొడకా! నువ్వు చెప్పినట్లు దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. సమోసాలు కొనడానికి కూడా జనం దగ్గర డబ్బు లేదు. దాంతో నా వ్యాపారం కూడా దివాళా తీసింది!’ అంటూ నిట్టూర్చాడు తండ్రి!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)      - నిర్జర.

జీవితాన్ని మార్చేసే - Pareto principle

జీవితంలో అందరికీ అన్నీ ఉండవు. అన్ని చోట్లా ఒకే తరహా ఫలితాలు రావు. ఈ విషయాలు మనకి తెలిసినవే! కానీ ఇలా వేర్వేరు ఫలితాల వెనక ఏదన్నా లెక్క ఉందా అన్న ఆలోచన కలిగింది ‘పేరెటో’ (pareto) అనే ఇటాలియన్‌ ఆర్థికవేత్తకి. మన జీవితంలో కనిపించే 80 శాతం ఫలితాలకు 20 శాతం కారణాలే ఉంటాయని ఆయన ఓ సూత్రం రూపొందించాడు. ఆ తర్వాత కాలంలో ఆయన పేరు మీదగానే ఈ సూత్రం pareto principle పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ సూత్రాన్ని కాస్త జాగ్రత్తగా పాటిస్తే మన జీవితాలే మారిపోతాయని ఓ నమ్మకం.   Pareto principleకి 80:20 rule అన్న పేరు కూడా ఉంది. ఏ రంగంలో చూసినా ఈ సూత్రం పనిచేస్తూ ఉంటుందని అంటారు. ఉదాహరణకు సంపదనే తీసుకోండి! మన సమాజంలో ఉండే సంపదలో 80 శాతం సంపద 20 శాతం మంది దగ్గరే కనిపిస్తుంది. సాఫ్టవేర్‌ రంగంలో 20 శాతం తప్పుల వల్లే 80 శాతం సమస్యలు తలెత్తుతాయని తేలింది. ఆఖరికి మన చుట్టూ జరిగే 80 శాతం నేరాలకి కారణం 20 శాతం మంది నేరస్తులే అని కూడా వెల్లడయ్యింది.   ఈ 80:20 సిద్ధాంతాన్ని పరిశ్రమలకి కూడా అన్వయించవచ్చు. ఆఫీసుల్లో వచ్చే 80 శాతం ఫలితాలకి అందులో పనిచేసే 20 శాతం మందే కారణం అవుతుంటారట. ఆ 20 శాతం మందినీ గుర్తించి ప్రోత్సహించడం, మిగతా కార్మికులని మరింత జాగ్రత్తగా నియంత్రించడం చేస్తే... మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నది నిపుణులు సూచిస్తున్నారు.   ఈ pareto principleని తొలిసారిగా ఎప్పుడో 1896లో ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. కంప్యూటర్లు వచ్చాయి, ప్రపంచీకరణ జరిగింది. అయినా ప్రతి కొత్త రంగంలోనూ ఈ సిద్ధాంతం పనిచేయడం ఆశ్చర్యకరమే! అందుకే ఓ అడుగు ముందుకు వేసి అసలు ప్రకృతిలోనే ఈ సూత్రం ఇమిడి ఉందని అంటున్నారు. మన కంటి ముందు కనిపించే 80% పంటలకు కారణం, 20% విత్తనాలే అన్న వాదనా ఉంది.   ఇంత ప్రత్యేకమైన ఈ 80:20 సిద్ధాంతం మన నిజజీవితంలో కూడా ఉపయోగపడుతుందన్నది ఓ వాదన. ఉదయాన్న లేచిన వెంటనే మనం ఆలోచించే తీరు మిగతా రోజునంతా ప్రభావితం చేస్తుందట. ఏదన్నా పనిచేసే ముందు, ఆ పని ఎలా పూర్తిచేయాలా అని కాసేపు ప్రణాళిక వేసుకోవడం వల్ల 80 శాతం పని సులువుగా సాగిపోతుందట. ఏదన్నా నిర్ణయం తీసుకునేముందు అసలు మన ముందు ఉన్న ఎంపికలు (choices/ directions) ఏమిటి అని కాసేపు ఆలోచిస్తే... 80 శాతం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందట. అంటే ఓ 20 శాతం పరిస్థితులను మనం జాగ్రత్తగా అదుపుచేయగలిగితే, 80 శాతం ఫలితాలు దక్కితీరతాయన్నమాట. ఇదేదో బాగానే ఉంది కదా!   - నిర్జర.

డయాబెటిస్‌ రావాలా వద్దా... మన చేతుల్లోనే!

  ఒకప్పుడు షుగర్‌ అంటే బాగా డబ్బున్నవాళ్లకి వచ్చే జబ్బనుకునేవారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతూ కనిపిస్తున్నారు. వంశపారంపర్యంగా షుగర్ ఉంటే, ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే! ఎలాంటి శారీరిక శ్రమా లేని జీవనశైలి కూడా ఈ వ్యాధి త్వరగా వచ్చేందుకు ప్రేరేపిస్తుందని తెలిసిందే! కానీ మనకి డయాబెటిస్ రావాలా వద్దా అని నిర్ణయించడంలో మన ఆహారానిదే ముఖ్య పాత్ర అని సరికొత్త పరిశోధనలు నిరూపిస్తున్నాయి.   స్వీడన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఆహారపు అలవాట్లకీ, డయాబెటిస్‌కీ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం గోధెన్‌బర్గ్‌ అనే పట్నంలోని 600 మందికి పైగా ఆడవారిని ఎంచుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల వ్యవధిలో, మూడు దఫాలుగా వీరందరి ఆహారపు అలవాట్లనీ గమనించారు.   సాధారణంగా ఒకరి వ్యక్తిగత ఆహారపు అలవాట్లని నిశితంగా నమోదు చేయడం కష్టమవుతుంది. అందుకని పరిశోధకులు, అభ్యర్థుల రక్తనమూనాలని సేకరించారు. ఈ రక్తనమూనాలలో ఉండే పోషకాలని గమనించడం ద్వారా, వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ఒకొక్కరి నుంచి సేకరించిన నమూనా, వారి ఆహారాన్ని సూచించే వేలిముద్రలా (metabolic fingerprint) పనిచేస్తుందన్నమాట.   చేపలు, వంటనూనెలు, తృణధాన్యాలు, విటమిన్‌ ఈ కలిగిన పదార్థాలు ఎక్కువగా తినేవారిలో డయాబెటిస్ చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. అదే మాంసం, కొవ్వు పదార్థాలు తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం మెండుగా ఉన్నట్లు గ్రహించారు. అంటే మనం తినే ఆహారమే, భవిష్యత్తులో మనకి డయాబెటిస్ వస్తుందా రాదా అన్న విషయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నమాట.   ప్రపంచం మొత్తం మీదా డయాబెటిస్‌ ఎక్కువగా ఉండే దేశాలలో మనది రెండో స్థానం. మరో రెండు దశాబ్దాలలో మనదే మొదటి స్థానం అన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఆరుకోట్ల మందికి పైగా జనాభా డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. సాధారణంగా 40 ఏళ్ల వచ్చేసరకి డయాబెటిస్‌ లక్షణాలు కనిపించడం మొదలుపెడతాయట. కాబట్టి చిన్నవయసు నుంచే పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లని నేర్పిస్తే... భవిష్యత్తులో వారు డయాబెటిస్‌కు వీలైనంత దూరంగా ఉంటారు. పైన పేర్కొన్న పరిశోధనే ఇందుకు సాక్ష్యం. - నిర్జర.  

ఈ ఏడు చిట్కాలు పాటిస్తే... నూరేళ్లు బతికేయచ్చు!

  నిండు నూరేళ్లు బతకాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ అలా బతికితే సరిపోదు! వృద్ధాప్యంలో కూడా మెదడు చక్కగా పనిచేయాలి. ఎంతటి కష్టాన్నయినా తట్టుకునేంత గుండెబలం ఉండాలి. చాలామందికి వయసు గడిచేకొద్దీ ఈ రెండు అవయవాలే బలహీనపడిపోతుంటాయి. ఎన్నాళ్లు బతికి ఏం లాభం అన్నట్లుగా కాలాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. మరి ఇందుకు ఉపాయం లేదా అంటే లేకేం!   అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు బలమైన గుండె, మెదడు ఉండటానికి ఎలాంటి జీవనశైలి ఉండాలో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ ఈ దిశగా వచ్చిన 182 పరిశోధనల ఫలితాలను క్రోడీకరించి చూశారు. వాటిని గమనించిన తర్వాత అసలు గుండె, మెదడు ఎందుకు దెబ్బతింటాయో ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని అధిగమించే చిట్కాలూ కనిపించాయి.   మన రక్తనాళాలు నిదానంగా కుంచించుకుపోవడమే గుండె, మదడులు దెబ్బతినేందుకు ప్రధాన కారణం అని తేలింది. ఇలా రక్తనాళాలు కుదించుకుపోవడం వల్ల రక్తసరఫరా తగ్గిపోవడమే కాకుండా, కొవ్వులాంటి పదార్థాలు కూడా అక్కడ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది క్రమేపీ పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో ఈ పరిస్థితిని atherosclerosis అంటారు.   Atherosclerosis ఒక వ్యాధి కావచ్చు. కానీ చాలా సందర్భాలలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతాయి. సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం, మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం, పొగాకు వంటి వ్యసనాలు... అన్నీ కూడా రక్తనాళాలలు కుదించుకుపోయేలా చేస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి రోగాలకు కూడా కారణం అవుతాయి.   ఇంతకీ ఈ పరిస్థితిని దాటేందుకు పరిశోధకులు చెబుతున్న ఏడు చిట్కాలు ఇవే....... - రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం. - ఒంట్లో కొలెస్ట్రాల్ మోతాదు మించకుండా చూసుకోవడం. - షుగర్‌ని నియంత్రించుకోవడం. - శారీరక శ్రమ చేయడం. - పౌష్టికాహారాన్ని తీసుకోవడం. - బరువుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం. - పొగాకు జోలికి పోకుండా ఉండటం. వినేందుకు ఈ పద్ధతులన్నీ కాస్త కఠినంగానే ఉండవచ్చు. కానీ అనారోగ్యంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకునేకంటే ఇది చాలా సులభం అంటున్నారు. లేకపోతే మున్ముందు కోట్లమంది డిమెన్షియాలాంటి సమస్యలని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.  

యువతని వెర్రెత్తిస్తున్న ‘జిమిక్కి కమ్మల్‌’ పాట!

  ఓ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘వై దిస్‌ కొలవరి డీ’ పాటను ఎవరు మర్చిపోగలరు. అప్పట్లో ఏ సందులో చూసినా ఈ పాటే వినిపించేది. ప్రతి వేదిక మీదా ఈ పాటకి అడుగులు వేసేవారు. అలా ఓ ఏడాదిపాటు ఈ పాటని పీల్చి పిప్పి చేసి వదిలిపెట్టాం. దేశాన్ని అంతగా వెర్రెత్తించిన పాట మళ్లీ రావడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ వచ్చేసింది. అదే జిమిక్కి కమ్మల్‌!   ఆగస్టు నెలాఖరున మలయాళంలో ‘వెలిపండితె పుస్తకం’ అనే సినిమా వచ్చింది. ఇందులో మోహన్‌లాల్ హీరో! ఆయనది కాలేజి కుర్రకారుని అదుపు చేసే లెక్చరర్‌ పాత్ర. నిజానికి ఈ సినిమా ఏమంత గొప్పగా లేదంటూ విమర్శకులు పెదవి విరిచారు. మోహన్‌లాల్‌లోని నటుడిని ఇందులో ఉపయోగించుకోలేకపోయారంటూ దెప్పిపొడిచారు.     మొత్తానికి వెలిపండితె పుస్తకం ఓ మాదిరి విజయాన్ని మాత్రమే సాధిస్తుందనుకున్నారంతా! కానీ అందులోని ఓ పాట కారణంగా ఇప్పుడు సినిమా తెగ వసూళ్లు సాధిస్తోంది. సినిమాలోని ఓ సందర్భంలో కుర్రకారు ‘జిమిక్కి కమ్మల్‌’ అనే సరదా పాటని పాడుకుంటారు. ‘మా అమ్మ కమ్మలు’ అని ఈ పాట అర్థం. పాటలో పెద్దగా సరుకు లేదు. కానీ పాట వెనుక వినిపించే బీట్‌కు చిత్రమైన ఆకర్షణ ఉందని తోచింది నిర్మాతలకు. అంతే! ‘జిమిక్కి కమ్మల్‌ ఛాలెంజ్’ పేరుతో ఒక పోటీని మొదలుపెట్టారు. ఆ పాట బీట్‌కు అనుగుణంగా ఎవరైనా నాట్యం చేయవచ్చంటూ ప్రచారం మొదలుపెట్టారు.   ‘జిమిక్కి కమ్మల్‌ ఛాలెంజ్’ నిజంగానే ఓ ట్రెండ్‌గా మారింది. అదే సమయంలో ఓనమ్‌ పండుగ కూడా రావడంతో కేరళలో జరిగే ప్రతి వేడుకలోనూ జిమిక్కి కమ్మల్‌కు నాట్యం చేయడం మొదలుపెట్టారు. అలా కొచ్చిలోని Indian School of Commerceలో జరిగిన ఓనం కార్యక్రమంలో కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. ఇహ అక్కడి నుంచి ఈ కథ మరో మలుపు తీసుకుంది.   Indian School of Commerceలో జరిగిన డాన్స్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగానే ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. పట్టుమని పది రోజులైనా గడవకముందే ఈ వీడియోని 90 లక్షల మంది చూశారు. ఆ వీడియోలో అందరికన్న హుషారుగా డాన్స్ చేస్తున్న ‘షెరిల్‌ కాదవన్’ అనే టీచరుకి ఫిదా అయిపోయారు. రాత్రికి రాత్రే షెరిల్‌కి లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. ఆమె పేరుతో వందలాది సోషల్‌ మీడియా అకౌంట్లు పుట్టుకు వచ్చాయి. సినిమాల్లో ఆఫర్లూ మొదలైపోయాయి. ఈ పాటతో తన జీవితమే మారిపోయిందనీ, తనకి భయం కలిగేంత పాపులారిటీ వచ్చేసిందని షెరిల్‌ వాపోతున్నారు.   మొత్తానికి జిమిక్కి కమ్మల్‌ పుణ్యమా అని మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి వార్తల్లో నిలిచింది. 2015లో  వచ్చిన ప్రేమమ్, గత ఏడాది వచ్చిన పులిమురుగన్‌ (మన్యం పులి) సినిమాల విజయంతో ఊపు మీదున్న మలయాళ పరిశ్రమకి మరో గౌరవం దక్కింది. ఒకవైపు ఈ పాటకు యువత నాట్యం చేస్తుంటే, మరోవైపు తమ అభిమాన నటులు ఈ పాటకి డాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలు వెలువడుతున్నాయి.   కొసమెరుపు: అమెరికాలో Jimmy Kimmel అనే టీవీ వ్యాఖ్యాత ఉన్నాడు. ఈ పాట చరణాలు ఆయన పేరుకి దగ్గరగా ఉండటంతో ఆయన ట్విట్టర్ పేజి కూడా సందడిగా మారిపోయిందట. విషయం తెలుసుకున్న Jimmy Kimmel తాను కూడా ఆ పాటని చూసి షెరిల్‌ అభినయానికి అభిమానిగా మారిపోయాడు.  - నిర్జర.  

ఇది తాగితే నిద్ర పట్టేస్తుంది!

  ఒత్తిడి. ఈ మాట గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పుకోనవసరం లేదు. ఇది మన జీవితాలలో ఉన్నదే! మారుతున్న జీవనశైలి పుణ్యమా అని అటు ఉద్యోగంలోనూ, ఇటు ఇంట్లోనూ కావల్సినంత ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడితో నిద్ర పట్టని మాటా నిజమే! అలాంటి నిద్రలేమి వల్ల డిప్రెషన్‌, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి సమస్యలు సరేసరి. పోనీ నిద్రమాత్రలు వేసుకుందామా అంటే... వాటికి ఉండే దుష్ప్రభావాలూ తక్కువేం కాదు. వెరసి ఇటు నిద్రా పట్టక, అటు ఆరోగ్యమూ చెడిపోయే పరిస్థితి. కానీ ఇందుకో చిట్కా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.   జపానుకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు.. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమిని దూరం చేసే పదార్థాల మీద ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం Octacosanol అనే రసాయనం ఏమేరకు ఉపయోగపడుతుందో చూశారు. ఈ Octacosanolను ఎలుకల మీద ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ రసాయనం ఎలుకలలోకి చేరగానే వాటిలోని ఒత్తిడి చాలావరకు తగ్గిపోయినట్లు తేలింది. మన రక్తంలోని ఒత్తిడని సూచించే corticosterone అనే పదార్థం చాలా అదుపులో కనిపించింది. Corticosterone అదుపులోకి రాగానే గాఢనిద్ర పడుతున్నట్లు తేలింది.   ఒకే ఒక్క రసాయనంతో మనలోని ఒత్తిడి తగ్గిపోతుందనీ, మంచి నిద్ర పడుతుందనీ తేలిపోయింది. కానీ దీన్ని వాడేదెలా! Octacosanol ఇప్పటికే మందుల రూపంలో దొరుకుతోంది. కొవ్వుని తగ్గించడానికీ, బలాన్ని పెంచడానికీ ఈ మందును వాడుతూ ఉంటారు. గోధుమలు, బియ్యపు పొట్టు నుంచి ఈ పొడిని తయారుచేస్తుంటారు.   మందుగా కాకుండా మనకి కనిపించే ఓ ఆహారపదార్థంలో కూడా ఈ Octacosanol పుష్కలంగా లభిస్తుందని చెబుతారు. అదే చెరుకురసం! తెల్లటి చెరుకుగడల నుంచి తీసిన రసంలో ఈ రసాయనం తగినంత మోతాదులో ఉంటుందట. కాబట్టి ఎప్పుడన్నా ఒత్తిడితో నిద్ర పట్టకపోతుంటే ఓ గ్లాసుడు చెరుకురసం తీసుకుంటే తప్పకుండా ఫలితం దక్కుతుందని సూచిస్తున్నారు. - నిర్జర.  

కుక్కలకీ ఉంది డెమోక్రసీ!

  మనిషి సంఘజీవి! నలుగురితో కలిసిమెలిసి బతకనిదే అతనేం సాధించలేడు. కానీ నలుగురూ కలిసి బతుకుతున్నప్పుడు... అందరి మాటకీ విలువ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రజాస్వామ్యం అనే విధానం అమల్లోకి వచ్చింది. ఎక్కువమంది ఏది అనుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడటమే ప్రజాస్వామ్యం. ఇప్పటిదాకా మనుషులకి మాత్రమే పరిమితం అయిన ఈ పద్ధతి, జంతువులలో కూడా ఉందని నిరూపిస్తోంది ఓ పరిశోధన. దక్షిణ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం బోత్స్వానా (Botswana). ఇక్కడి అడవుల్లో అరుదైన ఆఫ్రికన్‌ కుక్కలు నివసిస్తున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతిని గమనించేందుకు సిడ్నీ నుంచి కొందరు పరిశోధకులు బోత్స్వానాకు చేరుకున్నారు. అక్కడి వాటి తీరుతెన్నులని గమనిస్తున్న సదరు పరిశోధకులకు ఓ ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. అడవి కుక్కలు వేటకి బయల్దేరేటప్పుడు మాంఛి హడావుడి చేస్తాయి. వాటిలో ఒక బలమైన కుక్క సారథ్యం వహించగా, అన్నీ కలిసి ఓ గుంపుగా వేటకి బయల్దేరతాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ కుక్కలు బయల్దేరే ముందు ఓ నాలుగు తుమ్ములు తుమ్మి బయల్దేరడమే విచిత్రం. కుక్కలు ఎక్కువగా తమ వాసన మీదే వేటని పసిగడతాయన్న విషయం తెలిసిందే! అందుకే తమ ముక్కులని సరిచేసుకునేందుకా అన్నట్లు అవి తుమ్ముతాయి. కానీ సరిగ్గా వేటకి బయల్దేరేముందు అన్నీ ఇలా పనిగట్టుకుని తుమ్మడం వెనుక ఏదన్నా కారణం ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందుకోసం బోత్స్వానాలో ఐదు వేర్వేరు ప్రాంతాలలో నివసించే అడవి కుక్కల గుంపుల తీరుని గమనించడం మొదలుపెట్టారు. ఒకటి కాదు రెండు కాదు... 68 సందర్భాలలో అవి వేటకి బయల్దేరుతున్నప్పుడు, వాటి శబ్దాలని రికార్డు చేశారు. ఎక్కువ తుమ్ములు వినిపించినప్పుడు అవి వేటకి బయల్దేరాయనీ, తుమ్ములు తక్కువగా వినిపించినప్పుడు అవి వేటని విరమించుకున్నాయనీ తేలింది. అంటే తుమ్ముల ద్వారా అవి తమ ఓటుని ప్రకటిస్తున్నాయి! వేటకి వెళ్లడం తమకి ఇష్టం ఉందా లేదా అన్న అభిప్రయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నమాట! పైగా గుంపుకి నాయకత్వం వహించే కుక్క లేకపోతే, మరిన్ని తుమ్ములు అవసరం కావడాన్ని గమనించారు. ఈ పరిశోధన చాలా చిన్నదే! కానీ కలిసి జీవించేటప్పుడు ఎలా మెలగాలో... జంతువులకి కూడా ఓ అవగాహన ఉన్నట్లు బయటపడుతోంది. ఓ పక్క కుక్కలేమో ప్రజాస్వామ్యానికి అలవాటు పడుతున్నాయి. మరి మనుషులేమో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. బలవంతుడిదే రాజ్యం అనే జంతుధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరి నుంచి నేర్చుకోవాలి? - నిర్జర.  

ఇవి చేతిలో ఉంటే ఒత్తిడి తగ్గిపోతుంది!

  ‘అ... ఆ’ సినిమా గుర్తుందా! అందులో సమంత చేతిలో ఎప్పుడూ ఓ రబ్బరు బంతి ఉంటుంది. ఇంట్లో దొంగలు పడితే ఏ వస్తువైనా వదులుకుంటుంది కానీ, ఆ ‘స్ట్రెస్ బాల్‌’ని మాత్రం వదులుకోదు. ఇదొక్కటే కాదు.... మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈమధ్య కాలంలో చాలా వస్తువులే అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్ట్రెస్ బాల్‌ ఒకటి మాత్రమే. మన కండరాలలో పేరుకున్న ఒత్తిడిని స్ట్రెస బాల్‌ మీద చూపడం వల్ల ఇది ప్రభావం చూపుతుంది. మరి మిగతా వస్తువులు ఏమిటో, అవి ఎలా పని చేస్తాయో…   Fidget Spinner :- ఈమధ్యకాలంలో పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇది కనిపిస్తోంది. చిన్న ఫ్యాన్‌లాగా ఉండి, మధ్యలో బేరింగ్స్ ఉండే ఈ స్పిన్సర్‌ ఇప్పుడో ట్రెండ్‌. చాలామంది చేతులలో ఏదో ఒకటి కదిలించడం వల్ల రిలాక్స్ అవుతూ ఉంటారు. వేలికి ఉన్న ఉంగరం తిప్పుడూ ఉండటం, పెన్నుని వేళ్ల మధ్య ఆడించడం చేస్తూ ఉంటారు. దీన్నే ఫిడ్గెటింగ్‌ అంటారు. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ‘కెలకడం’ అనవచ్చు. Fidget Spinner సరిగ్గా ఇదే పని చేసి పెట్టి ఒత్తిడిని మాయం చేస్తుంది.   Fidget cube :- ఫిడ్గెట్‌ స్పిన్నర్‌ అంత కాకపోయినా, ఫిడ్గెట్‌ క్యూబ్‌ కూడా ఈమధ్యకాలంలో బాగానే ప్రచారంలోకి వచ్చింది. ఒక క్యూబ్‌కి ఆరు వైపులా ఉండే రకరకాల వస్తువులను నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గించేసుకోవచ్చునంటున్నారు. స్విచ్‌లు, బటన్లు, జాయ్‌స్టిక్... ఇలా ఎలక్ట్రానిక్‌ పరికరాల మీద ఉండే రకరకాల మీటలన్నీ ఈ క్యూబ్‌ మీద ఉంటాయి. దీంతో ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందన్న వాదనలూ ఉన్నాయి.   Worry beads :- మనసు ఎప్పుడూ పరిపరివిధాలా పోతూ ఉంటుంది. అందుకే దేవుడి మీద దృష్టి పెట్టాలంటే, ఇతరత్రా ఆలోచనలని అదుపు చేసేందుకు చేతిలో జపమాల ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. పెద్దల మాటల్ని కొట్టివేసే కుర్రకారు ఇప్పుడు ఇలాంటి మాలలనే చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. అవే వర్రీ బీడ్స్‌! చేతిలో అటూ ఇటూ ఆడిస్తూనో, వాటిని లెక్కపెట్టుకుంటూనో, పూసలు శబ్దం చేసేలా ఒకదానికి ఒకటి తాటిస్తూనో సమయం గడిపేస్తారు.   Worry stones :- చాలామంది మనసులో ఒత్తిడిన ఎదుర్కొనేందుకు గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇక పెదాలు కొరుక్కోవడం, జుట్టు పీక్కోవడం లాంటి అలవాట్లూ కనిపిస్తుంటాయి. వర్రీ స్టోన్స్ ఇలాంటి అలవాట్ల నుంచి ధ్యాస మళ్లిస్తుంది. అరచేతిలో ఒక రాయిని ఆడిస్తూ ఉండటం వల్ల, ఒత్తిడి తగ్గే అవకాశం ఇస్తుంది. ఇంతే కాదు! ఫోమ్‌తో చేసిన ఆటవస్తువులని బిగిసి పట్టుకోవడం, ప్యాకింగ్‌ కోసం వాడే బబుల్‌ రాప్స్‌ని చిదపడం... లాంటి బోలెడు చిట్కాలతో ఒత్తిడిని ఇట్టే తగ్గించేసుకోవచ్చు. మీరూ ఇందులో ఏదో ఒకదాన్ని ప్రయత్నించి చూడండి. - నిర్జర.  

తిండిపోతుల రహస్యం తెలిసిపోయింది!

కొంతమంది తాము ఎంతగా లావు అయిపోతున్నా సరే... ఆహారం మీద ఎలాంటి నియంత్రణా పాటించలేరు. చూసేవాళ్లకి వాళ్లలో ఏదో లోపం ఉందనిపించక మానదు. ‘నాలుకని ఆ మాత్రం అదుపు చేసుకోలేరా!’ అని ఈసడించడమూ వినిపిస్తుంది. నిజానికి పాపం ఇది వారి స్వభావంలోని లోపం కాదంటున్నారు నిపుణులు. మరి వారు చెప్పేది ఏమిటంటే…   సన్నగా ఉండేవారికీ, లావుగా ఉండేవారికీ మధ్య ఏదో జన్యుపరమైన తేడా ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని తేల్చేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఒక పరీక్షను చేపట్టారు. సర్జరీ ద్వారా పొట్ట తగ్గించుకున్నవారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. సర్జరీ చేయించుకున్నవారి పేగులలో ‘enteroendocrine cells’ అనే కణాలు గణనీయంగా పెరిగినట్లు గమనించారు.   మనం తినే ఆహారాన్ని నియంత్రించడంలో ఈ enteroendocrine cells చాలా ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఉదరంలోని పైభాగంలో ఉండే ఈ కణాలు పేగులలోకి ఎంత ఆహారం చేరుతోందో గమనిస్తూ ఉంటాయి. పేగులలోకి తగినంత ఆహారం ఉందని వీటికి సూచన అందగానే ‘ఇక తిన్నది చాలు’ అంటూ మెదడుకి ఓ సందేశాన్ని అందిస్తాయి. కొందరిలో ఈ కణాలు చాలా తక్కువగా ఉంటాయట. ఫలితం! ‘ఇక చాలు’ అన్న సూచన వారి మెదడుకి అందదు. దాంతో వారు అవసరానికి మించిన ఆహారాన్ని లాగించేస్తూ ఉంటారు. అలా అధికంగా పేరుకున్న ఆహారమంతా కొవ్వుగా మారి ఊబకాయానికి దారితీస్తుంది.   కొవ్వు తగ్గించుకునేందుకు చేయించుకునే బేరియాట్రిక్‌ సర్జరీ వంటి చికిత్సల తర్వాత ఈ enteroendocrine కణాలు పెరగాన్ని గమనించారు. దీంతో... అధికంగా తినడం అనేది మానసికమైన లోపం కాదనీ, అది ఓ శారీరిక రుగ్మత అనీ తేలిపోయింది. అయితే ఈ కణాలను పెంచుకోవడానికి శస్త్రచికిత్సే గతి అనుకోవడానికి లేదు. మున్ముందు మన తిండిని నియంత్రించే ఈ కణాలను కృత్రిమంగా ప్రవేశపెట్టే రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. అదే కనుక జరిగితే ఒక చిన్న ఇంజక్షన్‌ ద్వారా మన ఆకలిని హద్దులలో ఉంచుకోవచ్చునేమో!   పై పరిశోధన వెలువడిని సమయంలోనే ఫిన్లాండ్‌లోని కొందరు పరిశోధకులు మరో పరిశోధనను కూడా చేపట్టారు. ఏదన్నా ఆహారాన్ని ఆస్వాదించేటప్పుడు మన మెదడులోని endogenous opioid system అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ఈ పరిశోధన ఉద్దేశం. మనం కొన్ని రకాల పదార్థాలను తీసుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది.   అదే పదార్థాన్ని మళ్లీ మళ్లీ తీసుకోవాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది మనకు సంతోషాన్ని కలిగించినా... మద్యం, డ్రగ్స్‌లాంటి పదార్థాలకు బానిసగా మారడానికి కూడా ఈ వ్యవస్థే కారణం. అతిగా ఆహారం తీసుకునేవారిలో ఈ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు తేల్చారు. దాంతో ఎంత తిన్నా కూడా మనసుకి తృప్తి కలగదంట. దాంతో ఏదిపడితే అది, ఎంతపడితే అంత లాగించేసి ఊబకాయాన్ని కోరి తెచ్చుకుంటారని తేల్చారు. - నిర్జర.

తెలుగు నేర్చుకోకపోతే జీవితం వృథా!

  ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడితే పండితుడు అనుకునేవారు, అందుకని ప్రాంతీయభాషల వారు కూడా బలవంతంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. దేవభాష అయిన సంస్కృతం రానురాను క్షీణించిపోయింది. కానీ ఆ స్థానంలో ఆంగ్లేయుల పెత్తనం మొదలైంది. మొదట తమ వ్యాపార విస్తరణ కోసం స్థానిక భాషలని నేర్చుకునే ప్రయత్నం చేశారు ఆంగ్లేయులు. కానీ ఎప్పుడైతే వారి వ్యాపారం కాస్తా పెత్తనంగా మారిందో... తమ భాషనే స్థానికుల మీద రుద్దడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష నేర్చకుంటేనే మనుగడ సాధ్యం అన్న వాదన మొదలైపోయింది. ఆంగ్లం తప్పనిసరే! కాదని ఎవరూ అనడం లేదు. కానీ తొలి ప్రాధాన్యత ఎప్పుడూ మాతృభాషదే కావాలంటున్నారు నిపుణులు. అలా ఎందుకు? అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి. మన జన్యువులలోనే – తరతరాలుగా మనం ఒక భాషకి అలవాటు పడి ఉన్నాము. కాబట్టి మన మెదడు కూడా సదరు భాషకి అనుగుణంగానే ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే మాతృభాష అనేది మన మెదడులోని సహజసిద్ధమైన హార్డ్‌వేర్ అన్నమాట. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం అంటే... మన సహజమైన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడమే! తల్లి కడుపులోనే – భాష నేర్చుకోవడం తల్లి కడుపులోనే మొదలవుతుందని పరిశోధనలు తేల్చాయి. తల్లి నుంచి వినిపించే శబ్దాలు అతని మెదడులోని భాష నేర్చుకునే భాగాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. తల్లులు లాలిపాటలు పాడటం, కడుపులోని బిడ్డతో మాట్లాడటం వృధా కావనీ... ఆ బిడ్డలోని భాషా నైపుణ్యాన్ని పెంచుతాయని అంటున్నారు. అలా అలవోకగా నేర్చుకుంటున్న భాషని వదిలేసి మరో భాష కోసం ఎగబడం ఎంతవరకు సబబు! మాతృభాషలోనే నేర్చుకోగలం – ఏడాది దగ్గర నుంచి పిల్లలు, తమ మాతృభాషలో ఒకో పదాన్ని నేర్చుకుంటారు. ఆ భాషలోనే తమకి తెలియని విషయాలను నేర్చుకోవడం, తమ భావాలను వ్యక్తపరచడం చేస్తుంటారు. అది పక్కన పెట్టేసి ఆంగ్లంలో ఒకేసారి ఓనమాలతో పాటుగా పద్యాలని, వాక్యాలని నేర్చుకోవడం ఎంత కష్టం! ఇది వారి జ్ఞానం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒక స్థాయి వరకూ చదువుని మాతృభాషలో నేర్చుకుంటేనే ఉపయోగం అని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఏ భాష నేర్చుకోవాలన్నా – పునాది సరిగా లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా ఉపయోగం ఏముంది? మాతృభాష మీద పట్టు సాధించకుండా ఇతర భాషలు నేర్చుకోవడమూ ఇంతే! ముందు మాతృభాష మీద ఒక అవగాహన వచ్చినవాడే ఇతర భాషలను సులువుగా నేర్చుకోగలడనీ, అందులో పరిపూర్ణతను సాధించగలడనీ పరిశోధనలన్నీ ఏకరవు పెడుతున్నాయి. ఎంత సాధించి ఏం ఉపయోగం – మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అతనికంటూ ఒక సంస్కృతిక నేపథ్యం ఉంటుంది. కానీ మాతృభాష నుంచి దూరమైనవాడు ఒంటరిగా మారిపోతాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం అతనికి తోచదు. ఆ ఒంటరితనం తెలియకుండా అతన్ని క్రుంగదీస్తుంది. అందుకే భాషని దూరమైన ఆదిమజాతివారు త్వరగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న పరిశోధన ప్రపంచాన్ని కుదిపేసింది. జ్ఞానానికి దూరం – భాష అంటే తరతరాల జ్ఞానసంపద. భాషకి దూరమైతే ఆ జ్ఞానానికి కూడా దూరమైపోతాం. ఉదాహరణకు మన చుట్టూ ఉండే మొక్కలనే తీసుకోండి. బీపీని తగ్గించే సర్పగంధి, షుగర్‌ని తగ్గించే నేలవేము గురించి ప్రాంతీయ భాషలలో ఉన్నంత తేలికపాటి సమాచారం ఆంగ్లంలో ఉండదు. అంతదాకా ఎందుకు! వినాయక చవితి రోజున పూజించే ఏకవింశతి పత్రాల గురించి మనం అప్పుడే మర్చిపోయాం. అవన్నీ మన గృహవైద్యంలో భాగమే కదా! ఇలా లాలిపాటల దగ్గర నుంచి సామెతల వరకు మాతృభాషలో అద్భుతమైన విజ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నాం. చివరగా ఒక్క మాట. మనకి కోపం వస్తే ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెడతాం. బాధ కలిగితే అమ్మా అంటూ మనసుకి సర్దిచెప్పుకొంటాం. మన మనసుకి దగ్గరగా ఉన్న మాతృభాష కావాలా, మన అహంకారాన్ని పెంచి పోషించే ఇతర భాషలు కావాలా! తేల్చుకోవాల్సిందే మనమే! - నిర్జర.

సంతోషానికి చిట్కా!

  చాలా రోజుల క్రితం ఓ భార్యాభర్తా ఉండేవారు. వాళ్లిద్దరూ ఉన్నంతలో చాలా సంతోషంగానే ఉండేవారు. కానీ ఆ సంతోషం ఎంత కాలం నిలుస్తుందో అని వాళ్లకి తెగ అనుమానంగా ఉండేది. ఈలోగా వాళ్లుండే ఊరికి ఒక సన్యాసి వచ్చాడని తెలిసింది. ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉంటాయని ప్రచారం జరిగింది. దాంతో తమ సమస్యను ఆ సన్యాసికే విన్నవించుకోవాలని దంపతులిరువురూ బయల్దేరారు. దంపతుల సమస్య విన్న సన్యాసి పెద్దగా ఆశ్చర్యపడలేదు. పైగా ‘‘నా దగ్గరికి అంతా డబ్బు కోసమో, కీర్తి కోసమో వస్తుంటారు. మీరు ఇలా సంతోషాన్ని కోరుతూ రావడం మంచిదే! అయితే ఇదేమంత తేలికగా నెరవేరే కోరిక కాదు. ఈ ప్రపంచంలో ఎవరైతే సంతోషంగా ఉంటారని మీకు అనిపించిందో వారి దగ్గరకు మీరు వెళ్లండి. ఆ వ్యక్తి వేసుకున్న చొక్కాలో ఒక ముక్క చించి మీ చేతికి చుట్టుకోండి. దాంతో మీరు చిరకాలం సంతోషంగా జీవిస్తారు,’’ అని చెప్పుకొచ్చాడు. సన్యాసి మాటలు విన్న దంపతులు ‘ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవారు ఎవరా!’ అని వెతుక్కుంటూ బయల్దేరారు. అలా వారు ఒకో ప్రాంతం దాటుకుంటూ ‘దగ్గరలో ఎవరన్నా సంతోషంగా ఉన్నారా!’ అని వాకబు చేసుకుంటూ ఊరూరా తిరగసాగారు. ఒక చోటకి వెళ్లేసరికి ‘ఫలానా జమీందారు దంపతులు చాలా సంతోషంగా ఉంటారని’ అందరూ చెప్పుకోవడం వినిపించింది. వెంటనే దంపతులు ఆ జమీందారు వద్దకు వెళ్లారు. వాళ్ల మాటలు విన్న జమీందారుగారి భార్య ‘‘మేం నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే... కాకపోతే ఓ చిన్న లోటు. మాకు పిల్లలు లేరు. ఆ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లలా మా మనసులు నిరాశలో మునిగిపోతాయి,’’ అంటూ ఒకింత బాధగా చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్న భార్యాభర్తలు ఉస్సూరుమంటూ తమ యాత్రని కొనసాగించారు. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారికి ‘ఫలానా చోట ఉండే ఓ రైతు చాలా సంతోషంగా ఉంటాడని’ తెలిసింది. వెంటనే ఆ రైతు ఇంట్లోకి ప్రవేశించారు. వారి మాటలు విన్న రైతు ‘నిజంగానే మేం చాలా సంతోషంగా ఉంటాము. కాకపోతే ఒకటే సమస్య. మాకు గంపెడు సంతానం. వారందరినీ సంభాళించలేక ఒకోసారి జీవితం అంటే విరక్తి కలుగుతుంది,’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ రైతు. రైతు మాటలు విన్న దంపతులు మరోసారి నిరాశపడ్డారు. ఇక ‘సంతోషంగా ఉండే మనిషిని కనుక్కోవడం అసాధ్యం!’ అనుకొని తిరుగుముఖం పట్టారు. దారిలో వారికి ఒక గొర్రెల కాపరి కనిపించాడు. మైదానంలో గొర్రెలని మేపుకుంటూ, పాటలు పాడుకుంటూ గంతులు వేస్తున్న అతన్ని చూసి దంపతులకి అతను చాలా సంతోషమైన మనిషని తోచింది. వెంటనే అతని దగ్గరకు వెళ్లి- ‘నువ్వు చాలా సంతోషంగా ఉంటావా!’ అని అడిగారు. ‘ఓ! నాకు దుఃఖం అనేదే లేదు. జీవితంలో ఏది లభించినా అది భగవంతుని అనుగ్రహంగా భావించి తృప్తి పడుతూ ఉంటాను. జీవనం ముందుకు సాగేందుకు నా వంతు ప్రయత్నంలో ఎప్పుడూ లోటు రానివ్వను. నాకు అవసరం లేనిదాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోను. పక్కవాడిని చూసి నా జీవితం కూడా అలా ఉండాలని పోల్చుకోను,’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘మంచిది. మరేమనుకోకుండా నీ చొక్కాలోంచి ఒక ముక్క చించి నాకు ఇవ్వగలవా!’ అని అడిగరు దంపతులు. ఆ మాటలకి గొర్రెలకాపరి నవ్వుతూ ‘నాకు అసలు చొక్కానే లేదు కదా! ఉన్నదల్లా ఓ కంబళి ఒకటే. దాన్ని చించేస్తే ఇక నాకు ఎండావానల నుంచి రక్షణ ఏది,’ అంటూ నవ్వుతూ తన దారిన తను వెళ్లిపోయాడు. గొర్రెలకాపరి మాటలను మననం చేసుకుంటూ దంపతులు తమ గ్రామాన్ని చేరుకున్నారు. ఊళ్లోకి అడుగుపెడుతూనే వారు తమ సన్యాసి దగ్గరకు చేరుకుని జరిగిన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చారు. ‘నిత్యం సంతోషంగా ఉండే మనిషిని మేం కనుగొన్నాం. కాకపోతే మీరు సూచించినట్లుగా ఆయన చొక్కాలోంచి ఒక ముక్కని తీసుకుని రాలేకపోయాం,’’ అంటూ నిరాశగా చెప్పారు. ‘‘మీరు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారని నేను ముందుగానే ఊహించాను. తొడుక్కోవడానికి ఒక చొక్కా కూడా లేనివాడు సైతం సంతోషంగా ఉండగలడు అని నిరూపించడానికే మీకు ఆ లక్ష్యం ఏర్పరిచాను. మీరు నిత్యం మీ చెంత ఉంచుకోవాల్సింది అతని చొక్కా ముక్క కాదు. అతను చెప్పిన మాటలు. అవే మీకు సంతోషానికి మార్గంగా నిలుస్తాయి,’’ అని హితవు పలికాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

ఫోన్ మార్చేసే జబ్బు - COMPARISION NEGLECT

  మీ ఫోను అద్భుతంగా పనిచేస్తోంది. కానీ అదే సమయానికి ఓ కొత్త మోడల్‌ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అంతే! ఠక్కున ఆ ఫోన్ పక్కన పడేసి upgraded version తీసుకునేందుకు బయల్దేరిపోయారా? అయితే మీరు ఖచ్చితంగా comparision neglect అనే సమస్యతో బాధపడుతున్నట్లే! ఇంతకీ ఆ సమస్య ఏమిటి? అది మన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? చాలా కంపెనీలు చూడండి! ఒక ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిందో లేదో... మళ్లీ కొన్నాళ్లకి ఓ చిన్న మార్పు చేసి మరో మోడల్‌ని విడుదల చేసేస్తాయి. యాపిల్‌ ఐఫోనునే తీసుకోండి- 5,6,7... ఇలా ఒకదాని తర్వాత ఒకటి upgraded versions పేరుతో వచ్చిపడుతూనే ఉన్నాయి. అవి వచ్చిన వెంటనే జనం వాటిని తలకెత్తుకూనే ఉంటున్నారు. ఈ స్వభావం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా 18 నుంచి 78 ఏళ్ల లోపు వయసు ఉన్న ఓ వెయ్యిమందిని ఎన్నుకొన్నారు. వీరి దగ్గర ఏ ఫోన్ ఉందో తెలుసుకున్నారు. ఆ ఫోన్‌ తర్వాత వచ్చిన upgraded versionని కూడా చూపించారు. ఆ రెండు ఫోన్లలోనూ ఉన్న ఫీచర్లనీ వివరించారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే.... UPGRADED అన్నమాట కనిపించగానే మిగతా ఫీచర్లన్నింటినీ పక్కన పెట్టేసి కొత్త ఫోనుకే ఓటు వేసేశారట. దాదాపు 78 శాతం మంది UPGRADED అనే మాట తమ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని చెప్పారు. మిగతా ఫీచర్లని కూడా ఓసారి పరిశీలించి చూడమని ఒత్తిడి చేసిన తర్వాత కానీ వారు మరోసారి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. అంటే UPGRADED అన్నమాట తెలియకుండానే మన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేస్తుందన్నమాట. అప్‌గ్రేడెడ్‌ అంటే అందులో ఇంకా అత్యాధునిక ఫీచర్లు, శక్తిమంతమైన పరికరాలు ఉంటాయన్న అభిప్రాయం కలగడం సహజమే! కానీ సరిగ్గా ఇదే బలహీనతని కంపెనీలు క్యాష్‌ చేసుకుంటాయని అంటున్నారు నిపుణులు. కేవలం మొబైల్ ఫోన్లే కాదు... మార్కెట్‌లో ఏ వస్తువుని చూసినా new pack, developed, latest version, updated... లాంటి తోకలు ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి మాటలు చూడగానే జనం కళ్లుమూసుకుని వాటిని బుట్టలో వేసుకుంటారు. ఇకమీదట ఇలాంటి మాటలు మీ నిర్ణయాన్ని ప్రభావితం కాకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.

ఇవి తింటే పీడకలలు ఖాయం!

  మనిషికి ఏమున్నా లేకపోయినా ఫర్వాలేదు కానీ ఆహారం, నిద్రా లేకపోతే మాత్రం బతకడం కష్టమే. అందుకే ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటారు పెద్దలు. నిజమే! హాయిగా పడుకోవాలనీ, ఆ నిద్రలో ఎలాంటి పీడకలలూ రాకుండా ఉండాలని ఎవరికి మాత్రం తోచదు. కానీ కొన్ని రకాల ఆహారపదార్థాలను తింటే మాత్రం పీడకలలు వస్తాయని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో…   మద్యం:- చాలామంది మందు కొడితే హాయిగా నిద్రపట్టేస్తుంది అనుకుంటారు. కానీ మద్యం వల్ల నిద్ర పట్టదు సరికదా! పట్టినా కూడా పీడకలలు ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు REM (rapid eye movement) అనే దశ ఉంటుంది. ఈ దశలోనే మనం కలలను కంటాము. మోతాదు మించిన మద్యం ఈ దశని చెడగొడుతుందట. ఫలితంగా పీడకలలు తప్పవంటున్నారు.   చాక్లెట్‌:- పడుకునే ముందు హాయిగా ఓ చాక్లెట్‌ని ఆస్వాదించి పడుకుందామని చాలామంది అనుకుంటారు. కానీ చాక్లెట్‌లో కెఫిన్‌ అనే పదార్థం చాలా అధికంగా ఉంటుందనీ... ఆ కెఫిన్ మన నిద్రను పాడుచేస్తుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఆ మాటకి వస్తే చాక్లెట్‌ మాత్రమే కాదు- కెఫిన్‌ అధికంగా ఉండే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ లాంటి పదార్థాలన్నీ కూడా పీడకలలకు దారితీస్తాయి.   మషాళాలు:- ఈ రోజుల్లో చాలామంది మంచిగా పార్టీ చేసుకుని ఓ బిర్యానీ పొట్లాన్నీ పొట్టన వేసుకుని పడుకుంటున్నారు. బిర్యానీనే కాదు వేపుళ్లు, మషాళాలు, బేకరీ పదార్థాలు లాంటివాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మన జీర్ణవ్యవస్థకీ నిద్రకీ చాలా దగ్గర సంబంధం ఉంది. కష్టమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరం ఇబ్బందిపడుతుంటే, మెదడు సుఖంగా ఎలా ఉంటుంది. దాని మానాన అది పీడకలలు కంటుంది కదా!   ఐస్‌క్రీం:- రోజంతా పడ్డ శ్రమకి ప్రతిఫలంగా ఓ కప్పుడు ఐస్‌క్రీంని ఆస్వాదిద్దాం అనుకుంటాం. కానీ చల్లగా కనిపించే ఐస్‌క్రీం మన బుర్రని వేడెక్కించేయగలదు. అందుకు కారణాలు లేకపోలేవు. ఐస్‌క్రీంని పాలతో తయారుచేస్తారు. వయసు పెరిగేకొద్దీ మనలో ఈ పాలపదార్థాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. పైగా ఐస్‌క్రీంలో తీపి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనలోని మెటబాలిజం (జీవక్రియలు) మీద ప్రభావం చూపుతుంది. ఇక చల్లటి ఐస్‌క్రీంని ఒంటికి తగినట్లు వేడిగా మార్చుకునేందుకు కూడా శరీరం ఇబ్బంది పడుతుంది. వీటన్నింటి ఫలితం – పీడకలలే! అదండీ సంగతి! కమ్మటి కలలు కనే నిద్ర పట్టాలంటే మనం పడుకునే ముందు ఏ ఆహారం తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే. ఆ ఆహారం కూడా నిద్రపోయేందుకు ఓ రెండు గంటల ముందరే తినేయాలని సూచిస్తున్నారు! - నిర్జర.  

పగటి కలల్లో మునిగి తేలండోయ్

  ఓ చిన్న కథ గుర్తుందా మీకు? ఒకడు బుట్టనిండా గాజు సామాను పెట్టుకుని అమ్మటానికి పట్టణానికి వెళుతూ, దారిలో చెట్టు నీడలో కాసేపు కూర్చుంటాడు. ఆ కాసేపటిలో తాను బుట్టలోని సామాను అంతా అమ్మేసినట్టు, దాని నుంచి వచ్చిన డబ్బుతో మళ్ళీ సామాను కొన్నట్టు, అలా అలా వ్యాపారం పెరిగి పెద్ద ఇల్లు, సేవకులు, మంది మార్బలం, పెళ్ళాంపిల్లలు... అలా ఊహించుకుంటూ, ఆ ఊహలో సేవకుడు ఏదో పని చెబితే చేయలేదని కాలితో ఓ తన్ను తంతాడు. ఊహల్లోని సేవకుడికి ఇతని కాలిదెబ్బ తగిలిందో లేదోగానీ, వాస్తవంలో కాలి దగ్గర వున్న గాజు సామాను కాస్తా నేలపాలై విరిగిపోతాయి. ఇలా గాల్లో మేడలు కడితే వచ్చేదేం లేదు కానీ, ఉన్నది కూడా పోతుందని పెద్దలు నీతి చెబుతారు. అయితే అదే పనిగా గాల్లో మేడలు కడుతూ, పగటి కలలు కంటూ వుంటే ఏమోగానీ, అప్పుడప్పుడు మాత్రం పగటి కలలు మంచివే అంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ బూత్రా.   సోమరితనం కాదు...   ఎవరైనా తమ స్థాయికి మించి ఏదో సాధిస్తామని చెప్పినప్పుడు పగటి కలలు కంటున్నావా? అంటూ వెక్కిరిస్తాం. ఆ తీరుని సోమరితనమని, కాలం వృధా చేయటమని అనుకుంటాం. కానీ, అవి మంచివే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. వ్యక్తులు తాము సాధించాలని అనుకుంటున్న కోరికలని, ఆశలని, తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటితోనే నిండిపోయే పగటి కలలు కనడం ప్రారంభిస్తారు అంటున్నారు వీరు. మేలుకొని వుండగానే తమకిష్టమైన వాటిని అద్భుతంగా ఊహించుకోవడమే పగటికట అంటూ విశ్లేషిస్తున్నారు కూడా. సాధారణంగా అవి సంతోషకరమైన సందర్భాలు, ఆశలు, ఆశయాలే అయి వుంటాయి.   ఆరోగ్యకరం కూడా...   పగటి కలలు మంచివి మాత్రమే కావు.. ఒకోసారి అవి ఆరోగ్యకరమని కూడా చెబుతున్నారు క్లినికల్ సైకాలజిస్టులు. ముఖ్యంగా సంగీతం, నవలా రచన, దర్శకత్వం వంటి సృజనాత్మక వృత్తుల్లో రాణించడానికి ఈ పగటి కలలు ఎంతో ఉపయోగపడతాయని కూడా చెబుతున్నారు. సృజనాత్మకకి ఊహాశక్తి అవసరం కదా! ఆ ఊహల్లోంచి అద్భుత సృష్టి జరుగుతుంది. కాబట్టే చాలామంది గొప్పగొప్ప కవులు, రచయితలు వాస్తవ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఎప్పుడూ ఊహాలోకాల్లో వుంటారంటూ చెబుతున్నారు వీరు. ఇంకా ఈ పగటి కలలు కనని వాళ్ళకి వాటిలో మునిగి తేలండంటూ సలహా కూడా ఇస్తున్నారు.   పగటి కలలకీ హద్దుంది...   నిరాశ ఆవరించినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు, కోపం అతలాకుతలం చేస్తున్నప్పుడు.... వెంటనే ఇష్టమైన విషయం కోసం లేదా రేపటి భవిష్యత్తు కోసం, ఉద్యోగం కోసం, పిల్లల కోసం... ఇలా ఎవరికి నచ్చిన ఊహల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలిట. కాసేపు... అంటే ఓ పది, పదిహేను నిమిషాలసేపు ఆ పగటి కలల్లో విహరిస్తే చాలు అప్పటి వరకు వున్న బాధ, నిరాశ పోయి వాటి స్థానంలో సంతోషం వచ్చి చేరుతుందిట. అదెలా సాధ్యం? అంటూ సందేహం వద్దు. ఎన్నో అధ్యయనాలు చేసి మరీ చెబుతున్నారు ఈ నిపుణులు. నమ్మకం కలగాలంటే మీరూ పగటి కలల్లోకి వెళ్ళి రావాల్సిందే. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పగటి కలలు అనేవి వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా వుండాలి. అంతేకానీ, ఆ కలల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు నింపితే ఆనందం బదులు కష్టం రెండింతలవుతుంది. అందులోనూ ఊహలకి హద్దేముంది? అలా హిమాలయాలదాకా వెళ్ళిరండి. లేదా రోడ్డుపై కారు నడపటానికి కూడా భయపడేవాళ్లు ఏకంగా విమానం నడిపేస్తున్నట్టు గాల్లో తేలిపోండి. సాధ్యాసాధ్యాల ప్రసక్తే లేదు. కానీ ఆ కలలకి కూడా హద్దు వుంది.   కమ్మటి కలల్లో విహరించండి...   పగటి కలల్ని పనులు మానుకుని మరీ కనాలనేం లేదుట. హాయిగా రాత్రి పడుకోబోయేముందు ఓ ఐదు నిమిషాలు అలా ఊహాలోకంలోకి వెళ్తే చాలుట. చక్కటి భావన కమ్మటి నిద్రని ఇస్తుందిట. అయితే నిపుణులు మరో విషయం కూడా చెబుతున్నారు. మంచివి అన్నాం కదా అని గంటలు గంటలు పగటి కలల్లోనే మునిగిపోతే మళ్ళీ అదో మానసిక సమస్యగా మారే ప్రమాదం వుందని అంటూ హెచ్చరిస్తున్నారు. నచ్చిన విషయాలని, కావాలనుకుంటున్న వాటిని కలలోనైనా దక్కించుకోవడం మంచిదే అంటున్నారు. మరింకేం... వీలు చిక్కితే కమ్మటి కలల్లో విహరించండి. -రమ ఇరగవరపు

దేశ చరిత్రను మార్చేసిన ముగ్గురి సాహసం

  B.B.D. Bagh. కోల్‌కతాలోని ఒక ప్రముఖ కూడలి. బెంగాల్ సచివాలయం లాంటి ప్రముఖ భవంతులన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రదేశానికి Dalhousie Square అని పేరు. ఆ డల్హౌసీ స్క్వేర్‌ బి.బి.డి.బాగ్‌గా మారడం వెనుక ఒక అద్భుతమైన కథ వినిపిస్తుంది.   ఒకనాటి బ్రటిష్‌ గవర్నర్‌ ‘లార్డ్‌ డల్హౌసీ’ పేరు మీదుగా బ్రిటిష్‌వారు కోల్‌కతాలో డల్‌హౌసీ స్క్వేర్‌ అనే ప్రాంతానికి రూపకల్పన చేశారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారాలకీ, అధికారాలకీ ఇది కూడలిగా ఉండేది. 1930 డిసెంబర్‌ 8న ఈ డల్హౌసీ స్క్వేర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ హోరుతో మోతెక్కిపోయింది. ఇక్కడ బ్రిటిష్‌వారి అధికార దర్పానికి నిలువెత్తు రూపంగా ఉండే రైటర్స్ బిల్డింగ్ వణికిపోయింది. అందుకు కారణం బినయ్‌, బాదల్‌, దినేష్ అనే ముగ్గురు యువకులు.   బినయ్, బాదల్‌, దినేష్‌ ముగ్గురూ మూడు నేపథ్యాల నుంచి వచ్చినవారు. కానీ ఆ ముగ్గురి ఆలోచనా విధానమూ ఒక్కటే! మన దేశాన్ని ఎలాగైనా బ్రటిష్‌వారి చెర నుంచి విడిపించడమే వారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే వారు సుభాష్‌ చంద్రబోస్‌ నెలకొల్పిన ‘బెంగాల్ వాలంటీర్స్’ అనే సంఘంలో చేరారు. భారతీయులు పట్ల కర్కోటకంగా వ్యవహరిస్తున్న బ్రిటిష్‌ అధికారులను గుర్తించి, వారిని ఏరివేయడమే ఈ బెంగాల్‌ వాలంటీర్స్‌ కర్తవ్యం.   అప్పట్లో NS Simpson అనే బ్రటిష్‌ అధికారి ఉండేవాడు. అతను జైళ్లశాఖకి ఇన్స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించేవాడు. తన చేతికి అందిన స్వాతంత్ర్య సమరయోధులని చిత్రహింసలు చేయడం అంటే అతనికి మహా సరదా! భారతీయులలో నిండిన జైళ్లని నరకకూపాలుగా మార్చడం అంటే అతనికి మహా ఆసక్తి. ఆ NS Simpsonని ఎలాగైనా తుదముట్టించాలని అనుకున్నారు బినయ్‌, బాదల్‌, దినేష్‌లు. అప్పటికే బినయ్‌ Lowman అనే ఓ పోలీసు అధికారిని హతమార్చి బ్రటిష్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాడు. తను చదువుతున్న వైద్యవిద్యని మధ్యలోనే ఆపివేసి పూర్తిస్థాయి విప్లవకారునిగా మారిపోయాడు. అతనికి బాదల్‌, దినేష్‌లు కూడా తోడయ్యారు.   1930, డిసెంబరు 8వ తేదీన ఈ ముగ్గురూ NS Simpson ఉండే రైటర్స్ బిల్డింగ్‌ను చేరుకున్నారు. అక్కడ తమని ఎవరూ అనుమానించకుండా యూరోపియన్‌ దుస్తులలో ప్రవేశించారు. నేరుగా Simpson దగ్గరకి వెళ్లి అతని గుండెల మీద తుపాకీగుళ్లని కురిపించారు. ఆ మోతకి బ్రిటిష్ సైనికులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు ‘తీవ్రవాదు’లని తుదముట్టించేందుకు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు.   బ్రిటిష్‌వారు తమ మీద ఎదురుదాడి చేస్తారని బినయ్, బాదల్‌, దినేష్‌లకు ముందుగానే తెలుసు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రాణాలతో లొంగకూడదని నిశ్చయించుకున్నారు. అందుకే బాదల్ పొటాషియం సైనేడు మాత్ర మింగేశాడు. బినయ్‌, దినేష్‌లు తమని తాము కాల్చేసుకున్నారు. ఆ గాయంతోనే బినయ్‌ ఆసుపత్రిలో చనిపోయాడు. దినేష్‌ కోలుకుని, మరుసటి ఏడు ఉరికంబాన్ని ఎక్కాడు.   బినయ్‌, బాదల్‌, దినేష్‌ల దాడితో బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయుల పట్ల భయం మొదలైంది. దేశంలోని విప్లవకారులకి ఈ చర్య సరికొత్త ఉత్తేజాన్ని అందించింది. - నిర్జర.

సమయాన్ని ఆదా చేసే Eisenhower Method

  చరిత్ర చదువుకున్న చాలామందికి Eisenhower అన్న పేరు పరిచయం ఉండే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనిక జనరల్‌గా ఐసన్‌హోవర్ ప్రసిద్ధుడు. ఆ ప్రజాదరణతోనే తర్వాతకాలంలో అమెరికా అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. సైన్యాన్ని నడపాలన్నా, దేశాన్ని పాలించాలన్నా ఏమంత తేలికైన విషయం కాదు కదా! ప్రతి క్షణమూ చాలా విలువైనదే. ప్రతి నిర్ణయమూ ప్రాణాంతకమే! అలాంటి సందర్భంలో ఐసన్‌హోవర్ రూపొందించుకున్న ఒక సూత్రానికే Eisenhower Method అని పేరు పెట్టారు.   ‘నా ముందు రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి అత్యవసరంగా (urgent) తేల్చాల్సినవి, రెండు తప్పనిసరిగా (important) తేల్చాల్సినవి. అత్యవసరం అనుకున్నది తప్పనిసరి కాకపోవచ్చు. తప్పనిసరి అనుకున్నది అత్యవసరం కాకపోవచ్చు,’ అని ఐసన్‌హోవర్‌ ఒకానొక సందర్భంలో అన్నారు. ఇదే మాటల్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వ వికాస నిపుణులు Eisenhower Methodని రూపొందించారు.   Eisenhower Methodలో మన పనులని నాలుగు రకాలుగా విభజించాలని చెబుతారు... (1) Urgent and important - వీలైనంత త్వరగా, తప్పనిసరిగా చేసితీరాల్సిన పనులు మొదటి జాబితాలోకి వస్తాయి. పై అధికారి ఫోన్ చేస్తున్నారనుకోండి, ఆ ఫోన్‌ తప్పనిసరిగా వెంటనే రిసీవ్ చేసుకోవాల్సిందే కదా! పిల్లవాడు కిందపడిపోతే, వెళ్లి పైకి లేపాల్సిందే! ఈ జాబితాలోకి వచ్చే పనులను సాధారణంగా ఎవరైనా చేసి తీరతారు. ఇవి కూడా చేయడం లేదు అంటే వారంతటి పలాయనవాదులు మరొకరు ఉండరు.   (2) Not urgent but important – త్వరగా ఇంటికి వచ్చేస్తానని భార్యకి చెప్పాం. అది అత్యవసరం కాకపోవచ్చు. కానీ భార్య మనసు నొప్పించకుండా ఉండాలంటే మాటకి కట్టుబడి ఉండాల్సిందే! అలాగే ఒళ్లు తగ్గించుకోవడం కోసం వ్యాయామం చేయాలని అనుకుంటున్నాం. వ్యాయామం చేయకపోతే కొంపలు మునిగిపోవు. కానీ నిదానంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలామంది ఈ రెండో విభాగంలోని విషయాలను పూర్తిగా అశ్రద్ధ చేస్తుంటారు. అత్యవసరం కాదు కదా అన్న చులకన భావంతో విలువైన బంధాలనీ, లక్ష్యాలనీ, ఆరోగ్యాన్నీ దూరం చేసుకుంటారు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం వీటికి కూడా జీవితంలో భాగం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.   (3) Urgent but not important – దూరపు బంధువుల పెళ్లికి వెళ్లాలి. కుటుంబంలో ఎవరో ఒకరు ఆ వేడుకకు వెళ్తే సరిపోతుంది. మీకేమో ఆఫీసులో బోల్డు పని ఉంది. సహజంగానే భార్యనో పిల్లలను పెళ్లకి పంపిస్తారు కదా! మనం సమయం వృధా చేసుకోకుండా, ఇతరుల ద్వారా సాధించగలిగే కార్యాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. కొంత డబ్బు కేటాయించో, పలుకుబడిని ఉపయోగించో, సాయాన్ని అర్థించో... ఇతరులతో చేయించగలిగే పనుల కోసం మీ సమయాన్ని వదులుకోవద్దని చెబుతున్నారు నిపుణులు.   (4) Not urgent and not important – కంప్యూటర్‌ ఆన్‌ చేస్తాం.... ఎందుకు ఆన్‌ చేశామో మనకే స్పష్టత లేదు. కాబట్టి ఏదో బ్రౌజ్‌ చేస్తూ సమయాన్ని గడిపేస్తాం. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాం... ఏవో పోస్టులు చూస్తూ కాలాన్ని మర్చిపోతాం. వీడియోగేమ్స్, టీవీ, సెల్‌ఫోన్‌లో కబుర్లు, పేకాట, బార్లో పార్టీలు... ఇలా చాలా సందర్భాలలో తెలిసో తెలియకో విలువైన కాలాన్నంతా వృధా చేసేస్తుంటాం. మనం చేసే ఈ పనులు అత్యవసరమూ కాదు, తప్పనిసరి కూడా కాదు. ఉత్త చెత్త! ఇలాంటి పనులను తగ్గించుకుంటే, జీవితంలో ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. మరింకేం! మీరు కూడా ఓసారి ఈ Eisenhower Methodని పాటించి చూడండి మరి.   - నిర్జర.  

ఆ ఊరిలో అంతా లక్షాధికారులే

మహారాష్ట్ర-  ఈ పేరు వింటే శివాజీ వంటి వీరులు స్ఫురిస్తారు. గోదావరితో సస్యశ్యామలం అయిన పంటలు కూడా గుర్తుకువస్తాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర అంటే కరువు. అలాంటి ఇలాంటి కరువు కాదు... తాగేనీరు కూడా రైళ్లలో తెప్పించుకోవాల్సిన దుస్థితి. గత కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్ర కరువు మరీ విలయతాండవం చేస్తోంది. అహ్మద్‌నగర్‌ వంటి జిల్లాలలో అది రైతులని ఆత్మహత్యకి పురికొల్పుతోంది. కానీ అదే అహ్మద్‌నగర్ జిల్లాలోని ఓ ప్రాంతం మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. అదే ‘హివారే బజార్‌’ (Hiware Bazar) గ్రామం. హివారే బజార్ ఓ సాధారణ గ్రామం. దానికంటూ ఎలాంటి ప్రత్యేకతా ఉండేది కాదు. పైపెచ్చు 1972లో వచ్చిన కరువుతో ఆ గ్రామం పేదరికంలోకి జారిపోయింది. బీడుపడిన పంటపొలాలని వదలి ఆ గ్రామప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్లిపోయారు. ఏళ్లు గడిచేకొద్దీ ఆ గ్రామం పేరుకి మాత్రమే ఊరుగా మిగిలింది. అలా సాగిపోతున్న ఆ గ్రామవాసుల జీవితంలోకి 1990లో ఒక మార్పు వచ్చింది. 1990లో జరిగిన గ్రామ సర్పంచి ఎన్నికలలో ‘పోపట్‌రావ్ పవార్‌’ అనే కుర్రవాడు నిలబడ్డాడు. చదువుకున్నవాడు కావడంతో, ఆయననే తమ సర్పంచిగా ఎన్నుకొన్నారు ఆ గ్రామ ప్రజలు. ఆ ఎన్నికే వారి జీవితాన్ని మార్చివేసింది. పవార్ సర్పంచిగా ఎన్నికైన దగ్గర్నుంచీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. గ్రామంలో మద్యాన్ని నిషేధించాడు. పచ్చని చెట్లని నరకడం కానీ, మేత కోసం వాడటం కానీ చేయకూడదని తీర్మానించాడు. కుటుంబ నియంత్రణ, శ్రమదానం వంటి కార్యక్రమాలకి సిద్ధంగా ఉండాలని సూచించాడు. ఒకపక్క గ్రామంలోని పరిస్థితులను చక్కబెడుతూనే మరోపక్క నీటి వసతి పెరిగే ఏర్పాట్లు చేశాడు పోపట్‌రావ్‌. ఎక్కడికక్కడ కాల్వలు తవ్వించడం, ఆనకట్టలు కట్టించడం, చెరువులు పూడికలు తీయించడం లాంటి పనులతో వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా రైతులు పంటలు వేసుకునేందుకు, ఆ పంటలను మార్కెట్‌ చేసుకునేందుకు అవసరమయ్యే రుణాలన్నీ మంజూరయ్యేలా చూశాడు. నీటిని ఎక్కువగా వాడిపారేసే చెరకు, అరటి లాంటి పంటలు మాత్రం వేయకూడదని గ్రామస్తులకు సూచించాడు. ఎప్పటికీ లాభసాటిగా ఉండే పాల ఉత్పత్తి, పూల మొక్కల పెంపకం లాంటి పనులు చేపట్టేలా ప్రోత్సహించాడు. గ్రామస్తుల జీవితాలు మెరుగుపడటానికి పోపట్‌రావ్ చేయని పనంటూ లేదు. బడి దగ్గర నుంచీ స్మశానవాటిక దాకా వారికి కావల్సిన సదుపాయాలన్నీ ఏర్పరిచారు. ఇలాంటి చర్యలతో ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. రాష్ట్రం అంతా కరువుతో విలవిల్లాడుతున్నా, అక్కడ మాత్రం పొలాలు విరగపండాయి. 1995లో 830గా ఉన్న నెలసరి ఆదాయం 2012 నాటికి 30 వేలకు చేరుకుంది.  ప్రస్తుతం హివారే బజార్‌లో పదిలక్షల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నవారి సంఖ్య 60కు పైగా చేరుకుంది. రెండు వందలకు పైగా కుటుంబాలలో కేవలం మూడు కుటుంబాలే దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నాయి. ఒకప్పుడు ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలన్నీ తిరిగి వచ్చేశాయి. ‘హివారే బజార్‌’ గ్రామానికి బోలెడు అవార్డులు వచ్చాయని వేరే చెప్పాలా! అలాంటి అవార్డులూ గుర్తింపుల కంటే వారి జీవితాలలో వచ్చిన మార్పే విశిష్టమైనది. అలాంటి మార్పు కేవలం ఒక వ్యక్తి వల్లే రావడం మనందరూ గుర్తుంచుకోదగ్గది.                                         - నిర్జర.  

చెల్లెలు పక్కన ఉంటే ఆ లైఫే వేరబ్బా..

  రాఖీ పండుగ వచ్చిందంటే... మన దేశంలో తెగ సందడి కనిపిస్తుంది. చిట్టి చెల్లెళ్లు, తల్లిలాంటి అక్కయ్యలు కట్టే రాఖీ కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతకీ ఇంట్లో ఒక సోదరి ఉంటే ఆ విలువే వేరనుకోండి. కానీ ఆ విలువకి రుజువు ఏమన్నా ఉందేమో అని తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. మరి ఆ పరిశోధన ఏమిటో, అందులో ఏమని బయటపడిందో మీరే చూడండి!   మన జీవితంలో 10 నుంచి 14 ఏళ్లలోపు వయసు చాలా కీలకం అంటూ ఉంటారు. బాల్య దశ నుంచి టీనేజిలోకి అడుగుపెట్టే ఆ క్రమంలో మన వ్యక్తిత్వం ఎంతో మార్పుకి లోనవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి చిన్న విషయమూ మన మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి లోనుకావడం, భయందోళనలకు గురికావడం, ఆత్మన్యూనతకి లోనుకావడం, లేనిపోని గొడవల్లో తలదూర్చడం.... లాంటి సమస్యలు ఈ వయసు కుర్రకారుని వేధిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు.   తాము ఎంచుకున్న విషయాన్ని పరిశోధించేందుకు 10-14 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఓ 395 కుటుంబాలను ఎంచుకొన్నారు. సదరు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ల జీవనశైలి ఎలా ఉంది? వాళ్లకి అక్కయ్యలు కానీ చెల్లెళ్లు కానీ ఉన్నారా? లాంటి సవాలక్ష విషయాలన్నింటినీ సేకరించారు. ఓ ఏడాది గడిచిన తర్వాత ఇదే పిల్లలని మరోమారు పరిశీలించి చూశారు.   ఆశ్చర్యకరంగా ఇంట్లో అక్కయ్యకానీ, చెల్లెలు కానీ ఉన్న కుర్రకారు చాలా సంతోషంగా కనిపించారట. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటూ, ఎలాంటి ఆందోళననైనా అధిగమిస్తూ ఉన్నారట. ఇంట్లో ఒక అక్కో చెల్లో ఉంటే చాలు! వాళ్లు బాగా చిన్నవారైనా, పెద్దవారైనా కూడా ఇంట్లోని మగపిల్లవాడి మీద వాళ్ల సానుకూల ప్రభావం ఉన్నట్లు తేలింది.   ఇంట్లో అక్కో, చెల్లో ఉంటే మనసు సంతోషంగా ఉండటమే కాదు... వ్యక్తిత్వం కూడా దృఢంగా ఉంటుందని తేలింది. తోటివారికి సాయపడాలని అనుకోవడం, బడిలో పిల్లలతో మంచిగా మెలగడం, మంచి పనులు చేయడంలో ముందు ఉండటం... లాంటి స్వభావాలు అక్కా లేదా చెల్లి ఉన్న పిల్లలలో కనిపించాయట. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రభావం కంటే సోదరీమణుల ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.   అయితే ఇంట్లో కేవలం అక్కా లేదా చెల్లి ఉంటే సరిపోదు, వాళ్లతో సఖ్యత కూడా ఉండాలి కదా! అన్న అనుమానం రావచ్చు. నిజమే! అలా ఇంట్లో అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య సఖ్యత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒకవేళ వారిద్దరూ భిన్నధృవాలలాగా ఉన్నా, కనీసం వారి మధ్య మాటామంతీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే మొహమొహాలు చూసుకోని బంధాలకంటే చిన్నాచితకా కొట్లాటలతో సాగే బాంధవ్యమే మున్ముందు నిలిచే అవకాశం ఉందట.   - నిర్జర.

అది తింటే వయసు ఆగిపోతుంది

  మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్ కంప్యూటర్కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా మతిమరపు రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకోసారి అల్జీమర్స్ వంటి సమస్యలకి కూడా దారితీస్తుంది. కానీ మెదడులోని కణాలు నిర్వీర్యం అయిపోకుండా ఇప్పుడు ఓ ఉపాయం దొరికేసింది అంటున్నారు పరిశోధకులు. ల్యూటెన్ (Lutein). ఈ పదార్థం గురించి మనం పెద్దగా విని ఉండం కదా! ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు వంటి అతికొద్ది పదార్థాలలో కనిపించే ఒక ముఖ్యమైన పోషకం ఈ ల్యూటెన్.   ఇప్పటివరకూ ఈ ల్యూటెన్ మన కళ్లకి చాలా మంచిదని చెబుతూ వస్తున్నారు. క్యారెట్లు తినడం వల్ల కళ్లకి మంచిదని పెద్దలు చెప్పడానికి.... అందులో విటమిన్ Aతో పాటుగా ల్యూటెన్ ఉండటమే కారణం. ఈ ల్యూటెన్ వల్ల మెదడుకి కూడా ఏమన్నా మేలు జరుగుతుందా అన్న ఆలోచన వచ్చింది పరిశోధకులకి. దాంతో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిని ఓ 60 మందిని ఎన్నుకొన్నారు. ల్యూటెన్ మన కంట్లోని కణాలలో పోగవుతూ ఉంటుంది. దాంతో కంట్లో ల్యూటెన్ నిల్వలు అధికంగా ఉండేవారి మెదడు ఏ మేరకు చురుగ్గా ఉంటోందో గమనించే ప్రయత్నం చేశారు.   ఆశ్చర్యంగా ల్యూటెన్ ఎక్కువగా ఉన్నవారి మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని గమనించారు. అభ్యర్థుల మెదడుకి ఎలక్ట్రోడ్లను తగిలించి చూసినప్పుడు, ల్యూటెన్ అధికంగా ఉండేవారిలో ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తక్కువ ల్యూటెన్ ఉన్న పెద్దవాళ్ల మెదడు, వయసులో ఉన్నవారితో సమానంగా స్పందిస్తోందని గ్రహించారు. మెదుడ మీద ల్యూటెన్ ప్రభావం తేలిపోవడంతో.... మెదడుకి సంబంధించి అనేక సమస్యలకు ల్యూటెన్ని మందుగా ఇచ్చే ప్రయత్నాలు మొదలవుతాయని ఆశిస్తున్నారు.   వీలైనంతవరకూ ల్యూటెన్ అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, చిలగడదుంప, టమాటా, క్యారెట్, గుడ్లు, బొప్పాయి, బీన్స్... లాంటి పదార్థాలు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడమని చెబుతున్నారు. మన శరీరానికి స్వతహాగా ల్యూటెన్ని తయారుచేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి, అది అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ కాస్త జాగ్రత్తా కనుక తీసుకుంటే.... వయసు ఎంతగా మీదపడినా మెదడు మాత్రం భద్రంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. - నిర్జర.