నిన్న జగిత్యాల...నేడు నిజామాబాద్.. అన్న కోసమే కవిత యాక్టివ్

ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఎంఎల్ సి కవిత యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత ఆరునెలలపాటు తీహార్ జైలులో ఊచలు లెక్కబెట్టి బయటకు వచ్చారు. బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర పడ్డ కవిత జైలు నుంచి విడుదలయ్యాక ప్రజలకు దూరంగా ఉంటున్నారు.  దసరాకు ముందు గైనిక్ సమస్యలతో గచ్చిబౌలిలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి వచ్చే విజువల్స్ తో ఓ సారి కనపించి మాయమయ్యారు. బతుకమ్మ పండగకు కవిత రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని వచ్చిన వార్తలు సత్యదూరమయ్యాయి. జైలు నుంచి విడుదయ్యాక  మొదటి సారి జగిత్యాల పర్యటన చేశారు. బిఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కేడర్ అంతా షిప్ట్ అయ్యింది. కవిత జగిత్యాల పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కొట్టొచ్చొంది. ఆ పర్యటన తర్వాత నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. జిల్లాకు రావడం ఇదే ప్రథమం. డిచ్ పల్లి వద్ద కవితకు బిఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి రూపు రేఖలపై విమర్శించిన కవిత బిఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లిని  ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌  వద్ద   పుష్పాంజలి ఘటించారు.  పార్టీలో హరీష్ రావ్ పై  కళ్లెం వేయడానికి  కవిత రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఒకవేళ ఎసిబి లేదా ఈడీ కెటీఆర్ ను అరెస్ట్ చేస్తే హరీష్ రావ్ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మేన బావ అయిన హరీష్ కు చెక్ పెట్టాలంటే కవిత రీ ఎంట్రీ ఇచ్చే అగత్యం ఏర్పడింది. నవ్యాంధ్రలో వైఎస్ జగన్ జైలుపాలయినప్పుడు చెల్లెలు షర్మిల రాష్ట్ర మంతా పర్యటించి బొక్కబోర్లా పడ్డారు  షర్మిల గతే కవితకు పట్టడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.  తన  జిల్లా పర్యటనలో ప్రజా సమస్యలపై ఎక్కువ ఫోకస్  పెట్టారు ఈ మాజీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు. 

ఖిల్లా ఘనపూర్ పొలాల్లో వెయ్యేళ్ల గణపతి

కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి తరతరాల చరిత్రకు ఆలవాలమైన ఖిల్లా ఘన్ పూర్ పొలాల్లో వెయ్యేళ్ల నాటి సిద్ధి గణపతి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  అన్నారు. గ్రామ గ్రామాన గల వారసత్వ సంపదను గుర్తించి స్థానికులకు అవగాహన కల్పించి పరిరక్షించేందుకు దోహదపడే "ప్రిజర్వ్ హేరిటేజ్ ఫర్ పోస్టేరీటి" కార్యక్రమంలో భాగంగా, ఆయన ఆదివారం నాడు ఖిల్లా ఘనపురం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ క్రమంలో ఘనపూర్ పట్టణానికి పశ్చిమంగా మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో గల ఒక పెద్ద గుండు పై ఐదు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో, రాతిని తొలచి మలచిన పెద్ద గణపతి విగ్రహాన్ని పరిశీలించారు. తలపై జటామకుటం, గజముఖం, ఎడమవైపుకు తిరిగిన తొండం, పై రెండు చేతుల్లో పరశు, పాశం, కింది రెండు చేతుల్లో విరిగిన దంతం, మోదకాలను, పొట్టపై నాగయజ్ఞోపవీతాన్ని ధరించి, లలితాసనంలో కూర్చుని ఉన్న, వనపర్తి జిల్లాలోని అతిపెద్దదైన ఈ గణపతి విగ్రహం క్రీ.శ. 11వ శతాబ్ది నాటి కందూరు చోళుల తొలి కాలపు ప్రతిమా లక్షణాన్ని తెలియజేస్తుందని శివనాగి రెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాన్ని కాపాడుకోవాలని ఖిల్లా ఘనపూర్ కు చెందిన, వనపర్తి జిల్లా విశ్వహిందూ పరిషత్ సేవా ప్రముఖ బెస్త శ్రీనివాస్, ఆగారం ప్రకాష్, ఆగారం శేఖర్ రెడ్డి, ఎం.డి పాషాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పట్నం కృష్ణంరాజు పాల్గొన్నారని ఆయన చెప్పారు.

పేర్నినానివి కట్టు కథలు : కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లాలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్ర మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు ముదురుతోంది.  పేర్నినాని భార్య జయసుధను అరెస్ట్ చేయనున్నట్టు కొల్లు రవీంద్ర చేసిన ప్రకటనపై పేర్ని నాని  కట్టు కథలు అల్లుతున్నారు. ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులు ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు  పేర్ని నాని కట్టు కథలు అల్లినట్టు కొల్లు రవీంద్ర స్టేట్ మెంట్ ఇచ్చారు. వీరి మధ్య పంచాయతీ ముదురుతోంది. నన్ను అరెస్ట్ చేయాలని కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నట్టు కట్టు కథ అల్లారని అన్నారు. రేషన్ బియ్యం స్వంత గోడౌన్ నుంచి స్మగ్లర్లకు తరలించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేసు నమోదైన నాటి నుంచి పేర్ని తప్పిచుకుతిరుగుతున్నాడని కొల్లు రవీంద్ర అన్నారు.ప్యాంటు తడుపుకున్న పేర్ని నెలరోజులు మాయం అయ్యాడని కొల్లు అన్నారు.  నీ తప్పే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.   పేర్ని భార్య  జయసుధ గోడౌన్ నుంచి 7 500 బియ్యం బస్తాలు ఏమయ్యాయని మంత్రి ప్రశ్నించారు

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అరుదైన రికార్డు

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ గా కోనేరు హంపి నిలిచి అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు.  టోర్నీలో ఆమె దూసుకెళ్లింది. 8.5 పాయింట్ల తో అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. 2019లో హంపి చెస్ చాంపియన్ అయింది. కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్  చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా  పేరు గడించింది. ఇదే టోర్నీలో మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. 2024 మన దేశ చెస్ క్రీడాకారులకు మర్చిపోలేని సంవత్సరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   

 కామారెడ్డి ఘటనలో ముగ్గురు దుర్మరణానికి కారణం ఇదే...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువులో ముగ్గురు దుర్మరణానికి మిస్టరీ వీడింది.  బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.  ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , ఎస్ఐ సాయికుమార్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాట్లాడుకోవడానికి వీరు చెరువు వద్దకు చేరుకున్నారు.  ముగ్గురి మధ్య మాటామాటా  పెరగడంతో శృతి చెరువులోకి దూకేసింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ దూకేసాడు. వీరిద్దరికి ఈత రాదు. వీరిని కాపాడటానికి ఎస్ ఐ సాయికుమార్ చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో సాయికుమార్ నీటిలో మునిగిపోయాడు. శృతి ఆత్మహత్య చేసుకుంటే నిఖిల్ , సాయికుమార్ రక్షించే క్రమంలో మునిగిపోయారు.   

ఈ నెల 30న  తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదానకార్యదర్శి  శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ వేదికగా భేటీ జరుగనుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీలపై  ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసాపై చర్చించనున్నారు. ఏడాదికి  ఎకరానికి 15 వేలు భూమిలేని రైతుకు 12 వేల రూపాయలు ఈ పథకం క్రింద ఇవ్వనున్నారు.సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు.  

మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ డుమ్మా.. కారణమేంటంటే?

రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. అవసరార్ధం ఆయన ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా దిగజారుతారని రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక సారి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ తరువాత తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇదేమిటని అడిగిన వారికి తన లక్ష్యం తెలంగాణ సాధన.. ఆ లక్ష్య సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దెట్టుకుంటా అని సమాధానం ఇచ్చారు. సరే సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమ ఫలితమైతేనేం, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసమైతేనేం తెలంగాణ సాకారమైంది. ఇది జరిగి పదేళ్లు దాటింది.  తెలంగాణ సాకారమైన సమయంలో కేసీఆర్ సకుటుంబ  సపరివార సమేతంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపి మరీ వచ్చారు. అంతకు ముందు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా అన్నారు. అయితే తెలంగాణ ఆవిర్బావం తరువాత వరుసగా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేటీఆర్.. ఆ సమయంలో  కాంగ్రెస్ ను రాష్ట్రంలో నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సహయంలోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని మన్మోహన్: నేతృత్వంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్న కేసీఆర్ మన్మోహన్ అంత్యక్రియలకు మాత్రం హాజరు కాలేదు. తనకు బదులుగా తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందాన్ని పంపారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు సహా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ స్వయంగా హాజరై ఉండాల్సిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అయితే కేసీఆర్ సీతయ్య లాంటి వారు. ఎవరి మాటా వినరు. తనకు ఏది తోస్తే అదే చేస్తారు. గత ఏడాది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచీ కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అలాగని పూర్తిగా రాజకీయ సన్యాసం చేయలేదు. తాను కలవాలనుకున్నప్పుడల్లా పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ సమయానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు  కేసీఆర్ గైర్హాజర్ కావడం ఏ మాత్రం హుందాగా లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. పరాజయంతో ముఖం చెల్లకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. మన్మోహన్ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉండటానికి కారణం ముఖ్యమంత్రి హోదాలో  ఉన్న రేవంత్ ను ఫేస్ చేయడానికి ఇష్టపడకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే తాను సీఎంగా ఉండగా ప్రొటోకాల్ ను సైతం ధిక్కరించి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సమయంలో ఆయనకు స్వాగతం పలకలేదు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పరిశీలకులు ఇప్పుడు మోడీకి ఎదురుపడి అవమానపడటం కంటే దూరంగా ఉండటమే మేలని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ గైర్హాజర్ కావడం ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చిందని అంటున్నారు.  

వైసీపీకి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా

మాజీ ఐఏఎస్ అధికారి  ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  తొలి నుంచీ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఇంతియాజ్ అహ్మద్   వైసీపీ హయాంలో   కీలక జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇంతియాజ్ అహ్మద్ కు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చే వారు. అటువంటి ఇంతియాజ్ అహ్మద్ తనకు ఎన్నికలలో పోటీ చేయాలని ఉందన్న ఆసక్తి కనబరచగానే జగన్ ఓకే అనేశారు. అంతే ఆఘమేఘాల మీద  వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ గూటికి చేరిపోయారు. కర్నూలు, లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే చివరకు జగన్ ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి కర్నూలు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోవడం, అలాగే వైసీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో జగన్ ఇంతియాజ్ అహ్మద్ ను పట్టించుకోవడం మానేశారు.  దాంతో పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.

సంక్రాంతి తరువాత షెడ్యూల్.. ఫిబ్రవరిలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి తరువాత వెలువడే అవకాశం ఉంది.   మొత్తం  మూడు విడతల్లో  ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే  జరగనున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా  12,815 గ్రామ పంచాయతీలు, 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు  కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకుని పంచాయతీ ఎన్నికలలో జయకేతనం ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో  కాంగ్రెస్ సర్కార్ ఉంది.   ఇప్పటికే  పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో  సత్తా చాటేందుకు భారీ ప్రణాళిక రూపిందించింది.    ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందింది.  ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సమాయత్తమౌతోంది.   ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచు ల పదవీ కాలం ముగియగా, జూలై 3వ తేదీన ఎం పిటిసి, జడ్పిటిసి సభ్యుల పదవీ కాలం ముగిసిం ది. దీంతో అప్పటి నుంచీ స్థానిక ప్రజాప్రతి నిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ఎన్నికల కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేప డుతోంది.  జనవరి 14వ తేదీన ఎన్నికల షెడ్యూల ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపిటిసి స్థానాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

సినీ ఇండ‌స్ట్రీతో వివాదం.. రేవంత్ కు జగన్ కు తేడా గమనించారా?

రేవంత్ స‌ర్కార్, టాలీవుడ్ మ‌ధ్య త‌లెత్తిన వివాదం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించింది.  పుష్ప-2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ తొక్కిస‌లాట చోటుచేసుకుని మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సినీ న‌టుడు అల్లు అర్జున్‌, థియేట‌ర్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ త‌రువాత అల్లు అర్జున్ అరెస్టు కావ‌టం, బెయిల్ పై జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌టం చకచకా జరిగిపోయాయి. అయితే, వివాదం స‌ర్దుమ‌ణిగింద‌ని అంతా భావిస్తున్న దశలో  థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వెంట‌నే అల్లు అర్జున్ మీడియా స‌మావేశం పెట్టి రేవంత్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో రేవంత్ స‌ర్కార్‌, సినీ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య ఎవ‌రూ పూడ్చ‌లేని గ్యాప్‌ ఏర్ప‌డిందని అంతా భావించారు. కానీ  రెండుమూడు రోజుల‌కే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రంగంలోకి దిగి రేవంత్ ను రీచ్ అయ్యారు.  దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు కొంద‌రు భేటీ  అయ్యారు. ప్ర‌భుత్వం, ఇండ‌స్ట్రీకి మ‌ధ్య వివాదం స‌మ‌సిపో యిందనిపించారు. అయితే, గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలోనూ సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా వివాదం కొన‌సాగింది. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో వివాదాన్ని పెంచుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం త‌న చాకచక్యంతో వివాదాన్ని ముగించడమే కాకుండా పై చేయి సైతం సాధించారు. రేవంత్ తీరును గ‌మ‌నించిన వైసీపీ నేత‌లు సినీ పెద్ద‌ల ప‌ట్ల జ‌గ‌న్ అప్పట్లో అవ‌లంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీని చుల‌క‌న‌గా చూశార‌న్న‌ వాద‌న ఉంది. సినిమా రేట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా కొద్ది రోజులు వివాదం కొన‌సాగింది. ఈ క్ర‌మంలో  మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మ‌హేశ్‌బాబు, ప్ర‌భాష్‌, రాజ‌మౌళి త‌దిత‌రులు సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వారి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏవైనా.. ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్య‌క్తి వెళితే ఘ‌న‌ స్వాగ‌తం ల‌భించేది. కానీ, జ‌గ‌న్ మాత్రం చిరంజీవి, ఇత‌ర హీరోల వాహ‌నాల‌ను లోప‌లికి అనుమ‌తించ‌లేదు. దీంతో వారు కార్ల‌ను గేటు బ‌య‌టే వ‌దిలేసి జ‌గ‌న్ ను క‌లిసేందుకు న‌డుచుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. దీనికితోడు జ‌గ‌న్ తో స‌మావేశం అయిన స‌మ‌యంలో మీరేంటి హీరోలు.. నేను అస‌లైన హీరో అన్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న క‌నిపించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి చేతులు జోడించి సినిమా ఇండ‌స్ట్రీకి మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకోవాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌టంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ తీరుప‌ట్ల‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  చిరంజీవి ప‌ట్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మెజార్టీ ప్ర‌జ‌లుసైతం సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు. దీనికితోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు సినీ ఇండ‌స్ట్రీపై నోరుపారేసుకున్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఘోరం ఓట‌మికి ఈ ఘ‌ట‌న కూడా కార‌ణ‌మైంద‌ని చెప్పొచ్చు. తెలంగాణలో ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. అయితే, హైద‌రాబాద్ లో చెరువులను ఆక్ర‌మించి నిర్మించిన క‌ట్ట‌డాల‌ను ప్ర‌భుత్వం కూల్చివేత‌ల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హీరో నాగార్జున‌కు సంబంధించిన ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీ నుంచి రేవంత్ రెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కొద్దిరోజుల త‌రువాత కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల వ్య‌వ‌హారాన్ని మంత్రి కొండా సురేఖ ప్ర‌స్తావించారు. దీంతో అక్కినేని కుటుంబంతోపాటు సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈక్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మారింది. తాజాగా పుష్ప‌-2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవంతి అనే మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె కుమారుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘట‌న‌కు సంబంధించి అల్లు అర్జున్ స‌హా ప‌లువురిపై కేసు న‌మోదైంది. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైల‌ుకు పంపించారు. అదే స‌మ‌యంలో హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుద‌లై అల్లు అర్జున్ త‌న నివాసానికి వెళ్లిన త‌రువాత సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించారు. దీంతో రేవంత్ స‌ర్కార్ వ‌ర్సెస్ సినీఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా వివాదం మారింది.  ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినీఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు ఆస్ప‌త్రిలో ప్రాణాపాయ‌స్థితిలో చికిత్స పొందుతుంటే అత‌న్ని చూసేందుకు వెళ్ల‌ని సినీ ప్ర‌ముఖులు జైలుకు వెళ్లివ‌చ్చిన అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించ‌టం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా త‌ప్పుబ‌ట్టారు. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు ఉండ‌వ్‌, టికెట్లు పెంపు ఉండ‌ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేశారు. దీంతో సినీ పెద్ద‌ల రంగంలోకిదిగి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న‌ సినీ ప్ర‌ముఖుల ప‌ట్ల‌ రేవంత్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వంగా న‌డుచుకున్నారు. హీరో నాగార్జున‌, వెంక‌టేశ్ తో రేవంత్‌ ఆప్యాయంగా మాట్లాడారు. త‌ద్వారా  ప్ర‌భుత్వం ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల్లో  కాఠిన్యం ఉన్నా.. సినీ ఇండ‌స్ట్రీ వారి ప‌ట్ల మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉంటామ‌ని రేవంత్ చెప్ప‌క‌నే చెప్పారు. ఈ స‌మావేశంలో సినీ పెద్ద‌ల ప్ర‌తిపాదనలను రేవంత్ ఆమోదించలేదు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు వంటి వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయితే రేవంత్ సినీ ప్రముఖులకు ఇచ్చిన మర్యాద ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. రేవంత్ తో భేటీ తరువాత ఆ భేటీకి హాజరైన వారంతా రేవంత్ ను పొగడ్తల వర్షంలో ముంచేశారు. దీంతో  గతంలో సినీ ప్రముఖులతో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చింది. రేవంత్ జగన్  మధ్య తేడాను ప్రస్ఫుటంగా ఎత్తి చూపింది. అప్పట్లో సినీ హీరోల‌ ప‌ట్ల జ‌గ‌న్  వ్యవహరించిన తీరు ఏ మాత్రం సమర్ధనీయం కాదన్న అభిప్రాయం మరో సారి వ్యక్తం అవుతోంది.  

బుగ్గన మెడకూ బియ్యం ఉచ్చు!?

ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలలో కూడా పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. మాయం అయిన బియ్యం విలువకు సమానంగా సొమ్ములు చెల్లిస్తామంటూ ఆయన న్యాయవాదులు చెప్పడంతోనే పేర్ని కుటుంబం బియ్యం మాయం చేసినట్లు అంగీకరించినట్లైందని అంటున్నారు.  అయితే ఇలా గోదాముల నుంచి బియ్యం మాయం ఒక్క పేర్ని కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోదాములు ఉన్న వైసీపీ నేతలు మరింత మంది కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బేతంచర్లలో ఉన్న గోదాం నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు రాగానే బుగ్గన స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే..ఆ గోడౌన్లలో కొన్ని తన బంధువులకు చెందినవి అయి ఉండొచ్చంటూ ముక్తాయించడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. తన బంధువుల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయమైతే తనకేం సంబంధం అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలతోనే బేతంచర్లలోని గోదాంలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఎంతగా దబాయించాలని చూసినా.. బేతంచర్ల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయం అయ్యాయనీ, అది తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంలో  బుగ్గన ఉన్నారనీ ఆయన మాటలను బట్టే అవగతమౌతోంది. బుగ్గన బంధువుల పేరు మీద గోడౌన్లు నడిచినా ఆయన సహకారం, మద్దతు లేకుండా బియ్యం మాయం చేయడం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు.   బేతంచర్ల గోదాముల వ్యవహారంలో  విజిలెన్స్ దర్యాప్తు ఆరంభమైంది. మాయమైన బియ్యం లెక్కలు నేడో రేపో  బయటకు రాకపోవు. ఈ భయంతోనే బుగ్గన మీడియా ముందుకు వచ్చి మరీ ఆ గోదాములతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారని అంటున్నారు.  అలాగే వైసీపీకి అలవాటైన ఎదురుదాడికీ పాల్పడుతున్నారు.  అదే సమయంలో బియ్యం మాయంతో తనకేం సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే బుగ్గనకూ అజ్ణాత వాసంలోకి వెళ్లక తప్పని పరిస్థితి త్వరలోనే ఎదురు కావచ్చునంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

ఏసీబీ కంటే ముందు ఈడీ – కేటీఆర్‌కు నోటీసులు !

ఫార్ములా ఈ రేసు కేసులో  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది.  ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది. దీనిపై కోర్టుకు వెళ్లిన కేటీఆర్ స్వల్ప ఊరటను పొందారు. అసలింకా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కానీ ఈ లోగానే  ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో ఈడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది.  ఈ కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీయే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే వీరిరువురినీ కేటీఆర్ కంటే ముందుగానే అంటే జనవరి 2, 3 తేదీలలో విచారించనుంది.  ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ప్రివెంటివ్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది.  ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.  ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు అవినీతికి సంబంధించింది. అయితే ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అవినీతి జరగలేదని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. అయితే ఈడీ మాత్రం ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తరలించారంటూ కేసు పెట్టింది. ఏదో రూపంలో సొమ్ములు తరలించినట్లు కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఆ తరలింపుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఈడీ రంగంలోకి దిగింది. అక్రమంగా సొమ్ములు తరలింపులో కేటీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఈడీ తేలుస్తానంటూ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కన్నా ఈడీ దూకుడుగా వ్యవహరించడం కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు ఆందోళన కలిగించే అంశమే.  అసలు ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న తరువాత అనుమతి ఇవ్వడంతోనే ఏదో తప్పు జరిగిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ కు ఉచ్చు బిగిసిందన్న భావన రాజకీయ వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది. 

కడపలో వైసీపీ పట్టు జారిపోయింది!?

కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు  చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.  అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కడపలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేడాయినిక కృత నిశ్చయంతో ఉంది. ఎవరైనా సరే చట్టాలను, నిబంధనలను గౌరవించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి రెడీ అని హెచ్చరికలు జారీ చేస్తోంది. కడప గడ్డపై నుంచే వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతామనీ, మెడలు వంచుతామని హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతోంది. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమౌతోంది.  ఇందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుంబిగించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇక చట్టాన్ని అతిక్రమించే వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడానికి ఆయన కడప పర్యటనకు సమాయత్తమౌతున్నారు.   ఇంత కాలం ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమ దారికి తెచ్చుకునేవారు. వారు దారికి రాకుంటే ఫ్యాక్షనిస్టు మార్గాలలో కుటుంబాలను టార్గెట్ చేసుకుని బెదరింపులకు పాల్పడేవారు. దీంతో అధికారులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సేఫ్ గేమ్ ఆడేవారు. దీంతో ఇంత కాలం కడపలో వైసీపీ రాజ్యాంగమే నడుస్తూ వచ్చింది. వైసీపీ రాజ్యాంగమంటే రాజారెడ్డి రాజ్యాంగమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై ఇలాంటి పోకడలు సహించేది లేదన్న సంకేతాన్ని కూటమి ప్రభుత్వం గాలివీడు ఎంపీడీవోపై దాడి సంఘటన తరువాత  ఆ దాడికి పాల్పడిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కుని పోవడం  ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఇక వైసీపీయుల అరాచకాలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేసింది. అధికారులు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా తమ పని తాము చేస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చాటడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీయుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులకు నైతిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి అధికారులు, ప్రజలలలో ధైర్యాన్ని నింపడానికి సమాయత్తమౌతున్నారు. ఇప్పటకే జిల్లా జనం, వైసీపీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. ఆ విషయం ఇటీవల క  జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. సొంత పార్టీ క్యాడరే అధినేత జగన్ పట్ల అసంతృప్తి, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. జగన్ వ్యవహార శైలి పట్ల తమ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కడప గడ్డపై నుంచి వైసీపీ అరాచకాలను సహించేది లేదని చాటేందుకు రెడీ అవడంతో  ఇక వైసీపీయులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతి.. టీటీడీ నిర్ణయం

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు సార్లు వారి లేఖలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెజారిటీ సభ్యులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమించాలనడంతో టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.   శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. . తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌,  అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని  మంత్రి కొండా సురేఖ కూడా గళమెత్తారు.   దీంతో ఈ విషయాన్ని పున: పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. బోర్డులోని మెజారిటీ సభ్యుల అభిమతం మేరకు వారానికి రెండు సార్లు తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇహనో ఇప్పుడో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  

రొంపిచర్ల చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి

నిర్లక్ష్యపు నీడలో కాకతీయ శాసనాలు భద్రపరచాలంటున్నప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద, వెళ్లే దారిలో గల నిర్లక్ష్యానికి గురైన క్రీ.శ. 10-13 శతాబ్దాల నాటి శిల్పాలు, శాసనాలను భద్రపరిచి, కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సిఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపదను గుర్తించి, పరిరక్షించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం (డిసెంబర్ 27) రొంపిచర్లలో పర్యటించి అనేక చారిత్రక ఆనవాళ్లను గుర్తించారు. ఊరు బయట, వినాయక ఆలయం ముందు రోడ్డుపైన, మదన గోపాల దేవాలయానికి వెళ్లే దారిలో, క్రీ.శ 10వ శతాబ్దికి చెందిన మహిషాసురమర్దిని, బ్రహ్మ, కుమారస్వామి, భైరవ, నంది విగ్రహాలు, ఇంకా కాకతీయ గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు విడుదల చేసిన రాతి శాసనాలు ఆలనా పాలనా లేక గడ్డి, గాదం మధ్య పడి ఉన్నాయన్నారు. తేది లేని గణపతి దేవుని శాసనం లో స్థానిక కేశవ దేవునికి, క్రీ.శ. 1320 నాటి ప్రతాపరుద్రుని శాసనంలో స్థానిక అనంత గోపీనాథ దేవుని అమావాస్య కొలుపులకు రెడ్ల చెరువు వెనక కొంత భూమిని దానం చేసిన వివరాలు, అలాగే క్రీ.శ. 1245 నాటి కోట భీమరాజు మంత్రి వల్లభుడు, రొంపిచర్లలో కట్టించిన గోపీనాథ ఆలయానికి కొంత భూమిని దానం చేసిన వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రొంపిచర్ల గ్రామ చరిత్రకు సాక్ష్యాలైన ఈ శిల్పాలు, శాసనాలను కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు, ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ శ్రీనివాస్ పద్మ వంశీ, స్థపతి బి. వెంకటరెడ్డి పాల్గొన్నారు.