ఇన్ చార్జ్ లు కావలెను.. జగన్ వెతుకులాట.. నేతల దోబూచులాట!

వైసీపీ పరిస్ధితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టు నాగంభోట్లుఅన్నట్లుగా తయారౌతోంది. ఏ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎప్పుడు పీకేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఛాదస్తపు మొగుడు చెబితే వినడు తిడితే ఏడుస్తాడు అన్నట్లుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆ పార్టీ నేతలే తలలుపట్టుకుంటున్న పరిస్థితి. అధికారంలో ఉండగా కన్నూమిన్నూగనక.. ఇక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామన్న గుడ్డి విశ్వాసంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు వైసీపీ వినా మరో గత్యంతరం లేక ఆ పార్టీలోనే ఉంటున్నారు. అలా కాకుండా కొద్దో గొప్పో పార్టీలో తామరాకు మీద నీటిబొట్టులా ఉండి.. ప్రత్యర్థులపై నోరు పారేసుకోని నేతలు వైసీపీని వదిలేసి కూటమి పార్టీల్లోకి దూకేశారు. ఆ దారిలో ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు. సంక్రాంతి తరువాత వైసీపీ నుంచి వలసలు పెద్ద సంఖ్యలో ఉంటాయనీ చెబుతున్నారు. ఇక రోజా, అంబటి, బుగ్గన, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి వంటి వారు వారి తీరు కారణంగా మరో పార్టీలోకి ప్రవేశం లేక.. గత్యంతరం లేక వైసీపీనే పట్టుకు వేళాడుతున్నారు.  ఇక గత ఎన్నికల సమయంలో  పార్టీ టికెట్ల కేటాయింపును జగన్ మోహన్ రోడ్డి అపహాస్యం చేసి పారేశారు. ఎలాంటి కారణం, హేతువు అన్నదే లేకుండా అభ్యర్థులను మార్చి పారేశారు. తన ఫొటో చూసే ఓట్లు పడతాయి, అభ్యర్థులు నిమిత్త మాత్రులు అన్నట్లుగా వ్యవహరించారు. అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నరసరావుపేటకు పంపేయడం, అలాగే రోజా, అంబటి వంటి వారికి అసలు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న సస్పెన్స్ లో ముంచి చివరి నిముషంలో టికెట్ కేటాయించడం వంటి ఫీట్లు ఎన్నో చేశారు.  ఆయన ఏం చేసినా అప్పట్లో నేతలు నోరు మెపదకుండా ఉండడానికి మరోసారి జగన్ అధికారంలోకి వస్తారన్న విశ్వాసమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. తీరా గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి జగన్ అరాచక పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలలో అత్యధికులు సైలెంటైపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా, మిగిలిన వారిలో అత్యధికులు అటు పార్టీకీ, ఇటు ప్రజలకూ ముఖం చాటేసి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ఈ కోవలోకి వస్తారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది.   రాష్ట్రంలో దాదాపు 50కి పైగా నియోజకవర్గాలలో ఇప్పడు వైసీపీకి ఇన్ చార్జీలే లేరు. ఎవరినైనా నియమిద్దామని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆ పోస్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే వారే కరవయ్యారు.  పోనీ కోరుకున్న వారికి ఆ పోస్టు ఇచ్చేయొచ్చు కదా అంటే అందుకు జగన్ అంగీకరించడం లేదు. కింద పడినా పై చేయి నాదే అంటున్న జగన్ తీరు చూసి నేతలు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఇన్ చార్జిలు ఉన్న నియోజకవర్గాలలో కూడా పార్టీ  కార్యక్రమాలు చేపట్టేందుకు క్యాడర్ ముందుకు రావడం లేదు.   ఓ వైపు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతూ కోటి సభ్యత్వాల ల్యాండ్ మార్క్ చేరుకుంది. ఆ పార్టీ కార్యకర్తల కోసం బీమా కూడా చేయించింది. మరో వైపు వైసీపీ ఉన్న క్యాడర్ ను చేజార్చుకుంటోంది. దీంతో రానున్న రోజులలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బెజవాడ్ బుక్ ఫెయిర్ లో పవన్ కల్యాణ్.. రూ.10లక్షల విలువైన పుస్తకాల కొనుగోలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుస్తక ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో వెల్లడించారు. ఇటీవల అంటే ఈ నెల 2వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన పవన్ కల్యాణ్  ఆ సందర్భంగా పుస్తకపఠనం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇవ్వడానికి క్షణం కూడా ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తానని ఆయనా సందర్భంగా చెప్పారు. అది పక్కన పెడితే పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 11) విజయవాడ బుక్ ఫెయిన్ ను సందర్శించారు. ఒక పుస్తక ప్రియుడిగా ఆయన బుక్ ఫెయిర్ అంతా కలయతిరిగారు. పలు స్టాల్స్ సందర్శించారు. పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు పది లక్షల రూపాయల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆ బిల్లును తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు.  అంతకు ముందు అంటే శుక్రవారం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు.  ఆసందర్బంగా ఆధునిక వసతులతో పిఠాపురంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొన్న పుస్తకాలన్నీ ఆ లైబ్రరీ కోసమేనని తెలుస్తోంది.  ఆయన కొనుగోలు చేసన పుస్తకాలలో  అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు ఉన్నాయి.

అల్లు అర్జున్ కు ఊరట

సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. పుష్ప 2 సినీమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె 9ఏళ్ల కుమారుడు శ్రీతేజ్  ఆస్పత్రి పాలు కావడం తెలిసిందే. ఆ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆ తరువాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిలు కూడా అభించింది. కోర్టు విధించిన షరతుల మేరకు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీసు స్టుషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిపై అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారం పోలీసు స్టేషన్ కు హాజరు కాలేనని వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆ పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు.. ప్రతి ఆదివారం పోలీసు స్టేషన్ కు హాజరు నుంచి అల్లు అర్జున్ కు మినహాయింపు ఇచ్చింది. అలాగే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కూడా అనుమతించింది.  

వైఎస్ వారసత్వ పోటీలో వెనుకబడ్డ జగన్!?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తమ తండ్రి వైఎస్ రాజకీయవారసత్వం కోసం తీవ్రమైన పోటీ జరుగుతోంది. అయితే ఈ పోటీలో షర్మిలే ఒకింత ముందున్నారన్న అభిప్రాయం కూడా ప్రజలలో వ్యక్తం అవుతున్నది. నిర్భయంగా, నిస్సంకోచంగా షర్మిల తన అన్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను ఎండగట్టడమే కాకుండా, వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచారంటూ పలు ఉదంతాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది లేదు. పైగా నిఖార్సైన కాంగ్రెస్ నేతగా ఆయన తన జీవితాంతం బీజేపీని వ్యతిరేకించారనీ, అందుకు భిన్నంగా తన అన్న, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారనీ విమర్శిస్తున్నారు.  వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పేర సొంత పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కుటుంబం ముక్తకంఠంతో జగన్ ను ప్రకటించింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంతే అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది.  ఆ మార్పు ఎలా ఎందుకు వచ్చిందంటే.. ఎదుగింటి సందింటి  రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్)  కుటుంబం లో యుద్ధం మొదలయింది. ఆస్తుల తగాదా నుంచి అది వారసత్వ పోరు వరకూ వెళ్లింది.  ఆస్తుల పోరు కాస్తా రాజకీయ వారసత్వ రణం వరకూ వెళ్లింది.  ఈ యుద్ధంలో అన్న జగన్ ఒక వైపు.. చెల్లి వైఎస్ షర్మిల మరో వైపు మోహరించారు. అమ్మ కుమార్తె షర్మిల వైపే నిలిచారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుటుంబం మొత్తం ఒక్కటై నిలిచింది. కష్ట కాలంలో ఒకరినొకరు ఓదార్చుకోవడంలో కానీ, తండ్రి రాజకీయ అండ చేజారిపోకుండా చూసుకోవడంలో కానీ, రాజకీయంగా కుటుంబం పెత్తనం సడలిపోకుండా కాపాడుకోవడంలో కానీ తల్లి, కుమారుడు, కుమార్తె, వీళ్లే కాకుండా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబం ఇలా మొత్తం వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపై నిలిచింది.    జగన్ సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ అధినేతగా తన సొంత రాజకీయ ప్రయాణం ఆరంభించారు. 2014 ఎన్నికలలో విభజన ఎమోషన్స్ తో పాటు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ పై ఉన్న పలు కేసులు, ఆయన వ్యవహార శైలిపై ప్రజలలో ఉన్న సంశయాలు, అనుమానాల కారణంగా జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అయితే విపక్ష నేతగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటూ నిత్యం జనంలోనే గడిపారు. ఆయన ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో వచ్చిన సానుభూతి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జనంలో ఉన్న అభిమానానికి తోడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు జగన్ కు ప్లస్ అయ్యాయి. దాంతో ఆ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ విజయానికి పైన చెప్పిన అన్ని కారణాలతో పాటు వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు అండగా నిలబడటం కూడా ప్రధాన కారణంఅనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం, ప్రసంగాలు, జగన్ తల్లి విజయమ్మ కుమారుడి కోసం రోడ్డుపై బైఠాయించి మరీ తెలిపిన నిరసనలు, బాబాయ్ వైఎస్ వివేకా, ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెన్నంటి ఉండటం ఇలా ఇవన్నీ జగన్ కు  కలిసి వచ్చాయి.   ఇదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ కు కలిసి వచ్చిన అంశాలే   ఆయనకు 2024 ఎన్నికలలో ప్రతికూలంగా మారాయి.  నాడు జగన్ వెనుక ఐక్యంగా నిలిచిన కుటుంబం అండ లేకుండా పోయింబది. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయన వైపే చూపించాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఆయనకు వ్యతిరేకంగా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల 2024 ఎన్నికలలో జగన్ కు గురిపెట్టిన బాణంగా మారి ఆయనపై విమర్శలు గుప్పించారు.  ఇవన్నీ కూడా జగన్ స్వయంకృతాపరాధాలే అని చెప్పక తప్పదు.  తల్లి చెల్లి సహా వైఎస్ కు సన్నిహితులు అన్న వారందరినీ జగన్ వదిలించేసుకున్నారు.   సరే ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు మారలేదు. తనపై విమర్శలు గుప్పించిన చెల్లి షర్మిలపై తన సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయించారు. దీంతో ఆమె జగన్ పై మరింత తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఆమె  మరోసారి వైఎస్ రాజకీయ వారసురాలిని తానే నని ప్రకటించుకున్నారు. ప్రధాని మోడీతో జగన్ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలోకి తొక్కి జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  జగన్ బీజేపీతో  అంటకాగుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడినని ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది తాను మాత్రమే అని చెప్పారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని షర్మిల స్పష్టం చేశారు. మొత్తంగా వైఎస్ వారసత్వ పోరులో జగన్ ను వెనక్కు నెట్టి షర్మిల ముందుకు వచ్చారని చెప్పకతప్పదు. అధికారంలో ఉండగా వైఎస్ బ్రాండ్ ను వదిలించుకుని సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన జగన్.. ఓటమి తరువాత మళ్లీ వైఎస్ పేరు జపిస్తుండటం సహజంగానే జనంలో ఆయనను చులకన చేసింది. దీంతో షర్మిల వైపునకే వైఎస్ అభిమానులు మొగ్గు చూపుతున్నారు. 

జగన్ అవసరం జనానికి లేదని చాటుతున్న పవన్!

తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన పోలీసుల పని తీరుపై చేసిన వ్యాఖ్యలు, అధికారుల సమన్వయలోపాన్ని ఎత్తి చూపిన తీరు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్ఠించాయి. సామాన్య జనం పవన్ మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, నిష్కర్షగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తుంటే.. వైసీపీయులు మాత్రం పవన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పవన్  కల్యాణ్ ఏ సందర్భంలో పోలీసుల వైఫల్యం, అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారన్నది గమనిస్తే.. వైసీపీయుల వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ రాజకీయలబ్ధి కోసం పడుతున్న వెంపర్లాటలో భాగమే అని ఇట్టే అవగతమౌతుంది.  పవన్ కల్యాణ్ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వారు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే.. ఏపీలో ప్రతిపక్షం లేదు. విపక్షంగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పటికీ వారెవరూఅసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు తిరస్కరించినా సరే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నఅసంబద్ధ డిమాండ్ తో అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో విమర్శలు, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే... ప్రభుత్వంపై నాలుగు రాళ్లేసి ముఖం చాటేయడం వినా ఆ పార్టీకి మరో యాక్టివిటీ కనిపించదు. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తినప్పుడు కానీ, ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట విషద సమయంలో కానీ ఆ పార్టీ రాజకీయం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత బాధితులకు స్వాంతన కలిగేలా వ్యవహరించడానికి ఇవ్వలేదు. శవ రాజకీయాల కోసం మాత్రమే ఆ పార్టీ అధినేత కానీ, నాయకులు కానీ బయటకు వస్తున్నారు. మీడియా ముందు మాట్లాడుతున్నారు.  ఇక్కడే పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారు. అంతే రాష్ట్రంలో ప్రతిపక్షం లేని లోటును పూడ్చేందుకు తాను ఉన్నానని చాటారు. ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా పొరపాట్లను ఎత్తి చూపారు. సరిదిద్దుకోవాలన్నారు. సరిదిద్దు కుంటామని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితులకు, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ప్రతిపక్షం లేదు అన్న ప్రజలలో కలగకుండా.. ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్న సంకేతాన్ని పవన్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటామని ఆయన కూటమి ఎన్నికలలో  తిరుగులేని విజయం సాధించిన నాడే చాటారు. ఆయన ప్రకటనను అప్పట్లో చంద్రబాబు కూడా చాటారు. ప్రభుత్వంలో ఉన్నా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన గళమెత్తుతుందనడానికి గతంలోనే ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. 2014 ఎన్నికలలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అప్పడు తెలుగుదేశం ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలే అప్పట్లో మంత్రులను అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల విషయంలో స్పందిచడానికి స్వపర బేధం ఉండదని చాటారు.   ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత లేకున్నా ఆ హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ ఈ ఆర్నెళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పనైనా చేశారా? అంటే లేదు.    ప్రభుత్వానికి ఇప్పటి వరకూ నిర్మాణాత్మక సూచన చేసిన ఉదంతం లేదు. ఇదీ ప్రభుత్వ వైఫల్యం అని ఎత్తి చూపిన ఒక్క సందర్భం లేదు. అసలు ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి, ఆ పార్టీ నాయకుడిగా జగన్ కు ఒక దిశదశ ఉన్నట్లు కనిపించదు.  ఈ పరిస్థితులతో తామే ప్రతిపక్షంగా ఉంటామని కూటమిలోని పార్టీలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగమే తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు. విమర్శలు. ఇది స్వాగతించాల్సిన అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్  ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. మా ప్రభుత్వం తప్పు చేసినా ఎత్తి చూపుతాననీ, సరిదిద్దుకునేలా చేస్తానని అంటున్నారు. ఇందులో తప్పుపట్టాల్సిందేముందని పరిశీలకులు అంటు న్నారు.   అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించారు.  బాధితులకు భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం చేతకాని తనాన్ని గుర్తించి.. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు.  దీనిని స్వాగతించే సంస్కారం వైసీపీకి లేదు. కనీసం  చూసి నేర్చుకోవడానికైనా ప్రయత్నిస్తే మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. 

బాబు మారారు.. ఇదే నిదర్శనం!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కఠిన నిర్ణయాలు తీసుకోరు అన్న అపప్రధ ఉంది. ఆయన సుదీర్ఘ సమీక్షలు, విచారణలూ అంటూ నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం చేస్తారన్న వాదనా ఉంది. అయితే చంద్రబాబు ఇటీవలి కాలంలో పలు మార్లు స్పష్టంగా చెప్పారు. తాను మారాననీ, తప్పు చేస్తే ఇసుమంతైనా ఉపేక్షించబోననీ, తనలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని చంద్రబాబు చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ చంద్రబాబులో మునుపటి మెతకతనం లేదనీ తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించిన విధానం స్పష్టం చేస్తున్నది.  పాలనలో ఇక 1995 నాటి సిఎం ను చూస్తారని చంద్రబాబు ప్రకటించిన సంగతి విదితమే.  తిరుపతి   తొక్కిసలాటలో పలువురు భక్తులు  మృతి చెందడం, మరి కొందరు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఆయన వేగంగా చర్యలకు ఉపక్రమించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి ఎస్పీ, టీటీడీ జేఈవో గౌతమిలపై బదలీ వేటు వేశారు. ఇక్కడ గమనించాల్సినవిషయమేంటంటే తిరుపతి ఎస్పీని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్నారు.  అయినా ఆ ఎస్పీ విధినిర్వహణలో ఒకింత ఉదాశీనంగా వ్యవహరించారని తెలియగానే క్షణం ఆలోచించకుండా బదలీ వేటు వేశారు. ఈ చర్యే చెబుతుంది.. పని విషయంలో చంద్రబాబు ఇసుమంతైనా రాజీపడేందుకు సిద్ధంగా లేరని.  ఇక అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతే కాదు.. త్వరలో టీటీడీ ఈవోపై కూడా బదలీ వేటు పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక టీటీడీలో సమన్వయ లోపం.. అధికారుల వైఫల్యాలపై ఆయన మీడియా ఎదుటే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏం తమాషాగా ఉందా అంటూ గట్టిగా మందలించారు. వీటన్నిటినీ ఉటంకిస్తూ పరిశీలకులు చంద్రబాబు మారారనీ, ఆయనలో 1995 నాటి స్పీడ్ ను మళ్లీ చూస్తున్నామనీ విశ్లేషిస్తున్నారు. 

 పల్లె బాట పట్టిన పట్నం వాసులు.. ఖాళీ అవుతోన్న హైదరాబాద్  

సంక్రాతి పండుగ సందర్భంగా స్కూళ్లకు  వరుస సెలవులు  ప్రకటించడంతో పట్నం వాసులు  పల్లె బాట పట్టారు.  ఇప్పటికే చాలామంది తమ గ్రామాలకు చేరుకున్నప్పటికీ శనివారం  నాడు ఆర్టీసి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో జనాలు కిక్కిరిసి పోయారు.  ఈ నెల11 నుంచి 19 వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. తిరిగి 20 వ తేదీనాడు పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి.  అనేక ప్రభుత్వ, ప్రయివేటు హాస్టళ్ల విద్యార్థులు తమ తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ఆంద్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్బంగా తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సీట్లు దొరకకపోవడంతో నిల్చునే తమ స్వగ్రామాలకు బయలు దేరే పరిస్థితి నెలకొంది. శని, ఆది వారాల తర్వాత హైదరాబాద్ దాదాపు ఖాళీ అయినట్టేనని పరిశీలకులు అంటున్నారు.   విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలపై కిలో మీటర్ల ట్రాఫిక్ స్థంభించింది. చౌటుప్పల్ మంబలంలో పతంగి టోల్ ప్లాజా ,  కేతేపల్లి మండల పరిధిలోని  కోరపహడ్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ స్థంభించింది. 

జగనన్న కాలనీలు కాదు..పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ లు

జగన్ హయాంలో  అంతకు ముందు వరకూ ఉన్న  పథకాల పేర్లను ఇష్టారీతిగా మార్చేసిన విషయం తెలిసిందే.  వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రభుత్వ పథకాలకు అప్పటి వరకూ ఉన్న పేర్లను మార్చేసి వాటికి వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టి కొనసాగించారు. కేవలం పథకాలకే కాకుండా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు, అలాగే విశాఖలో అబ్దుల్ కలామ్ వ్యూపాయింట్ ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చేశారు. ఈ పేర్ల మార్పుపై అప్పట్లోనే పెద్ద ఎత్తున వివాదం రేగింది.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిేన తరువాత జగన్ హయాంలో ఇష్టారీతిగా పేర్లు మార్చి వైఎస్, జగన్ పేర్లు పెట్టుకున్న పథకాల పేర్లను మారుస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే జగనన్న విద్యాకానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా, జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా, వైఎస్ఆర్ కళ్యాణ‌మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యా వసతి పేరును ఎన్టీఆర్ విద్యావసతిగా, జగన్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా, జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్షణ పథకాన్ని ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా  జగనన్న కాలనీల  పేర్లను మార్చింది. జగనన్న కాలనీలను ‘పీఎంఏవై-ఎన్టీఆర్‌’ నగర్‌గా మార్చింది.   ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సందర్శకులకు తలుపులు తెరిచిన సుప్రీం

దేశ సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు సందర్శకులకు తలుపులు తెరిచింది. సుప్రీం కోర్టు ఎలా ఉంటుంది. కేసుల విచారణ ఎలా జరుగుతుంది. అసలా కోర్టులో ఎన్ని బెంచ్ లు ఉన్నాయి. ఏ కేసులు ఏ కోర్టులో విచారణ చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవడానికి, సుప్రీం కోర్టును ఒక్కసారైనా చూడాలనీ, ఆ కోర్టులో వాదనలు జరిగే తీరు చూడాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. సుప్రీం కోర్టులో కొన్ని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారానికి ఇప్పటికే అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు సందర్శకులు ప్రత్యక్షంగా సుప్రీం కోర్టులో విచారణలు వీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రభుత్వ సెలవులు, రెండో, నాలుగో ఆదివారాలు వినా.. ప్రతి శినవారం సందర్శకులకు సుప్రీం కోర్టు సందర్శనకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సందర్శకులను నాలుగు విడతలుగా, విడతకు 40 మంది చొప్పున సుప్రీం కోర్టు  సందర్శనకు అనుమతిస్తారు.  ఉదయం 10 నుంచి 11.30 వరకు, 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు, 3.30 నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు విడతలుగా సందర్శకులను అనుమతిస్తారు. ప్రతి బ్యాచ్ తోనూ ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ సుప్రీం కోర్టు గదులు, జ్యుడీషియల్ మ్యూజియం, న్యాయమూర్తుల గ్రంథాలయాలను చూపుతూ వాటి గురించి వివరాలు తెలియజేస్తారు. అయితే సందర్శకులు సుప్రీం కోర్టులో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి మాత్రం అనుమతించరు. సెల్ ఫోన్ వినియోగాన్ని కూడా అనుమతించరు.  సుప్రీం కోర్టు సందర్శించాలనుకునే వారు ముందుగా ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. వారికి కేటాయించిన స్లాట్ టైమ్ కంటే కనీసం అరగంట ముందు సుప్రీం కోర్టు వద్దకు చేరుకోవాలి.  

పరామర్శ పేర రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాట..మారని జగన్ తీరు!

  తిరుమ‌లలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. సొంత మీడియా ద్వారా, త‌న సోష‌ల్ మీడియా బ్యాచ్ ద్వారా అస‌త్య‌ ప్ర‌చారం చేస్తూ హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు.. ప్ర‌జ‌లు లాగి లెంప‌కాయ కొట్టినా తన బుద్ధి మార‌లేదనీ.. మార‌దని మ‌రోసారి నిరూపించుకున్నారు. జ‌గ‌న్ అహంకారానికి తోడు వైసీపీ నేత‌ల వెకిలి చేష్ట‌లతో తిరుప‌తి ఘ‌ట‌న‌లో బాధితుల ప‌రామ‌ర్శించే స‌మ‌యంలో వారు ప్ర‌వ‌ర్తించిన తీరు ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాన్నికలిగించింది. కొంద‌రు అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా దుర‌దృష్ట‌వ‌శాత్తూ తిరుప‌తి తొక్కిసలాట ఘ‌ట‌నలో ఆరుగురు మృతి చెంద‌టం బాధాక‌ర‌మైన విష‌య‌మే. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే  టీటీడీ, తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యాయి. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టారు. వారికి మెరుగైన వైద్యం అందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుప‌తి వెళ్లి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. టీటీడీ స‌భ్యులు, అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొంద‌రు అధికారుల‌ స‌స్పెండ్  చేశారు. తిరుపతి ఎస్పీ, జేఈవోలను ట్రాన్స్ ఫర్ చేశారు. విచారణ అనంతరం మరి కొందరిపై కూడా వేటు పడే అవకాశాలున్నాయి. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌డంతోపాటు.. వారికి కుటుంబాల్లోని ఒక‌రికి టీటీడీలో ఉద్యోగం  ఇస్తామ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించిన తీరుప‌ట్ల భ‌క్తులు, రాష్ట్ర ప్ర‌జానీకం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అయితే, జ‌గ‌న్ మాత్రం తిరుప‌తి ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు నానా ప్రయత్నాలూ చేసి అడ్డంగా దొరికిపోయారు.  ఏదైనా విషాద ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బాధితుల‌ను ప‌రామ‌ర్శించే స‌మ‌యంలో అధికారుల సూచ‌న‌లు పాటించాలి. హంగూ ఆర్భాటం లేకుండా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాల‌ను తెలుసుకోవాలి. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూటే స‌ప‌రేటు. ఊహించ‌ని ఘ‌ట‌న‌లో బాధితులుగా మారి గాయాల‌తో ఇబ్బందులు ప‌డుతూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లి జ‌గ‌న్‌  హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజు ఉద‌యం నుంచే బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తిరుప‌తికి జ‌గ‌న్ వ‌స్తున్నారంటూ విస్తృత ప్ర‌చారం చేశారు. స్థానిక వైసీపీ క్యాడ‌ర్ భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావాలంటూ సందేశాలు పంపించారు. దీనికితోడు అధికారులు ఇచ్చిన స‌మ‌యం కంటే జ‌గ‌న్ ఆల‌స్యంగా తిరుప‌తి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డే ఉన్నారు. కాస్త వేచి ఉండాల‌ని అధికారులు సూచించినా జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు వారిని లెక్క‌చేయ‌కుండా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వ‌ద్ద‌కు వెళ్లారు. జ‌గ‌న్ తోపాటు దాదాపు ప‌ది మంది వైసీపీ నేత‌లు ఆస్ప‌త్రి సిబ్బంది వారించినా లెక్క‌చేయకుండా తొసుకుంటూ లోప‌లికి వెళ్లారు. ఈ క్ర‌మంలో కొంద‌రి సెలైన్ బాటిల్స్ కూడా ప‌క్క‌కు తోసేశారు. ఐసీయూలోకిసైతం తోసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శ పేరుతో జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ చిన్న‌పాటి రాజ‌కీయ యాత్ర చేశారు.  జ‌గ‌న్ రెడ్డి రాజ‌కీయం ఎంత నీచాతినీచంగా ఉంటుందో ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఏపీ ప్ర‌జ‌లంద‌రూ చూశారు. త‌ల్లిని, చెల్లినిసైతం పార్టీని నుంచి గెంటేసి, వారికి రావాల్సిన ఆస్తినిసైతం ఇవ్వ‌కుండా ముప్పుతిప్ప‌లు పెట్టాడు. అంత‌టితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియాలో త‌ల్లి, చెల్లిపై విష‌ప్ర‌చారం చేయించారు. సొంత బాబాయ్ హ‌త్య విష‌యంలోనూ హంత‌కులుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలిచారు. వారిని త‌న ప‌క్క‌నే తిప్పుకున్నారు. రాజ‌కీయాల‌కోసం ఎంత‌కైనా దిగ‌జారిపోయే జ‌గ‌న్ రెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా ప్ర‌జ‌లు గ‌ట్టి బుద్ధిచెప్పారు. అయినా ఆయ‌న బుద్ధి మార‌లేదు. తిరుప‌తి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించే విష‌యంలోనూ జ‌గ‌న్ తనకు రాజకీయ లబ్ధి వినా మరేం పట్టదనీ, ప్రజలూ, వారి బాధల గురించి పట్టింపే లేదనీ మరో సారు రుజువు చేసుకున్నారు.  జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌కు వెళ్లేందుకు కొద్ది నిమిషాల ముందే ఒక‌రిద్ద‌రు వైసీపీ నేత‌లు 18మంది బాధితుల‌కు తెల్ల క‌వ‌ర్లు ఇచ్చారు. జ‌గ‌న్ వ‌స్తున్నారు,  ఆయ‌న వ‌చ్చిన స‌మ‌యంలో చంద్ర‌బాబు కార‌ణంగానే తిరుప‌తి ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పాలంటూ సూచించారు. బాధితుల‌కు తెల్ల క‌వ‌ర్లు ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రోవైపు.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప్రాధాన్య‌త‌నిచ్చాడు.  తిరుప‌తి ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి కుటుంబాల‌కు, క్ష‌త‌గాత్రుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. టీటీడీ బోర్డులోని కొంద‌రు స‌భ్యులు త‌మ‌వంతుగా స‌హాయం అంద‌జేసేందుకు ముందుకొచ్చారు. ఐదు సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా చేసిన జ‌గ‌న్ రెడ్డికి నిజంగా ఘ‌ట‌న ప‌ట్ల బాధ‌క‌లిగి ఉంటే   మృతుల కుటుంబాల‌కు తన వంతుగా సాయం ప్రకటించి ఉండాలి.  కానీ అలాంటిదేమీ చేయ‌కుండా కేవ‌లం ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు మాత్ర‌మే జ‌గ‌న్‌ ప్ర‌య‌త్నించారు. బాధితుల ప‌రామ‌ర్శ స‌మ‌యంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల తీరును టీవీల ద్వారా వీక్షించిన ప్ర‌జ‌లు.. జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌కు వెళ్లావా.. రాజ‌కీయ యాత్ర‌కు వెళ్లావా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...బిజెపి అభ్యర్థులు వీరే...

తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ  ఎన్నికలకు సంబంధించి  బిజెపి అభ్యర్థులను ప్రకటించింది.  రెండు ఉపాధ్యాయ  ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి  అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాద్యాయ  ఎంఎల్ సి స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి , కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్   ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  స్థానానికి  అభ్యర్థిగా   మల్కా కొమరయ్యను ఎంపిక చేశారు.   కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి    సి అంజిరెడ్డిని ఎంపిక చేశారు. 

అంబటి రాంబాబు పదవి పీకేసిన జగన్.. సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి

అంబటి రాంబాబును వైసీపీ వదిల్చేసుకుంటోందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెన పల్లి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏమిటో చూపిందా? అంటే వైసీపీ శ్రేణులే ఔనని అంటున్నాయి. అయినదానికీ కాని దానికీ ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో, అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు ఇక  సత్తెన పల్లి నియోజకవర్గ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత విస్పష్టంగా చెప్పేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఉరుములేని పిడుగులా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సత్తెన పల్లి నియోజకవర్గ  సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని  ఆ ఉత్తర్తులలో పార్టీ  కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ ఉత్తర్వుల ద్వారా అంబటికి ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పని లేనట్టేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. కంటి తుడుపు చర్యగా ఆయనకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తే ఇవ్వచ్చు కానీ, చెప్పా పెట్టకుండా నియోజకవర్గ సమన్వయకర్త పోస్టు పీకేయడం అంటే అంబటికి అవమానమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అవమానాన్ని దిగమింగుకుని అంబటి పార్టీ తరఫున విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తన నోటి దూల తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోవచ్చు. ఆయన మాట్లాడకపోయినా పార్టీ పట్టించుకోదు.  

చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసును క్వాష్ చేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం (జనవరి 10)  తొసిపుచ్చింది. ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి  సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.  దీనిని కొట్టివేయాలంటూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా  హైకోర్టు ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14)   తనపై దుండగులు దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పింది. స్కూలు నుంచి తిరిగి వస్తుంటే ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు తనను అడ్డుకుని, మత్తుమందు తాగించారని తెలిపింది. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సదరు బాలిక చదివే స్కూలుకు వెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై  స్పందించిన పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. అయితే, బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.  కాగా హైకోర్టు  చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చడంతో  పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించాలని చెవిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.  

ఉత్తరాంధ్రలో దిక్కూమెక్కూలేని వైసీపీ

కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిన వైసీపీకి ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కోసం పని చేయడానికి సీనియర్లెవరూ పెద్దగా సుముఖత చూపడం లేదు. కొత్తవారెవరూ కనీసం పార్టీ వైపు దృష్టి పెట్టడం లేదు. ఆ పార్టీ కార్యక్రమాలన్నీ పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోయిన పరిస్థితి ఉంది.  అధికారంలో ఉన్నంత కాలం అంతా మేమే అన్నట్లుగా బోర విరుచుకు తిరిగిన వైసీపీయులెవరూ ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీకి ఇప్పుడు దిక్కూమొక్కూ లేని పరిస్థితి నెలకొంది. ఇంత కాలం ఆ పార్టీలో సీనియర్ లుగా చెలామణి అయిన నేతలెవరూ కూడా పార్టీ కార్యాలయం వైపు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. పలు నియోజకవర్గాలలో పార్టీకి అసలు కోఆర్డినేటరే లేని పరిస్థితి ఉంది. ఎవరినైనా నియమించాలన్నా దొరకని పరిస్థితి.  ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ జిల్లాల పర్యటన వాయిదా పడటంతో సరిపోయింది కానీ, లేకుంటే ఆ పార్టీ దయనీయ స్థితి మరింతగా ప్రస్ఫుటమై ఉండేది. ఇక ఎలాంటి మార్గదర్శనం, దిశా నిర్దేశం లేకపోవడంతో ఉత్తరాంధ్రలో పార్టీ క్యాడర్ కూడా నిస్తేజంగా మారిపోయింది. ఆ పార్టీ ఇటీవల విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం అట్లర్ ప్లాప్ కావడానికి కార్యకర్తలెవరూ ముందుకు రాకపోవడమే కారణం. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయవాడ ఈస్ట్ నుంచి పరాజయం పాలైన తరువాత నుంచీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. నియోజకవర్గ కోఆర్డినేటర్ అయి ఉండి కూడా పార్టీకి ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో కోఆర్డినేటర్ ను నియమించాలని పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. కాగా వైసీపీ నాయకురాలు, జీవీఎంసీ మేయర్ గోలాగని హరి వెంకట కుమారి, మరో నేత మొల్లి అప్పారావులు నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవిపై కన్నేసినప్పటికీ, పార్టీ అగ్రనాయకత్వం వారి పట్ల సానుకూలంగా లేని పరిస్థితి ఉంది.  ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధినేత జగన్ ఆదేశించినా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తి చూపడం లేదు, తనను పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్తగా  నియమించాలని కోరుతున్నారు. పెందుర్తి కాకుంటే అనకాపల్లి అయినా ఫరవాలేదని చెబుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విజయనగరం జిల్లా పరిస్థితి కూడా అలాగే ఉంది.  జడ్పీ చైర్మన్ S చిన్న శ్రీను ఎస్ కోట, లేదా ఎచ్చెర్ల నియోజకవర్గానిక కోఆర్డినేటర్ గా ఉండాలని ఆశపడుతుంటే.. పార్టీ అధిష్ఠానం ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజవకర్గాలకు సమన్వయకర్తలుగా పని చేయడానికి పార్టీ సీనియర్లెవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అనివార్యంగా ఆ బాధ్యతలను అప్పగించడానికి పార్టీ హైకమాండ్ కొత్త ముఖాలను అన్వేషిస్తున్నది.   

టీటీడీ ఈవో శ్యామలరావుపై,జేఈవో వెంకయ్య చౌదరిపై బదిలీ వేటు?

తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్లుగా కనిపిస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు ఒకే రోజు తిరుపతిలో పర్యటించిన తెలుగుదేశం, అధినేత ముఖ్యమంత్రి, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తమదైన శైలిలో ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునే విషయంలో అధికారుల కంటే ప్రత్యక్ష సాక్షులు, ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంఘటనకు బాధ్యులు ఫలానా వారని చెప్పకుండానే.. మీడియా సమక్షంలోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఎస్పీపై అయితే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పద్ధతి మార్చుకోరా? ఏం తమాషాగా ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  మరో వైపు పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాటకు బేషరతు క్షమాపణలు చెప్పారు. బాధితులను ఆదుకుంటామనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనీ చెబుతూనే.. టీటీడీలో వీఐపీ యాటిట్యూడ్ మారాలని కుండబద్దలు కొట్టారు. ఈ ఘటనకు ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిల మధ్య సమన్వయ లోపమే కారణమని ఎత్తి చూపారు. అలాగే పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొందరు పోలీసులు బాధ్యతగా వ్యవహరించినా, కొందరు మాత్రం తొక్కిసలాట సమయంలో ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.  ఇక పోతే తిరుపతి తొక్కిసలాటకు ఎవరు కాదన్నా, ఔనన్నా బాధ్యత వహించాల్సింది మాత్రం తిరుమల తిరుపతి దేవస్ధానమే.  టీటీడీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సంగతి సీఎం సమీక్షలోనే ప్రస్ఫుటంగా బయటపడింది.  ఆ సమీక్షలో ఏకంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావులు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.  ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవోపై చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ మందలించారు.   టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావుల మధ్య సమన్వయం లేదన్న వార్తలు గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. పాలకమండలి సభ్యులే ప్రైవేటు సంభాషణల్లో పలు మార్లు ఈ విషయంపై చర్చించుకున్నారు.  ఆ కారణంగానే వైకుంఠ ద్వార దర్శనం టోకోన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రం తలుపులు ఎప్పుడు తెరవాలి, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను ఎలా నియంత్రించాలి అన్న దానిపై ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేయడంతో, ఈ విషయంలో పనుల పరిశీలన, సమీక్షల్లో కూడా ఎవరి దారి వారిదే, ఎవరిగోల వారిదే అన్నట్లుగా సాగడంతో కింది స్థాయి అధికారులలో గందరగోళం ఏర్పడిందంటున్నారు.   తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేయీవో గౌతమిలపై ప్రభుత్వంబదిలీ వేటు పడింది.  టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి  శ్రీధర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించానే కారణంతో ఆయననూ బదిలీ చేశారు. ఇక ప్రాథమిక నివేదికలో తొక్కిసలాటకు కారణం డీఎస్పీ రమణ బాబు అన్న కలెక్టర్ నివేదికతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత మందిపై చర్యలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ లో సమన్వయం లేకుండా వ్యవహరించిన ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రత కంటే తమ సొంత ఇగో శాటిస్ ఫ్యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన టీటీడీ పాలకమండలి సభ్యుల నుంచి బలంగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిరువురిపై కూడా బదలీ వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. 

నిన్న అరవింద్ కుమార్... నేడు బిఎల్ ఎన్ రెడ్డి...ఎసిబి విచారణ కంటిన్యూ

ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం గంటగంటకు మారుతుంది. నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ ను    ఎసిబి విచారణ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎసిబి విచారించింది. మాజీమంత్రి కెటీఆర్ ఆదేశం మేరకు  విదేశీ సంస్థకు తాను నిధులు మళ్లించినట్టు ఆయన ఒప్పుకున్నారు. మళ్లీ మేమే అధికారంలో వస్తాం. అనుమతులు అవసరం లేదని కెటీఆర్ తనతో అన్నట్టు అరవింద్ కుమార్ వెల్లడించారు. తాజాగా శుక్రవారం ఈ కేసులో ఎ 3 గా ఉన్న చీప్ ఇంజినీర్ బిఎల్ ఎన్ రెడ్డి  ఎసిబి విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ , కెటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా బిఎల్ ఎన్ రెడ్డి ని విచారిస్తున్నారు. ఎసిబి  అధికారుల ప్రశ్నలకు బిఎల్ ఎన్ రెడ్డి సహకరించడం లేదని తెలుస్తోంది.