మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు: ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ్ ను ఏపీ సీఐడీ  అరెస్టు చేసింది.  పలమనేరులో సోమవారం గౌతమ్ తేజ్ ను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయనను చిత్తూరు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి గౌతమ్ తేజ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.     మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. అసలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధం అయిన సంఘటనపై తొలి నుంచీ వైసీపీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు  గతంలోనే కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి కేసులు నమోదైన వారిలో   వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు అప్పట్లోనూ కర్నూలు రేంజ్ డీఐజీ తెలిపారు. ఆ తరువాత నిందితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. ఆ సోదాలలో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా నివాసం నుంచి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. అలాగే  వెంకటాచలపతి నివాసం నుంచీ కీలకమైన పది ఫైళ్లను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి. ఇక మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు అప్పట్లోనే ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు.   ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల  ట్యాంపరింగ్, దొంగతనం, చోరీ సొత్తు కలిగి ఉండటంతో పాటు సాక్ష్యాలు మాయం చేయడం, నిందితులకు సహకరించడం వంటి ఆరోపణలపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు  చేశారు. మొత్తంగా మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదలీ చేసింది. ఇప్పుడు సీఐడీ అధికారులు గౌతమ్ తేజ్ ను అరెస్టు చేయడంతో ఈ ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్న సూత్రధారుల గుట్టు బయటపడే అవకాశాలున్నాయి. 

ఏపీలో నాలుగు కోతుల ఫ్లెక్సీలు.. వైసీపీకి స్ట్రాంగ్‌ కౌంట‌ర్‌!

మ‌నిషి రోజువారి జీవితంలో సోష‌ల్ మీడియా ఓ భాగం అయిపోయింది. చిన్న పిల్ల‌ల నుంచి ముస‌లి వారి వ‌ర‌కు రోజుకు కొన్ని గంట‌లు సోష‌ల్ మీడియాలో నిమ‌గ్న‌మై పోతున్నారు. దీనిద్వారా అనేక లాభాలు ఉన్నాయి. చ‌దువుకునే వారి నుంచి వ్యాపార రంగం, రాజ‌కీయ రంగం.. ఇలా ఏ రంగంలోని వారైనా సోష‌ల్ మీడియా ద్వారా మ‌రిన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకునే వీలుంటుంది. చాలా మంది దీనిని మంచి మార్గంలో వినిగించుకుంటుంటే.. కొంద‌రు మాత్రం సోష‌ల్ మీడియాను చెడుకు ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో సోష‌ల్ మీడియా ద్వారా అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం, మార్ఫింగ్ ఫొటోల‌తో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర్చ‌డం వంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా చోటు చేసుకున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం వీటిని పెంచిపోషించింది.  అంతేకాదు.. ఇందుకోసం కొంత‌మందిని నియ‌మించుకొని ప‌ని క‌ట్టుకొని ప్ర‌తిప‌క్ష పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, వారి ఇళ్ల‌లోని ఆడ‌వారిపై బూతుల‌తో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి ఇబ్బందులు గురిచేశారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం ఆగ‌డాల‌తో ప‌లువురు ఆత్మ‌హ‌త్య‌లకు సైతం పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటుంబాల్లోని ఆడ‌వారిపై అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో పోస్టులు పెట్టారు.  వైఎస్ కుటుంబాన్నికూడా వ‌ద‌ల్లేదు. వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ ష‌ర్మిలపైనా, వారి కుటుంబ స‌భ్యుల‌పైనా వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టారు. వీటిపై అనేక ఫిర్యాదులు అందిన‌ప్ప‌టికీ అప్ప‌టి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. వారిని ప్రోత్స‌హించింది. అస‌భ్య‌క‌ర పోస్టుల‌పై ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా ష‌ర్మిల‌సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  అయితే, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవారిపై కొర‌డా ఝుళిపిస్తున్నది. ఈక్ర‌మంలో కొంద‌రు అరెస్టుఅయ్యారు.  తాజాగా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై  ప్ర‌భుత్వం క్యాంపెయిన్  చేప‌ట్టింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవారికి చెక్ పెట్టేలా చ‌ర్య‌లు ప్రారంభించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా దూషించే, రెచ్చగొట్టే పోస్ట్‌లను షేర్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పోలీస్ శాఖకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా.. ప్రత్యేకమైన, ఊహించని ప్రచారంతో ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. అమరావతి, గుంటూరు, విజయవాడతో సహా ఏపీ రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఆసక్తికరమైన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.  నాలుగు మంకీస్ బొమ్మల‌తో చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, వారి కుటుంబాలపై సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో ఇబ్బందులు పెట్టిన వారిప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని కూట‌మి ప్ర‌భుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.   ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మం ప‌ట్ల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. సోష‌ల్ మీడియాను మంచికోసం వాడుదాం.. అస‌త్య ప్ర‌చారాల‌కు, స్వ‌స్తి ప‌లుకుదాం అంటూ పెద్ద పెద్ద పోస్ట‌ర్ల ద్వారా విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో వీటిని రూపొందించారు. కొంద‌రు సినీ ప్ర‌ముఖులుసైతం ముందుకొచ్చి సోష‌ల్ మీడియాను మంచికోసం వినియోగిద్దాం.. చెడు పోస్టుల‌కు దూరంగా ఉందాం అంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా యూజర్లను చైతన్యపరిచేలా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. అదేస‌మ‌యంలో ఆలోచింపజేస్తున్నాయి.

కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ కేసులో విస్తుపోయే నిజాలు ...

 తెలుగు రాష్ట్రాల్లో  సెన్సేషనల్ అయిన కామారెడ్డి జిల్లాలో ట్రయాంగిల్ సుసైడ్ కేసులో మరో ట్విస్ట్ చేటుసుకుంది. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి  సింధు శర్మ ఎదుట  పెద్ద పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , శృతి పెళ్లి చేసుకోవాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.  కానీ ఎస్ ఐ సాయికుమార్ అడ్డుపడ్డాడు. ఎస్ఐ సాయికుమార్ తో శృతి అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆధారాలు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తన భర్త అక్రమ సంబంధంపై ఎస్ ఐ భార్య మహలక్ష్మి  ప్రతీరోజు గొడవపడేది. కానిస్టేబుల్ తో ఉన్న అక్రమ సంబంధాన్ని భర్తను నిలదీసేది మహలక్ష్మి.  నేను విడాకులు ఇవ్చవకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని పలుమార్లు హెచ్చరించింది మహలక్ష్మి.  చట్టబద్దంగా ఈ పెళ్లి చెల్లదు అయినా తనను  పెళ్లి చేసుకోవాలని శృతి  సాయికుమార్ పై వత్తి డి తెచ్చింది.  ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి    మూడేళ్ల కొడుకుతో మహలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం మహలక్ష్మి గర్బవతి. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో  మనస్థాపం చెందిన  ఎస్ ఐ సాయికుమార్ నిఖిల్, శృతితో గొడవపడ్డాడు. ఎస్ ఐ కంటే ముందే శృతికి నిఖిల్ తో ప్రేమ వ్యవహారం ఉంది.  పెళ్లి చేసుకోవాలనే సమయంలో ఎస్ఐ సాయికుమార్ విలన్ గా మారాడు. నాతో రిలేషన్ లో ఉన్నప్పుడు నిఖిల్ ను ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని నిలదీశాడు. ఎస్ ఐ ని పెళ్లి చేసుకోవడానికి శృతికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే సాయికుమార్ భార్య ఒప్పుకోకపోవడంతో వీరి ఫిజికల్ రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడలేదు. దీంతో శృతి పెళ్లికాని నిఖిల్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. శృతికి పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. బీబీ పేటలో ఒంటరిగా ఉంటోంది. ఎస్ ఐ సాయికుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో నిఖిల్ ఎస్పిని ఆశ్రయించాడు. సాయికుమార్ తరపున ఒక సిఐ , ఎస్ఐ మధ్యవర్తిగా ఉంటూ సమస్యను పరిష్కారం చేయాలనుకున్నారు.  కానీ ఎస్ఐ స్వయంగా రంగంలో దిగాడు. శృతి, నిఖిల్ ను పెద్ద చెరువు వద్దకు రమ్మన్నాడు. అర్దరాత్రి సమయంలో  ముగ్గురి మధ్యమాటామాటా పెరగడంతో శృతి చెరువులో దూకేసింది. శృతిని రక్షించడానికి నిఖిల్ , వీరిద్దరిని రక్షించడానికి సాయికుమర్ నీళ్లలో దూకాడు ఈత రాకపోవడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసు శాఖ పరువు పోతుందన్న భయంతో ఉన్నతాధికారులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. .  చట్టాన్ని రక్షించాల్సిన శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం డిపార్ట్ మెంట్ కే కళంకం తెచ్చింది.  

మంగళగిరిలో తెలుగుదేశం సభ్యత్వాలు లక్ష దాటాయి.. లోకేష్ మరో ల్యాండ్ మార్క్!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో ఘనత సాధించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ను విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాయకీ లేని నియోజకవర్గంగా ముద్రపడిన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి సారి పరాజయం పాలైన లోకేష్.. పార్టీ అధినేత కుమారుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండో సారి సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉండి కూడా.. పోయిన చోటే వెతుక్కుంటాను.. అపజయం ఎదురైన చోటే విజయ కేతనం ఎగురవేసి సత్తా చాటుతానని పట్టుబట్టి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  2019 ఎన్నికలలో మంగళగిరిలో ఎదురైన పరాభవాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ తరువాత ఐదేళ్ల పాటు మంగళగిరి నియోజకవర్గాన్నే తన నివాసంగా మార్చుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వినా మరెన్నడూ నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అందరివాడు అనిపించుకున్నారు. విజయం తరువాత కూడా ప్రజాదర్బార్ లతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని ఆయన చూరగొన్న ఫలితమే నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ సభ్వత్వాల సంఖ్య లక్ష దాటింది. అంతే కాకుండా తెలుగుదఏశం శాశ్వత సభ్వత్వాల విషయంలో కూడా మంగళగిరి నియోజకవర్గమే టాప్ లో నిలిచింది.   పార్టీ సభ్వత్వాలను నజరానాలతోనూ, ముడుపులతోనూ చేయించడం సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. ఎవరైనా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఆ వ్యక్తికి పార్టీ పట్ల అపేక్ష, అభిమానం ఉండాలి. లోకేష్ జనంతో మమేకమై వారి విశ్వసనీయత పొందడం వల్లనే నియోజకవర్గంలో జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో అరవై ఆరు శాతం ఓట్లు లోకేష్‌కు పడ్డాయి. దాదాపుగా లక్షా డెభ్బై వేల ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు. కానీ వారిలో లక్ష మందికిపైగా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబంలో సభ్యులయ్యారు.  కార్యకర్తలకు లోకేష్ అండగా ఉంటారన్న భరోసా కలగడంతోనే ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు.. అల్లు అర్జున్ పై పవన్ కల్యాణ్ విసుర్లు

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే అది పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలు, తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల చర్చ అంశాలపైనే. కాగా ఈ అంశంపై తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఎలాంటి భేషజాలకూ పోకుండా ఈ సంఘటనపై ఆయన స్పందన చాలా ముక్కుసూటిగా ఉంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి ఆయన ఎవరినీ బాధ్యులను చేయలేదు. అదే సమయంలో ఎవరికీ మద్దతుగా మాట్లాడలేదు. కానీ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఈ విషయంలో అల్లు అర్జున్ తీరును ఆయన తప్పుపట్టారు. సరిగా స్పందించడంలో విఫలమై అల్లు అర్జున్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. అల్లు అర్జున్ లేదా ఆయన ప్రతినిథులు ఎవరో ఒకరు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ఉండాల్సిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు వంటివి పరిశ్రమను ప్రోత్సహించడానికి దోహదపడతాయేమో కానీ.. అలా ప్రోత్సహించడం కోసం శాతి భద్రతల విషయంలో రాజీ పడటం సరైనది కాదనీ, అందుకే రేవంత్ వ్యవహరించిన తీరు నిష్పాక్షికంగా ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కారని రేవంత్ చాటారనీ, హీరోలైనంత మాత్రాన వారేం పైనుంచి దిగి రాలేదని   రేవంత్ నిరూపించారని చెప్పారు.   చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమా ప్రదర్శనలు చూసేవారనీ, అయితే ఆయన చాలా సాదా సీదాగా, ఎవరి కంటా పడకుండా థియేటర్ కు వెళ్లేవారని వివరించిన పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ ఆర్భాటంగా సంధ్యా థియేటర్ కు రోడ్ షో చేస్తూ వెళ్లడమే తొక్కిసలాటకు కారణంగా కనిపిస్తోందన్నారు. సంఘటన జరిగిన తరువాత  అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సమస్యను పెద్దది చేసిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై చంద్రబాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఒక్క సారిగా జోరందుకుంది. అలాగే నిర్మాత దిల్ రాజు ఆహ్వానం మేరకు ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఒక సమయంలో ఆయన బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు వంటివి సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని, అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ కూడదని అనడంతో కొన్ని షరతులతో ఏపీ సర్కార్ సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు.   

అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు 

సంధ్య థియేటర్ ఘటనలో  సినీ హీరో అల్లు  అర్జున్ గోరుతో పోయేది గొడ్డలితో తెచ్చుకున్నాడని  ఎపి డిప్యూటి సిఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన రేవతి కుటుంబాన్ని  పరామర్శించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసుల పనితీరును తప్పు పట్టలేమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అయితే కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యడు కాదని పుష్ప టీం నుంచి  ఎవరో ఒకరు పరామర్శించి ఉంటే వివాదం ఇంత ముదిరేదికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లు అర్జున్ కు   మానవతా దృక్పథం లోపించడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. క్రిందిస్థాయి నుంచి ఎదిగిన నేత రేవంత్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.  ఎపి ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా కుటుంబం వర్ససె అల్లు అర్జున్ వివాదం మళ్లీ రచ్చయ్యింది.  అప్పట్లో అల్లు  అర్జున్ వైకాపాకు సపోర్ట్ చేయడం, మెగా కుటుంబాన్ని పక్కకు పెట్టడంతో విభేధాలు మరింత ముదిరాయి. సంధ్య థియేటర్ వివాదం సద్దుమణిగిందని అనుకునే సమయంలోనే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ తో వివాదం మరింత ముదిరింది. 

ఇది అక్కినేని శత జయంతి సంవత్సరం.. అందుకే?

ప్రధాని నరేంద్రమోడీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశ వాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆయన తన మన్ కీ బాత్ లో కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావించి వారు ఆయా రంగాలలో దేశానికి చేసిన సేవలను ప్రస్తుతించారు. అందులో భాగంగానే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు ప్రస్తావించి దేశ సంస్కృతి, విలువలకు అద్దం పట్టేలా అద్భుతమైన సినీమాలు చేశారని ప్రశంసలు గుప్పించారు. అక్కినేనితో పాటుగా ఆయన బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ అని చెప్పుకోదగ్గ రాజ్ కపూర్, అలాగే అద్భుత గాయకుడు మహ్మద్ రఫీ తదితరుల పేర్లు కూడా ప్రస్తావించారు.  దీంతో తెలుగు రాష్ట్రాలలో కొందరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు విస్మరించారంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టేశారు. ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ మోడీ తెలుగుదేశం పార్టీని ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదనీ, అందుకు తార్కానం తన మన్ కీబాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మాత్రమే ప్రస్తావించి, ఎన్టీఆర్ ను విస్మరించారనీ విష ప్రచారం మొదలు పెట్టేశారు.  ఇక్కడ వారు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన విషయమేమిటంటే.. ఇది ఏఎన్నార్ శత జయంతి సంవత్సరం. అలాగే నటుడు రాజ్ కపూర్, గాయకుడు మహ్మద్ రఫీల శతజయంతి సంవత్సరం కూడా. అందుకే ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో వారి పేర్లు ప్రస్తావించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.  అయితే మోడీ మన్ కీబాత్ ను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి కుత్సితత్వాన్ని బయట పెట్టుకున్నారు. తెలుగు సీని పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల వంటి వారు. నటన విషయంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువా అని చెప్పడానికి అవకాశం లేదు.  

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే మాట!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం (డిసెంబర్ 30) జరిగింది. మాజీ ప్రధానమంత్రి, దివంగత మన్మోహన్ సింగ్ కు సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ఒక వింత చోటు చేసుకుంది. సభలోనూ బయటా కూడా ఉప్పూ నిప్పులా ఉంటున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒకే మాట చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తన ప్రసంగంలో కేటీఆర్ చెప్పారు.  కాగా సభలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో    తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలని.. మంచి ప్రదేశంలో ఆయన విగ్రహం పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి  మన్మోహన్ సింగ్ దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ ప్రశంసించారు.  మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తు చేసిన ఆయన  రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ కృషిని విస్మరించలేమన్నారు.  ఉపాధి హామీ, ఆర్టీఐ, ఆధార్ లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానిది అని కొనియాడారు. సరళీకృత విధానాలతో భారత్‌ ప్రపంచంతో పోటీ పడేలా చేశారని.. దేశానికి విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈ తరంలో మన్మోహన్‌ సింగ్‌తో పోటీపడేవారే లేరని రేవంత్ పేర్కొన్నారు. అనంతరం ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ మాట్లాడిన కేటీఆర్.. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్న రేవంత్ ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులనీ, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందనీ చెప్పారు.    

మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో... నేడు నింగిలోకి  స్పాడెక్స్ ప్రయోగం

మరో ప్రయోగానికి  ఇస్రో సిద్దమైంది. పీఎస్ ఎల్ వి  సి 60స్పాడెక్స్ మిషన్  రాకెట్ ద్వారా మరికొద్ది గంటల్లో నింగిలోకి   రెండు ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడానికి ఇస్రో సిద్దమైంది. సాంకేతికత అభివృద్దే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 8. 58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 25  గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. సోమవారం రాత్రి 9. 58 గంటలకు శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి రెండు ఉపగ్రహాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిని దిగువ కక్ష్యలో అనుసంధానం చేయనున్నారు. ఖగోళ ప్రయోగాల్లో అద్బుత విజయాలను మూట గట్టుకున్న ఇస్రో ఈ ప్రయోగం విజయం సాధించనుందని ఆశిద్దాం. 

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్.. దిల్ రాజు భేటీ ఆంతర్యమదేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పిన నేపథ్యంలో దిల్ రాజు పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ ఛేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ నటించిన  డాకూ మహరాజ్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో దిల్ రాజు, పవన్ కల్యాణ్ తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   అంతే కాకుండా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు దిల్ రాజే స్వయంగా నిర్మాత కావడంతో ఈ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించేందుకే దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పవన్ కల్యాణ్ ఇచ్చే డేట్ ను బట్టి ఏపీలోనే నిర్వహించాలన్న మేగాస్టార్ చిరంజీవి సూచన మేరకే దిల్ రాజు పవన్ తో భేటీ అయ్యారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు?!

అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం (డిసెంబర్ 30) విచారించనుంది. కాగా అల్లు అర్జున్ కు బెయిలు నిరాకరించాలని కోరుతూ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. గత విచారణ సందర్భంగానే కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరడంతోనే నాంపల్లి కోర్టు విచారణను మంగళవారానికి (డిసెంబర్ 30) వాయిదా వేసింది. పుష్ప2 సినిమా బెనిఫిట్ ఫో సందర్భంగా  సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ కు ఆదేశిందించి. అయితే అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసుకున్న క్వాషష్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిలు పిటిషన్ విచారణ జరుగుతోంది. పోలీసులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసిన తరువాత అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై విచారణ జనవరి 10 జరగనుంది.  

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీకార్టర్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి  పురస్కార గ్రహీత జిమ్మీ కార్ట‌ర్ క‌న్నుమూశారు.  ఆయ‌న వ‌య‌సు వంద సంవ‌త్స‌రాలు.. కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని తన నివాసంలో   తుదిశ్వాస విడిచారు.  1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన జిమ్మీ కార్టర్  శాంతి, మానవ హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడారు.  1924 అక్టోబ‌ర్ 1న జ‌న్మించిన జిమ్మీ కార్ట‌ర్‌.. ఈ ఏడాది త‌న వందో  జన్మదిన వేడుకలను ఘ‌నంగా జ‌రుపుకున్నారు.   అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల‌ పట్ల ఎంతో నిబద్ధతతో పని చేశారు. ఇజ్రాయెల్-ఈజిప్ట్ మధ్య  శాంతి ఒప్పందం కుదరడంలో కీలకంగా వ్యవహరించారు.   అధ్యకుడిగా దిగిపోయిన త‌ర్వాత‌ 1982లో ‘కార్టర్ సెంటర్‌’ను స్థాపించిన జిమ్మీ కార్టర్  సామాజిక, ఆర్థిక న్యాయం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన కృషికి గుర్తింపుగా  2002 నోబెల్  జిమ్మీ కార్టర్ ను శాంతి బహుమతి వ‌రించింది. న్యాయం, ప్రేమ వంటి ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలు తన అధ్యక్ష పదవికి పునాదిగా నిలిచాయని ప‌లు సంద‌ర్భాల్లో  జిమ్మీ కార్టర్ చెప్పారు. నేవీ ఉద్యోగిగా, గ‌వ‌ర్న‌ర్‌గా, అధ్యక్షుడిగా అన్నింటికీ మించి ఓ మాన‌వ‌తావాదిగా జిమ్మీ కార్టర్ మానవాళికి చేసిన సేవలు విస్మరించలేనివి. 

తెలంగాణ పోలీసు శాఖ లోగో మారింది!

తెలంగాణ పోలీసు శాఖ లోగో మారింది. మారిన లోగోను పోలీసు శాఖ విడుదల చేసింది. తెలంగాణ పోలీసు శాఖ ట్విట్టర్ లో కొత్త లోగోను పోస్టు చేసింది. పాతలోగోకు కొత్త లోగోకు కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. గత లోగోలో  తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉంటే.. ఈ కొత్త లోగోలో కేవలం తెలంగాణ పోలీస్ అని మాత్రమే ఉంది.   రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పతనమై కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లలో కీలక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా గతంలో తెలంగాణ రాష్ట్ర అంటే టీఎస్ అని అధికారిక చిహ్నాలలో ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణ అంటే టీజీగా మార్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు  గతంలో  టీఎస్( పేరును తొలగించి, టీజీ గా మార్పులు చేశారు. అదే దారిలో ఇప్పుడు  తెలంగాణ పోలీస్ కూడా తమ శాఖకు సంబంధించిన అధికారిక చిహ్నంలో  ఆ మేరకు మార్పులు చేసింది.  గత లోగోలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్  తొలగించి.. తెలంగాణ పోలీస్ అనే పేరుతో కొత్త లోగోను విడుదల చేసింది. 

కేటీఆర్ అరెస్టు అయితే.. తెలంగాణ సమాజం స్పందన ఎలా ఉంటుంది?

ఫార్ములా ఈ  కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ఆయన అరెస్టు కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్టైతే పరిస్ధితి ఏమిటి? అందరూ అనుకుంటున్నట్లుగా హరీష్ ఇక పార్టీపై పూర్తి పెత్తనం తీసుకుంటారా? లేక దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? లేక.. ఇటీవలి కాలంలో కొద్దిగా చురుకుగా కనిపిస్తున్న కవిత పార్టీపై పట్టు సాధిస్తారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నాయి.  అయితే దానిని పక్కన పెడితే  ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించి ఫార్ములా-ఇ రేసింగ్ కోసం చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాజీ మంత్రి కె. తారక రామారావుకు సమన్లు ​​జారీ చేసింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనవరి 7న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంతలో, కెటిఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దాని కంటే ముందు అంటే మంగళవారం (డిసెంబర్ 31)తో కేటీఆర్ కు కోర్టు ఇచ్చిన అరెస్టు నుంచి మినహాయింపు ముగుస్తుంది.  కోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేయకుంటే  ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.  అదే జరిగితే రాష్ట్రం అట్టుడికిపోతుందా? ఆందోళనలు మిన్నంటే అవకాశం ఉందా?  క్వాష్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహంలా  కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా ప్రజలు స్పందిస్తారా?  అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.  కెటిఆర్ విషయంలో ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం లేదన్న భావనే పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతోంది.   కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో సొమ్ముల బదలాయింపుతో తనకు సంబంధం లేదని టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకువచ్చి అధికారులను బలిపశువులను చేసైనా తాను బయటపడాలని భావిస్తున్నారు. అంతే తప్ప అక్రమంగా సొమ్ముల బదలాయింపు జరగలేదని చెప్పడం లేదు. అన్నిటికీ మించి తాను అరెస్టు కావడం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అవగతమౌతున్నది. దీంతో ఆయన ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. ఆయనను అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి అరెస్టు చేశారు. అరెస్టుకు కారణాలు కూడా చూపలేదు. అరెస్టు చేసిన తరువాత స్కిల్ కేసులో ఆయన పేరు చార్జిషీట్ లో పెట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు స్కిల్ విషయంలో ఎలాంటి తప్పూ జరగలేదన్న వాదనకే నిలబడ్డారు. అయితే కేసీఆర్ తప్పు జరగలేదని గట్టిగా చెప్పడం లేదు. తప్పు జరిగిందనీ, అయితే ఆ తప్పుకు తాను బాధ్యుడిని కాననీ చెప్పుకుంటున్నారు.  ఇక్కడ గతంలో కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు కూడా ప్రజల నుంచే కాదు, పార్టీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆమె అరెస్టు కూడా అనూహ్యంగా ప్రాపర్ విచారణ లేకుండా జరగలేదు. నోటీసులు ఇచ్చారు. పలు మార్లు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏసీబీ, ఈడీలు ఆయనకు నోటీసులు ఇచ్చాయి. సోమ్ము అక్రమ తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతున్నది. దీంతో కేటీఆర్  అరెస్టు విషయంలో నిరసనలు వ్యక్తమైనా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేంత స్థాయిలో ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎస్ విజయానంద్

ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్  పదవీ కాలం మంగళవారం (డిసెంబర్ 31)తో ముగియనుంది. దీంతో  ఆయన స్థానంలో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఇక నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారా? అన్న చర్చ జరిగినప్పటికీ, ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. సీనియారిటీ జాబితా ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆ పదవి చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ఆమెకు ఆ పదవి దక్కే అవకాశం లేదు. జగన్ హయాంలో ఆ పార్టీ కార్యర్తగా ఆమె తన హోదాను, పదవిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదీ కాక జగన్ ప్రభుత్వం పతనమైన తరువాత రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సీఎస్ రేసులో శ్రీలక్ష్మి చీఫ్ సెక్రటరీ పదవి కోసం మొత్తం ఎనమిది మంది సీనియర్ ఐఏఎస్‌లు  సీఎస్ రేసులోనే లేకుండా పోయారు.  ఇక మిగిలిన వారిలో ఆర్పీ సిసోడియా, అనంత రాము,  అజయ్ జైన్, సాయిప్రసాద్, సుమితా దావ్రా, విజయానంద్, రాజశేఖర్‌ ఉన్నారు. వీరిలో ప్రముఖంగా 1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్, 1991 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు చంద్రబాబు పరిశీలించారని సమాచారం. వీరిరువురిలో కూడా చంద్రబాబు 1992 బ్యాచ్ కు చెందిన కే. విజయానంద్ వైపే మొగ్గు చూపారు.    1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కె విజయానంద్ 1993లో అదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా కేరీర్ ప్రారంభించారు. తరువాత 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1996 నుండి గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజక్ట్ డైరెక్టర్‌గా, తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా  పనిచేశారు.  2008లో ప్లానింగ్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విజయానంద్‌ భాద్యతలు నిర్వహించారు.  విజయానంద్ 2022 నుండి ఏపి జెన్ కో ఛైర్మన్‌గా 2023 నుండి ఏపి ట్రాన్స్ కో ఛైర్మన్ అండ్ ఎండిగా, ఎనర్జీ డిపార్టమెంట్ స్పెషల్ సిఎస్‌గా పనిచేశారు. దీంతో పాటు ఎనర్జీ డిపార్టమెంట్ సెక్రటరీగా ఏపిపిసిసి, ఏపిఎస్పిసిఎల్, ఎన్ఆర్ఈడీసిఏపి, ఏపిఎస్ఈసిఎమ్ ఛైర్మన్‌గా  భాద్యతలు నిర్వహించారు. దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీకి ఛైర్మన్‌గా 2023-24 కు వ్యవహరించారు. కీలక సమయంలో విద్యుత్ సంక్షోభాలను పరిష్కరించడంలో విజయానంద్‌ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను సిఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో అమలులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా 160 గెగావాట్ల క్లీన్ ఎనర్జీని పెంపోందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 7లక్షల 50 ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగింది. 14 ఏళ్ల పాటు విద్యుత్ రంగాంలో ఆయన చేసిన సేవల వల్ల ఆ రంగంలో కీలక మార్పులు చేశారు. హుద్ హుద్, తిత్లీ లాంటి విపత్తుల సమయంలో కూడా విజయానంద్ విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు.  2016 నుండి 19 వరకూ ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎలక్ట్రానిక్ పాలసీ, డేటా సెంటర్ పాలసీల రూపాకల్పన కీలకంగా వ్యవహరించారు.   ఏపీ సీఎస్ గా నియమితులైన కె విజయానంద్‌కు పలువురు ఐఏఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.  తనను సీఎస్‌గా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రాబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖమంత్రి నారాలోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో పాటు మంత్రి వర్గంలోని అందరికీ విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలతోపాటు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా విజయానంద్ అన్నారు. 

తెలంగాణపై చంద్రబాబు గురి.. ఆ రెండు పార్టీల‌కు బిగ్‌షాక్ త‌ప్ప‌దా?

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌క్రం తిప్పేందుకు తెలంగాణ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌వుతున్నారా?  గ‌తంలో టీడీపీలో కీల‌కంగా ప‌నిచేసిన‌ నేత‌ల‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ‌లోనూ పార్టీ జెండాను రెప‌రెప‌లాడించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అందుకోసం, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ టీం ఇప్ప‌టికే రంగంలోకి దిగిందా? ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి పార్టీ బ‌లోపేతానికి అడుగులు వేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌య్యాయా? అంటే అవున‌నే స‌మాధానం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌యాంలో తెలంగాణ‌లో  తెలుగుదేశం బ‌ల‌మైన పార్టీగా కొనసాగింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటైన త‌రువాత కూడా తెలుగుదేశం పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గ‌లేదు. ముఖ్యంగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఆ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. గ‌త ఏడాది జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీని గ‌ద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. తెలంగాణలో రాజ‌కీయాల‌ను తారుమారు చేయ‌గిలిగే స‌త్తా ఉన్న తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు షురూ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లువురు ముఖ్య‌నేత‌ల‌తో చంద్ర‌బాబు మంత‌నాలు  జ‌రిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే రెండేళ్ల‌లో జిల్లాల వారిగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే చంద్ర‌బాబు, లోకేశ్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా ఏపీ రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీచేసి విజ‌యం సాధించింది.  2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు ఏపీలో ముఖ్య‌మంత్రిగా కొన‌సాగిన‌ప్ప‌టికీ ఏపీ అభివృద్ధిపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టి తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసా రించ‌ లేక‌పోయారు. దీంతో తెలంగాణ తెలుగుదేశంలోని ముఖ్య‌నేత‌లు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే, కీల‌క‌ నేత‌లంతా పార్టీని వీడిన‌ప్ప‌టికీ క్యాడ‌ర్ మాత్రం చెక్కుచెద‌ర‌లేదు.   2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జాకూటమి త‌ర‌పున టీడీపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు పోటీ చేయ‌గా.. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం కొత్త‌గూడెం జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఆ తరువాత కొద్దికాలానికే వారు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మ‌రోవైపు ఏపీలో 2019లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఏపీలో పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికే చంద్ర‌బాబు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో  2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ‌లో తెలుగుదేశం పోటీచేసే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే, ఏపీలో చంద్ర‌బాబు అరెస్ట్ అయిన స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలిపేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా హైద‌రాబాద్ లోని ఐటీ ఉద్యోగులు రోడ్ల‌పైకి వ‌చ్చి చంద్ర‌బాబు అరెస్టును ఖండించారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర‌స‌న తెలిపేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. పైగా.. ఏపీలో చంద్ర‌బాబు అరెస్ట్ అయితే మా రాష్ట్రంలో నిర‌స‌న‌లు ఎందుకు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో తెలంగాణ‌లోని తెలుగుదేశం సానుభూతిప‌రులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారు.    తెలంగాణ‌లో 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి తెలుగుదేశం దూరంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలు,  సానుభూతిప‌రులు  బ‌హిరంగంగానే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు తెలిపారు. చంద్ర‌బాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో బీఆర్ఎస్ లోని తెలుగుదేశం సానుభూతిప‌రులు సైతం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి  తెలుగుదేశం ఓ ప్ర‌ధాన కార‌ణంగా మారింది. ఇటీవ‌ల ఏపీలో తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వైసీపీ హ‌యాంలో ఏపీ అభివృద్ధిలో వెనుక‌బాటుకు గురైంది. దీంతో మ‌ళ్లీ తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థంలో న‌డిపించేందుకు చంద్ర‌బాబు కృషి చేస్తున్నారు. అయితే, ఈసారి ఏపీలో అభివృద్ధితో పాటు తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌లోపేతంపైనా చంద్ర‌బాబు దృష్టి సారించారు.   వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు తెలంగాణ తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యానికి వ‌స్తున్నారు. ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై వారితో చ‌ర్చిస్తూ అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ లో ప్ర‌శాంత్ కిశోర్‌, పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ కంపెనీ షో టైమ్ రాబిన్ శ‌ర్మ‌ల‌తో చంద్ర‌బాబు, నారా లోకేశ్ భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. వీరి భేటీలో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకువచ్చేందుకు  ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు  చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ తెలుగు దేశంలో చేరేందుకు ప‌లువురు నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. తీగ‌ల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేర‌తాన‌ని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే  చంద్ర‌బాబుతో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీడీపీలో కీల‌కంగా ప‌నిచేసిన ప‌లువురు నేత‌లు మ‌ళ్లీ సొంత గూటికి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, రాబోయే కాలంలో తెలంగాణ‌లో టీడీపీ పూర్వ‌వైభవం సంత‌రించుకోవ‌టం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.  తెలంగాణ‌లో టీడీపీ పూర్వ‌వైభవాన్ని సంత‌రించుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు, బీఆర్ఎస్ పార్టీకీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని రాజ‌కీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం నుంచి వెళ్లిన క్యాడ‌రే అధికంగా ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం మళ్లీ బలోపైతం అయితే వారంతా  తిరిగి సొంత‌గూటికి చేరే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయి. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి విజ‌యంలో  తెలుగుదేశం  క్యాడ‌ర్ కీల‌క భూమిక పోషించింది. వారంతా వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి  పూర్తిగా తెలుగుదేశం పార్టీకే మద్దతుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. తెలుగుదేశం  అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయ డంపై దృష్టిసారిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల‌కు గట్టి షాక్ తగలడం ఖాయం. దీంతో ఏపీ త‌ర‌హాలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో  తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తే అధికార పీఠం ఖాయ‌మ‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. చంద్ర‌బాబు వ్యూహంకూడా అదేన‌ని తెలుగుదేశం వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మొత్తానికి చంద్ర‌బాబు గురి తెలంగాణ‌పై మ‌ళ్ల‌డంతో టీడీపీ శ్రేణులు, సానుభూతిప‌రుల్లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతున్నది.