తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా.. వణికించేస్తున్న కోల్డ్ వేవ్

తెలుగు రాష్ట్రాలను చలి పులి చంపేస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి. ప్రతి ఏడూ సంక్రాంతి వస్తున్నదంటే చలి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అయితే ఈ ఏడు మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. జనవరి రెండో వారం వరకూ చలి తీవ్రత పెరుగుతూ వస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరో వారం రోజుల పాటు తెలుగురాష్ట్రాలు కోల్డ్ వేవ్ ను భరించాల్సిందేనని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదౌతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ఏజెన్సీ ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోయాయి.  ముఖ్యంగా గత పది రోజులుగా అర్బన్, మైదాన ప్రాంతాలలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయిపలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల దిగువకు పడిపోయాయి.   హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో ప్రజలు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ చలికి ఎక్స్ పోజ్ కాకుండా ఉండటమే మేలని అంటున్నారు. 

క‌ష్టాల్లో బీఆర్ఎస్‌.. చేతులెత్తేసిన కేసీఆర్‌?

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ప‌రిస్థితి ఇలానే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో బీఆర్ఎస్ ప్ర‌భావం ఇసుమంత కూడా ఉండ‌ద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల‌ను, క్యాడర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్నది. అయితే  కొంద‌రు పార్టీ నేత‌లు మాత్రం కేసీఆర్ పై ఆశ‌లు పెట్టుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పాలిటిక్స్‌లో మ‌ళ్లీ యాక్టివ్ అవుతార‌ని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ద‌బిడిదిబిడే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ  బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. కేసీఆర్ రాజ‌కీయాల నుంచి పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నాటి నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. కేటీఆర్ అరెస్టు అయినా కూడా కేసీఆర్‌ బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చున‌ని, హ‌రీశ్‌, క‌విత‌లే పార్టీ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌న్న చ‌ర్చ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. మ‌రోవైపు, కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల వారిగా నేత‌లు ఆయ‌న్ను క‌లిసి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతోంద‌నీ, మీరు పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ కావాల‌ని విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప‌దేళ్లు పాలించిన కేసీఆర్‌,  2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ త‌రువాత  ఆయ‌న ఇంట్లో స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురై కొన్ని రోజులు బెడ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల స‌మ‌యంలో ప‌లు బ‌హింగ స‌భ‌ల్లో పాల్గొని కేసీఆర్ ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కుకూడా కేసీఆర్ హాజ‌రు కాలేదు. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్రం అసెంబ్లీకి హాజ‌రైన కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీది చెత్త‌ బ‌డ్జెట్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌ నుంచి ప్ర‌తీరోజూ అసెంబ్లీకి వ‌స్తాన‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ  త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను చీల్చిచెండాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాకుండా డుమ్మా కొడుతున్నారు.   కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన అనుభవం మాకు మార్గదర్శకంగా ఉంటుందని ప‌లుసార్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించినా కేసీఆర్ పట్టించుకోలేదు. అసెంబ్లీకి ముఖం చాటేశారు. అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కడా కేసీఆర్ కనిపించడంలేదు.  పార్టీ నేతలు ఎవరైనా ఇంటికి వెళ్లి కలిస్తే వారితో మాట్లాడి పంపిచేస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరికలు అంటూ కొంత మందిని తీసుకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అది అధికారిక వీడియో కాదు. ఓ వ్యక్తి ఫోన్లో  తీసిన వీడియో. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడప్పుడే బయటకు రావాలని అనుకోవడం లేదు. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సుమారు ఐదు నెల‌లు జైలు జీవితం గ‌డిపారు. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురైన‌ట్లు ఆ పార్టీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో  పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనూ కేసీఆర్ ఆందోళ‌నలో ఉన్నారని అంటున్నారు. అయితే, 2025 జనవరి  నుంచి కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారని గ‌తంలో ప‌లుసార్లు కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌టంతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితి అందుకు విరుద్దంగా క‌నిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ లేదా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఏసీబీ పెట్టిన ఫార్ములా ఈ-కారు కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీష‌న్ ను కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇహనో ఇప్పుడో కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్ రావు, క‌విత భుజానికెత్తుకోనున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే క‌నీసం ఆరేడు నెల‌ల్లు లేదా ఇంకా ఎక్కువ కాలం  జైల్లో ఉండే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కార్‌ దూకుడు ముందు హ‌రీశ్ రావు, క‌విత సార‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ  ఏ మేర‌కు నిల‌దొక్కుకోగ‌ల‌దన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద పార్టీ  కష్టాల్లో ఉన్నా కేసీఆర్ బయటకు రావడం లేదంటే పార్టీ విషయంలో ఆయన చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.  ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యి.. కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కాకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో జిల్లాల వారిగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ ఆ పార్టీ నేత‌ల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ మాత్రం ఇక నావ‌ల్ల కాదు అన్న‌ట్లుగా చేతులెత్తేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ చ‌ర్చే నిజ‌మైతే రాబోయే కాలంలో బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న ఉంది.

ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి, ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్

తెలంగాణ రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో  ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే  ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు బుధవారం ( జనవరి 8) హాజరయ్యారు. పూర్తి డాక్యుమెంట్లతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారు. విచారణ అనంతరం ఈడీ అధికారులు ఆయన  వాంగ్మూలాన్ని ఈడీ  నమోదు చేస్తారు. ఇలా ఉండగా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బుధవారం (జనవరి 8) అయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.  ఈ కేసులో నగదు బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.  

ప్రయాగ్ రాజ్ కు శ్రీవారి కళ్యాణ రథం

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం వెళ్లనుంది. ఈ కల్యాణ రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మర్ బీఆర్ నాయుడు బుధవారం (జనవరి 8)ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు.  జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా  కుంభమేళాలో సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం దీని ద్వారా కలుగుతుంది. ఈ నమూనా ఆలయంలో నాలుగు సార్లు శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. కుంభమేళా జరుగుతున్న రోజులలో జనవరి 18,26 తేదీలోనూ, ఫిబ్రవరి 3 ,12 తేదీ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.    ప్రపంచం లోనే అతి పెద్ద ఉత్సవమైన కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. అలా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే ఉద్దేశంతోనే అక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  కుంభమేళా సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో జరిగే కల్యాణోత్సవాల కోసం శ్రీవారి కళ్యాణ రథం బుధవారం ప్రయాగరాజ్ కు బయలుదేరింది. 

 కెటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ  కాసేపట్లో...

ఫార్ములా ఈ  కార్ రేస్ కేసులో ప్రధాన నిందితుడైన , మాజీమంత్రి  కెటీఆర్ దాఖలు చేసిన పిటిషన్  బుధవారం మధ్యాహ్నం విచారణకు రానుంది. కెటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపే విధంగా ఎసిబికి ఆదేశాలివ్వాలని  కెటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణకు రావాలని కెటీఆర్ కు  ఎసిబి నోటీసులు జారీ చేసింది.  ఇదే కేసులో కెటీాఆర్ గతంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి భంగపడ్డారు. ఈ నేపథ్యంలోనే  ఆయన సుప్రీం  కోర్టు కెక్కే ప్రయత్నాలు చేస్తూనే తెలంగాణా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. 

బుద్ధభవన్ లో హైడ్రా పోలీస్ స్టేషన్.. ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్

హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగించేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించిన ప్రభుత్వం, ఆ దిశగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.   బుద్ధ భవన్ బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఇ ప్పుడు తాజాగా హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంతో హైడ్రా దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. హైడ్రా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసరుగా ఏసీపీ స్థాయి అధికారిని నియమిం చనున్నారు.  హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు, పార్కులు, లేఔట్స్, ఓపెన్​ప్లాట్స్, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తుంది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా మానిటర్​చేస్తుంది. ఇక నుంచి భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ఇతర కేసులకు  సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకునే వారు హైడ్రా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.  

ఆశారాం బాపూకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన సుప్రీం

అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వయం ప్రకటిత దేవుడు ఆశారాం కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది.  86 ఏళ్ల ఆశారాంబాపూ తన 77 ఏళ్ల భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో ఉన్నారనీ, ఆమెకు బైపాస్ ఆపరేషన్ చేయించాల్సి ఉందనీ పేర్కొంటూ బెయిలు కోసం చేసిన విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనకు మార్చి 31వరకూ తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది.  ఈ బెయిలు సమయంలో ఆయన తన అనుచరులను కలవకూడదని షరతు విధించింది.  గాంధీనగర్ సమీపంలోని తన ఆశ్రమంలో 2013 జరిగిన అత్యాచార కేసులో ఆశారాంబాపు నిందితుడు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు ఆశారాం బాపు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ చేసిన ఆరోపణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 2023 జనవరిలో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగిలినవారికి వారిని విడుదల చేశారు. 2023లో జీవిత ఖైదును సస్పెండ్ చేయాలంటూ ఆశారాం బాపు వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు గత ఏడాది ఆగస్టులో తిరస్కరించింది. ప్రస్తుతం  ఆశారం బాపు జోధ్ పూర్ జైలులో ఉన్నారు. ఆయన కుమారుడు   నారాయణ్‌ సాయిపై కూడా అత్యాచారం కేసు నమోదైంది. ఆ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నారాయణ్ సాయి  ప్రస్తుతం అతడు  సూరత్ జైలులో ఉన్నాడు.

బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టు కోరుకుంటోందా?

ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అవుతాయనడానికి ప్రస్తుతం మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఓ ఉదాహరణ. ఏడాది కిందటి వరకూ డీఫాక్టో సీఎంగా రాష్ట్రంలో చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. పార్టీ కూడా ఆయన అరెస్టునే కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ అరెస్టైతే.. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ బీఆర్ఎస్ లో గట్టిగా ఉంది. ఇందుకు వారు గతంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు ముంగిట ఉన్నారా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ తెలంగాణ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను మంగళవారం (జనవరి 7) కొట్టివేసిన క్షణం నుంచీ కేటీఆర్ ఆరెస్టుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు న్యాయవాది ఒకరు అయితే బుధవారం సాయంత్రానికే కేటీఆర్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన తరువాత ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ గ్రీన్ కో కార్యాలయాలపై తెలంగాణ ఏసీబీ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వీధీనం చేసుకుంది. మరో వైపు ఈడీ కూడా ఇలా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయగానే అలా కేటీఆర్ కు ఈ నెల 16న విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించింది. మరో వైపు ఏసీబీ కూడా కేటీఆర్ కు ఈ నెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులలో కేటీఆర్ న్యాయవాదులను అనుమతించేది లేదని స్పష్టంగా పేర్కొంది. ఇక కేటీఆర్ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయిస్తే.. అంతకంటే ముందే రేవంత్ సర్కార్ సుప్రీంలో కేవియెట్ దాఖలు చేసింది. ఇలా కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్నట్లుగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  సాధారణంగా కేటీఆర్ అరెస్టును ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలు కోరుకోవడం సహజం. పైగా ఓటుకు నోటు కేసులో గతంలో రేవంత్ ను అప్పటి కేసీఆర్ సర్కార్ అరెస్టు చేసింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ అరెస్టుతో రేవంత్ కేసీఆర్, కేటీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా అవుతుంది. అయితే విషాదం ఏమిటంటే బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టును కోరుకుంటోంది. అయితే బీఆర్ఎస్ కేటీఆర్ అరెస్టును కోరుకోవడానికి కారణం వేరు. కేటీఆర్ అరెస్టైతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ కేటీఆర్ అరెస్టు కావాలనే కోరుకుంటున్నారు.  గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వారసుడిగా కేటీఆర్ ను సీఎంను చేసి ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతారన్న ప్రచారం జోరుగా సాగింది. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ ఇవ్వడానికి కూడా కారణం అదేనని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో పార్టీ మొత్తం కేటీఆర్ కు మద్దతుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీలోని చాలా మంది కేటీఆర్ కంటే హరీష్ రావు, కల్వకుంట్ల కవితలలో ఎవరో ఒకరు కేసీఆర్ రాజకీయవారసులుగా ఉండాలని భావిస్తున్నారు. పార్టీలో అలా కోరుకుంటున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ కూడా కేటీఆర్ అరెస్టునే కోరుకుంటున్న పరిస్థితి. ఏడాది కిందటి వరకూ డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన కేటీఆర్.. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి నిజంగా అవమానకరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇస్రో కొత్త చైర్మన్‌ నారాయణన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో  నూతన చైర్మన్‌గా వీ నారాయణన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఉన్న సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం జరిగింది. ఇస్రో కొత్త చైర్మన్ గా నారాయణన్ ఈ నెల 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్ గా ఉంటారు. నారాయణన్ ప్రస్తుతం శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అందులో ఉపయోగించే కెమికల్స్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజనిక్, క్రయోజనిక్ ప్రొపల్షన్ దశల్ని పర్యవేక్షించే  లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ డైరెక్టర్ గా ఉన్నారు.  ఈయనను ఇస్రో కొత్త చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.  ఇక ఈ నెల 13న అంటే సోమవారం పదవీ విరణమ చేయనున్న ప్రస్తుత చైర్మన్ సోమనాథ్  2022 జనవరిలో పదవీ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. సోమనాథ్ హయాంలోనే ఇస్రో  తొలిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై రోవర్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. చంద్రునిపై రోవర్ విజయవంతంగా లాంచ్ చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా చేరింది కూడా ఈయన హయాంలోనే. 

16న విచారణకు రండి.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు

విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. వాస్తవానికి మంగళవారం (జనవరి 7) విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్ కు ఈడీ ఇటీవల నోటీసులు పంపింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ పై అదే రోజు తీర్పు వెలువరిస్తుందనీ, కనుక విచారణకు హాజరు కావడానికి మరి కొంత సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో  కేటీఆర్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఈడీ  విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అన్నట్లుగానే ఆయనను ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఇలా ఉండగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్డు డిస్మిస్ చేసిన తరువాత ఈడీ, ఏసీబీలు దూకుడు పెంచాయి. ఏసీబీ ఏకంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఇక ఈడీ విచారణకు తేదీ ఖరారు చేస్తూ కేటీఆర్ కు నోటీసులు దాఖలు చేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా  ఒక వేళ తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలంటూ కేవియెట్ దాఖలు చేసింది. 

మాజీ అయినా మారని గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ!

వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఐటీ పరిశ్రమ అధోగతికి పడిపోయినా.. కొడిగుడ్డు కథ చెప్పి.. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సమయం పడుతుందంటూ సమర్ధించుకున్న తీరు అప్పట్లో ఆయనను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్ల పాలన అన్ని విధాలుగానూ అధోగతి పాలు చేసింది. విభజిత రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం విభజిత రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో  ఐటీ రంగంలో  లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి.  ఐ‌టి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా దానిని  శాశించే స్థాయికి ఎదిగింది.   చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా  చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది.  కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్‌ నిర్వాకం వలన గత  5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది. రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది.  అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్.  చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి.  అయితే జగన్ నిర్వాకంతో గత ఐదేళ్లలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది.   విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో  ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.    ఔను నిజమే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ ఎగుమతులలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కేవలం రూ.1,000 కోట్లే. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ కూడా ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేసింది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.  2021-22 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే.. మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం.  ఇందులో ఏపీ వాటా 0.111 శాతం  మాత్రమే.    ఇదీ ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ వెలగబెట్టిన నిర్వాకం. మంత్రిగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఆయన చెప్పిన గుడ్డు కథ అప్పట్లో పెద్ద ఎత్తున హేళనకు గురైంది. ఇంతకీ అప్పట్లో ఆయనేం చెప్పారంటే.. ‘ కోడి గుడ్డును పెట్టగలదు కానీ కోడిని పెట్టలేదుగా.. ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డును పెట్టిందనీ, దానిని పొదగాలి, అది కోడి కావాలి పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి అని చెప్పుకునేవారు. అందులోని లాజిక్ కనీసం ఆయనకైనా అర్ధమయ్యిందో లేదో కానీ, జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో కోడి గుడ్డూ పెట్టలేదు, పొదగా లేదు, పిల్లలూ కాలేదు, అవి పెరిగి పెద్దా కాలేదు. అందుకే అన్ని రంగాలతో పాటు తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా వెలుగొందుతున్న ఐటీ రంగం కూడా రాష్ట్రంలో కుదేలైంది.  ఇప్పుడు జగన్  అధికారంలో లేరు. మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా మాజీ మంత్రి అయిపోయారు. అయినా ఆయన గుడ్డు కథను మాత్రం వదలడం లేదు.  ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. జగన్ హయాంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు సాకారం అవుతోంది.  ప్రధాని నరేంద్రమోడీ బుధవారం (జనవరి 8) విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ రైల్వే జోన్,  నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ లకు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.  మూడు రాజధానులు అంటూ జగన్ విశాఖను ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ చేస్తాను, ఇక్కడ నుంచే పాలన సాగిస్తానంటూ గొప్పలు చెప్పినా.. తన భార్య కోసం రుషికొండకు బోడిగుండు కొట్టించి విలాసవంతమైన భవనం నిర్మించడం తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఆరు నెలలలోనే విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడంతో పాటు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. గుడివాడ అమర్నాథ్ తెరమీదకు వచ్చి మరో సారి కోడిగుడ్డు కథ చెప్పేశారు. ఇప్పుడు అంటే మంగళవారం (జనవరి 8) మోడీ భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులన్నిటికీ జగన్ హయాంలోనే అంకురార్పణ జరిగిందనీ, ఇప్పడు చంద్రబాబు ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారంటూ విమర్శలకు దిగారు. అయితే ఆయన మాటలను నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. గుడ్డు కథలు ఆపు అమర్నాథూ అంటూ చురకలం టిస్తున్నారు. మాజీవి అయినా గుడ్డు కథ మారలేదేంటి? అని సెటైర్లు వేస్తున్నారు. 

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత ..పోలీసుల లాఠీచార్జి

తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు.  తెలంగాణాలో కాంగ్రెస్ బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారయ్యింది.  బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను బిజెపి ఖండించడమే గాక ర్యాలీ నిర్వహించింది. ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్, ఎస్ బి అప్రమత్తమై ప్రభుత్వానికి హెచ్చరిక  చేసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. బిజెపి కార్యకర్తలు గాంధీభవన్ వైపు రాళ్లు రువ్వడంతో వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు 

సుప్రీంలో నందిగం సురేష్ కు చుక్కెదురు

మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిలు కోసం నందిగం సురేష్ దాఖలు చేసుకున్న  బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది.  మరియమ్మ హత్య కేసులో పోలీసులు నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్ కోసం నందిగం సురేశ్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయన బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైంది. నందిగం సురేష్ బెయిలు పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నందిగం బెయిలు పిటిషన్ ను విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం,  ట్రయల్ కోర్టు ఆదేశాలలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంటూ నందిగం సురేష్ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసింది.   ఇంతకీ మరియమ్మ హత్య కేసు ఎప్పటిది అంటే   వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ 2020లో హత్యకు గురైంది. అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ విధానాలను బాహాటంగా విమర్శించిన మరియమ్మ, జగన్ సర్కార్ తన పెన్షన్ ఆపేసిందనీ, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందనీ విమర్శలు గుప్పించారు.   అప్పట్లో జగన్ అరాచకపాలనను ఎవరు విమర్శించినా ప్రభుత్వం, వైసీపీయులూ సహించలేకపోయే పరిస్థితి ఉన్న సంగతి తెలిసందే. దాంతోనే  నందిగం సురేశ్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో మరియమ్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జగన్ హయాంలో పోలీసులు ఆయన ఫిర్యాదును పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మంత్రి నారా లోకేష్ ను కలిసి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. దీంతో లోకేష్ ఆదేశాలతో కేసు దర్యాఫ్తులో వేగం పెంచిన పోలీసులు, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. 

 ఢిల్లీలో ఫిబ్రవరి ఐదో తేదీన ఒకే దశ  పోలింగ్ 

కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు  ఈ ఫిబ్రవరి 23తో ముగియనుంది. మొత్తం 70  మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు ఆప్ అధికారంలో వచ్చింది. 2015 లో  67 స్థానాలు, 2022లో 62 స్థానాలతో  ఆప్ అధికారంలో రాగలిగింది. వరుసగా పదిహేనేళ్లు అధికారంలో ఉన్న  కాంగ్రెస్ గత ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది.  ఫిబ్రవరి ఐదో తేదీన ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎనిమిదో తేదీన కౌంటింగ్ ఉంటుంది.  ఈ విషయాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కేవియెట్.. కేటీఆర్ కు ఇక చుక్కలే!

ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు తెలంగాణ సర్కార్ ఇలా కేటీఆర్ పై ముప్పేట దాడి చేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కనీసం అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తినీ తిరస్కరించింది. దీంతో  ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ లో భాగస్వామి అయిన గ్రీన్ కో తెలంగాణ, ఏపీలోని కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. అదే సమయంలో కేటీఆర్, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరి నివాసాలలో సోదాలకు అనుమతి తీసుకుంది. ఇక నేడే రేపొ ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేయాడానికి పకడ్బందీగా అడుగులు వేస్తున్నది.  ఈ నేపథ్యంలో తన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. సుప్రీంను ఆశ్రయించే ఉద్దేశంతో ఆయన ఇప్పటికే తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నారు.  అలాగే పార్టీలోని ప్రముఖలతో కూడా ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. మొత్తంగా నేడో, రేపో కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచన చేస్తుండగానే రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసి  ఒక వేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు కూడా వినాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేవీయెట్ దాఖలు చేసింది.  ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతిలో కేటీఆర్ ప్రమేయం ఉందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. అలాగే ఈ కేసులో భాగస్వామి అయిన గ్రీన్ కో.. బీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారానికి సంబంధించిన ఆధారాలూ ఉన్నాయని పేర్కొంటూ.. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే ఆయన పిటిషన్ తో పాటు తమ పిటిషన్ ను కూడా విచారించాలనీ, తమ వాదననూ వినాలని కోరుతూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేసింది. 

9న కేటీఆర్ అరెస్ట్?

బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ గురువారం అంటే జనవరి 9న అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మూలా ఈ కార్ కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేయడంతో ఆయనకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో కంపెనీ కార్యాలయాలలో సోదాలు ప్రారంభించింది. ఫార్ములా ఈ కార్ నిర్వహణలో గ్రీన్ కో భాగస్వామి అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ కంపెనీ పలు దఫాలుగా బీఆర్ఎస్ కు దాదాపు 41 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది.   ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్ కో కార్యాలయాలలో మంగ ళవారం (జనవరి 7)  తనిఖీలు చేపట్టారు.  మరో వైపు  నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఏసీబీ కేటీఆర్ కు ఈ నెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ రోజు వరకూ కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి సోమవారం (జనవరి 6)  విచారణకు హాజరు కావాల్సిన కేటీఆర్.. ఏసీబీ కార్యాలయం వరకూ వెళ్లి కూడా తనతో పాటు తన న్యాయవాదులనూ అనుమతించాలని పట్టుబట్టి విచారణకు హాజరు కాకుండా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేటీఆర్ కు మరోమారు నోటీసులు జారీ చేసి.. గురువారం (జనవరి 9) హాజరు కావాల్సిందిగా పేర్కొంది. ఆ నోటీసుల్లో న్యాయవాదులకు అనుమతి లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు గైర్హాజరైతే సహకరించడం లేదన్న కారణంతో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఆయన విచారణకు హాజరైనా, విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు మాత్రం అనివార్యమనీ, అది గురవారమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.