సీనియర్లకు శుభ సంకేతాలు!

తెలంగాణ కాంగ్రెస్లో సీన్ రివర్స్ అవుతోందా? ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అంతే  కాదు, యంగ్ లీడర్స్ టాలెంట్ గుర్తించక పోవడం, పదవులు పక్కదారి పట్టి సీనియర్ నాయకులకు చేరడంతో   యువ నాయకులు అనేక మంది వేరే దారులు వెతుకున్నారు. ఉదాహరణకు,   రాజస్థాన్, మధ్య ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్టానం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సచిన్ పైలెట్ ను కాదని, వృద్ద నేత అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది. మధ్య ప్రదేశ్ లోనూ అంతే, జ్యోతిరాదిత్య సింధియా ను కాదని కమల్ నాథ్ ను  సిఎంను చేసింది.  నిజానికి, పైలెట్, సింధియా ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి సన్నిహితులు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు. సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్  కాంగ్రెస్  పార్టీలో, ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు మంత్రివర్గంలో పనిచేసారు. జ్యోతిరాదిత్య సిందియా తండ్రి మాధవ  రావు   సిందియా విషయం అయితే చెప్పనే అక్కర లేదు. నాలుగైదు సార్లు ఎంపీగా గెలవడమే కాదు,   గ్వాలియర్ నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజ్ పేయిని ఓడించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.  పైలెట్, సింధియా ఇద్దరూ కూడా. వారసులుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చినా, నాయకులుగా నిరుపించుకున్నారు. ఎంపీలుగా గెలిచారు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మన్మోహన్ సింగ్   మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసి, పరిపాలనా అనుభవం సంపాదించుకున్నారు. రెండు రాష్ట్రల్లోనూ 2018 ఎన్నికలలో  కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ఇద్దరే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.  అయినా, కాంగ్రెస్ అధిష్టానం యువ నాయకులను కాదని, వృద్ధులకు పదవులు కట్టబెట్టింది. నిజానికి  ఆ ఇద్దరనే కాదు, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది యూత్ లీడర్స్ కు పార్టీలో  గుర్తింపు దక్కలేదు. అందుకే జితిన్  ప్రసాద, ఆర్పీ సింగ్ మొదలు నిన్న మొన్న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన,  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ వరకు ఎంతో మంది యువ నేతలు ముఖ్యంగా రెండు మూడు తరాలుగా, కాంగ్రెస్ కుటుంబాలుగా ముద్ర వేసుకున్న  నేతల కుమారులు, కాంగ్రెస్ అధిష్టానం తమకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని బయటకు వెళ్లి పోయారు. ఈ మధ్యనే  జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవలు అందించిన, అహ్మద్ పటేల్ కుమారుడు, ఫైసల్  పటేల్   కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి, ఇక చాలని తప్పుకున్నారు. అయినా  యంగ్ టాలెంట్ బయటకు వెళ్లి పోతున్నా చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పటికీ  సీనియర్ నాయకులకే కుర్చీలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఎదుకనో ఒక్క తెలంగాణ విషయంలో మాత్రం, ఆనవాయితీకి భిన్నంగా, రెండుమూడు పార్టీలు మారి, కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డిని మాత్రం చేయి పట్టుకుని రాజకీయ వైకుంఠపాళిలో పాముల నోటిన పడకుండా నిచ్చెనలు ఎక్కించుకుంటూ   పైకి తీసుకు పోయింది. 2017లో  తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి   అధిష్టానం అండదండలతో చకచకా  నిచ్చెన మెట్లు ఎక్కారు.   బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇంత వేగంగా పదవుల మెట్లు ఎక్కినా నాయకుడు మరొకరు ఉండక పోవచ్చును. 2021 లో సీనియర్ నాయకుల నుంచి తీవ్ర  ప్రతిఘటన  ఎదుర్కుని కూడా ఆదిష్ఠానం   అండదండలతో  టీపీసీసీ  అధ్యక్షుడయ్యారు. అదే క్రమంలో 2023లో కాంగ్రెస్ అధిష్టానం,సీనియర్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ని  ముఖ్యమంత్రిని చేసింది.  అయితే  ఇప్పడు అదే అధిష్టానం కారణాలు ఏమిటో ఖచ్చితంగా తెలియక పోయినా సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్  నియామకం జరిగిన తర్వాత, ఈ  మార్పు   స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.  అలాగే, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిని  పక్కకు నెట్టి, జానా రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టాం సీనియర్ నాయకులకు  త్వరలోనే పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లు, అయ్యిందని సీనియర్ నాయకులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ రాకతో, అధిష్ఠానానికి సీనియర్ నాయకులకు మధ్య మాజీ రాష్ట్ర ఇన్ చార్జిలు, కోటరీ నేతలు కట్టిన అడ్డు గోడలు తొలిగి పోయాయి. సీనియర్ నాయకుడు జానా రెడ్డి వారధిగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో  సీనియర్ నాయకులకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది  అంటున్నారు. అలాగే, ఇటీవల గుజరాత్ లో రాహుల్ గాంధీ, బీజేపీతో భూత, భవిష్యత్, వర్తమానాల్లో పత్యక్ష, పరోక్ష సంబంధాలున్న అందరికీ  ఉద్వాసన తప్పదని చేసిన హెచ్చరిక  నేపధ్యంగా రాష్రంలో చోటు చేసుకుంటున్న  పరిణామాలను సీనియర్ నాయకులు  శుభ సంకేతాలుగా తీసుకుంటున్నారు.

జగన్ పట్ల ధిక్కారమే వారి లక్ష్యమా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్న పార్టీనే గానీ.. ప్రజాస్వామికంగా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి స్థాపించి.. తానే ఆ పార్టీకి మోనార్క్ అని భావించుకుంటూ.. నియంతలా నిర్వహిస్తున్న పార్టీ అది. రికార్డుల్లో కూడా అలాంటి పోకడే ఉండాలనే ఉద్దేశంతోనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం- ఆ పప్పులన్నీ ఉడకవని మొట్టికాయలు వేసిన తరవాత నాలిక్కరచుకుని వెనక్కు తగ్గారు. అలాంటి పార్టీలో ఎవరైనా చెలామణీ అవుతున్నారంటే.. వారందరరూ జగన్ దయాదాక్షిణ్యాల మీదనే బతుకుతున్నట్టుగా ఆయన భావిస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం ఉండే పార్టీలో ఆయనను ధిక్కరించి నడుచుకునే వాళ్లు ఉండరు. సాధారణంగా అలాంటి వారు పార్టీని వదలి తమ దారి తాము చూసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ శాసనసభలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు.. జగన్ పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాలనుకుంటున్నారా? ఇలాంటి చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  శాసనసభలో పది శాతం ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష నేత హోదా దక్కదు అనే సంగతి తనకు స్పష్టంగా తెలిసినప్పటికీ, అదే మాటలతో గతంలో చంద్రబాబును ఎద్దేవా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు రాబోనంటూ పట్టుపట్టారు. తన పార్టీ తరఫున గెలిచిన మిగిలిన పదిమందినీ కూడా వెళ్లనివ్వకుండా నియంత్రించారు. అయితే.. ఈలోగా.. వరుసగా 60రోజులు సభకు గైర్హాజరైతే పదవి పోతుందనే రాజ్యాంగ నిబంధన తెరపైకి వచ్చింది. జడుసుకున్న జగన్, తొలుత మేకపోతు గాంభీర్యంతో మాట్లాడారు గానీ  పిమ్మట అందరినీ వెంటబెట్టుకుని ఒక రోజు సభకు వచ్చి వెళ్లారు.  ఆ తరువాత కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో సభ దాక వచ్చి అటెండెన్సులో సంతకాలు చేసి.. సమస్యలపై సభకు ప్రశ్నలు ఇచ్చేసి.. సభలోనికి అడుగుపెట్టకుండానే బయటకు వెళ్లిపోతున్నారని ఇవాళ స్పీకరు అయ్యన్నపాత్రుడు గుర్తించారు. దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాల్సిన, దొంగల్లాగా వ్యవహరించాల్సిన ఖర్మ వారికేం పట్టిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు కూడా. దీనికి ఆ ఏడుగురిలో ఒకరైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటర్ ఇస్తూ .. తాము దొరల్లాగానే వచ్చి వెళ్లాం అని వివరణ ఇచ్చారు కూడా.  ఆ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిస్వామ్య పార్టీగా నడిచే వైఎస్సార్ కాంగ్రెస్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను సభకు వెళ్లవద్దని నిర్దేశించిన తర్వాత.. వారు సంతకం పెట్టడం మాత్రం ఎలా జరిగింది? సంతకాలు పెట్టేయడం ద్వారా.. తమ మీద అనర్హత వేటు పడకుండా కాపాడుకోవాలని వారు అనుకున్నారా? లేదా, ఈ విషయం దాచేస్తే దాగేది కాదు కాబట్టి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదేశం పట్ల తమ ధిక్కార స్వరాన్ని బహిరంగంగానే వినిపించదలచుకున్నారా? అనే మీమాంస ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. తాను వద్దని చెప్పిన తర్వాత సభకు వెళ్లిన వారి మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తాటిపర్తి చంద్రశేఖర్ వివరణ కూడా రావడం విశేషం.  ఈ ఏడుగురి వైఖరి ఖచ్చితంగా జగన్ పట్ల ధిక్కారమేనని, అయితే, వారి మీద కోపం వచ్చినా కూడా ఇదివరకటిలాగా ప్రదర్శించలేని దుర్బల స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే మీద ఆగ్రహిస్తే వారు పార్టీకి రాజీనామా చేసేస్తారో అనే భయం ఆయనలో ఉన్నదని ప్రజలు కూడా అనుకుంటున్నారు.

ఛత్తీస్గఢ్ లో ఎన్ కౌంటర్.. 22 మంది మావోలు మృతి!

ఛత్తీస్గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో  ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కూడా మరణించినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతుండటంతో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్ ముక్త దేశంగా చూడాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జనవరి 6న ప్రకటించారు. అప్పటి నుంచే దండకారణ్యంలో పోలీసు యాక్షన్ ముమ్మరమైంది. కూంబింగ్ ఆపరేషన్ ఎడతెగకుండా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి9న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.    తాజాగా గురువారం (మార్చి 20)  ఉదయం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్యా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో  22 మంది మావోయిస్టులు మరుణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.    దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ పోస్టులో  మన సైనికులు నక్సల్ ముక్త భారత్ అభియాన్ దిశగా ఒక గొప్ప ముందడుగు వేశారని పేర్కొన్నారు.  మోడీ  ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. అనే పేర్కొన్నారు. 

చాహల్ , ధనశ్రీ లకు  విడాకులు  మంజూరు 

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ధన శ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు గురువారం (మార్చి 20)తో తెరపడింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది కన్ఫర్మ్ చేశారు. ధన శ్రీకి భరణం క్రింద రూ 4. 75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. విడాకులు కేసు తుది దశకు చేరుకోవడంతో చాహల్ ఇంకా ఐపిఎల్  టీమ్ లో చేరలేదు. చాహల్, ధనశ్రీ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు గుప్పు మన్నాయి. వీరువురికి 2020లో  పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లయ్యింది34 ఏళ్ల చాహల్ 2025 ఐపిఎల్ ఆడటానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమౌతుంది. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.  బాలివుడ్ నటి  ప్రీత జింతా యాజమాన్యంలో ని పంజాబ్ కింగ్స్ చాహల్ కు భారీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసింది. చాహల్ ను కొనుగోలు చేయడానికి  పంజాబ్ కింగ్ రూ 18 కోట్ల బిడ్ వేసింది 

అందమైన వివాదం.. మిస్ వరల్డ్ చుట్టూ దుమారం

మన దేశం మరో మారు  మిస్ వరల్డ్  (ప్రపంచ సుందరి) పోటీలకు వేదిక అవుతోంది.  అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  మే 7 నుంచి 31 వరకు  హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.   ఇంచు మించుగా,నెల రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 140 దేశాల అందాలు భామలు పాల్గొంటారు. ఆ 140 దేశాల అందాల భామలు హైదరాబాద్ లో కురిపించే  అందాలను  కెమేరాతో పట్టుకుని   ప్రపంచానికి చూపేందుకు మూడు వేల టీవీ ఛానల్స్  నెల రోజుల పాటు  హైదరాబాద్  నగరంలో విడిది చేస్తాయి. ఈ మూడు వేల టీవీ ఛానల్స్  రాక పోకలు ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి విదేశాంగ మంత్రి జయశంకర్ తో మంతనాలు జరిపి  వచ్చారు. దీంతో ప్రపంచ సుందరి  పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది.  అంతే  కాదు  ప్రపంచ సుందరి పోటీలకు తమ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నదో కూడా ముఖ్యమంత్రి స్వయంగా శాసన సభకు వివరించారు. ఇది అలాంటి ఇలాంటి వేడుక కాదు, ఇతవరకు 72 సార్లు  ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తే ఒకే ఒక్క సారి 1998లో  మన దేశంలో బెంగుళూరులో నిర్వహించారు. అదికూడా అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) సంస్థ నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పడు మా ప్రభుత్వమే ప్రపంచ సుందరి  పోటీలు నిరహిస్తోందని సగర్వంగా సభకు తెలిపారు. (ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో కానీ, లాస్ట్ ఇయర్, 2024 లోనూ మన దేశంలో  ముంబై/ ఢిల్లీలోనే మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. సరే అది వేరే విషయం.) ఈ పోటీలను ఇక్కడ హైదరాబాద్’లో  నిర్వహించడం వలన రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని,అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, నిర్ణయించిందని వివరించారు.  అయితే ఎప్పుడో జరిగే అందాల పోటీల విషయం ఎలా ఉన్నా ఇప్పుడది, రాష్ట్ర  రాజకీయాల్లో మరో వివాదానికి తెర తీసింది. పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్ లో నిర్వహించడం  ద్వారా  పర్యాటక రంగం పరుగులు తీస్తుందని, అంటుంటే, ప్రధాన ప్రతి పక్ష పార్టీ బీఆర్ఎస్  మాత్రం  అందాల పోటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని ఆరోపిస్తోంది. అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో అందాల పోటీలా ...?  అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోటీల నిర్వహణకు రూ.200 కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆరోపించారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.46 కోట్లు ఖర్చుచేసి  ఫార్ములా - ఈ కార్  రేస్ నిర్వహిస్తేనే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఏదో జరిగిపోయిందని  ఏసీబీ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే  కేవలం రూ.46 కోట్లతో  ప్రపంచంలోనే ప్రప్రధమంగా ఫార్ములా - ఈ  రేస్  నిర్వహిం చడమే తప్పయితే, రూ.200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఎలా రైట్  అవుతుందని బీఆర్ఎస్ నేతలు లాజికల్ గా  ప్రశ్నిస్తున్నారు. సరే.. అదలా ఉంటే, ఇందులో ఇంకొక సీరియస్ కోణం వుందని అంటున్నారు. 1998లో అమితాబచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలా  పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.  మహిళా సంఘాల నిరసనలు, ఆత్మాహుతి ప్రయత్నాల కారణంగా స్విమ్ సూట్’ ఈవెంట్ ను రద్దు చేయడం కూడా జరిగిందని  గుర్తు చేస్తున్నారు.అంతే కాదు  చిత్రంగా, ప్రగతిశీల వామపక్ష మహిళా సంఘాలు, హిందూ జాతీయ వాద మహిళా సంఘాలు ఒకే గొంతుకతో  నిరసన గళం వినిపించాయి. అయితే, ఇప్పడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందా? శాంతి భద్రతల సమస్య వస్తుందా, అంటే చెప్పలేము. అయితే ఇటీవల ఉత్తర ప్రదేశ్, ప్రయాగ రాజ్ లో 45 రోజుల పాటి సాగిన మహా కుంభ మేళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన మాటల యుద్ధం, తీవ్ర రాజకీయ దుమారన్నిరేపింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నాయకులు, సనాతన హిందూ ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు  అందుకు వ్యతిరేకంగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు, కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తూ చేసిన ప్రతి విమర్శలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా కొంత ఇబ్బందికి గురిచేశాయి అనే అభిప్రాయం వుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, కుభమేళ ప్రభావం కొంత మేర ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లోఉంది. ఈ నేపధ్యంలో భారతీయ, సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధమనుకునే మిస్ వరల్డ్ అందాల పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం పై బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఎలా స్పందిస్తాయి.. కాంగ్రెస్ ఆదిస్థానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేవి ఇప్పడు మిస్ వరల్డ్ ముందున్న ప్రశ్నలు. అలాగే  ఈ అందాల వివాదం  చిలికి చిలికి వికృతంగా వికారంగా మారుతుందా, లేక  లాస్ట్ ఇయర్ లాగా,  కూల్ గా సర్దు మణిగి పోతుందా  అనేది ముందు ముందు గానీ తెలియదు.

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఎ2 సునీల్ యాదవ్?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర ఉందని చెప్పారు. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? హత్యకు కుట్రపన్నింది ఎవరు అన్న విషయాలను వెల్లడిస్తానని మీడియా సమావేశంలో చెప్పారు.  గురువారం (మార్చి20) కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్ యాదర్ ఈ హత్య విషయంలో తాను ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాననీ, అన వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గన్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్‌-2)గా ఉన్న సునీల్ యాద‌వ్ సైతం.. అప్రూవర్‌గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు చాలానే కుట్ర జ‌రిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవ‌రున్నారు? అస‌లు ఈ ప్లాన్ ఎవ‌రిది అనేది చెప్పేస్తా అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉద‌యం క‌డ‌ప ఎస్పీ కార్యాల‌యానికి వ‌చ్చిన సునీల్‌.. మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసు విషయంలో ఇంత వరకూ మౌనంగా ఉన్నాననీ, కానీ ఇప్పుడు తనకే బెదరింపులు వస్తున్నాయన్నారు.   తాను జైల్లో ఉన్న‌ప్పుడు, ఇప్పుడు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా త‌న‌కు వైసీపీ నాయ‌కుల నుంచి బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని, తనకు ప్రాణ భయం ఉందనీ సునీల్ చెప్పారు. అయితే భయపడుతూ ఎన్నాళ్లు బతకాలని భావించి.. ఇప్పుడు వివేకా హత్య వెనుక కుట్ర కోణాన్ని, హత్య సూత్రధారులు, పాత్రధారుల ఎవరన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో బెయిలుపై ఉన్నసునీల్ యాదవ్, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడీ వివరాలు బయటపెట్టడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి సైతం బెదరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, భద్రత కలిగించాలనీ  కోరుతూ కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ సైతం బెదరింపులు వస్తున్నాయంటూ జీల్లా ఎస్పీని ఆశ్రయించడం గమనార్హం.  

సిఐడి కస్టడీలో వల్లభనేని వంశీ

 టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  నిందితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  మూడు రోజుల పాటు సిఐడి కస్టడీ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారి చేసింది. ఈ కేసులో వంశీ ఎ 71 గా ఉన్నారు.  కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ఈ నెల 28 వరకు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సిఐడి పోలీసులు వంశీని కస్టడీలో తీసుకున్నారు.  ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇరు వర్గాల వాదనలు  ముగిసినప్పటికీ ఆయనకు బెయిల్ రాలేదు. గత వైకాపా హాయంలో  టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అప్పట్లో 54 రోజుల పాటు  రిమాండ్ చేస్తూ మహిళా న్యాయమూర్తి హిమబిందు  తీర్పు చెప్పారు.  ప్రస్తుతం వంశీ  కేసులో  హిమబిందు న్యాయమూర్తిగా ఉన్నారు. సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో వంశీ విజయవాడ జైల్లో ఉన్నప్పుడు వైకాపా  అధినేత జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల వల్లే వంశీకి బెయిల్ రాలేదని చర్చ జరుగుతుంది.  అధికారుల బట్టలూడదీస్తామనే  జగన్ వ్యాఖ్యలవల్లే వంశీకి బెయిల్ రాలేదని ప్రచారం జరుగుతుంది. వంశీపై మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వ్యాపార పనుల నిమిత్తం  తాను అమెరికా వెళ్లాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని వంశీ ప్రాధేయపడినప్పటికీ బెయిల్ రాలేదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ పై ఎఫ్ ఐఆర్ కొట్టివేసిన కోర్టు

ఫోట్ ట్యాపింగ్ కేసులో  మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి చ‌క్ర‌ధ‌ర్ గౌడ్‌ ఫిర్యాదు మేరకు హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి విదితమే.   అయితే ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హరీష్ రావు తన క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు.  ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో హరీష్ రావు ప్రమేయానికి సంబంధించిన ఆదేశాలు చూపాలని కోర్టు కోరింది. అందుకు పోలీసుల తరఫు న్యాయవాదది సమయం కోరినా, ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు సరికాదని పేర్కొంటూ కోర్టు హరీష్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  

చంద్రబాబు సర్కార్ కి నలుగురు గౌరవ సలహాదారులు

వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌ శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్‌ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు  ఆ పదవుల్లో ఉంటారు. సుచిత్ర ఎల్ల భారత్‌ బయోటెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్‌ బయోటెక్‌తోపాటు, ఎల్ల ఫౌండేషన్‌కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారికి వ్యాక్సిన్‌ను అందించడంతో పాటు, బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికిగాను 2022లో భర్త డాక్టర్‌ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగానూ సేవలందిస్తున్నారు. పారిశ్రామిక, సామాజిక సేవా రంగాల్లో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా సౌండ్‌ ఇండియా బిజినెస్‌ అచీవర్స్‌ అవార్డ్, సార్క్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డ్‌ వంటి అనేక పురస్కారాలు వరించాయి. జి.సతీష్‌రెడ్డి ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త. సిస్టమ్స్‌ మేనేజర్‌. గతంలో రక్షణ మంత్రికి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా, డీడీఆర్‌డీ కార్యదర్శిగా, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు. మిషన్‌శక్తి, లాంగ్‌రేంజ్‌ గైడెడ్‌ బాంబ్, క్షిపణి సాయంతో టార్పెడో విడుదల వ్యవస్థల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. లండన్‌లోని రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ సభ్యత్వంతోపాటు అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌ అవార్డు, ఏరోనాటికల్‌ ప్రైజ్, నేషనల్‌ సిస్టమ్స్‌ గోల్డ్‌మెడల్, నేషనల్‌ డిజైన్‌ అవార్డ్, హోమీబాబా గోల్డ్‌మెడల్‌ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ సలహాదారుగా ఉన్నారు. డాక్టర్‌ కేపీసీ గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్త. గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల ఫోరెన్సిక్‌ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చేరారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ లో పనిచేసి ఫోరెన్సిక్‌ దర్యాప్తులో నైపుణ్యం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సంబంధించి సొంతంగా ట్రూత్‌ ల్యాబ్స్‌ను స్థాపించారు. ప్రస్తుతం దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పేస్‌ టెక్నాలజీ రంగ గౌరవ సలహాదారుగా నియమితులైన శ్రీధర్‌ ఫణిక్కర్‌ సోమనాథ్‌కు ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవముంది. 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌కు కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.  

చిరుకి యూకే లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ పురస్కారం

సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసి అందరివాడుగా నిలిచిన మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కీర్తికిరీటంల మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మ విభూషన్ పురస్కారాలు అందుకున్న చిరంజీవి తాజాగా బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో  ప్రజాప్రతినిథులు, ప్రముఖుల సమక్షంలో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ అధికార  లేబర్ పార్టీ ఎంపి నయెందు మిశ్రా ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమంలో  రాజకీయ సినీ రంగాలలో చిరంజీవి సేవలకు గుర్తింపుగా యూకే గుర్తింపుగా యుకె పార్లమెంట్  లైఫ్ టైం అఛీవ్ మెంట్ పురస్కారం అందజేసింది. యూకే పార్లమెంటు నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు చిరంజీవే కావడం గమనార్హం.   ప్రతిష్ఠాత్మకమైన యూకే పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కు శుభాకాంక్షలు అందజేస్తూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక అన్నయ్య కంటే తండ్రి సమానుడిగా ఆయన్ను గౌరవిస్తానని, జీవితంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు దిక్సూచిగా నిలిచిన మార్గదర్శి చిరంజీవి అని గుర్తు చేసుకున్నారు.  3 నంది, 9 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా లక్షలాది మందికి రక్త, నేత్ర దానాలు చేయించిన చిరు సేవలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.  

బాబు దార్శనికతకు బిల్ గేట్స్ ఫిదా.. సీబీఎన్ తో భేటీ అద్భుతం అంటూ ట్వీట్

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు బుధవారం (మార్చి 19) ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో  భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీ తరువాత చంద్రబాబు ఎక్స్ వేదిగా ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఈ భేటీ అత్యంత కీలకం అంటూ పేర్కొన్నారు. ఈ భేటీ  రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ భేటీ ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు.  కాగా చంద్రబాబుతో భేటీపై బిల్ గేట్స్ కూడా స్పందించారు. చంద్రబా దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ గురించి బుధవారం ఆ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. బిల్ గేట్స్ తో తాను సమావేశం అయ్యానని.. ఏపీ ప్రగతిలో కీలకం కానున్న ఈ బేటీ తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అద్భుతంగా సాగిందంటూ బిల్ గేట్స్ గురువారం (మార్చి 20)  సందించారు.  ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తమ ఫౌండేషన్ కీలక ఒప్పందంపై సంతకం చేసిందన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించుకుని పురోభివృద్ధి సాధించే లక్ష్యంతో సాగుతున్న ఏపీకి తమ ఫౌండేషన్ ద్వారా సంపూర్ణ సహకారం అందించనున్నామనీ, ఒప్పందంలో భాగంగా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించామని బిల్ గేట్స్ పేర్కొన్నారు.   వాస్తవానికి బిల్ గేట్స్, చంద్రబాబుల స్నేహ బంధం 1995లో మొదలై సాగుతూనే ఉంది.  నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం హోదాలో చంద్రబాబు… అతికష్టం మీద గేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించారు. వారి తొలి భేటీ ఢిల్లీలోనే జరిగింది. ఓ రాజకీయ నేతగా ఉండి టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో వినియోగించే దిశగా మాట్లాడుతున్న చంద్రబాబును బిల్ గేట్స్ మెస్మరైజ్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు విజ్ణప్తి మేరకు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అది మొదలు పలు దిగ్గజ సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి.   ఇటీవలే దావోస్ లో కలిసిన సందర్బంగా ఏపీకి సాయం చేయాలంటూ బాబు కోరితే… రెండు నెలలు తిరక్కుండానే గేట్స్ రంగంలోకి దిగారు, కీలక ఒప్పందాలు కుదిరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం కార్యరూపం దాల్చింది. 

హౌస్ అరెస్ట్ ప్లీజ్.. బతిమాలుకుంటున్న వైసిపి నేతలు!

వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం  అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఏకపక్షంగా  మీరు ఉద్యమాలు చేయండి, పోరాడండి అని ఆదేశాలు మాత్రం జారీ చేస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే  వైసీపీ నాయకులు పోలీసులలో తమకు పరిచయం ఉన్న వారికి ఫోన్ చేసి పార్టీ పిలుపు ఇచ్చిన రోజులలో తమన హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా వేడుకుంటున్నారు! హౌస్ అరెస్టు అయిపోతే ఇక వేరే ఇబ్బందులు ఉండవని, బయటకు వెళ్లే పనిలేదని అనవసరపు ఖర్చు తప్పించుకోవచ్చు అని వారు భావిస్తున్నారు. వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి రకరకాల ఆందోళనలకు పిలుపు ఇస్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ట్విటర్ నుంచి కదలకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులంతా  రోడ్లెక్కి పోరాటాలు  చేయాలని పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి, ఆస్తులు అమ్ముకున్న నాయకులు.. పార్టీ చెప్పే పోరాటాల పేరిట ప్రతిసారీ డబ్బుల ఖర్చుకు వెనుకాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో చేస్తానన్నా తరువాత ఆ పర్యటనల గురించి పట్టించుకోకవపోవడానికి ఇది కూడా ఒక కారణం అని, ఖర్చు పెట్టడానికి స్థానిక నేతలెవ్వరూ సిద్ధంగా లేరని ఒక ప్రచారం ఉంది.  కాగా.. తాజాగా విశాఖపట్టణంలోని క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు తొలగించినందుకు వైసీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎప్పుడో ఏర్పాటు అయిన స్టేడియంకు ఉన్న పేరుకు ముందు జగన్ హయాంలో  వైఎసఆర్ పేరును ముందు జోడించారు. ఆ స్టేడియం విషయంలో ఆయన పాత్ర, ప్రమేయం ఏమీ లేనందున కూటమి ప్రభుత్వం ఆ పేరును తొలగించింది.  వైఎస్సార్ పేరు చూస్తే కూటమి ప్రభుత్వం భయపడుతున్నదంటూ వైసీపీ నేతలు కొందరు నానా యాగీ చేశారు. ఈలోగా విశాఖలో స్టేడియం వద్ద ధర్నా చేయాలని పిలుపు ఇచ్చారు.  అసలే విశాఖ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానని జగన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్క సీటులో కూడా పార్టీని గెలిపించని నగరం అది. అలాంటిచోట పార్టీ పిలుపు ఇచ్చే ఆందోళనకు జనాన్ని పోగేయడం అంటే.. నాయకులకు తలకు మించిన భారమే. ఆర్థికంగా చిలుము వదిలిపోతుందని వారి భయం. అందుకే.. పోలీసులను ఆశ్రయించి లోపాయికారీగా తమను హౌస్ అరెస్టులు చేయాల్సిందిగా బతిమాలు కున్నట్టుగా తెలుస్తోంది.  పోలీసుల్ని బతిమాలి హౌస్ అరెస్టులు చేయించుకోవడం వైసీపీ నేతలకు ఇవాళ కొత్త కాదు. గతంలోనూ తిరుపతిలో నివాసం ఉండే ఓ వైసీపీ ఎంపీ.. తమ సొంత నియోజకవర్గంలో ఘర్షణల నేపథ్యంలో పర్యటనకు వస్తానని ప్రకటించి, వెళ్లే ధైర్యం లేక, తానుగా పోలీసులకు ఫోనుచేసి హస్ అరెస్టు చేయాల్సిందిగా వేడుకుని.. ఇల్లు కదలకుండా కూర్చున్నట్టుగా అక్కడ గుసగుసలు ఉన్నాయి.  

మాజీ  ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఎసిబి నోటీసులు 

ఎపి  ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వైకాపా  హయాంలో ఆయన జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు దోచి పెట్టారు. వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారన్న  ఆరోపణలు ఉన్నాయి.2019 నుంచి 24 మధ్య సాక్షి పత్రికకు 371 కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో విజయ్ కుమార్ రెడ్డి దోచి పెట్టారు. ఐఅండ్ పిఆర్ లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిబంధనలకు విరుద్దంగా నియమించారు.  సాక్షి మీడియాలో పని చేస్తున్న సిబ్బందికే ప్రాధాన్యత ఇచ్చారు. మిగతా పత్రికలు, చానళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా పక్ష పాత వైఖరి అవలంబించారని ఎసిబి ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆయా సంస్థలకు   బిల్లుల చెల్లింపుల్లో కూడా  వివక్షత కనబరచారని విచారణలో తేలింది.  2019లో ఆయన నియామకమైనప్పుడు కేవలం రెండేళ్లవరకే ఈ పదవిలో ఉండాలి.   ఈ నిబంధనను జగన్ సర్కార్ పక్కకు  పెట్టింది.  వైకాపా అధికారం కోల్పోయే వరకు ఐ అండ్ పిఆర్ కమిషనర్ గా ఆయన  కంటిన్యూ అయ్యారు. తనకు ఐఅండ్ పి ఆర్ కమిషనర్ పదవి రాగానే విజయ్ కుమార్ రెడ్డి జగన్ ఇంటికి వెళ్లి  సత్కరించి తన విధేయతను చాటుకున్నారు.  సాధారణంగా మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వాలంటే తక్కువ కొటేషన్, ఎక్కువ సర్క్యులేషన్ ప్రాతి పదికన ఇస్తారు. కానీ విజయ్ కుమార్ రెడ్డి అవేమీ పట్టించుకోలేదు . సాక్షి ఇచ్చిన టారిఫ్ ను ఎక్స్ అఫిషియో హాదాలో పెంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయనపై  ఎసిబి కేసు నమోదుచేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే వారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. నోటీసులను ఈ-మెయిల్ ద్వారా ఎసిబి పంపింది. దీనితో  పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. నోటీసులను ఇంటికి అతికించారు.   ప్రస్తుతం ఆయన కోల్‌కతాలో పని చేస్తున్నారు. విచారణకు హాజరవుతారా డుమ్మా కొడతారా తేలాల్సి ఉంది. 

దొంగ రాజకీయాలు.. దొంగచాటు సంతకాలు!

వైసీపీ చేసేవన్నీ దొంగ రాజకీయాలే. ఒక్క విషయంలో కూడా చెప్పినది చెప్పినట్లు చేసిన దాఖలాలు కనిపించవు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి బేషరతు మద్దతు అంటూ ప్రకటించి.. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాటతో దొంగ రాజకీయాలు నెరపింది. అలాగే 2019 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాది లోగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. భారీ ఎత్తున మద్యం ధరలు పెంచేసి, నాసిరకం మద్యం సరఫరాకు తెరతీసి జగన్ ప్రభుత్వమే దొంగ వ్యాపారం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ దొంగ రాజకీయాల గురించి లెక్కకు మించి ఉదంతాలు ఉంటాయి. తాజాగా అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో కూడా వైసీపీ అదే దొంగ రాజకీయాలు నెరపుతోంది. అసెంబ్లీ బాయ్ కాట్ అన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. సభకు హాజరు కావడం లేదు కానీ దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టేసి పారిపోతున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా అసెంబ్లీ ముఖంగా గురువారం (మార్చి 20) వెల్లడించారు.  వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం మీరెవరైనా చూశారా అంటే సభ్యులను ప్రశ్నించిన ఆయన.. సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ సభ్యులు ఇలా దొంగచాటుగా అసెంబ్లీ హాజరుపట్టీలో సంతకాలు పెట్టేసి సభకు హాజరు కాకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వారికి గౌరవం కాదని స్పీకర్ అన్నారు. సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు హాజరు కావాల్సి ఉందన్న అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి హాజరుపట్టీలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన అలా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఇలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెడుతున్నారని వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన రోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారనీ,  ఆ తరువాత వారెవరూ సభకు రాలేదనీ స్పీకర్ స్పష్టం చేశారు.  సభకు హాజరు కాకుండా హాజరుపట్టిలో దొంగచాటుగా సంతకాలు చేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్లు తాను గుర్తించడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేసి.. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించవద్దంటూ వైసీపీ సభ్యులకు హితవు చెప్పారు.  

కేసీఆర్ క్యాంపు ఆఫీసుకి టులెట్ బోర్డు

మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం (మార్చి 19) టులెట్‌ బోర్డు పెట్టారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్‌ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్‌ ఒక్కసారి కూడా గజ్వేల్‌ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు. ప్రజలకు వద్దకు రాని కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడటం లేదంటూ గజ్వేల్‌, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైరయ్యారు. అల్లరిమూకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తాళాలు పగలుగొట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాయంటూ గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ ఇరుకున పెడతారోనని వారు భయపడేవారు. కానీ నేడు దానికి భిన్నంగా అధికారపక్షమే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని కోరుతున్నా కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం కేసీఆర్‌ అసెంబ్లీకి రావటానికి విముఖత చూపుతున్నారు. గత సంవత్సరం కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి చుట్టపుచూపుగా వచ్చి కాసేపు అసెంబ్లీలో కూర్చొని వెళ్లిపోయారు. అసెంబ్లీకి రావటం లేదు కానీ జీతభత్యాలు మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్నారు.

 పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ విష్ణుప్రియ

  బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో టీవీ  యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన న్యాయవాది తో కలిసి ఉదయం పది గంటలకు  పిఎస్ కు చేరుకున్నారు  మంగళవారం సాయంత్రం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఆమె హాజరు కాలేదు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కాలేదని విష్ణు ప్రియ చెబుతున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో తన కో ఆర్టిస్ట్ షేకర్ భాషా పంజాగుట్ట పిఎస్ కు వచ్చి ఇదే విషయాన్ని చెప్పారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకానున్న నిందితుల్లో 11 మంది ఉన్నప్పటికీ విచారణకు హాజరైన వారిలో విష్ణు ప్రియ మొదటి స్థానంలో నిలిచింది.  షూటింగ్ కారణంగా విష్ణుప్రియ మంగళవారం  గైర్హాజరైనట్లు ఇవ్వాళ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల కారణంగా చాలామంది సుసైడ్ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి తోడు ఐపిఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు.   ఈ యాప్స్ కు సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఆయన  సోషల్ మీడియా వేదిక ద్వారా యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.

సలహాదారు పదవులకే వన్నె తెచ్చిన నియామకాలు.. దటీజ్ చంద్రబాబు

ఏపీలో గత వైసీపీ గత పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. పాలన అంటే దోచుకో, దాచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలూ, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయం సాగింది. జగన్ హయాంలో జనం నిత్యం భయంభయంగా బతికే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాలలో నెలకొంది. ఐదేళ్ల పాటు జగన్ అరాచక పాలనకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. తెలుగుదేశం కూటమి కొలువుదీరి తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో జనం స్వేచ్ఛగా ఉంటున్నారు. అక్రమ కేసుల భయం లేకుండా బతుకుతున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయగలుగుతున్నారు.  ఇక ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని నియమిస్తోంది. అదే జగన్ హయాంలో  సలహాదారుల నియామకం అన్నది ఒక వైసీపీ క్యాడర్ కు ఉద్యోగ కల్పన కోసమే అన్నట్లుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జగన్ హయాంలో భారీగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారు. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారు నియామకాలన్నీ.. అర్హత, యోగ్యతతో సంబంధం లేకుండా వైసీపీ అనుకూలురైతే చాలు అన్నట్లుగా జరిగాయి.  అయితే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుల పదవులలో నియమితులయ్యే వారంతా.. తమ సేవల ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే వారు, చేయగలిగే వారే ఉంటున్నారు.  తాజాగా వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ అడ్వైజర్లుగా నియమించింది.  ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్,  ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా డీఆర్ఢీఓ మాజీ చైర్మన్   సతీశ్ రెడ్డి,  ఫోరెన్సిక్ సైన్స్ కు కేపీసీ గాంధీ, హ్యాండ్ లూమ్స్ హబ్ కు సుచిత్రా ఎల్లాలను సలహాదారులుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ నియామకాలే రాష్ట్ర పురోభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఇస్రో  మాజీ చైర్మన్ సోమనాథ్  డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డిలను సలహాదారులుగా నియమించడం ద్వారా  ద్వారా వారి అనుభవాన్ని, నైపుణ్యాన్నిరాష్ట్ర పురోభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఇక సుచిత్రా ఎల్లా.. కరోనా కల్లోల సమయంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్. టీటీడీ బోర్డు సభ్యురాలు కూడా. ఆమెను హ్యాండ్ లూమ్స్ హబ్  సలహాదారుగా నియమించారు. అలాగే  ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా సుదీర్గ కాలం పాటు పనిచేసిన గాంధీని.. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా నియమించారు. ఈ నియమకాలు వీరి నైపుణ్యాన్ని, ప్రతిభను ఆయా రంగాలను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా సలహాదారు పదవికే గౌరవం వచ్చిందని ప్రశంసిస్తున్నారు. 

వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల చుట్టూ ఈడీ ఉచ్చు?

ప్రముఖ యాంకర్, వైసీపీ  అధికార ప్రతినిథి శ్యామలకు ఉచ్చు బిగుస్తున్నదా? అన్న ప్రశ్నకు  ఔననే సమాధానం వస్తున్నది.   నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై   పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలా కేసు నమోదైన వారిలో వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల కూడా ఉన్నారు.  అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ  శ్యామల కోర్టును ఆశ్రయించారు.  అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది? ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపీలాగుతున్నట్లు తెలియవచ్చింది.  ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే శ్యామల ఆస్తులు, లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందంటున్నారు. ఈడీ దూకుడు చూస్తుంటే.. ఏ క్షణమైనా శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశముందని రాజకీయ, సినీవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.