Sunita Williams could have to stay in space till February 2025 Nasa says

మరో ఆరు నెలలు అంతరిక్షంలోనే సునీత!

రోదసిలోకి మూడోసారి వెళ్ళిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు అంటే, మరో ఆరు నెలలో సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే వుండాల్సి వుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే వుంటుందని నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్‌ కాప్స్యూల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. షెడ్యూలు ప్రకారం జూన్ 14వ తేదీకి వీరిద్దరూ వెనక్కి తిరిగి రావాలి. కానీ, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంతికేక సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో వీరిద్దరూ రెండు నెలలుగా అంతరిక్షంలోనే వుండిపోయారు. వ్యోమగాములు ఇద్దరూ అంతరిక్షంలో సురక్షితంగానే వున్నారని నాసా తన ప్రకటనలో పేర్కొంది.

rs 10000 tp private temples

ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు రూ.10వేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ. 10 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో  జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలులోనికి తీసుకువచ్చినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వేల దేవాలయాలు నిధులు లేక కనీస ధూప, దీప, పైవేద్యాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబు ఆలయాలకు నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ప్రైవేటు దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రభుత్వం రూ. 5వేలు ఇచ్చేది. అయితే జగన్ హయాంలో ఈ పథకం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధకార పగ్గాలు చేపట్టిన రెండు నెలల లోపుగానే గతంలో ఇచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం రూ. 10 వేలు ఇచ్చేందుకు జీవో జారీ చేశారు. 

sunkisala retaining wall

కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్!

అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సాగర్ కు పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో రక్షణ గోడ వెనుక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని అధికారులు ఓపెన్ చేశారు. దీంతో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సొరంగాల్లోకి సాగర్‌ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటెయినింగ్‌ వాల్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంపుహౌస్‌ నీట మునిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రిటైనింగ్ వాల్ ఈనెల 1నే కూలిపోయింది. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.  ఇక్కడ మూడు షిఫ్టుల్లో కూలీలు పని చేస్తుంటారు. ఘటన  కూలీలు షిఫ్టులు మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. రిటైనింగ్ వాల్ కూలిపోయిన క్షణాల వ్యవధిలోనే పంప్ హౌస్ జలమయమైంది.   

Iranian Woman Arrested for Singing In Public Without Hijab

పబ్లిగ్గా పాటపాడింది.. అంతే...!

ఇరాన్‌లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలన్న నిబంధన వుంది. అయితే జారా ఇస్మాయిలీ అనే సింగర్ హిజాబ్ ధరించకుండా పబ్లిగ్గా ఓ ఇంగ్లీషు పాటపాడింది. ఈ సందర్భంగా పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత ఆమెని ఎక్కడకి తీసుకెళ్ళారో, ఆమె ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.  1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. వారిలో జారా ఇస్మాయిలీ కూడా ఒకరు. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూనే ఆమె పబ్లిగ్గా హిజాబ్ లేకుండా పాట పాడినట్టు తెలుస్తోంది. రెండేళ్ళ క్రితం మాసా అమీని అనే యువతి హిజాబ్‌ని సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలోనే ఆమె మరణించింది. ఆ సందర్భంలో మహిళలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు జారా ఇస్మాయిలీకి కూడా మాసా అమీనికి వచ్చిన పరిస్థితే వస్తుందేమోనని పలువురు భయపడుతున్నారు.

own buildings to anganwadi centers

ఎన్టీఆర్ జిల్లాలో అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాలు!

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 1457 అంగ‌న్ వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాలకు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని   కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి  అన్నపూర్ణ దేవికి  విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు.    కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి  అన్నపూర్ణ దేవి ని గురువారం (ఆగస్టు 8) పార్లమెంటులోని ఆమె ఛాంబర్ లో కలిసి ఎన్.టి. ఆర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల  అనుమతి కోరుతూ  వినతి పత్రాన్ని అందజేశారు.  జిల్లా లో సొంత భ‌వ‌నాలు వుండి ప్ర‌హారీ గోడ‌లు లేని 357 అంగ‌న్వాడీ కేంద్రాల‌కు ప్ర‌హారీ గోడ‌ల నిర్మాణం, అద‌నంగా మ‌రో 60 అంగ‌న్వాడీ కేంద్రాల ఏర్పాటు, సొంత భ‌వనాలు లేని 892 అంగ‌న్వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాల ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా  అభ్య‌ర్థించ‌టం జ‌రిగింది. అలాగే విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో  మొత్తం అంగన్వాడీ కేంద్రాల 1457 వుండ‌గా, వీటిలో  స్వంత భ‌వ‌నాలు కేవ‌లం 583 అంగ‌న్వాడీ కేంద్రాల‌కు మాత్ర‌మే వున్న‌ట్లు తెలియ‌జేశారు. వాటిలో  226  కేంద్రాలకు మాత్ర‌మే కాంపౌండ్ వాల్  వున్న‌ట్లు వివ‌రించారు.  ఎం.పి కేశినేని  శివనాథ్ చేసిన అభ్యర్థులపై   కేంద్ర‌మంత్రి అన్నపూర్ణ దేవి  సానుకూలంగా స్పందించారు.

tribal area delivery problem

మన్యంలో గర్భిణికి ఇబ్బందులు!

మన్యం జిల్లాలో ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. గిరి పల్లెల్లో వున్న గిరిజనులు అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్ళడం చాలా సవాళ్ళతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇలాంటి పరిస్థితిని ఒక గర్భిణి ఎదుర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కిచూరు పంచాయితీకి చెందిన అచ్చెమ్మ అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్.కి ఫోన్ చేశారు. అచ్చెమ్మ ఇంటికి అబులెన్స్ వెళ్తున్న సమయంలో దారి మధ్యలో అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. అంబులెన్స్.ని బయటకి తీయడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. అదే సమయంలో ఇంటి దగ్గర అచ్చెమ్మకి నొప్పులు పెరిగిపోయాయి. ఒక బిడ్డని కూడా ప్రసవించింది. ఆమె గర్భంలో వున్న మరో కవల శిశువు అడ్డం తిరిగింది. తంటాలు పడి అంబులెన్స్.ని బురదలోంచి బయటకి తీసి, అచ్చమ్మ ఇంటికి వెళ్ళిన 108 సిబ్బందికి అసలు విషయం తెలిసింది. అప్పుడు సిబ్బంది అచ్చమ్మ గర్భంలో వున్న మరో శిశువును కూడా బయటకి తీశారు. అదృష్టవశాత్తూ తల్లి, ఇద్దరు పిల్లలు క్షేమంగా వున్నారు.

vinesh phogat recieve welcome as olympic medalist

వినేశ్ ఫోగట్ కు హర్యానా సర్కార్ అండ!

భారత్ ఏస్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరి కూడా వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. దేశం యావత్తూ ఫోగట్ కు మద్దతుగా నిలిచింది. ఆమెపై అనర్హత వేటు అన్యాయమని ఎలుగెత్తింది. దీని వెనుక కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలను సైతం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా వినేశ్ ఫోగట్ అద్భుత ప్రదర్శన తరువాత కూడా పతకం లేకుండా రిక్త హస్తాలతో భారత్ కు తిరిగి రావలసిన పరిస్థితి వచ్చింది.  అటువంటి వినేశ్ ఫోగట్ కు హర్యానా ప్రభుత్వం అండగా నిలిచింది. పతకం సాధించకపోయినా ఆమెకు రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలూ, సత్కారాలు, సౌకర్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  హర్యానా ముఖ్యమంత్రి  న‌యాబ్ సైనీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. వినేశ్ చాంపియన్ అని పేర్కొన్నారు.  "అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది.  ఫోగట్  ఫైన‌ల్ ఆడ‌క‌పోవ‌చ్చు కానీ   ఆమె ఛాంపియ‌నే. అని పేర్కొన్నారు.  ఒలింపిక్ మెడ‌ల్  సాధించిన క్రీడాకారిణిలాగే ఆమెకు హర్యానా ప్రభుత్వం స్వాగతం పలకుతుంది. ఒలింపిక్ ర‌జ‌త ప‌త‌క విజేత‌కు ద‌క్కే అన్ని స‌న్మానాలు, రివార్డులు, సౌక‌ర్యాలను వినేశ్‌ ఫోగట్ కు అందజేస్తుంది.

jagan government not buy even single bus

జగన్ సర్కారు తుస్సు.. కొనలేదు ఒక్క బస్సు!

జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ ఆర్టీసీ కోసం ఒక్క బస్సు కూడా కొనలేదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఏలూరు నుంచి దూరప్రాంతాలకు వెళ్ళే 30 సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ స్లీపర్ బస్సులను మంత్రి గురువారం నాడు ప్రారంభించారు. అనంతరం ఏలూరు బస్సు డిపో ఆవరణలో మొక్కని నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘జగన్ సంక్షేమం పేరు చెబుతూ అభివృద్ధిని గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 1400 కొత్త బస్సులను కొన్నాం. ఆర్టీసీని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం’’ అన్నారు. 

Ukraine attacks Russian territory

రష్యాలోకి ఎంటరైన ఉక్రెయిన్ సైన్యం!

ఉక్రెయిన్ సైనికులు మామూలోళ్ళు కాదు.. చిన్న దేశం అయినప్పటికీ, చాలాకాలం నుంచి రష్యా భారీ దాడులను ఎదుర్కొంటోంది. తాజాగా ఉక్రెయిన్ సైనికులు రష్యాలోకి ఎంటరయ్యారు. రష్యా దక్షిణ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్ సైన్యం గురువారం నాడు రష్యాలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని రష్యా కూడా అంగీకరించింది. ఉక్రెయిన్ సైన్యం మా దేశంలోకి ప్రవేశించింది. వారితో భీకర యుద్దం జరుగుతోంది అని రష్యన్ ఆర్మీ ప్రకటించింది. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలోకి భారీ సంఖ్యలో ఉక్రెయిన్ సైన్యం ప్రవేశించడం ఇదే ప్రథమం. తమ దేశంలోకి ఉక్రెయిన్ సైనికులు ప్రవేశించడంతో రష్యా దేశ సరిహద్దుల్లో ఎమర్జెన్సీని విధించింది. రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఫైట్‌లో 31 మంది పౌరులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ సైనికులు రష్యాలోకి ఎంటరైన ప్రాంతానికి దగ్గర్లోనే వున్న కుర్క్స్ అణు విద్యుత్ కేంద్రం దగ్గర రష్యా ప్రభుత్వం భద్రత పెంచింది.

peddireddy gives  himself clean

పెద్దిరెడ్డి స్వాతి ముత్యమట!

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తానో స్వాతి ముత్యమని చెప్పుకుంటున్నారు. పుంగనూరు ప్రజలు తనను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనీ, తానోక శుద్ధమైన ప్రజానాయకుడిననీ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి నుంచీ తనను వ్యతిరేకిస్తున్నారనీ, అందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారనీ వగస్తున్నారు. మదనపల్లి సబ్ కలక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనతో తనకు సంబంధం లేదని నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు.  చిత్తూరు జిల్లాలలో చంద్రబాబును ఎదుర్కొని రాజకీయాలలో రాణిస్తున్నందునే తనపై కక్షగట్టి వేధిస్తున్నారనీ ఆవేదన చెందుతున్నారు. అయితే ఆయన ఈ మాటలన్నీ పుంగనూరులో మాట్లాడటం లేదు. ఎందుకంటే ఏడు సార్లు ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పుంగనూరు జనం ఆయనను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయడం లేదు. వైసీపీ పరాజయం తరువాత పుంగనూరు నియోజకవర్గంలో పెద్ద రెడ్డి బాధితులు ఒక జాతరలా తరలి వచ్చి మరీ ఆయన భూదందాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయన పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తనకు తాను కితాబులిచ్చేసుకుని వీరతాళ్లు తగిలించేసుకున్నారు.  నాలుగు దశాబ్దాల నిష్కళంక రాజకీయ జీవితం తనదని తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు. మరి ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణల సంగతేంటన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వడం లేదు.   పెద్ది రెడ్డి స్వోత్కర్షకూ పరనిందకూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీటుగా బదులిచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం దోపిడీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనచరుల పాపాలు తప్పక పండుతాయని, చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫైళ్లను తగుల బెట్టి  ఇప్పుడు అమాయకపు ముఖం పెడితే  తాను సుద్దపూసను, స్వాతిముత్యాన్ని అని చెప్పుకుంటే జనం నమ్మరని కుండబద్దలు కొట్టారు.  పెద్దిరెడ్డి, ఆయన అనచరులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనే దానికి... వారికి వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి తమకు అందిన వేలాది ఫిర్యాదులే తార్కాణమన్నారు.  వారి కుటుంబాన్ని తమ ప్రభుత్వం వేధిస్తోందని పెద్ది రెడ్డి అనడం దొంగే దొంగదొంగ అన్నట్లుగా ఉందనీ,  పెద్ది రెడ్డి కుటుంబం  తమను వేధించిందంటూ వేల మంది  ప్రభుత్వానికి  ఫిర్యాదులు ఇచ్చారని చెప్పారు. మదనపల్లె ఫైళ్ల దగ్ఢం ఘటన కుట్ర కోణంలోనే జరిగిందని, సీ ఐ డీ విచారణలో దోషులను కచ్చితంగా తేలుస్తామని చెప్పారు.  ప్రాధమిక సమాచారం మేరకు ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉందన్నారు.  

The price of gold has fallen sharply

బంగారం ధర భారీగా తగ్గిందహో... !

బంగారం ధర భారీగా తగ్గింది. ఇంకా కొద్ది రోజులు వేచి చూస్తే మరింత తగ్గుతుందేమో అనుకోకుండా, బంగారంతో అవసరం వుంటే అర్జెంటుగా షాపులకి వెళ్ళి బంగారాన్ని కొనుక్కోండి. వాన రాకడ, ప్రాణం పోకడ గురించి ఎవరూ ఎలా చెప్పలేరో బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అందుకే ముద్దు చేసినప్పుడే చంకనెక్కాలన్నట్టుగా, బంగారం ధర తగ్గినప్పుడే కొనుక్కోవడం మంచిది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా ఇండియాలో బంగారం ధర భారీగా తగ్గింది. బుధవారం నాడు 10 గ్రాములకు 870 రూపాయల వరకు తగ్గిన ధర, గురువారం నాడు 430 రూపాయల వరకు  తగ్గింది. రెండురోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1300 వరకు తగ్గింది. శ్రావణ మాసం ప్రారంభమైంది. పెళ్ళి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో లక్ష పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ వున్న సమయంలోనే బంగారం ధర తగ్గడం ఒక వింత. గోల్డుకి ఫ్రెండ్ అయిన వెండి ధర కూడా తగ్గుతోంది.

monkeypox in congo

కాంగోలో 27 వేల మందికి మంకీపాక్స్!

ఆఫ్రికా దేశం కాంగోని మంకీపాక్స్ వైరస్ కుదిపేస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా మంకీపాక్స్ బాధితులు కనిపిస్తున్నారు. ఒంటి మీద గుండ్రటి బొబ్బలు కలిగించే ఈ వైరస్ ప్రాణాంతకం కూడా. ఇప్పటి వరకు కాంగోలో ఈ వైరస్ బారిన 27 వేల మంది పడ్డారు. వెయ్యిమంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది చిన్నపిల్లలే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించింది. ఆఫ్రికాతోపాటు బయటి దేశాలకు కూడా ఈ మంకీపాక్స్ విస్తరించే ప్రమాదం పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రస్ అథనోమ్ హెచ్చరిస్తున్నారు.  

cbn diong same old mistake

చంద్రబాబు మళ్లీ పాత తప్పే చేస్తున్నారా? పార్టీని పట్టించుకోవడంలేదా?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ పాలనను పరుగులు తీయిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం, పరిశ్రమల స్థాపన కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. గతంలో 18 గంటలు పని చేస్తానని గతంలో చంద్రబాబు చెప్పుకునే వారు. అయితే ఇప్పుడు ఆయన స్పీడ్ చూస్తుంటే 20 గంటలు పని చేస్తున్నారా అనిపించకమానదు. అయితే 2014 నుంచి 2019 వరకూ ఆయన అప్పటికి రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి ఏడాది దేశంలోనే  రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపారు. తరువాతి నాలుగేళ్లు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. పట్టిసీమ పూర్తి చేశారు. కియా వంటి అగ్ర శ్రేణి పరిశ్రమలు రాష్ట్రానికి క్యూకట్టాయి. ఐటీలో ఏపీ తెలంగాణను అధిగమించేయడం ఖాయం అన్న భావన సర్వత్రా ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత పేరు తప్ప మరేమీ మిగలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి పథంలో పరుగులెత్తించిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పార్టీని మాత్రం గెలిపించుకోలేకపోయారు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రగతిపైనే దృష్టి సారించి పార్టీనీ, కార్యకర్తలను పట్టించుకోకపోవడమేనని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  ఇక ప్రస్తుతానికి వస్తే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు విస్పష్టంగా ఈ సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రగతితో పాటు పార్టీని పట్టించుకుంటారనీ, పార్టీ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తానని పదే పదే చెప్పారు. తాను మారాననీ, ఆ మార్పు మీరు చూస్తారనీ అన్నారు. సరే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పోలవరం, అమరావతి నిర్మాణాలు వేగం పుంజుకుంటయనీ, రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా తరలివస్తాయన్న నమ్మకం జనంలో ఏర్పడింది. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ నమ్మకం మరింత బలపడటానికి కారణమైంది.  అయితే చంద్రబాబు రాష్ట్ర ప్రగతిపైనే దృష్టి పెట్టారనీ, గతంలోలాగే పార్టీని పట్టించుకోవడం లేదనీ తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు పూర్తి అయినా ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించకపోవడంతో గత ఐదేళ్లుగా పార్టీ కోసం జగన్ వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొంటూ పోరాడిన శ్రేణులు, నేతలలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా కష్టపడ్డ నేతలు, తెరవెనుక పనిచేసిన ప్రముఖులు, అలాగే కూటమి భాగస్వామ్య పక్షాల  ఎన్నికల్లో పార్టీ కోసం వివిధ రూపాల్లో పనిచేసిన మాజీ అధికారులు  పదవులు ఆశిస్తున్న పరిస్థితి. ఊహించని స్థాయిలో విజయం దక్కడంతో.. నేతల ఆశలు-అంచనాలు కూడా అదే స్థాయిలో  ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం నామినేటెడ్ పదవులపై దృష్టి సారించడం లేదంటూ పార్టీ వర్గాలలో ఒకింత అసంతృప్తి మొదలైంది.    ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరం చంద్రబాబుకు ఒకింత క్లిష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  పొత్తులో సీట్లు దక్కని 31 నియోజకవర్గ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేసిన సీనియర్లు, మాజీ అధికారులు, వివిధ సంస్థల  అధిపతులు కూడా  నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు.  ఇప్పటివరకూ పార్టీకి సంబంధం లేకుండా, లక్ష్పీపార్ధసారధి ఒక్కరిని మాత్రమే నియమించారు. మిగిలిన అన్ని పదవులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు, పాలకవర్గం కూడా భర్తీకాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ పదవి రేసులో ఒక మీడియా సంస్థ అధినేత సహా పలువురు ఉన్నారు. వీరిలో టీవీ5 అధిపతి బీఆర్ నాయుడు, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజు, బీద రవీంద్రయాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  ఇంకా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌ల నియామకాలు చేయలేదు.  మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు డిప్యూటీ చైర్మన్, కూన రవికుమార్‌కు చీఫ్ విప్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.  అత్యంత కీలకమైన  సీఎం సీపీఆర్‌ఓను కూడా ఇంకా నియమించలేదు. అదేవిధంగా ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిని ప్లానింగ్‌బోర్డు ఉపాధ్యక్ష పదవి కూడా పెండింగ్ లోనే ఉంది. ఏది ఏమైనా నామినేటెడ్ పదవుల భర్తీలో ఇంకెంత మాత్రం జాప్యం తగదన్న భావనకు చంద్రబాబు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో సర్వ విధాలుగా నాశనమైపోయిన రంగాలు, వ్యవస్థలను గాడిలో పెట్టే పనిపై ఈ రెండు నెలలూ దృష్టి కేంద్రీకరించి పని చేసిన చంద్రబాబు.. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు. పొలిట్ బ్యూరో సమావేశంలో నామినేటెడ్ పదవులపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనీ, నియామకాలు కూడా వెంటనే చేపడతారని చెబుతున్నారు.   

నాగార్జున సాగర్, పులిచింతలకు భారీగా వరదనీరు

కృష్ణమ్మ పరుగులుతో సాగర్ , పులిచింతల ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది.   ప్రాజెక్టుల నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకున్నాయి. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 3,19,408 క్యూసెక్కులు కాగా, దిగువకు 2,89,356 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల నిండు కుండలా మారింది. పులిచింతలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరాం తాతయ్య కలిసి బుధవారం 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు నేతలు పూజలు చేసి, జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. పులిచింతల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా గురువారం ఉదయానికి 167.94 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, 35.5 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు గురువారం ఉదయానికి ఇన్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా ఉండగా, అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుండి కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీకి పరుగులు పెడుతోంది. భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది.రు.

ఉమ్ముతో మసాజ్.. దూల తీరింది ఎదవకి!

ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మెంటలోడు బార్బర్ షాపు నడుపుతున్నాడు. తన దగ్గరకి వచ్చే కస్టమర్లు ఫేస్ మసాజ్ చేయించుకునేటప్పుడు మధ్యమధ్యలో ఉమ్ముతో కూడా మసాజ్ చేసేవాడు. అలా చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో గమనించిన అధికారులు సీరియస్ అయ్యారు. అతని బార్బర్ షాపు చిట్టా బయటకి తీశారు. అది అక్రమంగా కట్టిన షాపు అని తెలిసింది. అంతే, బుల్డోజర్ తీసుకొచ్చి బార్బర్ షాపుని కూల్చేశారు. ఉమ్ముతో మసాజ్ చేసిన ఆ మెంటలోడిని కూడా అరెస్టు చేశారు. లేనిపోని దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకోవడం అంటే ఇదే.

ప్రకాశం బ్యారేజ్.. అదరహో!

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీ స్థాయిలో చేరింది. ఆ నీటిని చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఇదే మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బుధవారం ప్రకాశం బ్యారేజ్‌ని సందర్శించిన సందర్భంగా అన్నారు. విజయవాడలో వున్న ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. దాంతో వరదనీరు బ్యారేజీకిలో భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ‌లో ‌ 2,88,191 క్యూసెక్కుల నీరు వుంది. కాలువలకు ‌13,991 క్యూసెక్కుల నీటిని విడుదల అవుతోంది. వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 30 గేట్లు 7 అడుగుల మేర, 40 గేట్లు 6అడుగుల మేర ఎత్తి 2,74,200 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాలలో వుండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.