ఎపిలో వింత...ఎండాకాలంలో వర్షాలు

సూర్యుని జన్మని సూచించే  రథ సప్తమి రాగానే ఎండలు ప్రారంభమవుతాయి.  వర్షాకాలం వచ్చే వరకు వానలు ఉండవు. అయితే ఈ సంవత్సరం భిన్నంగా ఫిబ్రవరి నాలుగో తేదీకి  ముందే  రథసప్తమి ముందే ఎండలు మండిపోయాయి. ఇవ్వాల్టి వరకు ఎండలు దంచి కొడుతున్నాయి.  ఎపిలో మాత్రం రేపట్నుంచి మూడు రోజులు వర్షాలు ముంచెత్తుతాయని  విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.  మార్చి 22  నుంచి ఉత్తర కోస్తా జిల్లాలలో వర్షాలు పడతాయి.  వారం రోజుల పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఈ వర్షాల కారణంగా పది రోజుల పాటు చల్లటి వాతావరణం ఉంటుంది.  గంటకు 40  నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.   

సుబ్రహ్మణ్యం మీద సుబ్రహ్మణ్యేశ్వరుడిది ప్రేమా.. పగా?

పదేళ్లలో 103 సార్లు పాము కాటు ప్రతి సారీ చావు అంచుదాకా వెళ్లి బతికి బట్టకడుతున్న వైనం హేతువుకు అందని వింత నాగదేవుడి పేరు పెట్టుకున్న ఆ వ్యక్తిపై పాములు పగబట్టాయా? లేక భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నాయా? తెలియదు కానీ సుబ్రహ్మణ్యం అన్న నామధేయం ఉన్న ఆ వ్యక్తిని గత పదేళ్లలో  పాములు 103 సార్లు కాటు వేశాయి. అలా పాము కాటుకు గురైన ప్రతి సారీ అతడు బతికి బయటపడ్డారు. పాము కాటునుంచి తప్పించుకునేందుకు అతగాడు చేయని ప్రయత్నం లేదు. ఊర్లు మారాడు, రాష్ట్రాలు మారాడు. కానీ అదేమిటో అతడెక్కడ పని చేస్తే అక్కడ పాము కాటుకు గురౌతూ వస్తున్నాడు. ఇది వింతా, మిస్టరీయా తెలియదు కానీ.. సుబ్రహ్మణంను వెతికి వెతికి మరీ పాములు కాటువేస్తున్నాయి.  విషయమేంటంటే.. చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలం చల్లారు గుంట వాసి వడ్డెర సుబ్రహ్మణ్యం (47) గత పదేళ్లలో 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. సుబ్రహ్మణ్యం అని నాగదేవత పేరు పెట్టు కున్నసుబ్రహ్మణం ఇలా తరచుగా పాము కాటుకు గురి కావడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. పాము కాటుకు గురైన ప్రతి సారీ సుబ్రహ్మణ్యం చావు అంచుల దాకా వెళ్లి వస్తున్నాడు. తాజాగా ఈ నెల 15న మరో సారి అంటే 103వ సారి సుబ్రహ్మణ్యంను పాము కాటేసింది. పెద్ద పంజాణి జేఎంజే అస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే ఇన్ని సార్లు పాములు సుబ్రహ్మణ్యంనే ఎందుకు కరుస్తున్నాయి..అంటే సమాధానం దొరకదు. పాము కాటుకు గురైన ప్రతిసారీ వైద్య సహాయంతో బతికి బట్టకడుతున్నాడు కానీ, ఆ వైద్యం కోసం సుబ్రహ్మణ్యం తనకున్న మూడెకరాల పొలాన్నీ అమ్మేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.  సర్పదోషనివారణ పూజలు,రాహుకేతు పూజలు చేశాడు. అయినా పాములు మాత్రం అతడిని వదల డం లేదు.  మొత్తం మీద ఇన్ని సార్లు పాముకాటుకు గురైన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం గిన్నిస్ రికార్డులకు ఎక్కే అవకాశం లేకపోలేదని నెటిజనులు అంటున్నారు. సుబ్రహ్మణ్యం వెర్సెస్ పాములు వెనుక కారణాలు కనుగొనడానికి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

పదిహేనేళ్ల పాటు బాబే సీఎం..నేనే డిప్యూటీ.. తేల్చేసిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పాలన సాగిస్తోంది. పాలనా పరంగా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా, కూటమి పార్టీలలో సఖ్యత విషయంలో అనుమానాలు పొడసూపుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనల మధ్య అగాధం ఏర్పడిందన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ఈ విషయమై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఉన్నాయని జనం భావించే లక్ష్యంతో వైసీపీ మీడియా ఈ ప్రచారం సాగిస్తోందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ ప్రచారాన్నిఖండిస్తున్నాయి. అయినా కూడా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాని పరిస్థితి ఉంది. తాజాగా ఇటీవల పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేనాని పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలు అభూతకల్పనలేనని పవన్ కల్యాణ్ తేల్చేశారు. అది కూడా జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేల సమక్షంలో చంద్రబాబును పక్కన పెట్టుకుని తమ రెండు పార్టీల మధ్యా ఎలాంటి పొరపొచ్చాలూ లేవని విస్ఫష్టంగా చెప్పాశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం (మార్చి 20) ముగిశాయి. సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు కూడా అదే రోజు ముగిశాయి. ఈ సందర్భంగా  విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రజాప్రతినిథుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వీటిని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం, జనసేనల బంధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని విస్పష్టంగా చెప్పారు. దేశానికి నరేంద్ర మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అయ్యారనీ, అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటారనీ పవన్ కల్యాణ్ అన్నారు. అంటే చంద్రబాబు 15 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటారనీ, ఈ 15ఏళ్లూ తానే ఉపముఖ్యమంత్రిగా ఉంటాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. కూటమి సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉంటుందనీ, అంత కాలం తెలుగుదేశం అధినేత చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారనీ, తాను ఉప ముఖ్యమంత్రిగా ఆయన కింద పని చేస్తాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో చంద్రబాబు సహా తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ఆయన వైపే చూస్తు ఉండిపోయారు.  ఈ మాటలతో తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు పొడసూపాయంటూ జరుగుతున్న ప్రచారానికి పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. చంద్రబాబు పని తీరుకు, ఆయన విజ్ణతకు, దార్శనికతకు తాను అభిమాననని, రాష్ట్రప్రగతి విషయంలో ఆయన చిత్తశుద్ధిపై తనకు పూర్తి విశ్వాసం ఉందనీ పవన్ కల్యాణ్  చెప్పడం ద్వారా తెలుగుదేశంతో జనసేన పొత్తు సుదీర్ఘ కాలం సాగుతుందని తేటతెల్లం చేసేశారు.  

మంత్రి ఫరూక్ కు సతీ వియోగం

ఆంధ్రప్రదేశ్  మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్   సతీమణి షెహనాజ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమెశుక్రవారం (మార్చి 21)  ఉదయం తుదిశ్వాస విడిచారు. సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. షెహనాజ్‌ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.  శనివారం (మార్చి 22) అంత్యక్రియలు నిర్వహిస్తారు.   గత ఐదారు నెలలుగా షెహనాజ్  అనారోగ్యతో బాధపడుతున్నారు.మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్  మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు.  ఫరూక్   ఫరూక్‌ కుటుంబానికి అల్లా మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు. అలాగే మంత్రి లోకేష్, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రగాఢ సంతాపం తెలిపారు.  

 స్మగ్లర్ వీరప్పన్ కూతురుకి ఎన్టీకే పార్టీలో కీలక పదవి 

తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నేరాలను పెంచి పోషించిన వారి వారసులకు అక్కడి రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకుని కీలక పదవులు కట్టబెడుతున్నాయి. నేర ప్రవృత్తి అభ్యర్థుల అర్హతగా మారిపోయింది. గంథపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణికి తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలో కీలక పదవి వరించింది.  ఆ పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా నియమించారు.   పార్టీ  ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ  విద్యారాణి నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. పిఎంకె పార్టీలో చేరి ఆమె రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2020లో  బిజెపిలో చేరారు.  తాజాగా ఎన్టీకేలో చేరి కీలక పదవిని కైవసం చేసుకోవడం చర్చనీయాంశమైంది.  గత లోకసభ ఎన్నికల్లో కృష్ణగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి  ఎన్టీకే అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. మూడు రాష్ట్రాలను గడ గడలాడించిన కరడు గట్టిన స్మగ్లర్ వీరప్పన్ 2004లో కర్నాటక అడవుల్లో ఎన్ కౌంటరయ్యారు. వీరప్పన్ కు ఉన్న క్రేజ్ ను ఎన్టీకే వినియోగించుకోవాలని చూస్తోంది. వన్నీయర్ సామాజిక వర్గానికి చెందిన  వీరప్పన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు జనాభాలో 12 నుంచి 15 శాతం వన్నీయార్ లు ఉన్నారు. వీరప్పను లాగే అతని కూతురుని వన్నీయార్లు ఆదరిస్తారని ఎన్టీకే భావిస్తోంది.  

తెలుగుదేశం వైపు మర్రి రాజశేఖర్ చూపు!

వైసీపీ భవిష్యత్ పట్ల ఆ పార్టీ నాయకులు ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీ కీలక నేతలంతా జగన్ కు దూరం జరుగుతూ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బుధవారం (మార్చి 20) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీని కూడా వీడతాననీ, తన కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశం గూటికి చేరతాననీ ప్రకటించారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఇప్పటి వరకూ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. మర్రి రాజశేఖర్ కంటే ముందు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంటకరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే.. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన వైసీపీ తరఫున విజయం సాధించారు. చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఇండిపెండెంట్ గా విజయం సాధించిన మర్రి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు.  ఇక 2019 ఎన్నికలలో ఆయన చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019లో చిలకలూరి పేట స్థానం నుంచి విడదల రజనీని జగన్ రంగంలోకి దింపారు. అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోనైనా మర్రి రాజశేఖర్.. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, కేబినెట్ లోకి తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు.   అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ ఇచ్చిన హామీ మేరకు మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం 2023 వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలలో మర్రికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మర్రి రాజశేఖర్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. కాగా రాజీనామా చేయవద్దంటూ జగన్ రాయబారాలు పంపినా మర్రి ఖాతరు చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మర్రి రాజీనామా చేయవద్దంటూ ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు  ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పరీక్షలు జరిగాయి.  పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యార్థులను అనుమతించారు.  పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు రాయనున్నారు.  2, 650  పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి.  పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు చాలామంది విద్యార్థులు సమీపంలోని దేవాలయాలకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం కనిపించింది.  పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పహారా కాశారు. 

హైకోర్టులో శ్యామల క్వాష్ పిటిషన్

వైసీపీ అధికార ప్రతినిథి, యాంకర్ శ్యామల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ ఆమె హై కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం (మార్చి 21) విచారణ జరుపుతుంది.  నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలా కేసు నమోదైన వారిలో వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల కూడా ఉన్నారు.  అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ  శ్యామల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది? ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపీలాగుతున్నట్లు తెలియవచ్చింది.  ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే శ్యామల ఆస్తులు, లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందంటున్నారు. 

శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు  స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి, నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగానే చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా గురువారం రాత్రికే తిరుమల చేరుకున్నారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తదితరులు చంద్రబాబుకు పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు. గురువారం రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, అర్చ‌కులు  స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయక మండపం వద్ద వేదపండితులు  ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం   కుటుంబ సమేతంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు.   అక్కడ భక్తులకు చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ స్వయంగా  అన్న ప్రసాదాన్ని వడ్డించారు.. దేవాన్ష్ పేరుతో అన్న‌దానం నిర్వ‌హించారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. 

కేసీఆర్ లో గజ్వేల్ ఉప ఎన్నిక భయం.. అసెంబ్లీకి ఒక్క రోజు హాజరు అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై.. అధికారానికి దూరమైన క్షణం నుంచీ   రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అనే విధంగా యాక్టివ్ పోలటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. అయితే అప్పుడప్పుడు మాత్రం తాను మళ్లీ క్రియాశీలం అవుతాననీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాననీ చెబుతూ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారానికి దూరమైన ఈ 15 నెలల్లోనూ ఆయన అసెంబ్లీకి హాజరైంది కేవలం రెండు సార్లు మాత్రమే. రెండు మూడు సార్లు మాత్రమే బహిరంగంగా సభలలో మాట్లాడారు. అంతే మిగిలిన కాలమంతా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన తాను రాజకీయంగా క్రియాశీలం అవుతాననీ, అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీస్తాననీ గట్టిగా చెప్పారు. అన్నట్లుగానే అసెంబ్లీకి వచ్చారు. అదీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు మాత్రమే. ఆ తరువాత మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. యథాప్రకారం ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఈ 15 నెలల కాలంలోనూ ఆయనను ఎవరైనా కలవాలనుకున్నా.. లేదా ఆయన ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా వేదిక ఫామ్ హౌస్ మాత్రమే.   ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చారు. అప్పుడూ అంతే ప్రసంగం ముగించేసి మళ్లీ ఫామ్ హౌస్ కు చేరిపోయారు.   ప్రస్తుతం సభలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది కానీ కేసీఆర్  మాత్రం సభకు రాలేదు. దీంతో ఆయన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీకి వచ్చింది. మొక్కుబడి తంతుకోసమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణులలో కూడా వ్యక్తం అవుతోంది.  ఆయన అసెంబ్లీకి హాజరైంది.. కేవలం హాజరు కోసమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం   శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే గైర్హాజరుగా ప్రకటించవచ్చు.  అదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో  కేసీఆర్ ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి భయపడుతున్నారా? అందుకే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీలో హాజరు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ కాలం నుంచీ ఉప ఎన్నికలను పార్టీ పటిష్ఠతకు, ఉద్యమ బలోపేతానికి అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక అంటేనే భయపడుతున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అనర్హత   వేటు నుంచి తప్పించుకోవానికే కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యారా, ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ ను ఫాలో అయ్యారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  15 నెలల్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా  57లక్షల 84 వేల124 రూపాయల వేతనం తీసుకున్నారనీ, కానీ అసెంబ్లీకి హాజరైంది మాత్రం కేవలం రెండు రోజులేననీ ఎద్దేవా చేశారు. అయితే ఆ విమర్శలను, ఎగతాళిని కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకుంటే నాకేం.. అనర్హత వేటు నుంచి తప్పించుకుంటే చాలు అన్నట్లుగా ఆయన వైఖరి కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఫాలో అవుతున్నట్లు తోస్తోంది. అందుకే జగన్ లానే కేసీఆర్ కూడా అసెంబ్లీకి  మొక్కుబడిగా ఒక రోజు హాజరై..మళ్లీ ముఖం చూపడం లేదు. వాస్తవానికి దేశంలో ఉప ఎన్నికలను అత్యంత వ్యూహాత్మకంగా, సమర్ధంగా పార్టీ పురోగతికి, బలోపేతానికి వాడుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో  ఆయన ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు తెరలేపేవారు.  అప్పట్లో ఆయన తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల ద్వారా ఉద్యమ స్ఫూర్తి ఇసుమంతైనా తగ్గకుండా ఉంచేవారు. అటువంటిట కేసీఆర్ ఇప్పుడు.. ఉప ఎన్నిక అంటే భయపడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వ్యవహరిస్తున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో పరాజయాన్ని చవి చూశారు. గజ్వేల్ లో విజయం సాధించారు. కామారెడ్డి పరాజయంతో ఆయన ఇప్పుడు తనపై అనర్హత వేటు పడి గజ్వేల్ కు ఉప ఎన్నిక వస్తే ఆ స్థానాన్ని నిలుపుకోవడం కష్టం అని భావిస్తున్నారనీ, అందుకే   శాసనసభ్యత్వాన్ని కాపాడుకుని, ఉప ఎన్నిక ముప్పును నివారించడానికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున హాజరయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

సీనియర్లకు శుభ సంకేతాలు!

తెలంగాణ కాంగ్రెస్లో సీన్ రివర్స్ అవుతోందా? ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అంతే  కాదు, యంగ్ లీడర్స్ టాలెంట్ గుర్తించక పోవడం, పదవులు పక్కదారి పట్టి సీనియర్ నాయకులకు చేరడంతో   యువ నాయకులు అనేక మంది వేరే దారులు వెతుకున్నారు. ఉదాహరణకు,   రాజస్థాన్, మధ్య ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్టానం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సచిన్ పైలెట్ ను కాదని, వృద్ద నేత అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది. మధ్య ప్రదేశ్ లోనూ అంతే, జ్యోతిరాదిత్య సింధియా ను కాదని కమల్ నాథ్ ను  సిఎంను చేసింది.  నిజానికి, పైలెట్, సింధియా ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి సన్నిహితులు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు. సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్  కాంగ్రెస్  పార్టీలో, ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు మంత్రివర్గంలో పనిచేసారు. జ్యోతిరాదిత్య సిందియా తండ్రి మాధవ  రావు   సిందియా విషయం అయితే చెప్పనే అక్కర లేదు. నాలుగైదు సార్లు ఎంపీగా గెలవడమే కాదు,   గ్వాలియర్ నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజ్ పేయిని ఓడించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.  పైలెట్, సింధియా ఇద్దరూ కూడా. వారసులుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చినా, నాయకులుగా నిరుపించుకున్నారు. ఎంపీలుగా గెలిచారు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మన్మోహన్ సింగ్   మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసి, పరిపాలనా అనుభవం సంపాదించుకున్నారు. రెండు రాష్ట్రల్లోనూ 2018 ఎన్నికలలో  కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ఇద్దరే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.  అయినా, కాంగ్రెస్ అధిష్టానం యువ నాయకులను కాదని, వృద్ధులకు పదవులు కట్టబెట్టింది. నిజానికి  ఆ ఇద్దరనే కాదు, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది యూత్ లీడర్స్ కు పార్టీలో  గుర్తింపు దక్కలేదు. అందుకే జితిన్  ప్రసాద, ఆర్పీ సింగ్ మొదలు నిన్న మొన్న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన,  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ వరకు ఎంతో మంది యువ నేతలు ముఖ్యంగా రెండు మూడు తరాలుగా, కాంగ్రెస్ కుటుంబాలుగా ముద్ర వేసుకున్న  నేతల కుమారులు, కాంగ్రెస్ అధిష్టానం తమకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని బయటకు వెళ్లి పోయారు. ఈ మధ్యనే  జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవలు అందించిన, అహ్మద్ పటేల్ కుమారుడు, ఫైసల్  పటేల్   కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి, ఇక చాలని తప్పుకున్నారు. అయినా  యంగ్ టాలెంట్ బయటకు వెళ్లి పోతున్నా చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పటికీ  సీనియర్ నాయకులకే కుర్చీలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఎదుకనో ఒక్క తెలంగాణ విషయంలో మాత్రం, ఆనవాయితీకి భిన్నంగా, రెండుమూడు పార్టీలు మారి, కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డిని మాత్రం చేయి పట్టుకుని రాజకీయ వైకుంఠపాళిలో పాముల నోటిన పడకుండా నిచ్చెనలు ఎక్కించుకుంటూ   పైకి తీసుకు పోయింది. 2017లో  తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి   అధిష్టానం అండదండలతో చకచకా  నిచ్చెన మెట్లు ఎక్కారు.   బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇంత వేగంగా పదవుల మెట్లు ఎక్కినా నాయకుడు మరొకరు ఉండక పోవచ్చును. 2021 లో సీనియర్ నాయకుల నుంచి తీవ్ర  ప్రతిఘటన  ఎదుర్కుని కూడా ఆదిష్ఠానం   అండదండలతో  టీపీసీసీ  అధ్యక్షుడయ్యారు. అదే క్రమంలో 2023లో కాంగ్రెస్ అధిష్టానం,సీనియర్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ని  ముఖ్యమంత్రిని చేసింది.  అయితే  ఇప్పడు అదే అధిష్టానం కారణాలు ఏమిటో ఖచ్చితంగా తెలియక పోయినా సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్  నియామకం జరిగిన తర్వాత, ఈ  మార్పు   స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.  అలాగే, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిని  పక్కకు నెట్టి, జానా రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టాం సీనియర్ నాయకులకు  త్వరలోనే పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లు, అయ్యిందని సీనియర్ నాయకులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ రాకతో, అధిష్ఠానానికి సీనియర్ నాయకులకు మధ్య మాజీ రాష్ట్ర ఇన్ చార్జిలు, కోటరీ నేతలు కట్టిన అడ్డు గోడలు తొలిగి పోయాయి. సీనియర్ నాయకుడు జానా రెడ్డి వారధిగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో  సీనియర్ నాయకులకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది  అంటున్నారు. అలాగే, ఇటీవల గుజరాత్ లో రాహుల్ గాంధీ, బీజేపీతో భూత, భవిష్యత్, వర్తమానాల్లో పత్యక్ష, పరోక్ష సంబంధాలున్న అందరికీ  ఉద్వాసన తప్పదని చేసిన హెచ్చరిక  నేపధ్యంగా రాష్రంలో చోటు చేసుకుంటున్న  పరిణామాలను సీనియర్ నాయకులు  శుభ సంకేతాలుగా తీసుకుంటున్నారు.

జగన్ పట్ల ధిక్కారమే వారి లక్ష్యమా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్న పార్టీనే గానీ.. ప్రజాస్వామికంగా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి స్థాపించి.. తానే ఆ పార్టీకి మోనార్క్ అని భావించుకుంటూ.. నియంతలా నిర్వహిస్తున్న పార్టీ అది. రికార్డుల్లో కూడా అలాంటి పోకడే ఉండాలనే ఉద్దేశంతోనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం- ఆ పప్పులన్నీ ఉడకవని మొట్టికాయలు వేసిన తరవాత నాలిక్కరచుకుని వెనక్కు తగ్గారు. అలాంటి పార్టీలో ఎవరైనా చెలామణీ అవుతున్నారంటే.. వారందరరూ జగన్ దయాదాక్షిణ్యాల మీదనే బతుకుతున్నట్టుగా ఆయన భావిస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం ఉండే పార్టీలో ఆయనను ధిక్కరించి నడుచుకునే వాళ్లు ఉండరు. సాధారణంగా అలాంటి వారు పార్టీని వదలి తమ దారి తాము చూసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ శాసనసభలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు.. జగన్ పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాలనుకుంటున్నారా? ఇలాంటి చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  శాసనసభలో పది శాతం ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష నేత హోదా దక్కదు అనే సంగతి తనకు స్పష్టంగా తెలిసినప్పటికీ, అదే మాటలతో గతంలో చంద్రబాబును ఎద్దేవా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు రాబోనంటూ పట్టుపట్టారు. తన పార్టీ తరఫున గెలిచిన మిగిలిన పదిమందినీ కూడా వెళ్లనివ్వకుండా నియంత్రించారు. అయితే.. ఈలోగా.. వరుసగా 60రోజులు సభకు గైర్హాజరైతే పదవి పోతుందనే రాజ్యాంగ నిబంధన తెరపైకి వచ్చింది. జడుసుకున్న జగన్, తొలుత మేకపోతు గాంభీర్యంతో మాట్లాడారు గానీ  పిమ్మట అందరినీ వెంటబెట్టుకుని ఒక రోజు సభకు వచ్చి వెళ్లారు.  ఆ తరువాత కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో సభ దాక వచ్చి అటెండెన్సులో సంతకాలు చేసి.. సమస్యలపై సభకు ప్రశ్నలు ఇచ్చేసి.. సభలోనికి అడుగుపెట్టకుండానే బయటకు వెళ్లిపోతున్నారని ఇవాళ స్పీకరు అయ్యన్నపాత్రుడు గుర్తించారు. దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాల్సిన, దొంగల్లాగా వ్యవహరించాల్సిన ఖర్మ వారికేం పట్టిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు కూడా. దీనికి ఆ ఏడుగురిలో ఒకరైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటర్ ఇస్తూ .. తాము దొరల్లాగానే వచ్చి వెళ్లాం అని వివరణ ఇచ్చారు కూడా.  ఆ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిస్వామ్య పార్టీగా నడిచే వైఎస్సార్ కాంగ్రెస్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను సభకు వెళ్లవద్దని నిర్దేశించిన తర్వాత.. వారు సంతకం పెట్టడం మాత్రం ఎలా జరిగింది? సంతకాలు పెట్టేయడం ద్వారా.. తమ మీద అనర్హత వేటు పడకుండా కాపాడుకోవాలని వారు అనుకున్నారా? లేదా, ఈ విషయం దాచేస్తే దాగేది కాదు కాబట్టి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదేశం పట్ల తమ ధిక్కార స్వరాన్ని బహిరంగంగానే వినిపించదలచుకున్నారా? అనే మీమాంస ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. తాను వద్దని చెప్పిన తర్వాత సభకు వెళ్లిన వారి మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తాటిపర్తి చంద్రశేఖర్ వివరణ కూడా రావడం విశేషం.  ఈ ఏడుగురి వైఖరి ఖచ్చితంగా జగన్ పట్ల ధిక్కారమేనని, అయితే, వారి మీద కోపం వచ్చినా కూడా ఇదివరకటిలాగా ప్రదర్శించలేని దుర్బల స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే మీద ఆగ్రహిస్తే వారు పార్టీకి రాజీనామా చేసేస్తారో అనే భయం ఆయనలో ఉన్నదని ప్రజలు కూడా అనుకుంటున్నారు.

ఛత్తీస్గఢ్ లో ఎన్ కౌంటర్.. 22 మంది మావోలు మృతి!

ఛత్తీస్గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో  ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కూడా మరణించినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతుండటంతో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్ ముక్త దేశంగా చూడాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జనవరి 6న ప్రకటించారు. అప్పటి నుంచే దండకారణ్యంలో పోలీసు యాక్షన్ ముమ్మరమైంది. కూంబింగ్ ఆపరేషన్ ఎడతెగకుండా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి9న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.    తాజాగా గురువారం (మార్చి 20)  ఉదయం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్యా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో  22 మంది మావోయిస్టులు మరుణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.    దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ పోస్టులో  మన సైనికులు నక్సల్ ముక్త భారత్ అభియాన్ దిశగా ఒక గొప్ప ముందడుగు వేశారని పేర్కొన్నారు.  మోడీ  ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. అనే పేర్కొన్నారు. 

చాహల్ , ధనశ్రీ లకు  విడాకులు  మంజూరు 

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ధన శ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు గురువారం (మార్చి 20)తో తెరపడింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది కన్ఫర్మ్ చేశారు. ధన శ్రీకి భరణం క్రింద రూ 4. 75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. విడాకులు కేసు తుది దశకు చేరుకోవడంతో చాహల్ ఇంకా ఐపిఎల్  టీమ్ లో చేరలేదు. చాహల్, ధనశ్రీ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు గుప్పు మన్నాయి. వీరువురికి 2020లో  పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లయ్యింది34 ఏళ్ల చాహల్ 2025 ఐపిఎల్ ఆడటానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమౌతుంది. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.  బాలివుడ్ నటి  ప్రీత జింతా యాజమాన్యంలో ని పంజాబ్ కింగ్స్ చాహల్ కు భారీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసింది. చాహల్ ను కొనుగోలు చేయడానికి  పంజాబ్ కింగ్ రూ 18 కోట్ల బిడ్ వేసింది 

అందమైన వివాదం.. మిస్ వరల్డ్ చుట్టూ దుమారం

మన దేశం మరో మారు  మిస్ వరల్డ్  (ప్రపంచ సుందరి) పోటీలకు వేదిక అవుతోంది.  అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  మే 7 నుంచి 31 వరకు  హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.   ఇంచు మించుగా,నెల రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 140 దేశాల అందాలు భామలు పాల్గొంటారు. ఆ 140 దేశాల అందాల భామలు హైదరాబాద్ లో కురిపించే  అందాలను  కెమేరాతో పట్టుకుని   ప్రపంచానికి చూపేందుకు మూడు వేల టీవీ ఛానల్స్  నెల రోజుల పాటు  హైదరాబాద్  నగరంలో విడిది చేస్తాయి. ఈ మూడు వేల టీవీ ఛానల్స్  రాక పోకలు ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి విదేశాంగ మంత్రి జయశంకర్ తో మంతనాలు జరిపి  వచ్చారు. దీంతో ప్రపంచ సుందరి  పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది.  అంతే  కాదు  ప్రపంచ సుందరి పోటీలకు తమ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నదో కూడా ముఖ్యమంత్రి స్వయంగా శాసన సభకు వివరించారు. ఇది అలాంటి ఇలాంటి వేడుక కాదు, ఇతవరకు 72 సార్లు  ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తే ఒకే ఒక్క సారి 1998లో  మన దేశంలో బెంగుళూరులో నిర్వహించారు. అదికూడా అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) సంస్థ నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పడు మా ప్రభుత్వమే ప్రపంచ సుందరి  పోటీలు నిరహిస్తోందని సగర్వంగా సభకు తెలిపారు. (ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో కానీ, లాస్ట్ ఇయర్, 2024 లోనూ మన దేశంలో  ముంబై/ ఢిల్లీలోనే మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. సరే అది వేరే విషయం.) ఈ పోటీలను ఇక్కడ హైదరాబాద్’లో  నిర్వహించడం వలన రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని,అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, నిర్ణయించిందని వివరించారు.  అయితే ఎప్పుడో జరిగే అందాల పోటీల విషయం ఎలా ఉన్నా ఇప్పుడది, రాష్ట్ర  రాజకీయాల్లో మరో వివాదానికి తెర తీసింది. పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్ లో నిర్వహించడం  ద్వారా  పర్యాటక రంగం పరుగులు తీస్తుందని, అంటుంటే, ప్రధాన ప్రతి పక్ష పార్టీ బీఆర్ఎస్  మాత్రం  అందాల పోటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని ఆరోపిస్తోంది. అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో అందాల పోటీలా ...?  అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోటీల నిర్వహణకు రూ.200 కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆరోపించారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.46 కోట్లు ఖర్చుచేసి  ఫార్ములా - ఈ కార్  రేస్ నిర్వహిస్తేనే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఏదో జరిగిపోయిందని  ఏసీబీ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే  కేవలం రూ.46 కోట్లతో  ప్రపంచంలోనే ప్రప్రధమంగా ఫార్ములా - ఈ  రేస్  నిర్వహిం చడమే తప్పయితే, రూ.200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఎలా రైట్  అవుతుందని బీఆర్ఎస్ నేతలు లాజికల్ గా  ప్రశ్నిస్తున్నారు. సరే.. అదలా ఉంటే, ఇందులో ఇంకొక సీరియస్ కోణం వుందని అంటున్నారు. 1998లో అమితాబచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలా  పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.  మహిళా సంఘాల నిరసనలు, ఆత్మాహుతి ప్రయత్నాల కారణంగా స్విమ్ సూట్’ ఈవెంట్ ను రద్దు చేయడం కూడా జరిగిందని  గుర్తు చేస్తున్నారు.అంతే కాదు  చిత్రంగా, ప్రగతిశీల వామపక్ష మహిళా సంఘాలు, హిందూ జాతీయ వాద మహిళా సంఘాలు ఒకే గొంతుకతో  నిరసన గళం వినిపించాయి. అయితే, ఇప్పడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందా? శాంతి భద్రతల సమస్య వస్తుందా, అంటే చెప్పలేము. అయితే ఇటీవల ఉత్తర ప్రదేశ్, ప్రయాగ రాజ్ లో 45 రోజుల పాటి సాగిన మహా కుంభ మేళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన మాటల యుద్ధం, తీవ్ర రాజకీయ దుమారన్నిరేపింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నాయకులు, సనాతన హిందూ ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు  అందుకు వ్యతిరేకంగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు, కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తూ చేసిన ప్రతి విమర్శలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా కొంత ఇబ్బందికి గురిచేశాయి అనే అభిప్రాయం వుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, కుభమేళ ప్రభావం కొంత మేర ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లోఉంది. ఈ నేపధ్యంలో భారతీయ, సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధమనుకునే మిస్ వరల్డ్ అందాల పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం పై బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఎలా స్పందిస్తాయి.. కాంగ్రెస్ ఆదిస్థానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేవి ఇప్పడు మిస్ వరల్డ్ ముందున్న ప్రశ్నలు. అలాగే  ఈ అందాల వివాదం  చిలికి చిలికి వికృతంగా వికారంగా మారుతుందా, లేక  లాస్ట్ ఇయర్ లాగా,  కూల్ గా సర్దు మణిగి పోతుందా  అనేది ముందు ముందు గానీ తెలియదు.

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఎ2 సునీల్ యాదవ్?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర ఉందని చెప్పారు. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? హత్యకు కుట్రపన్నింది ఎవరు అన్న విషయాలను వెల్లడిస్తానని మీడియా సమావేశంలో చెప్పారు.  గురువారం (మార్చి20) కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్ యాదర్ ఈ హత్య విషయంలో తాను ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాననీ, అన వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గన్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్‌-2)గా ఉన్న సునీల్ యాద‌వ్ సైతం.. అప్రూవర్‌గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు చాలానే కుట్ర జ‌రిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవ‌రున్నారు? అస‌లు ఈ ప్లాన్ ఎవ‌రిది అనేది చెప్పేస్తా అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉద‌యం క‌డ‌ప ఎస్పీ కార్యాల‌యానికి వ‌చ్చిన సునీల్‌.. మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసు విషయంలో ఇంత వరకూ మౌనంగా ఉన్నాననీ, కానీ ఇప్పుడు తనకే బెదరింపులు వస్తున్నాయన్నారు.   తాను జైల్లో ఉన్న‌ప్పుడు, ఇప్పుడు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా త‌న‌కు వైసీపీ నాయ‌కుల నుంచి బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని, తనకు ప్రాణ భయం ఉందనీ సునీల్ చెప్పారు. అయితే భయపడుతూ ఎన్నాళ్లు బతకాలని భావించి.. ఇప్పుడు వివేకా హత్య వెనుక కుట్ర కోణాన్ని, హత్య సూత్రధారులు, పాత్రధారుల ఎవరన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో బెయిలుపై ఉన్నసునీల్ యాదవ్, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడీ వివరాలు బయటపెట్టడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి సైతం బెదరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, భద్రత కలిగించాలనీ  కోరుతూ కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ సైతం బెదరింపులు వస్తున్నాయంటూ జీల్లా ఎస్పీని ఆశ్రయించడం గమనార్హం.  

సిఐడి కస్టడీలో వల్లభనేని వంశీ

 టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  నిందితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  మూడు రోజుల పాటు సిఐడి కస్టడీ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారి చేసింది. ఈ కేసులో వంశీ ఎ 71 గా ఉన్నారు.  కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ఈ నెల 28 వరకు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సిఐడి పోలీసులు వంశీని కస్టడీలో తీసుకున్నారు.  ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇరు వర్గాల వాదనలు  ముగిసినప్పటికీ ఆయనకు బెయిల్ రాలేదు. గత వైకాపా హాయంలో  టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అప్పట్లో 54 రోజుల పాటు  రిమాండ్ చేస్తూ మహిళా న్యాయమూర్తి హిమబిందు  తీర్పు చెప్పారు.  ప్రస్తుతం వంశీ  కేసులో  హిమబిందు న్యాయమూర్తిగా ఉన్నారు. సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో వంశీ విజయవాడ జైల్లో ఉన్నప్పుడు వైకాపా  అధినేత జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల వల్లే వంశీకి బెయిల్ రాలేదని చర్చ జరుగుతుంది.  అధికారుల బట్టలూడదీస్తామనే  జగన్ వ్యాఖ్యలవల్లే వంశీకి బెయిల్ రాలేదని ప్రచారం జరుగుతుంది. వంశీపై మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వ్యాపార పనుల నిమిత్తం  తాను అమెరికా వెళ్లాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని వంశీ ప్రాధేయపడినప్పటికీ బెయిల్ రాలేదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ పై ఎఫ్ ఐఆర్ కొట్టివేసిన కోర్టు

ఫోట్ ట్యాపింగ్ కేసులో  మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి చ‌క్ర‌ధ‌ర్ గౌడ్‌ ఫిర్యాదు మేరకు హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి విదితమే.   అయితే ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హరీష్ రావు తన క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు.  ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో హరీష్ రావు ప్రమేయానికి సంబంధించిన ఆదేశాలు చూపాలని కోర్టు కోరింది. అందుకు పోలీసుల తరఫు న్యాయవాదది సమయం కోరినా, ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు సరికాదని పేర్కొంటూ కోర్టు హరీష్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.