సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పరిహారం, పునరావాసంపై కీలక ప్రకటన?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 27) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు.  ఈ సందర్భంగా ఆయన పరిహారం, పునరావాసం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. ముందుగా ఈ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.  అంతకు ముందు పోలవరం వ్యూపాయింట్ ను పరిశీలిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసిన అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది.  తాజా సమీక్షలో   పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో తాగు, సాగునీటికి కొరత లేకుండా పోతుందని చంద్రబాబు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరంపై ప్రత్యేక  దృష్టి పెట్టి పనులను పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతి సోమవారం ఆయన పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు సందర్శన చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పోలవరం పనులను నిలిపివేసింది. జగన్ హయంలో పోలవరం పడకేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరం పరుగులు తీస్తున్నది. నిర్దుష్ట కాలపరిమితిలో పోలవరం పూర్తే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత చంద్రబాబు పోలవరం సందర్శించడం ఇది మూడో సారి. దీనిని బట్టే ఆయన పోలవరం పూర్తికి ఇస్తున్న ప్రాధాన్యత అవగతమౌతుంది. 

హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది.  ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.  మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.   కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ కేసు ఏపీ సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలుువడే వరకూ అంటే ఏప్రిల్ 3 వరకూ ఎంపీ మిథున్ నెడ్డిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దనీ, అరెస్టు చేయవద్దనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశాన్ని తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో లేవనెత్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో పోలస్తే డిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదన్న ఆయన ఈ విషయంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తునకు  డిమాండ్ చేశారు.   దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిధున్ రెడ్డిని పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఈ కుంభకోణంపై ఆరా తీశారు. హోంమంత్రితో భేటీ అనంతరం హుటాహుటిన అమరావతికి వచ్చిన ఎంపీ కృష్ణ దేవరాయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంబకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికా ఫస్ట్ అంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాలకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా విదేశీ కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంచుతే నిర్ణయం తీసుకున్నరు. అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై ఈ పాతిక శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. జఅయితే అమెరికాలో తయారైన కార్లపై మాత్రం ఎటువంటి సుంకం ఉండదు.  ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 3 నుంచి అమలులోకి రానుంది.  దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.  అయితే ఈ తాజా సుంకం నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, ఆటో మేకర్ సరఫరా చైన్ ను దెబ్బతీస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.  

యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‎కు తృటిలో  ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.  వివరాలిలా ఉన్నాయి.   యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదేళ్ల పాలనను పురస్కరించుకుని లక్నోలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు యోగి ఆదిత్యనాథ్ ఆగ్రా నుంచి ప్రత్యేక విమానంలో  బయలుదేశారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటిలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఆగ్రా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.  ఆ తరువాత అధికారలు ఢిల్లీ నుంచి మరో విమానం రప్పించారు.   విమానంలో సాంకేతిక లోపం కారణంగా లక్నోలో సీఎం యోగి పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయ్యింది. ఇలా ఉండగా యూపీ సీఎం యోగి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.   సాంకేతిక సమస్యకు కారణాలేమిటన్న దానిపై ఫ్లైట్ ఇంజినీర్లను ప్రశ్నించారు.   

భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  

బెట్టింగ్ యాప్ లపై రేవంత్ రెడ్డి సీరియస్ 

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిండు అసెంబ్లీలో   బాసటగా నిలిచారు.   బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధం విధించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్నవారు  రెచ్చిపోతున్నారన్నారు.  తమ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఉపేక్షించబోదన్నారు.  పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.  ప్రస్తుతం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారిని కట్టడి చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. 

ఠారెత్తిస్తున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేద్ లో ఎండ తీవ్రత దడపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

వంశీకి ఇప్పట్లో బెయిలు కష్టమే!?

గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు. రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు. కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో  వంశీకి  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. 

నకిరేకల్ లో కేటీఆర్ పై రెండు కేసులు

బిఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.  నకిరేకల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో   సోషల్ మీడియా వేదికగా  తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ  నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేర్వేరుగా నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేపర్‌ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్‌  ఎక్స్‌  లో షేర్‌ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు   ఏ 1గా మన్నె క్రిశాంక్‌, ఏ 2 గా కేటీఆర్‌, ఏ 3గా కొణతం దిలీప్‌ కుమార్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్‌  ఫిర్యాదు మేరకు  ఏ1 గా కొణతం దిలీప్‌ కుమార్‌ , ఏ2గా మన్నే క్రిశాంక్‌, ఏ 3గా కేటీఆర్‌, మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.   పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతోపాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్‌ బాలునితో పాట ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.  

 అప్సర హత్య కేసులో పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు 

హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన  అప్సర అనే యువతిని 2023 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి  కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ప్రతీ రోజు అప్సర అనే యువతి ఆలయానికి వచ్చేది. ఈ  నేపథ్యంలో పూజారీతో పరిచయం ప్రేమకు దారితీసింది. పూజారి సాయి కృష్ణకు అప్పటికే పెళ్లయి పిల్లలు  ఉన్నారు. అప్సరకు  కూడా అ ప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో   అప్సర తమిళనాడు నుంచి హైద్రాబాద్ చేరుకుంది. అప్సరతో  అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఓకే చెప్పిన  పూజారి పెళ్లి చేసుకోవడానికి  మాత్రం నిరాకరించాడు.  ప్రతీరోజు అప్స‌ర  పూజారి సాయికృష్ణ ను  పెళ్లి చేసుకోవాలని వేధించేది.  ఎలాగో అలా  అప్సరను వదిలించుకోవాలనుకున్న  పూజారీ పథకం ప్రకారం తమిళనాడు కోయంబత్తూరు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. తన కారులోనే  శంషాబాద్ మండలంలోని సుల్తాన్ పల్లిలోని ఓ గో శాలకు తీసుకెళ్లాడు. సిసి కెమెరాలు లేవని నిర్ధారించుకుని అప్సరను హత్య చేశాడు. ముఖంపై ప్లాస్టిక్ కవర్ తో కప్పి అత్యంత పాశవికంగా పూజారి అప్సరను హత్య చేశాడు. తాను చేసిన నేరాన్ని పూజారి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. బలమైన సాక్ష్యాలతో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు.  రంగా రెడ్డి కోర్టులో ట్రయల్ ముగియడంతో  బుధవారం తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

మోడీ రంజాన్ తోఫా.. చంద్రబాబును తు.చ. తప్పకుండా అనుకరించిన ప్రధాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది. అందుకే ఆయనపై ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా, ఆరోపణలు చేసినా జనం వాటిని విశ్వసించరు.  గతంలో చంద్రబాబు ఆరంభించి, ప్రారంభించిన పలు పథకాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవ్వడమే చంద్రబాము ముందు చూపుకూ, వాస్తవిక దృక్ఫథానికీ నిదర్శనంగా పరిశీలకులు చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గతంలో ప్రారంభించి అమలు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. అంతే కాదు.. ఆ పథకానికి అప్పట్లో చంద్రబాబు పెట్టిన పేరునే కంటిన్యూ చేస్తూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏమిటనుకుంటున్నారా.. రంజాన్ తోఫా. ఔను రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ ను పురస్కరించుకుని వారి ఇళ్లల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు దోహదం చేసేలా రంజాన్ తోఫా అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ముస్లింలకు అవసరమైన పండుగ సరుకులను అందజేశారు. అంతేనా హిందువులకు సంక్రాంతి కానుక, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ఈ పథకాలకు బ్రహ్మాండమైన ప్రజాదరణ లభించింది.   ఇప్పుడు  మోడీ కూడా ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న 32 లక్షల పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన రంజాన్ తోఫాను యాజ్ ఇట్ ఈజ్ గా అదే పేరుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.  

రాజమండ్రిలో పాస్టర్ అనుమానాస్పద మృతి

 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ పగడాల  ప్రవీణ్ కుమార్(46)  అనుమానాస్పదస్థితిలో మరణించాడు. డెడ్ బాడీపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ పక్కనే ప్రవీణ్ మృతదేహం పడి ఉంది. స్పాట్ లోనే రక్తపు మరకలతో ఉన్న కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో డెత్ మిస్టరీ వీడలేదు. పాస్టర్ మృతితో ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనమైంది. డెడ్ బాడీ రాజమండ్రి  రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం చేస్తున్నారు.  రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని  గామన్ బ్రిడ్జి రహదారిపై మృతదేహం కనిపించింది.  క్రైస్తవ సంఘాలు డెత్ మిస్టరీ చేధించాలని నిరసనకు దిగాయి. పోస్టర్లు అంటించాయి.  హైద్రాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ లగేజి కట్టుకుని రాజమహేంద్రవరం బయలు దేరారు.  గామన్ బ్రిడ్జి టోల్  గేట్ దాటగానే పాస్టర్ మృతదేహం కనిపించింది. కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ప్రవీణ్ కుమార్ బుల్లెట్ పల్లపు ప్రాంతంలో పడిపోయింది.  ప్రమాదవశాత్తు ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న బుల్లెట్  లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.  పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై ఐటీ మంత్రి లోకేశ్  దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. 

రాజమహేంద్రవరంలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్యా యత్నం.. లైంగిక వేధింపులే కారణం!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని  బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది.  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ దీపక్ లైంగిక వేధింపులకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ అంజలి రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ దీపక్ తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు అంజలి పేర్కొంది.   ఏలూరు జిల్లా జీలుగుమిల్లికి చెందిన అంజలి   అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ అంజలి బంధువులు, విద్యార్థులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. దీపక్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి పరిస్థితి అదుపు చేశారు. అంజలి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమహేంద్రవరం, రాజానగరం ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు వచ్చి అంజలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.   

ఏపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి ఈడీ?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా?  ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు.  అయితే విశ్వసనీయ సమాచారం మేరకు లావు అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో భేటీ కాలేదనీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే స్వయంగా లావును పిలిపించుకుని మద్యం కుంభకోణంపై ఆరా తీశారు. ఆ సందర్భంగా ఎంపీ ఇచ్చిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఇది జరిగిన తరువాత ఎంపీ లావు బుధవారం (మార్చి 26) అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరుసగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ఎంపీ డిమాండ్ కు కేంద్ర హోంమంత్రి  సానుకూలంగా స్పందించారనీ, ఈడీని రంగంలోకి దించేందుకు అంగీకరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో  అమలు చేసిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. జగన్ మద్యం పాలసీ దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నది. ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని తెలుగుదేశం వాదిస్తోంది. ఏపీ మధ్యం కుంభకోణం వేల కోట్లేనని అంటోంది. ఏపీలో మూడు మద్యం విషయంలో మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని లోక్ సభ వేదికగా లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు.   ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్.. మూడింటినీ వైసీపీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని అక్రమాలకు పాల్పడ్డారని లావు లోక్ సభలో సోదాహరణంగా చెప్పారు. అంతే కాకుండా ఈ మద్యం కుంభకోణం సొమ్ము దాదాపు 4 వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించేశారని లావు ఆరోపించారు.  మొత్తం మీద లావు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన తరువాత కేంద్రం కూడా ఏపీ మద్యం కుంభకోణం నిగ్గు తేల్చాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. దీనిపై   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనీ, ప్రస్తుతం ఏపీ మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణలో విదేశాలకు మద్యం సొమ్ము తరలినట్లు నిర్ధారణ కావడంతో ఇక ఈడీని కూడా రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఆ కారణంగానే కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నారు.  

సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని నోట చంద్రబాబు మాట 

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని  తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం  అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని  కూనంనేని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద ప్రసంగిస్తున్న సమయంలో కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. వామ పక్ష పార్టీలకు బిజెపి బద్ద శత్రువు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి టిడిపి మిత్రపక్ష పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  సిపిఐ మిత్ర పక్షంగా ఉంది. కాంగ్రస్కు బద్ద శత్రువు బిజెపి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసింది. ఉమ్మడి పది జిల్లాల్లో 30 సీట్లలో సిపిఐకి 10 వేల ఓట్ బ్యాంక్ ఉందని కూనం నేని పలు సందర్బాల్లో చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  బిఆర్ఎస్ కు మిత్ర పక్షంగా ఉన్న సిపిఐకి  మిత్ర ధర్మంగా ఒక్క స్థానం ఇస్తామని కెసీఆర్ ఖరాఖండిగా  చెప్పడంతో బిఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడానికి సిపిఐ ముఖ్య భూమిక వహించింది. పార్టీలకు, పొత్తులకతీతంగా కూనంనేని కుండబద్దలు కొట్టి మాట్లాడటం చర్చనీయాంశమైంది

అమిత్ షాతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు భేటీ.. కారణమేంటో తెలుసా?

తెలుగుదేశం ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఇటువంటి భేటీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అమిత్ షాతో భేటీ అయిన సమయం, అంతకు ముందు రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) లోక్ సభలో లావు ప్రసంగం తరువాత అమిత్ షాతో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా ఆయన పలు పత్రాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా వాటికి సంబంధించిన విషయాలను వివరించారు. లావు ఇచ్చిన పత్రాలను అమిత్ షా కూడా ఆసక్తిగా చూశారనీ, ఆయన వివరణలను శ్రద్ధగా విన్నారనీ తెలుస్తోంది. అయితే ఈ పత్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలకు సంబంధించినవి కావని పరిశీలకులు అంటున్నారు.   సోమవారం (మార్చి 24) లోక్ సభలో లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీ మద్యం కుంభకోణం ఎన్నో రెట్టు పెద్దదని పేర్కొన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలను అక్రమంగా ఢిల్లీకి తరలించారనీ, దీని వెనుక వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనీ లావు ఆరోపించారు. అంతే కాకుండా ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే అంటే మంగళవారం (మార్చి 25)న లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడమే ఈ ప్రాధాన్యతకు కారణం. ఈ భేటీలో లావు శ్రీకృష్ణ దేవరాయులు.. లోక్ సభలో తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా మరో సారి ఈడీ దర్యాప్తు డిమాండ్ ను గట్టిగా చేశారనీ ఏపీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్ గఢ్  మాజీ ముఖ్యమంత్రి  భూపేశ్ బఘేల్  నివాసంలో సీబీఐ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు,  భూపేశ్ బఘేల్ నివాసంతో పాటు  రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలు,   సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  అదే విధంగా బఘేల్  సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసాలలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  వాస్తవానికి భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు ఇటీవల  బాఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించారు.  ఈ సోదాలు ఈ నెల  10న జరిగాయి. ఛత్తీస్ గఢ్ లిక్కర్ కుంభకోణంలో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్  కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే  భిలాయ్ లోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఇప్పుడు తాజాగా బహేల్ నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నది.