తెలుగు జాతి కోసమే తెలుగు దేశం 

తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వేడుకలు జరిపారు. పార్టీ జెండాలను ఎగురవేసి స్వర్గీయ నందమూరి తారకరామారావును స్మరించుకున్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు.  రైతు సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు చెప్పారు. పేదల పక్కా ఇళ్లకు 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. 9 నెలల్లో ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీదేనని తెలిపారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు టీడీపీనే అధికారంలో ఉందన్నారు. రాజకీయాలంటే సేవాభావం, పేదల సంక్షేమం అని ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనం చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కరోనా తర్వాత ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయన్నారు టీడీపీ అధినేత.  హైదరాబాద్‌లో తాము శ్రీకారం చుట్టిన జినోమ్ వ్యాలీలోనే కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే వైఎస్, ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారని తెలిపారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలని సూచించారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు చంద్రబాబు. త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ టీడీపీ అన్నారు. గత రెండేళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని చంద్రబాబు మండిపడ్డారు.   

ఆ తప్పు చేయనంటున్న కేసీఆర్.. సాగర్‌లో దుబ్బాక టెన్షన్..

నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు దుబ్బాక ఫీవర్ పట్టుకుంది. అక్కడి మాదిరే ఇక్కడా ఫలితం తేడా వస్తుందేమోనని భయపడుతోంది. అందుకే, సాగర్‌లో గెలుపు కోసం దుబ్బాక దంగల్‌లో జరిగిన పొరబాట్లు రిపీట్ కాకుండా చూస్తోంది. అందులో భాగంగా దుబ్బాక ఓటమికి కారణాలేంటో పోస్టుమార్టం చేసి.. నాగార్జున సాగర్ నేతలకు వివరించారు గులాబీ బాస్. ఆ తప్పులు ఇక్కడ చేయొద్దంటూ.. తానూ అలా చేయనంటూ.. టీఆర్ఎస్ నాయకులకు హితోపదేశం చేశారు కేసీఆర్. దుబ్బాక ఓటమి కారు పార్టీని కలలో కూడా వెంటాడుతూనే ఉంటుంది. కీలక సమయంలో.. కీలకమైన నియోజకవర్గంలో.. కీలకమైన అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అధికార పార్టీకి తీవ్ర అవమానకరం. దుబ్బాక సీఎం కేసీఆర్ సొంత జిల్లా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్ల, హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేట.. ఈ మూడు ప్రాంతాలకు మధ్యలో ఉన్న దుబ్బాకలో ఓడిపోవడం మామూలు విషయం కాదు. అప్పటికే దుబ్బాక నుంచి నాలుగుసార్లు గెలిచింది టీఆర్ఎస్. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. కారు గుర్తుపై ఆయన భార్య పోటీల నిలిచారు. దండిగా సానుభూతి. ఫుల్లుగా పొలిటికల్ పవర్. గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు గులాబీ బాస్. అందుకే ప్రచారానికి అటువైపు కూడా చూడలేదు. కనీసం కేటీఆర్ సైతం దుబ్బాకలో అడుగుపెట్టలేదు. మంత్రి హరీశ్‌రావుకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. అదే తాము చేసిన తప్పంటున్నారు సీఎం కేసీఆర్. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో అధికార పార్టీ పరువంతా పోయింది. అప్పటి నుంచే బీజేపీ దూకుడు పెరిగింది. ఒక్క సీటు.. ఒకే ఒక్క సీటు కదాని లైట్ తీసుకుంటే.. అది గ్రేటర్ వరకూ వచ్చిందనేది గులాబీ బాస్ విశ్లేషణ. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలాంటిది.. దుబ్బాకలో బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నా.. ప్రచారానికి దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడకపోవడమే తమ ఓటమికి కారణమని తేల్చేశారు కేసీఆర్. అక్కడ తాను కానీ, కేటీఆర్ కానీ ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామంటున్నారు కేసీఆర్. ఒక్క హరీశ్‌కే వదిలేయకుండా.. తామిద్దరం సైతం జోక్యం చేసుకొని ఉంటే.. దుబ్బాకలో ఫలితం మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు. అందుకే, దుబ్బాకలో చేసిన తప్పిదం నాగార్జున సాగర్‌లో రిపీట్ అవకుండా చూస్తామని చెప్పారు. సాగర్ ప్రచారానికి తనతో పాటు కేటీఆర్‌ కూడా వస్తారని నియోజక వర్గ నేతలకు అభయం ఇచ్చారు కేసీఆర్.  నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న నేతలను పిలిపించి మాట్లాడారు గులాబీ బాస్. అంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. మరోనేత చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్‌ చేస్తామని చెప్పారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో నాయకులంతా సాగర్‌లో కష్టపడాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

హైదరాబాద్ లో మాస్క్ లేకుంటే 2 వేల ఫైన్ 

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ పంజా విసురుతోంది. గ్రేటర్  హైదరాబాద్ లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గత పది రోజుల్లోనే 15  వందల వరకు కొత్త కేసులు వచ్చాయి. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్... కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే భారీగా ఫైన్ వేస్తోంది. అంతేకాదు షాపుల్లోకి మాస్కు లేనివారిని అనుమతి ఇస్తే.. షాపు ఓనర్లకు జరిమానా విధిస్తోంది. ఫతేనగర్‌లో మాస్క్‌ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2 వేల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు.  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.  ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించింది. కొవిడ్‌ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ చట్టాల ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. హోలీ వేడుకలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధించింది. షబ్‌-ఏ-బరాత్‌, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్‌ జయంతి, గుడ్‌ ప్రైడే, రంజాన్‌  వేడుకలపైనా ఆంక్షలు విధించింది. 

ఒక సామాజిక వర్గమే జగన్ టార్గెట్! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మొదటి నుంచి ఒక ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని ఆపార్చీ టార్గెట్ గా చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. అందుకు బలం చేకూరేలా చాలా సంఘటనలు జరిగాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపైనే ఎక్కువ కేసులు నమోదు కావడం, వాళ్ల వ్యాపారాలను దెబ్బ తీసే ప్రయత్నాలు జరగడం వెలుగు చూశాయి. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు.  తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా  ఇలాంటి ఆరోపణలే చేశారు. ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో ముంచేసిందని మనోహర్ విమర్శించారు. అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారని అన్నారు. మద్యం, ఇసుక, సిమెంట్ ద్వారా వస్తున్న డబ్బంతా ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో 96 శాతాన్ని గెలిచామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడుకోకుండా ఉంటే వైసీపీకి ఈ గెలుపు సాధ్యమయ్యేదా? అని నాదేండ్ల నిలదీశారు.  తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తుండటంపై కొందరు జన సైనికులు ఆవేదన చెందుతున్న మాట నిజమేనన్నారు మనోహర్. ఇతర పార్టీల అభ్యర్థుల కంటే తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మెరుగైన అభ్యర్థి అన్నారు. ఆమె విజయం కోసం జనసైనికులంతా పని చేయాలని పిలుపునిచ్చారు. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం... జనసేనకు ఉన్న బలమని మనోహర్ అన్నారు. సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కావాలని చెప్పారు.  

పవార్‌తో బీజేపీ మైండ్ గేమ్!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటీ అంటూ విస్తృత ప్రచారం. ఎన్సీపీ ఖండిస్తున్నా.. అమిత్ షా నర్మగర్భ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చీలికంటూ కథనాలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన విసుర్లు. ఇలా మహారాష్ట్ర కేంద్రంగా గుజరాతీ-మరాఠీ రాజకీయ ఎత్తుగడలు రంజుగా సాగుతున్నాయి.  దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శరద్ పవార్ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో కమల వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో.. వ్యూహాత్మకంగా శరద్ పవార్ టార్గెట్‌గా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఆదివారం ఆసుపత్రిలో చేరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. పొత్తికడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన పవార్‌కు గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. బుధవారం ఆయనకు ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. శనివారం గుజరాత్‌లో అమిత్ ‌షా, శరద్ పవార్ సమావేశం జరిగిందంటూ వార్తలు రావడం అనుమానాలకు తావిస్తోంది.  నెలకు వంద కోట్ల వసూళ్లు టార్గెట్ పెట్టారంటూ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలతో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి రేపాయి. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారని స్వయంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖే ప్రకటించారు. అటు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారు.. అయినా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటి’అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు.  ఓవైపు మహారాష్ట్రలో శివసేన వర్సెస్ ఎన్సీపీ నడుస్తుండగా.. అదే సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య శనివారం రహస్య భేటీ జరిగిందంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. భేటీకి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాకున్నా.. మీటింగ్ జరిగిందంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ అంశంపై  అమిత్‌ షాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమ మధ్య భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ చెప్పలేదు కానీ.. ‘ప్రతి అంశం బయటకు చెప్పలేం’కదా అంటూ  సమాధానం ఇవ్వడంతో రాజకీయం మరింత రక్తి గట్టింది.   ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అనే విమర్శలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ కీలక అడుగులు వేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. బెంగాల్‌లో మమత బెనర్జీ కమలనాథులకు చుక్కలు చూపిస్తున్నారు. బెంగాల్ మళ్లీ తృణమూల్ కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, పుదిచ్చేరిలోనూ బీజేపీకి ఛాన్సెస్ లేవు. వీటితో పాటు మిగతా భావసారూప్య పార్టీలతో కలిసి.. ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నారు శరద్ పవార్. శరద్ పవార్ కూటమిలో మమతా బెనర్జీనే కీలకం. పవార్ తప్పుకుంటే మమతా బెనర్జీనే పీఎం క్యాండిడేట్. ఇలాంటి సమయంలో పవార్, అమిత్ షా భేటీ అంటూ వార్తలు క్రియేట్ చేసి.. ప్రతిపక్ష కూటమిని మొదట్లోనే కన్ఫ్యూజ్ చేసేలా కుట్ర చేస్తున్నారనేది ఎన్సీపీ వాదన.  ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్రజలు నమ్మరని..  తమ పార్టీ ప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే భేటీ జరిగిందంటూ అమిత్ షా బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూమర్స్‌ క్రియేట్ చేసి.. బీజేపీ చీప్ పాలిటిక్స్‌ చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఇదంతా అమిత్ షా ఆడిస్తున్న రాజకీయ డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. అమిత్ షా, బీజేపీ చేస్తున్న పొలిటికల్ ఎత్తులు ఔట్ డేటెడ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. అమిత్ షా వ్యూహాలు ఇటీవలి కాలంలో పని చేయడం లేదని చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ పప్పులు ఉడకలేదంటున్నారు. ఎన్నికల లబ్ది కోసమ చీఫ్ పాలిట్రిక్స్ చేయడం మానుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నోముల భగత్ స్పెషాలిటీ ఏంటంటే!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డితో పాటు స్థానిక నేతలు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్, ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో సుదీర్ఘ కసరత్తు చేశారు కేసీఆర్. సర్వే సంస్థలతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు. నామినేషన్ల గడువుకు ఒకరోజు ముందు అభ్యర్థిని ఖరారు చేశారు గులాబీ బాస్.  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే  నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ను ఎంపిక చేశారు. తెలంగాణ భవన్ లో నోముల భగత్ కు సీఎం కేసీఆర్ బీఫామ్ అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , తేరా చిన్నపరెడ్డి, నోముల లక్ష్మి ఉన్నారు . మంగళవారం నోముల భగత్ నామినేషన్ వేయనున్నారు. పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్ ను కూడా పార్టీ అధినేత కేసీఆర్ భగత్ కు అందించారు. టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని  స్వయంగా సీఎం కేసీఆర్ ద్వారా హామీ ఇప్పించనున్నట్టు సమాచారం.  హైకోర్టు న్యాయవాదిగా ఉన్న నోముల భగత్ కొంత కాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన తండ్రిగా తోడుగా ఉంటూ వచ్చారు. 1984లో జన్మించిన భగత్..బీటెక్ చేశారు. తర్వాత ఎంబీఏ చేశారు. సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గా కొంత కాలం పని చేశారు.  విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ గా  పని చేసిన అనుభవం కూడా భగత్ కు ఉంది. తన తండ్రి న్యాయవాది కావడంతో భగత్ కూడా అటువైపే దృష్టి సారించారు. L.L.B, L.L.M పూర్తి చేసి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.  నోముల ఎన్.ఎల్.  ఫౌండేషన్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నోముల భగత్. పేద విద్యార్థలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆశావాదులకు ఉపాధి కల్పించడానికి కోచింగ్ క్లాసులు మరియు జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు భగత్. అభ్యర్థి ఎంపిక కోసం కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ భగత్ పై సానుకూలత వ్యక్తమైందని తెలుస్తోంది. నోముల నర్సింహయ్యపై సాగర్ జనాల్లో ఉన్న సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. భగత్ కు టికెట్ ఇస్తే ఈజీగా గెలవొచ్చని సర్వే సంస్థలు, నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే భగత్ పేరును కేసీఆర్ ప్రకటించారని చెబుతున్నారు. 

ఎన్టీఆర్‌ రావాలి.. మరి, వస్తారా?

రావాలి.. రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. అభిమానుల నుంచి టీడీపీ సీనియర్ల వరకూ ఇదే డిమాండ్. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ బలోపేతం కోసం పని చేయాలంటూ పిలుపిచ్చారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ సీనియర్ మోస్ట్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పని చేయాలని చెప్పారు. త్వరలోనే తెలుగుదేశంలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఆ మార్పు.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీనేనా అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.  టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీ సీనియర్ నేత నోటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు రావడం యాధృచ్చికమో.. వ్యూహాత్మకమో.. తెలీదు కానీ.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ సెగ తగిలింది. బాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణులు జూనియర్‌ను రాజకీయాల్లో దింపాలంటూ అధినేత సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటి నుంచి రామారావు రాకపై ఆసక్తి నెలకొంది. కట్ చేస్తే.. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నేరుగా ఎన్టీఆర్‌నే పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు జర్నలిస్టులు. ఇది సమయం కాదంటూ అప్పుడు మాట దాటేశారు జూనియర్.  ఆ తర్వాత తెల్లవారితే గురువారం ప్రీరిలీజ్ ఫంక్షన్‌లోనూ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానుల సీఎం స్లోగన్స్‌పై సీరియస్ అయ్యారు జూనియర్. ఆగండి బ్రదర్.. అంటూ ఫ్యాన్స్‌ను అదుపు చేశారు ఎన్టీఆర్. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుందగా.. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేత సైతం ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.  40ఏళ్ల ప్రస్తానంలో టీడీపీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అయినా.. ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచింది. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ పునాదులు కదిలించిన టీడీపీ.. ఆ తర్వాత చంద్రబాబు చేతిలో మరింత ఉన్నత శిఖరాలకు చేరింది. టీడీపీకి.. ఎన్టీఆర్ ఎలాగో.. చంద్రబాబూ అంతే. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోటు ఎన్నడూ ఎదురుకాలేదు. ఇప్పటికిప్పుడు పార్టీకి జూనియర్ అవసరమూ లేదంటున్నారు సీనియర్లు. ప్రస్తుతం టీడీపీ ప్రాభవం తగ్గినా.. ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇంకో పదేళ్లయినా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగలరు. ఆయన వారసులుగా లోకేవ్, బాలకృష్ణలు ఉండనే ఉన్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు వెండితెరపై మరింత మంచి భవిష్యత్ ఉంది. అర్జెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. అంతలా సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే.. మరో పది, పాతికేళ్ల తర్వాత రాజకీయ ఆలోచన చేయొచ్చు. అప్పటి వరకూ జై తెలుగుదేశం.. జై చంద్రబాబు.

ఏ1,ఏ2లు త్వరలో జైలుకు! బీజేపీ ముఖ్యనేత సంచలనం

ఏ1, ఏ2లు త్వరలోనే జైలుకెళ్లబోతున్నారు.. ఇదీ  బీజేపీ ముఖ్య నేత కామెంట్. ఏ1,ఏ2 లంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి తెలుసు. గతంలో వాళ్లిద్దరు జైలుకు వెళ్లి వచ్చినవారే. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉండి... ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆ ఇద్దరు నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్య నేత చెప్పడం కలకలం రేపుతోంది.  తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపుతోంది. వైసీపీ, బీజేపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది.  బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ ఖరారు అయ్యాకా అధికార వైసీపీ, కమలం నేతల మధ్య  మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు ట్విట్టర్ ద్వారా ఆరోపణలు,సవాళ్లు చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంను చేస్తామన్న ఏపీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతల విజయసాయి రెడ్డి స్పందించారు. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని.. వారి డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సోము వీర్రాజు కూడా ట్వీట్ చేశారు. త్వరలోనే జైలుకెళ్లబోతున్నారని ఎద్దేవా చేశారు. ”తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.” అటూ విజయసాయి రెడ్డి  ట్వీట్ చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు  సోము వీర్రాజు గట్టిగానే కౌంటరిచ్చారు. “మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. తిరుపతిలో జనసేన-బీజేపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు... పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎంగా చూడటమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే మాట చెప్పారన్నారు. సోము వ్యాఖ్యలను విమర్శిస్తూ  విజయసాయి రెడ్డి ట్వీట్ చేసి పొలిటికల్ హీట్ పుట్టించారు.   

ఆసుపత్రిలో రోజా.. అభిమానుల్లో ఆందోళన

నగరి ఎమ్మెల్యే రోజా అనారోగ్యతంతో ఆసుపత్రిలో చేరారు. చెన్నై అడయార్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఉన్నట్టుండి సడెన్‌గా రోజా ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోజాకు ఏమైందని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.  ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ జబర్దస్త్‌గా ఉండే రోజాకు అనారోగ్యం అనే న్యూస్ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయంగా దూకుడు మీదుండే నగరి ఎమ్మెల్యేకు ఏ సమస్య వచ్చిందోనని అంతా ఆందోళన పడుతున్నారు.  రోజా ఆరోగ్య పరిస్థితిపై ఆమె భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. చెన్నై అడయార్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రోజాకు ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆదివారం రాత్రి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారని.. 2-3 రోజుల్లో యథావిధిగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పారు. దయచేసి ఎవరూ హాస్పిటల్ దగ్గరకు రావద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు సెల్వమణి. గతేడాది కరోనా, జనవరిలో ఎన్నికల కారణంగా సర్జరీలు వాయిదా వేశారని సెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే రోజా రెండు, మూడు నెలలుగా బిజీ, బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ హడావిడి ముగియడంతో రోజా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వైఎస్సార్‌‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆడియో టేప్ రూపంలో ప్రకటన విడుదల చేశారు సెల్వమణి.

వాట్సాప్ చేస్తే 10వేలు.. వైసీపీకి టీడీపీ షాక్

7557557744 నెంబర్‌కు వీడియో, ఆడియో, ఫోటో.. వాట్సాప్ చేయండి. మీ అకౌంట్‌లో పదివేలు వేస్తాం. ఈ ఆఫర్ తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మాత్రమే. ఉప ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ బెదిరించే వారికి కౌంటర్‌గా వాట్సాప్ ఆఫర్ ప్రకటించింది.   వాలంటీర్లు గానీ, అధికార పార్టీ వాళ్లు కానీ బెదిరిస్తే... వెంటనే తమకు వాట్సాప్‌లో సమాచారం అందించాలని పిలుపిచ్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల గుట్టురట్టు చేయాలన్నారు. అలా బెదిరించే కాల్ రికార్డు కానీ, ఫోటో కానీ, వీడియో కానీ.. 7557557744 అనే నెంబర్‌కు వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్‌లో 10వేలు వేస్తామని చెప్పారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు అచ్చెన్న.  రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. తిరుపతిలోనే టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, అధికార పార్టీ బెదిరింపులతో ఓటమి తప్పలేదన్నారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని... ఆ డబ్బులు జగన్ రెడ్డి తాత డబ్బులో.. తండ్రి డబ్బులో కాదని.. అవి ప్రజల డబ్బులన్నారు. 10 పైసలు ఇచ్చి.. 90 పైసలు దోచుకుంటున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. 

మంత్రి మాయం.. మల్లన్న కోసమేనా?

రెండు వేరు వేరు ఘటనలు. ఇద్దరు వేరు వేరు మనుషులు. ఆ ఇద్దరిలో ఒకరు తీన్మార్ మల్లన్న. ఇంకొకరు తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి. ఇక, ఆ రెండు ఘటనల్లో ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు అంచుల వరకూ చేరుకోవడం. రెండో ఘటన.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఆ సీనియర్ మినిస్టర్ రెండు సార్లు మిస్సింగ్ అవటం. అవును, మీరు చదివింది నిజమే. మినిస్టర్ మిస్సింగ్. చుట్టూ మందిమార్బలం ఉన్నా.. ఎస్కార్ట్ వెహికిల్స్, గన్‌మెన్స్ ఉన్నా.. అందరి కళ్లూ గప్పారు. హుష్ కాకిలా.. గప్‌చుప్‌గా మాయమయ్యారు. ఇలా, రెండుసార్లు సదరు మంత్రివర్యులు మాయమయ్యారు. అది కూడా సరిగ్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ టైమ్‌లో ఇలా జరగడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. మేటర్ సీఎం కేసీఆర్ దగ్గరికి చేరడంతో పొలిటికల్ అటెన్షన్ పెరిగింది.  పైపైన చూస్తే మల్లన్నకు ఆ మంత్రి మిస్సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆయన ఈయన కోసమే మాయమయ్యారని అంటున్నారు. ఆ ఇద్దరూ బీసీ ఎజెండాతో రహస్య స్నేహితులుగా మారారని చెబుతున్నారు.  ఆ మంత్రి నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇంట్లో నుంచి గాయబ్ అయ్యారట. ఓ రోజు ఉదయాన్నే.. సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ నిద్ర లేవకముందే.. సొంతవాహనం, సొంత డ్రైవర్‌తో కలిసి బయటికి వెళ్లారు. నిద్ర లేచిన తర్వాత మంత్రి తన నివాసంలో లేరని గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అదే మంత్రి మరోసారి ఇలాగే బయటికి వెళ్లారు. ఇలా రెండుసార్లు ఆ మంత్రి మాయమైన విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించారు పోలీస్ ఉన్నతాధికారులు.  సెక్యూరిటీకి తెలీకుండా ఆ సీనియర్ మంత్రి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సరిగ్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆ మంత్రి రెండుసార్లు భద్రతా సిబ్బంది కన్నుగప్పి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ మంత్రి.. తీన్మార్ మల్లన్న కోసమే రెండుసార్లు గోడ దూకారని అంటున్నారు. కొంతకాలంగా సీఎం కేసీఆర్‌పై రెబెల్ వాయిస్ వినిపిస్తున్న సదరు మినిస్టర్.. అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకూ సిద్ధంగా ఉన్నారని టాక్. ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి తనను పిలవకుండా అవమానించినందుకు ప్రతీకారంగా.. కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేలా తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు ఆ మంత్రి తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు సమాచారం. వరంగల్ జిల్లాలో తనకున్న పరిచయాలను ఉపయోగించి.. మల్లన్నకు సపోర్ట్ చేసేలా.. మంత్రాంగం నెరిపారని అంటున్నారు. ఆ మంత్రిని ఇప్పటికే నిఘానేత్రం వెంటాడుతోందని.. ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని.. అందుకే, సెక్యూరిటీకి సైతం తెలీకుండా.. తెల్లవారుజామునే ఇంట్లో నుంచి మాయమయ్యారని చెబుతున్నారు. సదరు మినిస్టర్ మిస్సింగ్ ఎపిసోడ్.. మల్లన్న కోసమేనా? లేదా, కొత్త పార్టీ ఏర్పాట్ల కోసమా? అనేది తేల్చే పనిలో నిఘా వర్గాలు బిజీగా ఉన్నాయి. 

వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు!

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన వైసీపీ.. తిరుపతిలో భారీ విజయానికి ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు దేశం నేతలు మాత్రం అధికారం ఉపయోగించి తిరుపతిలో అక్రమాలు చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తోంది.  తిరుపతి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిస్తే...వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మాట్లాడిన బుద్దా.. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయగలిగేది ఒక్క టీడీపీ మాత్రమే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు. డబ్బు, అధికారం, పోలీస్ అనే మూడు రత్నాలతో ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. 2024లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి  పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. తిరుపతి లోక్ సభ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావు 2 లక్షల 40 వేల మెజార్టీతె గెలిచారు.ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. 

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్.. బీజేపీ టికెట్ ఎవరికో? 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే  నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖాయమైంది. సాగర్ టికెట్ విషయంలో సుదీర్ఘ కసరత్తు చేశారు కేసీఆర్. స్థానిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. వివిధ సర్వే సంస్థల ద్వారా వివరాలు తెప్పించుకోవడంతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు. ఈనెల 30 మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో..  28న రాత్రి 11గంటలకు భగత్‌కే టికెట్‌ కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఆయనకు తెలిపారు. భగత్‌ను ఆదివారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు పిలిపించగా, టికెట్‌ రేసులో ఉన్న ఎంసీ.కోటిరెడ్డిని సైతం హైదరాబాద్‌కు రప్పించారు. ఆదివారమే సీఎంతో కోటిరెడ్డి, మంత్రి జగదీ్‌షరెడ్డి భేటీ కావాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం అందరి సమక్షంలో భగత్‌ పేరును సీఎం ప్రకటించనున్నారు. నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఢీకొట్టడం, నోముల కుటుంబానికి న్యాయం చేయడం వంటి అంశాలే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సర్వేలు చేయించారని చెబుతున్నారు. లోకల్ అంశం కొంత భగత్ కు వ్యతిరేకంగా ఉన్నా.. నర్సింహయ్యపై ప్రజల్లో ఉన్న సానుభూతి ఆయనకు కలిసి వస్తుందనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారంటున్నారు. సాగర్ టికెట్ రేసులో నిలిచిన గురువయ్య యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కూల్ చేసినట్లు తెలుస్తోంది.  ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఏప్రిల్‌ 5 నుంచి 10వ తేదీ మధ్యలో ప్రచారం నిమిత్తం నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. హాలియాలో 50వేల మందితో సభ ఉంటుందని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా కేటీఆర్‌ రోడ్‌షోలు ఉంటాయని తెలిసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారు కావడంతో బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ టికెట్ రేసులో 2018 ఎన్నికల్లో పోటీ చేసిన నివేదితా రెడ్డితో పాటు ఇంద్రాసేనా రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ ఉన్నారు. టీఆర్ఎస్ యాదవ్ కు ఇచ్చినందున బీజేపీ నుంచి రెడ్డి లేదా ఎస్టీ అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఆదివారం సాయంత్రం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో కీలక నేతలు మంత్రి శ్రీనివాస్‌, సంకినేని, గంగిడి మనోహర్‌, నూకల నరసింహారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో ప్రచార సభలు అందులో పాల్గొనే వక్తలు, నామినేషన్‌, సోషల్‌ మీడియా ఇలా 27కీలక అంశాలను గుర్తించి వాటికి ఇన్‌చార్జులను ఖరారు చేశారు. మేనేజ్‌మెంట్‌ కమిటీ మొత్తానికి చైర్మన్‌గా సంకినేని వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండగా, వైస్‌ చైర్మన్లుగా సురే్‌షరెడ్డి, గంగిడి మనోహర్‌ను నియమించారు. 30మందితో సాగర్‌ ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను బీజేపీ పెద్దలు ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ తో  ఢీ అంటే ఢీ అన్న రీతికి పార్టీ, ప్రచా రం ఉంటే తానూ సాగర్‌కు వస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాచారం ఇచ్చారు.  

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. రామరాజ్యమే లక్ష్యమన్న చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. పార్టీ జెండాను ఎగురవేస్తున్నారు. నందమూరి తారకరామారావు అశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియాజేశారు.  తెలుగువారందరూ ఆత్మగౌరవంతో, సమసమాజానికి బాటలువేస్తూ, తెలుగునేల ఘనతను ప్రపంచ నలుదిక్కులా చాటేలా... అభివృద్ధిపథంలో దూసుకుపోవాలన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు, ప్రజలకు అసలైన రామరాజ్యాన్ని అందించే వరకు విశ్రమించరాదని ఈ వ్యవస్థాపక దినం సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ తీసుకుందాం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.  కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి దేశభక్తుల స్ఫూర్తిగా మహాశయుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు.  అనంతపురం రాప్తాడులో దివంగత పరిటాల రవి, మాజీ మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, దివంగత నేత మాజీమంత్రి పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్గ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక చరిత్రను సృష్టించుకున్న పార్టీ టీడీపీ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను, వెనుకబడిన తరగతులను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు నడిపించడానికి ఒక శక్తిలా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిందని పరిటాల శ్రీరామ్ అన్నారు. ప్రస్తుత అధికారంలోఉన్న వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడంలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లను అడ్డం పెట్టుని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ గెలిచిందన్నారు. గ్రామాల్లో ఎదురుతిరిగే రోజులొస్తాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పరిటాల శ్రీరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు

యాదాద్రిలో  68 మందికి కరోనా! భువనగిరి జిల్లాలో కలవరం 

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కరోనా కలవరం రేపుతోంది. దేవాలయంలో పనిచేస్తున్న 68 మంది సిబ్బందకి కరోనా పాజిటివ్ అని తేలింది. దేవాలయంలో అర్చకులతో సహా ఆలయ ఉద్యోగులకు కరోనా సోకడంతో యాదగిరిగుట్ట గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్టలో కరోనా వైరస్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయసిబ్బందికి కరోనా సోకిందని తెలియడంతో భక్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కరోనా కలకలంతో దేవాలయంలో నిత్నాన్నదాన విభాగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలను మాత్రమే కొనసాగిస్తామని యాదాద్రి ఆలయ అధికారులు చెప్పారు.  శుక్రవారం చేసిన పరీక్షల్లో మొదట ఆరుగురు సిబ్బందిలో కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆలయ సిబ్బందికి మొత్తం పరీక్షలు చేశారు. అందులో  శనివారం 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఆదివారం మరో 32 మందికి కరోనా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో ఆలయ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత వారమే యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆలయ సిబ్బందికి వైరస్‌ సోకింది. దీంతో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిలో దైవదర్శనాలకు మాత్రమే భక్తులకు అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో అధికారులు కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహోత్సవాల నిర్వహణ సమయంలో కరోనా నియమాలను ఏమాత్రం పాటించకపోవడం వల్లే ఆలయ సిబ్బందికి కరోనా సోకినట్లు విమర్శలు ఉన్నాయి. అలంకార సేవోత్సవాలు, స్వామి వారి విశేష వేడుకల్లో భౌతిక దూరం, మాస్క్‌లు ధరించకపోడం, శానిటైజేషన్‌ చేయకపోవడం కారణాలుగా తెలుస్తున్నాయి తెలంగాణలో ఆదివారం కొత్త‌గా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 146 మందికి క‌రోనా సోకింది.శనివారంతో పోల్టితే కేసులు సంఖ్య తగ్గినా... ఆదివారం టెస్టులు తక్కువగా చేయడం వల్లే కేసులు తక్కువగా వచ్చాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆదివారం కేవలం 32 వేల టెస్టులు మాత్రమే నిర్వహించారు. తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,469 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,690గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,583 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,815 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. 

ఎన్టీవోడి సంచలనం.. 1982లో ఏం జరిగింది?

తెలుగు దేశం పార్టీ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి  సాక్షి. దేశాన్ని ఏకపక్షంగా పాలిస్తూ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా పురుడుపోసుకుని సంచలనం స్పష్టించిన పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని నినాదంతో పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు, కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం. ప్రతిసారి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఎన్టీఆర్ సాగించిన ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.  తారకరామారావు రాజకీయ అరంగ్రేటం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రభంజనం అయితే.. తర్వాత ఆయన కేంద్రంగా సాగిన రాజకీయ ప్రస్థానం కూడా సంచలనమే. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ ఘోరపరాజయం పాలై..కలగూరగంపగా ముద్ర పడిన జనతా పార్టీ విఫలమై తిరిగి ఇందిరాగాంధీ ప్రధాని అయిన రోజులవి. కాంగ్రెస్ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకుని .. కడియం నియోజకవర్గం జనతాపార్టీ తరుపున గెలిపించుకున్న అమ్మిరాజు కాంగ్రెస్ లో చేరిపోయిన సమయం. కాంగ్రెస్ పై ఆంధ్రా జనాలు కసిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారనే వార్త ప్రకంపనలు స్పష్టించింది. జనాలు చర్చించుకుంటుండగానే 1982 మార్చి 29న పార్టీని  ప్రకటించారు తారకరామారావు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.  ఎన్టీఆర్  చైతన్యరధం బయలుదేరగానే.. తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం మొదలైంది. పల్లెలన్నీ ఆయన వెంట కదిలిపోయాయి. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లినా జనసందోహమే. ఇసుక వేస్తే రాలనంతా జనమే. గ్రామాలు గ్రామాలే ఆయనకు జై కొట్టాయి. ముందు లీడర్లెవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. రాజమండ్రిలో గోరంట్ల రాజేంద్రప్రసాద్ తమ్ముడు పార్టీ జెండా కట్టారు. కడియం వడ్డి వీరభద్రరావు  సభ్యత్వ పుస్తకాలు పట్టుకుని  రాజ్ దూత్ బండి మీద తిరిగారు.  బూరుగుపూడి పెందుర్తిసాంబశివరావు పార్టీ జెండా ఎత్తారు. ఇలా ఒక్కొక్కరు అన్నగారికి తోడయ్యారు. మండు వేసవిలో అన్నగారి పర్యటన సాగుతున్నా.. జనజాతర ఆగలేదు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం సినిమా ఆకర్షణగానే భావించారు .. అలాగే వ్యాఖ్యానించేవారు. వేషాలు వేసుకునేవాళ్లకు ఓట్లు పడతాయా అంటూ అవహేళన చేశారు. ఎన్టీఆర్ పర్యటనకు ఆటంకాలు కల్పించారు. వసతి దొరక్కుండా చూసేవారు.  అయినా అన్నగారి జోరు తగ్గలేదు. అప్పడు ఏ బండికి చూసినా తెలుగుదేశం పిలుస్తుంది రా  కదలిరా  స్టిక్కర్లే. వేలాది మంది కార్యకర్యలే సొంత డబ్బులతో జెండాలు కొని మోసారు. చైతన్య రథంపై నుంచి ఖాకీ డ్రెస్ లో ఎన్టీఆర్ మాటల తూటాలు..ఉర్రూతలూగించే ప్రసంగాలకు జనాలు ఫిదా అయ్యారు. చైతన్యరధయాత్ర సాగుతుండగానే ఎన్నికలు వచ్చేసాయి. కొంత మందిని ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్లు ఇస్తానంటే.. వద్దని కాంగ్రెస్ తరుపున నిలిచారు. అలాంటి వారిలో నీరుకొండ నారయ్య చౌదరి..రాయవరం మునసబు ఉండవల్లి సత్యనారాయణమూర్తి లాంటి నేతలు ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి. అయినా కాంగ్రెస్ నేతలకు దింపుడు కళ్ళం ఆశ చావలేదు. సినీ గ్లామరుకి ఓట్లు పడవని వారికి నమ్మకం. అమ్మ బొమ్మకే ఓటేస్తారని వాళ్ల విశ్వాసం.  కౌంటింగ్ మొదలైంది. సాయంత్రం మొదటి ఫలితం షాద్ నగర్... కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహంగా ఉన్నారు. రేడియో వార్తల్లో ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా వారీగా వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. ఎన్టీవోడి దెబ్బకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు కూలిపోయాయి. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ...ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. డాక్టర్లు..ఇంజినీర్లు.. లాయర్లు..పట్టభద్రులు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఫలితం అప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి తెలుగు దేశ పార్టీ 202 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది.  ఎన్టీఆర్ ప్రభంజనంతో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట రేడియోలో వేశారు. అన్నగారి పాటలతో హోరెత్తించారు. వేషాలు వేసుకునేవాడంటూ హేళన చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఫలితాలు చూసి షాకయ్యారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారకరామారావు.  దీంతో తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది.బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది. ఇప్పటి లాగే అప్పుడు కూడా విషపుత్రికలు అబద్దపు పత్రికలు ఉండేవి. దాదాపు అన్ని పత్రికలు..ప్రధాన శీర్షికలు..తెలుగుదేశం ప్రభంజనం..తెలుగుదేశం సూపరు హిట్టు అని పెడితే..ఒకటి రెండు పత్రికలు..ఇంకా లెక్కింపు కొనసాగుతున్నట్టు.. టీడీపి ఘనవిజయాన్ని తక్కువ చేసి చూపించటానికి ప్రయత్నం చేసారు. 1982లో ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. ఏకంగా 202 అసెంబ్లీలో స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది తెలుగు దేశం పార్టీ. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అప్పటి లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్షమయింది.  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాకర్షక పథకాలతో జనాల గుండెల్లో చోటు సంపాదించారు నందమూరి తారక రామారావు. ఆయన ప్రవేశపెట్టిన కిలోబియ్యం రెండు రూపాయల పధకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే ప్రజలు రెండు రూపాయల కిలోబియ్యం పథకం గురించి మాట్లాడుకుంటూ అన్నగారిని స్మరించుకుంటున్నారంటే.. ఆ స్కీమ్ ఎంతగా పాపులర్ అయిందో ఊహించవచ్చు. పేదల కోసం కూడు, గుడ్డ, గూడు నినాదంతో పాలన సాగించారు ఎన్టీఆర్. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా.. తన సంక్షేమ పాలతో పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించారు రామారావు. "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి  నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణాలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలిపారు.తెలుగువారి పౌరుషాన్ని చూపించారు. ఎన్టీఆర్ పోరాటంతో  చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేసింది ఇందిరాగాంధీ. కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి తన సత్తా ఏంటో ఇందిరాగాంధీకి చూపించారు. రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.  అయినా కుంగిపోకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు రామారావు. దేశంలోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించారు.  కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు.  "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్. 1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  రాజకీయాల్లో మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ ఒక సంచలనం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక కీలక అంశం ఉండేది. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకుంటారని పేరున్న ఆయన ప్రధాని చరణ్ సింగ్ తర్వాత కీలకం.  మూడో ఫ్రంట్ లోనూ టీడీపీ కీలకంగా వ్యవహరించింది. మొత్తం ఫ్రంట్ కు కన్వీనర్గా ఎన్టీరామారావు వ్యవహరించారు. దేశ రాజకీయాల్లో కి వెళ్తారు అనుకున్న ఎన్టీఆర్ 1994లో వచ్చిన ప్రభంజనంతో ఆయన ఖచ్చితంగా ప్రధాని అవుతారని మాట వినిపించింది.  రామారావు భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి..  పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో  అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు.. రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది. 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అధికారాన్నితీసుకున్న చంద్రబాబు 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.  అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సంవత్సరాల చరిత్ర సృష్టించాడు. తన పాలనలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చారు చంద్రబాబు. హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో పెట్టారు.  స్వర్ధాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు చేసిన పాలనలో దేశ రాజకీయాల్లో చర్చగా మారింది. తన తొమ్మిదేండ్ల పాలనలో హైదరాబాద్ రూపురేఖలే మార్చేశారు చంద్రబాబు. 1999లో 29 ఎంపీ స్ఠానాలు గెలిచిన తెలుగు దేశం పార్టీ.. పార్లెమంట్ లో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీసింది. చంద్రబాబు విజన్... అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. చంద్రబాబు దార్శనికత, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అయువుపట్టుగా మారాయి. చంద్రబాబు విజన్ వల్లే తెలంగాణ ప్రస్తుతం ధనిక రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

తెలుగు దేశం పార్టీ @40

'శ్రామికుడి చమట చుక్కల్లో నుంచి.. కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి.. రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటి చుక్కల నుంచి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్ధుల ఆక్రందనలోనుంచి పుట్టింది ఈ తెలుగు దేశం' - ఇదీ నందమూరి తారక రామా రావు తొలిప్రసంగం  తెలుగుదేశం పార్టీ మరో మైలురాయిని దాటింది. తెలుగింటి ఇలవేలుపు నందమూరి తారకరామా రావు, తెలుగు వారి ఆత్మగౌరవ జెండాను ఎత్తిపట్టి, తెలుగు దేశం పార్టీని ప్రకటించి నేటికి (మార్చి 29) 39 ఏళ్ళు నిండాయి.  1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ పార్టీ పేరును ప్రకటించారు. టీడీపీ 40వ ఏట అడుగు పెట్టింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో టీడీపీఎన్నో ఎన్నెన్నో చారిత్రక పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచింది.  నిజానికి ఒక చారిత్రిక అవసరంగా ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ చరిత్రనే సృష్టించింది.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే,అధికారాన్ని కైవసం చేసుకుని ఓ చరిత్రను  తిరగ రాసింది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంత తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.  అలాగని  నాలుగు పదులకు చేరుకున్న చరిత్రలో టీడీపీ ప్రస్థానం సాఫీగా సాగిందా అంటే, లేదు.ఎన్నోవిజయాలను సొంత చేసుకున్న పార్టీ మరెన్నో సంక్షోభాలను దాటుకుని ముందుకు సాగుతోంది. తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినపార్టీ, రెండు సంవత్సరాలు తిరగకుండానే తొలి సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ తర్వతా ఎన్నో అటుపోట్లను ఎదుర్కుంది. అయినా,లేచి నిలబడింది.నిలతొక్కుకుంది.మళ్ళీ మళ్ళీ జైత్ర యాత్రను కొనసాగించింది. పార్టీ ప్రస్థానంలో సగానికంటే ఎక్కువ కాలం,సుమారు 22 సంవత్సరాలు అధికారంలో కొనసాగింది.అందులో ఏడేళ్ళు ఎన్టీఅర్ ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు, అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మరో మారు,  మొత్తం కొంచెం అటూ ఇటుగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఇదొక రికార్డ్,ఇంతవరకు ఇంత సుదీర్ఘకాలం మరెవ్వరూ పాలించలేదు.  రాష్ట్రంలోసుదీర్ఘకాలం అధికారంలో ఉండడమే కాదు, కేంద్రంలోనూ టీడీపీ చక్రం తిప్పింది. 13వ లోక్ సభలో 29లోక్ సభ స్థానాలు సాధించి, లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపింది. ఇక చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు.  ఎన్టీఅర్,’సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’ అని ప్రకటించి ‘కిలో రెండు రూపాయలు బియ్యం’ వంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, అంతవరకు, ‘రాజకీయ అంటరానితనానికి’ గురైన బడుగు బలహీన వర్గాలను చేరదీసి, వారికి రాజకీయ  బిక్షను ప్రసాదించారు. ఈరోజు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కీలక పదవులలో ఉన్న అనేక మంది ఎన్టీఅర్ పుణ్యానే రాజకీయంగా ఎదిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది ఎన్టీఅర్ , తెలుగుదేశం పార్టీ, ఇది దేశం ప్రత్యర్ధులు, కూడా నేటికీ కాదనలేని నిజం.అప్పుడే కాదు ఇప్పడు కూడా,   'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు' అన్న పార్టీ మూల సిద్ధాంతాన్ని మరువకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతో మమైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది, తెలుగు దేశం పార్టీ ఒక్కటే. మరోవైపు చద్రబాబు నాయుడు, ఎన్టీఅర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూనే, తమ దార్శనికతతో రాష్ట్రాభి వృద్ధికి బాటలు వేశారు.పరిపాలనా,ఆర్థిక సంస్కరణలతో సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా, చేశారు. ఇటు ఐటీ రంగంలో అటు విద్యుత్, పరిశ్రమలు, చేతి వృత్తులు, ఇలా న్నిరంగాలలో సంస్కరణలు తెచ్చారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో   ఐటీ సావీ’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, వ్యసాయ రంగాన్ని ఉపేక్షించారనే  అపవాదు నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు. నిజానికి,చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ఉపేక్షించారు అన్నదినిజం కాదు. ‘వ్యవసాయం దండగ’ అని ఆయన ఏనాడూ అనలేదు. అయినా  ప్రత్యర్ధులు ఆయన అనని ఆ మాటను ఆయన నోట్లో పెట్టి దుష్ప్రచారం చేశారు.అలా చంద్రబాబు రైతు వ్యతిరేకి అనే ముద్ర వేశారు. నిజానికి ఎన్టీఅర్ సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇస్తే, చంద్రబాబు అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించారు. ఐటీ సహా అనేక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి గుర్తింపు మాత్రమే కాదు గౌరవం ఖ్యాతి కూడా తెచ్చారు. అనేక ప్రపంచ సంస్థలు హైదరాబాద్’లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అంటే అందుకు చంద్రబాబు వేసిన విత్తే కారణం. హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్’గ పెట్టుబడుల డెస్టినేషన్’గా అభివృద్ధి చేసిన క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుంది. ఇదే విషయాన్ని, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామ రావు పలు సందర్భాల్లో అంగీకరించారు.  అదలా ఉంటే మరోవంక తెలుగు దేశం ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారి పోయింది. అంతవరకు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి, ఎన్టీఅర్ చరిష్మా చెక్ పెట్టింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పతనానికి తెలుగు దేశం పార్టీనే బీజం వేసింది.కాంగ్రెస్’కు వ్యతిరేకంగా  యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఅర్ కీలక భూమికను పోషించారు.ఇందులో భాగంగా, 1989 (?)లో  వివిధ జాతీయప్రాతీయ పార్టీల నాయకుల,తొలి కాంక్లావే/సమావేశం హైదరాబాద్’లో ఎన్టీఅర్ అధ్యక్షతన జరిగింది. అలాగే, చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ... కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఇక ఆ తర్వత ఏమి జరిగింది అనేది చరిత్ర.  

తీన్మార్ మల్లన్నతో కొండా కొత్త పార్టీ!  

తెలంగాణలో కొత్త పార్టీల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. పార్టీ ఏర్పాట్లలో ఆమె చాలా దూకుడుగా వెళుతున్నారు.  షర్మిల పార్టీతో పాటు మరికొన్ని కొత్త పార్టీలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంచలన కామెంట్లతో టీఆర్ఎస్ నాయకత్వానికి టెన్షన్ పుట్టిస్తున్న మంత్రి ఈటల రాజేందర్.. బీసీ అజెండాతో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ సాగుతోంది. పీసీసీ ఇవ్వకపోతే ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెడతారనే కొందరు చెబుతున్నారు. తన యూట్యాబ్ ఛానెల్ ద్వారా  కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తూ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాందించిన తీన్మార్ మల్లన్న కూడా కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.  తాజాగా కాంగ్రెస్ కు ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మరో బాంబ్ పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో మరో పార్టీ రావాలని చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా, బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందన్నారు. దీని వల్లే చాలా మంది నాయకులు అమ్ముడు పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. బీజేపీలో చేరాలా?లేదా కొత్త పార్టీ పెట్టాలా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయించుకుంటానని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.   కొండా కామెంట్లతో ఆయన కూడా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్నతో కొండా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్నతో పాటు టీజేఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. కోదండరామ్, తీన్మార్ మల్లన్నతో కలిసి కొత్త కూటమి పెట్టేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సీరియస్ గానే వర్కవుట్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్యుడిగా పోటీ చేసి విజయం అంచు వరకు వెళ్లారు తీన్మార్ మల్లన్న.   ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న క్రేజ్ మరింత పెరిగింది. కోదండరామ్ కూడా భారీగానే ఓట్లు సాధించారు. దీంతో ప్రశ్నించే గొంతుకలకు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని భావిస్తున్న  కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ... వాళ్లతో కలిసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  ఆదివారం తన  భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన తీన్మార్ మల్లన్న..  రాష్ట్రంలో 6 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న పేరిట కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.  రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఉంటాయని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. తీన్మార్ మలన్న భవిష్యత్ కార్యాచరణతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడమంటే కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న... టీఆర్ఎస్ సర్కార్ పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దింపేవరకు విశ్రమించబోనని చెప్పారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చోవడమే తన లక్ష్యమన్నారు. దీంతో తీన్మార్ మల్లన్న కేంద్రంగానే కొత్త పార్టీ రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలపైనా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు తనకు ఇష్టమైన నేతలు అన్నారు. తక్కువ మాట్లాడతారు... ఎక్కువ వింటారని చెప్పుకొచ్చారు. ఈటలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని, అపాయింట్‌మెంట్ కూడా అడిగానని కొండా చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఈటల ఒక్కోసారి అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తున్నారని చెప్పారు. అది కనుక్కుందామనే... ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్టు చెప్పారు. నిజంగా బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండని చెబుతానన్నారు. ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని కొండా జోస్యం చెప్పారు. దీంతో మంత్రి ఈటెలతోనూ కొండా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. తాను అనుకుంటన్న కూటమిలోకి ఈటల కూడా వస్తే.. మరింత పవర్ ఫుల్ అవుతుందనే యోచనలో కొండా ఉన్నారని చెబుతున్నారు.  

ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా

తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. వారం రోజులుగా ఉదృతం అవుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సామాజిక మాధ్య‌మం ద్వారా తెలిపారు. "టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను." అంటూ వాణిదేవి వెల్లడించారు.  ఇటీవలే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణిదేవి  విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె విస్తృతంగా తిరిగారు. సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగింది. లెక్కింపు సందర్భంగా వాణిదేవీ కూడా కౌంటింగ్ హాల్ లో ఉన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొన్న సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకింది. రోజు రోజుకు వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కౌంటింగ్ హాల్ కరోనా వ్యాప్తి చెందిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణిదేవీ ఇటీవల శాసనమండలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్సీలంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు.