పదిమంది సీనియర్ నేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్.!!

  ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణలో తెరాసను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీడీపీ, టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు ఇలా అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరిపి.. ఆచితూచి అడుగులు వేసి.. పార్టీలు సంతృప్తి చెందేలా సీట్ల లెక్క తేల్చింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనూ భారీ కసరత్తు చేసింది. నియోజకవర్గాల్లో రిపోర్ట్ లు తెప్పించుకొని, ముఖ్య నేతలతో చర్చింది అభ్యర్థుల ఎంపిక జాగ్రత్తగా చేస్తుంది. అయితే అభ్యర్థులను ప్రకటించిన తరువాత తెరాసలో లాగా అసంతృప్తి సెగ తగలకుండా కాంగ్రెస్ ముందే జాగ్రత్త చర్యలు చేపట్టింది. తెరాసలో అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తి సెగ ఎంతలా తగిలిందో తెలిసిందే. పలు సీనియర్ నేతలు పార్టీని వీడారు.. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జానారెడ్డి, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, విజ‌య‌శాంతి ఇలా సుమారు పదిమంది ముఖ్య నేతలను రంగంలోకి దింపనుందట. వీరికి ఒక్కొక్కరికి 10 నుంచి 15 నియోజకవర్గాలు అప్పగిస్తారు. అభ్యర్థుల ప్రకటన జరిగిన వెంటనే ఈ నేతలు ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను బుజ్జగించే పనిలోపడతారు. టిక్కెట్లు రాలేద‌ని బాధ‌ప‌డొద్ద‌ని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌వుల‌లో ప్రాధాన్య‌త కల్పిస్తామ‌ని, ఇత‌ర మార్గాల ద్వారా కూడా పార్టీ నుంచి మేలు జ‌రుగుతుంద‌ని బుజ్జ‌గింపులు చేసి.. వారు పార్టీ మారకుండా, రెబెల్స్ గా పోటీచేయకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారన్నమాట. చూద్దాం మరి కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

ఏంటో ఈ జోక్యం.. 'సీబీఐ'నే కాదు 'ఆర్బీఐ'ని కూడా వదలని కేంద్రం

  గుర్రం చేసే పని గుర్రం చేయాలి.. గాడిద చేసే పని గాడిద చేయాలి. అలాకాకుండా ఒకరి పనిలో ఒకరు తలదూరిస్తే చివరికి వారి పని అయిపోతుంది. ప్రస్తుతం కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలే సీబీఐ పనితీరులో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న కేంద్రానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. తాము టెస్టు మ్యాచ్‌లను ఆడుతుంటే కేంద్రం మాత్రం టీ-20 క్రికెట్ తరహా నిర్ణయాలను తీసుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. తాజాగా ఏడీ ష్రాఫ్ మెమోరియల్ స్మారకోపన్యాసాన్ని ఆచార్య ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆర్బీఐ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతున్నదంటూ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ఈ తరహా మోసాలకు ఆర్బీఐ వంటి నియంత్రిత సంస్థలు బాధ్యత వహించట్లేదని, రాజకీయ నాయకుల్నే ప్రజలు దోషులుగా చూస్తున్నారని జైట్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు జైట్లీకి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతీ విదితమే. దీనిపై విఠల్ ఆచార్య స్పందిస్తూ ఆర్బీఐకి అసలు స్వేచ్ఛ ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణ కోసం ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాల్సిందేనన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య మార్పులు, బోర్డుల్లో డైరెక్టర్ల నియామకాలు, లైసెన్సుల రద్దు, విలీనాలు, అమ్మకాల్లో తీర్మానాలు వంటి అంశాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయమై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పరోక్షంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఇది కుదరడం లేదని ఆచార్య సంకేతాలిచ్చారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల వ్యవహారంపైనా స్పందిస్తూ.. పర్యవేక్షణ, నియంత్రిత ప్రమాణాల్లో రాజీ పడాల్సి వస్తున్నదని ప్రభుత్వ పెద్దల జోక్యాన్ని ఎండగట్టారు. చివరకు ఆర్బీఐ ద్రవ్యవిధాన నిర్ణయాల్లోనూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పేరుతో తలదూర్చడాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏమాత్రం మంచివి కావంటూ ఆర్బీఐ స్వేచ్ఛను గౌరవించకపోతే ఆర్థిక మార్కెట్లకు కష్టాలు తప్పవన్నారు. ఇప్పటికే సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం వంటివాటిల్లో కేంద్రం తల దూరుస్తుందని విమర్శలు వస్తున్న వేళ.. ఆర్బీఐ నిర్ణయాలలోనూ కేంద్రం తల దూరుస్తుందని తెలియడంతో ఈ విమర్శలు మరింత పెరిగేలా ఉన్నాయి.

సీమాంధ్రులపై కేటీఆర్ ప్రేమ.. నిజమెంత?

  తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెరాస 100 సీట్లకు పైగా సాధించి మళ్ళీ తామే అధికారం చేపడతామని ధీమాతో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో 'తెరాస వర్సెస్ మహాకూటమి' పోరు నువ్వా నేనా అన్నట్టు సాగేలా కనిపిస్తోంది. దీంతో తెరాస.. మహాకూటమి మీద మాటల యుద్ధం మొదలుపెట్టింది. 'కాంగ్రెస్ సిగ్గులేకుండా టీడీపీ తో పెట్టుకుంది. మహాకూటమి గెలిస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుంది. మళ్ళీ తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం వస్తుంది'. ఇలా తెరాస నేతలు ఏవేవో సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని సహించలేక.. గతంలో లాగా మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చాలనే ఉద్దేశంతో.. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ శృతిమించిన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా అవే సెంటిమెంట్ మాటలా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఇక ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వారు.. తెరాస తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలే గతంలో ఏపీకి ప్రత్యేకహోదా వస్తే తెలంగాణలోని కంపెనీలు ఏపీకి తరలిపోతాయంటూ వ్యాఖ్యలు చేసి.. ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైన తెరాస నేతలు.. ఎన్నికల వేల చంద్రబాబు, ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ వ్యాఖ్యలు చేసి ఇంకా ఆగ్రహం తెప్పించారు. అయితే ఏమైందో ఏంటో సడెన్ గా తెరాస యూ టర్న్ తీసుకుంది. 'సీమాంధ్రులకు సోదరుడిలా అండగా ఉంటా.. అమరావతి నిర్మాణానికి వందకోట్లు ఇవ్వాలనుకున్నాం.. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారు.. హరికృష్ణ మరణసమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూసారుగా'.. అంటూ ఏపీ మీద, ఏపీ ప్రజల మీద తమకు చాలా ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేసారు కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతోనే కేటీఆర్ లేనిప్రేమను ఒలకపోస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో సెటిలర్లు ఎక్కువుగా ఉంటారు. వీళ్ళు అనేక నియోజక వర్గాల్లో గెలుపుని ప్రభావితం చేయగలరు. వారిలో ఎక్కువగా టీడీపీని, చంద్రబాబుని అభిమానించే వారుంటారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించారో ఏంటో.. కేటీఆర్ ఇప్పుడు వారి మీద ప్రేమ చూపిస్తున్నారనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మొన్నటి వరకు తెరాస నేతలు చంద్రబాబు మీద విరుచుకు పడితే కేటీఆర్ మాత్రం ఆచితూచి అడుగులు వేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారనే చంద్రబాబుపై మా కోపం.. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు పాలించాలనేదే మా ధ్యేయం అన్నారు. అంతేనా అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వాలనుకున్నారట. కానీ కేంద్రం మట్టి, నీరు తప్ప ఏమివ్వట్లేదు అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఇస్తే బాగోదని ఆగిపోయారట. కాంగ్రెస్, బీజేపీ హవా ఉండకూడదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉండాలి.. అన్నదమ్ముల్లా కలిసుండాలి అని కేటీఆర్ అన్నారు.. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదని వీరు కూడా ఇవ్వడం మానేశారంట!!.. ఇదేం లాజిక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు.. కానీ ప్రత్యేకహోదా వస్తే తెలంగాణ కంపెనీలు ఏపీకి తరలిపోతాయనే అపోహ ఎందుకు కలిగించారు?.. తెలంగాణ ఏర్పడి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆంధ్రా పెత్తనం అని ఎందుకు అంటున్నారు? ఏపీ సీఎం మీద శృతిమించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడటమే.. సెటిలర్ల విషయంలో కేటీఆర్ యూ టర్న్ తీసుకోవడానికి కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ పై దాడి వెనుక నిజంగానే టీడీపీ హస్తముందా?

తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఒక విషయంపై విపరీతమైన రచ్చ జరుగుతుంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే ఓ యువకుడు సెల్ఫీ కోసమంటూ జగన్ దగ్గరికి వచ్చి.. తన వెంట తెచ్చుకున్న కోడి పందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. జగన్ ప్రాథమిక చికిత్స చేసుకొని.. నార్మల్ గానే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇక అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మారిపోయింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల దాడి మొదలు పెట్టారు. కొందరు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దాడి జరిగిందంటే.. ఇంకొందరేమో అసలు ఈ దాడి చేయించిందే టీడీపీ, ఈ దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇక మరి కొందరైతే ఆ కత్తికి విషం పూసి పొడిచారేమో అంటూ కొత్త అనుమానాలు క్రియేట్ చేసి పార్టీ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురిచేసారు. అంతేనా జగన్ భుజానికి గాయం లోతు విషయంలోనూ కన్ఫ్యూజన్. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ లో చికిత్స చేసిన డాక్టర్లు జగన్‌ ఎడమ చేతికి అర సెంటీమీటరు లోతున భుజానికి గాయమైందని చెప్తే.. హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్లు మాత్రం జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. దీంతో వైజాగ్ లో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు.. హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.     సరే ఇదంతా పక్కన పెడితే.. అసలు ఈ దాడికి కారణం టీడీపీ నే అని వైసీపీ బలంగా ఆరోపణలు చేస్తోంది. కానీ ఆరోపణల్లో నిజమెంత?. నిందితుడు శ్రీనివాస్ వెయిటర్ గా పనిచేస్తున్న హోటల్ ఓనర్ టీడీపీ సానుభూతి పరుడు అన్నారు. కానీ ఆ ఓనర్ మాత్రం తాను వైసీపీ అభిమానినని మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతెందుకు నిందితుడు శ్రీనివాస్ కూడా జగన్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. నిందితుడి సోదరుడే స్వయంగా మీడియా ముందు చెప్పాడు. 2018 న్యూ ఇయర్ సందర్భంగా నిందితుడు ఒక ఫ్లెక్సీ పెట్టాడు. అందులో అతని ఫోటోతో పాటు జగన్ ఫోటో కూడా ఉంది. ఈ ఫ్లెక్సీ ఫోటో కూడా నిందితుడి సోదరుడి ద్వారా బయటికి వచ్చింది. కానీ ఎవరో ఆ ఫ్లెక్సీ ఫోటోని కూడా మార్ఫ్ చేసారు. ఒక దానిలో జగన్ ప్లేస్ లో చంద్రబాబు ఫోటో.. మరోదానిలో జగన్ ప్లేస్ లో లోకేష్ ఫోటో పెట్టారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు చూసి కొందరు కార్యకర్తలు ఆందోళన, మరికొందరు నిరసన వ్యక్తం చేసారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన నాయకులూ కూడా రెచ్చ కొట్టే వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూడా వాటిని అంతేస్థాయిలో తిప్పికొడుతోంది. ఎయిర్‌పోర్ట్‌ లో స్థానిక పోలీసులు కాదు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ఉంటారు.. వారి కళ్ళుగప్పి నిందితుడు కత్తి ఎలా లోపకి తీసుకెళ్లాడు?.. తనపై దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, వారికి సమాచారం తెలపకుండా తన మానాన తాను హైదరాబాద్‌ ఎలా వెళ్లిపోయారు? వైజాగ్ లో స్వల్ప గాయం హైదరాబాద్ వెళ్ళాక పెద్దగా ఎలా అయిందంటూ టీడీపీ నేతలు పలు అనుమానాలు చేసారు. అంతేకాదు గతంలో శివాజీ.. ఆపరేషన్ గరుడలో భాగంగా ఒక ముఖ్య నేతపై ఇలా ప్రాణహాని లేని దాడి జరిపి అల్లర్లు సృష్టిస్తారు అన్నారు. శివాజీ చెప్పినట్టే దాడి జరగడంతో ఇది ఆపరేషన్ గరుడలో భాగమే అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆపరేషన్ గరుడ కూడా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని ఆరోపిస్తుంది. దీంతో అసలు ఈ దాడి ఏంటో? ఈ దాడి వెనకున్న డ్రామా ఏంటో అర్థంకాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.     సరే కాసేపు ఈ దాడి వెనుక టీడీపీ ఉంది అనుకున్నాం. కానీ ఈ దాడి వల్ల టీడీపీకి జరిగే ప్రయోజనం ఏంటని అడిగితే అందరి సమాధానం మౌనం. ఒక నాయకుడి మీద దాడి జరిగితే ఆ దాడి వల్ల ప్రజల్లో ఎంతోకొంత సానుభూతి వస్తుంది. పోయి పోయి ఒక పార్టీ, ప్రత్యర్థి పార్టీ నాయకుడి మీద ఇలాంటి దాడి చేసి సానుభూతి పెంచుతుందా? అంటే అనుమానమే. మరి టీడీపీ మాత్రం ఇంత సిల్లీ దాడి ఎలా చేస్తుంది?. జగన్ ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలు కవర్ చేసారు. వందల మీటింగులు పెట్టారు. వేల కిలోమీటర్లు నడిచారు. అయినా జగన్ మీద ఈగ కూడా వాలలేదు. కానీ టైట్ సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్ట్‌లో అంత సిల్లీగా దాడి ఎలా జరిగింది?. నిందితుడు అసలు సిబ్బంది కళ్ళు గప్పి ఆ కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు.. అక్కడ ఉండే సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది నిర్లక్ష్యం అవుతుంది. అదీగాక నిందితుడు కూడా తాను జగన్ అభిమానిని.. ఆయనని సీఎం చేయాలనే ఆశతో సానుభూతి కోసం ఈ దాడి చేసానని పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు బయటికి వస్తాయి. అసలు నిజమేంటో తెలీకుండా కొందరు నేతలు ఇలా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం ఎంత వరకు కరెక్ట్?. ప్రస్తుతం జరిగిందంతా చూస్తుంటే ఈ దాడి వెనుక టీడీపీ ఉందనే ఆరోపణల్లో నిజంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అసలు ఈ దాడి వెనుక ఉన్న డ్రామా ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. తెలుసుకుందాం త్వరలో అసలు నిజాలేంటో.

పంచాయతీ ఎన్నికలు.. జనసేనకు తప్పవా కష్టాలు

  ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిజానికి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో జరగాలి. కానీ ప్రభుత్వం జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తమ పార్టీకి భయపడే టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే జనసేనకు పంచాయతీ ఎన్నికలు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ స్థాపించి సుమారు ఐదేళ్లు అయింది కానీ.. ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రూపంలో ముందే బరిలోకి దిగే అవకాశం వచ్చింది. పవన్.. టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు కానీ.. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగడం జనసేనకు అంత మంచిదేమి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీల గెలుపు గురించి పట్టించుకుంటారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు ఎన్నికలు కొత్త కాదు. గ్రామస్థాయి నుంచి కేడర్ ఉంది. మండల, నియోజకవర్గ స్థాయి నేతలున్నారు. వారు పంచాయతీ ఎన్నికలు పట్టించుకుంటారు. కానీ జనసేన పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉంది. గ్రామస్థాయిలో నిర్మాణం జరగలేదు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఏర్పడలేదు. అసెంబ్లీ ఎన్నికలంటే పార్టీ అధ్యక్షుడిగా పవన్ ప్రచారం చేయొచ్చు.. కానీ పంచాయితీలకు సాధ్యపడదు. అక్కడి లీడర్లు, అక్కడి కేడర్ కావాలి. ఇవ్వన్నీ చూస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు చేదు అనుభవం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. అలా అని జనసేన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పవన్ పలు సందర్భాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జనసేనకు కష్టాలు తెచ్చిపెట్టాయిగా అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి జనసేన వీటిని ఎలా ఎదుర్కుంటుందో.

ఆ రెండు స్థానాల్లో టీడీపీ.. తెరాసకు పెద్ద తలనొప్పిగా మారిందా?

  తెలంగాణలో టీడీపీ పార్టీ ప్రస్తావన వస్తే ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మొదటినుంచి పట్టుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని టీడీపీనే కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశముంది.. కానీ పార్టీలో అంతర్గత వర్గ పోరు కారణంగా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికల తరువాత పార్టీలోని కొందరు నేతలు తెరాసలో చేరారు. దీంతో ఇప్పుడు వర్గపోరు లేదు. అదీకాకుండా ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది. దీంతో ఖమ్మంలో టీడీపీ బలం రెట్టింపు అవుతుంది. నిజానికి 2014 ఎన్నికల తరువాత సీనియర్ నాయకులు కొందరు పార్టీని వీడడంతో ఖమ్మంలో టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ విషయం ఈ మధ్య బాలకృష్ణ ఖమ్మం పర్యటన సందర్భంగా స్పష్టమైంది. బాలకృష్ణ మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించగా.. స్వచ్చంధంగా వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పసుపుమయం చేసారు. దీంతో టీడీపీ ఖమ్మంలో ఎంత బలంగా ఉందో అర్థమైంది. ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం కూడా తోడవడంతో.. ఖమ్మం పార్లమెంట్ కి మహాకూటమి అభ్యర్థి బరిలోకి దిగితే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రధాన దృష్టి ఉంది. అవే ఖమ్మం అసెంబ్లీ మరియు సత్తుపల్లి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పువ్వాడ అజయ్ కుమార్, టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై ఐదువేల మెజారిటీతో గెలుపొందారు. అయితే తరువాత వీరిద్దరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మల మంత్రి అయ్యారు. తరువాత పాలేరులో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పాలేరు నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక ఖమ్మం విషయానికొస్తే తాజా మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ నే తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని తెరాస పట్టుదలగా ఉంది. అజయ్ తో పాటు తుమ్మల ఖమ్మం అసెంబ్లీని సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఖమ్మంలో తెరాస గెలుపు సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. ఆ ఎన్నికల్లో తెరాస 7 శాతం ఓట్లకే పరిమితమైంది. తరువాత ఇద్దరు నేతల చేరికతో తెరాస బలం కాస్త పెరిగినప్పటికీ.. ఖమ్మంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఇంకా బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం.. అదీగాక మహాకూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయం అవ్వడంతో తెరాసకు తలనొప్పి మొదలైంది. బలమైన కేడరున్న పార్టీలు ఏకమవ్వడం, బలమైన ప్రత్యర్థి బరిలోకి దిగుతుండడంతో తెరాసకు ఓటమి భయం మొదలైంది. సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున పోటీ చేసిన దయానంద్ రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక తెరాస అభ్యర్థి పిడమర్తి రవి కేవలం ఆరు వేల ఓట్లే సాధించారు. తరువాత వైసీపీ అభ్యర్థి దయానంద్ తెరాసలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఆయనే అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తెరాస అనూహ్యంగా పిడమర్తి రవినే తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి సెగ భగ్గుమంది. ఇదే సండ్రకు కలిసి రానుంది. ఒకవైపు కాంగ్రెస్ ఓటుబ్యాంకు బలం తోడైంది.. మరోవైపు తెరాసలో అసంతృత్తి సెగ. దీంతో మళ్ళీ సండ్రనే విజయం సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తుమ్మల మాత్రం సత్తుపల్లిని బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా తెరాస జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది తుమ్మల సొంత నియోజకవర్గం.. అదీగాక ఆయన గతంలో టీడీపీని తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు, అనుభవంతో సండ్ర జోరుకి ఎలాగైనా బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తుమ్మల ఆశలు ఫలించేలా లేవు. మొత్తానికి టీడీపీ బరిలోకి దిగుతున్న ఖమ్మం అసెంబ్లీ, సత్తుపల్లి అసెంబ్లీ సీట్లు తుమ్మల, తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్ మహాకూటమికి చెక్ పెట్టాలని జగన్, పవన్ ని దింపుతున్నారా?

  తెరాస 100 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ అధికారం తామే చేపడతామని ధీమా వ్యక్తం చేస్తూ ముందస్తుకు సిద్ధమైంది. అయితే తెరాస ఊహించినట్లు 100 సీట్లైతే రావడం కష్టం కానీ.. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని అందరూ భావించారు. ఇదంతా ఒకప్పటి మాట. ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ తెరాసను అధికారానికి దూరం చేసే అంత బలం లేదని మొన్నటివరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం పెరిగింది. ముఖ్యంగా నాయకులు దూరమైనా కేడర్ ఉండి.. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న టీడీపీ బలం కాంగ్రెస్ కు కలిసొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్నట్టు జరిగే అవకాశాలున్నాయి. ఇదే ఇప్పుడు తెరాసను కలవరపెడుతోంది. మహాకూటమిని ఓడించి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మహాకూటమిని అడ్డుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని కేసీఆర్ భావిస్తున్నారట. దానిలో భాగంగానే అవసరమైతే జగన్, పవన్ లను అస్త్రాలుగా మలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట. ప్రస్తుతం జగన్, పవన్ ల దృష్టంతా వచ్చే ఏపీ ఎన్నికల మీదే ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని ఎవరికి తోచిన దారిలో వారు అడుగులు వేస్తున్నారు. అయితే వీరి అడుగులు తెలంగాణలో పడితే ఎలా ఉంటుందా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. నిజానికి తెలంగాణలో వైసీపీ, జనసేన పార్టీలు అసలు ఉన్నాయా? అనే పరిస్థితి. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది కానీ వాళ్ళు ఎన్నికల అనంతరం పార్టీని వీడారు. ఉన్న కేడర్ కూడా దూరమైంది. దీంతో జగన్ పార్టీని ఏపీకే పరిమితం చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. మరి అలాంటిది కేసీఆర్ వైసీపీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే దానికో కారణం ఉందట. వైసీపీని కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో బరిలోకి దింపితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదున్న అభిమానంతో కొందరు కాంగ్రెస్ ఓటర్లు వైసీపీకి ఓటేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారట. దీనివల్ల కాంగ్రెస్ కి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అలాగే జనసేన బరిలోకి దిగితే కూడా తెరాసకు ఎంతోకొంత లాభం ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. మహాకూటమి బలంగా ఉన్న స్థానాల్లో జనసేనను బరిలోకి దింపితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు చీలిపోయి తెరాసకు లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ కేసీఆర్ మహాకూటమిని అడ్డుకోవడానికి వైసీపీ, జనసేనని రంగంలోకి దింపుతారా అంటే నమ్మడానికి కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక బలంలేని తెలంగాణలో పోటీ చేసి వైసీపీ తన పరువు తాను తీసుకునే సాహసం చేయకపోవొచ్చు. ఇక జనసేన విషయానివస్తే తెలంగాణలో పార్టీ నిర్మాణమే జరగలేదు. ఇప్పటికిప్పుడు సరైన అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. మరి ఇలాంటి సమయంలో పవన్ తొందరపడి పార్టీకి నష్టం జరిగే స్టెప్ వేయకపోవొచ్చు. చూద్దాం మరి మహాకూటమిని అడ్డుకోవడానికి కేసీఆర్ ముందు ముందు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ఏంటో.

బొత్స జనసేన వైపు చూస్తున్నారా?

  బొత్స సత్యనారాయణ.. తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా బొత్స బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసారు. ఇలా రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న బొత్స రాష్ట్ర విభజన అనంతరం కాస్త డల్ అయ్యారు. విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ ఏపీ ప్రజలు ఆ సమయంలో కాంగ్రెస్ మీద బాగా ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మెజారిటీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. కొందరు పూర్తిగా రాజకీయాలకే దూరమైతే.. కొందరు ఇతర పార్టీలలో చేరారు. వారిలో బొత్స ఒకరు. ముందుగా బొత్స టీడీపీలో చేరాలని చూసినా అటునుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో.. ఇక వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో కూడా బొత్స సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. బొత్సకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పని చేసిన అనుభవముంది. కానీ జగన్ తన సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వడంలేదని బొత్స భావిస్తున్నారట. రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న తాను వైసీపీలో చేరాక జిల్లా నేత స్థాయికి దిగజారానని బొత్స ఫీల్ అవుతున్నారట. బొత్స అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్.. తన నియోజకవర్గం వచ్చేసరికి తన పేరు చెప్పకుండా వెళతాడా?.. తాను తీసుకువచ్చిన 'కోలగట్ల వీరభద్రస్వామి'కి ముందే టిక్కెట్‌ ఇచ్చి తనకు ఇవ్వరా?.. ఎంత అవమానం?..  అని బొత్స ఫీల్ అవుతున్నారట. అంతేకాదు తన సంగతే ఇలా ఉంటే ఇక తన కుటుంబసభ్యుల టిక్కెట్ల సంగతేంటి? వారికి టిక్కెట్లు కష్టమేనా అని ఆవేదన చెందుతున్నారట. అసలే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. తనకి, తన కుటుంబానికి సీట్ల కేటాయింపు విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అవసరమైతే పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారట బొత్స. టీడీపీలో డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి జనసేనవైపు చూస్తున్నారట. మరి బొత్స నిజంగానే వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కట్లేదని ఫీల్ అవుతున్నారా? అసలు ఆయనకు వైసీపీని వీడి జనసేనలో చేరే ఆలోచన ఉందా?.. అసలే పవన్ పార్టీలో చేరికల గురించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి అలాంటి పవన్.. బొత్స పార్టీలో చేరతానంటే ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

ఒక్క సీటు.. మహాకూటమిలో చిచ్చుపెడుతోంది.!!

  తెరాసను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్.. టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. ఒకవైపు తెరాస ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, అసంతృప్తులను బుజ్జగిస్తూ, ప్రచారం మొదలుపెడితే.. మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయింది. తెరాసలో లాగా మహాకూటమిలో అసంతృప్తుల సెగ తగలకూడదనే ఉద్దేశంతో.. కాంగ్రెస్ కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరుపుతూ.. ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే కొన్నిసార్లు ఆలస్యం కూడా ప్రమాదమే. ఇప్పటికే టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఇదే చెప్పారు. కాంగ్రెస్ ఆలస్యం చేయకుండా సీట్ల విషయంలో ఎంత త్వరగా స్పష్టత ఇస్తే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ మాత్రం కూటమిలోని మిగతా పార్టీలకు తక్కువ సీట్లు కేటాయించాలని చూస్తోందని.. కాంగ్రెస్ చెప్పిన సంఖ్యతో టీడీపీ, టిజెఎస్ సంతృప్తిగా లేవని.. దానివల్లే సీట్ల సర్దుబాటు లేటవుతోందని తెలుస్తోంది. దీంతో అసలు సీట్ల విషయంలో చిచ్చు మొదలై అసలు మహాకూటమి చీలిపోయే ప్రమాదముందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మరి కాంగ్రెస్ సీట్ల విషయంలో టీడీపీ, టిజెఎస్ పార్టీలను ఎలా బుజ్జగిస్తుందో తెలీదు కానీ.. ఒక్క సీటు విషయంలో మాత్రం సిపిఐతో పెద్ద తలనొప్పి ఏర్పడిందట. ఆ సీటు మాకే కేటాయించాలని సిపిఐ పట్టుబడుతోందట. ఒకవేళ ఆ సీటు కేటాయించకపోతే అవసరమైతే కూటమికి దూరం అవ్వడానికి కూడా సిద్దమనే సంకేతాలు ఇస్తుందట. సిపిఐ అంతలా పట్టుబడుతున్న ఆ సీటు ఏంటంటే ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం. గిరిజన నియోజకవర్గంగా ఉన్న వైరా 2009లో ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, సిపిఎం  మద్దతుతో సిపిఐ పోటీ చేయగా కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా బాణోత్‌ చంద్రావతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సిపిఎం మద్దతుతో వైసీపీ.. కాంగ్రెస్‌ మద్దతుతో సిపిఐ పోటీ చేసాయి. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్‌ గెలిచారు. తరువాత ఆయన తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఆయన్నే ప్రకటించారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ మహాకూటమితో దగ్గరయ్యాయి. దీంతో మహాకూటమి నుంచి వైరాలో ఎవరు బరిలోకి దిగుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీటు కోసం కాంగ్రెస్, సిపిఐ పోటీపడుతున్నాయి. గతంలో ఇది తమ సిట్టింగ్‌ స్థానమని తమకు బలముందని తప్పకుండా విజయం సాధిస్తామని సిపిఐ వాదిస్తుండగా.. కాంగ్రెస్‌ నేతలు తామే అధికార పార్టీని ఢీకొనగలమని, తాము పోటీ చేస్తేనే విజయం తథ్యమనే సంకేతాలు పార్టీ అధిష్ఠానానికి పంపిస్తున్నారు. దీంతో సిపిఐ వైరాలో బలప్రదర్శన నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్‌ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఈ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరోవైపు వైరాలో తాము పోటీ చేస్తామంటూ కాంగ్రెస్‌ శ్రేణులు బలమైన సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించడంతో పాటు గాంధీభవన్‌ వద్ద నిరసన తెలిపి వైరా స్థానాన్ని కాంగ్రెస్‌ వదులుకోకూడదంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీనికితోడు కాంగ్రెస్‌ కీలక నేత మల్లు భట్టి విక్రమార్క సొంత మండలం వైరా కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే వైరా నుండి బరిలోకి దింపితే బాగుంటుందని భావిస్తున్నారట. మొత్తానికి ఈ ఒక్క సీటు కోసం ఇరుపార్టీలు పట్టుపట్టినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఈ సీటు విషయంలో సిపిఐని ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

తెరాసకు కడియం కుటుంబం బిగ్ షాక్.!!

  తెరాసకు అసంతృప్తుల సెగ తగులుతూనే ఉంది. ఇప్పటికే కొండా సురేఖ, బాబుమోహన్ లాంటి వారు పార్టీని వీడారు. అయితే ఇప్పుడు కడియం కుటుంబం తెరాసకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ కూతురు కావ్య పోటీలో ఉండేలా కార్యకర్తలను గత రెండేళ్లుగా సన్నద్ధం చేశారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా కడియం కావ్య ప్రచారం చేస్తూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. నియోజకవర్గంలో రాజయ్యపై ఉన్న వ్యతిరేకత కూడా కావ్యకు కలిసొస్తుంది.. ఈసారి కావ్యకే టిక్కెట్ వస్తుంది అనుకున్నారంతా. కానీ కేసీఆర్ ఆ అంచనాలను తారుమారు చేస్తూ.. స్టేషన్ ఘన్‌పూర్‌ తెరాస అభ్యర్థిగా మళ్ళీ రాజయ్యనే ప్రకటించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసమ్మతి నేతలంతా బహిరంగసభలు నిర్వహించారు. కేటీఆర్ వద్దకు వెళ్లి తమకు రాజయ్య వద్దని విన్నవించుకున్నారు. అయినా తెరాస అధిష్టానం మాత్రం దిగిరాలేదు. పైగా కడియంను పిలిచి.. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే కాదు.. మహబూబాబాద్, డోర్నకల్ స్థానాలలో కూడా తెరాస అభ్యర్థులకు అసమ్మతి లేకుండా చేసే బాధ్యత మీదే అంటూ కడియంకి నిర్దేశించారట.     అదే సమయంలో కడియం తెరాసను వీడుతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. కూతురి టిక్కెట్ కోసం కడియం కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలని కడియం ఖండించారు. ఆయనకు పార్టీ మారే ఉద్దేశం ఉందో లేదో తెలీదు కానీ.. ఆయన కూతురు కావ్య మాత్రం టిక్కెట్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనీ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై ఆమె నియోజకవర్గ కార్యకర్తలతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెరాసకు బిగ్ షాక్ అనే చెప్పాలి. మహాకూటమి నుండి ఈసారి తెరాసకు నువ్వా నేనా అన్నట్టు పోటీ ఎదురుకానుంది. అంటే తెరాసకు ప్రతి స్థానం ముఖ్యమే. మరి ఇలాంటి సమయంలో కడియం కూతురు కావ్య ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే.. నియోజకవర్గంలో తెరాస ఓటు బ్యాంకు రెండుగా చీలిపోయే ప్రమాదముంది. ఇది మహాకూటమికి కలిసొస్తుంది. గెలుపు వరిస్తుంది. మరి కడియం కావ్య నిజంగానే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తెరాసకు షాక్ ఇస్తారా? లేక తెరాస కడియం కుటుంబాన్ని బుజ్జగించి స్టేషన్ ఘన్‌పూర్‌లో జెండా ఎగరేస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.

పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా?

  'పాలించడానికి కాదు ప్రశ్నించడానికి వస్తున్నా' అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. దానికి తగ్గట్టే 2014 ఎన్నికల బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి అయితే వచ్చాయి కానీ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుంది అంటూ టీడీపీ, బీజేపీ మీద పోరాటం మొదలుపెట్టింది. అదే సమయంలో పవన్ కూడా సినిమాలకు బ్రేకిచ్చి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతా అంటూ.. టీడీపీకి దూరమయ్యారు. ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేనా యాత్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైతే.. అసలు జనసేన బరిలోకి దిగుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు కానీ.. ఏపీలో ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం ఉండగానే పవన్ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. దీనిబట్టి చూస్తుంటే పవన్ ప్రస్తుతం ఏపీ మీదే దృష్టంతా పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీలో యాత్రలు చేస్తూ ఎప్పుడూ టీడీపీ మీద, అప్పుడప్పుడు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ ఈమధ్య ఎక్కువగా మాట్లాడుతున్న ఒక పాయింట్ మాత్రం అందరిని ఆలోచనలో పడేస్తుంది. పవన్ మైక్ పడితే ఈమధ్య ఒక మాట బలంగా వినిపిస్తుంది. 'ఒక సీఎం మనవడు సీఎం కావొచ్చు.. ఒక సీఎం కొడుకు సీఎం కావొచ్చు.. కానీ ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా?' అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కాకూడదు అవొచ్చు. ఛాయ్ వాలా మోదీ పీఎం కాలేదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది ఒకటుంది. పవన్ మెగాస్టార్ తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తన టాలెంట్ తో పవర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. పవన్ ప్రజల దృష్టిలో సామాన్యుడు కాదు.. కానిస్టేబుల్ కొడుకు కాదు.. ఒక స్టార్ అనే విషయాన్ని గుర్తించాలి. ఒకప్పుడు పవన్ పాలించడానికి కాదు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చా అన్నారు. అంతేకాదు ప్రజలకు సేవ చేయాలంటే పదవే కావాలా? అని ప్రశ్నించారు. అలాంటి పవన్ ఇప్పుడు సీఎం సీఎం అంటున్నారు. పదవి లేకుండా సేవ చేయడం కష్టం అనుకున్నారో ఏమో తెలీదు కానీ ఈమధ్య పవన్ మాటల్లో సీఎం కావాలనే ఆశ మాత్రం కనిపిస్తోంది. ఆయన అభిమానులు కూడా కొందరు సీఎం సీఎం అని అరుస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం అవుతారని నమ్మకంగా ఉన్నారు. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవ్వడం సాధ్యమేనా అంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. పవన్ సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. ఇది నిజం. కానీ ఈ ఫాలోయింగ్, సభలు ఇప్పటికిప్పుడు పవన్ ని సీఎం చేస్తాయా అంటే డౌటే. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రజలు సభలకు ఇలానే తరలివచ్చారు. ఇక చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మరి అలాంటి చిరంజీవికి ఆయన కుటుంబంలోని పవన్ లాంటి మిగతా హీరోలు తోడైనా.. అనూహ్యంగా కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. దీన్నిబట్టి ఫాలోయింగ్, సభలు సీఎం చేయలేవని అర్థంచేసుకోవచ్చు. అదీగాక జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తీ స్థాయిలో జరగలేదు. ఇక పార్టీలో పవన్ తప్ప జనాన్ని ఆకర్షించదగ్గ నేతలు కూడా లేరనే చెప్పాలి. పవన్ కూడా ఉత్తరాంధ్ర మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప రాష్ట్రం మొత్తం మీద అంతగా దృష్టి పెట్టట్లేదు. అదీగాక ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కూడా బలంగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే పవన్ ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే అవకాశం తక్కువున్నా.. గెలుపు ఓటములను మాత్రం ప్రభావితం చేయగలరు. టీడీపీ, వైసీపీలకు పూర్తీ మెజారిటీ లేకపోతే పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి పవన్ వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారో లేదో చూడాలి. అయితే పవన్ సీఎం అయ్యే అవకాశాలని పూర్తిగా కొట్టిపారేయలేం. ఆయన ఇప్పటికిప్పుడు సీఎం కాకపోయినా.. భవిష్యత్తులో అయినా సీఎం అవకాశాలున్నాయి. సేవచేయడానికి పదవులు అవసరంలేదని నమ్మిన పవన్.. పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటే.. ప్రస్తుతం ఆయన్ని నమ్ముతున్న వారే కాదు.. మిగతావారు కూడా ఆయన్ని నమ్మి సీఎం అవకాశముంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.

కాంగ్రెస్ గూటికి పలువురు తెరాస కీలక నేతలు..!!

  ఎన్నికల సమయం దగ్గరపడడంతో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత ఎన్నికల అనంతరం.. ఈ నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలలోని పలువురు సీనియర్ నాయకులు తెరాస గూటికి చేరారు. తెరాస ఒకరకంగా నాయకులతో కళకళలాడింది. అయితే ఇప్పుడు తెరాసకు ట్విస్ట్ ఇచ్చే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్. కేసీఆర్ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. అంతేనా.. ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించి దూకుడు పెంచారు. అయితే అప్పటి నుంచి కాంగ్రెస్ తెరాస దూకుడికి కళ్లెం వేసే పని మొదలు పెట్టింది. ఓ వైపు టీడీపీ, టీజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి.. గెలుపై ధీమాగా ఉన్న తెరాసకు షాక్ ఇస్తూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి సిద్ధమైంది. దీనికి తోడు తెరాసకి మరో చిక్కొచ్చిపడింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుండి భారీగా నాయకులను చేర్చుకున్నారు. దీంతో అన్ని స్థానాల నుండి ఆశావహులు ఎక్కువయ్యారు. అందరికి టిక్కెట్ కేటాయించడం కుదరదు. దీంతో అసంతృప్తిలో ఉన్న నేతలు కొందరు అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడితే.. మరికొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. ఇది కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం. ఇప్పుడు కాంగ్రెస్ తెరాసలోని అసంతృప్తిని తమకి అనుకూలంగా మార్చుకొనే పనిలో బిజీగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా అయితే ఉంది కానీ ఇప్పట్లో అధికారం పొందడం కష్టమనే అభిప్రాయం మొన్నటివరకు ఉండేది. కానీ ఎప్పుడైతే ముందస్తుకు తెర లేచిందో అప్పటి నుంచి కాంగ్రెస్ కి మంచిరోజులు మొదలయ్యాయి. నాయకులు అంతగా లేకున్నా కేడర్ బలంగా ఉన్న టీడీపీ మహాకూటమితో దగ్గరైంది. దీంతో అధికారం దక్కుతుందనే ఆశ కాంగ్రెస్ లో మొదలైంది. దీనికి తోడు తెరాసలో టిక్కెట్ కోసం అసంతృప్తి సెగలు. ఇంకేముంది కాంగ్రెస్ 'వస్తుందిలే అధికారం ముందు ముందునా' అని పాడుకుంటుంది. అంతేకాదు తెరాసలోని అసంతృప్తి నేతలకు సైలెంట్ గా గేలం వేస్తుందట. తెరాస లోని ఓ ఐదుగురు కీలక నేతలు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారట. ఈ నెల 20న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఆయ‌న స‌మ‌క్షంలోనే ఈ ప్ర‌ముఖుల చేరిక‌లు ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఇది తెరాసకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరోవైపు ఈ చేరికలతో కాంగ్రెస్ కి కూడా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమవుతోంది. కూటమిలోని పార్టీలకు సంతృప్తికరంగా సీట్లు కేటాయించాలి. అదేవిధంగా కూటమిలోని పార్టీలకు సీట్లు కేటాయించిన స్థానాల్లో.. తమ పార్టీ నేతలను బుజ్జగించాలి. మరి ఇలాంటి సమయంలో తెరాస నుండి ఐదుగురు కీలక నేతలు చేరితే.. వారికి ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి. దీంతో సొంత పార్టీ నేతలకో లేక కూటమిలోని పార్టీల సీట్లకో గండిపడుతోంది. దీంతో కాంగ్రెస్ లో లేదా కూటమిలో అసంతృప్తి సెగ ఏర్పడే ప్రమాదం ఉంది. మరి కాంగ్రెస్ నిజంగానే తెరాసలోని కీలక నేతలకు గేలం వేసిందా? ఒకవేళ వారు నిజంగానే పార్టీలో చేరితే అసంతృప్తి ఏర్పడకుండా కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ఇలాంటి తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. ఎవరికి లాభం?

  తెలంగాణలో ఎన్నికల నగారా మ్రోగింది. కేసీఆర్ సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందుగానే అసెంబ్లీ రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలకు తెరలేచింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. తెరాస ఇప్పటికే 105 అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో బిజీ బిజీగా ఉంది. ఇక మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ కూడా ఒకవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతూనే.. మరోవైపు ప్రచారం మొదలుపెట్టాయి. ఇలా దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో ఉన్నాయి జనసేన తప్ప. జనసేన అసలు తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేక వైసీపీ లాగా ఏపీకే పరిమితమవుతుందా? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధమంటూ యాత్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని కాని.. తెలంగాణ గురించి ఇంతవరకు ఓ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు కూడా అసలు తెలంగాణలో జనసేన బరిలోకి దిగుతుందా? అంటూ అనుమానం వ్యక్తం చేసారు. అయితే తాజాగా పవన్ ఈ విషయంపై స్పందించారు. విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఎవరో పాలకులు చేసిన తప్పులకు ప్రజలెందుకు బలికావాలని అడిగారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై 4, 5 రోజుల్లో తేల్చేస్తామన్నారు. మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఏపీలో పర్యటన ముగించాక తెలంగాణ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్న సమయంలోనే ముందస్తు ఎన్నికలొచ్చేశాయని పవన్ చెప్పారు. అంటే జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో దిగేది లేనిది ఓ 4, 5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఒకవేళ తెలంగాణ బరిలో జనసేన దిగితే.. దానివల్ల ఎవరికి ప్రయోజనం? అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. జనసేన ఏపీలో ఎంతోకొంత ప్రభావం చూపగలదు కాని.. తెలంగాణలో ప్రభావం చూపడం కష్టమే. ఇంతవరకు పార్టీ నిర్మాణం కూడా జరగలేదు.. పవన్ తప్ప ప్రజలకి తెల్సిన నాయకులు లేరు.. అదీగాక అన్ని స్థానాల్లో బరిలోకి దిగే సరైన అభ్యర్థులు కూడా కష్టమే. దీంతో ఒకవేళ జనసేన తెలంగాణలో పోటీకి సిద్ధమైనా కొన్ని స్థానాల్లోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఆ కొన్ని స్థానాల్లో జనసేన గెలిచినా గెలవకపోయినా ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది. పవన్ వీరాభిమానులు, అలాగే కొందరు సెటిలర్లు జనసేన వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సెటిలర్ల చూపు మహాకూటమి వైపు ఉందనే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు జనసేన బరిలోకి దిగితే ఆ సెటిలర్ల ఓట్లు ఎంతోకొంత చీలే అవకాశముంది. ఇది తెరాసకు ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. అంటే పవన్ తెలంగాణలో పోటీ చేయాలనుకుంటే.. పరోక్షంగా తెరాస లాభం చేకూర్చినట్టే అవుతుందన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

గద్దర్ మహాకూటమి అస్త్రంగా మారనున్నారా?

  తెలంగాణకు మొదటినుండి ఉద్యమాల గడ్డగా పేరుంది. అయితే ఆ ఉద్యమాలలో పాటకి ప్రత్యేక స్థానముంది. ప్రజల్లో స్ఫూరి నింపాలన్నా, ఉద్యమం వైపు అడుగులు వేయించాలన్నా పాటే ఆయుధం. గద్దర్ ఆయుధం కూడా అదే. అసలు గద్దర్ అంటే మొదటగా గుర్తొచ్చేదే పాట. గద్దర్ పాట ఉద్యమానికి స్ఫూర్తి. ఎన్నో గుండెలను కదిలించగల శక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' అంటూ ఎందరినో ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్ పాట కోట్ల గుండెలను కదిలించగలదు. అందుకే ఇప్పుడు మహాకూటమి గద్దర్ ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తుంది. కేసీఆర్ పై పోటీ చేసేందుకు గ‌ద్ద‌ర్ దాదాపుగా సిద్దపడినట్టు తెలుస్తోంది. రాజ‌కీయ పార్టీలతో పాటు ప్ర‌జ‌లూ త‌న‌ని కోరుకుంటే.. గజ్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు సిద్ధం అని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలాంటి సమయంలో ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో క‌లుసుకోవ‌డం కొంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. సైద్ధాంతికంగా ఆయ‌న ఏపార్టీలోనూ చేరే అవ‌కాశం లేదు కాబ‌ట్టి.. మ‌హా కూట‌మి ఆయ‌న‌కి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే దీని వెన‌క మ‌హా కూట‌మి వ్యూహం ఉంద‌నీ చెప్పుకోవ‌చ్చు. కేసీఆర్ మీద కూట‌మి నుంచి ఏదో ఒక పార్టీకి చెందిన ఎవ‌రో ఒక‌ర్ని నిల‌బెట్టినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇత‌ర నేత‌ల్ని విమ‌ర్శించిన‌ట్టుగానే.. త‌న ప్ర‌త్య‌ర్థిపై కూడా కేసీఆర్ మాట‌ల తూటాలు అవలీలగా పేల్చేస్తారు. అదే గ‌ద్ద‌ర్ పోటీకి దిగార‌నుకోండి.. కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం త‌క్కువ‌. అంతేకాదు గ‌ద్ద‌ర్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా మ‌హాకూట‌మికి జ‌రిగే మ‌రో మేలు కూడా ఉంది. గద్దర్ కి ఆయుధ‌మైన పాట ద్వారా తెరాస పాల‌న‌పై ప్ర‌భావవంత‌మైన విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం ఉంది. కేసీఆర్ కి వ్య‌తిరేకంగా గ‌ద్ద‌ర్ ఆటాపాటా రాష్ట్రవ్యాప్తంగా మ‌హాకూట‌మికి ప్ర‌చార అస్త్రంగా మారే అవ‌కాశం ఉంటుంది. కేసీఆర్ మీద గ‌ద్ద‌ర్ లాంటివారు రంగంలోకి దిగితే, ఎన్నిక‌ల ఫ‌లితం అనూహ్యంగా మారుతుందో లేదో చెప్పలేం కానీ.. ఎన్నిక‌ల ప్రచారం మాత్రం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

కాంగ్రెస్ తో పొత్తు.. చంద్రబాబుకి తలనొప్పిగా మారనుందా?

  తెలుగు రాజకీయాల్లో తలపండిన మేథావులు కూడా కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా తెలంగాణలో ఈ రెండు పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. దీన్ని కొందరు స్వాగతించగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకేరించారు. అయితే మొదట చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలి అనుకోలేదు. తెరాసతో కలిసి నడుద్దాం అనుకున్నారు. కానీ తెరాస నుండి సానుకూల స్పందన రాకపోవడంతో మహాకూటమి వైపు అడుగులు పడ్డాయి. అదికూడా కాంగ్రెస్ పార్టీనే, టీడీపీతో పొత్తుకు ఉవ్విళ్లూరింది. టీడీపీలోని మెజారిటీ నాయకులు పార్టీని వీడినా పలు చోట్ల కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 10 శాతం పైనే ఓటుబ్యాంకు ఉందని అంచనా. అందుకే కాంగ్రెస్, టీడీపీతో దోస్తీకి సిద్ధమైంది. కాంగ్రెస్ కి తెలంగాణలో బలం ఉంది కానీ ఇప్పటికిప్పుడు ఒంటరిగా బరిలోకి దిగి తెరాసను ఓడిస్తుందా? అంటే అనుమానమే. అందుకే కాంగ్రెస్ తమ బలానికి, టీడీపీ బలం తోడైతే తెరాసను ఈజీగా ఓడించవచ్చని భావించింది. పొత్తు దిశగా అడుగులు వేసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు పొత్తు విషయాన్ని తెలంగాణ నేతలకే వదిలేసారు. ఇది కాంగ్రెస్ తో పెట్టుకున్నట్టు కాదు. తెరాసకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో భాగం అవుతామనే ఉద్దేశంతో టీడీపీ అంగీకరించింది. అయితే ప్రజల్లోకి ఇది కాంగ్రెస్ టీడీపీ పొత్తుగానే వెళ్ళింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కొండంత ఉంది కానీ టీడీపీకి ఆవగింజంత కూడా లాభం లేదు. లాభం సంగతి అటుంచితే ఇంకా టీడీపీకి నష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ పొత్తు వల్ల భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు వచ్చేలా ఉన్నాయి.       తెలంగాణలో టీడీపీకి భారీ సంఖ్యలో నాయకులు లేకపోయినా.. ఓటుబ్యాంకు మాత్రం బాగానే ఉంది. సుమారు 40 స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీ.. కేవలం కాంగ్రెస్ ఇచ్చే 10, 15 స్థానాల కోసం పొత్తుకు సిద్దమవ్వడం ఏంటంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేసున్నారు. ఒంటరిగా పోటీచేసినా ఆ 10,15 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ తో పొత్తు ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు టీడీపీ అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని పేరుంది. అలాంటి టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏపీ టీడీపీ నాయకులు కూడా కాంగ్రెస్ తో దోస్తీని వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. దోస్తీ తెలంగాణకే పరిమితం.. ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ఎప్పటికీ మన శత్రువే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. తెలంగాణలో పరిస్థితి వేరు. ప్రస్తుతం అక్కడ టీడీపీకి నాయకుల కొరత ఉంది. ముందు అక్కడ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలి. అందుకే కూటమిలో కలవాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేసున్నారట. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ తో దోస్తీ చంద్రబాబుకి తలనొప్పి తీసుకొచ్చి పెడుతుంది. ఓ వైపు ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెడుతూనే.. మరోవైపు తెలంగాణ దోస్తీ గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తూ బుర్ర వేడెక్కుతుందట. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీడీపీ కూటమిలో భాగం కావడం మాకు కలిసొచ్చింది. ఈ దోస్తీ వల్ల కాంగ్రెస్ కి ఎంత లాభం ఉందో.. టీడీపీకి అంతే నష్టం ఉంటుందని అభిప్రాయపడుతున్నారట. చూస్తుంటే ఈ దోస్తీ మూలంగా చంద్రబాబుకి భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు తలుపుతట్టేలా ఉన్నాయి. చూద్దాం మరి చంద్రబాబు వీటి నుండి ఎలా బయటపడతారో ఏంటో.

కాంగ్రెస్ టీడీపీకి అన్యాయం చేస్తుందా?

  తెలుగు రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదే తెలంగాణాలో మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవడం. అయితే తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యేలా టీడీపీ మహాకూటమికి మద్దతు తెలిపింది. నిజానికి తెలంగాణలో టీడీపీతో పొత్తుకి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నే ఎక్కువ ఉత్సాహం చూపింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ మహాకూటమి వైపు మొగ్గుచూపింది. పేరుకి మహాకూటమిలో కాంగ్రెస్ కాకుండా మూడు పార్టీలు ఉన్నాయనే కానీ.. కాంగ్రెస్ కి టీడీపీ నే ప్రధాన బలం. టీజెఎస్ పార్టీలో కోదండరాం లాంటి బలమైన నేతలు ఉన్నారు కానీ బలమైన ఓటు బ్యాంకు లేదనే చెప్పాలి. ఇక సిపిఐ సంగతి సరేసరి. ఒకప్పుడు ఎర్రజెండాలు రెపరెపలాడాయి కానీ ఇప్పుడు ఆ ప్రభావం లేదనే చెప్పాలి. టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎప్పటినుండో ఉన్న పార్టీ.. ప్రజలకు చేరువైన పార్టీ. 2014 ఎన్నికల అనంతరం మెజారిటీ నాయకులు పార్టీని వీడారు కానీ.. కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉంది. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 10 శాతంపైనే ఓటు బ్యాంకు ఉంది. అందుకే కాంగ్రెస్ టీడీపీకి దగ్గరైంది. తమ బలానికి టీడీపీ బలం తోడైతే అధికారం ఈజీగా పొందొచ్చని భావించింది. అయితే అలాంటి టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     సీట్ల కేటాయింపు విషయంలో మిగతా పార్టీలను చూసినట్టు కాంగ్రెస్, టీడీపీని చిన్నచూపు చూస్తుంది. టీడీపీ తెలంగాణలో దాదాపు 40 స్థానాలలో బలంగా ఉంది. ఈ 40 స్థానాల్లో టీడీపీ.. మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశముంది. ఈ లెక్కల ప్రకారం టీడీపీకి 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం 10,15 సీట్లిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు కూడా గట్టిగా పట్టుబట్టడం లేదు. ఏదో సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఎన్ని సీట్లిస్తే అన్ని చాలులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. ఇంత బలమైన కేడర్ ఉన్న పార్టీకి 10 స్థానాలు ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి నేతలు టీడీపీలో ఉండి ఉంటే కనీసం 25 సీట్లైనా కావాలని కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఇక చంద్రబాబు తెరమీదకు వచ్చి సీట్ల గురించి మాట్లాడి కనీసం 25 సీట్లైనా వచ్చేలా చూడాలని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కాంగ్రెస్ పది సీట్లు కేటాయించి టీడీపీ ఓటుబ్యాంకుతో లబ్ధిపొందాలని చూస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టి పార్టీకి అన్యాయం జరగకుండా చూడాలని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనసేనతో పొత్తు.. జగన్ నై నై

గత కొంతకాలంగా వైసీపీ, జనసేన పార్టీల మధ్య రహస్య పొత్తు ఉంది.. ఆ రెండు పార్టీలను వెనకుండి బీజేపీ నడిపిస్తోంది అంటూ పలువురు ఆరోపిస్తూ వచ్చారు. ఇక ఈమధ్య వైసీపీ, జనసేనల మధ్య అధికార పొత్తుకు రంగం సిద్దమైందంటూ వార్తలు కూడా వచ్చాయి. మరి వైసీపీతో పొత్తుకు జనసేన సుముఖంగా ఉందో లేదో తెలీదు కాని.. జనసేనతో పొత్తు అంటే మాత్రం వైసీపీ అధినేత జగన్ నై నై అంటున్నారట.     తనపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ తో పొత్తు పెట్టుకోనే ప్రసక్తేలేదని.. ఈ విషయంలో తనతో సంబంధం లేకుండా జనసేనతో చర్చించవద్దని.. జగన్ తన పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారట. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ వల్ల జనసేనకు లాభం కలుగుతుంది కానీ.. జనసేన వల్ల వైసీపీకి అసలు ఏ మాత్రం లాభం ఉండదని జగన్ భావిస్తున్నారట. అందుకే జగన్ ఒకవైపు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూనే మరో వైపు పవన్‌ పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్‌, పవన్‌ లను కలసి పోటీ చేయించాలని బీజేపీ పావులు కదుపుతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ జగన్ మాత్రం  పవన్‌ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని అంటున్నారట. ఆయన గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం ఆయన కోరిన సీట్లు ఇవ్వలేం.. గత ఎన్నికల పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. పవన్‌కు రాజకీయ లబ్దిని చేకూర్చడం కంటే ఒంటరిగా ముందుకు వెళదాం అని జగన్‌ తేల్చి చెబుతున్నారట.     ఇటీవల విజయసాయిరెడ్డి పవన్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. జగన్‌ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారా?.. లేదా ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు స్వయంగా కలిశారా?.. అనే విషయం బయటపడడం లేదు. ఏది ఏమైనా పవన్ తో ముందు ముందు మరిన్ని సమస్యలు వస్తాయని వైసీపీ ఆందోళన చెందుతుంది. వైసీపీ ఓటు బ్యాంక్‌ జనసేనకు లభించవచ్చు కానీ జనసేన ఓటు బ్యాంక్‌ వైసీపీకి బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పవన్‌ ఓటు బ్యాంక్‌ కేవలం కాపు యువజన ఓటర్లేనని.. వారు జనసేన అభ్యర్థికి ఓటు వేస్తారే తప్ప పొత్తు ఉన్నా వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని జగన్‌ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పవన్‌ తో పొత్తు కన్నా.. అప్పటి పరిస్థితులను బట్టి  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలా? ఎవరినైనా కలుపుకుపోవాలా? అనే విషయంపై చర్చిద్దామని జగన్‌ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏమంటారో తెలీదు కానీ ప్రస్తుతానికైతే జనసేనతో పొత్తు అంటే జగన్ నై నై అంటున్నారట.

చంద్రబాబుని ఫాలో అవుతున్న వైఎస్ జగన్.!!

చంద్రబాబుకి ముందుచూపు ఉన్న నేతగానే కాకుండా.. నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నేతగా పేరుంది. పార్టీ నేతలైనా, ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వ అధికారులైనా ఆయనలాగే క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు కోరుకుంటారు. నిబద్ధత, క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అవసరమైతే సొంత పార్టీ నేతలకు క్లాసులు కూడా పీకుతారు. అంతెందుకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో కూడా ఆయన ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారీగా తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. చిన్న తప్పులుంటే సూచలను ఇస్తారు. ఆ ఎమ్మెల్యే మీద ప్రజల్లో మరీ వ్యతిరేకత ఉంటే పద్ధతి మార్చుకో లేదంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేస్తారు. అందుకే ఆయన హయాంలో ఇంచుమించు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. చంద్రబాబుకి స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఆయన టిక్కెట్ల కేటాయింపు, అభివృద్ధి పనుల విషయంలో నిక్కచ్చగా ఉంటారు. దానికి తగ్గట్టే ఫలితాలు కూడా అందుకుంటారు. ఇదే ఇప్పుడు జగన్, చంద్రబాబుని ఫాలో అయ్యేలా చేసిందేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     జగన్, చంద్రబాబు అంటే ఒంటికాలి మీద లేస్తారు. ప్రతిపక్ష నేతగా అధికారపార్టీ నేతని విభేదించడం కామన్ లేండి. చంద్రబాబు మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించి సీఎం అవ్వాలని చూస్తున్న జగన్.. చంద్రబాబునే ఫాలో అవుతూ చంద్రబాబుని దెబ్బతీయాలని చూస్తున్నారట. మొన్నటివరకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు నమ్ముకున్న.. నియోజకవర్గాల వారీగా రిపోర్టులు, క్రమశిక్షణనే జగన్ కూడా నమ్ముకుంటున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ' పద్ధతి మార్చుకో.. లేదంటే నిన్ను మార్చి వేరే వారికి టిక్కెట్ ఇస్తాం' అని పెద్ద రాయుడు రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారట.     జగన్‌ ఓ వైపు పాదయాత్ర చేస్తూనే.. మధ్యలో విరామ సమయంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, సిట్టింగ్‌లతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమై వారి బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలను చీపురుపల్లెకు పిలుపించుకొని రివ్యూ నిర్వహించారట. సర్వే బృందాలు కూడా సమీక్షలో ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నీ బలహీనతలు ఇవి అంటూ బహిర్గత పరిచి సలహాలు, సూచనలు ఇచ్చారట. బలహీనతలు ఎక్కువ మోతాదులో ఉన్న వారిని ఉద్దేశించి మీ బలహీనతలను నెల రోజుల్లో సరిచేసుకుంటే సరి, లేకుంటే సీటు వేరే వారికి ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఒక ఇన్‌ఛార్జ్‌ని ఉద్దేశించి నీకు మాటలు ఎక్కువ, తిరుగుడు తక్కువ అని మందలిస్తూ ఇప్పటి నుంచైనా నియోజకవర్గ ప్రజలతో మమేకం కావాలని ఆగ్రహించినట్లు తెలుస్తోంది. అలాగే ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్నాయ్‌.. చురుగ్గా వ్యవహరించకపోతే ప్రత్యర్ధిని ఢీకొనడం కష్టమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు ఆయా ఇన్‌చార్జ్‌ల, ఎమ్మెల్యేల తీరు నచ్చక నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు ఎవరెవరు దూరంగా ఉంటున్నారో కూడా సర్వే నివేదిక ద్వారా వివరిస్తూ వారిని దగ్గరకు తీసుకునే చర్యలు వెంటనే చేపట్టాలని, గెలవాలంటే అహాన్ని వీడాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కూడా చంద్రబాబు స్టైల్ లో నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకొని ఫోకస్ చేస్తున్నారుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాఫెల్ డీల్ రచ్చ.. సుప్రీంకోర్టు విచారణ

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ డీల్ గురించి బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో.. ఈ రాఫెల్ వివాదం మరింత ముదిరింది. తరువాత భారత ప్రభుత్వం ప్రమేయం లేదని ఫ్రాన్స్‌ మాట మార్చింది కానీ.. కాంగ్రెస్ మాత్రం బీజేపీ మీద మాటల యుద్ధం చేస్తూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో మోదీ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్నారు. యుద్ధ విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం, అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మోదీని ఈ రాఫెల్ వివాదంతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   అయితే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. 36 రాఫెల్ జెట్‌ విమానాల కొనుగోలుకు ఎంత వ్యయం అయిందనే వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ వినీత్‌ ధండా అనే ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కెఎం జోసఫ్‌ ఈ పిటిషన్‌ విచారణను చేపట్టేందుకు అంగీకరించారు. ఈనెల 10న ఈ పిటిషన్‌ విచారణను ప్రారంభిస్తామని జస్టిస్‌ గొగొయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.   యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు, ఎన్డీయే హయాంలో విమానాల కొనుగోలుకు ఎంత కేటాయించారనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా న్యాయవాది వినీత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు రిలయన్స్‌, డసో ఏవియేషన్‌ మధ్య ఈ ఒప్పందం ఏ విధంగా జరిగిందో తెలపాల్సిందిగా కోరారు. ఆయనతో పాటు మరో న్యాయవాది ఎంఎల్‌ శర్మ కూడా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ విచారణ కూడా ఈనెల 10న చేపట్టనున్నారు. ఇన్నాళ్లు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా ఉన్న రాఫెల్ డీల్ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కడంతో.. ఈ వివాదం ఎటువైపు వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.