Venkaiah Naidu

వెంకయ్య ఐక్యతారాగం!

      అచ్చ తెలుగువాడు.. పదహారణాల ఆంధ్రుడు, బీజేపీ కేంద్ర నాయకుడు వెంకయ్య నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న ఆయన రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు మొత్తాన్నీ కిషన్ రెడ్డి చేతుల్లోనే ఉంచారు. అయితే పేనుకు పెత్తనం ఇచ్చినట్టుగా కిషన్ రెడ్డి తెలంగాణకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ దుకాణం సర్దేసే పరిస్థితి తెచ్చారు. కిషన్ రెడ్డిని ఇంకా అలాగే వదిలేస్తే పద్ధతిగా వుండదని అర్థం చేసుకున్న వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. కిషన్ రెడ్డి చేసిన డ్యామేజీని సరిదిద్దే ప్రయత్నంలో వున్నారు. సీమాంధ్రులు ప్రస్తుతం బీజేపీని శత్రువుగా భావిస్తున్నారు. మొదట ఆ అభిప్రాయాన్ని తొలగించే పనిలో వెంకయ్య వున్నారు. కిషన్ రెడ్డి నోటి పవర్ని కాస్త తగ్గించమని ఇప్పటికే ఆదేశాలు అందటంతో ఆయన అంతకుముందులా దూకుడుగా కాకుండా కాస్తంత ఆచి తూచి మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలకు తలవంచి ఇంతకాలం మౌనంగా వున్న వెంకయ్య నాయుడు ఇప్పుడు సమైక్యతా రాగం ఆలపిస్తున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లో ‘ఐక్యతా చిహ్నం’ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. సర్దార్ పటేల్ దేశం ఐక్యంగా వుండాలని ఎంతో కోరుకున్నారని, ఆయన ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని చెబుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజల్ని విభజించే పనిలో వుందని విమర్శించారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమే గానీ, ఇష్టమొచ్చినట్టు  రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించడానికి మాత్రం వ్యతిరేకమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం మాత్రమే కాకుండా తెలుగు ప్రజలను కూడా విభజిస్తోందని ఆయన కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమ మద్దతు వుంటుందిగానీ, ప్రజల్ని విభజిస్తామంటే తమ మద్దతు వుండబోదని స్పష్టంగా చెప్పారు. ఐక్యత అనేది ఎంతో బలమైనదని ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. వెంకయ్య నాయుడు ఐక్యతా ఉపన్యాసం విన్నవారికి, చదివినవారికి రాష్ట్రం ఐక్యంగా వుంటుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.

Telangana ministers

విభజనుల గుండెల్లో రాయి!

      రాష్ట్ర విభజనుల గుండెల్లో రాయి పడింది. ఆ రాయిపేరు ‘రాయల తెలంగాణ’. కేంద్ర ప్రభుత్వం దర్శకత్వంలో రూపొందిన అట్టర్ ఫ్లాప్ మూవీ ‘విభజన’లో సరికొత్త ట్విస్ట్ లేటెస్టుగా తెరమీదకి వచ్చింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మీద కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అది కూడా రాయలసీమ మొత్తాన్నీ తెలంగాణలో కలపకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలనే తెలంగాణలో కలిపే ఎందుకూ పనికిరాని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుంది.     తనకు వచ్చిన చెత్త ఐడియా గురించి రాష్ట్రంలోని విభజనవాదుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. కొంతమందికి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల చేత ఫోన్లు చేయించి రాయల తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగించింది. సహజంగానే విభజనులందరూ రాయల తెలంగాణ అనగానే మరో లభిప్రాయం లేకుండా నో చెప్పేశారు. నో అని అయితే చెప్పారుగానీ, ఆ తర్వాత నుంచి విభజనుల గుండెల్లో రాయి పడింది. కంటికి కునుకు దూరమైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రాయల తెలంగాణ వైపు పూర్తిగా మొగ్గి టోటల్‌గా తెలంగాణ ఆశలను వమ్ము చేస్తుందోనని భయం పట్టుకుంది. టీఆర్ఎస్ నాయకులయితే రాయల తెలంగాణ అనే మాట గుర్తొచ్చినా ఉలిక్కిపడుతున్నారు.   నిజంగా రాయల తెలంగాణ అనేది కార్యరూపంలోకి వస్తే తెలంగాణలో తమ పార్టీ బలం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. కరడుగట్టిన విభజనవాదులు బోలెడన్ని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ అనే నినాదాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ఎవరెంతగా వక్కాణించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం రాయల తెలంగాణ మీద మోజును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో జోరుగా మంతనాలు సాగిస్తోంది. అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే విభజన ప్రక్రియను మరింత ఆలస్యం చేసి తర్వాత చేతులు ఎత్తేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న అనుమానాలు తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని పది జిల్లాల తెలంగాణ కాకుండా ఇంకోరకం తెలంగాణ ఇస్తామంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని బెదిరింపులు మొదలుపెట్టారు.

kiran on congress

అంటే.. కిరణ్ ఉద్దేశమేంటి?

      రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి తన ఆనందాన్ని అణుచుకోలేని పరిస్థితిని చవిచూశారు. ప్రమాణ స్వీకారం చేసిన నెలా పదిహేను రోజుల నుంచే ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్న వార్తలు వచ్చిన పరిస్థితి నుంచి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.   కిరణ్‌కి ముఖ్యమంత్రి పదవి  దక్కడమే ఒక బోనస్ అయితే, ఆ బోనస్ మూడేళ్ళపాటు లాకౌట్ కాకుండా వుండటం విశేషమే. దానికితోడు ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదని అని అధిష్ఠానానికి వ్యతిరేకంగా గళమెత్తినా పదవి పోలేదంటే అంతకంటే ఆనందం మరొకటి వుంటుందా? ఆ ఆనందంలో తానేం మాట్లాడుతున్నాడో కూడా మరచిపోయి ముఖ్యమంత్రి మాట్లాడేశారు. మూడేళ్ళ ముచ్చట ముగిసిన రోజున ఆయన రాయచోటిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగితే అసలు గొడవే వుండేది కాదు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా వుందని, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందు వరకూ కూడా పథకాలు సక్రమంగా అమలు కాక ఎన్నో బకాయిలు వుండిపోయాయని, అలాంటి ఘోరమైన పరిస్థితులన్నీ తాను రాగానే చక్కదిద్దానని ఆయన చెప్పుకున్నారు. ఇది పైకి చాలా సింపుల్ విషయంలా కనిపించినా, కాంగ్రెస్ పార్టీకే పెద్ద డ్యామేజ్ లాంటి విషయం. కిరణ్ చెప్పిన మాటల ప్రకారం, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరమ అధ్వాన్నంగా వున్నట్టు! డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన గుడ్డ వేసుకుని కూర్చున్నట్టు! కిరణ్ గారు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు!! ఎవరైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ గత ప్రభుత్వం నాసిరకం ప్రభుత్వం.. మా ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కిరణ్ కుమార్ మాత్రం తన కాంగ్రెస్ ప్రభుత్వాలనే తిట్టిపోశారు. ఈ విషయాన్ని ఎలా రాజకీయం చేద్దామా అని ముఖ్యమంత్రి వ్యతిరేకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Kiran Completes 3 Years As CM

మూడేళ్ళ ముచ్చట!

      మూడేళ్ళ క్రితం స్పీకర్‌గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చాప కిందకి నీరులా ప్రవేశించి, ఆయన్ని తమిళనాడు గవర్నర్‌గా పంపించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ముచ్చట తీరి మూడు సంవత్సరాలు అవుతోంది. రాష్ట్రంలో పరిపాలనను కుంటుపడేలా చేసిన విభజన ఉద్యమాన్ని గాడిలో పెడతానని, పరిస్థితులు మొత్తం చక్కదిద్దుతానని అధిష్ఠానానికి పెద్ద స్క్రీన్ ప్లే ఇచ్చి కిరణ్ ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చున్నారు.   అయితే ఈ మూడేళ్ళ కాలంలో ఆయన ఏరకంగా అయినా సాధించిందేమైనా వుందా అని ప్రశ్నిస్తే ఫలానా వుందని చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఈ మూడేళ్ళ కాలంలో ఆయన తెలుగు ప్రజలకు మూడు నామాలు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి మూడేలా చేయడం మినహా సాధించిందేమీ లేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టినవాడు కాబట్టి తాను కూడా తెలంగాణ వాడినేనని, తనకున్న హైదరాబాద్ పవర్‌తో విభజనవాదులను కంట్రోల్ చేస్తానని అధిష్ఠానం దగ్గర చెప్పుకున్న కిరణ్ విభజనవాదుల్ని ఎంతమాత్రం అదుపులో పెట్టలేకపోయారు. బయటివారి సంగతి సరే, తన మంత్రివర్గ సహచరులను కూడా అదుపు చేయలేకపోయారు. అటు తెలంగాణ మంత్రులతోపాటు ఇటు సీమాంధ్ర మంత్రలు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకం అయిపోయారు. ఇదిలా వుంటే, పరిపాలన పరంగా ఆయన సాధించింది కూడా ఏమీ లేదు. పాత పథకాలకే కొత్త పాలీష్ కొట్టి అవేవో తన సొంత పథకాలన్నట్టు బిల్డప్ అయితే ఇచ్చుకున్నారు. అయితే ఆ పథకాలేవీ సక్రమంగా అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఎలా పరిపాలిస్తేనేం కిరణ్ కుమార్ రెడ్డి తాను కలలు కన్న ముఖ్యమంత్రి సీటు సాధించారు. మూడేళ్ళ ముచ్చట తీర్చుకున్నారు. కిరణ్‌కి ముఖ్యమంత్రి పదవిలో ఇంకా మూడునాళ్ళ ముచ్చట మిగిలి వుంది. ఆయన్ని త్వరలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పదవి నుంచి తప్పించకపోయినా నాలుగైదు నెలలలో అసెంబ్లీయే రద్దవుతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోనున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు.  

sridhar babu Assembly prorogue

శ్రీధర్‌బాబు ఏం చేస్తారో!?

      శాసనసభను ప్రొరోగ్ చేస్తూ వచ్చిన ప్రతిపాదనకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంతకం చేశారు. ఆ ఫైలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరకి చేరింది. శ్రీధర్‌బాబు ఆ ఫైల్‌ని ఓకే చేసి ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన దాన్ని గవర్నర్‌కి పంపిస్తారు. అప్పుడు శాసనసభ ప్రొరోగ్ అవుతుంది. శాసనసభ ప్రొరోగ్ అయితే తెలంగాణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ పెరిగే అవకాశం వుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్‌బాబు ఇప్పుడు తనదగ్గర వున్న ప్రొరోగ్ ఫైల్‌ని ముఖ్యమంత్రి దగ్గరకు పంపుతారా లేదా అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది.   విభజనవాదులు శ్రీధర్‌బాబు సదరు ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపరని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు రేపు తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వున్న వ్యక్తి కావడం వల్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా చూసే అవకాశం వుందని అంటున్నారు. అయితే సమైక్యవాదులు మరోరకంగా చెబుతున్నారు. స్పీకర్ నుంచి వచ్చిన ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపడం మినహా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల తనకు ఇష్టం వున్నా లేకపోయినా శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపి తీరాల్సిందేనని అంటున్నారు. అదేవిధంగా నలుగురితోపాటు నారాయణ అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నారే తప్ప శ్రీధర్‌బాబుకు వ్యక్తిగతంగా రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెబుతున్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్, మృదుస్వభావి అయిన దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టులు గతంలో అన్యాయంగా హతమార్చారు. తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టులు సమర్థిస్తూ వుండటం, తెలంగాణ ఏర్పడితో తెలంగాణ మావోయిస్టుల అధికారిక నివాసంగా మారిపోయే సూచనలు కనిపిస్తూ వుండటంతో శ్రీధర్‌బాబుకు తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేదన్నట్టు తెలుస్తోంది. అందువల్ల శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్ విషయంలో సంప్రదాయబద్ధంగా వ్యవహరించి ముఖ్యమంత్రికి పంపే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Jana Reddy in CM race

జానా ఆశలు ఆవిరి!

      రాష్ట్ర రాజకీయాలలో జానారెడ్డికి మించిన అదృష్టవంతుడు మరొకడు లేదని ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు అనిపిస్తూ వుంటుంది. జానారెడ్డి గారు మాట్లాడుతూ వుంటే, ఆయన ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది. ఆయన మాట్లాడిన మాటలన్నిటిని ఒకచోట చేర్చి అతికించుకుంటే తప్ప ఆయన ఏం మాట్లాడారన్నది అర్థం కాదు.   జనాన్ని అంతగా గొప్పగా ‘ఇంప్రెస్’ చేయగల వక్త అయిన జానారెడ్డి రాజకీయాలలో ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. ఆయన్ని రాజకీయాలలో అదృష్టమే అందలం ఎక్కించిందని అనిపిస్తూ వుంటుంది. ఆ అదృష్టమే తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తుందని ఆశించిన ఆయన నిరాశపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి కాకపోతే పోయె తెలంగాణకి అయినా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడి విభజన ఉద్యమ మంటల్లో తనవంతు పెట్రోల్ పోశారు. కేంద్రానికి, కాంగ్రెస్ పార్టీకి తనవంతు అభూత కల్పనల నివేదికలు అందించి, రాష్ట్రం విడిపోవడానికి ఎంతో శ్రమించి రాచమార్గం వేశారు. అయితే తాను వేసిన రాచమార్గంలో ఎవరెవరో ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి పీఠం కోసం ముందుకు దూసుకువెళ్తూ వుండటం చూసి జానా బాధపడిపోతున్నారు. ఇంతకాలం రాజకీయాల్లో ఆయన్ని అందలం ఎక్కించిన అదృష్టదేవత కీలక సమయంలో ముఖం చాటేసింది. తాజాగా రంగంలోకి వచ్చిన జైపాల్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎగరేసుకుపోయే అవకాశాలు బలంగా వుండటంతో జానా ఆశలు ఆవిరైపోయాయి. మొన్నటి వరకూ తెలంగాణ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నాయకులలో అగ్రస్థానంలో వున్న తాను ఇప్పుడు తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్న వారందరిలో ఒకడిగా, ఏమాత్రం ప్రాధాన్యం లేని స్థానానికి చేరుకోవడం ఆయనకు బాధను కలిగిస్తోంది. ఏదో ఆశించి ఏదో చేస్తే ఇప్పుడిలా అయ్యిందేమిటి భగవంతుడా అని ఆయన మథనపడుతున్నట్టు తెలుస్తోంది.  

 Article 371D to create unrest AP

వై దిస్ 371 డి?

      వై దిస్ కొలవరి డి? పాట అప్పట్లో దేశం మొత్తాన్నీ ఓ ఊపు ఊపించింది. ప్రస్తుతం విభజనవాదులు మాత్రం వై దిస్ 371 డి? అని విషాదగీతం పాడుకుంటున్నారు. ఇటాలియన్ సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా రాష్ట్రాన్ని కేక్ మాదిరిగా కోసేయాలన్న ప్రయత్నాలకు రాజ్యాంగంలోని 371-డి అధికరణం ప్రధాన అవరోధంగా మారింది. ఈ అధికారణాన్ని సవరించడమంటే అంత సులభంగా జరిగిపోయే పనికాదు. అందుకే ఈ అధికరణం జోలికి పోకుండానే రాష్ట్రాన్ని ముక్కలు చేసేయాలని విభజనవాదులు కోరుకుంటున్నారు.   అయితే ఈ అధికరణ సంగతి తేల్చకుండా విభజనపై ముందుకెళ్ళే సీను లేదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు తేల్చి చెప్పడంతో విభజనవాదులు తల్లడిల్లిపోతున్నారు. డిసెంబర్ 20వ తేదీ లోపు విభజనకు పార్లమెంట్‌లో ఆమోదం లభించకపోతే ఆ తర్వాత తెలంగాణ దుకాణం సర్దేయక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఏం చేయాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. కొంతమంది అతివాద వేర్పాటువాదులు ఈ అధికారణాన్ని పట్టించుకోకుండా విభజన చేసేయాలని పట్టుపడుతున్నా వారి గోడు వినేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. విభజన తద్దినం త్వరగా పెట్టేసి తన కొడుకును గద్దె మీదకి ఎక్కించేయాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ కూడా ఈ 371 డి ఆర్టికల్‌ను చూసి పళ్ళు కొరుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ అర్టికల్‌ని పట్టించుకోకుండా ‘పదండి ముందుకు... పదండి దూసుకు’ అని అధికార యంత్రాంగానికి ఆమె సూచించిందట. దానికి అధికార యంత్రాంగం స్పందిస్తూ, 371 డి ఆర్టికల్‌ని పట్టించుకోకుండా ముందుకు దూసుకువెళ్తే ‘పోతాం పోతాం పైపైకి’ అని సోనియాగాంధీకి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విభజన బాధ్యతలను భుజాల మీదకి ఎత్తుకున్న వాళ్ళంతా సీమాంధ్రులకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనలు పక్కన పెట్టేసి 371 డి అధికరణం కన్నుకప్పి రాష్ట్రాన్ని ఎలా విభజించాలన్న దానిమీదే తమ బుర్రల్ని పెట్టి ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. వాళ్ళు కూడా వై దిస్ 371 డి అని పాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

KPS Gill sparks off controversy

నీ ‘గిల్లు’డు ఆపవయ్యో!

      పోలీసు పెద్దాయన కేపీఎస్ గిల్ తాజాగా నోటికొచ్చిన ఓ స్టేట్‌మెంట్ పారేశారు. గవర్నర్లు వయసుడిగిన వేశ్యలతో సమానం అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. కేపీఎస్ గిల్ ఫ్లాష్‌బ్యాక్ తెలియనివాళ్ళు అబ్బ ముసలాయన భలే కామెంట్ చేశాడే.. ఎంత సిన్సియరో అనుకుంటారు. అయితే గిల్లుగారి గిల్లుడు గురించి తెలిసినవారు మాత్రం నీ గిల్లుడు ఆపవయ్యో అని విసుక్కుంటారు. ఐపీఎస్ చదివి పోలీసు శాఖలో ఉన్నత స్థానాలను చేపట్టిన గిల్లు గారికి మొదటి నుంచి నోటికొచ్చింది మాట్లాడే అలవాటుంది. సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అలా మాట్లాడేవాడేమో అని అపోహపడకండి.. ఈయన అన్నిరకాలుగా గ్రంథసాంగుడే.   1996లో రూపన్ డియోల్ బజాజ్ అనే ఒక సీనియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని కేపీఎస్ గిల్లు గారు గిల్లారు. ఆమెని లైంగిక వేధింపులతో మానసికంగా హింసించాడు. ఐపీఎస్ అధికారులు జరుపుకున్న ఒకపార్టీలో గిల్లు గారు తప్పతాగి, అసభ్యకరంగా మాట్లాడుతూ డియోల్ బజాజ్‌ని లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె గిల్ మీద కంప్లయింట్ చేసి న్యాయస్థానానికి ఈడ్చింది. న్యాయస్థానం ఇతగాడికి రెండు లక్షల రూపాయల జరిమానాతోపాటు మూడు నెలల జైలుశిక్ష కూడా విధించింది. అయితే కోర్టుని, డియోల్ బజాజ్‌ని బతిమాలుకుని బామాలుకుని జైలుశిక్ష నుంచి మాత్రం బయటపడ్డాడు. అంతేకాదు ఈయనగారు ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు భోంచేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంత గొప్ప వ్యక్తిని ఒకనాటి కేంద్ర మంత్రి రాజేష్ పైలెట్ మణిపూర్ గవర్నర్‌గా సేవలందించాలని ఆఫరిస్తే ఈయనగారు తిరస్కరించారట. ఈయన చెప్పినవాటిని ఖండించడానికి రాజేష్ పైలట్ బతికి లేడు కాబట్టి ఏవైనా చెప్పేయచ్చని గిల్ అనుకున్నట్టున్నాడు. మొత్తమ్మీద ఏమిటంటే, ప్రస్తుతం ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్న గిల్లు ఆ గోళ్ళు గిల్లుకునేదేదో గవర్నర్ కుర్చీలో కూర్చుని చేస్తే ఓ పనైపోతుంది కదా అని భావించినట్టున్నాడు. దానికోసం ప్రయత్నిస్తే గవర్నమెంట్ చాల్లే పోవయ్యో అన్నట్టుంది. అందుకే అందని ద్రాక్ష పులుపు అన్నట్టు తనకి దక్కకుండా పోయిన గవర్నర్ పదవిని పోల్చకూడని వృత్తితో పోల్చి తన అక్కసు తీర్చుకున్నాడు. నోటితోపాటు అన్ని రకాల దురదలూ ఎక్కువగా వున్న కేపీఎస్ గిల్‌కి గతంలో పద్మశ్రీ అవార్డు అనవసరంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తిరిగి లాక్కుంటే గానీ ఈయనగారి తిక్క కుదరదు!  

Seemandhra Ministers

అమ్మబాబోయ్ నమ్మరాదు!

      రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న తెలుగువారి నమ్మకం రోజురోజుకూ సడలిపోతోంది. ఈ నమ్మకం ఇలా సడలిపోవడానికి కారణం తెలుగువారు నమ్మకూడని వారిని నమ్మడమే! ముఖ్యంగా విభజన కారణంగా దారుణంగా మోసపోయే సీమాంధ్రులు ఎవర్ని నమ్మకూడదో వారినే నమ్మి ఇప్పుడు చింతిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాదంటూ సీమాంధ్రులను నమ్మించిన మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా బిజీగా వున్నారు.   కొత్త రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దు మొర్రో అని సీమాంధ్రులు మొత్తుకుంటున్నా వినని కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రలోని ప్రజా ప్రతినిధుల భుజాల మీద ఎక్కి కూర్చుని ఈ ఆందోళన సాగరాన్ని దాటే ప్రయత్నం చేస్తోంది. దీనికితోడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ రాష్ట్ర విభజన జరగదంటూ సీమాంధ్రులను మభ్యపెట్టే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీరందరూ కలసి సీమాంధ్రులను మరో నమ్మకంలో ముంచేశారు. ఆ నమ్మకం ఏమింటంటే, ‘‘తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కంటే సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆ బిల్లు అసెంబ్లీలో ఓడిపోతుంది. అప్పుడు రాష్ట్ర విభజన ఆగిపోతుంది’’. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమించకుండా భ్రమల్లో ఉంచడానికే సీమాంధ్ర కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు ఇలాంటి నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సీమాంధ్ర రాజకీయ నాయకులు సీమాంధ్రుల నమ్మకాలు ఎన్నింటినో నాశనం చేశారు.విభజనకు వ్యతిరేకంగా నిలబడతారని నమ్మినవారందరూ చివరికి ప్యాకేజీ ఇస్తే చాలంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ నమ్మకాన్ని కూడా వీళ్ళు నాశనం చేయరన్న నమ్మకం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విభజన బిల్లుకు అనుకూలంగా ఓటు వేయరన్న నమ్మకం ఏమిటన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులను నమ్మకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

cm kiran rachchabanda

అటు కాదు కిరణ్.. ఇటు!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్య చాంపియన్ హోదా తప్ప మరేమీ పట్టనట్టుంది. ప్రజల సమస్యల కంటే రేపు రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకి కూడా ముఖ్యమంత్రి పోస్టు వెలగబెట్టాలన్న ముచ్చట ఆయనలో కనిపిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా, ముక్కలై చిక్కిపోయిన చిన్న ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనతను సాధించడానికి ఆయన తంటాలు పడుతున్నట్టుంది.   ముఖ్యమంత్రి హోదాలో వున్న ఆయన సమైక్యం అని ఆయన కంఠ నాళాలు తెగిపోయేలా, అధిష్ఠానం కర్ణభేరులు పగిలిపోయేలా అరుస్తున్నప్పటికి పట్టించుకునేవారే లేకుండా పోయారు. సీఎం ఎంత కిందామీడా పడినా కేంద్రం లైట్‌గా తీసుకుని విభజనవైపు దూసుకుపోతోంది. అందుకే ఎలాగూ రాష్ట్రం ముక్కలయ్యేట్టుంది కాబట్టి సీమాంధ్రలో అయినా తన పట్టు నిలుపుకోవాలని కిరణ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే తనను తాను సమైక్య చాంపియన్‌గా సీమాంధ్ర ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో నిమగ్నం కావాలని ప్రయత్నిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన రాయలసీమ ప్రాంతంలో రచ్చబండ నిర్వహించనన్నారు. అయితే ఆయన ప్రస్తుతం వెళ్ళాల్సింది రాయలసీమకు కాదు.. హెలెన్ తుపాను ధాటికి కకావికలైపోయిన కోనసీమ, దివిసీమ ప్రాంతానికి! కోస్తాలోని ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న రచ్చబండకు వెళ్ళడం న్యాయమా? పోనీ కిరణ్ సార్ రచ్చబండకి వెళ్ళినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. జనం రచ్చబండలో సమైక్య నినాదాలు చేస్తూ  రచ్చరచ్చ చేస్తున్నారు.  రాయలసీమలో రచ్చబండకి వెళ్ళి జనం చేత తిట్లు తినేబదులు, తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళి బాధితుల చేత నమస్కారాలు అందుకోవచ్చు కదా..! ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచనలు రావు.. ఎవరైనా చెప్పినా వినరు.. ఆయనతో ఇదే సమస్య!

lagadapati telangana

లగడపాటీ.. నువ్ మంచిగుండాలె!

      లగడపాటి అన్నా.. మంచిగున్నవా? తబీయెత్ ఠీక్ వున్నదా? వ్యాపారాలు.. ఆమ్దానీ మంచిగున్నదా? నువ్వు మంచిగనే ఉంటవ్‌లే అన్నా. నువ్వు ఎప్పటిలెక్క మంచిగనే ఉండాలని ఆ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి దండాలు పెడతాండ అన్నా! గిందేంటా బై తెలంగాన వాల్లు నన్ను ఎప్పుడు చూసిన తిడ్తా వుంటరు గదా.. గిప్పుడేంటీ ఈ పోరడు మంచిగ అన్నా అంటుండని డౌటయితందా? నేను గిట్ల నిన్ను ప్యార్ సే అన్నా అని పిలుస్తున్ననో నీకు సంఝయ్యేట్టు చెప్త! చెప్పాలనుకుంది బరాబర్ చెప్త.   అన్నా.. గింతకుముందు నిన్ను మా విభజనవాదులందరూ మంచిగ తిట్టుకునేటోళ్ళం. రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాన ఇవ్వనికి నువ్వు ఒప్పకోవని, ఢిల్లీల పుల్లలు పెడ్తుంటవని నిన్ను అనెటోళ్ళం! తెలంగానకి నిన్ను శత్రువని చెప్పెటోళ్ళం. అయితే అప్పుడు నిన్ను గట్ల సమఝ్ చేసుకున్నందుకు మేం ఇప్పుడు చానా ఫీలవుతున్నం అన్నా. నువ్వు తెలంగాన బిడ్డలకి శత్రువువి కావన్నా.. నువ్వు మాకు మంచి దోస్తువన్నా. అది ఎట్లంటవా? గిప్పుడు తెలంగాన ఇంత ఈజీగా వచ్చుడుకు నువ్వు కూడా కారణమన్నా. మేం విభజన ఉద్యమం చేస్తున్నప్పుడు అటు పక్క సీమాంధ్ర వాల్లు కూడా సమైక్య ఉద్యమం చేస్తే వాళ్ళకి మంచిగ ఉండేటిది. ఇప్పుడు కొంప మునగకుండా ఉండేటిది. వాల్లు నిన్ను, నీలాంటోళ్ళని నమ్మి, మీరేదో ఊడపొడిచేస్తరని సప్పుడు జేయకుండా కూర్చున్నరు. తెలుగు తల్లి ఒడిలో ఆయుధం, స్టార్ బ్యాట్స్ మన్ అని ఏవేవో కబుర్లు చెప్పి నువ్వు సీమాంధ్ర వాళ్ళని కూల్ చేసినవ్. అందుకే వాల్లు ఇప్పుడు ఏడుస్తున్నరు. సమైక్య ఉద్యమం చల్లబడనికి నువ్వు కూడా మంచిగ కృషి చేసినవ్ లగడపాటి భయ్యా. సీమాంధ్రోల్లు నీ మాటలు నమ్మకుండా సొంతగా ఆలోచించి వుంటే ఇప్పుడు వీధుల్లో పడి ఏడవాల్సి వచ్చేటిది కాదు. వేర్పాటు వాదం ఈ రేంజ్‌కి వచ్చేటిదీ కాదు. అంద్కని ఇంతకాలం సీమాంధ్ర వాల్ల చెవులల్ల పూలు పెట్టినంద్కు మీకు మా విభజనవాదులందరి దిక్కుకెల్లి థాంక్స్ చెప్తన్ననన్నా!  నువ్వు ముందు ముందు కూడ గిట్లనే మా విభజనవాదులకి హెల్ప్ చేయన్నా. నువ్వు గిట్లనే మాకు హెల్ప్ చేస్తే మేం భీ నీకు హెల్ప్ చేస్తమన్నా. రేపు తెలంగాన వచ్చినంక హైదరాబాద్ల వున్న నీ ఆస్తుల జోలికి మేం రామన్నా. మనిద్దరిమధ్య ఈ ఒప్పందం కుదిరినట్టు ఎవలికీ చెప్పకన్నా.. ఇంకోపాలి థాంక్యూ లగడపాటి భయ్యా. ఇట్లు... -విభజనవాది

ktr seemandhra

‘కారు’కూతల కేటీఆర్!

      ‘కారు’ను తమ పార్టీ సింబల్‌గా పెట్టుకున్న టీఆర్ఎస్ నాయకులకి సీమాంధ్రుల మీద కారుకూతలు కూయడమంటే చాలా ఆస్తకి. సీమాంధ్రులకు మండేలాగా కారుకూతలు కూయడంలో కేసీఆర్ తర్వాతి స్థానం కోసం కేసీఆర్ కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావు పోటీ పడుతూ వుంటారు. ఆ పోటీలో కేటీఆర్‌దే పైచేయి అవుతూ వుంటుంది. నిన్నగాక మొన్ననే అదనపు ఆదాయం వెతుక్కుంటూ అమెరికా నుంచి తెలంగాణ ఉద్యమంలోకి దూకిన కేటీఆర్ భారత రాజ్యాంగం మొత్తాన్నీ ఔపోసన పట్టేసినట్టు మాట్లాడుతూ వుంటాడు. పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు ఎంతమాత్రం జంకు, గొంకు కనబర్చని కేటీఆర్ని చూస్తుంటే ముచ్చటేస్తూ వుంటుంది. ఎంతయినా దొరబిడ్డ దొరబిడ్డే అనిపిస్తూ వుంటుంది.     తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా చేయడానికి కొంతమంది ‘రోగ్’లు అసెంబ్లీని ప్రొరోగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. సరే కేటీఆర్ ఇక్కడితే ఆగితే బాగుండేది.. కానీ అలా ఆగితే ఆయన కేటీఆర్ ఎందుకవుతాడు? అసెంబ్లీకి తీర్మానం వచ్చినా రాకపోయినా, అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినా పొందకపోయినా తెలంగాణ బిల్ పాస్ అయ్యేలా చేసే అధికారం రాష్ట్రపతికి వుందట. అంచేత తమకేం భయం లేదట. రాష్ట్రపతి చెప్పాల్సిన పాయింట్ కూడా చెప్పేస్తున్న కేటీఆర్ భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఏంటో! ఇంకా ఏంటంటే, భద్రాచలం విషయంలో సీమాంధ్రులు అనవసరంగా హడావిడి చేస్తున్నారట. ఆరు నూరైనా భద్రాచలం తెలంగాణలోనే వుంటుందట. ఇదిలా వుంటే, ఢిల్లీలో వున్న అమెరికా రాయబార కార్యాలయంలో పొలిటికల్ ఆఫీసర్లు మరియం సిమెంట్‌వాలా, ట్రావిస్ కోబర్లీ అనేవాళ్ళు, ఇంకా హైదరాబాద్‌లో వున్న అమెరికా రాయబార కార్యాలయ అధికారులు జాన్, శ్రీమాలి తెలంగాణ భవన్‌కి వెళ్ళి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ నాయకుడు శ్రవణ్‌ని కలిశారట. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ గురించి వీళ్ళిద్దర్నీ అడిగి తెలుసుకున్నారట. సీమాంధ్రుల రక్షణ గురించి అడిగితే సీమాంధ్రులే అడగాలిగానీ, సీమాంధ్రులను భయపెట్టేవాళ్ళనే అడగటమేంటో! అమెరికా అధికారులు  ఆ అడిగేదేదో ప్రభుత్వ అధికారులను అడగాలిగానీ, కేటీఆర్, శ్రవణ్‌లని అడగటమేంటో!  అంతేలే, సీమాంధ్రవాళ్ళని బెదిరించేవాళ్ళనే అడగటం బెస్టని అమెరికావాళ్ళు అనుకున్నారేమో!

 D Srinivas Telangana Bill

డీఎస్ ఆశ్చర్యం!

      వారానికోసారి వార్తల్లో కనిపించి తెలంగాణకి అనుకూలంగా ఏదో ఒకటి మాట్లాడకపోతే డి.శ్రీనివాస్‌కి నిద్రపట్టేలా లేదు. తెలంగాణకి ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న చాలామంది సీమాంధ్ర వాళ్ళ మనసులు చివుక్కుమనేలా ఏదో ఒకటి మాట్లాడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి మూమెంట్లో తాను కూడా ఏదో ఒకటి మాట్లాడకపోతే ముఖ్యమంత్రి రేసులో వెనకబడిపోతానని అనుకుంటున్నారో ఏమో గానీ, డీఎస్ కూడా తనకు తోచింది మాట్లాడుతూ తానూ రంగంలో ఉన్నానని అనిపించుకుంటున్నారు.   తాజాగా ఆయన మాట్లాడిన పాయింట్లను గమనిస్తే, తాను మిగతా కాంగ్రెస్ నాయకులకంటే చాలా ఫార్వర్డ్ అయిపోయినట్టు, అధిష్ఠానానికి చాలా దగ్గరగా వున్నట్టు బిల్డప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన మాట్లాడిన పాయింట్లేంటంటే, 10 జిల్లాలతో, హైదరాబాద్‌తో కూడిన హైదరాబాద్ వచ్చేస్తోందట. సీమాంధ్రులు ఆశ్చర్యపోయి ఆనందంతో గంతులు వేసే స్థాయిలో ప్యాకేజ్ రాబోతోందట! అంచేత సీమాంధ్రులు సమైక్యం అంటూ హడావిడి చేయకుండా వచ్చే అద్భుతమైన ప్యాకేజీ తీసుకుని పండగ చేసుకోవాలట. బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో గప్‌చుప్‌గా బిల్లుకు ఆమోదం తెలిపి పంపేయాలట. అలా కాకుండా బిల్లును అడ్డుకోవడానికి ఏం చేసినా అది అసెంబ్లీ గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసినట్టేనట! ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఎ పరిధి ఉంటుందని తాను అనుకోవట్లేదట. ఒకవేళ హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్నా సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఎక్కువకాలం ఉంటలేరట.. ఎందుకంటే తమ ప్రాంతం కంటే హైదరాబాద్ దూరంగా వుంది కాబట్టి ఇంతదూరం రాలేక అక్కడే రాజధాని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారట. అలాగే రాయల తెలంగాణ డిమాండ్ చేసినవాళ్ళు  రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టేనట.. ఇవీ డీఎస్ గారు చెప్పిన విషయాలు! డీఎస్ ఇలా మాట్లాడ్డం సీమాంధ్రులకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సీమాంధ్రులని వెర్రోళ్ళని చేస్తూనే మాట్లాడతారు. రాష్ట్ర విభజన గురించి తనకు మాత్రమే అనేక విషయాలు తెలుసన్నట్టు మాట్లాడుతున్న డీఎస్, తెలంగాణ వస్తే తాను ముఖ్యమంత్రి అవుతారో లేదో మాత్రం చెప్పలేకపోవడం ఆశ్చర్యకరమేగా!    

Kishan Reddy Telangana

కిషన్‌రెడ్డి కితకితలు!

      బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే కితకితలు పెట్టినట్టు నవ్వొస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో పక్షపాత ధోరణితో తెలంగాణకే పూర్తి మద్దతు ప్రకటించి సీమాంధ్రలో పార్టీని గల్లంతు చేసినందుకు బీజేపీ అగ్రనాయకత్వం కిషన్‌రెడ్డికి అక్షింతలు వేసింది. అప్పటి నుంచి ఆచితూచి మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి అప్పుడప్పుడు అదుపుతప్పి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు.     బీజేపీ సీమాంధ్ర నాయకులెవరైనా ‘సమైక్యం’ అనే మాట మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కిషన్‌రెడ్డి సారు తాజాగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని విభజించాలని ఉద్యమాలైతే చేయొచ్చుగానీ, ఆల్రెడీ వున్న ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేయొద్దనడం మాత్రం నేరమట!  ఇప్పటికే కిషన్‌రెడ్డి వ్యవహారశైలి మీద గుర్రుగా వున్న సీమాంధ్ర నాయకులకు ఈ వ్యాఖ్యలు పుండుమీద కారంలా మారాయి. బీజేపీ కేంద్ర నాయకత్వమే తెలంగాణ మీద పునరాలోచించుకుంటున్న సమయంలో కిషన్‌రెడ్డి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం న్యాయం కాదని వారంటున్నారు.   సమైక్యం అంటే సీమాంధ్ర నాయకులను సస్పెండ్ చేస్తానని ప్రకటించిన కిషన్‌రెడ్డి ఇంకా ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం వందలాదిమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ ‌గాంధీ కోసం తెలంగాణ విభజనను చేపట్టిందని చెప్పారు. అంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుందని తెలిసీ బీజేపీ అందుకు మద్దతు ఇస్తోందని అర్థమా? కిషన్‌రెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు. బీజేపీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదించలేదని అన్నారు.   కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత ఆయన తెలంగాణకు అనుకూలంగా వున్నారా.. వ్యతిరేకంగా వున్నారా అనే విషయం సామాన్యులకు  అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. కిషన్‌రెడ్డి ఈతరహా కితకితలు ఆపి క్లారిటీతో మాట్లాడితే బెటరంటున్నారు. తన సొంత ఎజెండాలో క్లారిటీ లేకపోతే బుద్ధిగా కేంద్ర నాయకత్వం చెప్పినట్టు వింటే మంచిదని సూచిస్తున్నారు.

 Dokka Manikya Vara Prasad

డొక్కశుద్ధి లేనట్టుంది!

      ఎవరి నోట్లోంచి అయినా నలుగురికీ ఉపయోగపడే మాటలు రావాలంటే వాళ్ళకి కాస్తంత అయినా డొక్కశుద్ధి వుండాలి. రాష్ట్ర మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి పేరులో ‘డొక్క’ వుందిగానీ, మనిషిలో డొక్కశుద్ధి వున్నట్టు లేదు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి అయి వుండి కూడా ఆయన ఎప్పుడూ రాష్ట్రం సమైక్యంగా వుండాలని గట్టిగా వాదించిన పాపాన పోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన చేసిన కృషి కూడా లేమీ లేదు. అయ్యగారి నోటి వెంట ఎప్పుడు ఏ మాట వచ్చినా రాష్ట్ర విభజనకు అనుకూలంగానే వుంటుంది.   తనకు తన పదవి తప్ప ఏదీ పట్టదన్నట్టుగా ఆయన వ్యవహారశైలి వుంటుంది. ఇటు విభజన ఉద్యమంతోగానీ, అటు సమైక్య ఉద్యమంతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఆయన మాట్లాడుతూ వుంటారు. ఎవరైనా సమైక్య ఉద్యమకారులు ఎక్కడైనా నిలదీస్తే మాత్రం ‘రాష్ట్రం సమైక్యంగా వుండాలనే నేను కోరుకుంటున్నా. కాకపోతే రాష్ట్రం సమైక్యంగా ఉండే పరిస్థితి లేదు’ అని చెప్పి తప్పించుకుంటూ వుంటారు. సీఎం ఎడ్డెం అంటే తాను తెడ్డెం అనడం డొక్కా మాణిక్య వరప్రసాద్‌కి ఈమధ్య బాగా అలవాటైపోయినట్టుంది. అందుకే సీఎం సమైక్యం అంటున్నాడు కాబట్టి ఆ సమైక్యాన్ని నేనెందుకు పట్టించుకోవాలని ఊరుకుంటున్నట్టున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలన్న డిస్కషన్ అంతటా జరుగుతోంది. మన డొక్కా గారికి కూడా సీమాంధ్ర రాజధాని గురించి మంచి మంచి ఐడియాస్ వచ్చినట్టున్నాయి. వాటిని వెంటనే బయటపెట్టేశారు. కొండవీడు ప్రాంతానికి సంబంధించిన ఒక సీడీ విడుదల కార్యక్రమానికి వెళ్ళిన మంత్రిగారికి సీమాంధ్ర రాజధాని గురించి అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే కొండవీడు, అమరావతి ప్రాంతాలను సీమాంధ్ర రాజధానిగా చేస్తే అద్భుతంగా వుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేశారు. అసలే రాష్ట్రం విడిపోతోందన్న బాధలో వున్న సమైక్యవాదులను డొక్కా గారి విచిత్ర ప్రతిపాదనలు మరింత బాధపెడతాయే తప్ప వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పటికైనా డొక్కా గారు కాస్తంత డొక్కశుద్ధి చూపించి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది.

జగన్ మమతానురాగం!

      మొన్నీమధ్యనే జైల్లోంచి బయటకి వచ్చిన జగన్ ‘ముఖ్యమంత్రి కుర్చీ’ అనే తన కోర్కెను తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రత్యేక అనుమతులు తీసుకుని దేశమంతా తిరుగుతున్నాడు. మొన్నీమధ్యనే ఢిల్లీ వెళ్ళి జాతీయ నాయకుల మద్దతు సంపాదించుకోవాలని ప్రయత్నించిన జగన్‌కి అక్కడేమీ వర్కవుట్ కాలేదు. ఏదో సాధించాలని ఢిల్లీ యాత్ర చేసిన జగన్‌ని బీజేపీతో సహా అన్ని పార్టీల వరకూ ఖాళీ చేతులతో వెనక్కి పంపారు.     కు౦భకోణాల్లో ఇరుక్కుపోయిన వున్న జగన్‌తో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. జాతీయ పార్టీల దగ్గర పప్పులు ఉడకని జగన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద కన్నేశాడు. మొదటగా కోల్‌కతా వెళ్ళిన జగన్ కోల్‌కతా కాళి మమతా బెనర్జీని కలిశాడు. మమతను అందరూ ‘దీదీ’ (అక్క) అంటారు. జగన్ కూడా సోనియాని ‘అమ్మా’ అని ఎంత ప్రేమగా పిలుస్తాడో మమతని ‘అక్కా’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఆమె మద్దతు పొందే ప్రయత్నం చేశాడు. ఆమె దగ్గర ఏ మమతానురాగాలు ఒలకబోశాడో గానీ, మమత జగన్ తమ్ముడికి బాగానే రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే 2014  ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యే రేసులో వున్న మమతా బెనర్జీ ఇప్పుడు అందర్నీ కలుపుకుపోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు జగన్‌తో భవిష్యత్తులో రాజకీయంగా ఏ అవసరం పడుతుందోనని ఆమె జగన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి గంటలు గంటలు డిస్కషన్ చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చెల్లిని దూరం చేసుకున్న జగన్ ఇప్పుడు ఒక అక్కని సంపాదించుకున్నాడన్నమాట.  తాను జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపించిన షర్మిల చెల్లమ్మకే జెల్ల కొట్టిన జగనన్న భవిష్యత్తులో మమత అక్కకి ఎన్కి జలక్కులు ఇస్తాడో వేచి చూడాలి. పాపం బెంగాలీ అక్కకి జగన్ మమతానురాగాల గురించి పూర్తిగా తెలుసో తెలియదో!  

దేవతలారా దీవించండి!

      టీ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీని ఏనాడో దేవతని చేసేశారు. తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత ఆ భావన మరింత పెరిగిపోయింది. ఆ దేవతకి అర్జెంటుగా గుడులో గోపురాలో కట్టించేసి కృతజ్ఞతలు తీర్చుకోవాలన్న ఆకాంక్ష ప్రతి టీ కాంగ్రెస్ నాయకుడిలో భారీ స్థాయిలో ఏర్పడింది. తెలంగాణ ఇచ్చేసి దీవించిన సోనియా దేవత మీద టీ కాంగీయులకు ఆమాత్రం భక్తి వుండటం న్యాయమే! మరి రాష్ట్ర విభజన పావులు చకచకా కదులుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రులు ఏ దేవతని నమ్ముకోవాలి.. ఏ దేవత తమను దీవించి కాపాడుతుందని ఎదురుచూడాలి? ఈ ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇస్తున్నారు.     సోనియా దేవత తెలంగాణకు ఇచ్చిన వరాన్ని తిప్పికొట్టే శక్తి వున్న దేవతల గురించి కిరణ్ ఎంతో భక్తిగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో వున్న బిడికి అనే గ్రామంలో వున్న ఐదుగురు దేవతలు తెలంగాణ రాకుండా చేసే శక్తి కలిగి వున్నవారని ఆయన చెబుతున్నారు. ఆ గ్రామంలో ఐదుగురు గ్రామ దేవతల దేవాలయం వుందట. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఎవరు ఏమి కోరుకున్నా జరిగిపోతుందట. అందుకోసమే కిరణ్ కుమార్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్ళారు. రాష్ట్రం విడిపోకుండా సమైక్యంగా ఉంచాలని సదరు ఐదుగురు దేవతను మనసారా కోరుకున్నారు. ఆ దేవతలు తన ప్రార్థన విన్నారని, వాళ్ళు తప్పకుండా రాష్ట్రం విడిపోకుండా చూస్తారని కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర విభజన కోసం కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్నా, సీమాంధ్రులకు చల్లటి మాటలు చెబుతూ కిరణ్ శాంతపరుస్తున్నారని, రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోవడానికి సోనియా చెబుతున్నట్టు ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ ఎక్కడో చిత్తూరు జిల్లాలో వున్న ఐదుగురు గ్రామ దేవతలు రాష్ట్ర విభజనను ఆపుతారని కిరణ్ ప్రకటించడం చాలా కామెడీగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వున్న ఐదుగురు దేవతలకంటే సోనియా దేవతే చాలా పవర్ ఫుల్‌గా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ ఇలాంటి ‘ఆధ్యాత్మిక’ కబుర్లు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటున్నారు. కిరణ్ తన మాటల ద్వారా రాష్ట్ర విభజన జరిగిపోవడం ఖాయం.. ఇక మీకు ఆ దేవతలే దిక్కు అని సీమాంధ్రులకు అన్యాపదేశంగా చెబుతున్నారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ ప్రోరోగం?

  వెయ్యెకరాల పచ్చని మాగాణి పోతే పోయింది గానీ ‘లా’ క్షుణ్ణంగా తెలిసి వచ్చిందన్నట్లు జగన్ మూలంగా ఇప్పుడు సామాన్య ప్రజలకి కూడా సీబీఐ, కోర్టులు, కేసులు, బెయిలు, పిటిషన్లు, అనుమతులు వగైరా అంశాల గురించి చక్కటి అవగాహన ఏర్పడింది.   అదేవిధంగా రాష్ట్రవిభజన వ్యవహారంలో ఉత్తుతి కమిటీలు, కోర్ కమిటీలు, ఉత్తుత్తి రాజీనామాలు, జీఓయం, చట్టంలో ఉన్న వివిధ ఆర్టికల్స్, విభజన సాంప్రదాయాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా అర్ధం అయింది. నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెండు అంశాలలో పీ.హెచ్.డీ. పొందడానికి అన్నివిధాల అర్హులని ఒప్పుకోక తప్పదు. అయితే ఈ ప్రక్రియలో శాసనసభ, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందవలసి ఉంది గనుక, ఈ లోగా ప్రజలకి మరికొంత జ్ఞాన సముపార్జన చేసుకొనే సౌలభ్యం ఉంది.   గత రెండు రోజుల నుండి ‘ప్రోరోగ్’ అనే మాట అందరి నోట వినిపిస్తోంది. అంటే అదేదో వైద్య పరిభాషకు చెందిన ఏ అంటూ రోగమో అని కొందరు కాదు రోగ్ అంటే ప్రజాప్రతినిధులు ఒకరినొకరు తిట్టుకొనే 'తిట్టు' అని మరి కొందరు వాడులాడుకొంటున్నారు. అయితే దానర్ధం ఏమిటంటే మళ్ళీ ప్రభుత్వం కోరేవరకు శాసనసభని నిరవదికంగా వాయిదా వేయడమన్నమాట. ఇది శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత జరిగే సాధారణ తంతుగా చెప్పుకోవచ్చును.   ఈ ఏడాది జూన్ 23వరకు శాసనసభ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వం నుండి సభను ప్రోరోగ్ చేయమంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి ఎటువంటి అభ్యర్ధన రాలేదు. కానీ, ఇక నేడో రేపో శాసనసభను సమావేశపరిచి తెలంగాణా బిల్లుపై చర్చ చెప్పట్టవలసిన తరుణంలో సభని ప్రోరోగ్ చేయమని కోరుతూ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుండి లేఖ వచ్చిందని మీడియాలో పైలిన్ తుఫాను కంటే భీభత్సంగా చర్చలు జరుగుతున్నాయి.   మీడియాలో ఇంత హంగామా జరుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఇద్దరు వేరే ఏదో గ్రహాంతర ప్రయాణంలో ఉండి ఇది గమనించలేకపోయినట్లు ఇద్దరూ ఇంతవరకు నోరు మెదపట్లేదు. ఇదే అదునుగా రాజకీయ నేతలు, పార్టీలు, వాటి మీడియాలు ఈ ప్రోరోగం గురించి తీవ్రంగా చర్చిస్తూ, ప్రజలకి కూడా దాని పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి.   అధికారికంగా ఈ ప్రోరోగం గురించి ఎటువంటి వివరణ లేనందున మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కాసింత చొరవ తీసుకొని “అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోతే దానిని మళ్ళీ ఎప్పుడు సమావేశపరచాలన్నది స్పీకర్ పరిధిలో ఉంటుందని, ప్రొరోగ్ అయితేనే అప్పుడు ప్రభుత్వం పరిధిలోకి వెళ్తుందని” ఆయన తెలిపారు.   అంటే ఇప్పుడు సభను ప్రోరోగ్ చేయమని ముఖ్యమంత్రి నుండి విజ్ఞప్తి లేదా ఆదేశాన్ని స్పీకర్ అమలు చేయనవసరంలేదని అర్ధం అవుతోంది. స్పీకర్ కి కూడా చాలా ముందుగానే డిల్లీకి పిలిచి చెప్పవలసినదంతా చెప్పడం అయిపోయింది గనుక ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా స్పీకర్ శాసనసభ సమావేశాలు నిర్వహించడం ఖాయం.   సభను ప్రోరోగ్ చేసినంత మాత్రాన్న తెలంగాణా బిల్లూ ఆగదు, ఏర్పాటూ ఆగదని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా బాగానే తెలుసు గనుక, ఆయన ‘నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదనే’ భ్రమలో ఉండే ఆవకాశం లేదు. ఇటువంటి ప్రోరోగోపాయలు కేవలం అధిష్టానాన్ని కొంచెం అల్లరి పెట్టేందుకు, టెన్షన్ పెట్టేందుకే తప్ప బిల్లుని ఆపలేవు.   ముఖ్యమంత్రి శాసనసభలో జరిగే చివరి రాద్ధాంతంలో పాల్గొని మీడియా లైవ్ కవరేజ్ ఇస్తుంటే ధాటిగా ప్రసంగించి రాజీనామా చేసి సమైక్య ఛాంపియన్ ట్రోఫీ పట్టుకొని బయటపడవచ్చును. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం వల్ల ప్రజలకి ‘ప్రోరోగం’ అంటే అంటు వ్యాధి, తిట్టు కానేకాదనే మరో కొత్త విషయం తెలుసుకొనే అవకాశం కలిగితే, మీడియాకు మూడు నాలుగు రోజులకు సరిపడే మేత దొరికిందని చెప్పవచ్చును.

బలపడుతోన్న బంధం!

      కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి ప్రభంజనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న పార్టీ భారతీయ జనతాపార్టీ. ఒకే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రెండు శక్తులు ఒకటయితే ఎలా వుంటుంది? ఒక ఉన్నత లక్ష్యం మరింత సులభంగా చేరుకోవడానికి వీలవుతుంది. అందుకే భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య స్నేహబంధం బలపడుతోంది.     రాబోయే ఎన్నికలలో కలసి కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే విధంగా రంగం సిద్ధమవుతోంది. దీనికోసం విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు.. బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు. గత కొంతకాలంగా కేంద్ర రాజకీయాల మీదే దృష్టిని కేంద్రీకరించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు. ఇంతకాలం రాష్ట్ర బీజేపీలో కిషన్‌రెడ్డి చెప్పిందే వేదంలా నడిచింది. ఆయన జై తెలంగాణ అంటే కేంద్ర నాయకత్వం కూడా జై తెలంగాణ అంది. అయితే తెలంగాణ విషయంలో కిషన్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం రాష్ట్రంలో పార్టీకి ఎంత నష్టం చేసిందో బీజేపీ నాయకత్వం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో బీజేపీ తెలంగాణకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడం వెంకయ్య నాయుడికి ఇష్టం లేకపోయినా, పార్టీ విధానాన్ని గౌరవించి ఆయన ఇంతకాలం మౌనంగా వున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకి వచ్చాక తెలంగాణ విషయంలో బీజేపీ స్వరం మెల్లమెల్లగా మారుతోంది. రాష్ట్రంలో ఇతర పార్టీలో ఇంతవరకూ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మొదటి అడుగే తెలుగుదేశం పార్టీతో స్నేహం పెంచుకోవడం. బీజేపీ-టీడీపీ దోస్తీని కిషన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆయన మాట చెల్లకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కిషన్ రెడ్డి ఎంత వ్యతిరేకించినా బీజేపీ-టీడీపి బంధాన్ని బలపరచడానికి వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కేంద్ర నాయకత్వం నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.  జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే త్వరలోనే టీడీపీ-బీజేపీ జట్టు కట్టడం ఖాయమనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.