బీజేపీ తంటాలు చూతము రారండీ!

      నిన్న మొన్నటి వరకూ స్టేట్‌లో భారతీయ జనతాపార్టీ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుంది. విభజనవాదం ముదరడానికి తనవంతు సహకారాన్ని అందించింది. కేంద్రం తెలంగాణ ఇవ్వబోతున్నట్టు ప్రకటించే వరకూ బీజేపీ ఒకేమాట మీద నిలబడింది. ఆ తర్వాతే బీజేపీలో రెండో కోణం బయటపడింది. అప్పటి వరకూ నోరు మెదపకుండా వున్న సీమాంధ్ర బీజేపీ నేతల్లో కదలిక బయల్దేరింది. వాళ్ళు సమైక్యవాదాన్ని వినిపించకపోయినా, తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రులకు న్యాయం జరగాలని నినదించడం మొదలుపెట్టారు.     బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణకి అనుకూలంగా వుంది కాబట్టి ‘సమైక్యం’ అనడం లేదుగానీ, సీమాంధ్ర బీజేపీ నాయకులలో రాష్ట్రం విడిపోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇదిలా వుంటే, తెలంగాణ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనలోనే మార్పులు వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగినప్పటి నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం మోడీకి ఇష్టం లేదన్న ‘మెసేజ్’ రాష్ట్రంలో బాగా వ్యాపించింది. తెలంగాణ రావడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదన్న వాస్తవం బీజేపీ అగ్రనాయకత్వానికి అర్థం కావడం వల్ల మెల్లగా తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ ఏదో ఒక మెలికపెట్టి బిల్లు పాస్ కాకుండా చేసే అవకాశం కూడా వుందన్న అభిప్రాయలు వెలువడ్డాయి. దాంతో తెలంగాణ బీజేపీ నాయకులలో ఆందోళన మొదలైంది. తెలంగాణ విషయంలో బీజేపీ మెత్తబడటం లేదన్న సందేశాన్ని ఇవ్వడం కోసం తంటాలు పడుతున్నారు. ఆదివారం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి మొత్తం పరిస్థితి వివరించి మీరే ఏదైనా చేయాలని మొరపెట్టుకున్నారు. దాంతో రాజ్‌నాథ్ ‌సింగ్ అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దని, తెలంగాణ బిల్లుకి బీజేపీ నూటికి నూరుశాతం మద్దతు ఇస్తుందని అభయం ఇచ్చారు. ఇది చాలదన్నట్టు తెలంగాణలో బీజేపీ మీద నమ్మకం పెరగాలంటే సుష్మా స్వరాజ్‌ని నిజామాబాద్ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేయిస్తే తెలంగాణలో బీజేపీ పరిస్థితి బాగుంటుందని తెలంగాణ బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్‌ని కోరారు. దీన్ని కూడా పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ బిల్లుకి మద్దతు ఇస్తే తెలంగాణలో బీజేపీకి 10 పార్లమెంటు సీట్లు వచ్చేలా చేసే బాధ్యత తమదని తెలంగాణ బీజేపీ నాయకులు రాజ్‌నాథ్‌సింగ్‌కి వాగ్దానం చేశారట. తెలంగాణలో పట్టు నిలుపుకోవడం కోసం బీజేపీ నాయకులు ఇంకెన్ని తంటాలు పడాలో ఏంటో!

బస్సు ప్రమాద దోషి ప్రభుత్వమే!

      నలభై ఐదు నిండు ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలసిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా ఆ దుర్ఘటన మిగిల్చిన విషాదం మాత్రం ఇంకా రాష్ట్రాన్ని విడిచిపెట్టలేదు. ఆ ప్రమాదం గురించి వింటేనే మనసు బాధతో బరువెక్కుతోంది. ఇక ఆ ప్రమాదం కారణంగా తమవారిని కోల్పోయిన వారి పరిస్థితిని ఊహిస్తే మరింత బాధ కలుగుతోంది. బస్సు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి సంబంధించిన వివరాలను మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉంటే, ప్రమాదానికి కారకులైనవారి మీద ఆగ్రహం పెరిగిపోతోంది.   ఎన్నో బాధ్యతలు, జీవితం మీద ఎన్నో ఆశలు, ఎన్నో లక్ష్యాలు, వాటికోసం నిర్విరామ కృషి చేస్తున్న బంగారం లాంటి మనుషులు ఈ ప్రమాదంలో మాడిపోయారు. ఎవరి నిర్లక్ష్యానికో వాళ్ళు మూల్యం చెల్లించారు.  ఈ ప్రమాదానికి బాధ్యులుగా, దోషులుగా బస్సు యజమాని, డైవర్లని నిలబెడుతున్నప్పటికీ ఈ ప్రమాదంలో అసలైన దోషి ప్రభుత్వమే! రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసే నిబంధనలు చాలా వున్నాయి. కానీ, వాటిని సక్రమంగా అమలు చేసే అధికారులే లేరు. అధికారులను నియంత్రించగలిగే ప్రభుత్వమే లేదు. లంచం ఇస్తేచాలు ఏ పనైనా జరిగిపోయే ఈ దేశంలో ప్రభుత్వ వ్యవస్థల నుంచి మంచి పనితీరును ఆశించడం దురాశే అవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారుల తీరు చూస్తుంటే వారిమీద వున్న అసహ్యం మరింత పెరుగుతోంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ బస్సులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేశారు. తామేదో ఘనకార్యం చేసేస్తున్నట్టు బస్సుల్లో వున్న లోపాలను పసిగట్టారు. కొన్ని బస్సులని సీజ్ చేశారు. కొన్ని బస్సులకు జరిమానాలు విధించారు. ఇప్పుడు ఘోర ప్రమాదం జరిగింది కాబట్టి ఈ హడావిడి. ఆ తర్వాత అంతా మామూలే. 45 మంది ప్రాణాలను పణంగా పెట్టిన తర్వాత అధికారులు చేస్తున్న  ఈ హడావిడిని ఎవరూ హర్షించరు. ఈ సిన్సియారిటీని ప్రతిరోజూ ప్రదర్శిస్తే మొన్న 45 నిండు ప్రాణాలు బలయ్యేవి కావు. ఈ రెండుమూడు రోజుల్లో అధికారులు ప్రైవేట్ బస్సులకు సంబంధించిన చాలా కొత్త విషయాలు కనుక్కున్నట్టు అమాయకంగా చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ అతిక్రమిస్తున్న నిబంధనల్లో కొన్ని ఇవి.. 1. ఒకే నంబరుతో  వివిధ రూట్లలో రెండు మూడు బస్సులు తిరుగుతాయి.  అంటే ఒక బస్సుకే పన్ను కట్టి చాలా బస్సులు నడుపుతారు. 2. పర్మిట్, ఫిట్‌నెస్ లేకపోయినా బస్సులు నడుస్తాయి. 3. అనుమతి తీసుకున్న సీట్లు, బెర్తుల సంఖ్య కంటే ఎక్కువ ఏర్పాటు చేస్తారు. దానివల్ల బస్సులో లోడ్ పెరుగుతుంది. 4. బస్సులలో ఇద్దరు డ్రైవర్లు వుండాలి. కానీ ఒక్కరే ఉంటున్నారు. అలసిపోయిన డ్రైవర్లు ప్రమాదానికి కారణమవుతున్నారు. 5. బస్సుల్లో వాణిజ్య వస్తువుల రవాణా జరుగుతుంది. ఈ వస్తువులలో ప్రమాదకరమైన వస్తువులు కూడా వుంటాయి. 6. బస్సుల్లో ఎక్కే, దిగే ప్రయాణికుల  వివరాలు నమోదు చేయడం లేదు. 7. పండుగల సమయంలో అయితే ప్రైవేట్ బస్సులలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తారు. 8. అనేక బస్సుల వేగానికి పరిమితి వుండటం లేదు. వీటన్నిటినీ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తారు. అలాంటి అధికారులను ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టు వదిలేస్తుంది.

చిరంజీవ.. సుఖీభవ!

      నేడు తెలుగుజాతి దేశం ముందు తలెత్తుకుని నిలబడిన రోజు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో ఆంధ్రులు విశాలాంధ్రులై దేశంలోని ఇతర రాష్ట్రాల స్థాయిలో అభివృద్ధి వైపు దూసుకుపోయే అవకాశం కలిగినరోజు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి సరైన రీతిలో నివాళి అర్పించిన రోజు. ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజును ‘ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం’గా జరుపుకోవడం తెలుగువారికి గర్వకారణం.   తెలుగు వెలుగులను దేశమంతటా ప్రసరింపజేసిన ఈరోజు తెలుగువారికి పర్వదినం. తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది అని నినదిస్తూ అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవిస్తున్న తెలుగుజాతిని ఈమధ్యకాలంలో కొన్ని అరిష్టాలు చుట్టుముట్టాయి. పచ్చగ పెరిగే తెలుగు జాతిని ముక్కలు చేయడానికి వేర్పాటు శక్తులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. వేర్పాటు వాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని ప్రయత్నాలు చేయడం మాత్రమే కాకుండా, తెలుగుజాతి ఎంతో గౌరవించే స్ఫూర్తి ‘తెలుగుతల్లి’ని, తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును కూడా విమర్శించే స్థాయికి దిగజారారు. తెలుగు జాతి మొత్తం ఎంతో గర్వకారణంగా భావిస్తూ జరుపుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాన్ని కూడా అవమానిస్తున్నారు. పదవుల కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం ‘తెలంగాణవాదులు’ అనే ముసుగు వేసుకున్న కొందరు స్వార్థపరులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా, బ్లాక్ డేగా ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలను జరుపుకోవాలంటే ప్రజలు భయపడేలా చేసే రాజకీయ రౌడీలూ బయల్దేరారు. గత కొంతకాలంగా ఎవరెన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ అవతరోణత్సవాలు రాష్ట్రమంతటా జరుగుతూనే వున్నాయి. భవిష్యత్తులో జరుగుతూనే వుంటాయి. ఎంతో బలమైన తెలుగుజాతిని వేరుచేయడం తెలుగుజాతిలోనే వున్న ద్రోహుల వల్ల కాదు.. ఇతర రాష్ట్రాలవారి వల్ల కాదు.. విదేశీయుల వల్ల కూడా అయ్యేపని కాదు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన అందాల ఆంధ్రప్రదేశ్‌ని చిరంజీవి... సుఖీభవ అని దీవిద్దాం.  

టీడీపీ, బీజేపీలే టార్గెట్!

      రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి, కేంద్రంలో ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే రాష్ట్ర విభజన అంశంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల చెవుల్లో ఎలాగైతే పూలు పెట్టి ‘‘అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుంటాం’’ లాంటి స్టేట్‌మెంట్లు ఇప్పించి వాళ్ళంతా ఎలా ఇరుక్కుపోయేలా చేసిందో, అదే వ్యూహాన్ని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల విషయంలో కూడా ప్రయోగించబోతోంది.  పదకొండు అంశాలను రూపొందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాటి మీద అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటుందట. అసలు ఈ సమావేశానికి ఏ పార్టీ అయినా హాజరై ఒక్క అంశానికి సమాధానం ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అంగీకరించినట్టే అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఈ అఖిలపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా చేసుకుందని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రాజకీయంగా లాభం పొందే అవకాశం ఉన్నందువల్ల భారతీయ జనతాపార్టీ తెలంగాణ డిమాండ్ నుంచి పక్కకి తప్పుకుని సీమాంధ్రకు చేరువయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాంటిదేదైనా జరిగితే బీజేపీకి సీమాంధ్రలో స్థానం లేకుండా చేయడమే ఈ రెండో అఖిలపక్షం ఉద్దేశమని భావిస్తున్నారు. రాజకీయంగా సన్నిహితమవుతున్న తెలుగుదేశం, బీజేపీల మధ్య విభేదాలను పెంచేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని ఉపయోగించుకునే అవకాశం వుందంటున్నారు. మొత్తంమీద విభజన యజ్ఞం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ యజ్ఞంలో టీడీపీ, బీజేపీలను సమిధలుగా చేయాలని ప్రయత్నిస్తోంది. మరి ఆ రెండు పార్టీలు ఈ ప్రయత్నాలను ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.  

Supreme Court sensational verdict

  Supreme Court, which earlier has obliged the Central government to follow its orders of disqualifying the people’s representatives those who were convicted by the courts from contesting in the elections, later makes the Election Commission introduce a ‘Reject Button’ in Electronic voting Machines, thus to give a choice to people to reject the contestants, if they believe none of them deserved to be elected.   Today once again, a Supreme Court bench headed by Justice K S Radha Krishnan asks the IAS officers not to follow the verbal orders given by the political executives, instead demand for orders in written form, so as to insulate themselves from transfers, punishments for not their faults.   The bench also asks the Centre and all State governments along with Union Territories to issue directions within three months for providing fixed tenure to civil servants. It asks the governments to constitute Civil Services Board at the Centre and State-levels.   The apex court opines that giving a fixed minimum tenure to a civil servant will promote professionalism, efficiency and also led to good governance. The bench also asked the Central government to pass a bill that regulates matters related to IAS official’s postings, transfers and disciplinary action against them.   IAS officer Ashok Khemka of Haryana cadre got transferred for more than 42 times in a short span of 2 years by the Haryana government and he hits the bull’s eye by ordering investigation into DLF-Robert Vadra land deal only to be shunted to some unimportant position.   The story is of Durga Sakhti Nagpal of UP cadre is also no different from him. Akhilesh Yadav government suspends her framing false charges against her, who boldly took-upon the sand mafia, which has links with some ministers in Akhilesh government.   After seeing repetition of such bad experiences to honest IAS officers like them, Public Interest litigation was filed by 83 retired bureaucrats including former Cabinet Secretary T S R Subramanian seeking its directions for insulating bureaucracy from political interference and the Supreme Court responds very positively on it.

సెంటిమెంట్ మీద కొట్టిన కిరణ్!

      తాను సమైక్య వాదినని, తన అభిమానులు అంటున్నట్టు సమైక్య సింహాన్నని నిరూపించుకోవడానికి, సీమాంధ్ర ప్రజల హృదయాలలో తాను కోరుకున్న స్థానాన్ని పొందడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. ఈ అంశం మీద తనకు లభించిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా వినియోగించుకుంటున్నారు. ఆమధ్య రాష్ట్రపతికి, ప్రధానికి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేఖలు రాసి అందరి దృష్టినీ ఆకర్షించారు.   ఇప్పుడు ఆయనకి ఇందిరాగాంధీ వర్ధంతి రూపంలో మరో అవకాశం లభించింది. విశాఖపట్నంలో జరిగిన ఇందిరాగాంధీ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రం ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఆ ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలసి వుండాలని చెప్పి, ఆ మాటమీద నిలబడి వున్న గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. తాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ఇప్పటి వరకూ చెప్పిన మాటలన్నీ తన సొంత మాటలు కాదని.. ఇందిరాగాంధీ చెప్పినమాటలనే చెప్పానని అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున మరోసారి సమైక్యవాణిని వినిపించడం పరోక్షంగా మరోసారి సోనియాగాంధీకి సమైక్య సందేశం పంపడమేనని సీఎం సన్నిహితులు అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అయినా పునస్సమీక్షించుకోవాలని ఆయన పరోక్షంగా సోనియాగాంధీకి సూచిస్తున్నారని అంటున్నారు. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించడం ద్వారా సోనియాగాంధీతోపాటు రాష్ట్ర విభజనకు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుల ధోరణిలో మార్పు వస్తుందని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. సీఎం చేస్తున్నది నిజంగానో సమైక్యవాదమా, సీమాంధ్రులని మభ్యపెడుతూ సజావుగా విభజన జరిగేలా చేసే ప్రయత్నమా అన్న విషయాన్ని కాలమే తెలియజేస్తుంది. మొత్తం మీద ఇందిరాగాంధీ వర్ధంతి రోజున రాష్ట్ర సమైక్యతకోసం ఇందిరాగాంధీ చేసిన కృషిని ప్రస్తావించడం ద్వారా సీఎం అటు అధిష్ఠానం, ఇటు సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్ మీద గురిచూసి కొట్టారు.

అఖిలపక్ష సమావేశం ఇప్పుడెందుకు

  హోం మంత్రి షిండే వచ్చేనెల 9న రాష్ట్ర విభజన విషయంలో అనుసరించవలసిన మార్గ దర్శకాల గురించి చర్చించేందుకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ రోజు ప్రకంటించారు. అయితే విభజన ప్రక్రియ దాదాపు పూర్తి చేసి చేతులు దులుపుకొంటున్న ఈ సమయంలో మళ్ళీ ఇప్పుడు అఖిల పక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరితో చర్చించి, ఆమోదం తీసుకొన్న తరువాతనే విభజన చేస్తున్నందున మరిక ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదని తెగేసి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం హటాత్తుగా చివరి నిమిషంలో అఖిల పక్షం ఎందుకు అంటోంది? అంటే మొట్ట మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖలే.   రాష్ట్ర విభజన విషయంలో పూర్తిగా రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిందిగా కోరుతూ ఆయన వ్రాసిన లేఖను రాష్ట్రపతి వెంటనే హోం శాఖకు పంపి వివరణ కోరడం జరిగింది. అధిజరిగిన మూడు రోజులకే ఈ రోజు సోనియాగాంధీ తన అపాయింట్ మెంటులన్నిటినీ రద్దు చేసుకొని మరీ అత్యవసరంగా కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. వెంటనే హోం మంత్రి షిండే రాష్ట్రపతిని కలిసి మాట్లాడారు.   ఈ నాలుగు వేర్వేరు సంఘటనలనుకలిపి చూస్తే, ముఖ్యమంత్రి లేఖతో స్పందించిన రాష్ట్రపతి హోంమంత్రికి మొట్టికాయలు వేసి ఉండవచ్చును. అదేవిధంగా రాజ్యంగబద్దంగా విభజన జరపడంలో ప్రధానికి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించి ఉంటే, ఇంతకాలం అడ్డుగోలుగా కధ నడిపించిన తరువాత ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుంది గనుక మధ్యే మార్గంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొన్నామని ‘మమ’ అనిపించేసి మిగిలిన తంతు పూర్తి చేయాలనే ఆలోచన కావచ్చును.   దీనివల్ల సీమాంధ్ర ప్రజలలో, నేతలలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖత పెరుగుతుందే తప్ప తగ్గదు. పైగా దీనివల్ల తెలంగాణా ప్రజలకి కాంగ్రెస్ నిబద్దత పట్ల కొత్త అనుమానాలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే సీమాంధ్రతో పాటు తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.అప్పుడు కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లవుతుంది కాంగ్రెస్ పని.

రిటైర్మెంట్ బాటలో సోనియా?

      2014 ఎన్నికల తర్వాత సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు ఈ అంచనాకి బలాన్నిస్తున్నాయని అంటున్నారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత చాలకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తెరవెనుకే వుండిపోయిన సోనియా, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి భారతదేశ రాజకీయ రంగం మీద తనదైన ప్రభావాన్ని వేశారు.   మాతృదేశం ఇటలీ అయినా ఇండియాని తన కంటిచూపుతో శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆమె ముందు వున్న ఒకే ఒక బాధ్యత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేయడం. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేవని విమర్శకులు అంటున్నా. ఆమె తల్లిమనసు అందుకు అంగకరించడం లేదు. రాహుల్‌ని ప్రధాని చేయడం కోసం తన శయశక్తులా కృషి చేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత రాహుల్ ప్రధాని అయ్యేదీ లేనిదీ క్లారిటీ వస్తుంది. రాహుల్ ఈసారి ప్రధాని అయితే సోనియా లక్ష్యం నెరవేరినట్టే! 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రధాని పదవిని రాహుల్ చేతిలో పెట్టి సోనియా విశ్రాంతి తీసుకునే అవకాశం వుందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా ఆమె రాజకీయాల్లో కొనసాగే అవకాశం లేదంటున్నారు. వయసు పైబడటం, అనారోగ్యం, పిల్లలు చేతికి అందిరావడం... వీటన్నిటి కారణంగా ఆమె రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న యు.పి.లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి ఈసారి సోనియా పోటీ చేయబోరని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.  రాజీవ్ నియోజకవర్గం అమేథీ రాహుల్‌కి అప్పగించినట్టే, తన నియోజకవర్గం రాయబరేలిని ప్రియాంకకి సోనియా అప్పగించే అవకాశం వుందంటున్నారు. రాయబరేలి ప్రజలకు ప్రియాంకని చేరువ చేసే పని కూడా మొదలైంది. ఇందులో భాగంగానే రాయబరేలికి సంబంధించిన అన్ని విషయాలలోనూ ప్రియాంక యాక్టివ్‌గా వుంటోంది. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రియాంక తరచుగా పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటోంది. అక్కడి ప్రజలతో మమేకమవుతోంది.  

చెల్లితో జగన్‌కి చెడిందా?

      జగనన్న వదిలిన బాణం షర్మిల. ఇప్పుడు జగన్‌కి, షర్మిలకి మధ్య అగాథం పెరిగిందా అనే సందేహాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జీవించి ఉండగా కానీ, ఆ తర్వాత కానీ ప్రజా జీవితంలోకి వచ్చి ఎరుగని షర్మిల జగన్ జైలుకు వెళ్ళడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.   జగన్ జైలులో వున్నాడు.. ఇప్పడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేదెవరన్న సందేహాలు కలిగినప్పుడు నేనున్నానంటూ షర్మిల తల్లితో కలసి ముందుకు వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జనం మరచిపోకుండా ఉండటం కోసం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటించారు. జగనన్న వదిలిన బాణాన్నంటూ తనను తాను చాటుకుని అతి కొద్దికాలంలోనే రాజకీయంగా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. వైరి పక్షాల మీద ఘాటైన విమర్శలు చేస్తూ జగన్ ఇంకొంతకాలం బయటకి రాకపోయినా షర్మిల పార్టీని మేనేజ్ చేయగలదన్న నమ్మకాన్ని కలిగించారు. జగన్ జైలు నుంచి తెలంగాణవాదం, సమన్యాయ వాదం, సమైక్యవాదం.. ఇలా ఏ వాదం గురించి మాట్లాడమంటే ఆ వాదాన్ని వినిపించి తండ్రికి తగ్గ కూతురు, అన్నకి తగ్గ చెల్లి అనిపించుకున్నారు.  జగన్ జైలులో నిరాహార దీక్ష చేసినప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించిన షర్మిల ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. జగన్ జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత ఎక్కడా షర్మిల పేరు వినిపించలేదు. తాజాగా జగన్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావ సభకు విజయమ్మ, షర్మిల వచ్చినప్పటకీ వేదిక మీదకు రాకుండా కిందే ఉండిపోయారు. మంచి వాగ్ధాటి వున్న షర్మిల వేదిక మీదకు వచ్చి మాట్లడకపోవడం వెనుక ఏదో ఆంతర్యం వుందని, వీరిమధ్య పెరుగుతున్న అగాధానికి ఇదొక నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షర్మిలకు, జగన్ భార్య భారతికి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంటారు. ఈమధ్య కాలంలో అవి మరింత పెరిగాయని, అందువల్లే జగన్‌కి, షర్మిలకు మధ్య దూరం పెరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.  

ఆంజనేయరెడ్డికి సెల్యూట్!

      రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల గురించి చర్చించడానికి కేంద్ర హోంశాఖ సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసిన విషయం, ఆ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల విషయం గురించి చర్చించడానికి టాస్క్‌ఫోర్స్‌ విశ్రాంత డీజీపీలతో మంగళవారం నాడు సమావేశం నిర్వహించింది. విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డికి కూడా టాస్క్‌ఫోర్స్‌ ఆహ్వానం పంపింది.   అయితే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో వున్న మాజీ డీజీపీ పేర్వారం రాములుని ఆహ్వానించలేదు. దాంతో టీఆర్ఎస్ నానాయాగీ చేసింది. ఇదంతా సీమాంధ్రుల కుట్రేనని తన సహజశైలిలో నోటికొచ్చిన ఆరోపణలు చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో వున్న ఆంజనేయరెడ్డిని ఆహ్వానించి, విభజన ఉద్యమంలో వున్న పేర్వారం రాముల్ని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించింది. దాంతో ఈ తలనొప్పి ఎందుకనుకున్నారో ఏమోగానీ, హోంశాఖ అధికారులు పేర్వారం రాములుకి ఫోన్ చేసి ఈ విషయంలో మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండని కోరారు. సరే, ఈ విషయం ఇలా వుంటే... మంగళవారం జరిగిన సమావేశానికి ఆహ్వానం అందినప్పటికీ విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ ఆయన మీద గౌరవం పెంచేలా వుంది.  ‘‘నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాను. రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్నాను. అలాంటి నేను రాష్ట్రం విడిపోతే ఏం చేయాలని ఆలోచించే సభకు ఎందుకు వెళ్తాను? పైగా ఆ సభకు నేను వెళ్ళకపోవడానికి మరో కారణం ఏమిటంటే, రాష్ట్రం ఎప్పటికీ విడిపోదు.. సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం నాకుంది’’ అన్నారు. ఆంజనేయరెడ్డి లాంటి నిజాయితీపరులైన వ్యక్తుల నమ్మకమే తెలుగుజాతిని ఎప్పటికీ విడిపోకుండా కాపాడుతుందని సమైక్యవాదులు అంటున్నారు.  సమైక్య ఉద్యమానికి నైతిక బలాన్నిచ్చేలా వ్యవహరించిన ఆంజనేయరెడ్డికి సెల్యూట్ చేస్తున్నారు.

అడ్డంగా నరికి ఆయింట్‌మెంట్ రాయనుంది!

      రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని అడ్డంగా నరికిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తాను చేసిన మానని గాయానికి ఆయింట్‌మెంట్ రాసే ప్రయత్నం చేస్తోంది. తన పేరు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పినా, ప్రధాని మన్మోహన్ పేరు చెప్పినా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్న తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని అర్థం చేసుకున్న సోనియాగాంధీ ఇప్పుడు తెలుగు ప్రజల్ని.. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల్ని ప్రసన్నులని చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. చల్లని మాటలతో, చర్యలతో సీమాంధ్రలో తన మీద వున్న వ్యతిరేకతని పోగొట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం వరదల కారణంగా విలవిలలాడుతున్న సీమాంధ్ర ప్రాంతంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలసి ఏరియల్ సర్వే చేయాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. తద్వారా సీమాంధ్ర ప్రజలకు తనంటే వున్న ఆగ్రహాగ్నిని నాలుగు సానుభూతి కన్నీటి చుక్కలతో చల్లార్చాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో సోనియాగాంధీ, మన్మోహన్ సీమాంధ్రలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తారట. విమానంలోంచే ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తారట. ఆ తర్వాత  విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీమాంధ్ర వరద బాధితుల కోసం  ఒక భారీ ప్యాకేజీని ప్రకటిస్తారట. ఇంతకీ సోనియా, మన్మోహన్ ఎప్పుడు ఏపీకి వస్తారన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. సోనియాగాంధీ మొసలి కన్నీటికి సీమాంధ్రుల ఆగ్రహాగ్ని చల్లారుతుందా? ఆమె రాసే ప్యాకేజీ ఆయింట్‌మెంట్ తెలుగువారి గుండె గాయాన్ని మాన్పగలుగుతుందా?  

విభజనుల గుండెల్లో రాయి

      రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల మీద పడే ప్రభావం, మావోయిస్టుల ప్రాబల్యం, హైదరాబాద్ స్థాయి... ఇలాంటి అంశాలన్నింటినీ అధ్యయనంచేయడానికి కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ చకచకా రంగంలోకి దిగిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రానికి నివేదిక అందించాల్సి వున్న కారణంగా ఈ టాస్క్‌ఫోర్స్ మెరుపు వేగంగా పనిచేస్తోంది.   ఇప్పటికే మాజీ డీజీపీలతో ఒక సమావేశాన్ని నిర్వహించేసింది. కేంద్రం ఈ టాస్క్‌ఫోర్స్ ఫోర్స్‌ ఏర్పాటు చేయడం విభజన వాదుల గుండెలో రాయిపడేలా చేసింది. తెలంగాణ ప్రక్రియను మరింత ఆలస్యం చేయడానికో, హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా శాశ్వత హక్కు కల్పించడానికో ఒక పథకం ప్రకారం కేంద్రం ఈ టాస్క్‌ఫోర్స్‌ని రంగంలో దింపిందన్న ఆందోళనను విభజనవాదులు వ్యక్తం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకపోవడం, మాజీ డీజీపీల సమావేశానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ అధికారి, టీఆర్ఎస్ సభ్యుడు పేర్వారం రాములుకు ఆహ్వానం అందకపోవడం విభజన వాదుల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.  తమ ప్రాంతానికీ భాగస్వామ్యం కల్పించాలని టీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్, కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ని కేంద్రం పట్టించుకుంటుందో లేదో చూడాలి. టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన తొలిరోజు సమావేశంలో హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థ ఉండాలన్న అంశం మీద చర్చ జరగడం దేనికి సంకేతంగా భావించాలో అర్థంకాక విభజన వాదులు తలలు పట్టుకుంటున్నారు. అటూ ఇటూ చేసి ఈ టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌ని తమకి కాకుండా చేస్తుందేమోనన్న ఆందోళన విభజన వాదుల్లో ఏర్పడింది.

చిరంజీవికి టైం బ్యాడ్!

      మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ప్రతి విషయంలోనూ ఆయనకి చుక్కెదురే అవుతోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంచలనం సృష్టించాలనుకుంటే ఆ పార్టీ తనకే జలక్ ఇచ్చింది. ఆ పార్టీతో కొంతకాలం వేగిన తర్వాత చక్కగా కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి హోదాలో ప్రశాంతగా ఉండొచ్చని ఆయన భావించారు. కానీ అదేంటోగానీ, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా లేదు.. దాంతోపాటు ఆయనా ప్రశాంతంగా లేరు.   కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా హైదరాబాద్‌ని యు.టి. చేయాలన్న నేరానికి తెలంగాణ ప్రజలకి, పదవులకు రాజీనామా చేయని పాపానికి సీమాంధ్ర ప్రజలకి ఆయన దూరమైపోయారు. ఒకప్పుడు రాజాలా, తాను చెప్పిందే వేదంలా వెలిగిన ఆయన పాపం కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పినట్టు వినాల్సిన పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తానికి సీఎం అయిపోవాలని కలలు కన్న ఆయన ప్రస్తుతం సీమాంధ్ర ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఇందులో కూడా ఆయనకి పోటీ ఎక్కువగా వుంది. కాంగ్రెస్ పార్టీలో సీమాంధ్ర సీఎం రేసులో వున్నవారిలో అందరికంటే వెనుకబడి వున్న వ్యక్తి చిరంజీవే! ఈమధ్య కురిసిన వర్షాలు, వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర వాసులను పరామర్శించడం ద్వారా అక్కడి ప్రజల మనసులలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా  శ్రీకాకుళం జిల్లాలో శుభమా అని పరామర్శలు ప్రారంభించిన చిరంజీవికి  ఆదిలోనే అపశకునం ఎదురైంది. పడవ ఎక్కబోయిన చిరంజీవి నీళ్ళలో జారిపడిపోయారు. చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తికి ఇలాంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడమే తప్ప చిరంజీవికి వరద బాధితులకు అధికారికంగా సాయం ప్రకటించే అవకాశం లేదు. నష్టపరిహారం అందేలా చేస్తాను, చూస్తాను అనే హామీలు మాత్రమే ఇస్తున్నారు. దాంతో వరద బాధితులు చిరంజీవి తమను పరామర్శించడం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని అనుకుంటున్నారు. దీనికితోడు చిరంజీవి ఎక్కడకి వెళ్ళినా ఆయనకి సమైక్య సెగ తగులుతోంది. రాజాంలో విద్యార్థులు సమైక్య నినాదాలు చేస్తూ ఆయన మీద కంకర చిప్స్ విసిరారు. దరిద్రంలో అదృష్టమన్నట్టు ఆయనకి దెబ్బలేం తగల్లేదుగానీ, సెక్యూరిటీ సహకారంతో అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది.  మరోవైపు చిరంజీవి కారణంగా ఆయన కొడుకు రామ్‌చరణ్ కెరీర్ కూడా ప్రభావితం అవుతోంది. ‘ఎవడు’ సినిమా రిలీజ్‌కి రెడీ అయి చాలాకాలమైనా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. అటు విభజన వాదులు, ఇటు సమైక్య వాదులు ఆ సినిమా మీద కత్తికట్టి వున్నారు. చిరంజీవి పరిస్థితి ఇలా అయిపోవడం ఆయన అభిమానులకు ఎంతో ఆవేదన కలిగిస్తోంది.

మనుషులు పోయినందుకు కాదు బాధ

  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. రెండు నెలల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం బొద్ గయలో బాంబులు పేల్చిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు, మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ పాట్నాలో జరిపిన సభకి ముందుగా బాంబులు పేల్చడం, దానిలో ఆరుగురు చనిపోవడం, అనేకమంది తీవ్రంగా గాయపడటంతో, నితీష్ కుమార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో తరచు విఫలం అవుతున్నారని విమర్శలు మొదలయ్యాయి.   ముఖ్యంగా తనకి బద్దశత్రువయిన మోడీ, తన బీహార్ రాష్ట్రం లో సభ పెట్టుకొంటునపుడు, ఉగ్రవాదులు ఏకంగా సభా ప్రాంగణంలోనే ప్రేలుళ్ళకు పాల్పడటంతో శాంతి భద్రతల విషయంలో ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఆయన సంస్కరణలు, అభివృద్ధి పట్ల చూపుతున్నంత శ్రద్ద, శాంతి భద్రతల విషయంలో చూపడం లేదని, రాష్ట్ర పోలీసు, నిఘా వ్యవస్థలపై ఆయనకు సరయిన పట్టు లేకపోవడంతో వలననే తరచు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.   ఇక కొద్ది నెలల క్రితం బీహార్ లో శరన్ అనే ప్రాంతంలో చిన్నారులు స్కూలులో విషాహారం తిని మృతి చెందిన కేసు నేటికీ పరిష్కరింపబడలేదు. ఏదయినా ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే, నితీష్ కుమార్ ముందు విచారణకు ఆదేశించడం, ఆ వెంటనే భాదిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం తప్ప, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం ఆయన చూడలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అయితే ప్రతీ రాష్ట్రంలో ఇటువంటి వ్యవహారాలు తరచు జరుగుతూనే ఉన్నపటికీ, ఆయన అటు ఎన్డీయే కూటమితో కటీఫ్ చేసుకొని, ఇటు యూపీయే కూటమిలోని జేరకపోవడంతో ఆయనకి ఎవరి మద్దతు లేకపోగా అందరు ఆయనపై దాడి చేసేందుకు చేజేతులా అవకాశం కల్పించుకొన్నారు.   ఒకవేళ ఆయన పార్టీ జేడీ(యూ) నేటికీ ఎన్డీయే కూటమిలో ఉండి ఉంటే, స్వయంగా బీజేపీయే ఆయనని వెనకేసుకు వచ్చేదేమో. అదేవిధంగా ఎన్డీయే కూటమి నుండి తప్పుకొని చాల కాలం అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపకపోగా ఇప్పుడు ఇంకా ఏర్పడని మూడో ఫ్రంటుతో జత కట్టాలని ఆలోచిస్తుండటంతో, సహజంగానే కాంగ్రెస్ కూడా ఆయన వైఫల్యాన్నిఎండగడుతోంది. మోడీ సభకి ఉగ్రవాదుల బెడద ఉంటుందని తాము ముందే హెచ్చరించినా కూడా, నితీష్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, తత్ఫలితంగా అమాయకులయిన ప్రజల ప్రాణాలు పోయాయని కాంగ్రెస్ దుమ్మెతి పోస్తోంది.   అయితే ప్రజలు చనిపోయారనే బాధకంటే , ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన నరేంద్ర మోడీ సభలో ఇటువంటి సంఘటన జరగడం వలన కేంద్ర రాష్ట్రాలు రెండూ ఆయన సభకు తగిన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందాయని, ఆయనకు తగిన రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం వహించి ఆయన ప్రాణాలకే ప్రమాదం తెస్తున్నాయని, రేపటి నుండి బీజేపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలపై అస్త్రాలు సందిస్తే దానికి వారిరువురి వద్ద జవాబు ఉండదు.   అది బీజేపీకి సానుభూతి ఓట్లను కురిపించవచ్చని గ్రహించిన కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలు “మీది తప్పంటే మీదే తప్పని” ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు.

జగన్ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు విభేదమేనా

  సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి జగన్ పార్టీకి మంచి లంకె ఉందని బల్లగుద్ది చెపుతుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాత్రం తమ మధ్య అటువంటిదేమి లేదని వాదిస్తున్నారు. అయితే తెలంగాణా విషయంలో వారు విభేదించారంటే అర్ధం ఉంది. కానీ ఈవిషయంలో కూడా వారు ఎందుకు విభేదించవలసివస్తోంది? అందరూ కాంగ్రెస్ తానులో ముక్కలే కదా?అని సందేహం కలుగుతుంది.   అయితే రాష్ట్ర విభజన జరిగిపోతున్నపుడు వేరే రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్) వ్యవహారాల్లో తలదూర్చడం వలన తల బొప్పికట్టడమే కాక తమ టికెట్స్ కూడా ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానం తమని మోసం చేసిందని, అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ మద్దతు కోసం అర్రులు చాస్తోందని చేస్తున్నఆరోపణల వలన, మున్ముందు తమతో కూడా పార్టీ అదే విధంగా వ్యవహరించవచ్చనే భయం లోలోన ఉంది. అయితే పరిస్థితులు ఇంకా అంతవరకు రాలేదు గనుక, పార్టీకి అటువంటి ఆవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే తామంతా సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా పార్టీ వెంట నడుస్తామని గట్టిగా నొక్కి చెప్పేందుకే సీమాంద్రా నేతల ఆరోపణలను ఖండిస్తున్నారనుకోవచ్చును.   పైగా ప్రస్తుతం వారు మొదలుపెట్టిన జైత్రయాత్ర/ సోనియ,రాహుల్ గాంధీల భజన కార్యక్రమంలో సోనియాగాంధీని తెలంగాణాలో ఇంటింటి ఇలవేల్పని ప్రచారం చేస్తున్నపుడు, ఆమెపై తమ సహచర నేతలే ఈవిధంగా ఆరోపణలు చేస్తుంటే తమ భజనకి అర్ధం లేకుండా పోతుంది. అందుకే వారు గట్టిగా సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వస్తున్నారు. అయితే రేపు ఒకవేళ వాళ్లకి కూడా కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ కే ప్రాధాన్యం ఇచ్చి తెరాసకే ఎక్కువ టికెట్స్ కేటాయిస్తే బహుశః అప్పుడు వారు కూడా సీమాంధ్ర నేతలతో కోరస్ పాడే అవకాశం ఉంది.   కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే మొన్న జగన్ మోహన్ రెడ్డి సమైక్యసభలో “అమ్మా సోనియమ్మా!” అంటూ హృదయపూర్వకంగా సోనియాగాంధీని అమ్మా అని సంబోధిస్తూనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే కిమ్మనని తెలంగాణా కాంగ్రెస్ నేతలు, సాటి కాంగ్రెస్ నేతలు చేస్తున్నఆరోపణలను ఖండించడానికి మాత్రం చాలా పోటీలు పడుతున్నారు. అయినా అన్నలకి తెలిసిన ఇంటి గుట్లు తమ్ముళ్ళకి తెలియకుండా ఉంటుందని ఎవరూ అనుకోలేరు కదా!

సచిన్ చేతిలో కాంగ్రెస్ క్లీన్‌బౌల్డ్

      సచిన్ టెండూల్కర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌బౌల్డ్ అయింది. క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తూ, వివాద రహితుడిగా, తన పనేదో తాను చేసుకువెళ్ళేవాడిగా పేరున్న సచిన్ టెండూల్కర్‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి నామినేట్ చేయడం ద్వారా రాజ్యసభకి ఎంపిక చేసింది. భారతీయ క్రికెట్ రంగానికి సచిన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చిందని అందరూ భావించారు. ఎవరూ దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయలేదు.   అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఒక ‘మాస్టర్’ ప్లాన్ వేసింది. రాజ్యసభకు ఎంపిక చేసింది కాబట్టి టెండూల్కర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి వుంటాడని, తాము కోరితే ఎన్నికలలో తమకు ప్రచారం చేస్తాడని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. దాంతో మధ్యప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సచిన్ టెండూల్కర్ ప్రచారం చేయబోతున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రచారం ఊపందుకుని సచిన్ నిజంగానే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నాడన్న నమ్మకం అన్ని పార్టీలకీ కలిగింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో సచిన్ టెండూల్కర్ వెంటనే స్పందించాడు. తాను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయబోవడం లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని ఫాస్ట్ బాల్ లాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఆ స్టేట్‌మెంట్ బాల్ ధాటికి కాంగ్రెస్ పార్టీ క్లీన్‌బౌల్డ్ అయింది. తాను వేసిన ప్లాన్ ఇలా తిరగబడిందేంటా అని నాలుక్కరుచుకుంది. ఈ విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. అధిష్ఠానం ఆదేశాలు అందుకున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వెంటనే రంగంలోకి దిగాడు. సచిన్ టెండూల్కర్ చేత ఎన్నికలలో ప్రచారం చేయించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని, ఈ విషయంలో వినిపించిన వార్తలన్నీ నిరాధారమైనవని ప్రకటించాడు. సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ అనీ, ఆయన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదని చెప్పాడు. ఈ తెలివితేటలన్నీ సచిన్ చేతిలో క్లీన్‌బౌల్డ్ అవకముందు ప్రదర్శించి వుంటే బాగుండేదని ప్రతిపక్ష పార్టీలవారు అంటున్నారు.

గుడి కట్టి బొట్టుపెట్టేశారు!

      అడ్డగోలుగా, అడ్డదారిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తహతహలాడారు. కరీంనగర్‌లో ‘కృతజ్ఞత సభ’ పెట్టాలని అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి, బయటి పార్టీల నుంచి విమర్శలు రావడం, సమయానికి వర్షాలు కురవడంతో వరుణ దేవుడి పేరు చెప్పి కృతజ్ఞత సభ వాయిదా వేశారు.   వరుణ దేవుణ్ణి తలుచుకున్నప్పడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఒక మహత్తరమైన ఐడియా వచ్చినట్టుంది. వెంటనే దాన్ని అమల్లో పెట్టేశారు. కృతజ్ఞత సభ నిర్వహించాలనుకున్న కరీంనగర్లోనే సోనియాకి గుడి కట్టేశారు. సోనియాగాంధీ చిత్రపటానికి బొట్టుపెట్టి, కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేసి, మంగళ హారతి ఇచ్చేశారు. ఆ రకంగా వాళ్ళలో పొంగి పొరలుతున్న కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. సోనియాగాంధీ దేవతకి ఇంత అర్జెంటుగా గుడి ఎలా కట్టారా అని ఆశ్చర్యపోతున్నారా.. తెలంగాణ కాంగ్రెస్ సోనియాకి కట్టింది రియల్ గుడి కాదు. రాత్రికి రాత్రే తయారు చేసిన ఫ్లెక్సీ గుడి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర మార్కులు సంపాదించుకోవడానికే ఇలాంటి ‘భక్తి’ ప్రదర్శించారని మెడకాయ మీద తలకాయ వున్న ఎవరికైనా అర్థమయ్యే విషయమే.  సోనియాకి ఫ్లెక్సీ గుడి కట్టి, పూజలు తె.కాం. నాయకులు ఏదో ఘనకార్యం చేశామని అనుకుంటూ వుండవచ్చు. అయితే చాలామంది  కాంగ్రెస్ నాయకులే ఈ చర్యని తప్పుపడుతున్నారు. దీనిని మితిమీరిన వ్యక్తిపూజకు పరాకాష్టగా భావిస్తున్నారు. ఇలాంటి ధోరణులే సోనియాగాంధీని నియంతగా మార్చాయని అంటున్నారు. బతికున్న వ్యక్తులెవరికీ గుడులు కట్టరు.  ఆ విషయం తె.కాం. నాయకులకు తెలియదేమోనని బాధపడుతున్నారు.   బతికే వున్న ఒక మనిషి ఫొటోకి బొట్టు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి, మంగళ హారతి ఇస్తే అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. సోనియాగాంధీ ఫొటోకి సమాధి కట్టడం నేరమయిన పక్షంలో, ఇలా గుడి కట్టి పూజలు చేయడం కూడా  అంతే నేరమని అంటున్నారు.  

జగన్ మదర్ సెంటిమెంట్!

      వైకాపా నాయకులు జగన్మోహనరెడ్డి ఏ దుర్ముహూర్తంలో సమైక్య శంఖారావ సభ ఏర్పాటు చేశాడోగానీ, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అన్ని పార్టీల వారి చేతా తిట్లు తింటున్నాడు. ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు, అటు కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ.. మధ్యలో టీఆర్ఎస్. అన్ని వైపుల నుంచీ జగన్ నిర్వహించిన సభ మీద, జగన్ మాట్లాడిన తీరు మీద విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి.   జగన్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కాంగ్రెస్,  టీఆర్‌ఎస్ పార్టీలు కూడా అందరూ జగన్ని తిడుతున్నారు.. మనం కూడా తిట్టకపోతే బాగోదన్నట్టుగా వాళ్ళు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్‌ని తిట్టిపోశారు. సరే బయటి పార్టీల వాళ్ళు తిట్టారంటే సర్దిచెప్పుకోవచ్చు. వైకాపా శ్రేణులు కూడా సభలో జగన్ మాట్లాడిన తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బాహాటంగా బయటపడలేక లోపల లోపలే కుమిలిపోతున్నారు. జగన్ ఎవరు మంచి చెప్పినా వినడు.. ఒకవేళ సాహసించి మంచి చెపితే ఆ చెప్పినవాళ్ళనే తరిమేస్తాడన్న వాస్తవం పార్టీలో ఎవరూ నోరెత్తకుండా చేస్తోంది. శంఖారావ సభలో మిగతా విషయాల సంగతి అలా వుంచితే, జగన్ సోనియాగాంధీని ‘అమ్మా’ అంటూ పిలిచిన తీరు మీద సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సోనియా మీద విమర్శలు చేయదలుచుకున్నప్పుడు ఘాటుగా చేయాలే తప్ప, ‘అమ్మా’ అని ప్రేమగా, అభిమానంగా పిలిచి విమర్శలు చేయడమేంటని అంటున్నారు. జగన్ నోటి వెంట వచ్చిన ‘అమ్మా’ అనే పిలుపులో వినిపించిన మాధుర్యం, కారుణ్యం, సెంటిమెంట్ తమకు చెవుల్లో సీసం పోసిన అనుభూతిని కలిగించిందంటున్నారు. శంఖారావ సభలో సోనియాని విమర్శిస్తూ జగన్ మాట్లాడిన తీరు తల్లిమీద అలిగిన కొడుకు మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప, కడుపు మండుతున్న తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు లేదని అంటున్నారు. ప్రసంగాలు చేయడంలో జగన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ఏర్పాటు అసంభవం!

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యం, అసంభవమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అసాధ్యమో కూడా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా ఏడు దశల్ని దాటాల్సివుంది. కానీ ఈ దశలన్నిటినీ దాటేంత సమయం కేంద్రంలో వున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి లేదు.   మాంత్రికుడి ప్రాణం ఉండే చిలకని పట్టుకోవాలంటే సప్త సముద్రాలు దాటాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను భార్యాభర్తలుగా అభివర్ణిస్తూ ఏడుగులు వేయించారు. ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇప్పుడు ఈ ఏడడుగుల బంధాన్ని తెంచాలంటే కూడా ఏడు కీలకమైన అడుగులు వేయాల్సి వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏడు కీలక దశల్ని తప్పనిసరిగా దాటాల్సి వుంటుంది. అవి... 1. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బిల్లు డ్రాఫ్ట్ తయారు చేయాలి. దీనికోసం పరిపాలనకు సంబంధించిన అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని దానిని క్రోడీకరించుకోవాలి. అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత బిల్ డ్రాఫ్ట్ రూపొందించాలి. దీనికి మొత్తం తక్కువలో తక్కువగా రెండు నెలల సమయం పడుతుంది. 2. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తయారు చేసిన బిల్ డ్రాఫ్టుని ప్రజలు, వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం ఒక నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఆ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్‌ని పరిశీలించి డ్రాఫ్టులో మార్పులు, చేర్పులు ఏవైనా అవసరమైతే చేయాలి. ఆ తర్వాత దానిని కేంద్ర కేబినెట్‌కి పంపాలి. 3. కేంద్ర కేబినెట్ బిల్లు డ్రాఫ్ట్ మీద చర్చించాలి. ఆమోదించాలి. తర్వాత దానిని రాష్ట్రపతికి పంపాలి. 4. రాష్ట్రపతి డ్రాఫ్ట్ ని పరిశీలించిన తర్వాత ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల అభిప్రాయం తెలుసుకోవడం కోసం రాష్ట్ర గవర్నర్‌కి పంపించాలి. 5. రాష్ట్ర శాసనసభలో డ్రాఫ్ట్ మీద చర్చ జరగాలి. శాసనసభ్యులు ఒక తీర్మానం చేసి కేంద్ర కేబినెట్‌కి పంపించాలి. 6. కేంద్ర కేబినెట్ డ్రాఫ్ట్ ని, అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి. 7. ఆ తర్వాత పార్లమెంట్‌లో చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందాలి. ఈ ఏడు దశలు దాటేసరికి మొత్తం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సమయం పడుతుంది. పార్లమెంట్ చివరి సమావేశాలైన శీతాకాల సమావేశాల్లో బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందితీరాలి. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లోనే మొదలవుతాయి. శీతాకాల సమావేశాల నాటికి ఈ ప్రొసీజరంతా పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం కూడా లేదు.