కేంద్రం కాకి లెక్కలు!

      కేంద్రం తన రాయల తెలంగాణ ప్రతిపాదనని ఎప్పుడెప్పుడు బయటపెట్టాలా అని ఉవ్విళ్లూరుతున్నట్టుంది. కాకిలెక్కలకు ఎంతమాత్రం తీసిపోని అంచనాలతో రాయల తెలంగాణ ఇవ్వాలని ఫిక్సయిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తేనెతుట్టెని కదల్చగానే కేంద్రాన్ని అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని సమస్యలు ప్రథమ చికిత్స చేస్తే తగ్గిపోయే రోగాల్లాంటివి కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ వదలక పీడించే దీర్ఘకాలిక రోగాల్లాంటివి. ఈ రోగాలన్నిటినీ నివారించే సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’ అని కేంద్రం భావిస్తోంది.   రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయడం వల్ల  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే అద్భుతమైన ఫలితాలేవో వచ్చేస్తాయని కేంద్రం కలలు కంటోంది. కొత్త రాష్ట్రంలో తాను అధికారంలోకి రావడానికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవటానికి, టీఆర్ఎస్, బీజేపీలను కొత్త రాష్ట్రంలో కంట్రోల్ చేయడానికి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసుకోవడానికి, జలవివాదాలు తలెత్తకుండా వుండటానికి, సీమాంధ్రకు రాజధాని సమస్య రాకుండా వుండటానికి... ఇలా ఒకటీ రెండు కాదు రెండు మూడు డజన్లకు పైగా అంశాలను కేంద్రం ఆలోచించి పెట్టేసుకుంది. తెలంగాణను ప్రకటించి తాను తప్పు చేశానన్న అపరాధభావం కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అంతర్లీనంగా వుంది. తనకు ఎంతమాత్రం ఉపయోగపడేలా లేని లేనిపోని తద్దినాన్ని అనవసరంగా నెత్తికెత్తుకున్నానని మథనపడుతోంది. తెలంగాణ ఇచ్చేసిన నింద పడేది కాంగ్రెస్ పార్టీమీదే అయినా రాజకీయ లబ్ధి మాత్రం టీఆర్ఎస్‌కి వెళ్లేలా పరిస్థితులు తయారయ్యాయని బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అడుసు తొక్కిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి రాయల తెలంగాణని ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

ఓదార్చింది చాల్లేవయ్యా మగడా!

      జగన్ మరోసారి ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. వైఎస్సార్ చనిపోయి నాలుగేళ్ళు దాటిపోయింది. ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక నిజంగా గుండె ఆగి చనిపోయిన వాళ్ళు ఎంతమంది వున్నారోగానీ, జగన్ ఎంత ఓదార్చినా వాళ్ళ సంఖ్య మాత్రం తరగడం లేదు. ఒకవేళ నిజంగా వైఎస్ మరణం వల్ల బాధతో గుండె ఆగి చనిపోయినవాళ్ళ కుటుంబాలు ఈ నాలుగేళ్ళుగా జగన్ వస్తాడు.. మమ్మల్ని ఓదారుస్తాడని ఎదురుచూస్తూ వుంటాయా? సరే ఇదెలా వున్నా, జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రల విషయంలో ఓదార్చింది చాల్లేవయ్యా మగడా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఈ గుసగుసలు వినిపిస్తోంది ఎవరో బయటి వాళ్ళు కాదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఇలా గుసగుసలాడుకుంటున్నారు. నాలుగేళ్ళ నుంచి  జగన్ పాడుతున్న ఓదార్పు పాట విని వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఉద్యమాలు చేయడానికి, జనాల్లోకి వెళ్ళడానికి బోలెడన్ని సమస్యలు, ఇష్యూలు వుండగా జగన్ ఈ ‘ఓదార్పు’నే పట్టుకుని వేలాడుతూ వుండటం చూసి నాయకులు, కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. జగన్ ఇలా వ్యవహరిస్తూ వుండటం వల్ల పార్టీ నష్టపోతోందని బాధపడుతున్నారు. ఇలా బాధపడుతున్నవాళ్ళని ఓదార్చేవాళ్ళే లేకపోవడం బాధాకరం. బయట అందర్నీ ఓదార్చే జగన్ కూడా వాళ్ళని ఓదార్చడం లేదు. కొంతమంది నాయకులు ఇక ఓదార్పు యాత్రని ఆపేద్దాం బాబూ అని జగన్‌కి చెబితే జగన్ వాళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూశాడని తెలిసింది. ఓదార్పు యాత్ర  ద్వారా తనకు ప్రజల్లో ఫాలోయింగ్ పెరిగిపోతోందని, ఇకముందు ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వద్దని సదరు నాయకులను జగన్ హెచ్చరించాడని తెలిసింది. ఈ విషయంలో ఇంకోసారి నోరెత్తితే పార్టీలోంచి బయటకి పంపిచేస్తాడన్న భయంతో అందరూ కిక్కురుమనకుండా ఉన్నారు. ఎలాగూ జగన్ తన విధానం మార్చుకోడు. రాబోయే ఎన్నికలలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోతుంది. అప్పుడు వైఎస్సార్సీపీ నాయకులందరూ కలసి జగన్‌ని ఓదార్చాల్సి వస్తుంది.  

ఇంకా బల్బు వెలగలేదా?

      రాష్ట్ర విభజన డ్రామాని నానా రకాల ట్విస్టులు తిప్పిన కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా రాయల్ తెలంగాణ ట్విస్ట్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరగబోతోందీ చెప్పేసింది. జీఓఎం ఇచ్చిన నివేదికకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపేస్తుందని కూడా డిసైడ్ చేసేసింది. బిల్లును రాష్ట్రపతి దగ్గరకి ఎప్పుడు పంపేదీ, రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి బిల్లు ఎప్పుడు వచ్చేదీ తీర్మానించేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గానీ, జనవరిలో జరిపే ప్రత్యేక సమావేశాల్లోగానీ బిల్లు ఆమోదం పొందుతుందని జోస్యం చెప్పేసింది.   యుపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు విషయంలో ఇలాంటి విషయాలని ముందే చెప్పేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు బీజేపీ మద్దతు ఉండే అవకాశం లేదని తెలుసుకోలేకపోవడం పాపం అమాయకత్వం!  రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం విధానం మారిందన్న విషయం రాష్ట్రంలో  చిన్నపిల్లలక్కూడా అర్థమైపోతోంది. కేంద్ర ప్రభుత్వం ట్యూబ్‌లైట్ బుర్ర మాత్రం ఇంకా వెలిగినట్టు లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే అర్థం కాలేదో, లేక అర్థమైనా అర్థంకాన్నట్టు వన్నెచిన్నెలు పోతోందో అనేది అర్థం కాని విషయం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో వున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రచార సభ జరిపినా ప్రతిసభలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా విభజిస్తోందని, యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం తెలుగు జాతిని చీల్చుతోందని విమర్శిస్తూనే వున్నారు. అలాగే మొన్నామధ్య ఓ సభలో మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ భారతీయ ప్రజలని ప్రాంతాల పేరుతో విభజిస్తోందని, దానిని తాము ఎంతమాత్రం అంగీకరించమని స్పష్టంగా ప్రకటించారు. సర్దార్ పటేల్ చెప్పిన సమైక్యతే తమ విధానమని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనను నరేంద్రమోడీ ఇంత బాహాటంగా వ్యతిరేకిస్తూ వుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో వెనకడుగు వేయకుండా ఆత్రాన్ని ప్రదర్శిస్తూ వుండటాన్ని అమాయకత్వం అనుకోవాలా? అతి తెలివికి తార్కాణమనుకోవాలా?  

ఢిల్లీ కూడా గోవిందా!

      దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయాల పరంపర త్వరలో ప్రారంభం కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయకేతనం ఎగరేసే అవకాశాలు నూటికి నూరుశాతం వున్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికలలో ఏం జరగొచ్చన్న అంశం మీద రెండు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో ఒపీనియన్ పోల్ నిర్వహించాయి.   ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఓఆర్జీ సంస్థతో కలసి సర్వే జరిపింది. అలాగే ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, నీల్సన్ సంస్థలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఈ రెండు సర్వేల్లోనూ ఢిల్లీలో రాబోయేది బీజేపీ పాలనేనని స్పష్టమైంది. ఈ సర్వేలో ఢిల్లీ ఓటరు మహాశయులు ‘కమలానికి ఓటేయని కరములు కరముల్?.. కాంగ్రెస్‌ని తిట్టని జిహ్వ జిహ్వా?’ అంటూ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపిస్తామని చెప్పేశారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి స్పష్టమైన ఆధిపత్యం లభించే అవకాశం వుందని చెప్పింది. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వే మాత్రం బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే నాలుగు స్థానాలు తక్కువగా వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం వుంది. రెండు సర్వేలూ ఆమ్ ఆద్మీ పార్టీకి పది స్థానాలు వస్తాయని వెల్లడించడం విశేషం. బీజేపీకి మెజారిటీ కంటే సీట్లు తక్కువ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తప్పని సరి అవుతుంది. ఏది ఏమైనా ఢిల్లీలో పదిహేనేళ్ళ కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలతో తెరపడింది. కేంద్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం వుందన్నదానికి ఢిల్లీ ఫలితాలు నిదర్శనం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో తమ పార్టీ ఓడిపోయే అవకాశం వుందని డౌటొచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుగురించి ఆలోచిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత హైకమాండ్ మొట్టికాయ వేసిందేమోగానీ, వెంటనే మాట మార్చి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని, ఎవరి సహకారం అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. టోటల్‌గా ఏంటంటే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గోవిందా.. గోవింద!  

జగన్ సమైక్యగానం ఓట్లు సీట్లకోసమేనా?

    ఊహించినట్లే వైకాపా నేతల సమిష్టి కృషివల్ల శనివారం సాయంత్రం కుప్పంలో జరిగిన జగన్ సమైక్య సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ సభలో అతని సమైక్యాంధ్ర ఉద్యమం యొక్క అసలు ఉద్దేశ్యాలు కూడా అతనే మరోసారి స్వయంగా బయట పెట్టుకొన్నాడు.   ప్రస్తుతం డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక జరిగిపోతూ, వచ్చే ఎన్నికలలోగానే రాష్ట్ర విభజన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంటే, అతను రాబోయే ఎన్నికలలో తనకి 30 యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్నివిడగొట్టకుండా ఆపుతానని హామీలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరుగకపోతే అతను చెపుతున్న మాటలకి అర్ధం ఉంటుంది. కానీ ఒకవేళ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగిపోయి, అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడిపోయిన తరువాత, అతనిని గెలిపిస్తే విడిపోయిన రెండు రాష్ట్రాలను ఏవిధంగా సమైక్యపరచగలరో కూడా అతను వివరించి ఉంటే బాగుండేది.   తను కోరుకొన్న విధంగా 30 యంపీ సీట్లు ఇచ్చి ప్రజలు తన పార్టీని గెలిపిస్తే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీకే మద్దతు ఇచ్చి, మనకు నచ్చిన వ్యక్తినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని అతను ప్రజలకు చెప్పడం అతని అహంభావానికి నిదర్శనం. ఇంకా ఇది సమైక్య రాష్ట్రమే గనుక, తెలంగాణాను కూడా వదులుకొన్న వైకాపా ఇప్పుడు కనీసం ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకు పోయింది. అటువంటి పార్టీకి అధ్యక్షుడయిన అతను కేంద్రంలో ప్రధానిగా ఎవరుండాలో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలో తనే స్వయంగా నిర్ణయిస్తానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.   ఇక నేడు కూడా అతను మళ్ళీ 30 యంపీ సీట్లు గురించే మాట్లాడటం గమనిస్తే, అతను చేసేది సమైక్యవాదన, కానీ ఆలోచనలు మాత్రం ఓట్లు, సీట్ల గురించేనని అర్ధం అవుతుంది. అంటే సమైక్యవాదం ముసుగులో సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకొని రానున్న ఎన్నికలలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు గెలిచేసి రాష్ట్రంలో, కేంద్రంలో తానే చక్రం తిప్పేయాలని ఆత్రం అతని ప్రతీ మాటలో వ్యక్తం అవుతోంది.   మరో ఆసక్తికరమయిన సంగతి ఏమిటంటే సీమాంధ్రలో ఉన్నవి కేవలం 26యంపీ సీట్లు మాత్రమే, కానీ అతను 30 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు. మరి మిగిలిన ఆ 4 యంపీ సీట్లు ఎక్కడివి? అంటే బహుశః సీమాంధ్ర ప్రజలు అధికంగా నివసిస్తున్న హైదరాబాద్ జంటనగరాలలో ఉన్న 3 సీట్లు, ఖమ్మంలో ఉన్న ఒక్కసీటు తామే గెలుస్తామని అతను భావిస్తున్నారేమో?   ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ తన పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అయితే అందుకు అతను ఎంచుకొన్నవిధానమే చాలా తప్పు. ఒకప్పుడు తెరాస తెలంగాణా ఉద్యమాలతో ఏవిధంగా రాజకీయంగా బలీయమయిన శక్తిగా ఎదిగిందో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ఏవిధంగా ఎన్నికలలో లబ్ది పొందిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రజలలో బలంగా ఉన్నసమైక్యభావనలను వారి బలహీనతగా భావిస్తూ సమైక్యవాదం పేరుతో ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అది కూడా రాష్ట్ర విభజన జరిగిపోతున్న ఈ తరుణంలోనేకాక, విడిపోయిన తరువాత కూడా సమైక్య సెంటిమెంటుతో ఓట్లు పిండుకోవాలని అనుకోవడం చాలా హేయమయిన రాజకీయం.   నిజం చెప్పాలంటే సీమాంధ్రలో కాంగ్రెస్, తెదేపాలకు ఎటువంటి బలమయిన క్యాడర్ ఉందో, అదేవిధంగా కారణాలేవయినప్పటికీ జగన్ని అభిమానించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అటువంటప్పుడు అతను చెప్పుకొంటున్న నీతి, నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేసుకొంటే, వారే కాదు ఇతరులు కూడా అతని వైపు ఆకర్షితులయ్యే వారేమో! కానీ అతని ఆలోచనా విధానము, వ్యవహార శైలి ఎప్పుడూ విచిత్రమే, అనుమానాస్పదమే. నేటి సభలో అతను పలికిన మాటలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.   నిజానికి అతను సమైక్యాంధ్ర కోసం ఈ సభ నిర్వహించి ఉంటే, రేపటి నుండి మళ్ళీ పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాలు మొదలుపెడదామని ప్రజలకు పిలుపు ఇచ్చి ఉండాలి. కానీ, 30 యంపీ సీట్ల గురించి, డిల్లీలో చక్రం తిప్పడం గురించి మాట్లాడారు.   ఎన్నికలలో తన పార్టీ గెలిచేందుకు అతను ఈవిధంగా సమైక్యసభలో, ఓదార్పు సభలో నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నించే బదులు, ముందుగా తన పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకొని, ఆ తరువాత ప్రజలవద్దకు వెళ్లి ఈ డొంక తిరుగుడు మానుకొని, నేరుగా తనకే ఓటేసి గెలిపించమని, తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలనుకొంటున్నారో చెప్పుకొంటే అతను పోగొట్టుకొన్న ‘విశ్వసనీయత’ మళ్ళీ పెరిగి, రానున్న ఎన్నికలలో విజయం సాధించవచ్చునేమో! కానీ, ఈవిధంగా ప్రజల బలహీనతమీద ఆడుకొని అడ్డు దారిలో విజయం సాధించాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

ప్రక్షాళన ఎందుకంట?

      పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భలే వెరైటీగా మాట్లాడుతూ వుంటాడు. అంతలోనే కామెడీ చేస్తుంటాడు. అంతలోనే సీరియస్ అయిపోతూ వుంటాడు. తెలంగాణ ఇస్తే తప్పేంటంటాడు.. అంతలోనే సమైక్యాంధ్ర అని నినాదిస్తాడు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానంటాడు. మళ్ళీ తానే అధిష్ఠానాన్ని ఎదిరించేవాళ్ళని పార్టీలోంచి తరిమేస్తానంటాడు.     ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ఆయనగారు సభ్యుడిగా వున్న కాంగ్రెస్ పార్టీనే ఒక విచిత్రమైన సంస్థ.. అందులో వున్న ఆయన విచిత్రంగా వుండక మరెలా వుంటారు? తాజాగా బొత్సగారికి కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ అధిష్ఠానాన్ని విమర్శిస్తున్న వాళ్ళ మీద పీకలదాకా కోపం వచ్చేసింది. వెంటనే ఆయన అలాంటి వాళ్ళు 26 మందితో ఒక లిస్టు తయారు చేశారు. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హూంకరించారు. అలాంటి వాళ్ళందర్నీ పార్టీలోంచి తరిమేసి పార్టీని ప్రక్షాళనం చేస్తానని ప్రతిజ్ఞ చేసేశారు. అయితే రాజకీయ విమర్శకులు మాత్రం బొత్సకి అంత శ్రమ అవసరం లేదని సూచిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఎలాగూ ఖాళీ అయిపోతోబోతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు పార్టీ మారిపోయారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నారు. ఇంకా నెలా రెండు నెలలు ఆగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు కూడా మిగలకుండా ఖాళీ అయిపోతుంది. అప్పుడు సీమాంధ్రలోని పార్టీ ఆఫీసులన్నిటికీ తాళాలు వేసి ఆ తాళాలు సోనియా చేతిలో పెట్టవచ్చు కదా అని బొత్సకి సూచిస్తున్నారు. ఈ కొద్దికాలం భాగ్యానికి ప్రక్షాళన లాంటి పెద్దమాటలు ఉపయోగించడం అనవసరం అని సూచిస్తున్నారు.  

కుట్ర జరిగే వుండొచ్చా?

      హిందూ మతానికి పునాదిలాంటి కంచి ఆశ్రమ ఆచార్యులు హత్య కేసు నుంచి ఏ మచ్చ లేకుండా బయటపడ్డారు. ఇది హిందూ లోకానికి ఎంతో ఊరట కలిగించిన అంశం. ఎక్కడో ఎవరో చేసిన హత్యని కంచి ఆశ్రమంలో జరిగినట్టు, ఆ హత్యను కంచి ఆచార్యులే చేసినట్టు పోలీసులు కహానీ అల్లారు. ఆధ్యాత్మిక జీవితమే తప్ప అన్నెం పున్నెం ఎరుగని కంచి స్వాముల మీద నిందారోపణ చేసి వారిని కారాగారానికి కూడా తరలించి మనోవేదనకు గురిచేశారు.   ఈ కేసు విషయంలో తీర్పు ఇచ్చిన సమయంలో కోర్టు కూడా పోలీసులను ఘాటుగా విమర్శించింది. సాక్షులను ప్రభావితం చేసేంతగా ముదిరిపోయిన పోలీసుల అత్యుత్సాహాన్ని ఆక్షేపించి అక్షింతలు వేసింది. పోలీసుల అతి కారణంగా నిర్దోషులు అవమానాల పాలయ్యారు. సందట్లో సడేమియా అన్నట్టు అసలు నిందితులు తప్పించుకునిపోయారు. కంచి స్వాముల మీదే టార్గెట్ చేసి వారిని ఇబ్బందిపెట్టడంలో బిజీగా వున్న పోలీసులు అసలు హంతకులు తప్పించుకుపోవడానికి రాజమార్గం వేశారు. ఇదిలా వుంటే బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు సరికొత్త సంచలనానికి, ఆలోచనలకు తెరతీశాయి. హిందూ మతాన్ని దెబ్బ తీసే క్రమంలో భాగంగా సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి కుట్రపన్ని కంచి స్వాములను కేసులో ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవే అయిన్పటికీ కొట్టిపారేయాల్సినవి కూడా కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన అల్లుడు అనిల్‌ని క్రైస్తవ ప్రచార రంగంలో పైకి తేవడం కోసం ఆ రంగంలో అప్పటికే టాప్‌లో వున్న కేఎ పాల్‌ని బజారుకీడ్చిన చరిత్ర వైఎస్సార్‌కి వుంది. అలాగే హిందూ మతానికి, హిందూ పుణ్యక్షేత్రాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన అనేక ప్రయత్నాలను పరిశీలించినట్టయితే కంచి స్వాములను వ్యతిరేకంగా కుట్ర జరిగిందేమోనన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అయితే ఆ కుట్ర పన్నింది సోనియా, వైఎస్సారేనా అన్నది మాత్రం ఎవరూ చెప్పలేని విషయం. చూద్దాం.. ముందుముందు ఏదైనా బయటపడొచ్చేమో!

జగన్ తెలివే తెలివి!

      రాష్ట్రాన్ని అడ్డంగా ముంచేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోతూపోతూ తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ తెలివితేటలున్న జగన్ని ఈ రాష్ట్రానికి కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. తెలివితేటల్లో ఆయనే ముదురనుకుంటే ఆయనగాని తనయుడు జగన్ మహాముదురు... ఇంకా చెప్పాలంటే దేశముదురు! వివిధ సందర్భాలలో జగన్ ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూస్తుంటే కాకలు తిరిగిన రాజకీయ పరిశీలకులకే నోటమాట రావడం లేదు. ఏదైనా ఇష్యూని తనకు అనుకూలంగా టర్న్ చేసుకోవడంలో జగన్ తెలివే తెలివని నోళ్ళు పెగల్చుకుని మరీ అంటున్నారు.   ఇప్పుడు కృష్ణానది మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలుగోడు భవిష్యత్తులో నీళ్ళో రామచంద్రా అని అల్లాడే పరిస్థితులు వచ్చే ప్రమాదం వుంది. రాష్ట్రమంతా ఈ బాధలో వుంటే, జగన్ మాత్రం ఈ ఇష్యూలో కొత్తకోణం ఆలోచించాడు. ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని తేల్చిపారేశాడు. ‘‘మిగులు జలాల మీద మేము హక్కు కోరం’’ అని దివంగత రాజశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌కి లేఖ రాసిన పాపమే ఇప్పుడు తెలుగు ప్రజల పాలిట శాపంగా మారిందని అందరూ దివంగతుడైన పెద్దమనిషిని విమర్శిస్తున్నారు.  ఈ సమయంలో నేరం తన తండ్రి మీదకు రాకుండా వుండటానికి జగన్ భలే పథకం వేశాడు. ఈ ఇష్యూలో చంద్రబాబునే దోషిగా నిలబెట్టే ప్లాన్ వేశాడు. దాంతో చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని వెరైటీ పాట పాడటం మొదలుపెట్టాడు. లేఖ రాసి తప్పు చేసిన తన ‘బాబు’ మీద వున్న ఫోకస్‌ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్ర‘బాబు’ మీదకు మళ్ళేలా స్కీమ్ సెట్ చేశాడు. ఈ స్కీమ్‌ని మరింత మోయడానికి జగన్ మానసపుత్రికలు పేపరు, ఛానలూ ఎలాగూ ఉండనే వున్నాయి. దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా వుంటుందో ఇదికూడా అలాగే వుంది.

తెలంగాణ తల్లి.. శంకరన్న లొల్లి!

      తెలుగువారి ఐకమత్యానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచే ఒక అద్భుతమైన భావన తెలుగుతల్లి. తెలుగుతల్లిని కన్నతల్లిలా భావించే తెలుగుజాతిలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు బయలుదేరి జాతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. వారి విచ్ఛిన్నకర కార్యకలాపాలు తెలుగుతల్లిని అవమానించడంతోనే ప్రారంభమయ్యాయి. తెలుగుతల్లి కాన్సెప్ట్ ని కాపీకొడుతూ ‘తెలంగాణతల్లి’కి రూపకల్పన చేశారు. తెలంగాణ అంతటా ఎక్కడ పడితే అక్కడ మురుక్కాలవ పక్కన, చెత్తకుండీ పక్కన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ తాము తల్లిగా భావిస్తున్న మూర్తినే అవమానిస్తున్నారు.   ఇదిలా వుంటే తెలంగాణ తల్లి ఆహార్యం గురించి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుబడిదారులు, ధనికులకు ప్రతినిధిగా అత్యంత ఆడంబరంగా వుందన్న విమర్శలు వినిపించాయి. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పోలికలు తెలంగాణ తల్లిలో కనిపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ ఆల్రెడీ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ యోధురాలు చాకలి ఐలమ్మను గుర్తు చేసేలా వుండాలే తప్ప కవితను గుర్తు చేసే విధంగా వుండాలని ఆయన డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇప్పుడు తెలంగాణ తల్లికి మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియాగాంధీకి గుడి కట్టి తీరతానని శపథం చేసిన శంకరన్న తాజాగా ఓ సరికొత్త స్టేట్‌మెంట్ పడేశారు. తెలంగాణ తల్లి అంటే వేరే ప్రత్యేకంగా ఎవరో కాదంట.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అట! మితిమీరిపోయిన వ్యక్తిపూజకి ఇంతకంటే పరాకాష్ట మరొకటి వుంటుందా? ఈలెక్కన పొరపాటున తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ తల్లి పరిస్థితి ఏమైపోతుందో! టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీధివీధిలో ఏర్పడే తెలంగాణ తల్లి విగ్రహాలలో కవితమ్మని చూసుకునే అదృష్టం కలుగుతుంది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రద్దు చేసి తెలంగాణ తల్లి పేరుతో సోనియాగాంధీ విగ్రహాలనే పెట్టేస్తారు. ఏదో కామెడీకోసం రాశారుగానీ నిజంగా అలా జరుగుతుందా అనుకుంటున్నారా.. పొరపాటున కూడా అలా అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చు!  

బీజేపీకి తెరాస గాలం!

      నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతానని ఊరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈమధ్యకాలంలో మనసు పూర్తిగా మార్చుకుంది. కాంగ్రెస్‌లో విలీనం అయి తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం అప్పగించేబదులు తానే అధికారం వెలగబెట్టాలన్న ఐడియాకి టీఆర్ఎస్ వచ్చేసింది. టీఆర్ఎస్ తనలో విలీనమైపోతుందని ఆశపడి తెలంగాణకి ఓకే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కొత్త వ్యూహం చూసి నోరు తెరిచింది.   టీఆర్ఎస్‌ని తమ పార్టీలో కలిపేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్లాన్లు వేసినా టీఆర్ఎస్ కొరకరాని కొయ్యలా తయారైంది. దాంతో టీఆర్‌ఎస్ తనలో విలీనం కాదని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్‌తో విలీనం మాటని అటకెక్కించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని తెలంగాణలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నిటిలో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని టీఆర్ఎస్ పథకరచన చేస్తోంది. దీనిలో భాగంగా తెరాస నాయకత్వం సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్‌ల దగ్గరకి రాయబారాన్ని పంపినట్టు తెలుస్తోంది. అయితే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే టైపు అయిన టీఆర్ఎస్‌ని నమ్మడానికి, పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. పొత్తు సందర్భంగా భారీ స్థాయిలో సీట్లు కేటాయిస్తామని టీఆర్ఎస్ ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నా బీజేపీ అగ్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్నట్టు సమాచారం. తెరాసతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల తెరాసకే లాభం తప్ప తమకేమీ ఒరిగేది లేదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు కుదుర్చుకుంటే అది తెలుగుదేశంతో అయితేనే మంచిదన్న అభిప్రాయంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా ఇటు తెలంగాణతో పాటు అటు సీమాంధ్రలో కూడా తమ పార్టీ పుంజుకునే అవకాశం వుందని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది.

ఇక ఏడవండి!

      ఓ తెలుగోళ్ళారా.. ఇక ఏడవండి! ఏడవమంటే అలా చూస్తారేంటి? బాగా ఏడవండి! ఇంతకీ నేనెవరనుకుంటున్నారా? నేను.. మీ కృష్ణవేణిని.. అర్థం కాలేదా? కృష్ణానదిని! ఎక్కడో పుట్టి.. ఎక్కడెక్కడో ప్రవహించి, తెలుగింటికి చేరే జీవనదిని! నాలో వున్న నీటిని వాడుకునే విషయంలో జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చిందిగా... నాలో వున్న మిగులు జలాల వాడకం విషయంలో మీకు అంత సీన్ లేదని డిసైడ్ చేసిందిగా! కర్నాటక, మహారాష్ట్రలు ఎక్కువ నీటిని వినియోగించుకునే విధంగా తీర్పు ఇచ్చేసిందిగా! ఇప్పుడు మీకు ఏడుపొస్తోంది కదూ.. ఏడవండి! మీ తెలుగోళ్ళు ఏడవటం మినహా ఏం చేయగలరు?   మీరు ఎప్పుడు చూసినా విడిపోదామా, కలిసుందామా, హైదరాబాద్ ఎవరిది, భద్రాచలం ఎవరిదని పోట్లాడుకుంటారే తప్ప.. మీరు పోట్లాడుకోవడం వల్ల ఎంత నష్టపోతారన్నది ఏనాడైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి ఏమైందో! అల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగిపోతుంది. మీ స్టేట్లోకి వచ్చే నా నీరు తగ్గిపోతుంది. మీలోమీరు కొట్టుకుంటూ సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళది పైచేయి అయింది. ఇప్పుడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఓకే చేసిందంటే 2050 వరకు మీ ఏరియా ఎడారే! బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటేను బంగారు పంటలే పండుతాయి అని తెలుగుతల్లి పాటని పాడటం కాదు.. కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి.. కృష్ణవేణి.. మా ఇంటి అలివేణీ అని సినిమా పాటలు పాడుకోవడం కాదు..  నా నుంచి మీకు న్యాయంగా రావాల్సిన నీళ్ళ వాటాని పొందడానికి మీరు ఏం కృషి చేశారని ప్రశ్నిస్తున్నా! మీలో మీరు పోట్లాడుకుంటూ వుండటం వల్ల అందరికీ మీరు చులకనైపోయారు. 42 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్‌గా వున్నప్పుడే మీ మాట పట్టించుకునేవాడు ఎవడూ లేకుండా పోయాడే! రేపు రాష్ట్రం రెండు ముక్కలైతే మీ మొహాలు చూసేవాడెవడైనా వుంటాడా? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రెండూ ఎండుతాయ్. ఖర్మకాలి రాష్ట్రం విడిపోతే నీళ్ళకోసం తెలుగోళ్ళే తన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా విషయాల్లో ఎలాగైనా తన్నుకుని చావండిగానీ, నా నీళ్ళ విషయంలో మాత్రం కాస్త కలసికట్టుగా వుండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పటికైనా నా మాట వింటే బాగుపడతారు. లేకపోతే మీ ఖర్మ! ఇట్లు.. -మీ కృష్ణానది

జగన్ కలలు!

      పదహారు నెలలపాటు జైల్లో గడిపి వచ్చిన జగన్ అక్కడ పనేమీ లేకపోవడంతో కలలు కనడం బాగా ప్రాక్టీసు చేసినట్టున్నాడు. అందుకే జైల్లోంచి జనాల్లోకి వచ్చాక కూడా కలలు కనడం కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ రాబోయే ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కల కంటున్నాడు. కల కంటే కన్నాడు.. ఆ కలని కనిపించిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి కలనీ బయటకి చెప్పాలనుకునే మానసిక వ్యాధి పేరేంటో మానసిక వైద్య నిపుణులే చెప్పాలి. ప్రస్తుతం జగన్ వరద బాధితులను పరామర్శించే నెపంతో సీమాంధ్రలో తిరుగుతున్నాడు. తుఫాను బాధితుల పరామర్శ కార్యక్రమంలోనే ఓదార్పు యాత్రని, సమైక్య సందేశాలని మిక్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మూడు దెబ్బలకు ఒకే పిట్ట అన్నట్టుగా మూడు కార్యక్రమాలను ఒకేదాంట్లో మిక్స్ చేసి ఓటరు పిట్టని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ వెళ్ళిన ప్రతిచోటా రైతులు తమ కష్టాలన్నీ వెళ్ళబోసుకుంటుంటే, జగన్ మాత్రం ప్రతి చోటా త్వరలో నా ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాడట. తుఫాను బాధితులకు న్యాయం చేయండంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఒక పద్ధతిగా వుంటుందిగానీ, నా ప్రభుత్వం వచ్చాక మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడమేంటని జనం విసుక్కుంటున్నారు. జగన్ చేస్తున్న యాత్ర ఎన్నిక ప్రచార యాత్రలా వుందే తప్ప తమను పరామర్శించడానికి వచ్చిన యాత్రలా లేదని జనం అంటున్నారు. పీడకలలాంటి తుఫానును ఎదుర్కొన్న తమ కన్నీళ్ళు తుడవడం మానేసి తాను కంటున్న కల గురించి చెప్పుకోవడమే ఎక్కువైపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

విభజన.. కేసీఆర్ భజన!

      తిలాపాపం తలా పిడికెడన్నట్టు రాష్ట్ర విభజన పాపాన్ని అన్ని పార్టీలకూ తలా పిడికెడు పంచితే తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం నాలుగైదు పిడికిళ్ళు పంచాలి. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ఒకపక్క విభజన పర్వం నడుస్తుంటే మరోపక్క టీఆర్ఎస్‌లో కేసీఆర్ భజనపర్వం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని నాయకులుగా తెరమీదకు వచ్చిన ఛోటామోటా లీడర్లందరూ కేసీఆర్‌ భజన చేయడంలో నిమగ్నం అయి వున్నారు.   టీఆర్ఎస్‌లో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోవాలని కలలు కంటున్నారు. వాళ్ళలో ఎంతటి పచ్చి అబద్ధాన్నయినా నిజమని పెద్ద గొంతుతో వాదించగల శ్రవణ్ ఒకరు. పార్టీ నాయకత్వమే తన టాలెంట్‌ని గుర్తించి తనను ఏదైనా సీట్లో నిలబెట్టే ఆఫర్ ఇస్తుందేమోనని ఆయన ఎదురుచూశారు. చూసీ చూసీ కళ్ళు కాయలు కాసినయ్యే తప్ప అటుపక్క నుంచి ఎలాంటి సిగ్నల్ లేకపోవడంతో తానే కేసీఆర్‌ని పొగడటం ద్వారా తాను అనుకున్నది సాధించుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. అందుకే కేసీఆర్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడుతున్నారు. శ్రవణ్ మాటల ప్రకారం కేసీఆర్ తెలంగాణకి జాతిపిత అట. దేశ స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ ఎలాంటివాడో తెలంగాణ స్వాతంత్ర్య పోరాటానికి కేసీఆర్ అంతటి నాయకుడట. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే 1969లో ఉద్యమం నడిపినవాళ్ళు, ఇప్పుడూ అప్పుడూ ఉద్యమంలో అమరులైనవాళ్ళు ఏమైపోయినట్టో! ఈ సందేహం వచ్చింది ఏ సీమాంధ్రుడికో, టీఆరెస్సేతర తెలంగాణవాదికో కాదు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లోనే వున్న కేశవరావుకి.  తెలంగాణ టాపిక్ మీద జరిగిన ఓ మీటింగ్‌లో పాల్గొన్న కేకే.. శ్రవణ్ మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కథానాయకుడెవరూ లేరని..తెలంగాణ వస్తుందంటే దానికి కారణం అమరవీరుల త్యాగమేనని నొక్కి వక్కాణించారు. పనిలోపనిగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు కూడా శ్రవణ్ కామెంట్ల మీద సెటర్లు విసిరారు. తెలంగాణ బండికి కేసీఆర్ డ్రైవర్ కావొచ్చేమోగానీ ఓనర్ కాదని అనేశారు. అందర్నీ తిట్టడమే తప్ప పొగడ్డంలో ప్రాక్టీసు లేనిశ్రవణ్ పొగడక పొగడక పొగిడితే ఆ పొగడ్తకి పొగబెట్టేవాళ్ళు బయల్దేరారు.  

‘మర్రి’యాద రామన్న!

      ఇద్దరు పోట్లాడుకుంటూ వుంటే ఇద్దరి మధ్యలో చేరి న్యాయమైన తీర్పు చెప్పే వ్యక్తిని మర్యాద రామన్న అని అంటారు. అయితే తెలంగాణవాదులు, సీమాంధ్రులు రాష్ట్ర విభజన కావాలి.. వద్దూ అని గొడవ పడుతూ వుంటే, ఆ గొడవని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించే వ్యక్తిని మాత్రం ‘మర్రి’యాద రామన్న అని పిలవొచ్చు.   ఆ ‘మర్రి’యాద రామన్న మరెవరో కాదు.. రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రిశశిధర్‌రెడ్డి. విపత్తుల నివారణ వ్యవహారాలను చూసే మర్రి శశిధర్‌రెడ్డి ప్రకృతి వైపరీత్యాల్లాంటి విపత్తుల దగ్గరే ఆగిపోకుండా రాష్ట్ర విభజన విపత్తులోకి కూడా ఎంటరయ్యారు. మొన్నటి వరకూ సమైక్యవాదిగా వున్న తెలంగాణ బిడ్డ మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్రం విడిపోకుండా చూస్తారేమోలే అనుకుంటే ఆయన తన అసలు స్వరూపం చూపించి భయ పెడుతున్నారు. ఇప్పుడాయన సమైక్యవాది రూపంలో కాకుండా... తెలంగాణ రావాలని, ఆ తెలంగాణకు తాను మొదటి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తిగా ముందుకు వచ్చారు. తన తండ్రి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తాను ఒక్కసారైనా సీఎం అవ్వాలని మర్రివారు కలలుకంటున్నట్టున్నారు. ముఖ్యమంత్రి పదవికి తనను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా శశిధర్‌రెడ్డి తెలంగాణలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని, లేకపోతే తెలంగాణలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడుతుందని జీఓఎం దగ్గర మొత్తుకున్నారు. దీనిమీద మంత్రుల బృందానికి ఓ నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన్ని ఎవరు పలకరించినా తెలంగాణలో నియోజకవర్గాల పెంపుదల గురించి వివరణలు, ఉదాహరణాలు, తార్కాణాలతో గంటలు గంటలు లెక్చర్లు ఇస్తున్నారట. 2014 ఎన్నికలలోపే నియోజకవర్గాల పునర్విభజన చేసేస్తే ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్ళపోతుందట. అలా చేయకపోతే రాజకీయ అస్థిరతతో తెలంగాణ మరో జార్ఖండ్‌లాగా దుంపనాశనం అయిపోతుందట. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చూరులో చుట్టకాలి ఇంకొకడు ఏడ్చాడంటారే... మర్రి శశిధర్‌రెడ్డి యవ్వారం కూడా అలాగే వుంది.

ఏదో సామెత చెప్పినట్టు...!

      వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలుగుజాతిని విడదీయడానికి తెలుగు సామెతలనే అనుసరిస్తోంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా సీమాంధ్ర, తెలంగాణ పిట్టల పోరులోకి కేంద్ర ప్రభుత్వం పిల్లిలా దూరి రెండు పిట్టల్నీ స్వాహా చేయాలని చూస్తోంది. తనది కాకపోతే ఊరంతా దేకమన్నట్టు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు రెండు ప్రాంతాలకూ ఇబ్బంది కలిగే ప్రతిపాదనల్ని రోజుకొకటి బయటపెడుతోంది. అత్తలేని కోడలు ఉత్తమురాలన్నట్టు సోనియాగాంధీ తన అత్త ఇందిరాగాంధీ చెప్పినమాట వినకుండా రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తోంది.   కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విభజన తేనెతుట్టె కదిలించి ముందుకు పోతే గొయ్యి వెనకకి పోతే నుయ్యి అనే పరిస్థితికొచ్చింది. అయినా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు అడ్డగోలు విభజనకు ఆత్రంగా ప్రయత్నిస్తోంది. ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణ వచ్చేసినట్టు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, రాహుల్ గాంధీ ప్రధాని అయిపోయినట్టు కలలు కంటోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకుచావండన్నట్టు ప్రస్తుతం మేం రాష్ట్రాన్ని విభజించేస్తాం. ఆ తర్వాత సమస్యలన్నీ మీరూ మీరూ కూర్చుని పరిష్కరించుకోండని అంటోంది. రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని సమైక్యవాదులు ఎంత మొత్తుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అవుతోంది. ఆరే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు, చేతకానమ్మకి చేష్టలెక్కువన్నట్టు అవసానదశలో వున్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు తహతహలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రాష్ట్ర విభజన చేస్తుంటే సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు, ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోరునష్టం పొందులాభం అనే సామెతని మరచిపోయిన విభజనవాదులు నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళన్నట్టు వ్యవహరిస్తున్నారు. అగడ్తలో పడ్డ పిల్లి అదే వైకుంఠమన్నట్టు మాట్లాడుతున్నారు. దూరపుకొండలు నునుపని భ్రమపడుతున్నారు. ఏది ఏమైనా చెడపకురా చెడేవు అనే సామెతకి అర్థం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలుసుకుంటుంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు తెలుగుజాతి యూపీఏ ప్రభుత్వాన్ని చెప్పుదెబ్బ కొట్టేరోజులు దగ్గర్లోనే వున్నాయి.  

షిండే తాతయ్యా.. హెల్త్ జాగ్రత్త!

      సుశీల్ కుమార్ షిండే తాతయ్యకి ఆంధ్రప్రదేశ్ బాలబాలికల నమస్కారం. మేం ఇక్కడ ఎంతమాత్రం క్షేమంగా, మనశ్శాంతిగా లేము. మీరు మాత్రం ఢిల్లీలో క్షేమంగా, మనశ్శాంతిగా వుండాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసే పనిలో మీరు చాలా బిజీగా వున్నారని తెలుసు. ఈ లెటర్ చదివేంత తీరిక మీకు వుండదని కూడా తెలుసు. అయినా మనసు ఉండబట్టుకోలేక రాస్తున్నాను.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అసాధ్యమని తెలిసినా మీరు చాలా కష్టపడుతున్నారు. మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతున్నారు. మీరు పెట్టే మీటింగుల్లో ఏ విషయమూ తేలక టెన్షన్ పడుతున్నారు. ఆ విషయం మంత్రుల బృందం మీటింగ్స్ ముగిశాక మీరు మీడియాతో మాట్లాడే పద్ధతి చెప్పకనే చెబుతోంది. బుధవారం జరిగిన జీవోఎం సమావేశం చాలా కీలకమైందని వార్తలు రావడంతో యావత్ తెలుగు ప్రజలు, మీడియా ఉత్కంఠని చవిచూశారు. సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత వున్న మీడియా మీరు సమావేశ మందిరం నుంచి బయటకి రాగానే లోపలేం జరిగిందని అడిగింది. లోపలేం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత వున్న మీరు మీడియా మీద చిరాకుపడ్డట్టు మాట్లాడారు. బుధవారం నాటి మీటింగ్ జీఓఎం చివరి మీటింగ్ అని గతంలో మీరే ఒకసారి చెప్పారు. మళ్ళీ మీరే మరికొన్ని మీటింగ్స్ వుంటాయని చెప్పారు. మీరు సృష్టించిన కన్ఫ్యూజన్ తొలగించే ఉద్దేశంతో మీడియా మిమ్మల్ని ఇంకా మీటింగ్స్ వుంటాయా అని అడిగింది. మీరు ఉంటాయనో, ఉండవనో చెబితే సరిపోయేది. అలా కాకుండా చాలా అసహనంగా ‘‘ఇంకా పది మీటింగ్స్ వుంటాయి. ఇప్పుడు సంతోషమేనా?’’ అన్నారు. మీడియా అడిగిన ఏ ప్రశ్నకీ సరైన సమాధానం ఇవ్వకుండా చిరాకుగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే మాకు ఏమర్థమైందంటే, వయసు పైబడిన మీకు బీపీ బాగా పెరిగిపోయింది. దాన్ని అర్జెంటుగా కంట్రోల్ చేయాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ విభజన లాంటి అసాధ్యమైన పనిని సోనియాగాంధీ మీ నెత్తిన పెట్టింది. పాపం మీకు బీపీ పెరగకుండా ఎలా వుంటుంది? రాష్ట్ర విభజన అవుతుందో, అవదో తర్వాతి సంగతి... ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేసుకోండి షిండే తాతయ్యా! ఇట్లు.. -ఆంధ్రప్రదేశ్ బాలబాలికలు                                                                                                               

Why Ashok Babu wants to start agitation after Dec.20th?

  It appears APNGOs’ President P.Ashok Babu has honestly told about his interest in joining active politics. His plan to launch aggressive Samaikyandhra agitations after December 20th instead from the day, when T-Bill is introduced in state Assembly indicates the same.   Speaking to Simhapuri University students at Nellore on Wednesday, he said “Seemandhra MPs and Union Ministers have agreed to divide the state as they are lured with minister posts and packages. They are confirming the division of the state even before the Assembly and Parliament pass the Telangana bill. Hence, I request you all to be prepared for intensive agitations that may begin any time after December 20th. It will be conducted in a massive scale, in which both private and public organizations may participate.”   If, he is sure about the timing of his agitations, then, then he is also might be providing sufficient time for Telangana bill approval in the Parliament, the way CM Kiran Kumar Reddy is co-operating with his high command by waiting for the bill to come to state Assembly.   Once, the state is officially divided, everyone knows that there is no use of conducting agitations at any scale, except for gaining political mileage from them. The way TRS has emerged as strongest party with its agitations and sentiment, it appears Ashok babu also would like to apply the same principle for his political growth.   If he is sure about this December 20th muhurath, then it may not only facilitate himself but also CM Kiran Kumar Reddy as well. If reports are to be believed, CM Kiran is going to launch in a new political party to continue his fight for Samaikyandhra.   After seeing Ashok Babu’s timing for starting second phase of Samaikyandhra agitations, it looks like they both are going to join hands and launch a new political party. If so, it is very hurting to see them build their political future playing on people’s sentiments and putting their lives at stake.

రేణుక శవరాజకీయం!

      రేణుకా చౌదరి శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వేరే ఎవరి శవాన్నో కాకుండా తన శవాన్నే ఉపయోగించుకుంటున్నారు. భద్రాచలం తెలంగాణలోనే వుండాలని, భద్రాచలాన్ని ఎవరైనా తీసుకెళ్ళాలని అనుకుంటే తన శవం మీద నుంచి తీసుకెళ్ళాలని రేణుక సంచలన వ్యాఖ్యలు చేశారు.   భద్రాచలం జోలికి ఎవరైనా వస్తే తన తడాఖా ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పుట్టి పెరగకపోయినా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ ‘భద్రాచలాన్ని సీమాంధ్రకి ఇచ్చే సవ్వాలే లేదు’ అని నొక్కి వక్కాణించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ఏమైనా చేస్తారు.. దేనినైనా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేణుకా చౌదరి ఈ వర్గానికి చెందిన నాయకురాలేమోనన్న సందేహాలు ఆమె మాటల్ని వింటే కలుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం చేసిన పాపాన పోని రేణుక ఇప్పుడింత సడెన్‌గా భద్రాచలం విషయంలో ‘శవం’ వరకూ వెళ్ళడానికి గల కారణాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే రేణుక ఇలాంటి పవర్‌ఫుల్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తెలంగాణ ఆడపడుచు కాని రేణుకా చౌదరి గతంలో ఎన్నడూ తెలంగాణ అనుకూల ఉద్యమంలో పాల్గొనలేదు. గతంలో ఖమ్మం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రేణుక ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా వున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేయని రేణుకా చౌదరిని ఖమ్మం స్థానం నుంచి దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం నుంచి రేణుక పోటీ చేయాలంటే రేణుక తన బర్త్ సర్టిఫికెట్ చూపించాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమాత్రం పాలు పంచుకోని రేణుకకు ఖమ్మం సీటు ఇవ్వరాదన్న డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాను కూడా తెలంగాణ వాదినేనని కలరింగ్ ఇచ్చుకోవడం కోసం, తెలంగాణ ప్రజల్లో మంచి మార్కులు సంపాదించడం కోసమే రేణుక భద్రాచలం తెలంగాణదే అంటూ నినదిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారికి చెక్ పెట్టడం కోసమే రేణుకా చౌదరి ‘శవం’ స్థాయిలో వ్యాఖ్యానించారని అంటున్నారు.

అంత ఎటకారం వద్దు!

      తెలంగాణ రాజకీయ నాయకులకు సీమాంధ్ర ప్రజలంటే మరీ చులకనగా వున్నట్టుంది. అందుకే సీమాంధ్రులతో ఎటకారాలు పోతున్నారు. ఆ ఎటకారాలు కూడా అట్టాంటిట్టాంటి ఎటకారాలు కావు.. కడుపులో మండిపోయే ఎటకారాలు! అసలే అన్యాయంగా, ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసేస్తున్నారని రగిలిపోతున్న సీమాంధ్రుల మీద తెలంగాణ నాయకులు తమ మాటల పెట్రోలు పోస్తూ మరింతగా రగిలిపోయేలా చేస్తున్నారు.   నాలుకలు కోస్తాం, తరిమికొడతాం అంటూ బెదిరించే వెటకారాలు కొన్ని అయితే, శాంతియుతంగా మాట్లాడినట్టు కనిపించే సుతిమెత్తని ఎటకారాలు కొన్ని! ఇప్పుడు సీమాంధ్రులు హైదరాబాద్‌లో అడ్డంగా ఇరుక్కుపోయారు కాబట్టి మనమేం మాట్లాడినా చచ్చినట్టు ఊరుకుంటారన్న నిర్లక్ష్యం తెలంగాణ రాజకీయ నాయకులలో కనిపిస్తోంది. కేంద్రమంత్రి బలరాం నాయక్ తాజాగా చేసిన కామెంట్లు ఈ కోవకు చెందినవే. ఇంతకీ ఘనత వహించిన బలరాం నాయక్ గారు ఏమన్నారంటే, ప్రస్తుతానికి సీమాంధ్రులు తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఒప్పేసుకోవాలట. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను ఎంతమాత్రం వ్యతిరేకించకుండా రాష్ట్ర విభజనకు సహకరించాలట.  తెలంగాణ వచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత అవసరమనుకుంటే సీమాంధ్ర, తెలంగాణ మళ్ళీ కలసిపోవాలట. ఇలాంటి పనికిమాలిన ప్రపోజల్ పెట్టడానికి బలరాం నాయక్ గారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. తెలంగాణ నాయకులకు తమ తెలివితేటలు ప్రదర్శించడానికి, ఏ మాట పడితే ఆ మాట అనడానికి సీమాంధ్రులు తేరగా దొరికినట్టున్నారు. సీమాంధ్రుల దగ్గర మరీ అంత ఎటకారాలొద్దు మినిస్టర్ గారూ!