రాజమండ్రి మళ్ళీ మురళీమోహన్ కే

        తూర్పు గోదావరి జిల్లలో వస్తున్నా మీ కోసం యాత్ర చేస్తున్న చంద్రబాబు రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. మూడు పార్లమెంటు స్థానాలకు గాను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి గత ఎన్నికల్లో ఓడిపోయిన సినీ నటుడు మురళీమోహన్ ను, అమలాపురం స్థానానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ప్రకటించారు. తాను తిరిగి రాజమండ్రి నుండి పోటీ చేస్తానంటున్న మురళీమోహన్ అభ్యర్థిత్వాన్ని కూడా ముందే ఖరారు చేసుకుని ఏడాది ముందే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్ లోకి వెళ్లి, మళ్లీ టీడీపీలోకి వచ్చిన గొల్లపల్లిని ఎంపీ స్థానానికి ప్రకటించడం వ్యూహాత్మకంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర జిల్లాలో ముగిసేలోపు కాకినాడ ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

వై.ఎస్.ఆర్.సి.పి. లో చేరనున్న కూన శ్రీశైలం

  కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ వై.ఎస్.ఆర్.సి.పి.లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూన శ్రీశైలం గౌడ్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ కు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్ట్టబెట్టారు. 2002-07 వరకు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ ను ములాఖత్ సమయంలో కలుసుకుని మంతనాలు జరిపారు. నియోజకవర్గంలోని బస్తీ నాయకులతో పలుమార్లు సమావేశమైన శ్రీశైలం వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన వైఎస్సార్సీపీ పార్టీలు చేరుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఐరాస ఆమోదం పొందిన శ్రీలంకపై తీర్మానం

  శ్రీలంకలో మానవ హక్కుల మండలి ఉల్లంఘనపై అమెరికా నేతృత్వంలో  తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 47 సభ్యదేశాలు ఉన్న మండలి గురువారం ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా భారత్ సహా 25 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, పాకిస్తాన్తో పాటు 13 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశారు, 8 ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో మానవ హక్కుల మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర, విశ్వసనీయ దర్యాప్తు నిర్వహించాలని, 2009లో ఐరాస  శ్రీలంక మానవహక్కుల మండలికి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, దీర్ఘకాలం కొనసాగిన సంక్షోభం ముగిసిన తరువాత తమిళులతో పాటు అన్ని వర్గాల అంగీకార యోగ్యమైన రాజకీయ పరిష్కారాన్ని అమలు చేయడానికి శ్రీలంకకు ఇదొక అపూర్వమైన అవకాశం అని భారత శాశ్వత ప్రతినిధి దిలీప్ సిన్హా శ్రీలంకకు హితబోధ చేశారు.

నేటి నుండే ఎస్.ఎస్.సి. పరీక్షలు ...

  శుక్రవారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు ఎస్.ఎస్.సి. పరీక్షలు ప్రారంభంకానున్నాయి.హైదరాబాద్ జిల్లాకు మాసాబ్ ట్యాంక్ బిఇడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం.రాధారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు ఆర్.ఎం.ఎస్.ఎ. జేడీ రాఘవేందర్ రాఘవేందర్ పరిశీలకులుగా నియమితులయ్యారు. వీరిద్దరూ పరీక్షల నిర్వహణపై గురువారం అధికారులతో సమీక్ష జరిపారు. జంటనగరాల్లోని 784 కేంద్రాలలో 1.75 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హైదరాబాద్ జిల్లా నుండి 81,867 మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లా నుంచి 93,777మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని వసతులు ఉన్న పాఠశాలలానే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఘాటైన విమర్శలతో చంద్రబాబు పాదయాత్ర

  వస్తున్నా మీకోసం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండోరోజు పాదయాత్ర సందర్భంగా టి.ఎన్.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ్ముళ్ళూ లక్షకోట్ల రూపాయల అవినీతి సొమ్మును సంపాదించినవారు, చంచల్ గూడ జైలుకి వెళ్ళిన నాయకులు మీకు ఆదర్శం కాకూడదు. ఎన్టీఆర్, అల్లూరి వంటి నాయకులను ఆదర్శంగా తీసుకోండి. మీ తెలివితేటలను, శ్రమను నమ్ముకుని పైకెదగండి అని పిలుపునిచ్చారు. కోరుకొండ రోడ్డులో టి.ఎన్.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యువజనుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలే కానీ చేతల్లేవు, రాజీవ్ యువకిరాణాలు అంటూ పదిహేను లక్షల ఉద్యోగాలిస్తానని వాగ్దానం చేసి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలిచ్చాడో మీ అందరికీ తెలుసు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

వేటుకు సిద్ధం ... కాంగ్రెస్

  శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ సభ్యులు 9 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రశేఖర రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఆళ్ళ నాని, పేరని నాని, జోగి రమేష్, ఎం.రాజేష్, బూచేపల్లి శివప్రసాద రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడ్డారు. బుధవారం హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఈ తొమ్మిదిమందిపై వేటు వేయాల్సిందేనని తీర్మానించారు. నిబంధనల ప్రకారం సంఘటన జరిగిన పదిహేను రోజుల్లో స్పీకర్ కు ఫిర్యాదు చేయాల్సి ఉండడంతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ గురువారం ఢిల్లీ లోని ఆజాద్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ తొమ్మిదిమంది పై ఒకటి రెండు రోజుల్లో స్పీకర్ కు ఫిర్యాదు చేసే అవకాశం వుంది. వీరిపై వేటు జూన్ నెలలో ఉండవచ్చని తెలుస్తుంది.

చేతులు జోడించిన సోనియా ... శాంతించిన ములాయం

  సమాజ్ వాదీ పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించిన బేణీ ప్రసాద్ వర్మ ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్లమెంటులో బేణీ ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. దీంతో ఎస్పీ నేతలు బేణీ ప్రసాద్ వర్మను కేబినేట్ మంత్రి హోదా నుండి తొలగించాలని, ములాయం సింగ్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ములాయంకు నచ్చజెప్పడంతో పాటు లోక్ సభలో సోనియా బుధవారం చేతులు జోడించి బేణీప్రసాద్ రాజీనామాకు పట్టుపట్టరాదనీ ములాయంను కోరింది. దీంతో ములాయం కాస్త వెనకడుగు వేశారు. అసలే డిఎంకే యూపీఏ కు తమ మద్ధతు ఉపసంహరించుకున్న తరుణంలో 22 మంది సభ్యులున్న సమాజ్ వాదీ పార్టీ కీలకంగా మారింది. ఇప్పట్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే సూచనలు లేకపోవడంతో ములాయం సరైన సమయంకోసం ఎదురు చూస్తున్నారు. బేణీ ప్రసాద్ వర్మ కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల నాథ్ తో కలిసి మీడియా సమావేశంలో ములాయంపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు.

సంజయ్ దత్ కు క్షమాభిక్షకై అభ్యర్థన

  1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ళలో నిందుతుడుగా, అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడన్న మిషపై టాడా కోర్టు సంజయ్ దత్ పై కేసు ఫైలు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా పద్దెనిమిది నెలలు సంజయ్ దత్ కారాగారంలోనే గడిపారు. తరువాత బెయిల్ పై విడుదలైన సంజయ్ దత్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఉన్నారు. తాజాగా గురువారం సుప్రీంకోర్టు సంజయ్ దత్ కు ఆరేళ్ళ జైలుశిక్షను ఐదేళ్ళకు కుదించి శిక్షను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టీస్ మార్కండేయ కట్టూ సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్ర గవర్నర్ కె. సత్యనారాయణన్ ను కోరుతూ ఒక లేఖ రాశారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం కింద క్షమాభిక్ష ప్రసాదించవచ్చని మార్కండేయ కట్టూ ఈ లేఖలో గవర్నర్ కు సూచించారు.

కాంగ్రెస్ ఘన చరిత్రలో సీబీఐ అధ్యాయం

  125 సం.ల చరిత్ర కలిగిన పార్టీ మాదని కాంగ్రెస్ నేతలు అందరూ గర్వపడటం మనం నిత్యం చూసేదే. అయితే, అంత ముసలిదయిపోయింది గనుకనే అంత ముసలి ఆలోచనలు చేస్తోందని విమర్శించేవారు లేకపోలేదు.   తనకు మద్దతు ఇచ్చినంత కాలం సదరు పార్టీలను ఖాతరు చేయక ఒంటెత్తు పోకడలు పోవడం, వారు మద్దతు ఉపసంహరిస్తే వారిని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్, ఆదాయపన్ను శాఖా వంటి సంస్థల చేత కేసులు పెట్టించి ముప్పతిప్పలు పెట్టడం వంటి దుర్లక్షణాలు అన్నీకలిగి ఉన్నకాంగ్రెస్ పార్టీ, తన ఘన చరిత్రలో ఇప్పుడు కొత్తగా సీబీఐ అనే ఒక అద్యాయాన్ని కూడా జోడించుకొంది. తవ్విన కొద్ది గుట్టలు గుట్టలు బయటపడే అటువంటి అంశాలన్నిటినీ పేర్కొనాలంటే ప్రత్యేకంగా మరో చరిత్ర అవుతుంది.   మన రాష్ట్రానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డితో సీబీఐ ఆడుకొంటున్నతీరు అందుకు ఒక మంచి నిదర్శనం కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి తలాక్ చెప్పి బయటకొచ్చిన ఓవైసీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గుణ పాఠం చెప్పిందో అందరికీ తెలుసు.   మాజీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి తన పదవిలో మళ్ళీ పునర్నియామకం అవుతున్న నిమిషంలో ఆదాయపు పన్నుశాఖ వారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వేసిన పాచికకు ఆయన ఓడిపోయాడు. కానీ ఆ తరువాత ఆదాయపన్ను శాఖ కూడా మరి ఆయనను పట్టించుకొన్న దాఖలాలు లేవు. ఎందుకంటే, దాని లక్ష్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్న నితిన్ గడ్కారి (కూడా) ఒక అవినీతి పరుడని నిరూపించడం మాత్రమే. కానీ, తొందరపడి కూసిన కోయిలలా కాంగ్రెస్ ముందే విసిరిన ఆ పాచిక వలన బీజేపీకి నష్టం జరుగకపోగా మేలే జరిగింది. ఒక అవినీతి పరుడయిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసుకొని ఎన్నికల సమరాంగణంలో దూకడం ఆ పార్టీకే నష్టం కలిగించేది. కానీ, కాంగ్రెస్ చేసిన మేలు వలన అది ఆయన స్థానంలో మచ్చలేని రాజ్ నాథ్ సింగును ఎన్నుకోగలిగింది.   ఒకవైపు ములాయం సింగు( సమాజ్ వాది) మరో వైపు మాయావతి (బహుజన్ సమాజ్ వాది) ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ తమని సీబీఐ చేత బెదిరిస్తూ మద్దతు పొందుతోందనే రహస్యం మీడియావారి చెవుల్లో చాలా కాలంగానే వేస్తున్నారు, కానీ ఈ రోజుల్లో చేయి మెలిక పెట్టకుండా అటువంటి వారిని లొంగదీయలేమని కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయం.   ఇక ములాయం సింగు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు డబ్బు తీసుకొంటున్నాడని, గౌరవనీయులయిన కేంద్ర మంత్రి వర్యులు బీణా వర్మగారు ఒక చక్కటి బహిరంగ రహస్యం పార్లమెంటులో చెప్పినపుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ, అటువంటి దేవరహస్యాలు ఇలాగ బహిరంగంగా ఎవరయినా చెప్పుకొంటారా అని ఊగిపోయారు.   ఇక తమిళ తంబి కరుణలేని కరుణానిధి యుపీయే ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించి ఇంటికి చేరుకొనే లోగానే సీబీఐ వారు ఆయనకీ గుమ్మంలోనే ఎదురయ్యారు. ఆయన కొడుకు స్టాలిన్ విదేశాల నుండి తెచ్చుకొన్న విలసవంతమయిన కార్లకి పన్ను కట్టలేదంటూ ఈ రోజు ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. కానీ, చెన్నై చిదంబరం కన్నెర్ర చేయడంతో సీబీఐ వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. సీబీఐ వారు చెపుతున్న కుంటిసాకుల సంగతి ఎలా ఉన్నా, వారు సోదాలు నిర్వహించిన సమయం, సందర్భం చూస్తే, వారి వెనుక కాంగ్రెస్ ఉందని అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చరిత్రలో ఇటువంటి అధ్యాయాలు మరిన్ని మనం చూడాలో తెలియదు.

సడక్ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యేల అరెస్ట్

  టి.ఆర్.ఎస్. టి.జెఎసి ఇతర పార్టీలు కర్నూల్-హైదరాబాద్ నేషనల్ హైవే సడక్ బంద్ కు పిలిపునిచ్చారు. ఆలంపూర్ లో తెలంగాణావాదులు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. వాహనాలను అడ్డుకుంటున్న ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన తెలంగాణా వాదులు పోలీసు వాహనాలపై రాళ్ళ వర్షం కురిపించారు. షాద్ నగర్ వద్ద కల్వకుంట్ల తారక రామారావును, కొత్తకోటలో భిక్షపతి యాదవ్, సమ్మయ్య, రాజయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలా తమను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం దారుణమని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని, తెలంగాణా ఇస్తామని చెప్పి మాట మార్చిన వారిపై కేసులు నమోదు చేయాలని, తెలంగాణా ఉద్యమాన్ని ఎంత అణచాలనుకున్నా ఉద్యమం మరింత ఉధృతమౌతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

సిబీఐ సోదాలకు బ్రేక్

  డీఎంకే యూపీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఎం.కె. స్టాలిన్ నివాసం, ఆయన వ్యక్తిగత కార్యదర్శి నివాసాల్లో సీబీఐ జరుపుతున్న సోదాలు నిలిపివేశారు. విదేశీ కార్ల దిగుమతి సుంకం చెల్లింపు విషయంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిబీఐ గురువారం స్టాలిన్ నివాసంపై దాడులు చేసి సోదాలు నిర్వహించింది. డిఎంకే యూపీఏ నుండి వైదొలగడంతో పాటు ఐదుగురు మంత్రులు రాజీనామా కూడా చేశారు. యూపీఏ ప్రభుత్వానికి బయటనుండి కూడా మద్ధతు ఇవ్వబోమని కరుణానిధి స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కూడా సిబీఐ దాడులకు నిరసన తెలపడంతో యూపీఏ ప్రభుత్వం సిబీఐణి తక్షణమే సోదాలు నిలిపివేయాలని సిబీఐని ఆదేశించడంతో సిబీఐ సోదాలు ఆపి వెనక్కి వెళ్ళిపోయారు.

కేవీపీ పాత్రపై సిబీఐ దర్యాప్తు

  జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు పాత్రపై సిబీఐ కూపీ లాగుతోంది. వై.ఎస్. హయాంలో ప్రభుత్వ నిర్ణయాల్లో కేవీపీ హస్తం కూడా ఉండవచ్చని సిబీఐ అనుమానిస్తుంది. జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మంత్రులు, ఐఏఎస్ ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుజ్ఞ్ది వివరాలు తీసుకున్న సిబీఐ కేవీపీ గురించి అధికారిక సమాచారం కోరడం ఇదే ప్రథమం. మొదటిసారి వై.ఎస్. ప్రభుత్వం ఏర్పడినప్పుడు వై.ఎస్. కేవీపీణి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సలహాదారుగా ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించారు. వై.ఎస్. సమక్షంలో జరిగే కీలక సమావేశాల్లో ఆయన కూడా పాల్గొనేవారు. ఎమ్మార్ విల్లాల విక్రయాల వ్యవహారంపై కేవీపీని పిలిచి విచారించిన సిబీఐ తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులోనూ దృష్టి సారించి కేవీపీకి సంబంధించిన పూర్తీ సమాచారాన్ని సిబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సిబీఐ అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధపడుతోంది.

మే 5న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు

  బుధవారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమీషనర్ వి.ఎస్. సంపత్  మాట్లాడుతూ కర్ణాటక శాసనసభకు మే 5న ఒకే దశలో ఎన్నికలు జరపాలని, కర్ణాటకలోని 224 శాసన స్థానాలకు జరిగే ఎన్నికలకు బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల్లో ధనం, కండబలాన్ని నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, వార్తా కథనాల రూపంలో వచ్చే పరోక్ష ప్రకటనల పైనా నిఘా ఉంటుందని, ఆస్తులు, అర్హతలు, నెర చరిత్రకు సంబంధించి ఒకే అఫిడవిట్ ను రూపొందించినట్లు, పోలీసు అధికారులను సొంత జిల్లాల్లో ఉండనీయబోమని, ఒకేచోట మూడేళ్ళుగా పనిచేస్తున్న పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని, తగినన్ని బలగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 17, నామినేషన్ల పరిశీలన  ఏప్రిల్ 18న, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 20 ఆఖరు తేదీ అని ప్రకటించారు. ఎన్నికలు మే 5న నిర్వహిస్తారు. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కూడా తెలిపారు.

ప్రపంచంలోనే తొలిసారి ... భారత్ కే సాధ్యం

  నీటిలోపల సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైల్ ని ప్రయోగించడం ప్రపంచంలోనే తొలిసారి. భారత్ - రష్యా దేశాల సంయుక్తంగా అభివృద్ధి చేసిన 290కిలోమీటర్ల పరిధిని చేరుకునే  బ్రహ్మోస్ క్షిపిణిని విశాఖ తీరంలోని సబ్ మెరైన్ నుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరిశీలించారు. బ్రహ్మోస్ క్షిపిణి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ సిఈవో మాట్లాడుతూ వ్యూహం రచించిన యుద్ధ వాతావరణంలో భాగంగా బంగాళాఖాతం జలాల్లోని సబ్ మెరైన్ నుండి ఉదయం 9-30నిముషాలకు బ్రహ్మోస్ క్షిపిణి దూసుకెళ్ళింది. 'ఎస్' ఆకారంలో విన్యాసం చేస్తూ నీటికి ఒక మీటర్ ఎత్తులో ప్రయాణించి లక్షిత నౌకను ధ్వంసం చేసింది. వర్టికల్ లాంచ్ కాన్ఫిగరేషన్ లో సబ్ మెరైన్లలో అమర్చడానికి బ్రహ్మోస్ క్షిపిణి సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది, ఈ ప్రయోగంలో క్షిపిని పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం

  బుధవారం సిఎం కార్యాలయంలో తెలంగాణా మంత్రులు శ్రీధర్ బాబు, సునితా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ ను సడక్ బంద్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా వారు కోరగా ముఖ్యమంత్రి సమాధానమిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సడక్ బంద్ కు అనుమతి ఇవ్వలేమని, ఇలాంటి కార్యక్రమాలకు గతంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వెళ్ళలేమని, ఈ విషయంలో అందరి సలహాలు తీసుకుంటామని, మీడియా ఇచ్చే సూచనలు కూడా స్వీకరిస్తామని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సడక్ బంద్ కు అనుమతి లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది విరుద్ధమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 8వేలమంది పోలీసులను రంగంలోకి దింపామని, మహబూబ్ నగర్ జిల్లాలో 2700 మందిని బైండోవర్ చేశామని, కర్నూలు సరిహద్దు నుండి శంషాబాద్ వరకూ పోలీసు సిబ్బందిని మోహరించామని, ఈ ప్రాంతమంతా 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నాడని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. హైవే పైకి ఎవరూ ఆందోళన చేయడానికి రావద్దని, అలా వస్తే వారిని అదుపులోకి తీసుకుంటామని హైదరాబాద్ రేంజ్ డిఐజీ నాగిరెడ్డి అంటున్నారు.

సడక్ బంద్ పై ఢీ అంటే ఢీ

  తెలంగాణా రాష్ట్ర సాధనకోసం టిజెఎసి, టి.ఆర్.ఎస్. కలిసి చేస్తున్న ఉద్యమాలలో భాగంగా నేడు ఉదయం ఏడు గంటలనుండి రాత్రి ఏడు గంటల వరకు హైదరాబాద్-కర్నూలు హైవేపై సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. టి.ఆర్.ఎస్., టి.జెఎసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెపుతుండగా అటు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలనే యోచనలో వుంది. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారి మార్గంలో శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు జెఎసిలోని రాజకీయ పార్టీలు టి.ఆర్.ఎస్., బిజెపి. న్యూడెమోక్రసీ, ఉద్యోగ-ప్రజాసంఘాల నేతలు ఇప్పటికే మొహరించారు. సడక్ బంద్ కోసం టి.ఆర్.ఎస్. ఐదు కేంద్రాలను గుర్తించింది. ఆ ఐదు కేంద్రాలు శంషాబాద్, జడ్చర్ల, భూత్పూర్, కొత్తపేట, ఆలంపూర్. ఆలంపూర్ వద్ద టి.ఆర్.ఎస్.ఎల్సీ. ఉపనేత ఈటెల రాజేందర్, జెఎసి చైర్మన్ కోదండరాం, పాలమాకుల వద్ద టి.ఆర్.ఎస్.ఎల్సీ. నేత టి.హరీష్ రావు, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఇన్ చార్జులుగా ఉన్నారు.