తెలంగాణ సమస్య మండే అగ్ని లావా

        కల్వకుర్తిలో 17 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ తపస్సు చేశానని, కల్వకుర్తి ప్రజలకు రుణపడి ఉంటానని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకు చేరుకున్న ఆయన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి తనకు రాజకీయా పాఠశాల అని, పుస్తకాలు చదివి రాజకీయాలు చేయలేరని ఆయన తెలిపారు. తెలంగాణ మండే అగ్ని లావాలా ఉందని, అప్పుడప్పుడు జ్వాలలు ఎగసి పడుతున్నాయని జైపాల్ రెడ్డి అన్నారు.కేంద్రంలో అధికార పార్టీ పక్షాన మంత్రిగా ఉన్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు. తెలంగాణపై తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్ దృతరాష్ట్రుడు

        వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ దృతరాష్ట్రుడు... మహాభారతంలో దృతరాష్ట్రుడిలాగే వైఎస్ కూడా తన కుమారుడితో అక్రమాలు చేయించాడు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వారి దోపిడీతో పేదలకు దక్కాల్సిన నిధులు మాయమయ్యాయి. అయితే అన్యాయం ఎంతో కాలం సాగదు. వైఎస్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలమీద మా పార్టీ పోరాటం చేస్తుంది. చివరికి ధర్మం గెలుస్తుంది. ఈ ధర్మపోరాటానికి తెలుగుదేశం పార్టీకి ప్రజలు సహకరించాలి” అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేవీపీ రాంచంద్రరావును విచారిస్తే వైఎస్ అక్రమాలన్ని బయటకు వస్తాయని, రాజకీయాలకు వైఎస్ కుటుంబం చెడ్డ పేరు తెచ్చిందని అన్నారు. మతం ముసుగులో వైఎస్ అల్లుడు, కల్తీ ఎరువులతో వైఎస్ బావమరిది, అక్రమ ఆస్తులతో వైఎస్ జగన్ రాజకీయాల బ్రష్టుపట్టించారని అన్నారు.

కోదండరామ్ ఉద్యోగం ఊడనట్లే

        తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగం విషయంలో చాలా రోజులుగా వివాదం నడుస్తుండటం తెలిసిన విషయమే. ఒకవైపు ప్రభుత్వం నుంచి జీతం అందుకుంటూనే…ఈ ప్రభుత్వానిది దురహాంకారమని, దుర్మార్గపు ప్రభుత్వమని కోదండరాం విమర్శిస్తారని, ఆయన ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయితే కోదండరాం మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు! అయితే తాజాగా సడక్ బంద్ విషయంలో ఆయన అరెస్టవ్వడం, జైలులో గడపాల్సి రావడంతో ఆయన ఉద్యోగం ఇంతటితో ఠాం అనే విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా 48 గంటల కు మంచి జ్యూడిషియల్ కస్టడీలో ఉంటే వారు ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతారు. అయితే అదృష్టం కొద్దో, లేక ఏమైనా లాబీయింగ్ ఫలితమో కానీ… ఆ 48 గంటలు గడవకుండానే కోదండరాం విడుదల అయ్యారు. ఉద్యోగాన్ని కాపాడుకున్నారు. ఈసారి కూడా తన ఉద్యోగం గురించి కోదండరాం ఏమీ మాట్లాడలేదు.

సెంచరీ చేసిన షర్మిల

  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల గత ఏడాది అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయలో మొదలు పెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయత్రకు ఆదివారంతో 100 రోజులు పూర్తయ్యాయి. 14 వందల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ఆమె ఇప్పటివరకు 7 జిల్లాలలో, 43 అసెంబ్లీ నియోజకవర్గాలు, 750 గ్రామాలలో ప్రజలను కలిసారు. మద్యలో మోకాలి గాయానికి శస్త్రచికిత్స నిమిత్తం రెండు నెలలు విశ్రాంతి తీసుకొన్న ఆమె, తిరిగి తన పాదయాత్రను ఫిబ్రవరి 6న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ నుంచి మొదలుపెట్టి నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా(యంయల్సీ ఎన్నికల వలన మద్యలో రెండు రోజులు పాదయాత్రకు విరామం ఈయవలసివచ్చింది.) తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆమెకు పాదయాత్ర 100రోజులు పూర్తైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం గుంటూరు జిల్లా మంగళ గిరిలో బస్టాండ్ సెంటరు వద్ద ఒక భారీ బహిరంగ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది. ఆ సభలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మరియు ఆ పార్టీ నేతలు పాల్గొంటారు.

టిడిపి ఎమ్మెల్సీ యాదగిరి కన్నుమూత

  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి గుండెపోటుతో కన్నుమూశారు. శాసన మండలి సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. దాదాపు ఏడాది కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో యాదగిరి బాధపడుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో.. శనివారం సాయంత్రం 6.45 నిమిషాలకు స్వగృహంలోనే కన్నుమూశారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు జయరాం ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. పొగాకు యాదగిరి మరణం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి యాదగిరి క్రియాశీలకంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. యాదగిరి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. యాదగిరి మృతికి సీఎం కిరణ్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, టీడీపీ నేతలు దేవేందర్ గౌడ్, టీఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు సంతాపం తెలిపారు.  

దోచుకో..దాచుకో అన్నది కాంగ్రెస్‌ నీతి: బాలయ్య

        'బతుకు, బతికించు.. పది మందిని బతికించుకోవడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలన్నది టిడిపి సిద్ధాంతమైతే, 'దోచుకో, దాచుకో...అవసరమైతే పది మందిని చంపించు' అన్నది నేటి కాంగ్రెస్‌పాలకుల నీతి అని సినీహీరో, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి టీడీపీ పుట్టిందన్నారు. అలాంటి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, నేతలు శ్రమించాలని పిలుపునిచ్చారు. జాబ్ రావాలన్నా, బతుకు బాగుండాలన్నా బాబు గెలవాలని అన్నారు. తాను ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ మండలంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు.

కేవీపీని 8గంటలు ప్రశ్నించిన సీబీఐ

  జగన్ అక్రమాస్తుల కేసులో రాజ్యసభ సభ్యడు కె.వి.పి. రామచంద్రరావును సీబీఐ శనివారం నాడు దాదాపు 8 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆయన మద్యాహ్నం భోజనం సీబీఐ ఆఫీసులోనే చేశారు. పొద్దున్న 11 గంటలకు మొదలయిన సీబీఐ విచారణ రాత్రి 7.30 వరకు సాగడంతో ఆయన బాగా అలసిపోయినట్లు కనిపించారు. అయినప్పటికీ, సీబీఐ ఆఫీసు నుండి బయటకి రాగానే, మీడియాతో కొంత సేపు మాట్లాడారు. తనను కేవలం సెక్షన్ 160 క్రింద సాక్షిగా మాత్రమే పిలిచారని ఆయన తెలిపారు. తనకు తెలిసిన సమాచారం అంతా సీబీఐకు తెలియజేసానని, అవసరమయితే మళ్ళీ వచ్చి సీబీఐకి సహకరించేందుకు కూడా తానూ సిద్ధంగా ఉన్నానని ఆయన మీడియాకు తెలిపారు. కానీ, కేసు విషయంలో ఏమేమి అడిగారు, తనేమి చెప్పారో వంటి విషయాలను మాత్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. సీబీఐ జాయింటు డైరెక్టరు లక్ష్మి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, కేవీపీ నుండి తమకు అవసరమయిన సమాచారాన్ని సేకరించామని, అవసరమయితే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. జగన్ కేసు ముగించడానికి సుప్రీం కోర్టు నిర్దిష్టమయిన గడువు పెట్టిన విషయాన్ని మీడియా ఆయనకు గుర్తుచేసి, ఆ కేసు ఎప్పటిలోగా ముగిస్తారని అడిగినప్పుడు, ఆయన సుప్రీం కోర్టు ఏమి చెప్పిందో వెబ్ సైటులో స్పష్టంగా ఉందని, వివరాలు కావలసిన వారు సదరు వెబ్ సైటును చూసుకోవచ్చునని ఆయన అన్నారు. తనకు తెలిసి మరెవరికీ సమన్లు జారీ చేయలేదని ఆయన అన్నారు.

కోదండరామ్, ఈటెలకు బెయిల్

        సడక్ బంద్ లో భాగంగా అరెస్టైన 8 మంది నేతలకు అలంపూర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండ రామ్, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష ఈటెల రాజేందర్ ,ఎమ్మెల్యే జూపల్లె కృష్ణారావు,మాజీ ఎమ్.పి జితేందర్ రెడ్డి, శ్రీనివాస గౌడ్ లతో సహా ఎనిమిది మందికి 10 వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోదండ రామ్ తో పాటు సడక్ బంద్ లో పాల్గొన్న 11మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 8 మందికి ఈ రోజు బెయిల్ మంజూరు అయ్యింది. ఇవాళ్ళ కోర్టులో లొంగిపోయిన కావేటి సమ్మయ్య, గట్టు తిమ్మప్ప, తుమ్మల రవికు రోజుల రిమాండ్ ను కోర్ట్ విదించింది.

అసమ్మతి నేతలపై వేటుకి కాంగ్రెస్ పిర్యాదు

  ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ దైర్యం చేసి 9 మంది అసమ్మతి శాసన సభ్యులకు వ్యతిరేఖంగా ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి పిర్యాదు చేసింది. పార్టీకి వ్యతిరేఖంగా పనిచేస్తున్న ఆ 9 మందిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ గండ్రవెంకటరమణారెడ్డి స్పీకర్ ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.   అయితే స్పీకర్ వారిపై వేటువేసినట్లయితే, రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది గనుక, ఆయన నిర్ణయం తీసుకోవడానికి కొంచెం తాత్సారం చేయవచ్చును. ప్రస్తుత అనిశ్చిత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించకపోగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే లాభం కలిగించే అవకాశం ఉంది. గనుకనే, తెదేపా కూడా తన విప్పును దిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన తన 6మంది శాసన సభ్యులపై ఇంతవరకు స్పీకర్ కు పిర్యాదు చేయలేదు.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన 9 మంది శాసన సభ్యులపై వేటు వేసేందుకు సిద్ధం అయితే, అప్పుడు తెదేపా కూడా స్పీకర్ కు పిర్యాదు చేసి మొత్తం 15 స్థానాలకు ఒకేసారి ఉపఎన్నికలు వచ్చేలా చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, అన్ని పార్టీలు కూడా ఉపఎన్నికలను రాబోయే సాధారణ ఎన్నికలకి సెమీ ఫైనల్స్ గా భావించి విజయం సాదించేందుకు తీవ్ర పోరాటం చేయవచ్చును.   అయితే, సాధారణ ఎన్నికలకి కేవలం ఏడాది మాత్రమే సమయం మిగిలిఉన్న ఈ తరుణంలో రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, తెదేపాలు ఉపఎన్నికలు తెచ్చి చేజేతులా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోవచ్చును. ఒకవేళ ఉపఎన్నికలే జరిగి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో రెండు మూడు సీట్లు పెరిగినా అది ఆపార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ప్రజలలో తనకు రాన్రాను సానుభూతి, మద్దతు తగ్గిపోతోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి సరయిన జవాబు చెప్పినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచి పరిణామం కాదు గనుక స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చును.

ఎమ్మెల్యే గానే బాలయ్య పోటి

      2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగానే పోటిచేస్తానని టిడిపి అదినేత చంద్రబాబు వియ్యంకుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా లావుకొత్తూరు మండలానికి చెందిన తునికి సమీపంలోగల తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను సామాన్య కార్యకర్తలాగా చేస్తానని ఆయన అన్నారు. విశాఖ జిల్లాకు చెందిన పాయకరావు పేటలో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు.

తెలంగాణ పై మోసం చేశారు

        శాసనసభలో శనివారం మరోసారి టీఆర్ఎస్ నేత హరీష్‌రావు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, 2004 కంటే ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని నమ్మించి మోసం చేసిందని హరీష్‌రావు విమర్శించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని, సభలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంశం జఠిలమైనదని, కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.  

బాలయ్యబాబు ఎన్నికలో పోటీకి సిద్ధమేనా ?

  ఈ రోజు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లా లావుకొత్తూరు మండలానికి చెందిన తునికి సమీపంలోగల తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ అదేశిస్తే రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన పాయకరావు పేటలో ఆయన స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు.   బాలకృష్ణ గత కొంత కాలంగా పార్టీ రాజకీయ వ్యవహారాల పట్ల కొంత ఆసక్తి కనబరుస్తున్నపటికీ, ఇంతవరకు ఆయన పూర్తి స్థాయి పాత్ర నిర్వహించేందుకు మాత్రం చొరవ చూపలేదు. ఆయన కుటుంబానికి ఎంత రాజకీయ నేపద్యం ఉన్నపటికీ, ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి కనబరుస్తునందున, వ్యక్తిగతంగా ఆయన పార్టీ మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవలసి ఉంది. సాధారణ ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది గనుక, ఆయనకీ నిజంగా రాజకీయాల పట్ల ఆసక్తి గనుక ఉంటే, మరిక జాప్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగి ఈ ఏడాది కాలాన్ని తన ‘రాజకీయ ఎప్రoటిస్’ కాలంగా భావించి తగిన అవగాహన పెంచుకొంటే మంచిది. అది ఆయనకే కాకుండా ఆయన పార్టీకి కూడా మేలు చేయవచ్చును. కానీ, ఆ ప్రయత్నం చేయకుండా ఈ విధంగా ప్రకటనలు చేయడం అసందర్భ ప్రకటనలుగా పరిగణింపబడుతాయి.   కేవలం నందమూరి వంశస్తుడవడమే పార్టీ నుండి టికెట్ ఆశించేందుకు, ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రధాన అర్హతలని భావించకుండా, అందుకు తగిన వ్యక్తినని నిరూపించుకొని పోటీ చేయడమే ఆయనకీ హుందాగా ఉంటుంది.   ఈ విషయంలోరాహుల్ గాంధీను ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఆయనకు ప్రధాని పీఠం అధిరోహించడానికి ఏ అడ్డంకులు లేనప్పటికీ, గత 9 సం.లుగా ప్రజల మద్య తిరుగుతూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొంటూ, తన అవగాహన పెంచుకొంటూ పార్టీని ప్రజలోకి తీసుకు వెళ్లేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. తద్వారా, ఆయన ఇప్పుడు ప్రధాని పదవిని ఆశించకపోయినా, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉత్తరాది ప్రజలు, ముఖ్యంగా యువత ఆయన ఆ పదవికి అర్హుడేనని ఇప్పుడు భావిస్తున్నారు.   అదేవిధంగా, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేయాలనీ భావిస్తున్న బాలకృష్ణ తదితరులు కూడా కనీసం ఈ ఏడాది కాలంలో ప్రజలలో తిరుగుతూ వారితో సంబందాలు మెరుగు పరుచుకోవడం అన్ని విధాల వారికే మేలు కలిగిస్తుంది. లేదంటే, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న వచ్చే ఎన్నికలలో గెలవడం అంత తేలికయిన పని కాదని ఆఖరి నిమిషంలో అర్ధమయినా అప్పుడు ఇక చేయగలిగేది ఏమి ఉండదు.   మారిన సామాజిక పరిస్థితుల్లో సినిమా గ్లామరు రాజకీయాలలో పెద్దగా ఉపయోగపడదని గత ఎన్నికలలో చిరంజీవికి అనుభవపూర్వకంగా అర్ధమయింది. బాలకృష్ణ తానూ కూడా ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోనవసరంలేదు గనుక, ఆయన రాజకీయాలలో ప్రవేశించే ఆలోచన ఉంటే ఇప్పటి నుండే అందుకు సంసిద్ధం అవడం మంచిది.

రెడ్డి సోదరులకు జైలే: ఎంఐఎం అక్బరుద్దీన్

        కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం కాదని అక్బరుద్దీన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసంహరించాక నా మీద కేసులు పెట్టి అరెస్టు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడగానే ఆయనపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జైలుపాలు చేశారు. అయితే భవిష్యత్ లో రెడ్డి సోదరులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు” అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరులను హెచ్చరించారు. అయితే అక్బరుద్దీన్ అరోపణలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను ఎవరిమీద వ్యక్తిగతంగా కేసులు పెట్టించలేదని, కేసులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని అన్నారు.

విఫలమయిన రెండు మాహా ఉద్యమాలు

  సామాజిక కార్యకర్తలు అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ కలిసి అవినీతికి వ్యతిరేఖంగా లోక్ పాల్ బిల్లు కొరకు డిల్లీలో ఉద్యమం ప్రారంభించినప్పుడు యావత్ దేశం కూడా సానుకూలంగా స్పందించింది. వారిరువురూ దేశ వ్యవస్థలో పెనుమార్పులు తేగల సమర్ధులని ప్రజలు చాలా ఆశపడ్డారు. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ వారిద్దరూ తలోదారి పట్టారు.   వ్యవస్థలో ఇమిడిపోయున్న అవినీతిని కేవలం ప్రజా ఉద్యామాల ద్వారానే రూపుమాపగలమని అన్నా హజారే భావిస్తే, అధికారం లేనిదే వ్యవస్థను ప్రక్షాళనం చేయడం అసంభవమని భావించిన అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని స్థాపించారు.   నాటి నుండి వారిరువురూ కూడా ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించుకోవడమే కాకుండా అప్పుడపుడు తీవ్ర విమర్శలు కూడా చేసుకొంటున్నారు. తద్వారా వారు నిర్దేశించుకొన్న గమ్యానికి ఇద్దరూ చాలా దూరం అయిపోయారు.   అన్నా హజారే ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభకు కనీసం వెయ్యి మంది జనం కూడా రాలేదంటే ప్రజలకి ఆయన పట్ల విశ్వాసం సడలినట్లు అర్ధం అవుతోంది. అయినప్పటికీ ఆయన ‘125 కోట్ల జనాభా గల భారతదేశం నుండి కేవలం 6కోట్ల మంది నాకు తోడుగా నిలిస్తే చాలు, నేను దేశం నుండి అవినీతిని పారద్రోలుతాను’ అని చెప్పడం విశేషం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్నపటికీ, ఆయన సరయిన కార్యాచరణ ప్రణాలిక లేకుండా ముందుకు సాగుతూ ప్రజలను ఆకట్టుకోవాలని విఫలయత్నం చేస్తున్నారు.   ఇక, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయపార్టీని పెట్టి సరయిన నిర్ణయమే తీసుకోన్నపటికీ తదనంతరము ఆయన కూడా పార్టీని నిర్మించుకొనే ప్రయత్నం చేయకుండా, అంభానీలు, గోయెంకాల స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు అంటూ సంచలనాలు సృష్టించి మీడియాను, తద్వారా ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. కానీ, దానివల్ల ఆయనకు కానీ, ప్రజలకు గానీ ఒరిగేదేమీ లేకపోగా, ఆయన పార్టీకే ఆయనే అడ్డంకులు సృష్టించుకొన్నట్లు అయింది.   రాజకీయ పార్టీ పెట్టుకొని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పాల్గొని పార్టీని గెలిపించుకోవాలంటే ఆయన ముందుగా పార్టీని బలపరుచుకొని ఉండాలి. కానీ, ఆయన ఆపని చేయకుండా నేడు డిల్లీలో పెరిగిన కరెంటు,నీటి చార్జీలకు వ్యతిరేఖంగా నిరవదిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. దీనివల్ల ఆయన సాదించేదేమి లేదని ఆయనకు బాగానే తెలిసి ఉంటుంది. అయినా కూడా ఇటువంటి అనవసరమయిన పనులకు పూనుకొని ఒక దశా దిశా లేకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలలో పాల్గొనే ఆలోచనే గనుక ఉండి ఉంటే ఆయన ఇప్పటికే తన పార్టీని దేశమంతటా వ్యాపింపజేసుకొని ఉండేవారు. కానీ ఆయన పోరాటాలు గమనిస్తే ఆయన ‘ఆమ్ ఆద్మీ’ కేవలం డిల్లీకే పరిమితమయినట్లుంది.   ఉప్పెనలా మొదలయినా వారిరువురి మహాఉద్యమం ఊహించినదానికంటే ముందే చల్లారిపోవడంతో దేశంలో అవినీతిపరులందరూ ఇప్పుడు మళ్ళీ నిశ్చింతగా తమ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ఒక ఉద్యమాన్ని నిర్మించడం ఎంత కష్టమో దానిని కడదాక సమర్ధంగా నడిపించడం ఇంకా కష్టమని వారిరువురూ మరోమారు నిరూపించారు.

ఎన్టీఆర్ 'బాద్ షా' కి డబ్బింగ్ చెబుతున్న మహేష్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసందే. ప్రిన్స్ మహేష్ 'బాద్ షా' కు డబ్బింగ్ ను మొదలు పెట్టారు. వాయిస్ ఓవర్ లో మహేష్ మంచి డైలాగ్స్ కూడా చెప్పారని తెలుస్తోంది. 'బాద్ షా' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 5న రికార్డ్ ధియేటర్ లలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నారు.   రీసెంట్ గా విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డైరెక్టర్ శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గ కూడదని ఎంతో కసితో ఈ స్క్రిప్ట్ కోసం పని చేసారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, ఎస్.ఎస్ తమన్ సంగీతం అంది౦చారు.

డి.శ్రీనివాస్‌కు మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి..!

        డి.శ్రీనివాస్‌కు మరోసారి పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జైపూర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో పిసిసి, డిసిసి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు సాధారణ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పదవి పట్ల ఆశలు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ శాసన సభ్యునిగా లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అవకాశాలు సన్నగిల్లుతాయేమోనని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు పిసిసి అధ్యక్ష పదవి నుండి తప్పుకొని తన నియోజకవర్గంపైనే దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.   ఒకవేళ ఎన్నికల వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పదవిలో కొనసాగినా, ఎన్నికల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో, పరిణామాలు ఎలా మారుతాయో ఊహించలేమని, అప్పుడు శాసన సభ్యునిగా లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అవకాశాలు సన్నగిల్లుతాయేమోనని బొత్స భావిస్తున్నట్లు సమాచారం.   ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంఎల్‌సిగా కొనసాగుతున్న డి.శ్రీనివాస్‌కే మూడవసారి పిసిసి అధ్యక్ష పదవివరించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం, బి.సి. వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అధిష్ఠానంకు నమ్మకస్తునిగా ఉండటం ఆయనకు ప్లస్‌ పాయింట్లు. పైగా కాంగ్రెస్‌ అధికారంలో వచ్చిన గత రెండు సాధారణ ఎన్నికలు జరిగిన సమయాల్లో డి.శ్రీనివాస్‌ పిసిసి అధ్యక్షునిగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.