2013లోనే ఎన్నికలు సమాజ్ వాదీ పార్టీ

  యూపీఏ పక్షంలోని భాగస్వాములు ఒక్కరొక్కరే బయటకు వెళ్ళిపోతున్నారు. వారం రోజుల క్రితం డిఎంకే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్ధతు ఉపసంహరించుకుంది. తాజాగా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ కూడా మద్ధతు ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2013లోనే లోక్ సభ ఎన్నికలలు వెళ్లేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ నిర్ణయం తీసుకున్నారని, యూపీఏ కూటమికి బయటినుంచి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకోవాలని, మే రెండో వారంలో ఓటింగ్ కు వచ్చే ఆర్థిక బిల్లు ఆమోదం పొందకుండా చేస్తే చాలు అని యూపీఏ సర్కారు దానంతటదే కూలిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హోలీ తరువాత భారీ ర్యాలీ తలపెట్టిన ములాయం సింగ్ యాదవ్ ఆ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

కాదేది రాజకీయలకనర్హం

  కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అగ్గి పుల్లా కాదేది కవితకనర్హం అని మహానుభావుడు శ్రీశ్రీ ఏ ఉద్దేశ్యంతో అన్నారో గానీ, అవి శిలాక్షరాలయిపోయాయి. ఈ రోజు మన రాజకీయపార్టీలకి రాజకీయం చేయడానికి అనర్హమయినవంటూ ఏవీ లేవు. దిల్ షుక్ నగర్ బాంబు దాడులలో గాయపడిన వారు వారికి రాజకీయ పావులే, దేశ ప్రతిష్టకు సంబంధించిన ఇటలీ నావికుల కేసు రాజకీయ చదరంగం ఆడుకోవడానికి అర్హమయినదే.   అటువంటిది, ఇటీవల సుప్రీం కోర్టు బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ ఇచ్చిన తీర్పు మాత్రం రాజకీయానికి ఎందుకు పనికిరాదు? కాంగ్రెస్ పార్టీ సంజయ్ దత్త్ ను క్షమించవచ్చునని వాదన మొదలు పెట్టగానే అంతవరకు మాట్లాడని బీజేపీ ముంబై దాడులలో మరణించిన వారిపై చూపని జాలి, కరుణ కేవలం సంజయ్ దత్త్ పైనే ఎందుకు చూపవలసి వస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. సంజయ్ దత్త్ ని క్షమిస్తే ఇక ముందు ఇదొక సంప్రదాయంగా మారుతుందని వాదించింది. సంజయ్ దత్త్ క్షమార్హుడు కాదని గట్టిగా వాదిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీల మద్య ఈ విధంగా యుద్ధం సాగుతుంటే, మరో వైపు మహారాష్ట్రలో కూడా సంజయ్ దత్త్ కి క్షమాబిక్ష పెట్టడం గురించి అక్కడి శాసన సభలో పెద్ద యుద్ధమే జరుగుతోందిప్పుడు.   మహారాష్ట్రలో ఒకవైపు బీజేపీ, శివసేనలు సంజయ్ దత్త్ కు వ్యతిరేఖంగా వాదిస్తుంటే, శివసేన నుండి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అనే వేరు కుంపటి పెట్టుకొన్నరాజ్ థాకరే శివసేనను వ్యతిరేఖించాలి గనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి సంజయ్ దత్త్ కు అనుకూలంగా వాదిస్తున్నారు. ఈ రాజకీయాలు చూస్తున్న సంజయ్ దత్త్ ఇక ఈ కంపు భరించడం కంటే ఆ జైలు జీవితమే మేలని భావించి తానే స్వయంగా జైలులోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.

టీడీపీకి దూరం అవుతున్న వల్లభనేని వంశీ

  తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా కృష్ణా జిల్లా తెదేపాకు ఎప్పుడూ కంచుకోటగానే నిలుస్తోంది. నందమూరి కుటుంబానికి ఆ జిల్లాతో ఉన్న ప్రత్యేక అనుబంధం అక్కడి ప్రజలు తెదేపాను తమ స్వంత పార్టీగా భావించి ఆదరించడం ఒక కారణమయితే, నిత్య రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే కృష్ణా జిల్లాలో తెదేపాకు బలమయిన నేతలు చాలామందే ఉండటం అందుకు మరో కారణమని చెప్పవచ్చును. అయితే, ఇప్పుడు ఆ రెండో కారణమే ఆ పార్టీకి ఊహించని ఇబ్బందులు తెస్తోంది.   ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేనప్పుడు అనేక కత్తులు ఎలా ఇముడుతాయి? ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కశినేని నాని, బుద్దా వెంకటేష్, నాగుల్ మీరా, ఇటీవలే పార్టీలో చేరిన దేవినేని చంద్రశేఖర్ వంటి వారే కాకుండా చాల మంది బలమయిన నాయకులున్నారు. ఒకసారి రాజకీయాలలో ప్రవేశించిన తరువాత ఎవరయినా తనకంటూ పార్టీలో, తన ప్రాంత ప్రజలలో ఒక గుర్తింపు కలిగి ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే, ఇంత చిన్న పరిధిలో ఎక్కువమంది రంగంలో ఉన్నపుడు వారి మద్య పోటీ, తత్ఫలితంగా యుద్ధాలు కూడా అనివార్యమే. అయితే, అది ఒక పరిధి దాటినప్పుడు వారి మనుగడకే కాకుండా పార్టీకి కూడా నష్టం కలుగుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసి ఉన్నపటికీ, ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకొనే ప్రయత్నంలో యుద్ధాలు, గెలుపు ఓటములు కూడా తప్పడం లేదు.   గత దశాబ్ద కాలంగా కృష్ణా జిల్లాలో తేదేపాకు తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణా జిల్లాలో తెదేపా బలపడేందుకు ఆయన చాల కృషి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దేవినేని నెహ్రు వంటి బలమయిన కాంగ్రెస్ నేతలను డ్డీ కొనడంలో వల్లభనేని చూపిన తెగువ, దైర్య సాహసాలను అందరు మెచ్చుకొన్నపటికీ, ఆయన దూకుడుతనం మాత్రం అప్పుడప్పుడు పార్టీకే కాక ఆయనకీ కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.   అయితే, ఇటీవల కాలంలో కేశినేని నాని క్రమంగా ఆయన స్థానం ఆక్రమిస్తూ ఆయనను వెనక్కు నెట్టివేస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఇటీవల చంద్రబాబు కృష్ణ జిల్లా పాదయాత్రలో స్పష్టంగానే కనబడింది. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో అడుగుపెట్టినపుడు వల్లభనేని వంశీ చురుకుగా పాల్గొన్నారు. అయితే, కేశినేని నాని రంగ ప్రవేశంతో ఆయన పాదయాత్ర నుండి దాదాపు కనుమరుగైపోయారు. కారణాలు ఎవయినప్పటికీ చంద్రబాబు కూడా ఆయన పట్ల కొంత నిర్లక్ష్యం కనబరిచినట్లే ఉంది. తత్ఫలితంగా వల్లభనేని వంశీ పార్టీకి మరింత దూరం జరిగినట్లు కనిపించింది.   అయితే, నిన్న చంద్రబాబు తన పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చినప్పుడు కృష్ణా జిల్లా నేతల మద్య నివురు గప్పిన నిప్పులా రగులుకొంటున్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా వల్లభనేని వంశీ, కేశినేని నాని, బుద్దా వెంకటేష్ మరియు నాగుల్ మీరాలతో విడివిడిగా భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందుగా నాయకుల మద్య సయోధ్య అవసరమని, అందువల్ల తనతో విభేదించే వంశీ స్థానంలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాగుల్ మీరాకు అర్భన్ అధ్యక్ష పదవిని ఈయమని కేశినేని నాని కోరడంతో చంద్రబాబుకు సరికొత్త సమస్య ఎదురయింది.   పార్టీకోసం ఎంతో కష్టపడిన వల్లభనేని వంశీని అర్భన్ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు ఇష్టం లేకపోయినప్పటికీ, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సరేననక తప్పలేదు. అందుకు వల్లభనేని చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే, వంశీని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకొని ఆయనకు కీలక బాద్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయినప్పటికీ, వంశీ ఆగ్రహం చల్లారలేదని తెలుస్తోంది. కానీ, చంద్రబాబుకి కూడా ఇంతకంటే వేరే మార్గం లేదు.   తాజా కూర్పులో కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు, నాగుల్ మీరాకు అర్భన్ అధ్యక్ష పదవి, విజయవాడ పశ్చిమానికి ఇన్ చార్జిగా బుద్దా వెంకన్న, మద్య నియోజక వర్గంలో బొండా ఉమా, తూర్పున గద్దె రామ్మోహన్ ఉండేలా నిర్ణయం అయింది. అయితే, వల్లభనేని వంశీని అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి నిర్ణయం తీసుకోన్నపటికీ, ఆయనకు రాష్ట్ర కార్యవర్గంలో సముచిత పదవినిస్తూ తెదేపా అధిష్టానం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయక పోవడంతో సహజంగానే కొంచెం ఆవేశపరుడయిన ఆయనకి మరింత కోపం కలిగించడంతో పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా తన ఫోన్ స్విచ్చ్ఆఫ్ చేసుకొన్నట్లు తెలుస్తోంది.   అటువంటి బలమయిన నాయకుడిని తెదేపా కనుక వదులుకొంటే ఆయన చేయి అందుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ సిద్దంగా ఉంటుందని తెదేపా అధిష్టానం గ్రహించకపోతే అది ఆ పార్టీకే తీరని నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చును. గతంలో జిల్లాలో బలమయిన నాయకుడయిన దేవినేని నెహ్రును కూడా ఇదేవిధంగా కోల్పోయిన తెదేపా ఆ తరువాత మళ్ళీ నిలదొక్కుకోవడం కోసం ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందా లేక తెదేపా చేతులు కాలక ముందే జాగ్రత్త పడుతోందో త్వరలోనే తేలుతుంది.

వైఎస్ చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష

        విద్యుత్ సమస్యలతో చిన్న పరిశ్రమల యాజమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తపరిచారు. విద్యుత్ సమస్యను తేల్చకుండా ప్రకృతి సహకరించడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. వైఎస్ హయాంలో జరిగిన తప్పులకు ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవించాల్సివస్తోందని ఆయన అన్నారు.   వైఎస్ 20 ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు 45 వేల ఎకరాల భూమి కేటాయించారన్నారు. బొగ్గు మనది, భూమి మనది, బూడిద మనది అని అయితే విద్యుత్‌ను మాత్రం పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకుంటున్న ల్యాంకో, జీవీకే ప్లాంటుకు గ్యాస్ ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. కమిషన్లు తీసుకుని పెద్ద కంపెనీలకే అనుమతులిస్తున్నారని ఆరోపించారు.    టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు కృషి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే అని ఆయన అన్నారు. కమిషన్ల కోసం కోస్తాతీరం మొత్తం వైఎస్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైఎస్ కుక్కచావు చచ్చారన్న సర్వే

      దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి పై సర్వే సత్య నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకంగా వైఎస్ కుక్కచావు చచ్చారు అని హీనంగా మాట్లాడారు. ప్రజాసేవ చేయమని సోనియాగాంధీ పంపితే ఆయన డబ్బు దోచుకున్నారని, అందుకే అలా చచ్చారని అన్నారు. సోనియాగాంధీ నియమిస్తేనే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారని, వైఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వేనని, అందులో వైఎస్ ఘనత ఏమీ లేదని అన్నారు. ఎంత వైఎస్ అంటే పడకున్నా సర్వే ఇలా మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు.

కాంగ్రెస్ కు షర్మిల సవాల్

        వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. పాదయాత్ర వందరోజులుకు చేరుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇటీవల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాపక్షం తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగలరా…అంటూ ఆమె విరుచుకపడ్డారు.   కొనసాగింపుగా…దమ్ముంటే వారిపై వేటు వేసి.. ఎన్నికలకు వెళ్లాలని ఆమె అన్నారు. ఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా దక్కవని కాంగ్రెస్ కు భయమని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ విధంగా షర్మిల తన పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యానాలు చేశారు.

గన్నవరం నుండి వల్లభనేని వంశీ పోటీ..!

  లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నానిని ఖరారు చేసేముందు చంద్రబాబు నాయుడు గారు.. తొలుత వల్లభనేని వంశీమోహన్‌ను బస్సులోకి పిలిపించి గంటసేపు మాట్లాడారు. అర్బన్ బాధ్యతలు వదిలేసి, రాష్ట్ర కమిటీలోకి రావాలని వంశీని ఆయన కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలలో వంశీ పోటీచేయడానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికలలో వంశీ గన్నవరం సీటుకోసం పట్టుపట్టారు. దాసరి జైరమేష్, బాలవర్ధనరావులను వదులుకోలేని చంద్రబాబు..అప్పట్లో వంశీకి నచ్చచెప్పారు. తనమాట విని ఈసారికి విజయవాడ నుంచి పోటీ చేయాలని, వచ్చేసారి (2014) గన్నవరంలో పోటీకి పెడతానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. భేటీ సందర్భంగా ఈ హామీని వంశీ గుర్తుచేసినట్టు తెలుస్తోంది. 'గన్నవరం' వంశీకి ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును మండలికి పంపడమో లేక విజయా డైరీ మిల్క్ సొసైటీ చైర్మన్‌ని చేయడమో చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దాసరి, జైరమేష్‌లతో బాబు మాట్లాడిన తరువాతగానీ దీనిపై స్పష్టత రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వంశీకి గన్నవరం సీటు ఇచ్చేసినట్టు టీవీలలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. దాంతో ఎమ్మెల్యే దాసరి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.

ఏప్రిల్ 27న పాదయాత్ర ముగింపు

      చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర విశాఖ జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆయన.. నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఏప్రిల్ 27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు విశాఖ మధురవాడలో బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ముగిస్తారు. కాగా, విశాఖ జిల్లాలో మొత్తం 19 రోజులపాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.   జిల్లాలో చోడవరం, మాడుగుల, పాడేరు, అరకులోయ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం వెల్లడించారు. యాత్ర ముగించేనాటికి ఆయన 2750 నుంచి 2800 కిలోమీటర్ల దూరం నడుస్తారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ ఇంత సుదీర్ఘకాలం, ఇంత ఎక్కువ దూరం పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా మధురవాడలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు

  1993 ముంబాయి వరుస బాంబు కేసులో టాడా సంజయ్ దత్ దగ్గర చట్టవిరుద్ధ, లైసెన్స్ లేని ఆయుధాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల శిక్ష విధించింది. పద్దెనిమిది నెలలు జైలులో ఉన్న సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇరవై సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు సంజయ్ దత్ ను నిందితుడిగా పేర్కొంటూ ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ తారలు సంజయ్ ఇంటికి వచ్చి అతన్ని పరామర్శించి సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టాలని సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్రమంత్రి చిరంజీవి, టాలీవుడ్ నటుడు రాం చరణ్ తేజ్, హృతిక్ రోషన్, విద్యాబాలన్ ప్రభుత్వాన్ని కోరారు. సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సంజయ్ దత్ క్షమాభిక్షకు అర్హుడేనని తెల్చేశాయి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదని అంటోంది. సీనియర్ బిజెపి నేత గోపీనాథ్ ముందే మాట్లాడుతూ సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టకూడదు అతను సెలబ్రిటీ కాబట్టి అతనికి క్షమాభిక్ష పెడితే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని చెప్పారు. మరొక బిజెపి ఎంపి బల్బీర్ పుంజ్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలి, గొప్పవారికి ఒక న్యాయం, బీదవాడికి మరొక న్యాయం అని  ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న అన్నా హజారే మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంజయ్ దత్ కట్టుబడి ఉండాలి అంతేకాని దేశ అత్యుత్తమ న్యాయస్థానం విధించిన శిక్షకు వ్యతిరేకంగా క్షమాభిక్ష పెట్టమని కోరరాదని హితవు పలికారు. ఆర్.ఎస్.ఎస్. నేత పాంచజన్య మాట్లాడుతూ బాంబు పేలుళ్ళలొ మరణించిన వారి బంధువుల ఆగ్రహం చల్లారి ఉంటుందని, రెండు దశాబ్ధాలుగా వీరంతా దోషులకు శిక్ష పడాలని ఎదురు చూస్తున్నారని, మరొక పక్క సంజయ్ దత్ కు ఇద్దరు చిన్నపిల్లలున్నారని, కోట్లాది రూపాయలు సంజయ్ దత్ నటించే చిత్రాలు నిలిచిపోతాయని సంజయ్ దత్ కు బాటగా నిలుస్తున్నవారు అంటున్నారని అన్నారు. ఏమైతే నేమి సంజయ్ దత్ కు ఒక పక్క క్షమాభిక్ష పెట్టాలని కొన్ని వర్గాలు కోరుతుండగా మరోపక్క క్షమాభిక్ష పెట్టరాదని మరికొన్ని వర్గాలు కోరుతున్నాయి. ఆఖరికి ఏ వర్గం గెలుస్తుందో వేచి చూడాల్సిందే

టిడిపి విజయవాడ ఎంపీ సీటు కేసినేని నానికే

  టిడిపి విజయవాడ లోక్ సభ అభ్యర్ధిగా పోటి చేసేందుకు ట్రావెల్స్ అధినేత కేసినేని నానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చంద్రబాబు ఆదివారం విజయవాడ నాయకులతో భేటి అయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..విజయవాడ లోక్సభ అభ్యర్ధిగా కేసినేని నాని ని ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు కృష్ణాజిల్లా పాదయాత్ర ప్రారంభానికి ముందే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీటుకు హామీ పొందారు. విజయవాడ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఖర్చంతా ఆయనే భరించారు. చంద్రబాబు యాత్రకు గుర్తుగా పరిటాల వద్ద కేశినేని నాని సుమారు రూ.70 లక్షల వ్యయంతో పైలాన్ నిర్మించారు. విజయవాడ సీటు తనకే ఖరారు అవడంతో.. అర్బన్ అధ్యక్ష పదవి కూడా కావాలని అడిగారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.   ఈ నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి నుంచి వంశీని తప్పించడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన స్థానంలో నాని సూచించిన నాగుల్ మీరాను నియమించనున్నట్టు అధినేత స్వయంగా సంకేతాలు ఇచ్చారు. అదేసమయంలో నాలుగేళ్లుగా నగర పార్టీ బాధ్యతలు మోస్తున్న వంశీకి నెమ్మదిగా నచ్చచెప్పి మార్పులు చేద్దామని చంద్రబాబు నిర్ణయించారు.

దానం నాగేందర్ వార్నింగ్

  బంజారాహిల్స్ లోని భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ప్రతియేటా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి పోటీచేస్తుంటాయి. ఈ సంవత్సరం జరిగే  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేష్, నాగరాజు అనే ఇద్దరు రెండు ప్యానల్స్ గా ఏర్పడి పోటీ చేశారు. వీరిద్దరూ తమ ప్యానెల్ కే మద్ధతునివ్వాలని కార్పోరేటర్ ను కోరారు. కార్పోరేటర్ ఒక వర్గానికి తన మద్ధతు ప్రకటించారు. దీంతో నిరాశకు గురైన రెండవ ప్యానల్ మంత్రి దానం నాగేందర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో దానం కార్పోరేటర్ ను పిలిచి ఆగ్రహం వ్యటం చేసినట్లు తెలిసింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యా సయోధ్య కుదర్చాలి గాని ఏదో ఒక అభ్యర్థికి మద్ధతు తెలిపితే ఎలా అని గట్టిగా మందలించారు. కార్పోరేటర్ ఆ ఇద్దరు అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా విఫలమవడంతో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వెంకటేష్ ప్యానెల్ విజయం సాధించింది. నాగరాజు వర్గ ప్యానెల్ ఓటమి పాలైంది. దీంతో ఒకే పార్టీలో వర్గాలు ఏర్పడటం మంచిది కాదని దీని పర్యవసానం భవిష్యత్తులో ప్రతిఫలిస్తుందని భగత్ సింగ్ నగర్ వాసులు వాపోతున్నారు

సిబీఐకి కెవిపి వాంగ్మూలం

  సిబీఐ కెవిపి రామచంద్రా రావును శనివారం విచారించింది. జగన్ తనని ఎప్పుడూ ఏదీ అడగలేదని, తన ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదని చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. తాను ప్రభుత్వ సలహాదారుగా పనిచేశానని, ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫైళ్ళూ చూడలేదని, ఎక్కడా తన పేరుతొ లావాదేవీలు, సంతకాలు ఉండవని, అడిగితే సలహా చెప్పేవాడినని, ఏదైనా అంశంపై సలహాలు కావలసి వచ్చినప్పుడు మాత్రమే తాను సమావేశాలలో పాల్గొనేవాడినని తెలిపారు. తానెప్పుడూ ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, ఫైళ్ళ వల్ల ఎవరెవరికి లాభం జరిగిందో తనకు తెలియదని, ప్రభుత్వం అడిగినప్పుడు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్సువాదినని, దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారో, ఆ సలహాలు అమలయ్యాయో లేదో కూడా తనకు తెలియదని, తాను రాజశేఖర రెడ్డికి సన్నిహితుడినే అయినా తనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని సిబీఐకి తెలిపినట్లు తెలిసింది.

బైరెడ్డి భవిష్యత్ వాణి టి.ఆర్.ఎస్.కు 90 సీట్లు

  ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉద్యమం చేస్తున్నారు. ఆదివారం కర్నూలుజిల్లా నందికొట్కూరులొ జరిగిన కార్యకర్తల సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ ... రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతానని తెలిపారు. అలాగే తెలంగాణలో ఎవరిని కదిలించినా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదం వినిపిస్తుందని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ప్రజల్లో బాగా ఉందని, రాబోయే ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.కు 90 సీట్లు ఖాయంగా వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని, అదే కనుక జరిగితే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని,టి.ఆర్.ఎస్.కు దీటుగా రాయలసీమ వాసుల్లో కూడా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం నినాదం కావాలని, ఇప్పటికే రాయలసీమ వెనుకబడి ఉందని, రానున్న స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను రాయలసీమ పరిరక్షణ సమితికి కట్టబెట్టాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలు రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీలే అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కింది

  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు చెలరేగాయి. కాంగ్రెస్ అధిష్ఠానం జైపాల్ ను కాదని కిరణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసింది. మరొక వైపు మహబూబ్ జిల్లాలో కేంద్రమంత్రి జైపాల్ కు రాష్ట్రమంత్రి డి.కె.అరుణల మధ్య ఆధిపత్య, వర్గపోరు ఉంది. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్య నివారణకు 100కోట్ల నిథులను కేటాయించి ఆ పనులను ప్రారంభించేందుకు, ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు విచ్చేశారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు సుదర్శన్ రెడ్డి, జానారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపి మంథా జగన్నాథం, ఎమ్మెల్యేలు రాములు, జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు జిల్లా ఇన్ ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా రాష్ట్రమంత్రి డి.కె. అరుణలకు ఆహ్వానాలు పంపించారు. కానీ వీరిద్దరూ గైర్హాజరయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అనునాయులకు కట్టబెట్టారని డి.కె.అరుణ అనుచరులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో జైపాల్ రెడ్డి, డి.కె. అరుణల మధ్య వర్గపోరు బహిర్గతం అయ్యిందని.