కష్టకాలంలో వైయస్సార్ కాంగ్రెస్

  జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాగయినా బెయిలు మీద బయటకి వస్తాడని చాలా ఆశగా ఎదురుచూసిన అతని కుటుంబం మరియు పార్టీ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారు పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నపటికీ, ప్రస్తుతం పార్టీలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను చూసి వారు చాల కలవరపడుతున్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాల వారిగా నియోజక వర్గ ఇన్-చార్జ్ లను నియమించి సిద్దమవుదామని ఆలోచిస్తే అదే ఆ పార్టీ పాలిట శాపంగా మారింది. నెల్లూరు, వరంగల్ జిల్లాలలో పార్టీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకొని ఏకంగా పెద్ద తలకాయలే పార్టీ వీడేట్లు చేస్తున్నాయి.   జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాకపోవడం వలన పార్టీ పై ఎటువంటి ప్రభావం లేదని, పార్టీలో అసమ్మతిని సమర్ధంగా అదుపు చేయగలమని నిరూపించే ప్రయత్నంలో నిన్నకొండ సురేఖ అనుచరులను పార్టీ నుండి బహిష్కరించారు. త్వరలో కొండా దంపతులు కూడా పార్టీ వీడే అవకాశం ఉంది.   అనకాపల్లిలో దాడి వీరభద్ర రావుని పార్టీలోకి ఆహ్వానించి ఆ పార్టీ కొరివితో తల గోక్కోన్నట్లయింది. ఆయన రాకను నిరసిస్తూ కొణతాల రామకృష్ణ సోదరులు పార్టీకి తాము కావాలో లేక దాడి కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారిచేసారు కూడా. ఇక, పార్టీలోకి కొత్తగా వచ్చిన దాడి కోసం, పార్టీ కొణతాలను వదులుకోవడానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. దానితో, ఆయనను తమ పార్టీ వైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. “ఆయన ఎప్పటికయినా మా కాంగ్రెస్ పార్టీ వాడే” అని కేంద్ర మంత్రి పురందేశ్వరి పలికితే, “ఆయన మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామని” మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు.   ఇక కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా ఇంచుమించి ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముందు నుండి ఆ పార్టీలో ఉంటూ రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు, ఇటీవల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో నుండి వైకాపాలోకి వచ్చిన నేతలతో పట్లు పడుతున్నారు. వారు అకస్మాత్తుగా వచ్చి తమ నోటి కాడ కూడు లాకొంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో 4-6నెలల వరకు జైలు నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పార్టీలో తమ మొర వినే నాధుడు లేదని వారందరూ ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.   ఇక, చంద్రబాబు పాదయత్ర సాగుతున్నంత కాలం, పోటీగా సాగుతున్న షర్మిల పాదయాత్ర గురించి మీడియాలో ఎక్కడో అక్కడ నిత్యం ప్రస్తావన ఉండేది. కానీ, చంద్రబాబు పాదయాత్ర పూర్తయిన తరువాత ఆమె పాదయాత్రను పట్టించుకొనే నాధుడే లేడు. ఆమె పాదయాత్రను మీడియా ఎలాగూ పట్టించుకోవడం లేదు, చివరికి వైకాపా శ్రేణులు, నేతలు కూడా మొహం చాటేయడం ఆశ్చర్యకరం. ప్రస్తుతం ఖమ్మంలో సాగుతున్న ఆమె పాదయాత్ర ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో, దాని వల్ల పార్టీకి ఏమయినా ఫలితం ఉంటుందో లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. చివరికి ఆమె పాదయాత్ర గురించి పార్టీలో నేతలు కూడా మీడియాతో మాట్లాడెందుకు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం.   ఒకవైపు జైల్లో జగన్ మోహన్ రెడ్డి, మరో వైపు షర్మిల, విజయమ్మలు పార్టీని ఎలాగయినా కాపాడుకోవాలని ఈ మండు వేసవి ఎండలను సైతం లక్ష్యం చేయకుండా కష్టపడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం చల్లగా తమ ఏసి గదులకే పరిమితమయిపోయి, మీడియాకి ఖండన ప్రకటనలు జారీ చేస్తూ హాయిగా కాలక్షేపం చేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. జగన్ మోహన్ రెడ్డి, మరియు అతని తండ్రి స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డిల పై ప్రజలలో ఉన్న ఆదరణ, సానుభూతి అనే రెండు అంశాలే తమను కష్టపడకుండా గెలిపిస్తాయని వారు భావిస్తునందునే వారు తమ ఏసి గదులకి పరిమితమయిపోయినట్లుంది. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలకు విజయమ్మే సారద్యం వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కొండా దంపతులకు పొగబెడుతున్న వైకాపా

  గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ దంపతుల ప్రాదాన్యత క్రమంగా తగ్గుతుండటంతో వారు కూడా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల వారి ప్రమేయమ లేకుండా నియోజక వర్గ ఇన్-చార్జుల నియామకం జరిగిన తరువాత, వారు తమకిక పార్టీలో స్థానం లేదని గ్రహించి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ వార్తలు మీడియాలో రావడం దానిపై మీడియాలో చర్చలు జరగడంతో ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో పూర్తిగా తెగతెంపులకి సిద్దం అవుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వారి అనుచరులయిన పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనావత్ రాధ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మసూద్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి మోహన్‌రావులను సస్పెండ్‌చేసింది. దీనికి ఆగ్రహించిన కొండా అనుచరుడు మరియు జిల్లా నియోజకవర్గ ఇన్-చార్జ్ శ్రీనివాస రెడ్డి మరి కొందరు పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అంతిమంగా కొండ దంపతుల నిర్ణయాన్ని బట్టి వారందరూ ఏ పార్టీలో చేరలో నిస్చయించుకోవడానికి ఈ రోజు వరంగల్ లో సమావేశం అవుతున్నారు. బహుశః ఈ వారంలోనే కొండ దంపతులతో బాటు వారి అనుచరులు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది.     ఇప్పటికే, పిల్లి సుబాష్ వంటి సీనియర్ నేతలు బయట నుండి కొత్తగా వచ్చిచేరుతున్న ఇతర పార్టీల నేతలతో ఇమడలేక క్రమంగా పార్టీకి దూరమయిపోయారు. ఇంతకాలం సేవలందించి పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసిన కొండ దంపతులు కూడా ఇప్పుడు వారి త్రోవలోనే బయటకి వెళ్ళాక తప్పడంలేదు. గమ్మతయిన విషయం ఏమిటంటే, కొండా సురేఖ దంపతులు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వారి నుండి జవాబు కోరిన కొణతాల రామకృష్ణ కూడా ఇప్పుడు దాడి వీరభద్ర రావు రాకతో అసమ్మతి స్వరాలూ వినిపిస్తున్నారు. వైకాపా అనవసర భేషజాలకు పోయి పార్టీకోసం త్యాగాలు చేసిన సురేఖ, కొణతాల వంటి వారిని పక్కన బెట్టి కొత్తవారికి పీట వేయడంతో సహజంగానే పార్టీలో అసమ్మతి మరింత పెరిగింది. అయినప్పటికీ, పార్టీ తన శ్రేణుల మీద పట్టు కోల్పోలేదని నిరూపించేందుకు క్రమశిక్షణా చర్యలుకు దిగితే అది మరింత మందిని బయటకి పంపే అవకాశం ఉంది.

నటుడు రామ్ చరణ్ ఫోటోలు మార్ఫింగ్ చేశారా!

        బంజారాహిల్స్‌లో రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను కొట్టిన సంగతి తెలిసిందే. సంఘటన పై లోకల్ మీడియాతో మాట్లాడిన చెర్రీ బాబు ఈ ఉదంతంలో తనది ఎలాంటి తప్పూ లేదని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే తనతో దురుసుగా ప్రవర్తించారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఓ ఫోటో గ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేయబోయాడని చెప్పారు. కారులో తనతో సహా తన భార్య ఉపాసన ఉందన్నారు. తనతో గొడవ పెట్టుకున్న వారు ఐటీ ఉద్యోగుల్లా లేరన్నారు. వారు మద్యపానం సేవించి ఉన్నారన్న అనుమానాన్ని చరణ్ వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులు ఒక వార్త సంస్థలో మాట్లాడుతూ తమది ఎటువంటి పొరపాటూ లేదని వాపోయినప్పటికీ, వారు ఆ రోజు కేసు పెట్టకపోవడంతో…. ఇప్పుడు ఇంకేం మాట్లాడటానికి లేకుండాపోయే అవకాశం కనిపిస్తోంది!

ఘనంగా తెలుగువన్ 13వ వార్షికోత్సవ వేడుకలు

       CLICK HERE FOR MORE Teluguone   13 Anniversary Celebrations Photos     తెలుగువన్ డాట్ కామ్ 13 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకి చెందిన అతిరధ మహారధులంతా విచ్చేసి ఆ సంబరాలకి మరింత శోభను కలిగించారు.   రాత్రి 7గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రార౦భమైంది. చి|| ప్రవస్తి, చి|| ప్రవీణ్, చి|| హనీ తమ పాటలతో ఆహుతులను అలరించారు. అలాగే  సూర్య తేజ అండ్ టీం హాస్యభరిత లఘు నాటికలతో ఆహుతులను నవ్వుల్లో ముంచారు. ఇక సభా కార్యక్రమాలు తెలుగువన్.కాం పరిచయంతో మొదలై,  తెలుగువన్.కాం క్రియేటివ్ హెడ్ మల్లిక్ గారి వందన సమర్పణతో ముగిశాయి.           ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారితో పాటు ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డిగారును, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారును, లిటిల్ మ్యూజిషియాన్ అకాడమి వ్యవస్థాపకుడు రామాచారిగారులను సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ. ఎం.నాగేశ్వర రావు గారు ఆత్మీయ అతిధిగా విచ్చేసి ఇంటర్ నెట్ మీడియా అలాగే తెలుగువన్ ప్రస్థానాన్ని అభినందించారు. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారు మాట్లాడుతూ..''సాహిత్యం, కథలు రాస్తానని ఏనాడూ అనుకోలేదు. నా బాధలు, కన్నీళ్లు నాతోనే అంతం కాకూడదన్న ఆలోచనతోనే రాశాను'' అని అన్నారు. దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు మాట్లాడుతూ..తాను ఓ తెలుగు సభలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నానని అన్నారు. ఇతర భాషల వారికి తమ మాతృభాషపై ఉన్న అభిమానం మన బాషపై మనకు ఉండకపోవడం బాధాకరమని అన్నారు. దేశంలో హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగునీ, మనలో చిత్తశుద్ధి లేకపోవటమే మన భాష దుస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ''జ్ఞానపీట్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జీవితానికి, నా జీవితానికి చాలా సారూప్యత ఉంది. ఇద్దరం కష్టాల కన్నీళ్ళను దాటుకొని పైకొచ్చిన వాళ్ళమే. గాడ్ ఫాదర్లు లేకపోయినా కృషి, పట్టుదలతో మేం ఈ స్థాయికి చేరాం. మా జీవితాలు చాలా మంది పేదవాళ్ళకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను..'' అని అన్నారు. తెలుగువన్ ఇంతగా విస్తరించినందుకు అభినందనలు తెలియజేస్తూ, మరింత ముందుకు దూసుకుపోవాలన్నారు.      

కొండా దంపతులకు బీజేపీ గాలం

        వైకాపా విషయంలో అలక వహించిన కొండా మురళి దంపతులకు బీజేపీ గాలం వేస్తోంది! వారిని తమవైపుకు తిప్పుకోవాలని చూస్తోంది! అటు వైఎస్ఆర్.సీపీలో కొనసాగలేక ,ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లలేక , కేసీఆర్ కింద పొదగలేక పోతున్న వారికి అన్ని విధాలా ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ అభయం ఇస్తోంది! ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొండా దంపతులకు ఫోన్ చేసి హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. ఇప్పటికే ఏ పార్టీకీ చెందకుండా ఉండిపోయిన నాగం జనార్ధన్ రెడ్డిని బుట్టలోకి వేసుకున్న బీజేపీ ఇలాంటి సందిగ్ధవస్థలో ఉన్న నేతలను తమవైపు తిప్పుకోవడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సురేఖ, మురళిలపై గాలం వేసింది. మరి వీరి గాలానికి వారు పడతారో లేదో?

నటి పూజాగాంధీ కి షాక్

        ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ రాయచూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు బీఎస్‌ఆర్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమెకు అతి తక్కువగా 1, 815 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ముంగారు మలే చిత్రంతో కన్నడ పరిశ్రమకు పరిచయమై అనతికాలంలోనే హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన పూజాగాంధీ మొదట మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవెగౌడ్‌ స్థాపించిన జేడీ(ఎస్‌) పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కర్నాటక జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆమె బీజేపీ మాజీ మంత్రి బి. శ్రీరాములు నేతృత్వంలోని బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేసి ఘోర పరాజయం పొందారు.

జగన్ బెయిలు పై సుప్రీం కోర్టు తీర్పు నేడే

  జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరు ఈ రోజు కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, మొన్న 6వ తేదీన సుప్రీంకోర్టులో ఆయన బెయిలుపై ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం తన తీర్పును రిజర్వులోఉంచిన సుప్రీంకోర్టు, నేడు ఆయనకు బెయిల్ మంజూరు చేసేది లేనిదీ ఈరోజు  ప్రకటించబోతోంది. ఆయనకు తప్పక బెయిలు దొరుకుతుందని వారు ధృడంగా నమ్ముతున్నారు.   ఒకవేళ ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసినట్లయితే, రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా? అని ఊగిసలాడుతున్నవారు, ఇక ముందు ఆయన కార్యాలయం ముందు బారులు తీరవచ్చును. అదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో జరుపాలనుకొంటున్న కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ ఎన్నికలపై ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ఆలోచన విరమించుకొన్నా ఆశ్చర్య పడనవసరం లేదు.   ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రాని పక్షంలో ఆ పార్టీ పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది గనుక, ఆయన తన స్థానంలో షర్మిలను నియమించి పార్టీ యొక్క పూర్తి బాధ్యతలు ఆమెకు అప్పగించవచ్చును.

కర్ణాటకలో ప్రతిపక్షం ఎవరికి?

        కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ధ్రువపడినట్లే! దాదాపుగా 120 సీట్లతో ఇక్కడ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే రెండోస్థానంలో నిలిచే పార్టీ ఏది అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత కర్ణాటకలో అధికారం సాధించిన ఉత్సాహంలో కాంగ్రెస్ ఉండగా, రెండోస్థానం కోసం బీజేపీ, జేడీఎస్ లు పోరాడుతున్నాయి. ప్రస్తుత ఆధిక్యాల దృష్ట్యా రెండు పార్టీలూ చెరో 40 సీట్లనూ సాధించే అవకాశం కనిపిస్తున్నాయి. 120 కాంగ్రెస్ ఖాతాలో అనుకున్నా, చెరో 40 సీట్లతో మిగతా రెండు పార్టీలూ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఒకటీ రెండు సీట్లతో బీజేపీ, జేడీఎస్ లలో ఎవరో ఒకరు ఆధిక్యంలో నిలిచే అవకాశాలున్నాయి. ఫలితాల గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) (జనతా దళ్ సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ…తాను కింగ్ ను కాను… కింగ్ మేకర్ ను కాదు అని అన్నారు. తాము ఎటువంటి రేసులో లేమని ఆయన స్పష్టం చేశారు. తమకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించలేదని కుమారస్వామి అన్నారు. ప్రతిపక్షంలో కూర్చుని.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జేడీఎస్ నాలుగు స్థానాల్లో గెలుపొంది, మరో 37 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది.

2014 ఎన్నికల్లో టిడిపి వర్సెస్ వై.ఎస్.ఆర్. పార్టీ?

        ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి వీస్తున్న గాలిని బట్టి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనేక రకాలుగా అభాసుపాలైన అధికార కాంగెస్ పక్షం రాష్ట్రంలో మూడవ స్థానంలోకి జారిపోయి, మొదటి రెండు స్థానాల్లో "తెలుగుదేశం''పార్టీ, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' పక్షమూ ప్రధాన రాజకీయ పక్షాలుగా అవతరించవచ్చునని ఢిల్లీలోని విశ్వసనీయ రాజకీయ పరిశీలకులనుంచి తెలియవస్తున్న సమాచారం. అయితే ఈ నూతన రాజకీయ సమీకరణను అసంభవం చేసే బాధ్యతను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం తెలంగాణాకు మాత్రమే పరిమితమై తెలుగుజాతిని విషప్రచారం ద్వారా చీల్చడానికి సొంత ఎజెండాతో టి.ఆర్.ఎస్. పార్టీని నెలకొల్పిన ఆంధ్రప్రాంత వలసవాదీ, వేర్పాటువాదీ అయిన కె.సి.ఆర్.పైన రానున్న ఎన్నికలకోసం ఒక బాధ్యత పెట్టింది. "గతంలో డిసెంబర్ 9''న చిదంబరం - తెలంగాణా ఏర్పాటు విషయమై కేంద్రంలో చింతన ప్రారంభమైంది, చర్చలలో ఉందన్న ఆకుకు అందని పోకకు పొందని ఒక ప్రకటన చేశాడు కాబట్టి దానికి కేంద్రం కట్టుబడి ఉంటే, తాను కాంగ్రెస్ లో చేరతానని కెసిఆర్ మాట ఇచ్చాడని, అందుకు ముదరాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్ఠకు విఘాతం కలగకుండా వ్యూహరచన చేయడం 'నీ వంతని' కెసిఆర్ ను అధిష్ఠాన వర్గ ముఖ్యులు కోరారనీ, అందుకు కెసిఆర్ ఒప్పుదల అయ్యాడనీ ఆ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈ ఏర్పాటువల్ల కెసిఆర్ కు వొనగూడే "ప్రతిఫలమేమిట''ని ప్రశ్నించగా ఆ 'ప్రశ్న'లోనే "నిగూఢమైన సమాధానం'' ఉందని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేసే పక్షంలో "ప్రత్యేక తెలంగాణా" రాష్ట్రానికి"నిన్నే "ముఖ్యమంత్రి"ని చేస్తామని అధిష్ఠాన వర్గ ముఖ్యులు హామీ ఇచ్చినట్టు ఈ పరిశీలకులు తెలిపారు. అయితే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. పార్టీ "ఎనిమిది పార్లమెంటు స్థానాల''ను గెలుచుకోడానికి అవకాశం వస్తే ఆ సీట్లు అడ్డం పెట్టుకుని కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా, మరొక పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా "తెలంగాణా పేరిట'' బేరసారాలు ఆడవచ్చుననీ, ఎన్నికలకు ముందస్తుగా కాంగ్రెస్, బిజెపి లాంటి జాతీయ పార్టీలతో సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకునేకన్నా, ఎన్నికల అనంతరం మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తగినట్టుగా సర్దుబాట్లు చేసుకుంటే టి.ఆర్.ఎస్. కీలకపాత్ర వహించగల్గుతుందని కెసిఆర్ వ్యూహమని పరిశీలకుల భావన. అయితే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో మరొక రాజకీయ పక్షం దేనితోనూ పొత్తులు పెట్టుకోకుండా "ఒంటరి''గా మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించిందని కెసిఆర్ ప్రకటించడంతో తెలంగాణలో ఆయని ప్రవర్తనను బట్టి అతణ్ణి, అతని మాటలనూ విశ్వసించడం "ఆత్మహత్యా సదృశ్యమ''న్న ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ముఖ్యులకు లేకపోలేదు!   ఎప్పుడయితే అమలుకురాని షరతుల మీద ఆధారపడి కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపెస్తానని అధిష్ఠాన ముఖ్యులకు హామీ యిచ్చాడన్న వార్త వెల్లడి కావటంతో తెలంగాణా ఉద్యమంలోనూ, ముఖ్యంగా ఉద్యమ నిర్వహణకని ఏర్పడిన "సంయుక్త కార్యాచరణ సంఘం''లోనూ విభేదాలు, చీలికలూ తలెత్తాయి. ఈ పరిణామానికి ఒక చారిత్రిక పునాది ఉంది - తెలంగాణా పేదలను, సాధారణ గ్రామీణ రైతాంగాన్ని, దళిత, బహుజన వర్గాలనూ [వీళ్ళే జనాభాలో అసంఖ్యాకులు] పీల్చి పిప్పిచేస్తూ రెండు అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఫ్యూడల్ భూస్వామ్య శక్తులు - వెలమ, రెడ్డిదొరలు. నిన్నటిదాకా "ఏలిననాటి శని''గా నేడు "ఏలేనాటి శని''గా మారిన ఈ 'అగ్రవర్ణ వైరుధ్యం' తెలంగాణలో ఈ వర్గాల నాయకత్వంలో తలెత్తే ఏ ఉద్యమంలోనైనా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంది, ఉంటుంది! ఈ కారణంతోనే 'ఉద్యమం' పేరిట జరిపే ధర్నాలు, రాస్తారోకోలు, వంటా-వార్పూ, తాత్కాలిక వూరేగింపుల నిర్వహణలోనూ, "సడక్'' బంద్ లు ఏకోన్ముఖంగా కాకుండా రెండు వేర్వేరు "కుంపట్లు''గా సాగుతున్నాయి. అటు కెసిఆర్, ఇటు కోదండరామ రెడ్డి నేను ముఖముఖాలు చూసుకునే పరిస్థితిలో లేరని ప్రజలకూ తెలిసిపోయింది! ఉద్యోగ, విద్యార్థి, వృత్తిసంఘాలన్నిటా రెండేసి "కుంపట్లు'' నడుస్తున్నాయి. చివరికి ఢిల్లీ "సంసద్'' ధర్నాలో పాల్గొన్నప్పుడు కూడా కెసిఆర్ వర్గం తరపున 'మనిషి'ఒకరు లేకపోతే జనం వేరేగా భావిస్తారేమోనన్న 'కపటం'తో పాల్గొనడమేగాని మనఃపూర్వకంగా పాల్గొనలేదు. దానికి కారణం - కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేయడానికి కెసిఆర్ అధిష్ఠానంతో పడివచ్చిన లాలూచీ తప్ప మరొకటి కాదు.   ఈ భాగోతం యిలా ఉండగా అటు చంద్రబాబు "తెలుగుదేశం'' పార్టీ, ఇటు జగన్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' పార్టీ తెలంగాణా సమస్యపట్ల ప్రధానంగా తటస్థవైఖరిని అవలంభిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాపిత పర్యటనలోనేగాక, ప్రధానంగా తెలంగాణా జిల్లాల్లో సహితం వారు నిర్వహించే సభలకు ప్రజలనుంచి వస్తున్న స్పందనను తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమని కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముఖ్యులు హెచ్చరిస్తున్నట్టు ఢిల్లీ పరిశీలకులు సంకేతాలు యిస్తున్నారు! తెలంగాణలో బొత్తిగా "తాడూ-బొంగరం''లేని [ఒకటి రెండు అసెంబ్లీస్థానాలు తప్ప] పార్టీలుగా నమోదైన కమ్యూనిస్టుపార్టీ, బిజెపిలు సహితం టి.ఆర్.ఎస్. 'ఒంటరిపోరు' వ్యూహాలతో, ఎత్తుగడలతో ఏకీభవించడం లేదు సరికదా జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసే ఎత్తుగడలను నిరసించే మార్కిస్టుపార్టీ 'గొంతు'కూడా ఇప్పుడు 'జీర'బోయిందని భావిస్తున్నారట. కాబట్టి అధికార కాంగ్రెస్ ముఖ్యులు కూడా కేంద్రస్థాయినుంచి తెలంగాణా ప్రాంతీయస్థాయి వరకూ చీలిపోయి ఉన్నారు కాబట్టి, "గిరీశం'' పంతులు "అటునుంచి నరుక్కురమ్మన్న''ట్టుగా కెసిఆర్ ను 'దువ్వడం' కోసం టి.ఆర్.ఎస్. ప్రతిపత్తికి కేంద్రనాయకులు ఎసరుపెట్టి కొంతవరకు జయం పొందడానికి నిదర్శనంగా - కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలపడానికి కెసిఆర్ నిర్ణయించడమేనని ఢిల్లీ పరిశీలకులు భావిస్తున్నారు.   దీనికి తగ్గట్టుగానే 'ఒంటరి'గా పోటీ చేయడం ద్వారా అసెంబ్లీలో 100 స్థానాలు, పార్లమెంటులో "పది''స్థానాలు పొందగలమన్న కెసిఆర్ ధీమా వెనక అసలు రహస్యాన్ని కూడా కేంద్రనాయకత్వం ఉపఎన్నికలలో పాత అనుభవం దృష్ట్యా పసికట్టిందట! ఆ బ్రహ్మ 'రహస్యం' - తెలంగాణా ప్రజల్లో అనుమానం రాకుండా తలెత్తుకు తిరగడానికి పన్నిన ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ కు యిచ్చిన హామీ ప్రకారం 2012 ఎన్నికల్లో "ప్రతిఫలాపేక్ష'' (క్విడ్ ప్రోకో) సూత్రం ప్రకారం టి.ఆర్.ఎస్. తరపున బలహీనమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం ద్వారా, తెలంగాణాలో కోల్పోయిన ప్రతిష్ఠను కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఎక్కువ స్థానాల్లో సుకరం చేయడం కెసిఆర్ బాధ్యత అవుతుందని, కాని ఈ ఎత్తుగడద్వారా అటు అధికార కాంగ్రెస్, ఇటు టి.ఆర్.ఎస్. జనంముందు అభాసుపాలు కావటం ఖాయమని ఢిల్లీ పరిశీలకులు భావిస్తున్నారు.   ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో వత్తిళ్ళమధ్య, దుష్ప్రచారం మధ్య "తెలుగుదేశం'' అధ్యక్షుడు అఖిలపక్ష సమావేశంలో "తెలంగాణా ఏర్పాటుకు మేం అడ్డు నిలబడబో''మని లిఖిత పూర్వకంగా హామీ పడివచ్చినా, తర్వాత తెలంగాణాలోనూ, రాష్ట్రంలో ఇతర చోట్ల జరిగిన సభల్లోనూ "ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం కేంద్రం పరిథిలోనిదేగాని, మా పరిదిలోది కాద''ని చంద్రబాబు, ఇతర "దేశం'' నాయకులూ చెబుతూనే వస్తున్నారు. ఇక జగన్ "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' ఆ వూసోతో నిమిత్తం లేకుండానే ఇటు తెలంగాణాలోనూ, అటు కోస్తాంధ్రలో జరిగిన కొన్ని ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించి పాలకుల్ని పార్టీలనూ ఆశ్చర్యచికితుల్ని చేసింది! ఈ తరుణంలో 2014లో జరిగే ఎన్నికలలో ప్రజలముందుకు రాష్ట్ర విచ్చిత్తి సమస్యపైన ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన రాజకీయపక్షాలు రెండే రెండనీ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పక్షాలుగా జనం మధ్య నిలబడగల స్థితి అటు "తెలుగుదేశం'' పార్టీకి, ఇటు జగన్ పార్టీకి మాత్రమే ఉందనీ, ఆ ఎన్నికలలో మొదటి రెండు స్థానాలలో "తెలుగుదేశం'', జగన్ పార్టీలు మాత్రమే ఉండగలవనీ, మూడవశక్తిగా మాత్రమే అధికార కాంగ్రెస్ మిగిలిపోవలసి వస్తుందనీ ప్రస్తుత పరిణామాలను ఢిల్లీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి తెలంగాణా సమస్యపై ఒక్కమాట కూడా ఉచ్చరించక పోవటానికి ప్రధాన కారణాలలో ఒకటి - ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎం.పి.లలో ఎకవాక్యత లేకపోవటం కాగా, రెండవ కారణం దేశ సమైక్యతకు వేర్పాటువాదం వల్ల ప్రమాదమని భావించడమేనని ఆ పరిశీలకులు అంటున్నారు. జనాభాలో అల్పసంఖ్యాకులైన రెండు అగ్రవర్ణ సామాజికవర్గాలు తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావడానికి 'ఉద్యమం' పేరిట చేస్తున్న ప్రయత్నాలను ప్రాంతంలోని అసంఖ్యాకులైన బడుగు, బలహీనవర్గాల ప్రజలు తిప్పికొట్టే ఆలోచనలో ఉండటం మరొక కొత్త కోణమని కూడా ఢిల్లీ పరిశీలకులు భావించడం విశేషం! వీరికి తోడుగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలన్నింటిని కలిపి "మన రాష్ట్రం'' ప్రకటించాలని గిరిజనప్రాంతాల సంయుక్త కార్యాచరణ సమితి కూడా డిమాండ్ చేస్తుండడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణలోకి తీసుకోవడం వల్ల తెలంగాణా వనరులు కుంచించుకు పోతాయి!

కర్ణాటకలో ముఖ్యమంత్రి రేసులో పోటీ మొదలు

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతోందని స్పష్టమవుతున్న తరుణంలో మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు జోరందుకొన్నాయి. ముఖ్యమంత్రి పదవికి పోటీలోనలుగురు బలమయిన అభ్యర్ధులు-మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖార్గే, కేంద్ర మంత్రి ఎస్.ఎం.కృష్ణ,, మరియు కర్నాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్ అప్పుడే తమ ప్రయత్నాలు ఉదృతం చేసారు. పార్టీలో వీలయినంత ఎక్కువమందిని తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నంలో వ్యక్తిగతంగా, ముఠాలవారిగా సమావేశాలవుతు తమకే మద్దతు ఇవ్వాలని అందరినీ బ్రతిమాలుకొంటున్నారు. అందుకు ప్రతిఫలంగా అధికారంలోకి రాగానే వారికి యధోచిత పదవులు, ఇతర వ్యవహారాలలో సహకారం అందిస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ రోజు సాయంత్రంకల్లా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడుతాయి గనుక, ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికయిన శాసన సభ్యులను సమావేశ పరచి ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారు. గనుక, ముందుగానే నలుగురు ప్రధాన అభ్యర్ధులు బలం కూడగట్టుకొంటున్నారు. ఇక ఈ తంతు ముగియగానే ఇక మంత్రి వర్గంలో పదవుల కోసం కొత్త పోటీ మొదలవుతుంది. దాని తరువాత షరా మామూలుగానే పదవులు దక్కని వారి అలకలు, అసమ్మతి ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ తరువాత నుండి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మార్క్ పరిపాలన మొదలవుతుంది.

యన్టీఆర్ విగ్రహావిష్కరణతో మొదలయిన కొత్త చర్చలు

  గత 17 సం.లుగా స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టించాలని పురందేశ్వరి, తెలుగుదేశం పార్టీతో పట్లుబడుతున్నపుడు, అన్ని రాజకీయ పార్టీ నేతలు వారి గొడవను ముచ్చటగా చూస్తుండిపోయారు. చివరికి ఆమె నిన్న పార్లమెంటు ఆవరణలో యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరింపజేసిన తరువాత గానీ వారికి జ్ఞానోదయం కాలేదు.   సీనియర్ కాంగ్రెస్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు స్పీకర్ మీరా కుమార్ ను కలిసి పార్లమెంట్‌లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరితే, తెరాస నేత హరీష్ రావు మాజీప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు విగ్రహం పెట్టాలని కోరారు. ఇక అదేవిధంగా మరో తెరాస నేత రాష్ట్ర శాసనసభ ఆవరణలో తెరాస సిద్ధంత కర్త స్వర్గీయ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరగా, దళిత వర్గాలకి చెందిన నేతలు జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.   ఈ విగ్రహాల డిమాండ్స్ పక్కన బెడితే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తూ పార్టీని స్థాపించి, రాష్ట్రంలో పార్టీని ఓడించిన స్వర్గీయ యన్టీఆర్ ని, పురందేశ్వరి మాటలు విని కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకోవడం ఏమిటని అనంతపురం లోక్ సభ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారు కొందరు విమర్శిస్తుంటే, మరో పక్క సోనియాగాంధీ ఈ ఆవిష్కరణ సభకు హాజరు కాకుండా తెలుగుజాతిని అవమానించారని తెదేపా నేతలు నిప్పులు కక్కుతున్నారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చిరకాలం సేవలందించిన మాజీప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహరావు చనిపోయినప్పుడు కనీసం కడసారి చూసేందుకు కూడా వెళ్ళని సోనియా గాంధీ, మళ్ళీ ఇప్పుడు తెలుగు గడ్డకి చెందిన స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణకి కూడా మొహం చాటేసి యావత్ తెలుగు ప్రజలను అవమానించారని విమర్శించారు.   చంద్రబాబు తదితరులు కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం తూ...తూ...మంత్రంగా జరిపి చేతులు దులుపుకొందని, ఆ మహానుభావుడి గురించి కనీసం ఎవరికీ ఒక్క ముక్క మాట్లాడే అవకాశం ఈయకుండా కేవలం పదినిమిషాలలో కార్యక్రమం ముగించడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. మొత్తం మీద యన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆలోచన మొదలు పెట్టిననాటి నుండి అది ముగిసిన తరువాత కూడా ఇంకా చర్చలు ఏదో ఒక రూపంలో కొనసాగుతోనే ఉన్నాయి.

భారత దౌత్యం వలనే చైనా దళాలు వెనక్కి మళ్లాయా?

  గత నెల 15వ తేదీన 50మంది చైనా సైనికులు 19కి.మీ. మేర భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఉభయ దేశాల సైనిక దళాల కమాండర్ల మద్య అనేక దఫాలుగా ఫ్లాగ్ మీటింగ్స్ జరిగిన తరువాత ఎట్టకేలకు రెండు రోజుల క్రితం వారు వెనక్కి మళ్ళారు. ఇది భారత దౌత్య విజయమని కొందరు మేధావులు అభివర్ణిస్తే, మరి కొందరు ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో జరుపనున్న తన ఒక్క రోజు జపాన్ పర్యటనను మరో రోజుకి పొడిగించడం ద్వారా చైనాపై ఒత్తిడి తెచ్చినందునే వారు వెనక్కి తగ్గాల్సివచ్చిందని విశ్లేషించారు. జపాన్ సముద్రజలాలలో ఉన్న కొన్ని ద్వీపాల కోసం చైనా ఆ దేశంతో కూడా చాలా రోజులుగా ఖయ్యానికి కాలు దువ్వుతున్నందున, ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనను మరొక రోజు పొడిగించడం ద్వారా, తాము జపాన్ కు మద్దతు తెలుపుతామని సూచించినట్లయింది కనుక, చైనా కాళ్ళ బేరానికి వచ్చి తన సైనికులను వెనక్కి తీసుకొందని సామాన్యులకు అర్ధం కాని ఒక మంచి లాజిక్ పాయింటు వివరించడంతో అల్పసంతోషులయిన భారతీయులు కూడా చాలా సంతోషించారు.   కానీ, ఉత్తర సైనిక కమాండ్ కు చెందిన ఒక సైనికాధికారి చెప్పిన కధ వింటే మాత్రం భారతీయులు ఉసూరుమనక మానరు.   ఐదు రోజుల క్రితం ఉభయ దేశాల సైనిక దళాల కమాండర్ల మద్య జరిగిన ఆఖరు ఫ్లాగ్ మీటింగ్ లో మన దేశ సరిహద్దుల్లో చుమార్ అనే ప్రాంతంలో మన సైనికులు గస్తీ కోసం నిర్మించిన బంకర్లను పూర్తిగా తొలగిస్తేనే తాము వెనక్కి వెళ్తామని స్పష్టం చేయడంతో, తప్పని పరిస్థితిలో చైనా షరతులకు భారత్ తలఒగ్గిన తరువాతనే వారు వెనక్కి మళ్లారని ఆయన తెలిపారు. వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు చైనా సైనికులు భారత భూభాగంలోనే నిలబడి “మీరు మా భూ భాగంలోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్ళిపొండి” అనే ఒక ఎర్ర బ్యానరు చాల సేపు పట్టుకొని మన సైనికులకు ప్రదర్శించిన తరువాతనే వెనక్కి మళ్ళారు. అని తెలిపారు. దీనినేనా మన దౌత్యవిజయంగా అభివర్ణిస్తున్నారు?

హవాల కేసులో మంత్రి శైలజానాథ్

  ఇప్పటికే పలు సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధమిక విద్యా శాఖామంత్రి శైలజానాథ్ పేరు హవాలా కేసులో బయటపడటంతో ఉలిక్కిపడింది. ప్రముఖ పరిశోధనా వెబ్ సైట్ ‘కోబ్రా పోస్ట్’ ఇటీవల డిల్లీలో నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ లో మన మంత్రిగారి పేరు బయటకి వచ్చింది.   కధలోకి వెళ్తే, కోబ్రా పోస్టుకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు డిల్లీలో గల ఇండియన్ బ్యాంక్ మేనజర్ మనోహర్ ని తమని తాము ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రతినిధులుగా పరిచయం చేసుకొని, మంత్రిగారు రూ.25కోట్లు నల్లదనాన్ని సురక్షితమయిన చోట పెట్టుబడి పెట్టలనుకొంటున్నారని, ఆయనకు నమ్మకం కలిగితే, మరిన్ని భారీ మొత్తాలు కూడా పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పడంతో, వారిని నమ్మిన బ్యాంక్ మేనేజర్ తిరుపతిలో తనకు తెలిసిన హరికృష్ణ ప్రసాద్ అనే ఒక ప్రముఖ అర్దోపెడిక్ వైద్యుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని, ఆయన ప్రస్తుతం భారీ వెంచర్ వేసే ఆలోచనలో ఉన్నందున ఇటువంటి భారీ పెట్టుబడికోసం చూస్తున్నారని, మంత్రి గారికి నచ్చితే అందులో పెట్టుబడి పెట్టవచ్చునని చెప్పారు.   అంత భారీ మొత్తం పెడుతున్న తమ డబ్బుకి గ్యారంటీ ఏమిటి? అని రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు రాష్ట్రంలో మంత్రి శైలజానాథ్ ఆయనకు మంచి మిత్రుడని ఆయన ఈ డబ్బుకి పూర్తి గ్యారంటీ ఇస్తారని చెప్పడంతో మంత్రి గారు కూడా రంగప్రవేశం చేసారు. ఆయన బ్యాంక్ మేనేజర్ చెప్పినట్లు హామీ ఇవ్వడమే కాకుండా, మొత్తం సొమ్ము మళ్ళీ వచ్చే ఎన్నికలకి సరిగ్గా నెల రోజుల ముందుగా దేశంలో వారు ఏ ప్రాంతంలో తీసుకోదలిస్తే ఆ ప్రాంతంలో అందేలా ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలో తానూ డిల్లీ వచ్చినప్పుడు పూర్తిగా చర్చించి విషయం మాట్లాడుకోవచ్చునని మంత్రిగారన్నారు.   అయితే, ఈ లోగా కోబ్రా పోస్ట్ తన రహస్య పరిశోధన వివరాలను వెబ్ సైటు లో పెట్టేయడంతో మంత్రిగారు వెంటనే మాట మార్చి, హరికృష్ణ ప్రసాద్ కేవలం తనకు స్నేహితుడని, ఆయన వద్ద డబ్బు పెడితే భయం లేదని మాత్రమే తానూ హామీ ఇచ్చినట్లు తెలిపారు,. తనపై వస్తున్న ఆరోపణలను గాలివార్తలని ఆయన ఖండించారు. తనకు ఎటువంటి హవాలా వ్యవహారాలతో సంబందాలు లేవని ఆయన స్పష్టం చేసారు. మరి కోబ్రా పోస్టు వారెందుకు ఆవిధంగా వ్రాశారో?

సౌత్‌ సినీ పితామహుడికి గుర్తింపేది..?

        భారతీయ సినిమా వందేళ్ల పండుగ జరుపుకుంటున్న శుభ తరుణంలో భారత రాష్ట్రపతి సాక్షిగా దక్షిణ భారత సినిమాకు అవమానం జరిగింది..   ఇండియన్‌ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా భారత ప్రభుత్వం 50 మంది సినీ ప్రముఖుల స్టాంపులను విడుదల చేసింది.. అందులో ముగ్గురు తెలుగు వారికి కూడా స్థానం లభించటం గర్వకారణమే.. కాని దక్షిణా భారత సినిమా పితామహుడు పేరుగడించిన మహానుభావుడు.. తొలి థియేటర్‌ నిర్మాత అయిన రఘుపతి వెంకయ్యకు ఆ గౌరవం దక్కకపోవటం మాత్రం బాధాకరం..         తెలుగు నుంచి అల్లురామలింగయ్య, భానుమతి రామకృష్ణ, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖుల స్టాంపులను విడుదల చేశారు.. వీరు అందుకు అర్హులే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. కాని వీరికన్నా ముందే తెలుగు వారి కీర్తి ఇతర దేశాల్లో కూడా చాటి చెప్పిన రఘుపతి వెంకయ్య గారిని గుర్తించకపోవటానికి కారణం ఏంటి..?         ఆయన భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను 1981లో ఆయన పేరిట రఘుపతి వెంకయ్య అవార్డును నెలకొల్పిన ప్రభుత్వం ఈ వందేళ్ల సంబరాల్లో మాత్రం ఆయన్ను ఎందుకు చిన్న చూపు చూసింది..?         1906లో క్రోనోమెగాఫోన్‌ అనే ప్రొజెక్టర్‌ను 30వేల రూపాయల ఖర్చుతో కొని ఇతర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చిన ఆయన.., తరువాత పూర్తి స్థాయి థియేటర్‌ను నిర్మించిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. 1912లోనే చెన్నై మౌంట్‌ రోడ్‌లో ఆయన నిర్మించిన గైటీ థియేటర్‌ దేశంలోనే తొలి పూర్తి స్థాయి థియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. అంతేకాదు రెండో ప్రయత్నంగా క్రౌన్‌ థియేటర్‌ను నిర్మించిన ఘనత కూడా ఆయనదే.         ప్రస్థుతం స్టాంపుపై ముద్రితమవుతున్న తెలుగు వారిలో అల్లు రామలింగయ్య, భానుమతి రామకృష్ణలు ఇద్దరు గతంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న వారే.. అలాంటిది ఆ మహానుభావుడికి ఈ భారతీయ సినిమా వందేళ్ల సంబరాల్లో సముచిత స్థానం దక్కకపోవటం చాలా బాధాకరం..  

బరి తెగించిన యుపీయే ప్రభుత్వం

  కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి దినదినగండం నూరేళ్ళ ఆయుషులా ఉంది. పాముల పుట్టలోంచి పాములు బయటకి వస్తున్నట్లు రోజుకొక కుంభకోణం బయటపడుతోంది. ఇది చాలదన్నట్లు బయటపడుతున్నఆ కుంభకోణాల ప్రభావం తమ పార్టీపై, ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు, దాని తీవ్రత తగ్గించే ప్రయత్నంలో సీబీఐ రిపోర్టులను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించిన విషయాన్నినిన్నసీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా స్వయంగా సుప్రీంకోర్టులో బయటపెట్టారు. అటువంటిదేమి జరుగలేదని ఇంతవరకు భుకాయిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రంజిత్ సిన్హా కోర్టుకి వ్రాతపూర్వకంగా సమర్పించిన ఎఫిడవిట్ తో ఇబ్బందుల్లో పడింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నిజాయితీగా తప్పు ఒప్పుకోవడం కానీ, తప్పు చేసిన మంత్రులను, అధికారులను తొలగించడం గానీ చేయలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వాటికిదొక జబ్బుగా మారిపోయిందని కాంగ్రెస్ అనడం చూస్తే, అది ఎంత బరి తెగించిందో అర్ధం అవుతుంది.   దేశాన్నినడిపిస్తున్న ప్రభుత్వం యావత్ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నపార్లమెంటుకు జవాబు చెప్పనవసరం లేదనే భావన వ్యక్తం చేస్తోంది. అవినీతిని అరికట్టవలసిన సీబీఐని జేబు సంస్థగా మార్చేసుకొని, చివరికి అది తయారు చేసిన రిపోర్టులను కూడా చక్కబెట్టే స్థాయికి కాంగ్రెస్ ఎదిగిపోయింది. ఇక, ప్రభుత్వం సీబీఐ రెండూ కూడా అడ్డుదారులు తొక్కుతున్నపుడు, వాటిని ఇక నియత్రించ గల ఏకైక వ్యవస్థ న్యాయవ్యవస్థే. అయితే దానిని కూడా ప్రభుత్వం ప్రవితం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల ప్రధానమంత్రి చేసిన వ్యాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.   ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ తన పరిధికి లోబడి పనిచేయాలని, అది మరో రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోకి చొరబడే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. గతంలో శేషన్ వంటి శక్తివంతుడయిన ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎన్నికల సమయంలో అక్రమాలకు కళ్ళెం వేసినప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడింది. దానితో ఏకసభ్య కమీషన్ గా ఉన్న ఎన్నికల కమీషన్ను త్రిసభ్య కమీషన్ గా మార్చిఅందులో తనకనుకూలమయిన అధికారులను నియమించుకొని, ప్రధాన ఎన్నికల కమీషనర్ అధికారాలకు కత్తెర వేసింది.   ప్రస్తుతం సుప్రీంకోర్టుచేత రోజు మొట్టికాయలు వేయించుకోవడం అలవాటుగా మారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు దీనికి కూడా విరుగుడుగా ఉపాయాలు ఆలోచిస్తోంది. ప్రధానమంత్రి న్యాయవ్యవస్థను హెచ్చరించడమే అందుకు తొలి సంకేతంగా భావించవచ్చును. ప్రభుత్వానికి కాగ్ నివేదికలంటే కొందరు పనిలేనివాళ్ళు సృష్టించిన చెత్త కాగితాలతో సమానం. కాగ్  సీబీఐ నివేదికలను ఖాతరు చేయని ప్రభుత్వం, పార్లమెంటుకు కూడా తానూ  జవాబుదారీ కాదని భావిస్తోంది.   ఇప్పుడు అది సుప్రీం కోర్టు కూడా తన అవినీతి వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని కోరుకొంటున్నట్లు, ప్రధాని వ్యాక్యాలతో స్పష్టం అయింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు తన హెచ్చరికలను ఖాతరు చేయకపోతే, అప్పుడు ఎన్నికల కమీషనర్ అధికార్లను కత్తెరించినట్లే న్యాయవ్యవస్థ అధికారాలను కూడా కత్తిరించే ప్రయత్నం తప్పక చేస్తుంది. కాంగ్రెస్ కనుక ఈ ప్రయత్నంలో సఫలం అయితే ఇక మన దేశ వ్యవస్థలన్నీ కూడా ఒక దాని తరువాత మరొకటి పేక మేడల్లా కుప్పకూలడం తధ్యం.

లక్ష్మీ పార్వతి అంతర్యం ఏమిటి?

  రేపు పార్లమెంటు ప్రాంగణంలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనున్న తరుణంలో, తనకు ఆహ్వానం పంపలేదని లక్ష్మీ పార్వతి ఆవేదన చెందడం సహజమే. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆమె స్వర్గీయ యన్టీఆర్ భార్య అనేది ఎవరూ కాదనలేని నిజం. అటువంటప్పుడు ఆమె తన భర్త విగ్రహావిష్కరణకు ఆహ్వానం కోరుకోవడంలో అసహజమేమి కాదు, కానీ దురదృష్టవశాత్తు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల ఆమె ఆక్రోశానికి అర్ధం ఉందని చెప్పక తప్పదు. అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆమెను తమ తల్లి స్థానంలో ఊహించుకోవడానికి ఇష్టపడట్లేదనే సంగతిని వారు మొదటి నుండి కూడా చాలా స్పష్టంగానే తెలియజేస్తున్నారు. అటువంటప్పుడు ఆమె కూడా వారి ప్రసక్తి తేకుండా తన జీవితం గురించి ఆలోచించుకొని ఉండాల్సింది. కానీ, రాజకీయంగా చైతన్య వంతురాలయిన ఆమె తన ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో పదేపదే యన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఒకసారి చంద్రబాబు మీద, మరొకసారి నందమూరి కుటుంబ సభ్యుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఆవిధంగా వ్యవహరించడం వలన మీడియాలో గుర్తింపు పొందగలిగారు కూడా. కానీ, అదే సమయంలో ఆమెను నందమూరి కుటుంభ సభ్యులు మరింత అసహ్యించుకొనేలాచేసింది. ఆ విషయం ఆమె కూడా బాగానే గ్రహించగలిగినప్పటికీ ఆమె తన ఉనికిని కాపాడుకోవాలంటే వేరే దారిలేదు గనుక తన ధోరణిలోతను ముందుకు సాగిపోతున్నారు.   నటీనటులు సినిమా జీవితానికి, ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపుకు అలవాటు పడితే దానికి దూరంగా ఉండలేనట్లే, ప్రజా జీవితానికి అలవాటుపడిన రాజకీయ నాయకులు కూడా, ఏ గుర్తింపుకు నోచుకోని సామాన్య జీవితం ఊహించుకోలేరు. లక్ష్మీ పార్వతి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండటంచేత, ఆమె తన ‘యన్టీఆర్ భార్య హోదా’ను పదేపదే ప్రస్తావిస్తూ, నందమూరి కుటుంబ సభ్యులను, చంద్రబాబును తరచూ విమర్శిస్తూ మీడియాను, ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.   ఆమె సమాజం నుండి గుర్తింపు, గౌరవం ఆశిస్తే, సమాజం తద్విరుద్ధంగా ప్రతిస్పందిస్తోంది. తద్వారా ఆమె తనకు తానూగానే సమాజంలో వ్యతిరేఖభావనలు సృష్టించుకొంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం కనబరుస్తున్న ‘అతిస్పందన’ సమాజంలో ఆమె పట్ల వ్యతిరేఖ భావనలు కలిగిస్తోంది.   సోనియా గాంధీకి, మీరా కుమార్ కి, పురందేశ్వరికి తన నిరసన తెలియజేస్తూ లేఖలు వ్రాస్తానని చెప్పిన ఆమె, మళ్ళీ అంతలోనే తనకు రేపటిలోగా ఆహ్వానం పంపకపోతే పురందేశ్వరిని, మీరా కుమార్ ని కోర్టుకు ఈడుస్తానని బెదిరించడం, పురందేశ్వరే స్వయంగా చంద్రబాబు వెనుక ఉంది తన తండ్రికి వెన్నుపోటు పొడిపించిందని ఆరోపానాలు చేయడంతో, ప్రజలకి ఆమె పట్ల కలిగిన సానుభూతి కాస్తా ఆవిరయిపోవడమే కాకుండా ఇప్పుడు విమర్శలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది.   రాజకీయ చైతన్యవంతురాలయిన ఆమె తదనుగుణంగా పయనిస్తే అప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందగలరు. కానీ ఎల్లకాలం ఇదే సూత్రం నమ్ముకొని ఉనంత కాలం ఆమె పరిస్థితుల్లో కానీ, ఆమె పట్ల సమాజ ప్రతిస్పందనలో గానీ పెద్దగా మార్పులు రావు.

కూడంకుళం ప్రాజెక్ట్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

        కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంకు సుప్రీంకోర్టు ఓకె చెప్పింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీల నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్కడాలేవని న్యాయస్థానం తెలిపింది. చేపట్టవలసిన 17 భద్రతా చర్యల్లో ఇప్పటికే 12 అమలు చేశారని, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా అణు విద్యుత్ అవసరం ఎంతైనా ఉందని, ఇతర విద్యుత్‌లతో పోలిస్తే అణు విద్యుత్ చాలా చౌక అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని కొనసాగించవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకారులు, స్వచ్ఛంద సంస్థలు స్టే కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ వేగవంతంగా జరిగింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్ణ, దీపక్ మిశ్రాల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అణు విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ ఆందోళనలు తీవ్రతరం కావటంతో ఈ వివాదం కోర్టు కెక్కింది.

జగన్ బెయిల్ కి అనర్హుడు: సిబిఐ

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచింది. జగన్ బెయిల్‌కు అనర్హుడని, విచారణ కీలక దశలో ఉన్న సమయంలో జగన్ బయటకు వస్తే విచారణ సవ్యంగా జరగదని, ఇతర దేశాల నుంచి వచ్చిన పెట్టుబడులపై విచారణ చేయాల్సి ఉందని సీబీఐ తరఫు న్యాయవాది అశోక్‌భాన్ తెలిపారు. జగన్ బెయిల్‌ను ఆర్థిక నేరంగా పరిగణించాలని, బెయిల్ ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని అశోక్‌భాన్ కోర్టులో వాదించారు. విచారణ ఇంకా 4, 5 నెలల్లో పూర్తి అవుతుందని న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. ఏడు అంశాల్లో జగన్‌ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. దర్యాఫ్తు పూర్తయినందున జగన్ కుబెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే వాదించారు. జగన్ ఎక్కడకు పారిపోరని, ఎన్నికలు వస్తున్నందున పార్టీని సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.