బొత్సకే మళ్ళీ పీసీసీ అధ్యక్ష పదవి?
తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రకు బొత్ససత్యనారాయణ, తెలంగాణకు పొన్నాల లక్ష్మయ్య పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మరి కొద్దిసేపటిలో పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారి పేర్లను అధికారికంగా ప్రకటించవచ్చును. ఇదే ఖాయమయితే, రెండు ప్రాంతాలలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతల అసమ్మతి, అలకలు, తిరుగుబాట్లు, బుజ్జగింపుల పర్వం త్వరలోనే మొదలవవచ్చును.
బొత్ససత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపటికీ ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక చాలా ఉంది. కానీ, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు కనబడటం లేదు గనుకనే ఆయన మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకే మొగ్గు చూపి ఉండవచ్చును. అయితే, కొద్దిరోజుల క్రితంకాంగ్రెస్ పార్టీలో ‘మూడు నెలల ముఖ్యమంత్రి పదవి పోటీలు’ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓపెనింగ్ బ్యాట్ మ్యాన్ గా చిరంజీవి దిగుతారని ప్రకటించారు. అంటే, ప్రస్తుతం బొత్ససత్యనారాయణని ఈ మూడు నెలల కోసం తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా నియమించి, ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలో గెలిస్తే అప్పుడు చిరంజీవిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించి, బొత్సను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉందేమో?
ముఖ్యమంత్రి పదవికి సీమాంధ్రలో కన్నా లక్ష్మినారాయణ, చిరంజీవి, రఘువీరారెడ్డి, ఆనం రామినారాయణ రెడ్డి తదితరులు రేసులో ఉండగా, డొక్కా, కొండ్రు తదితరులు పీసీసీ అధ్యక్షపదవికి రేసులో ఉన్నారు. కనుక, ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకోవచ్చును.