లేడీస్ హాస్టల్లో కేడీ...

  విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని ఒక లేడీస్ హాస్టల్‌లో ఒక కేడీ ప్రవేశించి హడావిడి చేసిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లిమర్లలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోకి ఈనెల నాలుగో తేదీన ఒక ఆగంతకుడు కిటికీలోంచి హాస్టల్‌లోకి ప్రవేశించాడని, హాస్టల్లో కొంతమంది ఆడపిల్లల మీద అత్యాచారయత్నం చేశాడని తెలుస్తోంది. అయితే ఆడపిల్లలు భయంతో కేకలు వేయడంతో అతను పారిపోయాడని చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసి ఆ వ్యక్తి ఎవరన్నది తేల్చాలని ఆడపిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీకృష్ణ జన్మస్థానానికి యాంకర్‌!!

  పది కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఓ విద్యాసంస్థ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో టీవీ యాంకర్ హర్షవర్ధన్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వీరికి పదిహేను రోజులపాటు రిమాండ్ విధించింది. దాంతో ఈ ఐదుగురినీ పోలీసులు ఏలూరులోని సబ్ జైలుకు తరలించారు. ఇదిలా వుండగా టీవీ యాంకర్ హర్షవర్ధన్ కారణంగా తాము కూడా ఎంతో నష్టపోయామని కొంతమంది ఇప్పుడు బయటకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ క్రైం యాంకర్ హర్షవర్ధన్ నేర చరిత్ర గురించి మరింత లోతుగా పరిశోధన జరపాల్సిన అవసరం వుందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

మూడేళ్ళపాటు బాత్‌రూమ్‌లో బంధించారు...

  వరకట్న పిశాచి వికృతరూపం అత్తవారింటి రూపంలో మరోసారి కనిపించింది. అదనపు కట్నం తేలేదని ఒక యువతిని అత్తింటివారు దారుణంగా హింసించి బాత్‌రూమ్‌లోంచి మూడేళ్ళపాటు బయటకి రాకుండా బంధించారు. మహారాష్ట్రలోని దర్బంగా పట్టణంలో ఈ దారుణం జరిగింది. మూడేళ్ళపాటు బాత్‌రూమ్‌లో మగ్గిన యువతిని పోలీసులు బయటకి తీసుకొచ్చారు. అదనపు కట్నం తేలేదని, ఆడపిల్లని కన్నానని తనను తన అత్తింటివారు చిత్రహింసలకు గురిచేశారని ఆమె పోలీసులకు తెలిపింది. తన పుట్టింటి వారు తనను చూడటానికి వచ్చినా బయటి నుంచి బయటే పంపించేవారని ఆమె రోదిస్తూ చెప్పింది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం రాక్షసుల్లా ప్రవర్తించిన బాధితురాలి భర్త ప్రభాత్ కుమార్ సింగ్, ఆమె మామ ధీరేంద్ర సింగ్, అత్త ఇంద్రాదేవిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ డ్రైవర్ గంగాధర్‌కి నివాళి...

  హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు దగ్ధం కావడం, ఆ బస్సు డ్రైవర్ గంగాధర్ ఈ ప్రమాదంలో సజీవ దహనం కావడం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించింది. డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి ఆరు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

బెల్లంకొండ సురేష్ ఆత్మహత్యాయత్నం... ఖండన

  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడన్న పుకార్లు ఫిలింనగర్‌లో వ్యాపించాయి. బెల్లంకొండ సురేష్ అంటే గిట్టనివాళ్ళు ఎవరు పుట్టించారోగానీ, ఈ వార్త పాపం నిక్షేపంలా వున్న బెల్లంకొండకు మనస్తాపాన్ని కలిగించాయి. ఆయన వెంటనే ఈ పుకార్లను ఖండించారు. తాను ఆత్మహత్యాయత్నం చేసేంత పిరికివాడిని కాదని, తాను తన తదుపరి చిత్రం పనుల్లో బిజీగా వున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి దారుణమైన పుకార్లు సృష్టించడం అన్యాయం. ఇటీవలి కాలంలో బెల్లంకొండ సురేష్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఒక సంస్థకు చెల్లించాల్సిన పాతిక కోట్లకు పైగా మొత్తానికి సంబంధించి ఆయన మీద ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశారన్న పుకార్లు వ్యాపించాయి. ఈ పుకార్ల విషయంలో బెల్లంకొండ సురేష్ వివరణ ఇవ్వడంతో క్లారిటీ వచ్చింది. ఇలాంటి పుకార్లు రావడం వల్ల బెల్లంకొండ మీద వున్న దిష్టి మొత్తం పోయినట్టుగా భావిస్తున్నామని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఫేస్‌బుక్ విలువ ఎక్కడికో వెళ్ళిపోయింది

  ఫేస్బుక్ మార్కెట్ విలువ 12.05 లక్షల కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే 22వ అతిపెద్ద కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. సోమవారం నాడు ఫేస్ బుక్ కంపెనీ షేర్లు అత్యధికంగా 77.6 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆది అల్ టైం హై అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇన్స్టాగ్రామ్ లాంటి ఫొటో షేరింగ్ సైట్లు, వాట్స్ యాప్ లాంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులను టేకోవర్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించుకున్నా, ఇంకా చేయలేదు. అది కూడా అయితే దీని విలువ మరింత పెరిగిపోతుందని అంటున్నారు. దీంతో ఫేస్బుక్ షేరుకు, ఆ కంపెనీకి బంగారు భవిష్యత్తు ఉందన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ.

ప్రియురాలిపై శాడిస్ట్ లవర్ కాల్పులు

  నాకు దక్కనిది వేరెవరికీ దక్కడానికి వీల్లేదన్నది సినిమాల్లో విలన్లు చెప్పే మాట. నిజ జీవితంలోనూ అలాంటి విలన్లకి తక్కువేమీ లేదు. గుర్గావ్‌లో లలిత్ అనే ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి అతన్ని కాదని ప్రదీప్ అనే మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. దీన్ని తట్టుకోలేని లలిత్ ప్రదీప్ మీద పగబట్టాడు. సోమవారం నాడు ప్రదీప్, లలిత్, ఆ యువతి ఒక పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా లలిత్‌కి, ప్రదీప్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశం ఆపుకోలేని లలిత్ తన దగ్గర వున్న నాటు తుపాకీతో ప్రదీప్ మీద కాల్పులు జరిపాడు. తాను ప్రేమించిన అమ్మాయి మీద కూడా కాల్పులు జరిపాడు. అయితే టైమ్ బాగుండి వాళ్ళిద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, లలిత్, ప్రదీప్ ఇద్దరూ గతంలోనే పెళ్ళయి పెళ్ళాలు పిల్లలు వున్నవాళ్ళే.

దంపతుల మధ్య ఫోన్ వివాదం.. భార్యని చంపిన భర్త...

  ఫోన్ ఆమె ప్రాణం తీసింది. కేవలం ఫోన్లో మాట్లాడ్డమే ఆమె నిండు జీవితానికి ముగింపు పలికింది. బెంగుళూరుకు చెందిన రేణుక, సైమన్ అనే యువతి యువకులు ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకున్నారు. సైమన్ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో కూడా చేరాడు. సంసారం హాయిగా సాగిపోతోంది. అయితే రేణుకకి గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతూ వుండటం అలవాటు. భర్త ఇంట్లో వున్నా ఫోన్ మాట్లాడ్డంలోనే మునిగిపోయి వుంటుంది. ఈ విషయంలో సైమన్ ఆమెను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ రేణుక తన ధోరణి మార్చుకోలేదు. సైమన్ ఆఫీసు నుంచి ఎప్పుడు ఇంటికి పోన్ చేసినా ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చేది. ఈ విషయంలో గత నెల నుంచి దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం రాత్రి దంపతులు తీవ్రంగా గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన సైమన్ కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.

రంజిత్ సిన్హాకి సుప్రీంకోర్టు తాఖీదులు...

  అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడ్డట్టు అందరికీ నోటీసులు ఇచ్చే సీబీఐ డైరెక్టర్‌కే నోటీసులు జారీ అయ్యాయి. 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారితో భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుంభకోణం నిందితులతో భేటీ అయిన ఆయన్ని సీబీఐ డైరెక్టర్గా తొలగించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు. ఈ ఆరోపణలపైసంబంధించి పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ‘సుప్రీం’ రంజిత్ సిన్హాను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణలో వుండాలంటే తెలంగాణకి సెల్యూట్ కొట్టాలి: కేసీఆర్

  తెలంగాణ సమాజాన్ని అగౌరవ పరిస్తే పాతరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. వరంగల్‌లో కాళోజీ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పై విధంగా స్పందించారు. రెండు ఛానెళ్ళను తెలంగాణలో ప్రసారం కాకుండా చేయడం పట్ల జరుగుతున్న ఆందోళన మీద ఆయన మాట్లాడారు. ‘‘మా తెలంగాణ గడ్డ మీద ఉండాలంటే మా ప్రాంతానికి సలాం కొట్టాలి. మా తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కర్లేదు.. మా తెలంగాణ ప్రజా ప్రతినిధులను పాచికల్లు తాగే ముఖాలు అంటే క్షమించాలా? అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం. కేసీఆర్ని తిడితే బాధలేదు. తెలంగాణ శాసన సభ్యులను తిట్టడం అవమానకరం. తెలంగాణ శాసనసభ్యులందరూ ఆ ఛానల్స్ మీద సమష్టిగా తీర్మానం చేశాయి. ఆ వ్యవహారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పరిధిలో వుంది. ఈ అంశానికి స్పందించిన ఎంఎస్ఓలు ప్రసారాలు నిలిపేశారు. దీనిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి రాద్ధాంతం చేశారు. ఆ రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సెల్యూట్ చేస్తున్నా. ఈ అంశంలో ఆ ఛానెళ్ళలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కూడా ఆలోచించాలి’’ అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు.

మోడీ పనితీరు అద్భుతం: కాంగ్రెస్ నేతలు

  భారత ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ ప్రత్యర్థులతో కూడా శభాష్ అనిపించుకున్నారు. ఎన్నడూ ఎవరినీ పొగిడి ఎరుగని కాంగ్రెస్ నాయకులకు కూడా మోడీని ప్రశంసించక తప్పలేదు. ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరో కాదు... దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్. జమ్ము - కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడానికి మోడీ స్పందించిన తీరు అందరికీ నచ్చింది. అందరితోపాటు కాంగ్రెస్ నాయకులకు కూడా నచ్చడమే వింత. కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ఆయనను ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్ వరదలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తీరు అద్బుతమని కొనియాడారు. జమ్ము కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో పాటు, ఆర్థిక సాయంగా వెయ్యి కోట్లు ప్రకటించడం,భద్రతా దళాలను సహాయక చర్యల్లో దించడం లాంటి చర్యలతో మోడీ పనితీరు బాగుందని వారు పేర్కొన్నారు.

గోదావరి ఉగ్రరూపం...

  భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకూ వరద జోరు పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి 55 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలానికి ఎగువనున్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడూ ఇంద్రావతి, చెంగల్వ, వెంగల్వ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉరవడి అంతా గోదావరిలో కలవడంతో తీవ్రప్రభావం చూపిస్తోంది. చెర్లమండలం, తాళ్లపేగు ప్రాజెక్టు నుంచి 13 గేట్లు ఎత్తివేసి 80వేల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు. దీనికి తోడూ ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

  బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కంటతడి పెట్టింది. దానికి కారణం మరెవరో కాదు.. మరో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. అయితే ప్రియాంక చోప్రా నటించిన ‘మేరి కోమ్’ చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనైన శిల్పాశెట్టి కంటతడి పెట్టిందే తప్ప మరో కారణం కాదు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మేరి కోమ్’ చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి మేరి కోమ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మేరి కోమ్ పాత్రను ప్రియాంకా చోప్రా ధరించింది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన శిల్పాశెట్టి ప్రియాంక నటనను చూసి కంటతడి పెట్టానని ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ‘‘మేరి కోమ్ సినిమా చూశాను. ప్రియాంక బాగా నటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఈ చిత్రాన్ని చూసి కంట తడి పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ఇది’’ అని శిల్ప ట్వీట్ చేసింది.

హీరోయిన్ మైత్రేయ రేప్ కేసు: మంత్రి కొడుక్కి బెయిల్

  కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని, ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేంద్ర మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేసింది. మైత్రేయ కేసు పెట్టినప్పటి నుంచి కార్తీక్ గౌడ పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో కోర్టు కార్తీక గౌడ అరెస్టుకు వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కార్తీక్‌గౌడకు ఊరట లభించింది. అత్యాచారం, చీటింగ్ కేసులో కార్తీక్ గౌడకు బెంగుళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో మంత్రి సదానంద గౌడ కుటుంబానికి ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది.