అక్కినేని నాగార్జున అవయవదానం

  అక్కినేని నాగార్జున అవయవదాన డిక్లరేషన్ మీద సంతకం చేశారు. యశోదా హాస్పిటల్ హైదరాబాదులో నిర్వహించిన ‘ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్’లో పాల్గొన్న నాగార్జున అవయవదానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4300 మంది అవయవదానానికి అంగీకరించి, డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ డ్రైవ్‌కు హాజరైన వారితో నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. యశోదా ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని నాగార్జున అన్నారు. అప్పట్లో తన తండ్రి నాగేశ్వరరావు కూడా అవయవదానానికి ముందుకొచ్చినా, డాక్టర్లు సాధ్యంకాదని చెప్పారని తెలిపారు. ఆయనకు సోకిన వ్యాధి కారణంగా అవయవదానం వీలుకాదన్నారని నాగ్ వివరించారు. నాగార్జునతోపాటు పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సోనియా, షట్లర్ పీవీ సింధు కూడా అవయవదాన డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు.

వస్త్రధారణపై దీపిక సంచలన కామెంట్స్

  ‘ఫైండింగ్ ప్యానీ’ సినిమాలో దీపిక పదుకొనే వస్త్ర ధారణ విషయంలో వివాదం రేగింది. దీపిక తన వక్షోజాలు కనిపించేలా వస్త్రధారణ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో చాలా తీవ్రంగా స్పందించారు. ‘‘నేను మహిళను. నాకు వక్షోజ సౌందర్యం వుంటుంది. దానివల్ల మీకేంటి సమస్య’’ అని ట్విట్టర్లో విమర్శకులను ప్రశ్నించింది. అంతేకాకుండా మహిళలను గౌరవించడం చేతగాని వారు వారి గురించి మాట్లాడకుండా వుండటం మంచిదని సలహా ఇచ్చింది. దీపిక పదుకొనే ట్విట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె ట్విట్స్‌కి భారీ స్థాయిలో స్పందన, మద్దతు లభించాయి.

బతుకమ్మ ఉత్సవాలకు 10 కోట్లు విడుదల

  తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల వేడుకను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవం. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటుకై శాఖల మధ్య సమన్వయం కోసం సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2న జరిగే బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి ఈనెల 29 లోగానే చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, అధికారులను సూచించింది. ఈ వేడుకలలో ఎటువంటి అపశ్రుతి దొర్లకుండా పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఐటీలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత ఎంతమాత్రం తగ్గవన్న అభిప్రాయాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో తన శాఖ 100 రోజుల పాలన ప్రగతి నివేదికను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. ఇద్దరూ ఐటీపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కోరారు. వాటిపై దృష్టిపెడతాం..’ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారని, దీనిపై మీ స్పందనేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా ‘పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం. అందరూ పత్రికా స్వేచ్ఛకు విలువనివ్వాలి’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

అణిగిమణిగి వుండాలంటూ... మణిపూర్‌‌లో తెలుగు విద్యార్థులపై దాడి

  ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానిక, స్థానికేతర వివాదం నడుస్తుంటే, అక్కడ మణిపూర్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మీద అక్కడి విద్యార్థులు మీరు స్థానికేతరులు అంటూ దాడులు చేశారు. మణిపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 30 మంది తెలుగు విద్యార్థులపై లోకల్ స్టూడెంట్స్ దాడి చేశారు. స్థానికేతరులంటూ ఈ దాడిలో 8 మంది తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. 20 రోజుల క్రితం విద్యార్థుల మధ్య మొదలైన గొడవలు ఇప్పుడు భౌతిక దాడులకు వరకు వచ్చాయి. తమకు అణిగిమణిగి వుంటేనే ఇక్కడ ఉండాలని మణిపూర్ స్థానిక విద్యార్థులు తెలుగు విద్యార్థులకు హుకుం జారీ చేయడంతో తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ పిల్లల భద్రతపై విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

మహారాష్ట్ర పీఠం బీజేపీదే: సర్వే

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్ - ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 200 సీట్లను కైవసం చేసుకోవచ్చునని వెల్లడి అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల పైన ఉంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ సొంతగా 107 సీట్లను పొందే అవకాశం వుందని, కాంగ్రెస్ పార్టీ 2009లో సాధించిన 82 స్థానాల నుండి 40కి పడిపోయే అవకాశం వుందని సర్వేలో తేలింది. బీజేపీ మిత్రపక్షం శివసేన 64 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అలాగే హర్యానాలో కూడా బీజేపీ హవా వుంటుందని సర్వే చెప్పింది.

ఉగ్రవాదులకు బలయిన బ్రిటిష్ పౌరుడు

      బిన్ లాడెన్ మట్టుబెట్టి తాలిబన్ ఉగ్రవాదులకు అమెరికా కళ్ళెం వేసిందని అందరూ ఊపిరి తీసుకొంటుంటే కొత్తగా ఐ.యస్.ఐ.యస్.అనే మరో ఉగ్రవాద సంస్థ సిరియాలో పుట్టుకొచ్చింది. కొద్ది వారాల క్రితం ఇద్దరు అమెరికన్లను అత్యంత కిరాతకంగా గొంతులు కోసి ఆ వీడియోను యూ ట్యూబ్ కి ఎక్కించిన ఆ సంస్థ నిన్న (శనివారం) తమ వద్ద బందీగా ఉన్న డేవిడ్ హెయిన్స్ అనే బ్రిటిష్ దేశస్థుడిని అదేవిధంగా చంపి ఆ వీడియోను కూడా విడుదల చేసింది. బ్రిటన్ దేశం తమపై బాంబుళ వర్షం కురిపిస్తున్న అమెరికాతో చేతులు కలిపినందుకు ఆ దేశానికి హెచ్చరికగా డేవిడ్ హెయిన్స్ కు ఈ శిక్ష విధిస్తున్నామని సదరు ఉగ్రవాద సంస్థ తను జారీ చేసిన వీడియోలో హెచ్చరించింది.  

మెదక్ పోలింగ్: 4 గంటలకు 61 శాతం ఓటింగ్...

  మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్‌ ఎలాంటి సమస్యలూ లేకుండా జరుగుతోంది. మధ్యాహ్నం వరకు 49 శాతం పోలింగ్‌ నమోదైంది. పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒంటిగంట సమయానికి అత్యధికంగా నర్సాపూర్‌లో 63 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా పటాన్‌చెరులో 34.5 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 61 శాతం పోలింగ్ పూర్తయింది. ఈసారి మెదక్ నియోజకవర్గంలో 95 శాతం పోలింగ్ జరిగే అవకాశం వుందని ఊహించారు. అయితే పోలింగ్ పూర్తయ్యే సమయానికి అనుకున్న స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఛానళ్ళ విషయంలో కేసీఆర్‌తో మాట్లాడతా: రాజ్‌నాథ్

  తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోగి ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేసిన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మరోసారి మాట్లాడనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇటీవల కేసీఆర్‌ తమతో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా టీవీ చానెళ్లపై ఆయనతో చర్చించానన్నారు. ఇటీవల మీడియాను బెదిరిస్తూ కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడంపై కేంద్ర హోం మంత్రి స్పందిస్తూ దీనిపై కేసీఆర్‌తో మరోసారి మాట్లాడతానని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో దానిపై కేంద్రం స్పందన ఏమిటని అడిగితే గణాంకాల కోసం సర్వే చేసి ఉండవచ్చునని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

సాక్షి సిబ్బంది నుంచి 32 లక్షల దోపిడీ

  సినీ ఫక్కీలో దోపిడీ చేసిన దొంగలు సాక్షి దినపత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఈ దోపిడీ జరిగింది. రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి 32 లక్షల రూపాయల డబ్బును బ్యాగ్లో తీసుకుని బ్యాంకులో జమ చేయడానికి వెళ్లారు. వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసిన ఓ స్కార్పియో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు తీసుకెళ్తున్న 32 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు.