మెదక్ పోలింగ్: 4 గంటలకు 61 శాతం ఓటింగ్...

  మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్‌ ఎలాంటి సమస్యలూ లేకుండా జరుగుతోంది. మధ్యాహ్నం వరకు 49 శాతం పోలింగ్‌ నమోదైంది. పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒంటిగంట సమయానికి అత్యధికంగా నర్సాపూర్‌లో 63 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా పటాన్‌చెరులో 34.5 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 61 శాతం పోలింగ్ పూర్తయింది. ఈసారి మెదక్ నియోజకవర్గంలో 95 శాతం పోలింగ్ జరిగే అవకాశం వుందని ఊహించారు. అయితే పోలింగ్ పూర్తయ్యే సమయానికి అనుకున్న స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఛానళ్ళ విషయంలో కేసీఆర్‌తో మాట్లాడతా: రాజ్‌నాథ్

  తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోగి ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేసిన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మరోసారి మాట్లాడనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇటీవల కేసీఆర్‌ తమతో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా టీవీ చానెళ్లపై ఆయనతో చర్చించానన్నారు. ఇటీవల మీడియాను బెదిరిస్తూ కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడంపై కేంద్ర హోం మంత్రి స్పందిస్తూ దీనిపై కేసీఆర్‌తో మరోసారి మాట్లాడతానని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో దానిపై కేంద్రం స్పందన ఏమిటని అడిగితే గణాంకాల కోసం సర్వే చేసి ఉండవచ్చునని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

సాక్షి సిబ్బంది నుంచి 32 లక్షల దోపిడీ

  సినీ ఫక్కీలో దోపిడీ చేసిన దొంగలు సాక్షి దినపత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఈ దోపిడీ జరిగింది. రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి 32 లక్షల రూపాయల డబ్బును బ్యాగ్లో తీసుకుని బ్యాంకులో జమ చేయడానికి వెళ్లారు. వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసిన ఓ స్కార్పియో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు తీసుకెళ్తున్న 32 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని చాలాదూరం తీసుకుని వెళ్తున్నాయి. మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగాచర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఓ త్రిసభ్య కమిటీని వేసింది. ఇందులో సీనియర్ జర్నలిస్టు రాజీవ్ రంజన్‌నాగ్ కన్వీనర్‌గా, కె. అమర్‌నాథ్, కృష్ణప్రసాద్ సభ్యులుగా ఉంటారు. తెలంగాణలో మీడియా ఎదుర్కొంటున్న ముప్పు, బెదిరింపుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు పీసీఐ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా

  త్రిపురలో సెల్‌ఫోన్ సరదా ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసింది. పశ్చిమ త్రిపురలోని తకర్జల హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు హాస్టల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లను రహస్యంగా వాడుతున్నారు. ఈ విషయం తెలిసి హాస్టల్ వార్డెన్ ఆ ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే ముగ్గురు అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ హాస్టల్ నుంచి పారిపోయారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వీరిపై ఎలాంటి అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని, సెల్‌ఫోన్ విషయంలో మందలించినందువల్లే ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు చెబుతున్నారు.

జీమెయిల్, యాహూ మెయిల్‌పై నిషేధం?

  జీమెయిల్, యాహూ మెయిల్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించనుందా? అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఈ రెండు మెయిల్స్‌పై భారతదేశంలోనే నిషేధం విధించడం కాదు.. ప్రభుత్వం నిర్వహించే కార్యకలాపాలు, లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ రెండు మెయిల్స్‌ని ఇక ఉపయోగించబోరని తెలుస్తోంది. కీలకమైన, సున్నితమైన ప్రభుత్వ డేటాను కాపాడుకోవాలంటే ఈ రెండు మెయిల్స్‌ని వాడకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన విభాగం (డీఈఐటీవై) కేంద్ర కేబినెట్‌కి ప్రతిపాదనలు పంపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు మినహా మిగతా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుగుతాయట.

రేపు మెదక్, నందిగామ ఉప ఎన్నికలు..

  తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం నాడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ రాజీనామాతో, నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్‌లో బీజేపీ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్‌రెడ్డి పోటీలో వున్న ప్రధాన అభ్యర్థులు. అలాగే నందిగామలో తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో వుండగా, కాంగ్రెస్ తరఫున బాబూరావు పోటీలో వున్నారు.

ఇండియాకి మరిన్ని ప్రకృతి విపత్తులు...

  భారతదేశాన్ని ముందు ముందు మరెన్నో ప్రకృతి విపత్తులు ముంచెత్తే అవకాశం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సంభవించిన కాశ్మీర్ వరదలు ఈ దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన వరదలని, ముందు ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు దేశంలో మరిన్ని సంభవించే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎన్ఇ) పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా వుండటం మంచిదని సూచిస్తున్నారు. సీఎస్ఇ నివేదిక ప్రకారం భారత దేశంలో అధిక వర్షపాతం వల్లే ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఏడాదీ వర్షాకాలం వచ్చే ముందుగానే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు.

కొత్త జిల్లాలా.. అలాంటిదేమీ లేదు... కేసీఆర్

  ఈమధ్య కాలంలో తెలంగాణలోని 10 జిల్లాలను విభజించబోతున్నారని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. 10 జిల్లాలను 24 జిల్లాలుగా విభజించనున్నారని కొన్ని పత్రికలలో, కాదు కాదు... ప్రస్తుతానికి ఏడు జిల్లాలను మాత్రమే పెంచుతున్నారని మరికొన్ని పత్రికలలో వచ్చాయి. ఈ జిల్లాలల పెంపు విషయంలో తెలంగాణ ప్రజల్లో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీ పరిస్థితికి తెలంగాణ సీఎం కేసీఆర్ తెర దించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు వుంటుందని కేసీఆర్ తెలిపారు.

171 మంది రైతుల ఆత్మహత్య: పొన్నాల లెక్క...

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 171 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో 30 మంది రైతులు కేసీఆర్ సొంత నియోజకవర్గంలో వున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లెక్కలు బయటకి తీసి చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ అవసరం లేని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారని, ఓ రకంగా చెప్పాలంటే నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని పొన్నాల విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్ గద్దెనెక్కి వంద రోజులు దాటినా తెలంగాణలో కరవు, కరెంట్, రైతుల ఆత్మహత్యలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్ ఆలోచనలు ఆకాశంలో, చేతలు పాతాళంలో వున్నాయి’’ అన్నారు.