బతుకమ్మకి సోనియాని ఆహ్వానించాల్సిందే.. టీ కాంగ్రెస్

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించాల్సిందేనని టీ కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీనే కాబట్టి బతుకమ్మ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాల్సిందేనని టీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞులై వుండాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు డి.కె.అరుణ చెబుతున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు కేంద్ర మంత్రులను, విదేశీయులను ఆహ్వానిస్తున్న కేసీఆర్ సోనియాగాంధీని మాత్రం ఎందుకు ఆహ్వానించడం లేదో తమకు అర్థం కావడం లేదని డి.కె.అరుణ అన్నారు. ఈనెల 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.

రాజ్యసభ ఇస్తే ఆలోచిస్తా.. అమీర్‌ఖాన్

  బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కి రాజ్యసభ సీటు మీద కన్ను పడినట్టు వుంది. ఆమధ్య సచిన్ టెండూల్కర్, రేఖ లాంటి వాళ్ళకి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చేసరికి, తనకు కూడా రాజ్యసభ సీటు అలాగే బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అందితే బాగుండని అమీర్‌ఖాన్ ఆలోచిస్తున్నట్టుంది. అందుకే తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే ఎంపీగా సేవలందించడానికి సిద్దమేననే సంకేతాలిచ్చాడు. రాజ్యసభకు ఎంపికకు అవకాశం వస్తే ఆలోచిస్తానని ఓ హిందీ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. మోడీ పాలన గురించి తన కంటే మీడియాకే ఎక్కువ తెలుసునని అమీర్‌ఖాన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

నా డ్యూటీ నేను చేశా.. మంత్రుల తప్పుల గురించి తెలియదు.. మన్మోహన్

  మాజీ ప్రధానమంత్రి నోరు తెరిచారు. ప్రధానమంత్రిగా తన డ్యూటీ తాను చేశానని, తన మంత్రివర్గంలో వున్న వాళ్ళు తప్పులు చేశారో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు. మన్మోహన్‌సింగ్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన కుమార్తె దమన్‌సింగ్ రాసిన ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ, ‘‘నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి చేశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’ అంటూ రెండంటే రెండు ముక్కల్లో తన స్పందనను వెల్లడించేశారు. తండ్రిపై వచ్చిన ఆరోపణలపై కూడా దమన్ సింగ్ కూడా పెద్దగా స్పందించలేదు. ‘‘వాస్తవంగా ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. అందువల్ల దానిపై నేనేమీ మాట్లాడలేను’’ అని ఆమె అన్నారు.

హైదరాబాద్ బాలుడు సాయి వర్మ ఖమ్మంలో హత్య...

  హైదరాబాద్‌కి చెందిన నాలుగేళ్ళ బాలుడు సాయివర్మను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని పరామర్శించడానికి తన కుమారుడు నిషాంత్ సాయివర్మను తీసుకుని ఈనెల 11వ తేదీన ఖమ్మం వెళ్ళింది. కోమలాదేవి ఆస్పత్రిలో వున్నప్పుడు సాయివర్మ కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి బాలుడి కోసం తల్లిదండ్రులు వెతుకుతూనే వున్నారు. పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఆదివారం నాడు ఖమ్మం శివారులోని రఘునాథపాలెం మండలం బలాపేట ప్రాంతంలోని పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో సాయివర్మ మృతదేహం కనిపించింది. బాలుడి హంతకులెవరు, హత్యకు గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.

నా జన్మదినం జరపొద్దు.. కాశ్మీర్‌ని ఆదుకోండి.. మోడీ..

  భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు ఈనెల 17వ తేదీ. ఆరోజున ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు వేడుకలు జరిపే బదులు భారీ వరదల కారణంగా ఆపదలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని తన స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామంటూ కోరారని, అయితే తాను వారిని వారించానని చెప్పారు. తన జన్మదిన వేడుకలకు ఖర్చుచేసే మొత్తాన్ని కాశ్మీర్ వరద సహాయంగా అందజేయాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

అక్కినేని నాగార్జున అవయవదానం

  అక్కినేని నాగార్జున అవయవదాన డిక్లరేషన్ మీద సంతకం చేశారు. యశోదా హాస్పిటల్ హైదరాబాదులో నిర్వహించిన ‘ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్’లో పాల్గొన్న నాగార్జున అవయవదానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4300 మంది అవయవదానానికి అంగీకరించి, డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ డ్రైవ్‌కు హాజరైన వారితో నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. యశోదా ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని నాగార్జున అన్నారు. అప్పట్లో తన తండ్రి నాగేశ్వరరావు కూడా అవయవదానానికి ముందుకొచ్చినా, డాక్టర్లు సాధ్యంకాదని చెప్పారని తెలిపారు. ఆయనకు సోకిన వ్యాధి కారణంగా అవయవదానం వీలుకాదన్నారని నాగ్ వివరించారు. నాగార్జునతోపాటు పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సోనియా, షట్లర్ పీవీ సింధు కూడా అవయవదాన డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు.

వస్త్రధారణపై దీపిక సంచలన కామెంట్స్

  ‘ఫైండింగ్ ప్యానీ’ సినిమాలో దీపిక పదుకొనే వస్త్ర ధారణ విషయంలో వివాదం రేగింది. దీపిక తన వక్షోజాలు కనిపించేలా వస్త్రధారణ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో చాలా తీవ్రంగా స్పందించారు. ‘‘నేను మహిళను. నాకు వక్షోజ సౌందర్యం వుంటుంది. దానివల్ల మీకేంటి సమస్య’’ అని ట్విట్టర్లో విమర్శకులను ప్రశ్నించింది. అంతేకాకుండా మహిళలను గౌరవించడం చేతగాని వారు వారి గురించి మాట్లాడకుండా వుండటం మంచిదని సలహా ఇచ్చింది. దీపిక పదుకొనే ట్విట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె ట్విట్స్‌కి భారీ స్థాయిలో స్పందన, మద్దతు లభించాయి.

బతుకమ్మ ఉత్సవాలకు 10 కోట్లు విడుదల

  తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల వేడుకను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవం. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటుకై శాఖల మధ్య సమన్వయం కోసం సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2న జరిగే బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి ఈనెల 29 లోగానే చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, అధికారులను సూచించింది. ఈ వేడుకలలో ఎటువంటి అపశ్రుతి దొర్లకుండా పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఐటీలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత ఎంతమాత్రం తగ్గవన్న అభిప్రాయాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో తన శాఖ 100 రోజుల పాలన ప్రగతి నివేదికను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. ఇద్దరూ ఐటీపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కోరారు. వాటిపై దృష్టిపెడతాం..’ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారని, దీనిపై మీ స్పందనేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా ‘పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం. అందరూ పత్రికా స్వేచ్ఛకు విలువనివ్వాలి’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

అణిగిమణిగి వుండాలంటూ... మణిపూర్‌‌లో తెలుగు విద్యార్థులపై దాడి

  ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానిక, స్థానికేతర వివాదం నడుస్తుంటే, అక్కడ మణిపూర్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మీద అక్కడి విద్యార్థులు మీరు స్థానికేతరులు అంటూ దాడులు చేశారు. మణిపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 30 మంది తెలుగు విద్యార్థులపై లోకల్ స్టూడెంట్స్ దాడి చేశారు. స్థానికేతరులంటూ ఈ దాడిలో 8 మంది తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. 20 రోజుల క్రితం విద్యార్థుల మధ్య మొదలైన గొడవలు ఇప్పుడు భౌతిక దాడులకు వరకు వచ్చాయి. తమకు అణిగిమణిగి వుంటేనే ఇక్కడ ఉండాలని మణిపూర్ స్థానిక విద్యార్థులు తెలుగు విద్యార్థులకు హుకుం జారీ చేయడంతో తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ పిల్లల భద్రతపై విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

మహారాష్ట్ర పీఠం బీజేపీదే: సర్వే

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్ - ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 200 సీట్లను కైవసం చేసుకోవచ్చునని వెల్లడి అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల పైన ఉంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ సొంతగా 107 సీట్లను పొందే అవకాశం వుందని, కాంగ్రెస్ పార్టీ 2009లో సాధించిన 82 స్థానాల నుండి 40కి పడిపోయే అవకాశం వుందని సర్వేలో తేలింది. బీజేపీ మిత్రపక్షం శివసేన 64 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అలాగే హర్యానాలో కూడా బీజేపీ హవా వుంటుందని సర్వే చెప్పింది.

ఉగ్రవాదులకు బలయిన బ్రిటిష్ పౌరుడు

      బిన్ లాడెన్ మట్టుబెట్టి తాలిబన్ ఉగ్రవాదులకు అమెరికా కళ్ళెం వేసిందని అందరూ ఊపిరి తీసుకొంటుంటే కొత్తగా ఐ.యస్.ఐ.యస్.అనే మరో ఉగ్రవాద సంస్థ సిరియాలో పుట్టుకొచ్చింది. కొద్ది వారాల క్రితం ఇద్దరు అమెరికన్లను అత్యంత కిరాతకంగా గొంతులు కోసి ఆ వీడియోను యూ ట్యూబ్ కి ఎక్కించిన ఆ సంస్థ నిన్న (శనివారం) తమ వద్ద బందీగా ఉన్న డేవిడ్ హెయిన్స్ అనే బ్రిటిష్ దేశస్థుడిని అదేవిధంగా చంపి ఆ వీడియోను కూడా విడుదల చేసింది. బ్రిటన్ దేశం తమపై బాంబుళ వర్షం కురిపిస్తున్న అమెరికాతో చేతులు కలిపినందుకు ఆ దేశానికి హెచ్చరికగా డేవిడ్ హెయిన్స్ కు ఈ శిక్ష విధిస్తున్నామని సదరు ఉగ్రవాద సంస్థ తను జారీ చేసిన వీడియోలో హెచ్చరించింది.