హలో ఉద్ధవ్... అమిత్ షా ఫోను...

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిత్రపక్షాలైన భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదరని విషయం తెలిసిందే. బీజేపీకి 119 సీట్లు ఇస్తామని శివసేన ఇచ్చిన ఆఫర్ని స్థానిక బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం 130 సీట్లన్నా బీజేపీకి కేటాయించాలని, లేకపోతే మీ పార్టీతో పొత్తుకో నమస్కారం అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే బీజేపీ, శివసేన పొత్తు కుదురుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. స్థానిక బీజేపీ నాయకులయితే మహారాష్ట్రలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలన్న ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరేకి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో రెండు పార్టీలూ సామరస్యపూర్వకంగా కలసి వెళ్తేనే రెండు పార్టీలకూ మేలు జరుగుతుందని, లేకపోతే రెండు పార్టీలే నష్టపోతాయని ఆయనక చెప్పినట్టు సమాచారం.

శశికపూర్‌కి తీవ్ర అస్వస్థత

  అలనాటి బాలీవుడ్ అందాల కథానాయకుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనను ఆదివారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్నారు. శశికపూర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా బాధపడుతున్నారు. ఆదివారం ఆయన శ్వాస అందక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇంటెన్సివ్ కేర్‌లో వున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదని వైద్యులు చెబుతున్నారు. శశికపూర్ 160కి పైగా సినిమాలలో నటించారు. ఆయన మూడుసార్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.

మార్స్ ఆర్బిటర్ (మామ్)కి నేడు కీలక పరీక్ష

  సంవత్సరం క్రితం అంగార గ్రహం మీదకు ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)కు నేడు కీలక పరీక్ష చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ ఆపరేషన్లో భాగంగా ప్రధాన ఇంజన్కు ఫైర్ చేస్తామని చెప్పారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం మన దేశానికి ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. మార్స్ ఆర్బిటర్ని గత ఏడాది నవంబర్ 5న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. ఇది అంగారకుడిపై ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం. ఇప్పటివరకు అనుకున్నట్లుగానే ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ ఈ నెల 24న.. బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోనున్నట్టు షార్ డైరెక్టర్ తెలిపారు.

ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్

  పలువురు ప్రజా నాయకులు, కవులు, కళాకారులు నిర్వహించ తలపెట్టిన ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ (ఎం) పార్టీ ఆవిర్భవించి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలు, సానుభూతి కార్యకర్తలు రాజధానిలో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సభలో పాల్గొనడానికి వచ్చిన జార్ఖండ్ రాష్ట్ర ప్రజా గాయకుడు జీత్ మరాండీ, పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆదివారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభకు అటు పోలీసు శాఖ అనుమతించలేదు. దీంతో వరవరరావు హైకోర్టును ఆశ్రయించగా సభ నిర్వహణకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వాహకులు, విరసం నేతలు ప్రకటించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా బలగాలు మోహరించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, సభ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వరవరరావు అరెస్టు

  విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. రాయకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించాలని విరసం నేతలు భావించారు. కాగా ఆ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలా అయిన సభను నిర్వహించాలని భావించిన విరసం నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో శనివారం రాత్రి వరవరరావుతోపాటు దాదాపు 50 మంది విరసం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారందరిని కంచన్బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉన్నారు.

బీజేపీకి శివసేన కొత్త ప్రతిపాదన

  అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన, బిజెపి మధ్య మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం వ్యవహారంలో ప్రతిష్టంభన ఏర్పడింది. శనివారంనాడు ఆ ఇరు పార్టీల మధ్య ఏ విధమైన చర్చలూ జరగలేదు. పాతికేళ్ల స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా వుంటే, శనివారం నాడు బిజెపి ముందు శివసేన కొత్త ఫార్ములాను పెట్టినట్లు వార్తలు వచ్చాయి. బిజెపికి 126 సీట్లు ఇచ్చి, తాము 155 సీట్లకు పోటీ చేస్తామని శివసేన ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, అటువంటి ప్రతిపాదనేది తమ వద్దకు రాలేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆదివారం నాడు  కొలిక్కి వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం మీద చిరంజీవి కామెంట్స్

  తెలుగుదేశం నాయకులు సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రఘువీరా సూచించారు.

ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏ విజయవాడ పరిసరాల్లోని ఏ ప్రాంతంలో రాజధాని అయితే బాగుంటుందన్న విషయంలో పూర్తిస్థాయిలో సర్వే జరుపుతోంది. మోడల్ రాజధానిగా వుండాలంటే ఏ ప్రాంతంలో రాజధాని నిర్మించాలన్న విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, దానిని ఇంటర్నెట్‌లో వుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్ని విధాలా అనుకూలంగా వున్న ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతుందని ఆయన అన్నారు.

కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు

  పాకిస్థాన్ మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, ఆసిఫ్ జర్దారీల కొడుకు బిలావల్ భుట్టో అతిగా వాగుతున్నాడు. కాశ్మీర్ విషయంలో పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. పాకిస్థాన్ రాజకీయాలలో పాగావేసి తన తాత, అమ్మమ్మ, తల్లి, తండ్రి తరహాలోనే పాకిస్థాన్‌కి నాయకత్వం వహించాలని కలలు కంటున్న బిలావల్ కాశ్మీర్ విషయంలో పనికిమాలిన, తనకు మాలిన కామెంట్లు చేసి పాకిస్థాన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోవాలని అనుకుంటున్నాడు. భవిష్యత్తులో తమ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కాశ్మీర్ మొత్తాన్నీ పాకిస్థాన్‌లోకి తీసుకొస్తుందని, కాశ్మీర్‌లో ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టదని, ఎందుకంటే కాశ్మీర్ పాకిస్థాన్‌కి చెందినది అని అన్నాడు.   అంతేలే, ఇండియాలోనే వున్న కొంతమంది దుష్టశక్తులు కాశ్మీర్ ఇండియాకి చెందినది కాదు అని నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు పాకిస్థాన్ వాళ్ళు ఎందుకు వాగరు? నీలాంటి పిచ్చుకకి కొమ్ములు తెచ్చింది మావాళ్ళే! 2018లో పాకిస్థాన్‌లో జరిగే ఎన్నికలలో పోటీ చేసి పాకిస్థాస్‌కి ప్రధానమంత్రి అయిపోవాలని కలలు కంటున్న బిలావల్‌కి కాశ్మీర్‌ మీద కామెంట్లు చేయడం తప్ప మరేమీ చేతై చావదు కాబట్టి ఇలా అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భారతదేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూ వుంటుంది. మరోవైపు ఆ తానులో ముక్కే అయిన బిలావల్ మాత్రం నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ వుంటాడు.   కాకపోతే బిలావల్ భుట్టో జర్దారీ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని స్వాధీనం చేసుకోవడం తన తాత జుల్ఫ్‌కర్ అలీ భుట్టో వల్ల కాలేదు, తల్లి బేనజీర్ భుట్టోకి చేతకాలేదు. తండ్రి ఆసిఫ్ జర్దారీకి వీలు కాలేదు. పిల్లకాకి బిలావల్‌కీ కుదరదు. చూడు మిస్టర్ బిలావల్... నువ్వు పాకిస్థాన్‌కి ప్రధానమంత్రి కావడం, కాశ్మీర్‌ని ఇండియా నుంచి లాక్కోవడం సంగతి తర్వాత... ముందు పాకిస్థాన్‌ మిలటరీ నుంచి, అతివాదుల నుంచి, ఉగ్రవాదుల నుంచి నీ ప్రాణాలు కాపాడుకో చాలు. ఫ్యూచర్లో నువ్వు ప్రాణభయంతో పాకిస్థాన్ నుంచి పారిపోవాలనుకుంటే శరణార్థిగా బతకడానికైనా ఇండియాతో మర్యాదగా వ్యవహరించు.

కేసీఆర్ నీ ఆర్థిక విధానమేంటో జర చెప్పరాదె: గద్దర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రకటించడం మాని తన ఆర్థిక విధానమేంటో ప్రకటించాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. వందలాది కేసులు పెట్టిన తెలంగాణ యువత పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజా పోరాటాల వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇక అభివృద్ధిని కూడా పోరాడి సాధించుకోవాలని గద్దర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 25 శాతం అమలు చేసినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. రానున్న రోజ్లులో తెలంగాణ అభివృద్ధి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తానని ప్రజా గాయకుడు గద్దర్ వెల్లడించారు.

ఆరు నెలల్లో జగన్ పార్టీ హుష్‌కాకి: జేసీ

  మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో టీఆర్ఎస్ పార్టీనే చప్పుడు చేయకుండా వుందని, అలాంటప్పుడు జగన్ పార్టీ ఎందుకు లేనిపోని హడావిడి చేస్తోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎక్కువ లాభపడేది రాయలసీమ ప్రాంతమేనని ఎంపీ జేసీ దివాకరరెడ్డి వివరించారు.

రెండు ప్రమాదాలు.. ఇద్దరు విద్యార్థులు..

  తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బి.వెంకటాయపాలెం వద్ద కారు ఢీకొనడంతో స్థానిక బీసీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న మన్నం సాయి అనే విద్యార్థి మరణించాడు. విద్యార్థి రోడ్డు దాటుతూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నందిత అనే నాలుగు సంవత్సరాల విద్యార్థిని స్కూలు బస్సు నుంచి కిందకి దిగి, అదే బస్సు కింద పడి మరణించింది. విద్యార్థిని మరణానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. స్థానికులు ఆగ్రహంతో స్కూలు బస్సును ధ్వంసం చేశారు.

అమెరికా అధ్యక్ష పీఠంపై బాబీ జిందాల్?

  అమెరికా అధ్యక్ష పీఠం మీద ఒక భారతీయుడు కూర్చుంటే ఎలా వుంటుంది? ఇంకెలా వుంటుంది? అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతాన్ని సాధించే వ్యక్తి ప్రస్తుత లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ ఎందుకు కాకూడదు? అవును.. బాబీ జిందాల్ అవ్వొచ్చన్న అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం శతాబ్దాల క్రితం అమెరికాకి వలస వెళ్ళి స్థిరపడింది. బాబీ జిందాల్ రెండుసార్లు లుసియానా రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2015 వరకు వుంది. 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ బాబీ జిందాల్‌ను అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో నిలపాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బాబీ జిందాల్ ఇమేజ్ కేవలం లుసియానా గవర్నర్ పదవితోనే ఆగిపోలేదు. ఇటీవల జరిపిన సర్వేలో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి వున్న పదిమంది వ్యక్తుల్లో బాబీ జిందాల్ కూడా ఒకరని తేలింది. రిపబ్లికన్ పార్టీలో కూడా ఎక్కువ శాతం మంది బాబీ జిందాల్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా చూస్తే అమెరికాలో వున్న లక్షలాది మంది భారతీయుల ఓటు బ్యాంకు కూడా బాబీ జిందాల్‌కి అండగా నిలుస్తుంది. ఒక తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు అయితే చూడాలని వుంది అని గతంలో ఎన్టీఆర్ అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడు ఒక భారతీయుడు అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం తర్వాత తెలుగువాడు కూడా అమెరికా అధ్యక్షుడు అవుతాడేమో!

‘దొరల కుట్ర’ అంటూ రేవంత్ ఆరోపణల చిట్టా...

  తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో వనరుల మీద దొరల కుట్ర జరుగుతోందంటూ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ వివరాలు..   * తెలంగాణలో వనరులు దోచుకోవడానికి దొరల కుట్ర జరుగుతోంది.   * మెట్రో రైలు భూమిని నందగిరి దొర మైహోమ్ రాజేశ్వరరావుకు కేటాయించడం నూటికి నూరుపాళ్ళు నిజం.   * ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్‌‌కి భయపడి మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ వాస్తవాలు దాచిపెడుతున్నారు. మొన్న గాడ్గిల్ చేసింది కూడా కేసీఆర్ చేయించిన బలవంతపు ప్రకటనే.   * మెట్రో రైలుకు కేటాయించిన 18 ఎకరాల స్థలం నుంచి వైదొలగితే తమకు నష్టమని, ఈ స్థలాన్ని మరొకరికి కేటాయించరాదనిఎన్వీఎస్ రెడ్డి గతంలో లేఖ రాస్తే అప్పటి సీఎం కిరణ్ కుమార్ ఈ విషయంలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రెండు వేల కోట్ల విలువైన స్థలాన్ని రామేశ్వరరావుకు ఉచితంగా కేటాయించింది. 26 కోట్ల స్టాంపు డ్యూటీని మినహాయించింది.   * తెలంగాణలో అభివృద్ధి జరగలాంటే దొరలు అవినీతికి పాల్పడకూడదు. సాటి దొరల కోసం కేసీఆర్ మెట్రోను పణంగా పెట్టడం అన్యాయం.

ఏపీలో మెట్రో, పెట్రో పర్యటనలు...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం నాడు మెట్రో, పెట్రో పర్యటనలు జరిగాయి. విజయవాడలో మెట్రోరైలు ఏర్పాటుకు సంబంధించి మెట్రో నిపుణుడు శ్రీధరన్ విజయవాడ పరిసరాల్లో పర్యటన జరిపారు. ఆయన మెట్రో నిపుణుల బృందంతో కలసి విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో రైలు ఏర్పాటుకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలు, మెట్రో రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మిస్తే మంచిదన్న అంశం మీద ఆయన పరిశీలన జరిపారు. అలాగే రాజమండ్రిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర బృందం రాజమండ్రిలో పర్యటించింది. పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కోసం అనువుగా వుండే స్థలం కోసం ఈ బృందం అన్వేషణ జరిపింది. ప్రస్తుతం తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన భవంతులను కూడా పరిశీలించింది. వచ్చే ఏడాది నాటికి సొంత భవనాలలో పెట్రో యూనివర్సిటీ కార్యకలాపాలు జరిగే అవకాశం వుందని బృంద సభ్యులు చెబుతున్నారు.