అమెరికా పర్యటనకు బయల్దేరిన మోడీ

  భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా బయల్దేరి వెళ్ళారు. నరేంద్ర మోడీ వెంట ఉన్నత అధికార బృందం కూడా బయల్దేరి వెళ్ళింది. మోడీ అమెరికాలో ఐదు రోజులపాటు పర్యటిస్తారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి 30 వరకు నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29 లేదా 30వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ భేటీ అవుతారు. 27న జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో నరేంద్ర మోడీ హిందీలో ప్రసంగిస్తారు. భారత్‌కి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఈ పర్యటనలోనే ట్విన్ టవర్స్‌ కూల్చివేతలో మరణించిన వారికి మోడీ శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమెరికాలోని ఆరు ప్రధాన కంపెనీల సీఇఓలతో కూడా నరేంద్రమోడీ సమావేశమవుతారని సమాచారం.

విద్యార్థిని చంపిన ఆ తెల్లపులి మనుషుల్ని తినదట...

  ఢిల్లీలోని జూలో ఇంటర్ విద్యార్థి తెల్ల పులి కేజ్‌లో పడిపోవడం, తెల్లపులి ఆ విద్యార్థిని చంపడం తెలిసిందే. దీనిమీద జూ అధికారులు వివరణ ఇచ్చారు. నిజానికి ఆ తెల్లపులి విజయ్ మనుషుల్ని తినేది కాదని, ఆ జూలోనే పుట్టి పెరిగినదని చెబుతున్నారు. పులిలో సహజంగా వుండే క్రూరత్వం కారణంగా కందకంలోని విద్యార్థిని చంపిందే తప్ప అది మనుషుల్ని వేటాడే పులి కాదని అంటున్నారు. ఇలాంటి వివరణల మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ పులి మనుషుల్ని చంపుతుందా లేదా అనేది మీరెప్పుడైనా పరీక్షించి చూశారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పులి కేజ్‌లోకి మనుషులు పడకుండా ఏర్పాట్లు చేయని జూ అధికారులు లేనిపోని వివరణలు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థి కందకం లోపల పడిపోయిన తర్వాత బయట వున్న వారు పులి మీద రాళ్లు విసురుతూ అరవడం వల్ల దానికి కోపం వచ్చి చంపి వుండవచ్చని అధికారులు అంటున్నారు.

కాఫీ కప్ సెల్యూట్ చేసిన ఒబామా

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి ఇప్పుడు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళి హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన ఒబామాకి బయట స్వాగతం పలకడానికి నిలుచుని వున్న మెరైన్ కార్ప్ గార్ట్స్ సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో కప్పుతో కాఫీ తాగుతున్న ఒబామా చేతిలో కాఫీ కప్పు వుంచుకునే వారికి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూట్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మీడియాకి విడుదలయ్యాయి. ఒబామా అలా చేతిలో కాఫీ కప్పుతో సెల్యూట్ చేయడం ఎంతమాత్రం పద్ధతిగా లేదని విమర్శలు మొదలయ్యాయి. అలా సెల్యూట్ చేసి ఒబామా మెరైన్ కార్ప్ గార్డ్స్ ని అవమానించారన్న వాదన బయల్దేరింది. కుడి చేతిలో కాఫీ కప్పు వుంటే దాన్ని ఎడంచేతిలోకి తీసుకుని సెల్యూల్ చేయాలిగానీ, ఎంతమాత్రం మర్యాద లేకుండా ఆ చేత్తోనే సెల్యూట్ చేయడం దారుణం అని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది గార్డ్స్‌కి ఒబామా సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, ఏదో ఒక రకంగా సెల్యూట్ చేశాడు కాబట్టి దానిలో తప్పులు వెతకొద్దని అంటున్నారు.

కూతుర్ని సజీవంగా పాతిపెట్టి సవతి తల్లి

  ఆరేళ్ళ కూతుర్ని గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ సవతి తల్లి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బయటపడింది. అర్చన అనే 22 ఏళ్ళ మహిళ గత ఆదివారం నాడు తన సవతి కూతుర్ని గొయ్యి తీసి పాతిపెట్టింది. ఆ తర్వాత ఆ పాప కనిపిచండం లేదని భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పాపని పాతిపెట్టిన ఆ దుర్మార్గురాలు ఆ రహస్యాన్ని తన బంధువులలో ఒకరి దగ్గర వెల్లడించింది. అది విని బిత్తరపోయిన ఆ బంధువు ఈ విషయాన్ని పోలీసుల దగ్గర బయటపెట్టాడు. దాంతో పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. గోతిని తవ్వి చూడగా సజీవంగా పాతిపెట్టిన పాప చనిపోయింది. తాను తను కన్న కొడుకు భవిష్యత్తు కోసమే సవతి కూతుర్ని చంపేశానని అర్చన అంగీకరించింది.

మర్డర్లు చేశాక బిర్యానీ తిని వెళ్ళిన హంతకులు

  విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీద కారులో వెళ్తున్న తండ్రీ కొడుకులను చంపిన ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు, సమాచారం లభిస్తోంది. హంతకులు వాడిన కారును గుర్తించారు. హంతకులు తాము బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుకే కారును వదిలి వెళ్ళిపోయారు. కారును, కారులో వున్న రెండు పెద్ద పెద్ద కత్తులు, ఒక తుపాకీతో పాటు కొన్ని ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు హత్యలు చేసిన తర్వాత హంతకులు హోటల్కు చేరుకుని, తాపీగా బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ బీహార్ ప్రొఫెషనల్ హంతకులు రాయల్ హంపీ హోటల్ నుంచి బయట పడిన తర్వాత వారందరూ రెండు కార్లలో వారు రాజమండ్రి వైపు వెళ్లినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. హంతకుల్లో అయిదుగురు బీహార్కు చెందినవారు కాగా ఒకరు స్థానికుడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసీఆర్ మీద గవర్నర్‌కి టీ టీడీపీ కంప్లయింట్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, ఆశ్రిత పక్షపాత మీద తెలంగాణ టీడీపీ నాయకులు గురువారం నాడు గవర్నర్ నరసింహన్‌కి ఫిర్యాదు చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వంలో టీటీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ని కలిశారు. గవర్నర్‌కి కేసీఆర్ మీద కంప్లయింట్ చేసిన అనంతరం ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ వ్యవహార శైలి, ఆశ్రిత పక్షపాతం మీద గవర్నర్‌కి ఫిర్యాదు చేశాము. అక్రమ భూబదలాయింపులను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాము. అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచేలా ఆదేశాలని కోరాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఇప్పుడు రైతాంగం, విద్యుత్, విద్యార్థి, సంక్షేమ పథకాలకు నిధుల సమస్యతో ఇబ్బంది పడుతోంది. మెట్రో అంశం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి ఆటంకం కలిగించింది. ఇటువంటి సమస్యలన్నిటినీ చర్చించి పరిష్కారాలు కనుగొనడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరపాలి’’ అని ఎల్.రమణ అన్నారు.

విజయవాడ హత్యల కోసం లండన్‌లో ప్లాన్

  విజయవాడ సమీపంలోని అవుటపల్లి దగ్గర జరిగిన మూడు హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సినిమా ఫక్కీలో, మాఫియా తరహాలో కారు మీద దాడి చేసి మరీ చేసిన హత్యలు అత్యంత పకడ్బందీ వ్యూహంతో జరిగిన హత్యలుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు కుట్రలో పాలుపంచుకున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ సమీపంలో ఈ మూడు హత్యలు చేయడానికి లండన్‌లో ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ హత్యల కోసం ముంబైకి చెందిన ఓ ప్రొఫెషనల్ కిల్లర్స్ బ్యాచ్‌తో మూడు కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. కొద్ది నెలల క్రితం ఏలూరులోని జెకె ప్యాలెస్ అనే హోటల్‌ యజమాని దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితులైన తండ్రి, ఇద్దరు కొడుకులు హతులయ్యారు. హతులైన వారికి కెనడా, లండన్‌లో చాలా ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. లండన్‌లో నివసించే దుర్గారావు బంధువు ఇక్కడ తన అనుచరులతో నిఘా పెట్టి, తండ్రీ కొడుకుల కదలికలను గమనిస్తూ ఈ దారుణ హత్యలు చేయించారని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ముంబైలో జరిగాయని అంటున్నారు.

అలిపిరి మందు పాతర కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు

  2003 సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద మందుపాతరతో దాడి చేసిన కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబును హత్యచేసే ఉద్దేశంతో శక్తివంతమైన క్లైమోర్ మైన్‌ని పేల్చారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికి ఐదుగురు వ్యక్తులు ప్రధాన నిందితులుగా వున్నారు. నిందితులలో ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఈ ఐదుగురిలో దోషులుగా సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. మిగతా ముగ్గురిని దోషులుగా ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు నాలుగేళ్ళ జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో శిక్ష పడిన దోషుల పేర్లు: రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, కేశవ్.

అలిపిరి కేసులో ఈరోజే తుది తీర్పు

  2003 సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద మందుపాతరతో దాడి చేసిన కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ పూర్తయింది. నిందితులు చంద్రబాబును హత్యచేసే ఉద్దేశంతో శక్తివంతమైన క్లైమోర్ మైన్‌ని పేల్చారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఈ కేసులో 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికి ఐదుగురు ప్రధాన నిందితులుగా వున్నారు. వీరిలో ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ముగ్గురిని దోషులుగా ఖరారు చేసింది. దోషులకు శిక్షలను హైకోర్టు ఈరోజే ప్రకటించే అవకాశం వుంది.

కేసీఆర్‌ జూలో పెద్దపులి: రేవంత్ రెడ్డి విమర్శలు

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని నిరంతరం విమర్శిస్తూ వుండే తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ని పులితో పోల్చారు. సాధారణంగా ఏ మనిషినైనా పులితో పోల్చామంటే అది ఆయన్ని పొగిడినట్టే అర్థం. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని పులితో పోల్చడం వెనుక ఆంతర్యం ఏమై వుంటుంది? పొగడ్డం మాత్రం కాదు. వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ తన బంధువు మైహోం జూపల్లి రామేశ్వరరావుకు భూములు కేటాయించే విషయంలో ఆయనపై ధ్వజమెత్తుతున్న రేవంత్ రెడ్డి బుధవారం కూడా దీనికి సబంధించి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ జూలో పులి ముందు పడిన యువకుడి గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఢిల్లీ జూలో పులిముందు పడిన యువకుడి లాంటి వ్యక్తి మా తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు. ఆ యువకుడి ఎదురుగా వున్న పులి కేసీఆర్. ఆ పులిమీద రాళ్ళు విసిరి రెచ్చగొట్టేది మైహోమ్ రామేశ్వరరావు’’ అన్నారు. గతంలో ప్రాంతీయవాదంతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇప్పుడు కులవాదంతో ఎర్రబెల్లి దయాకర్ రావుని మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను దోపిడిదారులైన దొరలను విమర్శిస్తున్నాను తప్పితే, తాను ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించడం లేదని రేవంత్ రెడ్డి వివరించారు.

‘మేక్ ఇన్ ఇండియా’ పోర్టల్, లోగో ఆవిష్కరించిన మోడీ

  భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సందేహాలకు మేక్ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా 72 గంటల్లో సమాధానాలు ఇవ్వనుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా నినాదం కాదు తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇండియాని మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా తయారు చేసేందుకు తాము చిత్తశుద్ధితోఉన్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేస్తామన్నారు. కార్మిక చట్టాలకు మరిన్ని సవరణలు తెస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం లండన్

  ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్‌ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్‌లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై జాబితా చివర్లో వుందట. ముంబైలో ఓ ఉద్యోగికి ఏడాదికి ఏడాదికి అయ్యే ఖర్చు 18 లక్షల 13 వేలు కాగా, అదే లండన్‌లో అయితే ఒక ఉద్యోగి ఖర్చును భారతీయ కరెన్సీతో పోల్చితే ఏడాదికి సగటుగా 73 లక్షలుగా వుంటుంది. ఆఫీసులు, గృహాల అద్దెలు, డాలర్‌తో పోల్చితే పౌండ్ విలువ తదితర అంశాలు లండన్‌లో జన జీవన వ్యయం ఎక్కువ కావడానికి కారణమయ్యాయని ఒక అధ్యయనం చెబుతోంది.

ఏపీలో 67 లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డులున్నాయట

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వున్న బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ముమ్మరంగా వుంది. రాష్ట్రం మొత్తంలో 67 లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డు వున్నట్టు తెలుసుకుంది. కడు పేదవారి దగ్గర వుండాల్సిన తెల్ల రేషన్ కార్డులు ఆర్థికంగా స్థితిమంతులుగా వున్న లక్షలాది మంది దగ్గర వున్నట్టు తేల్చింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి కూడా వైట్ రేషన్ కార్డే వుంది. ఈసారి విడుదల చేసే రేషన్ ‌బియ్యం కోటాలో ఆ  67 లక్షల బోగస్ కార్డులను తొలగించి అంటే 29 వేల టన్నుల బియ్యాన్ని కోత విధించి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 67 లక్షల బోగస్ రేషన్ కార్డులు వున్నాయా అని ఆశ్చర్యంతో అధికార వర్గాలు నోళ్ళు తెరిచాయి.

అడ్డంగా దొరికిపోయిన చెవిరెడ్డి...

  వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆర్థికంగా స్థితిమంతుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ రాయలసీమలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ఆర్థికంగా ముందుంటారు. అయితే అలాంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డికి పేద ప్రజలకు ఉండాల్సిన తెల్ల రేషన్ కార్డు వుంది. అలాగే సుబ్రహ్మణ్య రెడ్డి ఎంచక్కా నెలనెలా వృద్ధాప్య పెన్షన్ కూడా అందుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు (ఏపీ 102600500742) వుండటం, నెలకు నాలుగు వందల రూపాయల రూపాయల వృద్ధాప్య పెన్షన్ కూడా అందుకుంటూ వుండటం బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తున్న సందర్భంగా ఈ వివరాలు బయటపడ్డాయి. ఇలాంటి వారు ఎంతోమంది తెల్లకార్డులు పొందారని, వయసు తక్కువ వున్నా, అర్హత లేకపోయినా వృద్ధాప్య పెన్షన్లు కూడా పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అలాంటి వారిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తండ్రి కూడా వుండటం వైసీపీ నాయకుల గొంతులో వెలక్కాయలా మారింది.

రాహుల్ దత్తత తీసుకుంటారని ఎవరన్నారు... ప్రియాంక ప్రశ్న

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్ళి జోలికే వెళ్ళకుండా, తన రాజకీయ వారసుడి స్థానం కోసం తన సోదరి ప్రియాంక రాబర్ట్ వాద్రా కుమారుడిని దత్తత తీసుకోబోతున్నారన్న వార్తలు పలు జాతీయ మీడియాలో వచ్చాయి. ప్రియాంక కుమారుడైన రైహాన్‌కి ‘గాంధీ’ని తగిలించి ‘రైహాన్ గాంధీ’గా కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని అందించే ఉద్దేశం వున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వార్తల మీద ప్రియాంక చాలా సీరియస్ అయ్యారు. ఈ వార్త పూర్తిగా నిరాధారమని ఖండించారు. ఈ వార్తను ప్రసారం చేసిన వార్తా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు. ‘‘ఊహాగానాలతో మీరు (మీడియా) కల్పించిన వార్తలు మా కుటుంబ ప్రతిష్ఠను, నా మాతృత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వున్నాయి. ఇలాంటి అవాస్తవ వార్తలతో రాజకీయ ప్రకంపనాలు సృష్టించిన మీ వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ప్రియాంక రాబర్ట్ వధేరా తన లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.

ముగ్గురి హత్య... హనుమాన్‌జంక్షన్ దగ్గర కారు దొరికింది..

  కృష్ణా జిల్లాలోని అవుటుపల్లి సమీపంలో  జరిగిన కాల్పుల ఘటనలో దుండుగులు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. హనుమాన్ జంక్షన్ వద్ద ఈ కారు లభించింది. హత్య చేసిన దుండగులు మూడు రోజులుగా హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపీ హోటల్‌లో బస చేశారు. ఓ కారుకు బైక్ నెంబరు వేసి దుండగులు ఉపయోగించారు. కాల్పులు జరిగిన తర్వాత హనుమాన్‌జంక్షన్‌లోని హోటల్ వెనకాల కారును వదిలి హంతకులు పరారయ్యారు. పాతకక్షల కారణంగానే హత్యలు జరిగాయని విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. మృతులు చిన్న కడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి మారయ్య, నాగేశ్వర రావు, గంధం మారయ్య  ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు డ్రైవర్ ఏలూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. హత్య జరిగిన స్థలంలో పోలీసులు 5 తుటాలు స్వాధీనం చేసుకున్నారు.