భారత్ లో 9మంది ఐసిస్ కోసం పనిచేస్తున్నారు

  హైదరాబాద్ నగరంలోని టోలి చౌక్ అనే ప్రాంతానికి చెందిన అఫ్శా జబీన్ అనే 38 ఏళ్ళు వయసుగల మహిళ దుబాయిలో ఉంటూ ఐసిస్ ఉగ్రవాదుల ముఠాలో భారత్ యువకులను చేర్పించే ప్రయత్నాలు చేస్తునందున అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇంటలిజన్స్ అధికారుల విచారణలో ఆమె భారత్ లో మొత్తం తొమ్మిది మంది యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది. వారిలో ఇద్దరు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్ లకు చెందినవారని ఆమె తెలియజేసింది. అయితే ప్రస్తుతం వారివల్ల ఎటువంటి ప్రమాదం లేదని, వారి కదలికలపై నిఘా పెట్టమని ఇంటలిజన్స్ అధికారులు మీడియాకి తెలిపారు.   చాలా కాలంగా దుబాయ్ లో ఉంటున్న అఫ్శా జబీన్ తనను తాను బ్రిటిష్ దేశాస్తురాలిగా చెప్పుకొనేది. ఇంటర్నెట్ ద్వారా ఇస్లాం మతానికి సంబంధించిన మత గ్రంధాలను, వివరాలను సేకరించే ప్రయత్నంలో ఆమెకు హైదరాబాద్ కు చెందిన సలాం మోహినుద్దీన్ అనే కెమికల్ ఇంజనీర్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుండి ఆమె గమ్యం పక్కదారి పట్టింది. వారిరువురూ కలిసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో భారత్ యువతీ యువకులను చేర్పించేందుకు సామాజిక వెబ్ సైట్లలో అందుకోసం అనేక గ్రూపులు సృష్టించి యువతను ఆకర్షించడం మొదలుపెట్టారు. వారిరువురూ ఇంకా ఎంతమందిని ప్రభావిద్తం చేసారో తెలియదు కానీ ప్రస్తుతం తొమ్మిది మంది ఐసిస్ ఉగ్రవాదుల మద్దతుదారులు భారత్ లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అఫ్శా జబీన్ ఇంటలిజన్స్ అధికారులకి తెలియజేసారు.

నోయిడాలో నల్గొండ విద్యార్ధి దారుణ హత్య.. కాల్పులు జరిపి నరికి చంపారు

నల్గొండజిల్లాకు చెందిన విద్యార్ధి ఉత్తరప్రదేశ్ లో దారుణ హత్యకు గురయ్యాడు. అతని స్నేహితులే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం నల్గొండ  జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ అనే వ్యక్తి నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో  బీఎస్సీ (మెరైన్ సైన్స్) కోర్సు చేస్తున్నాడు. అయితే సందేశ్ మొదటి సంవత్సరం కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకోగా.. రెండవ సంవత్సరం ప్లాట్ అద్దెక్ తీసుకొని అందులో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో అదే యూనివర్సిటీలో చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీ సందేశ్ నివాసముంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చి అతనిపై నేరుగా కాల్పులు జరిపి.. ఆతరువాత గొడ్డలితో నరికారు. అయితే సందేశ్ రూంలో ఉన్న అతని స్నేహితుడు నదీమ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. నదీమ్ జరిగిందంతా పోలీసులకు వివరించగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. కాగా సందేశ్ మరణవార్తను పోలీసులు అతని తండ్రికి చేరవేయడంతో అతను వెంటనే నోయిడాకు చేరుకొన్నాడు. ఆదివారం పోస్టుమార్టం పూర్తిఅయిన అనంతరం మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

పవన్ కళ్యాణ్ న్ని అలయ్ బలయ్ కార్యక్రమానికి దత్తన్న ఆహ్వానం

  బీజేపీ సీనియర్ నేత మరియు కేంద్ర మంత్రి అయిన బండారు దత్తాత్రేయ చాలా ఏళ్లుగా దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏటా నిర్వహించే ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకి చెందిన రాజకీయ నాయకులను ఆహ్వానిస్తుంటారు. ఈసారి విశేషం ఏమిటంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని కూడా ఆయన ఆ అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. నిన్న ఆయన బీజేపీ ఎమ్మెల్యే డా. లక్ష్మణ్ తో కలిసి రామానాయుడు స్టుడియోలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ న్ని కలిసి ఆహ్వానించారు. వీలు కుదిరితే తప్పకుండా వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం.

నడిఘర్ సంఘం ఎన్నికలలో హీరో విశాల్ ప్యానల్ విజయం

  తమిళ సినీ పరిశ్రమకి చెందిన నటీనటుల నడిఘర్ సంఘానికి నిన్న జరిగిన ఎన్నికలలో ఊహించని విధంగా హీరో విశాల్ ప్యానల్ విజయం సాధించింది. గత పదేళ్లుగా నడిఘర్ సంఘం తమిళ హీరో శరత్ కుమార్ ప్యానల్ చేతిలోనే ఉంది. ఈసారి కూడా పోటీ ఉండదని అందరూ భావించారు కానీ హీరో విశాల్ బరిలోకి దిగడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. సాధారణ ఎన్నికలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇరు వర్గాలు ఒకరిపై మరొకటి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకొన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులు శరత్ కుమార్ ప్యానల్ కే ఉన్నట్లు ప్రచారం జరుగడంతో ఆయనే ఈ ఎన్నికలలో మళ్ళీ గెలుస్తారని అందరూ అనుకొన్నారు. కానీ ఊహించని విధంగా హీరో విశాల్ ప్యానల్ 107 ఓట్లు తేడాతో శరత్ కుమార్ ప్యానల్ పై విజయం సాధించారు. విశాల్ ప్యానల్ కి 1,445, శరత్ కుమార్ ప్యానల్ కి 1,138 ఓట్లు లభించాయి.   విశాల్ ప్యానల్ తరపున పోటీ చేసిన ప్రముఖ నటుడు నాజర్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడుగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే నిన్న ఉదయం ఎన్నికలు మొదలయినప్పటి నుండి హీరో శరత్ కుమార్ ప్యానలే పూర్తి ఆధిక్యత కనబరిచింది కానీ మధ్యాహ్నం నుండి క్రమంగా హీరో విశాల్ ప్యానల్ ఆధిక్యతలోకి వచ్చి చివరికి విజయం సాధించింది. విశాల్ ప్యానల్ తరపున కోశాధికారి పదవికి పోటీ చేసిన హీరో కార్తిక్ 413 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి కన్నన్ పై విజయం సాధించారు. కార్తిక్ కి 1,493 ఓట్లు లభించగా కన్నన్ కి 1,080 ఓట్లు దక్కాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3139మంది సభ్యులు ఉండగా వారిలో 83శాతం అంటే 2605 మంది వచ్చి ఓటింగులో పాల్గొన్నారు.   ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఈ ఎన్నికలలో విజయం సాధించిన విశాల్ ప్యానల్ సభ్యులందరికీ మనస్పూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల సమయంలో కనబడిన విభేదాలను ఇంతటితో మరిచిపోయి అందరూ మన సినీ పరిశ్రమ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి. అందుకు మా సలహాలు కోరితే తప్పకుండా ఇస్తాము. విశాల్ మరియు ఆయన బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.

ఏపీస్ ఆర్టీసీ త్వరలో ప్రభుత్వంలో విలీనం?

  ఏపీస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక త్వరలో తీరబోతోంది. నిన్న విజయనగరంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పీతల సుజాత కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సంబంధిత అధికారులు అవసరమయిన చర్యలు మొదలుపెట్టారని చెప్పారు. అదే విధంగా ఆర్టీసి కార్మికుల సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న పలుచర్యలను ఆమె వివరించారు. అనంతరం మాట్లాడిన ఆర్టీసీ మేనేజిన్ డైరెక్టర్ నండూరి సాంభశివరావు, రాష్ట్రంలో 13జిల్లాలలోను ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆదినీకరించే ప్రక్రియ కూడా మొదలుపెట్టమని, ఆర్టీసీ నష్టాలను తగ్గించుకొనేందుకు కూడా అనేక చర్యలు చేపదుతున్నామని తెలిపారు. ఒకవేళ మంత్రి చెపుతున్నట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లయితే దానికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతుంటాయి కనుక సంస్థ నష్టాల్లో నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

కేసీఆర్ ని ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం బేగంపేటలో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి అమరావతి ఆహ్వాన పత్రం అందజేసి కుటుంబ సమేతంగా అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు.చంద్రబాబు నాయుడుతో బాటు తెలంగాణా తెదేపా అధ్యక్షుడు యల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్న తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె. తారక రామారావు, జగదీశ్ రెడ్డికి కూడా ఆహ్వానపత్రాలు అందజేసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా వారిని కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి  తను తప్పకుండా వస్తానని కేసీఆర్ చెప్పారు. అనంతరం చంద్రబాబు నాయుడుని కేసీఆర్ కి అమరావతి అభివృద్ధి ప్రణాళిక ఇతర విశేషాల గురించి వివరించారు. వారిరువురూ సుమారు గంటసేపు అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. మళ్ళీ 8 నెలల తరువాత వారిరువురూ ఈవిధంగా కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకోవడం చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారు.

చంద్రబాబును పొగిడేసిన జానారెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు అందిస్తున్ననేపథ్యంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ జానారెడ్డిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా జానారెడ్డి చంద్రబాబును ప్రశంసించారు. ఏపీ రాజధాని కోసం చంద్రబాబు చేస్తున్న కృషి, పట్టుదల ఎనలేనిదని.. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు బాగా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా జానారెడ్డిని కలిసిన మంత్రులు కూడా జానారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించారని.. రాజధాని శంకుస్థాపనకు వస్తానని చెప్పారని అన్నారు. కానీ ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మాత్రం రానంటున్నారని జగన్ ఇంత మూర్ఖుడు అని అనుకోలేదని వారు అన్నారు.

ఏపీ రాజధానికి తెలంగాణ కళాకారుల విరాళాలు..

ఏపీ రాజధాని అమరావతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఇప్పటికే  నా ఇటుక - నా అమరావతి పేరు మీద వెబ్ సైట్ డిజైన్ చేసి విరాళాలు సేకరిస్తున్నసంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ప్రారంభించిన తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో విరాళాలు సేకరించడానికి నడుంబిగించారు కళాకారలు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విరాళాల సేకరణకు పూనుకుంది తెలంగాణ కళాకారులు కావడం. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ నేతృత్వంలో..  ''ఆర్ట్ బియాండ్ బౌండరీస్'' పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు ఏర్పాటు చేసే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తెలంగాణకు చెందిన చిత్రకారులూ పాల్గొంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ - బైరు రఘురాం - చిప్ప సుధాకర్ - డి.కవిత - కె.కిషన్ - ఎల్.సరస్వతి - శ్రీకాంత్ తదితరులు ఇక్కడి నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొని తమ చిత్రాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. వాటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నారు. ఏదిఏమైనా ఏపీ రాజధాని నిర్మాణానికి తెలంగాణ వాదులు పాల్గొని విరాళాలు సేకరించడం మెచ్చుకోదగ్గ విషయమే.

ఆయనకే అర్ధమయింది.. జానారెడ్డికి అర్ధంకాలేదు.. కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు నల్లగొండ జిల్లా పానగల్లు ఉదయసముద్రం దగ్గర వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, లకా్ష్మరెడ్డిలు శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉత్తర ప్రదేశ్ మంత్రి అఖిలేష్ యాదవ్ కు అర్ధమైంది కాని ప్రతిపక్ష నేత జానారెడ్డికి మాత్రం అర్ధం కావడంలేదని  అన్నారు. ఇంటింటికీ నీరు అందిస్తామని మేమంటుంటే.. ప్రతిపక్షాలు కాళ్లకు కట్టెలు పెట్టి అడ్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రజలు నమ్మరని.. వారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని.. వారి సన్నాయి నొక్కులను ప్రజలు పట్టించుకోరని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రైతు సమస్యలపై ఓ రభస చేస్తున్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు, టీడీపీ 17 ఏళ్లు పాలించాయి..ఇన్నేళ్లు పాలనలో ఉండి రైతులకు ఏం చేశారు.. వారి వల్ల రైతులకు ఇన్ని సమస్యలు వచ్చాయి అని ఎద్దేవ చేశారు. రైతు సమస్యలపై చర్యలు తీసుకుంటున్నామని.. వారి సమస్యలు తీర్చే బాధ్యత మాపై ఉందని.. అందుకే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

కేసీఆర్ ను పిలిచినట్టు జగన్ ను పిలవొచ్చుగా.. ఉమ్మారెడ్డి

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలికే నేపథ్యంలో కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే చంద్రబాబు సీఎంవో ఆఫీసు నుండి ఆధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంఓ ఆఫీసుకు ఫోన్ చేసి మరీ అపాంయింట్ మెంట్ అడిగారు. అయితే దీనిపై వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిని ఇంటికి వెళ్లి పిలిచినట్టు.. చంద్రబాబు జగన్ ను కూడా స్వయంగా వెళ్లి పిలవచ్చు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ ను అపాంయింట్ మెంట్ కోరినట్టు జగన్ కు కూడా కోరవచ్చు కదా అని అన్నారు. తన ఆరోగ్యం సరిగా లేకనే మంత్రులను కలవలేకపోయారని అని తెలిపారు. ఒకవేళ శంకుస్థాపనకు కనుక వెళితే మోదీ పక్కన కూర్చోబెడతారా.. తమ ప్రాధాన్యాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న మోడీ తమకు మాట్లాడే అవకాశం అవకాశం ఇవ్వాలని కోరారు.

మోడీకి జగన్ లేఖ.. ఆలోపు కలవడానికి సమయం ఇవ్వండి

ఒక పక్క ఏపీ శంకుస్థాపన కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు బిజీగా ఉంటే మరోపక్క ఏపీ ప్రతిపక్షనేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే జగన్ చంద్రబాబుకు తనను శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. మళ్లీ రాలేదని విమర్శించవద్దని లేఖ రాశారు. అయినా చంద్రబాబు మాత్రం తమ బాధ్యతగా మంత్రులకు జగన్ ను పిలవమని ఆదేశించారు. అయితే జగన్ ఈ రోజు మళ్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న జరగబోయే ఏపీ శంకుస్థాపన కార్యక్రమం జరిగే లోపు తనను కలవడానికి సమయం ఇవ్వాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ చెప్పారని.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై చర్చించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీ మంత్రలు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను శంకుస్థాపన కార్యక్రమానికి పిలవడానికి తనను కలిసేందుకు సమయం ఇవ్వడంలేదని.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లడటానికి అవకాశం ఇవ్వడంలేదని మండిపడుతున్నారు.

కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు

  ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తానన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్ ను కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబు కార్యలయం నుండి అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఈనెల 22న జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ని ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన మంత్రులు.. రావొచ్చు..! రాకపోవచ్చు..!

ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు ప్రారంభమయ్యాయి. ఏపీ మంత్రులు మంత్రులు అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, టిడి జనార్ధన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరిని ఇతర పార్టీ నేతలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు. దీనిలో భాగంగానే వీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ నానక్‌రాంగూడలో సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి శంకుస్థాపనకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి నాకు రావాలని ఉంది కానీ ఆసమయంలో షూటింగ్ నిమిత్తం గుజరాత్ వెళ్లవచ్చు అని అన్నారు. తాను వచ్చేది రానిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కాగా ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్ లా కాకూడదని ఆయన అన్నారు. అంతేకాదు ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఆయనను కలవడం సరికాదని.. గొడవల ఎల్లకాలం ముందుకు సాగలేమని.. సామరస్య వాతావరణం ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. కాగా శంకుస్థాపనకు వచ్చి రాజధానికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందించాలని మంత్రులు కోరారు. అంతేకాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడతారని తెలిపారు.

"నా ఇటుక - నా అమరావతి".. ఇచ్చేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనే ఉద్యేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన "నా ఇటుక - నా అమరావతి" కి అనూహ్య స్పందని లభించింది. గురువారం చంద్రబాబు చేతుల మీదుగా "నా ఇటుక - నా అమరావతి" పేరుతో ప్రారంభించిన వైబ్ సైటుకు తక్కువ కాలంలోనే ఎక్కువ విరాళాలు పొందారు. శనివారం ఉదయానికి 15వేల మంది ఇటుకల్ని దానం చేశారు. ఇప్పటివరకూ దానం చేసిన ఇటుకల సంఖ్య 10 లక్షలు దాటింది. అయితే ఈ రాజధానికి ఒక్క ఏపీ, తెలంగాణ వారు మాత్రమే కాదు.. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమవంతుగా విరాళాలు అందించడం గమనార్హం. అంతేకాదు ఉదయం, మద్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా విరాళాలు అందిస్తున్నారు. కాగా ఏపీ క్రెడా అందించిన విరాళాన్ని ఇప్పటివరకూ ఎవరూ క్రాస్ చేయలేదు.  ఏపీ క్రెడా 52200 ఇటుకల్ని విరాళంగా ఇచ్చింది. క్రెడా తర్వాతి స్థానంలో ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి 10116 ఇటుకల్ని, తర్వాతి స్థానంలో  గిరిధర్ అనంత 6000 ఇటుకల్ని విరాళం ఇవ్వగా.. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వెబ్ సైట్ స్టార్ట్ చేసిన సమయం నుంచి ఇప్పటివరకూ దీనిని 5 లక్షల మంది చూడగా కేవలం 15 వేల మంది మాత్రమే విరాళాలు ఇవ్వడం ఆశ్చర్యకరం.

ఏపీ శంకుస్థాపన ఆహ్వానాలు.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తని జగన్

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనను శంకుస్థాపనకు పిలవద్దని, పిలిచినా రానని.. మళ్లీ రాలేదని విమర్శించొద్దని చెప్పి బహిరంగంగా లేఖ రాసిన సంగతి తెలసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తను వచ్చినా రాకపోయినా పిలవడం తమ బాధ్యత అని జగన్ ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్ మాత్రం ఏపీ మంత్రులకు అందుబాటులోకి రావడం లేదట. ఏపీ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆహ్వానాలు మొదలయ్యాయి. కామినేని శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు, టిడి జనార్ధన్‌లు అన్ని పార్టీ నేతలను ఆహ్వానించే బాధ్యత తీసుకున్నారు.  ఇప్పటికే వీరు ఇతర పార్టీ నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. దీనిలో భాగంగానే.. చంద్రబాబు ఆదేశాల మేరకు జగన్ ను కూడా ఆహ్వానించేందుకు మంత్రులు జగన్ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా జగన్ మాత్రం అందుబాటులోకి రావడం లేదట. అంతేకాదు ఆయన పీఏకు ఫోన్ చేసినా ఆయన నుండి కూడా ఎటువంటి స్పందన లేదట. దీంతో మంత్రులు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తప్పకుండా శంకుస్థాపనకు రావాలని.. రానని మొండి పట్టు పట్టకుండా పరిస్థితి అర్ధం చేసుకోవాలని సూచించారు. మొత్తానికి జగన్ తాను అనుకున్నట్టుగానే శంకుస్థాపనకు నిజంగానే వెళ్లనట్టు కనిపిస్తుంది.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

  ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపాళెం శివారులో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రకాశం జిల్లా పుట్లూరు మండటం చేవూరు నుంచి డీసీఎంలో మాలకొండ వెళుతున్న పెళ్లి బృందాన్ని ఎదురుగా వస్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ కు చెందిన ప్రైవైటు బస్సు ఢీ కొంది. దీంతో డీసీఎం బస్సు క్యాబిన్ లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 40 మందిలో 15 మంది మృతి చెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బస్సులో మాత్రం ఎవరూ లేకపోవడం.. డ్రైవర్ అతి వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. చనిపోయిన వారిని కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

చంద్రబాబు వెనక్కి తగ్గడానికి మోడీ ఫోన్ కాల్ కారణమా?

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖర్చు గురించి అసలు పట్టించుకోరు అన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తున్న ఖర్చు గురించి పదే పదే చెబుతూ వివరణ ఇస్తున్నారు. అసలు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎంత గ్రాండ్ గా చేస్తున్నామని చూస్తారే తప్ప దానికి ఎంత ఖర్చు అయింది అని పట్టించుకోరు చంద్రబాబు. ఎన్నో విషయాల్లో చంద్రబాబు చేసిన ఖర్చులు గురించి ఎంతో మంది విమర్సలు చేసినా అవేమి పట్టించుకునేవారు కాదు. అయితే ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తున ఖర్చు నిమిత్తం పలు విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఒక్క చంద్రబాబే కాదు ఆయనతో పాటు మంత్రులు కూడా అంత ఖర్చు కావడంలేదని కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకొని చంద్రబాబు ఈ విషయంలో మాత్రం ఎందుకు వివరణ ఇస్తున్నారు అన్న సందేహాల నేపథ్యంలో చంద్రబాబుకు వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్లనే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా పదే పదే ఖర్చు గురించి మాట్లడటం.. వివరించడం వెనుక మోడీ ఉన్నట్టు చెబుతున్నారు. శంకుస్థాపన చేపట్టేందుకు ఇంత ఖర్చు ఎందుకని.. ఖర్చు విషయంలో విమర్శలు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ ఆఫీసు నుండి ఫోన్ రావడంతో ఖర్చు విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయం బీహార్ ప్రజలకు చెప్తాం.. రఘువీరా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పారని తెలిపారు. అంతేకాదు ఈ నెల 22వ తేదీన ఏపీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. అదే రోజు కల్లా ఏపీ ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశారని.. త్వరలో బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తాం.. అప్పుడు ఏపీ ప్రజలకు చేసిన మోసాన్ని బీహార్ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ శంకుస్థాపన.. కేసీఆర్ వెళ్లరా? కేటీఆర్ ను పంపిస్తారా?

  ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబే స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు అయితే చంద్రబాబే కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించినా కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరవరూ అనే సంకేతాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తన తరుపున కొడుకు కేటీఆర్ ను ఈ కార్యక్రమానికి పంపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్ర వ్యవహారాలను కేటీఆరే చూస్తుండటంతో కేంద్రంలో కూడా కేటీఆర్ ను ప్రమోట్ ను చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ, ఇతర దేశాల ప్రధానులు. అంతేకాదు పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు వస్తారు.. జాతీయ నాయకులతో మాటమంతీ కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈకార్యక్రామానికి కేటీఆర్ ను పంపించాలని ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఏపీ మంత్రులు కేటీఆర్ ను ఆహ్వానించగా అందుకు ఆయన కూడా వస్తానని తన సముఖత వ్యక్తం చేశారట. దీనితో పాటు ఆయన పలు మీడియా సమావేశాల్లో కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పోటీపడాలని.. ఏపీ రాజధానికి మద్దతు తెలుపుతున్నానని చాలాసార్లు చెప్పారు.