వారి నాలుకలకి రెండు వైపులా పదునే!

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు శాసనసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తలుచుకొన్నందునే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని, అందుకు తనతో సహా తెలంగాణా ప్రజలందరూ ఆమెకు సదా రుణపడి ఉంటారని అన్నారు. కానీ తెలంగాణా ఇచ్చింది సోనియా గాంధీయే అయినప్పటికీ, అందుకు కారణం రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ చేసిన పోరాటాలేనని మరో ముక్క అప్పుడే జోడించారు. ఆయన చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం కనుక శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ తెలంగాణా పాఠ్య పుస్తకాలలో ఎక్కడా ఆమె ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ మండిపడుతున్నారు. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల గురించి ఎక్కడా పేర్కొనకుండా కేవలం తెరాస, దాని అధ్యక్షుడు కేసీఆర్ చేసిన పోరాటాల వలననే తెలంగాణా ఏర్పడినట్లు చరిత్రను వక్రీకరించి పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.   అందుకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు భలే విచిత్రమయిన సమాధానం చెప్పారు. “గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలలో అనేకమంది బలిదానాలు చేసుకొన్నారు. ముఖ్యంగా 2009లో తెలంగాణ ఇస్తామని యూపీయే ప్రభుత్వం ప్రకటన చేసి, మళ్లీ మాట మార్చిన తరువాత వెయ్యి మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారు. ఇంత జరుగుతున్నా సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చేందుకు వెనుకాడి చివరికి తెరాస ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఏర్పాటు చేసారు. ఒకవేళ తెలంగాణా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గురించి దాని అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి వ్రాయవలసి వస్తే ఈ చేదు నిజాలన్నిటినీ కూడా పేర్కొనక తప్పదు. అందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమేనా? తెలంగాణా ఏర్పాటు చేసిన క్రెడిట్ కోరుకొంటున్నకాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలన్నిటికీ మూలకారణం తనేనని అంగీకరించేందుకు సిద్దమేనా?” అని ప్రశ్నించి కల్వకుంట్ల వారి నాలికలకి రెండు వైపులా పదునేనని కెటిఆర్ మరొక్కమారు నిరూపించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఏదో డొంక తిరుగుడు సమాధానం చెప్పగలదేమో కానీ దేనినీ ఔనని ఒప్పుకోలేదని అందరికీ తెలుసు.

పార్టీలో గుంట నక్కలతో జాగ్రత్త సుమీ

  ఈరోజు మహానాడులో మోత్కుపల్లి నరసింహులు మాటలు అందరినీ ముసిముసి నవ్వులు నవ్వుకొనేలా చేసాయి. ఆయన ప్రసంగిస్తూ, ఇంతకు మునుపు స్వర్గీయ ఎన్టీఆర్ తనను మంత్రిని చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా గవర్నర్ ని చేస్తానని అంటున్నారని అన్నప్పుడు చంద్రబాబుతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. “మీరు గవర్నర్ అయితే ఇక్కడ కేసీఆర్ తో యుద్ధం చేసేవారు ఉండరని” చంద్రబాబు చమత్కరిస్తే తను గవర్నర్ అయినా కాకపోయినా తన ధ్యేయం మాత్రం వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను ఓడించడమేనని మోత్కుపల్లి గడుసుగా జవాబిచ్చారు. “నేను ఇంకా గవర్నర్ కాకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గవర్నర్ గారని సంభోదిస్తుంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని” మోత్కుపల్లి అన్నప్పుడు అందరూ మరోమారు మనసారా నవ్వుకొన్నారు. కానీ మోత్కుపల్లి చెప్పిన ఒక మాట పార్టీలో ఎవరినో ఉద్దేశించి అన్నట్లుంది. కొంతమంది గుంటనక్కలు మన పార్టీలో ఉంటూ ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలుపుతూ తన వంటి వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి వారిపట్ల పార్టీ అధిష్టానం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అయితే ఆ గుంటనక్క ఎవరనే సంగతి ఆయన బయటపెట్టకపోయినా అదెవరో పార్టీలో చాలా మందికి బాగా తెలుసట.

ఇంతకీ మన్మోహన్ మోడీ నివాసానికి ఎందుకు వెళ్లినట్లో?

  రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఒకరి గురించి మరొకరు, ఒకరి ప్రభుత్వం గురించి మరొకరు మీడియాలో విమర్శలు గుప్పించుకొంటుంటే రాజకీయాలలో అది చాలా సహజమని అందరూ భావించారు తప్ప ఏదో విడ్డూరంగా భావించలేదు. కానీ అంతగా ఒకరినొకరు విమర్శించుకొన్న తరువాత మోన్న సాయంత్రం డా.మన్మోహన్ సింగ్ ని మోడీ తన నివాసానికి ఆహ్వానించడం, ఆయన అభ్యర్ధనను మన్నించి డా.మన్మోహన్ సింగ్ నిన్న సాయంత్రం మోడీ నివాసానికి వెళ్ళడం, మోడీ ఆయనకు ఎదురేగి సాదరంగా ఆహ్వానించిలోనికి తోడ్కోనిపోయి, టీ ఫలహారాలు చేస్తూ వారిరువురు ముచ్చట్లు ఆడటం మాత్రం నిజంగా విడ్డూరమేనని అందరూ అనుకొంటున్నారు.   సుమారు అర్ధగంట సేపు సాగిన వారిరువురి సమావేశంలో దేశ ఆర్ధిక పరిస్థితిపైనే ప్రధానంగా చర్చ సాగిందని సమాచారం. కానీ అంతకంటే చాలా ముఖ్యమయిన విషయం గురించే వారిరువు చర్చించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ అధికారం చేప్పట్టి ఏడాది పూర్తయింది గనుక ఆయనను అభినందించేందుకే డా. మన్మోహన్ సింగ్ మోడీ నివాసానికి వెళ్లి ఉంటారని అందరికీ అమోదయోగ్యమయిన కారణాన్ని కూడా చెప్పుకొంటున్నారు. నరేంద్ర మోడీ తమ ఫోటోని ట్వీటర్ లో పోస్ట్ చేసి “మళ్ళీ చాలా కాలం తరువాత మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ని కలుసుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అంటూ ఒక మెసేజ్ కూడా పెట్టారు. కానీ మళ్ళీ రేపటినుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యధావిధిగా తమ పోరాటాలు కొనసాగిస్తాయేమో? అయితే ఇంతకీ బద్ద శతృవులుగా వ్యవహరిస్తున్న వారిరువు ఎందుకు కలిసారు అనే ప్రశ్నకు సరయిన జవాబు మాత్రం దొరకనే లేదు.

ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుదే

  హైదరాబాద్ నగరాన్ని ఐటి కేంద్రంగా మలిచి రాష్ట్రానికి పెద్ద ఆర్ధికవనరుని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడేనని తెరాసకు కూడా తెలుసు. కానీ రాజకీయ కారణాల చేత ఆ విషయాన్ని తెరాస నేతలు బహిరంగంగా అంగీకరించలేకపోతున్నారనే సంగతి కూడా అందరికీ తెలుసు. హైదరాబాద్ ని తను అభివృద్ధి చేసారు గనుక చంద్రబాబు నాయుడు అదే విషయం మహానాడులో చెప్పుకొంటే దానినీ తెరాస నేతలు తప్పుపట్టడం హాస్యాస్పదం.   అయితే అప్రస్తుతమయిన ఆ అంశాన్ని పట్టుకొని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం కూడా అనవసరమే. ఎందుకంటే తెదేపా ప్రభుత్వం సుమారు పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించింది. కనుక తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అది చెప్పుకోవడం చాలా సహజం. కానీ నిన్న మొన్న అధికారం చేప్పట్టిన తెరాస పార్టీ తమ ప్రభుత్వం తను ఏమి చేసిందో చెప్పుకోవాలంటే మిగిలిన ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిచూపాల్సి ఉంటుంది. అప్పుడే గత కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల పాలనతో, వాటి హయాంలో జరిగిన అభివృద్ధితో బేరీజు వేసుకొనే హక్కు పొందుతుంది. కానీ అధికారం చేప్పట్టి ఏడాది కూడా పూర్తి కాకుండానే గత ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్, తెదేపాలు చేయలేని పనిని తాము చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకొన్నట్లయితే రేపు అదే పాయింటు పట్టుకొని ప్రతిపక్షాలు మళ్ళీ తెరాస ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించవచ్చును.

హుస్సేన్ సాగర్ ఇక ఖాళీ కాదు

హైదరాబాద్‌ నడిబొడ్డున వున్న కాలుష్య కాసారం హుస్సేన్ సాగర్ ఇక ఖాళీ కానట్టే.  అసాధ్యమైన అంశాన్ని నెత్తికి ఎత్తుకున్న  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హుస్సేన్ సాగర్ ద్వారా కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి, ఆ చెరువును మంచినీటితో నింపాలనే ఆలోచనే ఆచరణలో అసాధ్యమైన ఆలోచన. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోకుండా హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయించడం ప్రారంభించారు. రాజకీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా కేసీఆర్ పట్టు సడలించకుండా హుస్సేన్ సాగర్‌‌లోని నీటిని బయటకి వదిలే పనిని కొనసాగించారు. అయితే కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్టుగా హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ పోరాటం చేసింది. హుస్సేన్ సాగర్ నీటిని వదలడం వల్ల ఆ నీరు ప్రవహించే నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం వుందని ఈ సంస్థ వాదించింది. చెన్నైలో వున్న పర్యావరణ కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి, హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేయకుండా ఆపించింది.  ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. నాలాల మరమ్మతుల కోసం మాత్రమే నీటిని వదలాలి తప్ప ఖాళీ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి తీరతామని స్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ మాట ఫలించకుండా పోయే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. హుస్సేన్ సాగర్లోకి కాలుష్య జలాలను తీసుకుని వస్తున్న నాలాలను దారి మళ్ళించే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వచ్చిన సుప్రీం తీర్పు తెలంగాణ ప్రభుత్వం మీద నీళ్ళు జల్లింది. ప్రస్తుతం ఎండాకాలం ముగింపు దశలో వుంది. పదీ పదిహేను రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. వర్షాలు కురవడం మొదలైందంటే హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అప్పుడు కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా వుండే ఆదేశాలు వచ్చినా ఉపయోగం వుండదు.  మొత్తమ్మీద పరిస్థితుల్ని, పరిణామాల్ని చూస్తే ఇక హుస్సేన్ సాగర్ ఖాళీ అవనట్టే భావించాలి.

దేశ ప్రజలకు మన్మోహన్ షాక్

  పదేళ్ళు ప్రధానమంత్రిగా వున్న కాలంలో మహానుభావుడు ఒక్క ముక్కకూడా మాట్లాడకుండా నెట్టుకొచ్చారు. సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలా గుర్తింపు పొంది, పదవి ఊడిపోయిన తర్వాత చరిత్ర నన్ను అర్థం చేసుకోవాలంటూ బాధపడిపోయారు. అతగాడు మరెవరో కాదు... మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆయన బుధవారం నాడు దేశ ప్రజలకు షాక్ ఇచ్చారు... ఆ షాక్ ఏంటంటే, భారత ప్రధానిగా ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీని ఆయన ఇంటికి వెళ్ళి మరీ మన్మోహన్ అభినందించారు.  అసలు ఈ పరిణామం ఎవరూ ఊహించనిది. ఈ పరిణామాన్ని ప్రధాని మోడీ కూడా ఊహించి వుండరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ ఏంటీ... తమ పార్టీని గద్దె మీద నుంచి దించిన నరేంద్రమోడీని ఇంటికెళ్ళి మరీ అభినందించడమేంటి? నరేంద్రమోడీ పాలన ఒక ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం ఏడాదికాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసుకుంటూ వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మోడీ ప్రభుత్వం మీద బురద జల్లే పనిలో బిజీగా వున్నారు. రాహుల్ గాంధీ అయితే, ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కాని విధంగా మోడీ సర్కారును విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడైన మన్మోహన్ సింగ్ మోడీ ఇంటికి వచ్చి అభినందనలు తెలపడం ఏ తరహా రాజకీయమో అర్థం కావడం లేదు. మన్మోహన్ మనస్పూర్తిగా అభినందించడానికి వచ్చారా.. దీని వెనుక ఏదైనా అంతరార్థం వుందా... సోనియాగాంధీ రాజకీయ పాచిక ఏమైనా వుందా  అనే సందేహాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఉస్మానియాలో ఆత్మహత్యలు జరక్కూడదు

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు ఒక్కటే మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అది... ఉస్మానియా యూనివర్సిటీలో ఇకపై ఆత్మహత్యలు జరగకూడదు. సున్నిత హృదయులైన విద్యార్థులు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు. వాళ్ళందరూ చల్లగా వుండాలి. హాయిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. కానీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మనోభావాలను గాయపరిచేలా వున్నాయి. ఇలా మనోభావాలు గాయపడటం వల్లే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు. మా తెలంగాణ మాగ్గావాలె... మా భూములు మాగ్గావాలె.. మా నీళ్ళు మాగ్గావాలె... మా నిధులు, నీళ్ళు మాగ్గావాలె అంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులు అనేకమంది తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆత్మబలిదానాలతో తెలంగాణ అమరవీరులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారికి జోహార్లు. ఉస్మానియా విద్యార్థులు సరస్వతీ పుత్రులు. వాళ్ళు నిరంతరం చదువుకుంటూనే వుంటారు. అద్భుతమైన చరిత్ర వున్న విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామన్న ఆత్మ సంతృప్తితో వుంటారు. ఉస్మానియాలో ఎక్కడ చూసినా మెరికల్లాంటి విద్యార్థులు కనిపిస్తూ వుంటారు. ఒక ఐన్‌స్టీన్, ఒక థామస్ అల్వా ఎడిసన్‌లకు తీసిపోని మేధావులు ఉస్మానియా యూనివర్సిటీలో వున్నారు. వారు కేవలం మేధావులు మాత్రమే కాదు... వారిలో అంతర్లీనంగా కవులు, కళాకారులు, పోరు బిడ్డలు, ఉద్యమవీరులు కూడా వున్నారు. ఇలాంటి గొప్పగొప్ప విద్యార్థులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కళకళలాడుతూ వుంటుంది. ఇలాంటి విద్యార్థులు తన దగ్గర చదువుకుంటూ ఉన్నందుకు విశ్వవిద్యాలయం గర్వంతో పొంగిపోతూ వుంటుంది. అలాంటి విద్యార్థులు తమ మనోభావాలు దెబ్బతింటే మాత్రం రాజీలేని ఉద్యమం చేపడతారు. తమ ప్రాణాలు పోయినా లెక్క చేయరు. తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఉస్మానియా విద్యార్థుల ఆ తత్వమే ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం రాగానే తమకు ఉద్యోగాలు వచ్చేస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉస్మానియా విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఆ నిరాశతోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లాంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉస్మానియా విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దానికితోడు తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇళ్ళు కట్టించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వారిని ఎంతో బాధపెడుతోంది. తమ యూనివర్సిటీ స్థలాలను లాక్కుంటే ఒప్పుకోమంటూ ఉద్యమించిన విద్యార్థుల వీపుల మీద లాఠీలు నాట్యం చేశాయి. ఉస్మానియా స్థలంలో కట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన హోటల్ మీద ఏదో ఆవేదనతో రాళ్ళతో దాడి చేసిన విద్యార్థులను రిమాండ్‌కి పంపించడం కూడా ఉస్మానియా విద్యార్థి లోకానికి మనోభావాలు దెబ్బతినేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా క్రుంగిపోయిన ఉస్మానియా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడతారేమోనన్న ఆందోళన అందరిలోనూ కలుగుతోంది. అలా జరిగితే తెలంగాణ తల్లి కన్నీరు మున్నీరు అయిపోతుంది. అందుకే అలా జరక్కుండా చూడాలి. అలా జరక్కుండా చూసే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ చేతిలోనే వుంది.

స్నేహం చీటీ మళ్ళీ చించేశారా?

టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో... ఎప్పుడు ఎవరితో స్నేహం చీటీ చించేస్తారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్నటి వరకు ఎంఐఎం నాయకులతో ఫ్రెండ్‌షిప్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు మోడీవైపు మళ్ళింది. మొన్నటి వరకూ మోడీని ఎంతమాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ కొద్ది రోజుల క్రితం నుంచి మోడీని మంచి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పక్కనే నిల్చుని ఫొటో దిగి మురిసిపోతే, కేసీఆర్ కుమార్తె మోడీతో సెల్ఫీ దిగి ముచ్చటపడిపోయింది. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ మోడీని మంచి చేసుకునే ప్రయత్నాల్లోనే భాగంగానే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను చేపట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలా మరిన్ని అంశాల్లో మోడీని మంచి చేసుకోవాలన్న ప్రయత్నంలో వున్న టీఆర్ఎస్‌ సడన్‌గా ఆ ప్రయత్నాలకు బ్రేక్ వేసినట్టు కనిపిస్తోంది. మొన్నామధ్య టీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎంపీ కవిత కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా మోడీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేంద్రమంత్రి అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న ఆమె పిలిస్తే ఆలోచిస్తానని అనడం జనానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే బీజేపీ వర్గాలకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది. కవితమ్మ అలా అన్నారో లేదో ఇలా బీజేపీ స్పందించింది. టీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీయేనని, ఆ పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో స్థానం కల్పించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దాంతో మొన్నటి వరకూ బీజేపీని పల్లెత్తు మాటకూడా అనకుండా ఓర్పు వహించిన టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ గళం విప్పారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ‘మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ హైదరాబాద్ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది’’ అన్నారు. నిన్నటి వరకూ మోడీ స్ఫూర్తితోనే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇలా ప్లేటు తిప్పేశారంటే మోడీతో స్నేహానికి టీఆర్ఎస్ నాయకులు మంగళం పాడినట్టుగానే భావించాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ వాసనలు వదల్లేనట్టుంది...

చిమడవే చిమడవే ఓ చింతకాయ నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు...  ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయ... నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు... అనిచిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని చూస్తే ఇప్పుడు గుర్తొస్తోంది. ఉడికిన ఉల్లిపాయకు కంపు పోనట్టు భారత రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి కాంగ్రెస్ పార్టీ వాసనలు వదిలినట్టు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భోఫోర్స్ కుంభకోణాన్ని అసలు కుంభకోణమే కాదన్నట్టుగా ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేశాధినేత హోదాలో వున్న ప్రణబ్ ముఖర్జీ ఇలా మాట్లాడ్డం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో పదవులు, చివరికి రాష్ట్రపతి పదవిని కూడా పొందిన ప్రణబ్ ముఖర్జీ తన కృతజ్ఞతను బోఫోర్స్ అనేది అసలు కుంభకోణమే అన్నట్టు మాట్లాడుతున్నారు. మీడియానే దానిని కుంభకోణం అంది తప్ప ఏ కోర్టూ దానిని కుంభకోణం అంటూ వ్యాఖ్యానించలేదని చెప్పుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసినట్టుగానే భావించాలి. అయితే రాష్ట్రపతి పదవిలో వున్న ఆయన పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది. ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు చేసిన ఆ వ్యాఖ్యలు ఆ విలువల పరిధిని దాటాయనే భావించాల్సి వుంటుంది. రాష్ట్రపతి పదవికి వచ్చినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం తగ్గకపోతే పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కీర్తిస్తూ కాలక్షేపం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నారెడ్డిని చితగ్గొట్టారా? సో వాట్?

  తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మీద కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి వాతలు పడేలా కొట్టారు. రాజకీయాలు గౌరవంగా మాట్లాడుకునే స్థాయి నుంచి, పచ్చిబూతులు తిట్టుకునే స్థాయికి ఎదిగి, ఇప్పుడు కొట్టుకునే స్థాయికి ఒదిగిన పరిస్థితుల్లో ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మరో పార్టీకి చెందిన కార్యకర్తలు చితగ్గొట్టడం అనేది ప్రజలకు పెద్దగా షాక్ కలిగించే అంశంకాదు. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు పైకి కనిపిస్తోంది. లోపల మాత్రం నానా యాగీ చేయడానికి తమకో అవకాశం దొరికిందని సంతోషిస్తోంది. ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాల్లాంటి కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీగా వుంది. చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టడం నేరం, ఘోరం, అన్యాయం, అక్రమం అని కాంగ్రెస్ పార్టీ ఆక్రోశిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులో, టీఆర్ఎస్ నాయకులో ఎవరైతేనేమి ఎంతోమందిని కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణను కొట్టారు. టీఆర్ఎస్ పార్టీకి చెందని నాయకులు ఎంతోమందిని ఎన్నోరకాలుగా ఉద్యమం ముసుగులో చావబాదారు. అప్పుడెప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఆ ఘటనలను ఖండించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ఎంపీనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ని కూల్చేస్తానంటే ఆ పార్టీ లైట్‌గా తీసుకుంది. ఆ సమయంలో అంత కూల్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు చితగ్గొట్టడం చూసి చాలా ఫీలైపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఫీలవుతోందిగానీ, తెలంగాణలో ఇలాంటి ఘటనలను చూసీచూసీ విసిగిపోయి వున్న జనం మాత్రం సో వాట్? అంటున్నారు.. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిది.

కాంగ్రెస్‌కి మెంటల్ ముదిరింది

కాంగ్రెస్ పార్టీకి మెంటల్ బాగా ముదిరినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మెంటల్ ఎక్కిందన్న ఉద్దేశంతోనే ప్రజలు ఏడాది క్రితం ఎన్నికల సమయంలో తరిమికొట్టారు. అయినప్పటికీ ఈ పార్టీ తన మెంటల్ చేష్టలు మానుకోవడం లేదు. ఇప్పుడు అటు దేశంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే, ఈ పార్టీకి మెంటల్ బాగా ముదిరిపోయిందన్న విషయం అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు సమాధి కట్టేశారు. ఆ సమాధిలోంచే ‘వదల బొమ్మాళీ’ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రంకెలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతర కృషి చేస్తు్న్న తెలుగుదేశం ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుతోంది. సరే, ఏదో ఉనికికోసం కాంగ్రెస్ నాయకులు ఇలా నోరు పారేసుకుంటార్లే అని క్షమించేయాలని జనం అనుకుంటున్నప్పటికీ ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే కాంగ్రెస్‌ని ఎప్పటికీ క్షమించకూడదని ఏపీ ప్రజలు డిసైడ్ అవుతున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో తలతిక్క పనిచేసింది. అసలు ఈ పని చేయడానికి మనసెలా ఒప్పిందో... జనం వెటకారంగా నవ్వుకుంటారని ఆ పార్టీ నాయకులకు కొద్దిగా కూడా అనిపించలేదా అనే సందేహం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొత్తం ఆరు వందల హామీలు ఇచ్చిందట. వాటిలో ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదట. అలా హామీలు నెరవేర్చనందుకు తెలుగుదేశం పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటువేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కి వినతిపత్రం ఇచ్చారు. ఇంత ముదిరిపోయిన మెంటల్ తరహా పని కాంగ్రెస్ పార్టీ మినహా మరో పార్టీ చేయగలదా?

వలల బిజినెస్ మళ్ళీ పుంజుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రంలో వలల బిజినెస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఈ బిజినెస్ బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ బిజినెస్ దాదాపుగా జీరో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వలల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లే  ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా విద్యార్థులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి సంస్థల మీద రాళ్ళదాడులు చేశారు. దాంతో పలు సంస్థలు, భవనాలకు పెద్దపెద్ద వలలు కట్టుకున్నారు. ఆంధ్రావారి పరిశ్రమలకు చుట్టూ వలలు కట్టుకున్నారు. కొన్ని పరిశ్రమలు, సంస్థలవారయితే వలలు కట్టుకోవడంతోపాటు ‘‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’’ అని బోర్డులు కూడా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో అయితే ఏ ఆంధ్రావారికి చెందిన ఏ బిల్డింగ్ మీద అయినా పైనుంచి కింద వరకు పెద్ద వల కట్టేసి వుండేది. ఏ బిల్డింగ్ ఆంధ్రావారిది, ఏ బిల్డింగ్ ఆంధ్రావారిది కాదు అని చెప్పడానికి ఈ వలలే పెద్ద కొండగుర్తుగా వుండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రావారు వలలు తొలగించి రిలాక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ వలల బెడద తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉస్మానియా భూములను స్వాధీనం చేసుకుని, అక్కడ పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా వుండటం, దీన్ని వ్యతిరేకించిన ఉస్మానియా విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ జరిపించడం రాష్ట్రంలోని పరిస్థితిని మార్చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాల్లో కట్టారంటూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన ఒక హోటల్ మీద ఉస్మానియా విద్యార్థులు రాళ్ళదాడి చేశారు. అలాగే ఒక పెట్రోల్ బంక్ మీద కూడా తమ ప్రతాపం చూపించారు. భవిష్యత్తులో ఉస్మానియా విద్యార్థులు మరెంత రెచ్చిపోతారో, ఉస్మానియాలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా ఏయే వర్గాలకు విస్తరిస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌కి చెందిన నాయకులు, టీఆర్ఎస్ సానుభూతిపరులు తమ భవంతులకు రక్షణగా వలలు కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో వలల బిజినెస్ ఊపందుకునే అవకాశం వుంది.

ఏపీ ఉద్యోగుల మనసు కరగదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకూడదని ఏపీ ఎన్జీవోలు భారీ స్థాయిలో ఉద్యమం చేశారు. అంతవరకు ఓకే. రాష్ట్రం విడిపోకూడదని ఉద్యోగులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అని అప్పట్లో వారిమీద సదభిప్రాయం కలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల మీద అప్పటి వరకూ వ్యతిరేకతను వ్యక్తం చేసేవారు కూడా ఉద్యోగులు సమైక్య ఉద్యమం చేసిన తీరు చూసి తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఏపీ ఎన్జీవోల నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో చెట్లకింద అయినా పనిచేయడానికి సిద్ధం అని ప్రకటించేసరికి ఏపీ ప్రజలందరూ ఉద్యోగుల ఔదార్యం చూసి మురిసిపోయారు. అయితే  కాలం గడుస్తున్నకొద్దీ ఉద్యోగుల తీరు చూసి ఏపీ ప్రజలకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏపీ కొత్త రాజధానిలో చెట్లకింద కూర్చుని అయినా పనిచేస్తామని గతంలో ప్రకటించిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు కొత్త రాజధాని పేరు చెబితేనే రాము పొమ్మంటున్నారు. తమకు అక్కడ సౌకర్యాలు, సదుపాయాలు వుండవని అందువల్ల ఇప్పుడప్పుడే కొత్త రాజధానికి రానే రామంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఉద్యోగుల ఈ తీరు చూస్తే, అప్పట్లో వీరు చేసిన సమైక్య ఉద్యమం మీద కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వీరు చేసిన ఉద్యమం తమ ఉద్యోగాలకు స్థానభ్రంశం కలుగుతుందన్న ఆందోళనతో చేసిందే తప్ప, తెలుగుజాతి విడిపోతుందన్న బాధతో కాదని అర్థమవుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా అన్నీ వున్న తెలంగాణ రాష్ట్రం తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే, ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఇంత చేసిన ముఖ్యమంత్రి బతిమాలుతున్నా ఉద్యోగులు హైదరాబాద్‌ దాటి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రమిస్తోందే తప్ప.. ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు రాకపోవడం బాధాకరం. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మనసులు కరగలేదు. ముందుముందు కరుగుతాయన్న ఆశ కూడా కలగడం లేదు.

వైఎస్సార్ పేరుకు మంగళం.. శుభం...

ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక మంగళకరమైన ఆలోచన జరుగుతోంది. అది కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలనేది. ఇటీవల జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది.  ఈ చర్చ అనంతరం కడప జిల్లాకు వున్న వైఎస్సార్ పేరును తొలగించాలనే తీర్మానాన్ని ఆమోదించారు. మినీ మహానాడులో ఆమోదించిన ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించవచ్చు.. లేక ఆమోదించకపోనూ వచ్చు. అయినప్పటికీ, కడప జిల్లా పేరులోంచి వైఎస్సార్ పేరుకు మంగళం పలకడం అనేది ఒక మంగళకరమైన ఆలోచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు నిరంకుశంగా పరిపాలించిన సమయంలో తీసుకున్న అనేక అనవసర నిర్ణయాలలో ఒకటి కడప జిల్లాకు వైస్సార్ పేరు అతికించి ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేరును మార్చడం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయిపోయిన కాంగ్రెస్ నాయకులు జిల్లాల పేర్ల మార్పు తమ జన్మహక్కు అన్నట్టుగా కడప జిల్లా పేరుకు వైఎస్సార్ పేరును అతికించారు. కడప జిల్లాలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. కడప జిల్లాకు ఎంతో సేవ చేసిన గొప్పవారు వున్నారు. వారెవరి పేరునూ ఈ జిల్లాకు పెట్టాలన్న ఆలోచన రాని కాంగ్రెస్ నాయకులకు వైఎస్సార్ చనిపోగానే ఆయన పేరును పెట్టేశారు. ఈ అంశం మీద అప్పట్లోనే వివాదం చెలరేగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాను ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని చాంతాడంత పొడవుగా మార్చినప్పటికీ జనం మాత్రం చక్కగా ‘కడప జిల్లా’ అంటూ పాత పేరునే ఉపయోగిస్తూ వస్తున్నారు. మీడియాలో కూడా ‘కడప జిల్లా’ అంటూ వస్తోంది. ఒక్క జగన్ మీడియా మాత్రం ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేర్కొంటూ వస్తోంది. ‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’ అనే పేరును ఉపయోగించినట్టుగా కడప జిల్లా విషయంలో జరగలేదు. అంటే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టడం జనానికి కూడా ఇష్టం లేదని స్పష్టమవుతోంది. పైగా ముఖ్యమంత్రిగా పనిచేయడమే జిల్లాకు పేరు పెట్టడానికి అర్హత కాదు. అదే అర్హత అయితే ఏ జిల్లాకి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే  ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టేస్తారా? ఈ నేపథ్యంలో కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలన్న ఆలోచనలు రావడం శుభప్రదం.

కాంగ్రెస్‌వి దిక్కుమాలిన రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలు తరిమి కొట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఆ పార్టీ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానలేదు. అడ్డగోలు విభజన కారణంగా దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ప్రత్యేక హోదా మీద తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రత్యేక హోదా లభించినట్టయితే ఆంధ్రప్రదేశ్‌కి ఊరటగా వుంటుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడటానికి ఒక మార్గం దొరికినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ విషయంలో దిక్కుమాలిన రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు కీలకమైన అంశం. ఏపీకి ప్రత్యేక హోదా రావడం వల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది ఊహాజనితమైన అంశమే తప్ప మరేదీ కాదు. ఏ రాష్ట్రంలోని నాయకులైనా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని అనడం మాత్రం న్యాయం కాదు. కాంగ్రెస్‌కి చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ మధ్య కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరాదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందనేది ఆ లేఖ సారాంశం. పైగా లేఖ రాసిన తర్వాత ఆయన సదరు లేఖను తాను వ్యక్తిగతంగా రాశానని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆంధ్రకు మంటపెట్టే లేఖ రాయగానే, ఏపీ కాంగ్రెస్ నాయకులు కస్సుమంటూ లేచారు. గుత్తా ఇలా లేఖ రాయడం అన్యాయం, అక్రమం, దారుణం అంటూ ఆవేశపడిపోయారు. ఇప్పటికే ఏపీలో సర్వనాశనమైపోయిన పార్టీని తిరిగి నిలబెట్టడానికి తాము నిద్రాహారాలు మాని ప్రయత్నిస్తుంటే గుత్తా ఇలాంటి లేఖలు రాయడం అన్యాయమని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ, ఏపీ నాయకులు ఇస్తున్న ఈ రాజకీయ కటింగులు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని అనడం ద్వారా తెలంగాణలో ప్రజల మెప్పు పొందాలని గుత్తాగారు ప్రయత్నిస్తారు. గుత్తా మాటలను ఖండించి ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ నాయకులు ఏపీ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్న ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే దిక్కుమాలిన రాజకీయాల నమూనా అని ప్రజలు అంటున్నారు.

ఆ ముగ్గురిపై రేపు కోర్టులో తెదేపా పిటిషన్

  రాజకీయ నాయకులు అధికారం కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు. కాకపోతే పార్టీలు మారిన తరువాత పాత పార్టీ శాసనసభ్యులుగానే కొనసాగడం లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవలసి వస్తోంది. అనేక ఏళ్లపాటు తెదేపాలో కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డి వంటి ప్రజాప్రతినిధులు అందరూ ఆ కోవకు చెందినవారే. వారు తెదేపా నుండి తెరాసలోకి వెళ్ళినా నేటికీ తెదేపా శాసనసభ్యులుగానే కొనసాగుతున్నారు. ఈ విషయం సాక్షాత్ శాసన సభ కార్యదర్శి ఈరోజు విడుదల చేసిన శాసనసభ సభ్యుల జాబితాలోనే పేర్కొనబడింది. పార్టీని వీడినప్పుడు ఇంకా ఆ పార్టీ శాసనసభ్యులుగానే ఎందుకు కొనసాగుతున్నారనే ప్రశ్నకు వారే జవాబు చెప్పాలి. కానీ వారు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలాగని పదవులను వాదులుకోవడానికి వారు ఇష్టపడటం లేదు. అందుకే ఆ ముగ్గురిని యం.యల్సీ. ఎన్నికలలో ఓటు వేయకుండా దూరంగా ఉండమని ఆదేశించాలని కోరుతూ తెదేపా హైకోర్టులో సోమవారంనాడు ఒక పిటిషను వేసింది. శాసనసభ కార్యదర్శి ఈరోజు విడుదల చేసిన శాసనసభ సభ్యుల జాబితాను కూడా రేపు కోర్టుకి సమర్పించి, వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరబోతున్నట్లు సమాచారం. శాసనసభ్యుడిగా దక్కే అధికారం కోసం, జీతభత్యాలకు ఆశపడుతున్న వారిపై ఒకవేళ కోర్టు అనర్హత వేటువేస్తే వారి పరిస్థితి ఏమిటో?

ఒకే అంశం...రెండు రకాల కధనాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా కర్నూలుపై కూడా దృష్టి కేంద్రీకరించాలని ఉపముఖ్యమంత్రి కేఈ. కృష్ణమూర్తి చేసిన విజ్ఞప్తిని పట్టుకొని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక పార్టీకి చెందిన మీడియాలో  ‘ముఖ్యమంత్రితో ఉపముఖ్యమంత్రి డిష్యుం డిష్యుం’ అని హెడింగ్ తో హడావుడిగా ఓ కధనం ప్రచురించేసింది. అయితే అధికార పార్టీలో జరగరానిదేదో జరిగిపోతోందని వ్రాసేపడేసినప్పటికీ, తను ప్రచురించిన కధనం వలన చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారని స్వయంగా ద్రువీకరించినట్లయిందని ఆలశ్యంగా గ్రహించి, మళ్ళీ మర్నాడు అంటే ఈరోజు సంచికలో ‘ఏమిటో ఈ మాయ’ అంటూ మరో కౌంటర్ కధనం ప్రచురించి చేతులు దులుపుకొంది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాను మాత్రమే అభివృద్ధి చేస్తునందుకు ముఖ్యమంత్రిపై ఉపముఖ్యమంత్రి ఆగ్రహం అంటూ ఏదేదో వ్రాసేసిన ఆ చేత్తోనే ఈరోజు పత్రికలో “పశ్చిమ గోదావరి జిల్లాను ఏ మాత్రం అభివృద్ధి చేయకపోయినా తెదేపా నేతలు అక్కడ ఏదో చాలా అభివృద్ధి జరిగిపోతోందన్నట్లు ప్రజలను మభ్యపెట్టడానికి మరో సరికొత్త డ్రామాకి తెర లేపారు” అంటూ కధనం ప్రచురించడం గమార్హం.   నిన్న వ్రాసిన కధనంలో అధికార పార్టీలో పెద్దపెద్ద గొడవలయిపోతున్నాయని అనే అంశంపై హైలైట్ చేసి, ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి డ్రామా జరుగుతోందని వ్రాయడం మరెవరికీ సాధ్యం కాదేమో? ఈవిధంగా ప్రతీ అంశాన్ని కేవలం తన రాజకీయ కోణం నుండే ప్రజలకు చూపించడం ఎవరూ హర్షించరు. అద్దాల మేడలో కూర్చొని దారిన పోయే వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతుంటే, దాని వలన చివరికి నష్టపోయేది అద్దాల మేడలో కూర్చొన్న వాళ్ళేనని గ్రహిస్తే చాలు.

ఏపీ రాజధాని ప్లానింగ్ సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో అన్న విషయంలో అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు అందరూ రాష్ట్ర రాజధాని విషయంలో పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అంతకు ముందు సింగపూర్ వాళ్లు ఏపీ రాజధాని ప్లానింగ్ ఇచ్చినా దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని 'మాస్టర్ ప్లాన్' ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందింది. అయితే ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజధాని మస్టార్ ప్లాన్ ను అందజేశారు. తూళ్లూరు - మందడం మధ్య ఏపీ నూతన రాజధానిని(కోర్ కాపిటల్) రూపొందించనున్నారు. అయితే ఈ రాజధాని ప్లానింగ్ లో అనేక ఆసక్తికర అంశాలు పొందుపరిచారు. సింగపూర్ బృందం ఇచ్చిన ప్లానింగ్ లో ఎక్కువశాతం పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 7,068 ఎకరాలలలో 58 మండలాలతో 220 కిలోమీటర్ల పరిధిలో రాజధాని విస్తరణ ఉంటుంది. ఇండిస్ట్రియల్ పార్కులు, వినోదకేంద్రాలు, తాగునీరు, విద్యుత్‌, రవాణా, మౌలికసదుపాయాల అభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, నివాసేతర భవనాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించబడింది. నడక సైకిళ్లు ద్వారా కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భనవ్ లాంటి ప్రభుత్వ సంబంధిత కార్యలయాలన్నీ ఇక్కడే రానున్నాయి. అయితే సింగపూర్ ప్రతినిధులతో రాజధాని అంశాలపై చర్చించిన చంద్రబాబు ఈ 'మాస్టర్ ప్లాన్' లో కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు చేసిన సూచనలకు అనుగుణంగా తొలి దశ తుది మాస్టర్ ప్లాన్ మరో ఆరు వారాల్లో సర్కారు చేతికి అందజేయనుంది. అంటే జులై 15 నాటికి సీడ్‌ కేపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ ను సింగపూర్‌ బృందం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అది వచ్చిన వెంటనే ఏపీ రాజధానికి పునాది పడటమే తరువాయి.  

జగన్ ముద్దులు పెట్టడం మానాలి

  వైసీపీ నాయకుడు జగన్‌కి ఒక విచిత్రమైన అలవాటు వుంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ముద్దులు పెట్టేస్తూ వుంటారు. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచీ జగన్‌ది ఇదే వరస. ఎదుట వున్నవాళ్ళు ఎవరు... ఆడా... మగా అనేది కూడా ఆలోచించకుండా తల నిమురుతూ, ముద్దులు పెడుతూ ఓదారుస్తూ వుంటారు. ఓదార్పు యాత్ర అయినా, మరే యాత్ర అయినా ముద్దులు పెట్టే సీన్ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. ముద్దులు పెట్టీ పెట్టీ ఆయనకు ఆ పద్ధతి అలవాటు అయిపోయింది. జగన్ ముద్దుల గురించి జనాలు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నా జగన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలోనే వెళ్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ సార్ ఈ ముద్దుల పద్ధతిని మానుకుంటే మంచిదని భావిస్తు్న్నప్పటికీ ఆ విషయాన్ని జగన్‌కి చెప్పే ధైర్యం లేక ఊరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్ ముద్దుల మీద కామెంట్లు చేస్తు్న్నారు. జగన్ ఏదైనా యాత్రను చేపట్టారంటే జనం భయంతో పారిపోతున్నారని, జగన్ అంత దూరంలో వుంటే జనం ఇంకొంచెం దూరంగా పారిపోతున్నారని వ్యంగ్యంగా అంటున్నారు. ఎందుకంటే, జగన్ దగ్గరకి వెళ్తే ఎక్కడ ముద్దులు పెట్టేస్తారోనని జనం భయపడుతున్నారని చెబుతున్నారు. జగన్‌ని చూసి స్త్రీలు జగన్ ముద్దు పెట్టకుండా చూడు దేవుడా అని ప్రార్థిస్తున్నారని, పెళ్ళికాని ఆడపిల్లలయితే జగన్‌ని చూడగానే తుపాకీ పేలినప్పుడు పారిపోయే పక్షుల తరహాలో గల్లంతు అయిపోతున్నారని కామెడీగా అంటున్నారు. ఇలాంటి కామెడీ కామెంట్లకు ఆస్కారం ఇస్తున్న తన ముద్దుల ప్రహసనానికి జగన్ ఇప్పటికైనా తెర దించితే బావుంటుందేమో. మన అమాయకత్వం గానీ, జగన్ ఒకరు చెబితే విని మారే రకమా!?