అక్షయ్, సైనాను  తప్పుబట్టిన మావోలు జనానికి ఇస్తోన్న సంకేతం ఏంటి?

  పేదల కోసం, తాడిత, పీడిత జనం కోసం, గిరిజనుల కోసం మొదలైన ఉద్యమం నక్సల్ బిరీ ఉద్యమం. అది క్రమంగా పెరిగి పెద్దదై ఇవాళ్ల మావోయిస్టు హింసగా మారింది. యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న అడవిలో అన్నల ఆదర్శం… వేలాది ప్రాణాలు బలి తీసుకుని సాధించింది ఏంటి? సూటిగా మాట్లాడుకుంటే ఎలాంటి సమాధానం దొరకదు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం లేదు. మిగతా చోట్ల అక్కడక్కడా బలంగా వున్నా మొత్తానికి మొత్తంగా ప్రభావితం చేసే శక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు వున్నట్టుండీ విరుచుకుపడి జవాన్లను చంపటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. తరువాత ఆర్మీ, ప్రభుత్వాలు కూడా ప్రతీకార దాడులతో మరింత రక్తపాతం చేస్తున్నాయి…   అంతం అంటూ లేకుండా నడుస్తోన్న మావోయిస్టు హింసలో అమరులయ్యే సైనికులు, పోలీసులే అత్యంత అభాగ్యులు. ఎందుకంటే, వారు అన్నల మాదిరిగా అడవుల్లోకి ఏవో ఆదర్శాలతో ఆవేశంతో రారు. ఉద్యోగం కోసం భద్రతా దళాల్లో చేరి తరువాత అధికారులు చెప్పిన విధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోకి వస్తారు. వారికి ఏ నక్సలైటుతోనూ , గిరిజనుడితోనూ వ్యక్తిగత పగ, ప్రతీకారం వుండదు. కాని, వారు తమని చంపుతున్నారు కాబట్టి మావోలు కూడా వాళ్లని మట్టుబెడుతుంటారు. యుద్ధంలో అది తప్పు కాకపోవచ్చు. కాని, అసలు సీఆర్పీఎఫ్ జవాన్ల కూంబింగ్ ఎందుకు నడుస్తోంది? వామపక్ష ఉగ్రవాదులు ఆయుధాలు వదలకపోవటం వల్ల. యాభై ఏళ్లుగా తమకంటే వందల రెట్లు బలవంతమైన ప్రభుత్వాల్ని చాలీ చాలని ఆహారం, ఆయుధాలతో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తుండటం వల్ల! ఇలా కొండను ఢీకొడుతూనే వుంటే ఎప్పటికి అది పగిలేది? ఎప్పుడు సమ సమాజం ఏర్పడేది? మావోయిస్టుల వద్ద ఎలాంటి సమాధానం లేదు!   రష్యా మొదలు నిన్న మొన్నటి నేపాల్ వరకూ ఎక్కడా సాయుధ విప్లవం శాశ్వత మార్పు సాధించలేకపోయింది. రక్త చరిత్ర అలాంటి నిజం చెబుతున్నా… మన మావోలు మాత్రం తమ పంథా మార్చుకునే ఉద్దేశంలో లేరు. కనీసం ఇప్పుడున్న పంథాలోని లోపాల్ని సైతం విశ్లేషించుకునే తీరికలో లేరు. పైగా అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్ అమరులైన జవాన్ల కుటుంబాలకి ఆర్దిక సాయం చేస్తే మావోయిస్టులు దాన్ని తప్పుపట్టడం ఆశ్చర్యకరం! విషాదం! ఎందుకంటే, అక్షయ్, సైనా జీవితం గడపటం సమస్యగా మారిన కుటుంబాల్ని ఆదుకున్నారు కాని మావోయిస్టులపై పోరుకి జవాన్లకి ఆయుధాలు కొనివ్వలేదు. కాబట్టి వారికి యుద్ధంతో సంబంధం లేదు. యుద్ధం ఆపాల్సింది మావోలు. వాళ్లతో చర్చలు జరిపి సంధికి ప్రయత్నించాల్సింది ప్రభుత్వాలు. మధ్యలో జవాన్ల కుటుంబాల్ని ఆదుపుకున్న ఆక్షయ్, సైనాల్ని టార్గెట్ చేస్తే వారేం చేస్తారు?   ఎప్పుడు ఏ ఎన్ కౌంటర్ జరిగినా అది ఫేక్ అంటూ మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు మావోయిస్టులకు మద్దతుగా బయటకు వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో వారలా సాయుధ విప్లవకారులని సపోర్ట్ చేయటం సబబైతే జవాన్లకి ఆర్దిక సాయం చేసిన అక్షయ్, సైనాల్ని ఏమనగలం? వారి స్వంత కష్టార్జితం ఎవరికి ఇచ్చినా తప్పేముంది? అలాంటి సెలబ్రిటీల్ని కూడా తమ కరపత్రాల్లో విమర్శించి మావోయిస్టులు సామాన్య జనం ముందు మరింత తప్పైపోతున్నారు. ఇది ఖచ్చితంగా అత్యంత అట్టడుగు వర్గాల క్షేమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే అన్నలు పునరాలోచించుకోవాల్సిన చారిత్రక సమయం!

సంగారెడ్డిలోనే రాహుల్‌ సభ ఎందుకు? నానమ్మ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

  నానమ్మ సెంటిమెంట్ ను ఇప్పుడు మనువడు ఫాలో అవుతున్నాడు. ఓడిన చోటే గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకే నానమ్మ బాటలో సంగారెడ్డి నుంచి సమర శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యాడు రాహుల్‌. ప్రభుత్వ వైఫల్యాలను నానమ్మ ఇందిరాగాంధీలాగే ఎండగట్టి తిరిగి కాంగ్రెస్‌ను ప్రజల దగ్గరికి చేర్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.   సంగారెడ్డి అంటే కాంగ్రెస్ మొదటి నుంచి సెంటిమెంటుగా భావిస్తుంది. 1979లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. సంగారెడ్డి నుంచే ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. మెదక్ ఎంపీగా పోటీచేసి భారీ మెజార్టీ సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించి మరోసారి ప్రధాని అయ్యారు. అందుకే సంగారెడ్డి కలిసోస్తుందని పార్టీ పెద్దలకు నమ్మకం. అదే నమ్మకంతో రాహుల్ గాంధీ సభను సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. జూన్ 1న ప్రజా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.    సంగారెడ్డి సెంటిమెంట్ తమకు కలిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. బడా నేతలకు సైతం కనీసం డిపాజిట్లు రాలేదు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. అయితే 1979 ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించిన ఇందిరా గాంధీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. అందుకే సంగారెడ్డిలో రాహుల్ సభ ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా... భారీగా ఉచిత హామీలు గుప్పించి... మరోసారి ప్రజలకు చేరువై 2019 ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తున్నారు. మరి సంగారెడ్డి సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసొస్తుందా లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలుతుంది.

ఆ మంత్రి ఓటమి ఖాయం... కేసీఆర్‌ సర్వేలోనే తేలింది?

  తెలంగాణలో ఇప్పుడు సర్వేల గోలే నడుస్తోంది. అయితే సర్వేలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని పక్కనబెడితే... కేసీఆర్‌ మూడో సర్వేలో ఆయన ప్రియ శిష్యుడు, మంత్రి లాస్ట్‌ ప్లేస్‌లో నిలవడం టీఆర్‌ఎస్‌లో హాప్‌ టాపిక్‌‌గా మారింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి జగదీశ్‌‌రెడ్డికి వందకి కేవలం 30 మార్కులే వచ్చాయట. దాంతో శిష్యుడి పరువు పోతుందని జగదీశ్‌రెడ్డి మార్కులను కేసీఆర్‌ ప్రకటించలేదంటున్నారు గులాబీ నేతలు. టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌లో జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలను ప్రకటించిన కేసీఆర్‌... జగదీశ్‌రెడ్డి పేరు మాత్రం దాటవేశారు. తర్వాత చూద్దామంటూ తనదైన స్టైల్లో సైడ్‌ ట్రాక్‌ చేశారు. అయితే మంత్రికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తిచూపడంతో దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. జగదీశ్‌‌రెడ్డికి కనీసం పాస్‌ మార్కులు కూడా రాలేదని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.    జగదీష్ రెడ్డి మంత్రి కావడం... అది కూడా కేసీఆర్ కు అత్యంత ప్రియమైన శిష్యుడు కావడంతో ఫలితాలను ప్రకటించడానికి సీఎం ఇబ్బంది పడ్డారంటున్నారు. ఫలితాలు ప్రకటిస్తే ఓ బాధ... ప్రకటించకుంటే మరో బాధలా తయారైంది అధినేత పరిస్థితి. అందుకే జగదీష్‌రెడ్డి సర్వే ఫలితాలు  ప్రకటించకపోవడమే బెటర్ అనుకున్నారు సీఎం. అయితే జగదీష్ రెడ్డిని పేరును కాకుండా ఆ తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలైన తీగల, బాబూమోహన్, మాధవరం పేర్లను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ పేర్లు ప్రకటించి... జగదీష్ రెడ్డి పేరు ప్రకటించక పోవడాన్ని తప్పుబడుతున్నారు. జగదీశ్‌‌రెడ్డి.... కేసీఆర్‌కు ప్రియశిష్యుడు కావడం వల్లే ఆయన ఫలితాలను ప్రకటించలేదని గులాబీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు.   సర్వేలో జగదీష్ రెడ్డి ఫెయిల్ కావడం వెనుక చాలా కారణాలున్నాయంటున్నారు. పెద్ద, చిన్నా తేడా లేకుండా దూషణల పర్వానికి దిగుతారనే పేరుంది. అసెంబ్లీ వేదికగా ఇతర సభ్యులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పారు. ఏలాగూ సీఎం ఏమీ అనరన్న ధైర్యంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలున్నాయి. మరో వైపు నియోజకవర్గలో సైతం ఆయనకు మంచి పేరు లేదు. కనీసం కార్యకర్తలకు ప్రతి నమస్కారం కూడా చేయరని తెలుస్తోంది. అయినా సీఎంకు చాలా క్లోజ్ కాబట్టి నోరెత్తలేకపోతున్నారు. అయితే సీఎం మాత్రం జగదీష్ రెడ్డి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే... వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలుస్తాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఓడిపోతే.. ఎలా అకామిడేట్ చేయాలన్న దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతుంది. దాంతో ఆయన ఓటమి ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.

సైన్యం సైలెంట్‌గా మారిపోతోంది! ఆర్మీ చీఫ్ రావత్ ఆటా మొదలెట్టారు!

    ఏ దేశానికైనా అత్యంత అవసరమైన ఇద్దరే ఇద్దరు పౌరులు… జవాన్, కిసాన్! ఆ ఇద్దరిలో కూడా ఎవరు ఇంకా చాలా ముఖ్యం? ఖచ్చితంగా ఇప్పుడున్న ఆధునిక అణు బాంబుల యుగంలో జవానే కీలకం! ఇది కొంత మందికి నచ్చకపోవచ్చు… ఆర్మీకి విపరీతంగా ఖర్చు పెడుతున్నారని వాపోయే మేధావులు కూడా వుంటారు.. కాని, అవన్నీ కేవలం మాటలే. నిజంగా ప్రపంచ పటంలోని ప్రస్తుత పరిస్థితి చూస్తే … సైన్యం లేకుంటే దేశమే లేదు. ఒక వైపు పాక్, మరో వైపు చైనా, ఇంకో వైపు దేశం లోపల మావోయిస్టులు, ప్రకృతి విపత్తులు… ఇన్ని సుడిగుండాల నేపథ్యంలో ఇండియాకి సోల్జర్స్ కంటే ముఖ్యం ఇంకెవరో చెప్పండి?   ఆర్మీ వల్లే ఏ దైశమైనా బతికి బట్టకట్టేది. భారతదేశమూ అంతే! కాని, అప్పుడప్పుడూ, అక్కడక్కడా సైనికులు కూడా తప్పులు చేస్తుంటారు. అరాచకాలకు పాల్పడవచ్చు కూడా. కాని, వారి వల్ల కలిగే లాభంతో పొలిస్తే ఇబ్బంది చాలా స్వల్పం. అయినా కొందరు ఆర్మీని టార్గెట్ చేయటం అభ్యుదయవాదం అనుకుంటారు. మొన్నటికి మొన్న ఓ కేరళ మంత్రి ఆర్మీ వారు వచ్చి ఆడవాళ్లని కి్డ్నాప్ చేసి రేప్ చేస్తారంటూ నోటికి వచ్చినట్టు వాగేశాడు. కన్నయ్యా కుమార్ లాంటి జేఎన్ యూ విద్యార్థి కూడా చదువబ్బని వారు సైన్యంలో చేరతారంటూ అవమానకరంగా మాట్లాడు. ఇలాంటి వారు మన దేశంలో బోలెడు!   ఆర్మీని ఆడిపోసుకునే బాపతు వర్గం వారు ఆ మధ్య ఒక కాశ్మీరీని జీపుకి కట్టేస్తే నానా గొడవ చేశారు. అది నిజానికి మానవహక్కుల ఉల్లంఘనే అయినా మేజర్ నితిన్ గొగోయ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్న వేసుకునే ఓపిక లేదు కొందరు మేధావులకి! రాళ్లు రువ్వే కాశ్మీరీ అరాచాక ముఠాల బారి నుంచీ పోలింగ్ సిబ్బందిని కాపాడాల్సిన బాధ్యత ఆర్మీ మేజర్ పై పడింది. అప్పుడు ఆయన కాశ్మీరీ రాళ్లు రువ్వే యువత బారి నుంచీ వాళ్లలో ఒకర్నే జీపుకి కట్టేసి దాడి నివారించాడు. పోలింగ్ సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. ఇలాంటి కారణంగా సదరు సంఘటన వెనుక వుంది కాబట్టే భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ … మేజర్ గొగోయ్ ని ప్రశంసా పత్రంతో సత్కరించారు!   మోదీ ఏరికోరి ఆర్మీ చీఫ్ గా నియమించిన బిపిన్ రావత్ నిశ్శబ్ధంగా భారత సైన్యాన్ని సమూలంగా మార్చేసే చర్యలు చేపడుతున్నారు. అందులో మొదటిది కాశ్మీరీని జీపుకి కట్టేసిన మేజర్ కి అవార్డ్ ఇవ్వటం! మామూలుగా అయితే అలాంటి సాహసం చేసిన ఆర్మీ అధికారిని భారత సైన్యం శాఖా పరమైన చర్యలకి గురి చేస్తుంది. ఎందుకంటే, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అంతెత్తున లేచి ఆర్మీ ప్రత్యేక అధికారాలు తొలంగించాలంటూ సెలవిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం బయపడుతుంది కాబట్టి! ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మోదీ సర్కార్ ఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తోంది   ఇక ఇండియాన్ ఆర్మీ చీఫ్ ఈ మధ్య కాలంలో తీసుకున్న మరో నిర్ణయం సైన్యానికి, సర్కార్ కి మధ్య వుండే పేమెంట్ గొడవలకు స్వస్తి పలకటం! గతంలో ఎప్పుడు చూసినా ఆర్మీ అధికారులు, భారత ప్రభుత్వ అధికారులకి మధ్య ఆర్దిక విషయాల్లో అభిప్రాయ భేదాలు వుండేవి. ఆర్మీ అధికారుల్లో తమకు రావాల్సిన జీతాభత్యాల గురించి అసంతృప్తి వుండేది. బిపిన్ రావత్ తన అధికారులు కొందరు ఒప్పుకోకున్నా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చేశారు. దాని ప్రకారం ఇకపైన సైన్యం మొత్తానికి కొత్తగా నిర్ణయించిన జీతాలు చేతికందనున్నాయి. ఇది కుటుంబాలకు దూరంగా దేశం కోసం పని చేసే ఆర్మీ వారికి ఎంతో మేలు చేసే అంశం…   మన ఆర్మీ బాస్ తీసుకున్న మరో మంచి నిర్ణయం … యుద్ధం చేయటంలో ఎంతో శిక్షణ పొందిన జవాన్లని సహాయకులుగా వాడటాన్ని నివారించటం. గన్నులు పట్టుకుని దేశ సేవ చేయాల్సిన సిబ్బందిని అధికారుల ఇళ్లలో వివిధ సేవలకి వినియోగించుకోవటం ఎప్పట్నుంచో వస్తోంది.  ఆ పద్ధతికి బదులుగా బిపిన్ రావత్ కొంత మంది సాధారణ పౌరుల్ని సహాయకులుగా నియమించాలని నిర్ణయించారు. అప్పుడు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న సోల్జర్స్ యుద్ధానికి సిద్ధంగా వుండగలుగుతారు!    నెల నెలకి, వారం వారానికి పాక్ ఆగడాలు మితిమీరుతున్న వేళ సైన్యానికి నైతిక, ఆర్దిక స్థైర్యం కలిగించే చర్యలు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేపట్టడం నిజంగా అభినందనీయం. సంతోకరం.

నా కూతురూ కాదు... ఆమె పెళ్లమూ కాదు... సాయిశ్రీ కేసులో కొత్త మలుపు

  నాన్నా బతికించు అంటూ సెల్ఫీ వీడియోతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి... ప్రాణాలొదిలిన విజయవాడ చిన్నారి సాయిశ్రీ కేసు కొత్త మలుపు తిరిగింది. సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించని మాదంశెట్టి శివకుమార్‌ మీడియాకి సుదీర్ఘమైన లేఖ రాశాడు. సాయిశ్రీ, సుమశ్రీలతో తనకెలాంటి సంబంధం లేదని ట్విస్ట్‌ ఇచ్చాడు. సాయిశ్రీ అసలు తన కుమార్తే కాదన్నాడు. సుమశ్రీ కూడా తన భార్య కాదంటూ కొత్త బాంబు పేల్చాడు. పోలిన కృష్ణకుమార్‌‌కు సుమశ్రీ మూడో భార్య అన్న మాదంశెట్టి శివకుమార్‌.... సాయిశ్రీ అనారోగ్యంతో చనిపోలేదని, చంపేశారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. సుమశ్రీ, మరికొందరు కలిసి సాయిశ్రీని చంపేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నాడు. సాయిశ్రీ మరణంపై మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తానన్న శివకుమార్‌.... హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపాడు.   సాయిశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్‌లో అద్దెకు దిగిందని, ఆ తర్వాత 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్‌లోని కృష్ణకుమార్‌ వద్దకు పారిపోయిందని శివకుమార్‌ ఆరోపించాడు. దీనిపై పామర్రు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. సుమశ్రీ, సాయిశ్రీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న శివకుమార్‌.... కేవలం మానవతా దృక్పథంతోనే పాపను పెంచానని, సాయిశ్రీ వైద్యానికి సుమారు పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశానన్నారు. అయితే తన ఫ్లాట్‌లో మరో మహిళతో కలిసి సుమశ్రీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందని‌.... దీనిపై చుట్టుపక్కలవారు ఎన్నోసార్లు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫిర్యాదు కూడా చేశారన్నాడు.   నాన్నా బతికించు అంటూ సెల్ఫీ వీడియోతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి.... మరణించిన సాయిశ్రీ తీవ్ర కలకలం రేపితే.... ఇప్పుడు మాదంశెట్టి శివకుమార్ ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. అయితే మానవతా దృక్పథంతోనే వైద్యం చేయించానంటున్న మాదంశెట్టి శివకుమార్‌... సాయిశ్రీ తనకు ఏమీ కాకపోతే పాతిక లక్షలు ఎలా ఖర్చు పెడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సాయిశ్రీ తన బిడ్డే కాదంటూ కేసును కొత్త మలుపు తిప్పాడు శివకుమార్‌. మరి ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.... ఇంకెన్ని సీక్రెట్లు బయటికొస్తాయో చూడాలి.

సర్వేలను నమ్ముకుంటే జగన్‌‌కు ఎదురైన పరిస్థితే... ట్రంప్‌లాగా ఎందుకు జరగదు?

  2019లో అధికారం ఎవరిదన్న దానిపై కేసీఆర్‌, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్‌ సర్వే బోగసన్న కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై కేసీఆర్‌ విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని సర్వేలో తేలడంతో విపక్షాలకు బుర్ర పాడైందంటూ తన స్టైల్లో సెటైర్లు పేల్చారు. టీఆర్‌ఎస్‌ దెబ్బకు తెలంగాణలో అడ్రస్‌ లేని కాంగ్రెస్‌... కేడర్‌ లేని బీజేపీ కకావికలం అవుతున్నాయన్నారు.  తమను రాజీనామాలు కోరే హక్కు ఎవరికీ లేదన్న కేసీఆర్‌.... కాంగ్రెస్‌ లీడర్లకు అంత ధీమా ఉంటే.... రిజైన్లు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్‌ విసిరారు. అంత  పౌరుషం దమ్మూ ఉంటే రాజీనామా చేసి రండి.... ఆ సీట్లలో ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కేసీఆర్ రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు.   తెలంగాణ బీజేపీ నేతలపైనా కేసీఆర్‌ ఒంటి కాలిపై లేచారు. తమ సర్వే బోగస్‌ అంటున్న బీజేపీ లీడర్ల మైండే పెద్ద బోగస్‌ అంటూ ఫైరయ్యారు. సర్వేలపై నమ్మకం లేదంటున్న బీజేపీ నేతలు... సర్వేల్లో మోడీ గ్రాఫ్‌ పెరిగిందంటూ ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాని బీజేపీకి... వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు.   అయితే కేసీఆర్‌ సర్వేలపై సీఎల్పీ లీడర్‌, ప్రతిపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించకుండా... రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై కేసీఆర్‌‌కి అప్పుడే తొందరెందుకంటూ చురకలంటించారు. తనకు సర్వేలపై నమ్మకం లేదన్న జానా... 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్నారు. అమెరికాలో ట్రంప్‌ గెలిచినట్లుగా.... ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌ పవర్‌లోకి వస్తుందన్నారు. మొత్తానికి రెండేళ్ల ముందే తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. అయితే కేసీఆర్‌ చెబుతున్నట్లుగా టీఆర్‌ఎస్‌కి 111 సీట్లు వస్తాయనడం మాత్రం నమ్మశక్యంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సర్వేలను నమ్ముకుంటే జగన్‌‌కు ఎదురైన పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.

చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు...

  తండ్రి ముఖ్యమంత్రి... కొడుకు మంత్రి... ఇద్దరి మధ్యా 30ఏళ్లపైనే ఏజ్‌ గ్యాప్‌. ఒకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... మరొకరు ఆయన తనయుడు నారా లోకేష్‌... చంద్రబాబు వయసు ప్రస్తుతం 67 సంవత్సరాలు... లోకేష్‌ ఏజ్‌ సుమారు 34ఏళ్లు... కానీ ఇద్దరి పనితీరులో భారీ వ్యత్యాసం. 67ఏళ్ల వయసులోనూ చంద్రబాబు.... నవ యువకుడిలా పరిగెడుతుంటే... ఆయన తనయుడు లోకేష్‌ మాత్రం తండ్రి వేగాన్ని అందుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. ఇది ఎవరో ప్రత్యర్ధులు అన్న మాట కాదు... స్వయంగా నారా లోకేషే ఒప్పుకున్న నిజం...   మహానాడు వేదికగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన లోకేష్‌... ఆయనతో పోటీ పడటం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు. నవ యువకులకు కూడా అసూయ పుట్టేలా ఆయన కష్టపడతారని పొగడ్తలతో ముంచెత్తారు. యువకుడినైనా తానే...ఆయనతో పోటీ పడలేకపోతున్నాని చెప్పారు. చంద్రబాబు వేగాన్ని అందుకోవడానికి తామంతా ఆపసోపాలు పడుతున్నామన్నారు. 67ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని లోకేష్‌ అన్నారు. ఆర్ధిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని పైకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని తండ్రిపై... లోకేష్‌ ప్రశంసలు వర్షం కురిపించారు.   లోకేష్‌ వ్యాఖ‌్యలు కొంత ఆశ్చర్యం కలిగించినా... ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఉన్నంత యాక్టివ్‌గా మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 67ఏళ్ల ఏజ్‌లో కూడా ఆయన పాతికేళ్ల యువకుడిలా పరిగెడుతున్నారు. ఆయన తన శరీరాన్ని అదుపులో పెట్టుకున్న తీరు... అందరికీ ఆదర్శమే. అంతేకాదు రాజకీయాల్లో ఎనర్జిటిక్ లీడర్లనే జనం లైక్‌ చేస్తారు. బాహుబలిలా ఉండకపోయినా ఫర్లేదు కానీ... చురుగ్గా లేకపోతే మాత్రం అస్సలు ఇష్టపడరు. అందుకే చంద్రబాబు వయసు మీదకొచ్చేకొద్దీ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తన పనితీరుతో యువతకే చెమటలు పట్టిస్తున్నారు. అందుకు లోకేష్‌ వ్యాఖ‌్యలే రుజువు. మరి మీరేమంటారు?

ఆ ‘రెండే’ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం నిలబెట్టేవి

  మహానాడు ముగిసింది. తెలుగు దేశం పార్టీ మహా సంబరం కూడా అయిపోయింది. యధావిధిగా ఘుమఘుమలాడే వంటకాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాని, అదే రేంజ్లో ఘాటైన రాజకీయ ఉపన్యాసాలు చెవిన పడలేదని కొందరు బాధపడ్డారు. అయితే, టీడీపీ అభిమానులు మాత్రం మహానాడు ఘనంగా ముగియటంతో హ్యాపీగా ఫీలయ్యారనే చెప్పాలి. కాకపోతే, అధికారంలోకి వచ్చిన మూడో ఏడు నడుస్తున్న ఈ కీలక సమయంలో జరిగిన మహానాడు సారాంశం ఏంటి?   మహానాడులో బోలెడు మాటలు, ఇంకా చాలా తీర్మానాలు వినిపించి వుండవచ్చు. కాని, మొత్తం సంబరం అంతా ఒక్క వాఖ్యంలో మాట్లాడేసుకోవాలంటే… అది చంద్రబాబు చెప్పిన ‘’ అమరావతి, పోలవరం … రెండు నాకు రెండు కళ్లు! ‘’ అన్నది. ఈ ఒక్క స్టేట్మెంట్ వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశానికి మళ్లీ అధికారం ఎలా వస్తుందో చెప్పగలదు. అదే సమయంలో ఏ అంశాలు నిర్లక్ష్యం చేస్తే జనం మనసులో మార్పు ఆలోచన చోటు చేసుకుంటుందో ఆ రహస్యం కూడా అందులోనే దాగుంది!   నవ్యాంధ్రగా ఏర్పడ్డ ఏపీ ఇప్పుడు అస్థిత్వ పోరాటంలో వుంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా లేని స్థితిలో సరికొత్త ప్రస్థానం మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకు కారణమైన జాతీయ కాంగ్రెస్ ను ఆంధ్రా ప్రజలు సున్నా సీట్లతో కోలుకోలేని విధంగా శిక్షించారు. అదే సమయంలో నవ్యాంధ్రకు నవ్యమైన ఆత్మవిశ్వాసం కలిగించే గొప్ప బాధ్యత కూడా అనుభవం, దూరదృష్టీ వున్న చంద్రబాబుపై పెట్టారు. జగన్ని కాదని అధికారం ఇచ్చారు. అందుకే, అమరావతి తన రెండు ప్రాధాన్యాల్లో ఒకటని చెప్పారు బాబు. అయితే, కేవలం ఒక రాజధాని నిర్మాణం మాత్రమే అమరావతి అనిపించుకోదు. అమరావతి రూపంలో ఆంధ్రులకి ఎంతో అవసరమైన అవకాశల వెల్లువ మొదలవ్వాలి. అదంత తేలికైన విషయం కాకున్నా పని చేసే సత్తా వున్న ప్రతీవారికీ ఉద్యగం ఇప్పించగలగటమే  సీఎంకు అతి పెద్ద సవాల్! ఆ ఛాలెంజ్ కాని సమర్థంగా ఎదుర్కొంటే రానున్న ఎన్నికలు నల్లేరు పై నడకే!   చదువుకున్న యువత ఉద్యోగం కోరితే రైతులు కన్నీరు తుడిచే సాగునీరు కోరతారు. అందుకే, చంద్రబాబు పోలవరం కూడా ప్రస్తావించారు. ఒక్క పోలవరం పూర్తైతే యావత్ ఆంధ్ర రాష్టం స్థితి, గతే మారుతుంది. ఇది అందరూ ఒప్పుకునేదే. సాగునీరు, తాగు నీరు రెండూ జనానికి అంది సస్యశ్యామలం అవుతుంది తెలుగు నేల. కరువు రహిత రాష్ట్రం కూడా అవుతుంది. కాని, పోలవరం పూర్తి అసాధ్యం కాకపోయినా అసాధారణ విషయమే. చంద్రబాబు ఎంతో పట్టుదలతో భగరీథ ప్రయత్నం చేస్తే తప్ప అది సాకారం కాదు. కాని, ఒక్కసారి పోలవరం పూర్తి అయితే మాత్రం అది టీడీపీకి ఖచ్చితంగా పెద్ద వరమే అవుతుంది!   సీఎం చంద్రబాబు మహానాడులో చెప్పినట్టు వచ్చే ఎన్నికల లోపు అమరావతి, పోలవరం ఎంత వరకూ సాకారం అవుతాయో తెలియదుగాని … ఆయన కార్యదక్షతతో వాటిని నిర్మిస్తే మాత్రం సరికొత్త ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం జరిగినట్టే! అలాగే, తెలుగు దేశం కూడా మరిన్నేళ్లు తెలుగు దేశానిదే!    

ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం..తల్లిదండ్రుల ఏకాంతాన్ని వీడియో తీశాడు

సైబర్ నేరగాళ్లు అమాయకులను బుక్ చేయడానికి చాలా రకాల మార్గాలు వాడతారు వాటిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది ఫేస్‌బుక్. ఇప్పటి వరకు కేటుగాళ్ల మాయలో చిక్కుకుని ఎంతోమంది ధన, మాన, ప్రాణాలను పొగొట్టుకున్నారు. వారు ఎలాగో పోతారు...కాని వారి వల్ల కుటుంబం మొత్తం చిక్కుల్లో పడితే..అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫేస్‌బుక్‌కు బానిసగా మారిన ఓ 13 ఏళ్ల కుర్రాడు తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా తన తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్న వీడియోని తీసి అతనికి పంపాడు. అయితే అవతలి వ్యక్తి బ్లాక్ మెయిలర్‌గా మారడంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.   అసలు వివరాల్లోకి వెళితే బెంగళూరులోని హీరోహళ్లి-ఆంధ్రాహళ్లి రోడ్‌లో నివాసిస్తున్న 13 ఏళ్ల బాలుడు గతేడాది ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచాడు. ఈ క్రమంలో తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి బాలుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అతడు దానిని వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. బాలుడికి అభ్యంతరకర ఫోటోలు పంపడం మొదలెట్టిన తేజల్ పటేల్ చిన్నారిని చైల్డ్ పోర్నగ్రఫీకి అలవాడు చేశాడు. ఆ తర్వాత బాలుడిని మీ పేరేంట్స్ న్యూడ్ ఫోటోలు పంపాల్సిందిగా కోరాడు. అతడి కోరిక కాదనలేకపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసి దానిని తేజల్ పటేల్‌కు పంపాడు.   వాటిని అందుకున్న అతను ఇక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోని అడల్ట్ వెబ్‌సైట్‌లో పెడతానని బెదిరించాడు. దీనికి భయపడిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తతతో ఉండాలంటున్నారు పోలీసులు..పిల్లలు గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడపకుండా కాస్ల ఓ కన్నేసి ఉంచాలంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. లేదంటే మీ పిల్లలు చేసిన తప్పు వల్ల మొత్తం కుటుంబమే చిక్కుల్లో పడే అవకాశం ఉందంటున్నారు. సో బీ అలర్ట్.

సినిమా చూపిస్తాననీ..బాలికపై స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్

సినిమా చూపిస్తాననీ మాయ మాటలు చెప్పి విద్యార్ధినిపై స్నేహితులతో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అసలు వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలోని పిణ్యా ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువకుడికి అదే ప్రాంతంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ప్రతీ రోజు ఏదో ఒక వంకతో బాలికతో మాటలు కలపడంతో వారి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో గత ఆదివారం సినిమాకు వెళదామని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. ఇద్దరూ సినిమా చూసిన అనంతరం బయటకు వచ్చారు. అనంతరం పిణ్యాలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.   అంతటితో ఆగకుండా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. మళ్లీ స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాత్రి వరకు అదే భవనంలో బాలికను నిర్బంధించిన ఆ కామాంధులు తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. ఇంటికి వెళ్లడానికి భయపడిని బాలిక తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. ఐదు రోజులైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిణ్యా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఆచూకీని కనుగొన్నారు. అనంతరం జరిగిన దారుణాన్ని పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఇద్దరు మైనర్లు.

గన్నులు పట్టే ఉగ్రవాదులు… వారికండగా రాళ్లు రువ్వే ఉగ్రవాదులు!

కాశ్మీర్ కి మంచి కాలం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు! సంవత్సర కాలంగా రాళ్ల వర్షం కురుస్తోంది. అందుకు సమాధానంగా భారత ఆర్మీ, జమ్మూ , కాశ్మీర్ పోలీసులు కూడా గట్టిగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా మరో ఎన్ కౌంటర్ మరోసారి రాళ్లు రువ్వే వేర్పాటవాద ఉన్మాద మూకలకి పని కల్పించింది. ఆర్మీ, పోలీసులు టార్గెట్ గా వేలాది రాళ్లు గాల్లోకి ఎగురుతున్నాయి…   సంవత్సరం క్రితం బుర్హాన్ వనీ అనే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ కాశ్మీర్లో ఎన్ కౌంటర్ అయ్యాడు. అప్పట్నుంచీ పాకిస్తాన్ పంపే డబ్బులు తీసుకుంటున్న కాశ్మీరీ అల్లరి మూకలు రాళ్లు రువ్వే దుర్మార్గానికి తెగబడుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతగా నియంత్రించే చర్యలు చేపట్టినా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే దేశ ద్రోహులు బుద్ది మార్చుకోవటం లేదు. తాజాగా మరో ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకే చెందిన సబ్జార్ అహ్మాద్ అనే టెర్రరిస్ట్ హతమయ్యాడు. అతను బుర్హాన్ వనీకి వారసుడుగా, హిజ్బుల్ కమాండర్ గా కొనసాగుతున్నాడు! ఇక సంవత్సరం కాలంగా ఏ బుర్హాన్ కోసమైతే రాళ్లు రువ్వారో వారంతా ఇప్పుడు అహ్మద్ కోసం అరాచకానికి తెగబడుతున్నారు. ఒకవైపు పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్ జరుగుతుండగానే మరో వైపు అల్లరి మూకలు ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వ్యవస్థల ద్వారా సమాచారం పంచుకుని రోడ్లపైకి వచ్చి దాడులు మొదలుపెట్టాయి. అందుకే, నెల తరువాత ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన రాష్ట ప్రభుత్వం పన్నెండు గంటలు కూడా గడవక ముందే వాట్ని మళ్లీ నిషేధించింది!   వేర్పాటువాదులు, అల్లరి మూకలు, అరాచక యువత , విద్యార్థుల వల్ల సామాన్య కాశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. ఇంటర్నెట్ లాంటివి కూడా లేక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్మీ, పోలీసులు పూర్తి స్థాయిలో తమ సత్తా చాటి అరాచవాదుల్ని అణచివేయటం లేదు. ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం, కోర్టులు రాళ్లు రువ్వే వారిపై కాల్పులు జరపవద్దని చెప్పటం, మానవ హక్కుల సంఘాలు, మీడియా నిరంతర నిఘా భద్రతా దళాల్ని ఏం చేయలేని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ స్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం వుంది. పాకిస్తాన్ కంటే ఈ రాళ్లు రువ్వే అంతర్గత శత్రువులే కాశ్మీర్ పాలిట పెద్ద విలన్లుగా మారిపోతున్నారు…

షా వలసల అస్త్రం… కేసీఆర్ ఆకర్ష్ దివ్యాస్త్రం!

తెలంగాణ రాజకీయం వలసల సెగలతో సలసల కాగిపోనుందా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు! ఎందుకూ అంటే… 2014 ఎన్నికల ముందు వరకూ సమైక్య రాష్ట్రంలో కాంగ్రస్, టీడీపీలే ప్రధాన పార్టీలు. తరువాత వచ్చిన వైసీపీ బలమైన శక్తిగా ఎదిగింది. కాని, ఆ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్ని తొలిసారి ఎదుర్కొంది 2014లోనే! అప్పుడు టీడీపీతో పోటీపడి ఆంధ్రాలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇటు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ, బీజేపి లాంటి సీనియర్ పార్టీల కంటే టీఆర్ఎస్ టీ సెంటిమెంట్ తో బలంగా దూసుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రపు తొలి గులాబీ సర్కార్ ఏర్పాటు చేసింది! కాని, కేసీఆర్ సీఎం అయ్యాక వలసల విషయంలో కొత్త ఊపు తీసుకొచ్చారు!   ఒక దశలో టీఆర్ఎస్ అస్థిత్వాన్నే ప్రశ్నించేలా ఎమ్మెల్యేల్ని చీల్చి వైఎస్ రాజకీయం చేశారు. సరిగ్గా అదే ఆయుధం ఉపయోగించి కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక టీ కాంగ్, టీ టీడీపీలకు చుక్కలు చూపించారు! వారానికో ఎమ్మేల్నో, సీనియర్ నేతనో గులాబీ వనంలోకి లాక్కుంటూ తెలుగు దేశానికి, కాంగ్రెస్ కి మనః శాంతి లేకుండా చేశారు. చివరకు, టీ టీడీపీ తెలంగాణలో నామ మాత్రంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ కు చావు తప్పి కన్ను లొట్టపోయింది!   తెలంగాణలో కేసీఆర్ తన మిషన్ ఆకర్ష్ మొదటి దశ జరిపినప్పుడు చెక్కుచెదరకుండా వుండగలిగింది బీజేపి మాత్రమే! ఆ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేల్ని లాక్కోవలని ప్రయత్నించారో లేదో గాని… వున్న ఐదుగురు మాత్రం కాషాయదళంలోనే కంటిన్యూ అవుతున్నారు. కాని, తాజాగా అమిత్ షా టీ టూర్ చేసి వెళ్లటంతో బీజేపి అన్ని పార్టీల వారికి వెల్ కమ్ చెప్పే ప్లాన్ లో వుందని వార్తలోచ్చాయి. ఇంకా ఎవరూ కండువాలు కప్పుకోలేదు కాని… కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఎంతో కొంత టెన్షన్ అయితే ప్రారంభమైంది. అధికారంలో వున్న కార్ ను వదిలి పెద్దగా నాయకులు వెళ్లరనే భావించినా దిల్లీలో అధికారంలో వున్న  బీజేపి అసంతృప్తుల్ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే, కేసీఆర్ ఇక రెండో దఫా ఆకర్ష్ కి రెడీ అవుతున్నారని మీడియాలో టాక్!   బీజేపి వారు టీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులకి, అలాగే కాంగ్రెస్ వారు టీఆర్ఎస్ లోని అసంతృప్తులకి గాలం వేసేలోపే గులాబీ బాస్ ఇంకో సారి వలసల దండయాత్ర చేయనున్నారట. ఆదిలాబాద్ లోని టీ టీడీపీ సీనియర్ నాయకుడు, గిరిజన నేత రమేష్ రాథోడ్ వికెట్ త్వరలోనే పడనుందంటున్నారు. ఆయన సైకిల్ దిగి కార్ ఎక్కేస్తారట. రానున్న నెలల్లో ఇలా ఇంకా చాలా మందే టీడీపీ, కాంగ్రెస్ నుంచి గులాబీ వైపు వెళ్లవచ్చట! ఈ వలసల వల్ల వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా వుండబోతున్నాయో మనకు తెలియదుగాని… కేసీఆర్ కి, టీఆర్ఎస్ కి బీజేపి గండం మత్రం 2019ఎన్నిలైపోయేదాకా కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, అమిత్ షా కూడా కేసీఆర్ ప్రయోగిస్తున్న వలసల అస్త్రాన్నే తెలంగాణ రాజకీయాలపై ప్రయోగించనున్నారు! కాబట్టి ఐపీఎల్ ఆటగాళ్ల వేలం తరహాలో హాడావిడి తప్పదు…

నాడు, నేడు, మహానాడు…

  మరో సంవత్సరం గడిచింది. మరో మహానాడు కోలాహలం మొదలైంది. ఈసారి విశాఖ తీరం పసుపు రంగు కలయికతో మనోహరంగా మారింది. అయితే, ఇలా మహానాడు ప్రతియేటా జరిగేదే. వైజాగ్ లోనూ మహానాడు జరగటం ఇది మూడోసారి. కాని, సంవత్సరానికి ఒకసారి జరిగే టీడీపీ వార్షికోత్సవాల లాంటి మహానాడు సంబరాలు… ఊరికే మీడియాలో చూపించినట్టు ఉపన్యాసాలు, రకరకాల వంటకాలు, విందులు, వినోదాలు, ఏవో ఒకట్రెండు రాజకీయ అలజడులు మాత్రమే కాదు! మహానాడు అంటే ఇందిరా హయాంలోని ఇనుమడిస్తున్న కాంగ్రెస్ ను ఓడించి నిలిచిన ఒక పసుపు పచ్చ ఆత్మ గౌరవ పతాకానికి నిదర్శనం! తెలుగు జాతి ఆధునిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం!   అన్న ఎన్టీఆర్ దిల్లీ వీధుల్లో ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఆవేదన చెంది రాజేసిన నిప్పు కణం తెలుగుదేశం పార్టీ. అది ఇవాళ్ల , ఒక విధంగా జాతీయ పార్టీగా అవతరించగలిగింది. తెలంగాణలో విపక్షంగా, నవ్యాంధ్రలో పాలక పక్షంగా, రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా పక్షంగా అస్థిత్వం కొనసాగిస్తోంది. ఏ మహానాడుకైనా ఇదే అసలు సగర్వ కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, చరిత్రలో ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పై పోరుకి సై అంటూ బరిలోకి దిగాయి. అంతే త్వరగా హస్తం చరుపులకి నేలకూలిపోయాయి. కాని, ఎన్టీఆర్ భగ్గున వెలిగించిన తెలుగు దేశం ఇవాళ్టికీ దిల్లీ కాంగ్రెస్ పెద్దల అహాన్ని సవాలు చేస్తూ దూసుకుపోతుంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే రెండూ కలిసి జాతీయ కాంగ్రెస్ ను కట్టడి చేస్తే మన దగ్గర టీడీపీ ఒక్క పార్టీనే సింగిల్ హ్యాండ్ గా వందేళ్ల పార్టీని ఢీకొట్టింది!   సమైక్య రాష్ట్రంలో అధికారంలో వున్నా లేకపోయినా చాలా మహానాడు సంబరాలు హైద్రాబాద్ లోనే జరిగాయి. ఈ సారి అలాకాక టీడీపీ చేతిలో వున్న నవ్యాంధ్రలో… రాజధాని అమరావతిలో కాకుండా విశాఖలో జరుగుతున్నాయి. ఇలా వేరు వేరు నగరాల్లో మహానాడు ఏటేటా జరపటం పార్టీని కార్యకర్తలకి మరింత దగ్గర చేసే అవకాశం వుంటుంది. అయితే, అంతకంటే ముఖ్యంగా, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా అవతరించిన ఈ చారిత్రక సందర్భరంలో మహానాడు మేధోమథనంలో టీడీపీ నేతలు చేయాల్సిన మరో ముఖ్యమైన పని కూడా వుంది. ఆంధ్రలో తెలుగు దేశం సత్తా చాటింది. చంద్రబాబు భాషలో చెప్పాలంటే తల్లి కాంగ్రెస్ , పిల్ల కాంగ్రెస్ లను అధిగమించి అధికారం చేపట్టింది. కాని, సమస్యల్లా టీఆర్ఎస్ ఈదురు గాలికి వణికిపోతోన్న టీ టీడీపీతోనే!   విశాఖలో జరుగుతోన్న మహానాడుకి రెండు రైళ్లలో తెలంగాణ టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారట. అలాంటి వేలాది సైకిల్ సైనికుల కోసమైనా చంద్రబాబు టీ టీడీపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీ కాంగ్, టీఆర్ఎస్ ఆక్రమించిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని టీడీపీ మరోసారి మార్చాలి. బీజేపితో కలిసిగాని… స్వంతంగా కాని… తెలంగాణలో మరోసారి పచ్చ జెండా రెపరెపలాడించాలి. ఇది కేవలం పార్టీకి, కార్యకర్తలకి మాత్రమే కాదు జనానికి కూడా ఎంతో మేలు చేసే పరిణామం. అందుకే, ఈ మధ్య తెలంగాణ మహానాడులో బాబు చెప్పినట్టు టీ టీడీపీపై ప్రత్యేక దృష్టి పెట్టి పునాదులు నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జాతీయ పార్టీగా వెలుగొందే అవకాశం తెలుగుదేశానికి , పేరుకు తగ్గట్టుగా వుంటుంది.

ఓటమి తప్పని యుద్ధానికి సిద్ధమవుతోన్న సోనియా!

  ఇప్పుడు దేశంలో అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న అంశం… నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు? అద్వానీ నుంచీ రజినీకాంత్ దాకా చాలా మంది పేర్లే వినిపించాయి. అయితే, అటు అద్వానీ కాని… ఇటు రజినీకాంత్ కాని రాష్ట్రపతి అవ్వకపోవచ్చని ఆల్రెడీ సంకేతాలు వచ్చేస్తున్నాయి. అద్వానీ మీద కోర్టు విచారణ రాష్ట్రపతి ఎన్నికల కంటే వేగంగా దూసుకొస్తోంది. ఇటు రజినీకాంత్ తన స్వంత పార్టీ పెట్టి తమిళనాడు సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది! మరి తరువాతి రాష్ట్రపతి ఎవరు?   ప్రణబ్ తరువాత రాష్ట్రపతి భవన్ ఎవరిదో తెలియదుగాని… ప్రణబ్ మాత్రం ఇక సెలవు అంటున్నారు దిల్లీకి! మరో రెండు నెలల్లో తన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తనతో పని చేస్తోన్న అధికారుల్ని వారి వారి మంత్రిత్వ శాఖలకి తిప్పి పంపేస్తున్నాని ఆయన చెప్పారు. అంటే అర్థం ప్రణబ్ దా ఇక నేరుగా కోల్ కతా ఫ్లైట్ ఎక్కేస్తారనే! ఆయన ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో శేష జీవితం స్వరాష్ట్రంలో గడుపుతానని అన్నారు!   ప్రణబ్ తనకు రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండే ఉద్దేశం లేదని చెప్పటానికి కారణం పదవి మీద ఇష్టం లేక కాదు. ప్రస్తుతం మెజార్టీ వున్నా బీజేపికాని, ఎన్డీఏ కూటమి కాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చే ఉద్దేశంలో లేవు. అటువంటప్పుడు ప్రతిపక్షాల్ని నమ్ముకుని పోటీలో వుండటం కోరి ఓడిపోవటమే తప్ప మరోటి కాదు. అందుకే, గౌరవంగా పక్కకు తప్పుకుంటున్నాడు మన సీనియర్ కాంగ్రెస్ లీడర్. కాని, ట్విస్ట్ ఏంటంటే… ఒకవైపు ప్రణబ్ ముఖర్జీ తాను రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండనని చెబుతోంటే మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా అపొజిషన్ పార్టీలతో రాష్ట్రపతి అభ్యర్థి గురించి మీటింగ్ పెడుతున్నారు. కాంగ్రెస్ తో పాటూ చాలా పార్టీలు ప్రణబ్ తమకు ఓకే అని చెప్పాయి. కాని, మోదీ సర్కార్ ఎంత మాత్రం అలాంటి ఆలోచనలో లేదు!   సోనియా ఎలాగైనా మోదీ ప్రతిపాదించే అభ్యర్థిపై తమ క్యాండిడేట్ ను పోటీకి నిలపాలని ప్రయతిస్తన్నారు. గెలవటం కోసం కాకపోయినా… ప్రతిపక్ష పార్టీలన్నిటికీ రాష్ట్రపతి ఎన్నికని అడ్డుపెట్టుకుని తాము నేతృత్వం వహించాలని కాంగ్రెస్ ప్లాన్. కాని, సోనియా ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమత కూడా మోదీతో మాటా మంతీ అయ్యాక టోన్ మార్చారు! ప్రతిపక్షాలకు కూడా అంగీకారమయ్యే అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామనీ, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే బెటరని దీదీ అన్నారు! ఎలాగైనా ఎలక్షన్ జరిగేలా చూసి… మోదీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న సోనియాకి ఇది నిజంగా చిరాకు పరిచే స్టేట్మెంటే! అందరికీ అమోదయోగ్యం అయ్యే అబ్దుల్ కలామ్ లాంటి అభ్యర్థి అంటూ మమతా బెనర్జీ క్లాజులు పెట్టడం మోదీకి వెసులుబాటు కలిగించే అంశం! ఒడిషాకు చెందిన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మూ లాంటి వారిని రేపు బీజేపి తమ అభ్యర్థిగా నిలబెడితే… మమతా బెనర్జీ ఆమె గిరిజన మహిళ అంటూ మద్దతు ప్రకటించవచ్చు! అప్పుడు కాంగ్రెస్ టీమ్ లోంచి ఓ కీలక వికెట్ పడిపోయినట్టే!   కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా వున్న వేళ వస్తోన్న ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఖచ్చితంగా హస్తానికి తప్పనిసరి ఓటమే అవ్వనున్నాయి!

నక్కని ప్రేమించింది… నరకానికి వెళ్లి తిరిగొచ్చింది!

  ఉజ్మా అహ్మద్… నెల రోజుల క్రితం వరకూ ఎవ్వరికీ తెలియని ఒక భారతీయ ముస్లిమ్ మహిళ. కాని, ఇప్పుడు ఆమె ప్రపంచం ముందు పాక్ నుంచి ఇండియాకి ప్రాణాలతో తిరిగొచ్చిన అదృష్టవంతురాలు! గురువారం విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సమక్షంలో ఆమె మీడియా ముందుకొచ్చింది. తన నాలుగేళ్ల కూతుర్ని కళ్ల వెంట నీళ్లు కారిపోతుంటే గట్టిగా వాటేసుకుంది. అలా తనని ముద్దాడగలనని బహుశా ఆమె కొన్నాళ్ల క్రితం ఊహించి కూడా వుండదు. అంతటి నరకకూపంలోకి ప్రమాదవశాత్తూ జారిపోయి మళ్లీ బయటపడింది!   ఉజ్మా అహ్మద్ మలేషియాలో ఒక ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడింది. తాహిర్ అలీ అనే అతను పాకిస్తానీ. అయితే, అతడ్ని కలిసేందుకు కొన్నాళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లిన ఉజ్మా నరకం ఎలా వుంటుందో చవి చూసింది. తాహిర్ అలీ మలేషియాలో అయితే ప్రేమించాడు కాని… తన స్వంత దేశం పాక్ కి వచ్చేటప్పటికి రాక్షసుడిలా మారిపోయాడు. గన్ పెట్టి బెదిరించి ఉజ్మాను పెళ్లాడిన తాహిర్ ఆమెను కొడుతూ, హింసిస్తూ నరకం చూపాడు. ఎలాగో అతడ్ని తాను భారత హై కమీషన్ ఆఫీస్ కి వెళతానని, వీసాలు తెచ్చుకుంటాననీ కన్విన్స్ చేసిన ఉజ్మా … ఒక్కసారి ఇండియన్ ఎంబసీలో కాలుమోపి మళ్లీ బయటకి వెళ్లలేదు. తనని తాహిర్ కి అప్పగించాలని భారతీయ అధికారులు నిర్ణయిస్తే విషం తీసుకుని ఛస్తానని చెప్పింది!   ఈ వ్యవహారం మొత్తం తెలుసుకున్న మన విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా రంగంలోకి దిగి ఉజ్మాతో మాట్లాడి  భరోసా ఇచ్చారు. రోజులు కాదు… ఏళ్లైనా సరే … ఉజ్మాను ఇండియన్ ఎంబసీలోనే వుంచి కాపాడతామని చెప్పారు. దాంతో ధైర్యం తెచ్చుకున్న ఉజ్మా పాకిస్తాన్ కోర్టులో కేసు వేసి అనుకూల తీర్పు సంపాదించుకుని భారతదేశంలోకి క్షేమంగా అడుగుపెట్టింది!   సుష్మ స్వరాజ్ మొదలు పాక్ లోని భారతీయ అధికారుల వరకూ ఎందరో గట్టి కృషి చేస్తే మాతృదేశానికి తిరిగి వచ్చిన ఉజ్మా… పాకిస్తాన్ ఒక మృత్యు కూపం అని తేల్చి చెప్పింది. పాక్ అనే బావిలోకి దూకితే చావు తప్పదనీ, ఆడవాళ్లు కాదు… ఆ దేశంలో మగవాళ్లు కూడా క్షేమంగా వుండలేరని ఆమె హెచ్చరించింది. పూర్తిగా అరాచకమయం అయిపోయిన పాక్ స్థితేంటో ఈ సంఘటన మరోసారి ఋజువు చేసింది!   ఈ మధ్య కాలంలోనే దిల్లీలోని ప్రఖ్యాత నిజాముద్దీన్ దర్గా ప్రధాన మౌల్వీ, ఆయన బంధువు కూడా పాక్ లో కిడ్నాప్ కి గురయ్యారు. ఆ దేశానికి వెళ్లిన వాళ్లిద్దర్నీ పాకిస్తాన్ భద్రతా దళాలే నిర్భంధంలో వుంచాయని తరువాత తేలింది. అప్పుడు కూడా మన దేశ విదేశాంగ శాఖ ఎంతో శ్రమ చేసి వార్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది!   అరాచకానికి మారుపేరుగా మారిపోయిన పాకిస్తాన్ అక్కడి స్వంత ప్రజలకే ప్రమాదకరం అయినప్పుడు విదేశాల వారికి నరకంలా తోచటం ఆశ్చర్యమేం కాదు. ఉజ్మాలాగే దురదృష్టం కొద్దీ పాక్ మృత్యు కూపంలో పడిపోయిన మన కల్భూషణ్ జాదవ్ కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం…

పెట్రోల్ బంకుల దగ్గర కార్ల హడావిడి మరో ఐదారేళ్లేనట!

  కార్ అంటే కేవలం ఒక వాహనం కాదు. అదొక ప్రిస్టేజ్ సింబల్. అదొక సక్సెస్ సంకేతం. అందుకే, ఎవరైనా సరే నాలుగు కాసులు వెనకేయగానే కార్ కొని షికారు చేసేస్తుంటారు. అయితే, మరో ఐదు, పదేళ్ల తరువాత కార్లు కొనే వాళ్లు, పెట్రోల్ , డీజిల్ కొట్టించి చేతి చమురు వదిలించుకునే వారు భారీగా తగ్గిపోతారట! ఆ దెబ్బతో చమురు ధరలు భారీగా పడిపోయి ఆయిల్ ఉత్పత్తి చేస్తూ పెత్తనం చెలాయిస్తోన్న దేశాలు అతలాకుతలం అవుతాయట! అంతే కాదు, ఇప్పుడున్న లక్షల కోట్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా తుడిచిపెట్టుకుపోతుందట! ఏంటిదంతా… అనుకుంటున్నారా? ఇదేదో జ్యోతిష్యం కాదు! ఒక అమెరికన్ ఫ్యూచరిస్టు బిజినెస్ మ్యాన్ విశ్లేషణ!   టోనీ సెబా అనే వ్యాపారవేత్తకి అమెరికాలోనూ, ప్రపంచం వ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు వుంది. అందుక్కారణం ఆయన కొన్నాళ్ల క్రితం చేసిన ప్రిడిక్షన్! ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ వాడకం విరివిగా పెరిగిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. టోనీ చెప్పినట్టే సౌరశక్తితో అద్భుతాలు సాధ్యమవుతున్నాయి. అయితే, తాజాగా భవిష్యత్ అంచనా వేయటంలో దిట్ట అయిన టోనీ మరో బాంబు పేల్చాడు. ఐదారేళ్లలో లీటర్ పెట్రోల్ ధర 30రూపాయలకి పడిపోవచ్చని చెప్పాడు! ఎందుకో కూడా కన్విన్సింగ్ గా వివరించాడు!   టోనీ అనాలిసిస్ ప్రకారం… ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యుత్ శక్తితో నడిచే వాహనాల వినియోగం పెరుగుతోంది. మన దేశంలో ఇంకా విపరీతంగా పెట్రోల్, డీజీల్ కార్ల అమ్మకాలు జరుగుతోన్న చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, అస్సలు కాలుష్యాం చేయకపోవటం వీటి స్పెషాలిటీస్! అందుకే, మన విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆ మధ్య 2030నాటికి భారత ప్రభుత్వ వాహానాలన్నీ ఎలక్ట్రిక్ కార్లే వుండబోనున్నాయని ప్రకటించారు! టోనీ చెప్పే దాని ప్రకారం ఇండియాలోనే కాదు… 2030నాటికి యావత్ ప్రపంచం విద్యుత్ కార్లనే పెద్ద మొత్తంలో వాడేస్తుందట!   కేవలం ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగటంతోనే పెట్రోల్, డీజీల్ ధరలు పడిపోతాయా? కానే కాదు! ముందు ముందు నగర జీవనంలో భారీ మార్పులు రానున్నాయట. అందులో ప్రధానమైంది ప్రతీ ఒక్కరూ స్వంతంగా ఎడాపెడా కార్లు కొనకపోవటం! విపరీతమైన ట్రాఫిక్ జామ్ లు, స్వంతంగా నడిపించుకోవటంలోని ఒత్తిడి, అంతే కాక ఉబర్ లాంటి ట్యాక్సీ సర్వీసుల తక్కువ ధర సేవల కారణంగా.. దాదాపు 95శాతం మంది ఓన్ కార్స్ వాడటం మానేస్తారట! మరి దీని ఎఫెక్ట్ ఎలా వుంటుంది? ఖచ్చితంగా ఆయిల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు ఢమాల్ మంటాయట! మరో పది, పదిహేను ఏళ్ల తరువాత కూడా పెట్రోల్ , డీజీల్ కార్లు కొనేవారున్నా భారీగా సంఖ్య తగ్గిపోతుందట. దాని వల్ల ఆటోమొబైల్ , ఆయిల్ పరిశ్రమలు పెద్ద కుదుపుకి గురై ధరలు భారీగా పతనం అవుతాయి!   ఇదంతా టోనీ చెప్పిన భవిష్యత్ లోని ఎకనామిక్స్! కాని,పెట్రోల్, డీజీల్ ధరలు పడిపోయి… చమురు కొనే వారు తగ్గిపోతే … పెద్ద పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు అయిల్ ను అడ్డు పెట్టుకుని ఆటాడుకుంటున్న సౌదీ లాంటి సంపన్న దేశాలు… అప్పుడు డమ్మీ అవుతాయి. వాటిపై ఆధారపడే వారు లేకపోవటంతో ఇస్లామిక్ ఉగ్రవాదం లాంటి అంశాల విషయంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే, సౌదీ లాంటి పెట్రోల్ డాలర్ దేశాల రాజభోగం అంతం కావచ్చు. మొత్తం మీద రానున్న కాలంలో విద్యుత్ కార్ల షాక్ ప్రపంచానికి తప్పకపోవచ్చు! కాని, కాలుష్యం అస్సలు చేయని ఆ కార్లు ఎంత త్వరగా అంతే మంచిదని కూడా అంటున్నారు పర్యావరణ ప్రేమికులు!

రజినీకి బీజేపిలో చేరోద్దని సలహా ఇస్తోన్న బీజేపి ఎంపీ!

  రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా? ఎన్నో ఏళ్లు ఈ ప్రశ్న జనాల్ని వేదించింది. ఇప్పుడు దాదాపుగా అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. రజినీ రాజకీయాల్లోకి వస్తాడు! అయితే, ఇప్పుడు మరో మిలియన్ డాలర్ ప్రశ్న అందరి మనసుల్నీ తొలిచేస్తోంది. తలైవా స్వంత పార్టీ పెడతాడా? లేదా మన బాబా… కాషాయం కప్పుకుంటాడా? కాని, ఇంకా సూపర్ స్టార్ నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రావటం లేదు. దిల్లీకి వెళ్లి ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ మోదీని కలిశాక ఆయన ఏమైనా చెప్పవచ్చు. కాని, అంతలోనే జరగాల్సిన హంగామా జరిగిపోతోంది! మరీ ముఖ్యంగా సినిమా వాళ్లు రజినీ రాజకీయ ఎంట్రీ ఎగ్జైట్మెంట్ అస్సలు ఆపుకోలేకపోతున్నారు!   బీజేపి నాయకులు పై నుంచి కింద దాకా… పడయప్పని తమ పార్టీలోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. అమిత్ షా లాంటి అగ్రనేతలు పరోక్షంగా స్వాగతం పలుకుతుంటే తమిళనాడు నుంచి కేంద్ర కేబినేట్ లో వున్న బీజేపి నేత పొన్ రాధకృష్ణన్ లాంటి వారు నేరుగానే వెల్ కమ్ చెప్పేస్తున్నారు. ఆయన ఈ మధ్యే రజినీకాంత్ బీజేపిలోకి వస్తే తమిళనాడు సీఎం అవ్వటం గ్యారెంటీ అనేశారు! ఇక పొలిటీషన్స్ సంగతి ఎలా వున్నా సినిమా వాళ్లు మాత్రం … తమ శివాజీ, ది బాస్ నిర్ణయం కోసం అల్లాడిపోతున్నారు. ముత్తుతో ఒకప్పుడు ఆన్ స్క్రిన్ రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ మీనా తాను ఆల్రెడీ రజినీ టీమ్ అని చెప్పేసింది. ఆయన పార్టీ పెట్టినా, బీజేపీలో చేరినా తాను ఆయన వెంటేనని తేల్చేసింది. తమిళ భక్తుల చేత గుడి కట్టించుకున్న గుజరాతి భామ నమిత కూడా రజినీకాంత్ కి తన గ్లామర్ తో పూర్తిగా సాయం చేస్తానని ప్రకటించింది. మీనా లాగే నమిత కూడా తలైవా వెంట ఎట్ ఎనీ కాస్ట్ వుంటానని శపథం చేసింది!   మీనా , నమితా లాంటి వారు రజీనికాంత్ అండతో రాజీకాయాల్లోకి వద్దామని ఆరాటపడుతోంటే… వయస్సులో, ఇండస్ట్రీలో, పాలిటిక్స్ లో అన్నిట్లో సీనియర్ అయిన శత్రుఘ్న సిన్హా మాత్రం వివాదాస్పదమైన సలహా ఇచ్చాడు సూపర్ స్టార్ కి! ఆ మధ్య వచ్చిన లింగాలో తన కూతురు సోనాక్షితో కలిసి నటించిన రజినీకి తమిళనాడులో వున్న క్రేజ్ ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందుకే, తలైవాని టైటానిక్ ఆఫ్ తమిళనాడు అన్నాడు ట్వీట్స్ లో! అక్కడితో ఆగకుండా శత్రుఘ్న సిన్హా రాజకీయాల్లోకి రావటానికి ఇదే సరైన సమయం అన్నాడు. కాని, అసలు ట్విస్ట్ వెంటనే ఇస్తూ… బీజేపి టికెట్ మీద ఎంపీగా గెలిచిన ఆయన… రజినీకాంత్ ని స్వంత పార్టీ పెట్టుకొమ్మన్నాడు! ఒకవైపు కమలదళం నేతలు అందరూ నరసింహని తమ టీమ్ లో చేర్చుకోవాలని తలకిందులు తపస్సు చేస్తుంటే ఆయన ఎందుకు అలా అని వుంటాడు? ఖచ్చితంగా రజినీ క్షేమం కోరి మాత్రం కాదని విమర్శిస్తున్నారు మోదీ భక్తులు!   అద్వానీ, వాజ్ పేయ్ టైంలో ఒక వెలుగు వెలిగిన శత్రుఘ్న సిన్హా మోదీ, అమిత్ షాల కాలంలో పూర్తిగా ఆరటిపండు అయిపోయాడు. ఆయన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. మోదీ వ్యతిరేక, బీజేపి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటమే కారణం. మొన్నటికి మొన్న ఆయన లాలుని, నితీష్ ని, అరవింద్ కేజ్రీవాల్ ని కూడా పొగిడాడు! ఆ మధ్య బీహార్లో బీజేపి ఓడిపోతే కూడా మోదీ, షా ద్వయంపై ఒంటికాలు మీద లేచాడు! ఇదంతా తనని పక్కకు పెట్టినందుకే అనేది పబ్లిక్ సీక్రెట్! ఇప్పుడు ఇక రజినీకాంత్ ని కూడా తన పార్టీలోకి రావద్దంటూ ఇండైరెక్ట్ గా బీజేపిలోకి వస్తే అంతే సంగతులు అంటూ హింట్ ఇచ్చాడు!   శత్రుఘ్న సిన్హా చెప్పినందుకు కాదు గాని… రజినీ తన స్వంత పార్టీ పెట్టే ఛాన్సులే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాది పార్టీ అని ఆరోపణలు ఎదుర్కొనే కమలదళంలో చేరితే ఎంతో కొంత డ్యామేజ్ సూపర్ స్టార్ కి తప్పదు. అదే స్వంత కుంపటి పెట్టి కమలంతో దోస్తీ చేస్తే బెటర్ రిజల్ట్స్ వుంటాయి. అందుకే, ఆల్రెడీ పార్టీ జెండా, ఎజెండా రెడీ చేసే పని కూడా స్టారైందని తమిళ మీడియా చెబుతోంది!

మోదీతో సఖ్యం.. షాతో సమరం.. కేసీఆర్ వ్యూహం!

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ని కలిశారు. అదీ అత్యవసరంగా. ఎందుకు? ముస్లిమ్ లకు, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ల కోసం టీ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. కాని, గవర్నర్ ని కలిసిన కేసీఆర్ మాటలు వింటే మనకు చాలా తత్వమే బోధపడుతుంది. కేంద్రంతో, బీజేపితో ఆయన ఇప్పుడప్పుడే ఏ విధంగానూ కిరికిరి వద్దనుకుంటున్నారని ఇట్టే చెప్పేయోచ్చు. అందుకే, అమిత్ షా పై అమితమైన కోపం ప్రదర్శిస్తూ మోదీని మాత్రం ఫుల్లుగా ఆమోదిస్తున్నారు. ఏక కాలంలో కాషాయదళానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వెరైటీ రాజకీయం చేస్తున్నారు గులాబీ బాస్!   అమిత్ షా నల్గొండకు వచ్చి సభలు పెట్టి హడావిడి చేసేదాకా కేసీఆర్ అసలు ఆ సంగతి పట్టించుకున్నటే కనిపించలేదు. ఇతర టీఆర్ఎస్ లీడర్లు కూడా తీవ్రంగా ఏం స్పందించలేదు. కాని, ఒక్కసారి షా వచ్చి నల్గొండలో కాలుమోపాక సీన్ మారిపోయింది. అసలు అమిత్ షా తెలంగాణ పర్యటన మొత్తం హైద్రాబాద్ కి కాక నల్గొండకి ఎందుకు పరిమితం చేశారు? మరెక్కడా వుండకుండా పూర్తిగా ఒకే జిల్లాలో ఎందుకు వున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానంగా కొంత మంది నల్గొండలో భారీగా వలసలు వుండబోతున్నాయని అంటున్నారు. ఎప్పుట్నుంచో వినిపిస్తోన్న కోమటిరెడ్డి బ్రదర్స్ మొదలు చాలా మంది కాషాయ కండువాలు కప్పుకోనున్నారట. 2019కి ప్రిపరేషన్లో భాగంగా నల్గొండ నుంచీ వేట మొదలుపెట్టాలని బీజేపి భావిస్తోంది!   బీజేపి టార్గెట్ తెలంగాణ వ్యూహంపై ఎంత వరకూ క్లారిటీకి వచ్చారో మనకు తెలియదుగాని… కేసీఆర్ అమిత్ షాని బాగానే టార్గెట్ చేశారు. లక్ష కోట్ల విషయంలో రాజీనామా చేస్తానంటూ సవాల్ కూడా విసిరారు. అయితే, అదే సమయంలో తనని ఏమన్నా ఫర్వాలేదు తెలంగాణను అవమానించవద్దంటూ కామెంట్ చేశారు! అమిత్ షా ఎక్కడా యాంటీ తెలంగాణ కామెంట్స్ చేయలేదు. కాని, కేసీఆర్ మాత్రం తన బ్రహ్మాస్త్రామైన తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగించారు? ఇదంతా ఆయనలోని టెన్షన్ ను చూపిస్తోందంటున్నారు బీజేపి అభిమానులు,కార్యకర్తలు. ఎన్నికల లోపు బీజేపి భారీగా బలపడే సూచనలు వున్నట్టు కేసీఆర్ గ్రహించారని వారంటున్నారు!   బీజేపి వాళ్లు షా ఇచ్చిన జోష్ లో కేసీఆర్ తమ పార్టీని చూసి భయపడుతున్నారని అనవచ్చు. కాని, నిజంగా టీఆర్ఎస్ కు బీజేపి గండం వుందా? అలాంటిదేం లేదనదే ప్రస్తుతానికి వున్న పరిస్థితి. కాని, ముందు ముందు వార్ మొత్తం గులాబీ, కమలం మధ్యే వుండేలా వుంది. అమిత్ షాకు కావాల్సింది కూడా అదే! కాని, కేసీఆర్ వద్దనుకంటోందీ అదే! కేంద్రంలో అధికారంలో లేని రాహుల్ నేతృత్వంలో నడుస్తోన్న కాంగ్రెస్ ఢీకొట్టడం టీఆర్ఎస్ కు సులువు. అలా కాకుండా దిల్లీని బిగించి పట్టిన మోదీ సారథ్యంలో , వరుసగా రాష్ట్రాల్ని కొల్లగొడుతోన్న షా నేతృత్వంలో… ఎదురులేకుండా దూసుకుపోతోన్న బీజేపిని నియంత్రించాలంటే కష్టం! అసాధ్యమేం కాదు.   అందుకే, గవర్నర్ ని కలిసిన కేసీఆర్, షా పద్ధతేం బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూనే తాము నోట్ల రద్దు లాంటి నిర్ణయాలకు కూడా అండగా నిలిచామని, మోదీకి నైతిక మద్దతిస్తూ వస్తున్నామని చెప్పారు. పనిలో పనిగా తమని నానా మాటలు అన్న బీజేపి వారు… త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవర్ని నిలబెడితే వారికి మద్దతంటూ సంకేతాలిచ్చారు! ఇది ఖచ్చితంగా బీజేపితో ఫుల్ టైం వార్ కోరుకునే నేతలు చేసే పనైతే కాదు! మమత, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లాంటి వారి మాదిరిగా ఏటికి ఎదురీదాలని కేసీఆర్ భావించటం లేదు. తప్పనిసరైతే తప్ప కమలంతో కదనం చేయవద్దనేది ఆయన వ్యూహంలా కనిపిస్తోంది!

జగన్‌కు షాక్‌ మీద షాక్‌... తప్పు మీద తప్పు చేస్తోన్న జగన్‌ !

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి షాక్‌ మీద షాక్‌‌లు తగులుతున్నాయి. ప్రధాని మోడీతో భేటీ తర్వాత బీజేపీకి దగ్గరైనట్లు విస్తృతంగా ప్రచారం జరిగినా... తెలుగు రాష్ట్రాల పర్యటనకొచ్చిన కమల దళపతి అమిత్‌షా మాత్రం జగన్‌ ఆశలపై నీళ్లు చల్లేశారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని అమిత్‌షా ప్రకటించడంతో... తెలుగుదేశాన్ని పక్కకు జరిపి... ఆ గ్యాప్‌లోకి దూరేద్దామనుకున్న జగన్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తామని జగన్‌ బహిరంగంగా ప్రకటించినా... వైసీపీ గురించి అమిత్‌షా నోట ఒక్క మాట కూడా రాకపోవడం... ఆ పార్టీ నేతలు షాక్‌కి గురైనట్లు తెలుస్తోంది.   అయితే తన రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గేమ్‌ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అది టీడీపీ అయినా... వైసీపీ అయినా ఒక్కటేనన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఒకవైపు టీడీపీతో మిత్రబంధాన్ని కొనసాగిస్తూనే... తోక జాడిస్తే మాత్రం తమకు వైసీపీ ఉందనే హెచ్చరికలను పంపుతోంది బీజేపీ. అంతేకాదు ఎప్పుడు ఎవరు అవసరమొస్తారో తెలియదు కనుక... ఎవర్నీ దూరం చేసుకోకుండా వైసీపీని కూడా దగ్గరకు తీస్తోంది కమలం పార్టీ. ఏదిఏమైనా ఫైనల్‌గా తమ లాభమే ముఖ్యమన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోంది. అందుకే ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందన్న అమిత్‌‌షా.... తెలంగాణలో మాత్రం ఉంటుందో లేదో చెప్పలేదు.   ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏకి మద్దతిస్తామని జగన్‌ ప్రకటించడంతో వైసీపీ తన ఓటు బ్యాంకును కోల్పోవడం ఖాయమంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ... బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో... మెజారిటీ క్రిస్టియన్లు, ముస్లింలు వైసీపీ వెంట నడిచారు. అయితే మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి జగన్‌ మద్దతిస్తామని ప్రకటించడంతో... ఆ రెండు వర్గాలూ జగన్‌కు దూరమవుతారని విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్లు జగన్‌కు వివరించినా పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే కేసులతో సతమతమవుతోన్న జగన్‌... వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ సాహసానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.   ఇక వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియక తికమకపడుతోన్న కాంగ్రెస్‌ పార్టీ... జగన్‌ ప్రకటనతో ఓ క్లారిటీకి వచ్చింది. జగన్‌... ఎన్టీఏ వైపు మొగ్గుచూపడంతో... క్రిస్టియన్లు, ముస్లింలను మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ లెక్కన జగన్‌ రాజకీయ వ్యూహాలు.... రెండింటికీ చెడ్డ రేవడిలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.