తెలంగాణలో బీజేపీ మిషన్‌ ప్రారంభం... 60+10పైనే గురి

  2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలనైతే అనుసరించారో... అలాంటి స్ట్రాటజీనే తెలంగాణలోనూ ఇంప్లిమెంట్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఒక టార్గెట్‌ను విధించుకుని... పక్కా ప్లాన్‌తో సీరియస్‌గా సీన్‌లోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పదికిపైగా ఎంపీ సీట్లు, అరవైకి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా మిషన్‌-2019ని సిద్ధంచేసింది. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలకు అధినాయకత్వం ఆదేశించింది. ముఖ్యంగా బూత్‌ కమిటీల స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేసింది.   రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలున్న నేపథ్యంలో జూన్‌ తర్వాత తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన ఫార్ములాను అమలు చేయనుంది. ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకోవాలని భావిస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకొని ఆ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటోంది.   అధికార టీఆర్‌ఎస్‌కు కింది స్థాయి వరకు కేడర్‌ లేకపోవడం, పూర్తిగా జిల్లా కమిటీలు కూడా ఏర్పడకపోవడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రియా శీలకంగా వ్యవహరించకపోవడం, టీడీపీ పూర్తిగా బలహీన పడటం, వామపక్షాలు సత్తాచాటలేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం  అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై ఉద్యమిస్తూనే పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.

టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ కన్ను... తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌

  తెలంగాణలో అప్పుడే కూడికలు తీసివేతలు మొదలైయ్యాయి. పార్టీలన్నీ పక్కా స్కెచ్‌తో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణపై కన్నేసిన బీజేపీ అధిష్టానం యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్‌ సెవెన్‌ స్టేట్స్‌లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరదీసిన కమలం పార్టీ... టీడీపీ, కాంగ్రెస్‌లో ముఖ్యనేతలపై కన్నేసింది. ఇప్పుడున్న నేతలతోనే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని అంచనాకి వచ్చిన బీజేపీ హైకమాండ్‌... టీడీపీ, కాంగ్రెస్‌లో ప్రజాబలం, పేరున్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.   కమలం యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా... ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల్లో ఫైర్‌ బ్రాండ్‌లుగా పేరున్న పలువురు నేతలు... బీజేపీలో చేరేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారన్నది లేటెస్ట్‌ న్యూస్‌. అయితే టీడీపీ, కాంగ్రెస్‌లో బలమైన నేతలు బీజేపీలోకి వస్తే.... తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని పాత కాపులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దాంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఇతర పార్టీల నేతల ప్రయత్నాలకు మోకాలడ్డుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే దీన్ని గమనించిన ఆయా లీడర్లు... నేరుగా ఢిల్లీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.   తెలంగాణ పర్యటనలో అమిత్‌షా‌ను కలిసేందుకు ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమిత్‌షా మీదే ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరినా.... ఇప్పుడున్న నేతలు... కలుపుకొని పోతారో లేదోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నా... రాష్ట్ర నేతలు మాత్రం మోకాలడ్డే ప్రయత్నాలు చేయడంపై కలవరపడుతున్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే.... కనీసం ప్రస్తుతమున్న పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత అయినా దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

టీకాంగ్రెస్‌కు డేంజర్‌ బెల్స్‌... భయపెడుతోన్న వలసల సునామీ

  తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌ను... ఆ తర్వాత వ‌రుస ఓట‌ములు మ‌రింత కుదిపేశాయి. ఆ నిరాశతోనే పలువురు నేత‌లు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌‌లోకి క్యూ క‌ట్టారు. ఆ వలసల భయం నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న కాంగ్రెస్‌ను మ‌రోసారి వ‌ల‌స‌ల భయం వెంటాడుతోంది. తాజాగా పార్టీ నుంచి భారీ వ‌స‌ల‌స‌లు ఉంటాయ‌నే చ‌ర్చ బ‌లంగా వినిపిస్తోంది. పార్టీలో ఏ ఇద్దరు నేత‌లు క‌లిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. వ‌ల‌సల జాబితాలో ప‌లువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తుండ‌టంతో ఆ పార్టీకి మింగుడు ప‌డ‌టం లేదు.   అయితే ఈసారి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోకి కాకుండా... జాతీయ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హస్తం పార్టీ నుంచి  దాదాపుగా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌‌లో ఉన్నారనే వాదన బ‌లంగా వినిపిస్తోంది. వీరితోపాటు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తం 30మంది నేతలు కమలం పార్టీలోకి జంప్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నార‌నే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌... హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పేరొందిన మాజీ మంత్రులిద్దరు... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఈ నేతలు... త్వరలోనే కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు.   అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం త‌మ పార్టీ నుంచి వ‌ల‌స‌లు ఉండవంటున్నారు. పైగా  ఇత‌ర పార్టీల‌కు చెందిన చాలా మంది నేత‌లు తమకు ట‌చ్ లో ఉన్నార‌ని చెబుతున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వారంతా కాంగ్రెస్‌లోకి వస్తారంటున్నారు. తమతో టచ్‌లో ఉన్న నేతల్లో అధికార టీఆర్‌ఎస్‌ నేత‌లు కూడా ఉన్నార‌ని ఉత్తమ్ చెబుతున్నారు. అయితే ఉత్తమ్‌ కామెంట్స్‌ను లైట్‌ తీస్కుంటున్న టీకాంగ్రెస్‌ సీనియర్లు.... నేతలు చేజార‌కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేదంటే వలసల సునామీ కాంగ్రెస్ ను ముంచేయ‌డం ఖాయ‌మ‌ంటున్నారు.

పవన్ కౌంటర్.. ఆరునూరైన పోటీ ఖాయం..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ఇప్పటికీ చాలామంది బహిరంగంగానే కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్లపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఘాటుగానే సమాధానమిచ్చారు. అనంతపురం జిల్లా నూతన నాయకులతో సమావేశమైన ఆయన ఆ ప్రాంతంలోని పలు సమస్యలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని చెప్పారు. అంతేకాదు నేను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడునికి కాదు అని కొందరు అంటున్నారు... అసలు అలాంటి రాజకీయ నాయడుకు రాజకీయాల్లో ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాలు చేస్తూ కోట్లు గణిస్తున్నారు..ఇంట్లో కూర్చొనే కోట్లు సంపాదించుకుంటున్నారు.. అని మండిపడ్డారు. ఇంకా సినిమాల గురించి కూడా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుదిశ్వాస విడిచేవరకు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా... ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని.. సినిమా అన్నా, సినీ పరిశ్రమ అన్నా అపార గౌరవం ఉంది..  నా కుటుంబం, సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నా అని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అనంతపురం పోటీ చేయడం ఖాయమని... సామాన్యులు రాజకీయాలు ఎలాచేయగలరో చెప్పాలనుకుంటున్నా, వేలకోట్లు అవసరం లేదని నిరూపిద్దామని చాలా భావోద్వేగంతో చెప్పారు.

నన్ను బ్రతికించు నాన్నా..కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో..

  "నాన్నా నన్ను బ్రతికించు నాన్నా.. నాకు బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి..  నా స్నేహితులతో ఆడుకోవాలని, స్కూలుకు వెళ్లాలని ఉంది".. ఓ చిన్నారి తన తండ్రిని ప్రాధేయపడుతూ మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు వింటే ఎవరికైనా హృదయం చలించక మానదు. కానీ ఆ తండ్రి హృదయం మాత్రం కరగలేదు. ఫలితం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకరమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అయితే ప్రాణం పోవడానికి ముందు ఆ పాప మాట్లాడుతూ విడుదల చేసిన వీడియో మాత్రం అందరిని కంటతడిపెట్టిస్తోంది.   విజయవాడలోని దుర్గాపురంలో మాధవ శెట్టి శివకుమార్, సుమశ్రీ దంపతులు. వీరికి సాయిశ్రీ అనే చిన్నారి ఉంది. అయితే తల్లిదండ్రులు వీడిపోవడంతో సాయిశ్రీ తన తల్లితోనే ఉంటోంది. అయితే ఈ చిన్నారి గత కొంతకాలంగా క్యాన్సర్ బారిన పడటంతో చికిత్స చేయించుకుంటుంది. ఇక భర్త నుండి విడిపోయిన సుమశ్రీ పాప చికిత్స కోసం ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టింది.  మెరుగైన వైద్యం అందకపోతే పాప బ్రతకదని వైద్యులు చెప్పడంతో బెంగుళూరు తీసుకెళ్లాలనుకున్నారు. అందుకు సాయిశ్రీ పేరున తండ్రి రాసిన ఫ్లాట్‌ అయినా అమ్మి వైద్యం చేయిద్దామనుకుంది సుమశ్రీ. కానీ అది వీలుకాని పరిస్థితి. ఫ్లాట్‌ బాలిక పేరున ఉన్నా.. మైనర్‌ కావడంతో సంరక్షకుడిగా తండ్రి పేరున ఉంది. ఇక కూతురు మైనర్ కావడం...తండ్రి రౌడీ షీటర్ కావడంతో కొంత మంది ఎమ్మెల్యేల అండదండలతో ఫ్లాట్ ను కబ్జా చేయించారు. ఈ క్రమంలోనే సాయిశ్రీ తన తల్లి సుమశ్రీ దాదాపు పదిరోజులు శివకుమార్ ఇంటి చుట్టూ తిరిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ శివకుమార్ మనసు మాత్రం కరగలేదు. అదిపోగ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అరకొర వైద్యం అందడంతో సాయిశ్రీ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆ పాప వీడియో మాత్రం వైరల్ అయింది. వీడియో విన్న ప్రతి ఒక్కరూ పాప బాధ విని చలించిపోతున్నారు.   ఇదిలా ఉండగా.. తన కూతురు మరణంపై తల్లి సుమశ్రీ మాట్లాడుతూ... తన భర్త నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్న కుమార్తెకు సరైన వైద్యం చేయించకుండా అడ్డుపడిన భర్త శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

పెగ్గేసిన పెళ్లికొడుకుల మత్తు వదిలిస్తోన్న పెళ్లి కూతుళ్లు!

  బీహార్… ఈ పేరు చెప్పగానే మనకు వెనుకబాటుతనం, రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యం, లాలూ అవినీతి పాలన … ఇవే గుర్తుకు వస్తాయి. కాని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీహార్ నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒక విచిత్రమైన కారణం చేత వార్తల్లో నిలిచింది! అదేంటంటే… రెండు మూడు వారాల వ్యవధిలో ముగ్గురు బీహారీ వధువులు పెళ్లికొడుకుల్ని వద్దు పొమ్మని వెళ్లగొట్టేశారు. పీటల మీది దాకా వచ్చిన పెళ్లిల్లు ఎందుకు ఆగిపోతున్నాయి? రీజన్ వింటే ఆశ్చర్యం, ఆనందం కలగక మానవు!   బీహార్ వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనుకబడేసిన ప్రాంతం! రాజకీయ నేతలు తమ స్వార్థం కొద్దీ జనంతో ఆటలాడుకున్నారు. అందుకే, ఒకప్పుడు నలంద లాంటి విశ్వవిద్యాలయం వున్న ఆ రాష్ట్రం ఇప్పుడు విద్యలో, ఉద్యోగాల్లో, అభివృద్దిలో అన్నిట్లో వెనుకబడింది. అందుకు అనేక కారణాలు. వాటిల్లో ముఖ్యమైంది… మద్యపానం! తాగి తాగి అక్కడి మగవాళ్లు తాము చచ్చి , కుటుంబాల్ని కూడా చంపుకుతిన్నారు. పేదరికంలో కూరుకుపోయేలా చేశారు. అయితే, నితీష్ కుమార్ గత ఏప్రెల్ లో మొండి పట్టుదలతో ముందుకు పోయి చెప్పిన మాట ప్రకారం మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. దాని సత్ఫలితాలు మెల్ల మెల్లగా తొంగి చూస్తున్నాయి ఇప్పుడిప్పుడే!   బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం వున్నా మందు దొరుకుతోంది అన్నది బహిరంగ రహస్యం. సీఎం నితీష్ లిక్కర్ బ్యాన్ మెచ్చుకోదగ్గదే అయినా… బ్లాక్ మార్కెట్లో మందు లేకుండా చేయటంలో ఆయన విఫలమయ్యాడు. దాని ఫలితమే అక్కడక్కడా ఇంకా బీహారీ మందు బాబులు చిందులేస్తూనే వున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. ఒకే నెలలో మూడు పెళ్లిల్లు ఆగిపోయి… నోట్లోంచి వచ్చిన మద్యం కంపుతో!   తాజాగా జరిగిన సంఘటనలో పాట్నాకి 75కిలో మీటర్ల దూరంలోని ఓ ఊళ్లో వరుడు పెళ్లికి వచ్చేప్పుడు మందు కొట్టి వచ్చాడట. దండలు మార్చుకునేందుకు వధూ, వరులు దగ్గరికి రావటంతో మనోడి సంగతి అమ్మాయికి తెలిసిపోయింది. అంతే కాదు, అబ్బాయి తరుఫున వచ్చిన మగ పెళ్లి వారు చాలా మంది తాగి వచ్చి రచ్చ చేయటంతో అమ్మాయి మూడు ముళ్లు వేయించుకోటానికి ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి వారు అబ్బాయి బృందం మొత్తాన్ని ఊళ్లోనే బంధించారు. గ్రామ పెద్దలు వచ్చి కట్నం డబ్బులు, కానుకలు అన్నీ తిరిగి ఇచ్చేస్తామని పెళ్లి కొడుకు వారి చేత ఒప్పించాక వదిలేశారు! అయితే, ఇలాంటి దిమ్మ తిరిగే సంఘటన బీహార్లో మొదటిది కాదు. రెండు, మూడు వారాల వ్యవధిలో మూడోది! కొన్నాళ్ల కిందట కూడా ఇలాగే మరో రెండు పల్లెటూళ్లలో కూడా మద్యం తాగొచ్చిన వరుళ్లకి మత్తు దిగే షాకిచ్చారు అమ్మాయిలు!   బీహార్ సీఎం నితీష్ మద్యపాన నిషేధం అనగానే మొదట అందరూ విమర్శించారు. ఆయనతో పొత్తు పెట్టుకున్న లాలూ కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికల హామీగా మాత్రమే చూశాడు. కాని, గెలిచిన తరువాత నితీష్ అన్నంత పనీ చేశాడు. ఆయనెందుకు చేశాడో… ఇప్పుడు ఇలా అమ్మాయిలు పెళ్లిల్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటుంటే అర్థం అవుతోంది. బీహార్ మహిళలు మద్యంతో దశాబ్దాలుగా విసిగి, వేసారి వున్నారు. అందుకే, మద్యం అంటేనే చిర్రెత్తిపోతున్నారు!

యుమున తీరంలో యముడ్ని శాంతింపజేసే యజ్ఞం! మూడో ప్రపంచ రణమే కారణం!

  మూడో ప్రపంచ యుద్ధం… ఈ మాట ఇప్పటికి చాలా సార్లు వినిపించింది. ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కొంత కాలం అందరూ మౌనంగా వున్నారనుకుంటా! ఆ తరువాత నుంచీ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మూడో ప్రపంచ యుద్దం అంటూ కామెంట్లు చేస్తూనే వున్నారు. కాని, 1945 తరవాత గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ థర్డ్ వాల్డ్ వార్ రాలేదు. కాని, ఇక ఆగేది కాదంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు!   అమెరికా, ఉత్తర కొరియా మధ్య టెన్షన్ గురించి మీకు కొంచెమైనా తెలిసి వుంటే మూడో ప్రపంచ యుద్ధం డిస్కషన్ ఇప్పుడెందుకు వచ్చిందో అర్థమైపోతుంది. అమెరికా ఈ మధ్య కాలంలో అఫ్గనిస్తాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాలపై దాడులు చేసింది. కాని, అవేవీ న్యూక్లియర్ కంట్రీస్ కావు. ఇప్పుడు నార్ కొరియా కొట్లాటకు సర్వం  సిద్ధం చేసుకుంది. ఆ దేశ నియంత అణు క్షిపణులు చూసుకుని ఎగిరెగిరిపడుతున్నాడు. ఇక ట్రంప్ కూడా రోజు రోజుకు యుద్ధం తప్ప వేరే మార్గం లేదన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికా, ఉత్తర కొరియాలు అణు దాడులకు దిగితే మాత్రం … అది మూడో ప్రపంచ యుద్ధమే అవ్వబోతోంది!   అమెరికా, కొరియాల మధ్య యుద్ధ వాతావరణం పసిగట్టి థర్డ్ వాల్డ్ వార్ రాబోతోందని చెప్పటం విశ్లేషణ మాత్రమే. కాని, జ్యోతిష్యులు ఆకాశంలోని గ్రహాలు ఆగ్రహంగా వున్నాయంటున్నారు. అనుగ్రహం కోసం యజ్ఞాలు కూడా చేస్తున్నారు. అంతే కాదు, థర్డ్ వాల్డ్ వార్ అనివార్యమని చెబుతోంది మన భారతీయ జ్యోతిష్యులు మాత్రమే కాదు… అమెరికన్ అస్ట్రాలజర్ ఒకరు ఈ బాంబు తొలిసారి పేల్చారు! జూన్ 14న మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అంటూ డేట్ కూడా చెప్పేశాడు! ఆ ప్రముఖ అమెరికన్ అస్ట్రాలజరే గతంలో ట్రంప్ ఖచ్చితంగా యూఎస్ ప్రెసిడెంట్ అవుతాడని కూడా చప్పాడట!   అమెరికన్ అస్ట్రాలజర్ అమెరికా,కొరియా దేశాల మధ్య యుద్ధం గురించి మాట్లాడితే మన దేశ జ్యోతిష్య పండితులు ఇండియా, పాకిస్తాన్ గొడవల గురించి చెప్పుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాక్ అన్ని విధాల వినాశనానికి సంసిద్ధంగా వుంది. ఏ క్షణమైనా భారత్ పూర్తి స్థాయి సర్జికల్ స్ట్రైక్స్ మొదలు పెట్టవచ్చు అంటున్నారు అస్ట్రాలజర్స్! ఇండియా, పాక్ సంబంధాల సంగతి కాస్తో కూస్తో తెలిసిన విశ్లేషకులు కూడా ఈ వాదనని కొట్టిపారేయటం లేదు. భారత ఆర్మీ పగతో రగిలిపోతోంది. కాబట్టి పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావటం సమీప భవిష్యత్ లో దాదాపుగా జరిగే పనే! కాకపోతే, పాక్ వద్ద కూడా ఉత్తర కొరియాలాగే న్యూక్స్ వుండటం అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం!   అమెరికా, ఉత్తర కొరియా, ఇండియా, పాక్ దేశాల మధ్య యుద్ధాలు మూడో ప్రపంచ సంగ్రామానికి నాంది పలుకుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం . కాని, అనలిస్టులు,అస్ట్రాలజర్లు ఇద్దరూ వార్ ని కొట్టిపారేయటం లేదు! అందుకే, మన వాళ్లు కొంత మంది యముడి సోదరి అని భావించే యమున నది తీరంలో విశ్వ శాంతి యజ్ఞం చేస్తున్నారు. యుద్ధం తప్పాలని దైవాన్ని ప్రార్థిస్తున్నారు! మరి హింస తప్పుతుందా? రణమూ, మరణమూ శాంతిస్తాయా? కాలమే తేల్చాలి…

టీచర్ ని లవ్వాడాడు! పెళ్లాడాడు! ఇప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయ్యాడు!

  యూరప్ ఖండంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య తీవ్రమైన పోటీ వుండేది. కేవలం ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకల విషయంలో మాత్రమే కాదు… కవిత్వం, కళలు వంటి వాటి గురించి కూడా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు తెగ పోటీ పడేవి. ఆ పోటీలో భాగంగానే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి యూరోపియన్ దేశాలు ప్రపంచంలోని అనేక దేశాల్ని కాలనీలుగా మార్చుకుని పంచుకున్నాయి! అయితే, ఇంగ్లీషు వాళ్లు ఎప్పుడూ రాజకీయంగా డామినేట్ చేసేవారు! కాని, ఫ్రెంచ్ వారు మాత్రం రొమాన్స్ విషయంలో ముందుండే వారు!   ఎప్పుడో వాల్డ్ వార్ టూకి ముందు విషయాలు ఇప్పుడెందుకు అంటారా? ఒక పెద్ద లింక్ వుంది. అందుకే, ఈ ఉపోద్ఘాతం! ఫ్రాన్స్ ఇప్పుడే కాదు ఎప్పుడూ రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్! వందల సంవత్సరాలుగా మత్తు కలిగించే మద్యాలు, గమ్మత్తు కలిగించే రొమాంటిక్ పద్యాలు అక్కడ సర్వ సాధారణం! ఈ కళల విషయంలో బ్రిటన్ ఎన్నో శతాబ్దాలు ట్రై చేసి కూడా ఫ్రెంచ్ వార్ని ఓడించలేకపోయింది. అయితే, ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ ఫ్రాన్స్ జనాల రొమాంటిక్ ప్యాషన్ ఏ మాత్రం తగ్గినట్టు లేదు! అందుకు తాజా సంచలన ఉదాహరణ… న్యూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యువల్ మాక్రోన్!   తనకంటూ ఓ పార్టీ కూడా లేకుండా ఇండిపెండెంట్ గా బరిలో దిగాడు 39ఏళ్ల ఎమ్మాన్యువల్! ఆయన ప్రత్యర్థిది జాతీయ వాదం అయితే ఈయనది ఆదర్శవాదం. లిబరల్ థింకింగ్ వున్న లెఫ్టిస్ట్ అయిన ఎమ్మాన్యువల్ ని ఆయన ఇచ్చిన వాగ్ధానాలు నమ్మే ఫ్రెంచ్ ఓటర్లు అధికారంలోకి తెచ్చారు. కాకపోతే, క్యాంపైన్ టైంలో ఎమ్మాన్యువల్ కి బాగా కలిసొచ్చిన మరో అంశం… ఆయన భార్య బ్రిజ్జెట్టి! ఇప్పుడు 39ఏళ్లున్న కొత్త అధ్యక్షుడి 64ఏళ్ల భార్య ఆమె!   ఇంకా నలభై నిండని వాడికి అరవై దాటిన బామ్మ భార్య అనటంతోనే అవాక్కయ్యారా? ఇంకా వుంది బోలెడంత ఫ్రెంచ్ రొమాన్స్! ఎమ్మాన్యువల్ 15ఏళ్లున్నప్పుడు బ్రిజెట్టి మనోడి టీచర్! ఆమె ప్రేమలో మునిగిపోయిన టీనేజ్ కుర్రాడు మెల్లగా లైన్లో పెట్టాడు. కాని, అందరు టీనేజర్లలా కొన్నాళ్లకు మర్చిపోకుండా టీచర్ నే కళ్లల్లో, కలల్లో పెట్టుకుని చూసుకుంటూ వచ్చాడు. చేసేది లేక ఈ ఫ్యూచర్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి టీచరమ్మ కూడా పడిపోయింది. అలా 15ఏళ్లప్పుడు స్టార్టైన ఎమ్మాన్యువల్ ప్రేమ కథ ఆయన పీజీ కూడా పూర్తయ్యాక పెళ్లితో కొత్త పుంతలు తొక్కింది. కాని, బ్రిజ్జెట్టికి అప్పటికే పెళ్లైంది. విడాకులు కూడా ఇచ్చేసింది. కాని, ముగ్గురు పిల్లలున్నారు మొదటి భర్త కారణంగా! ఇంకా విడ్డూరం ఏంటంటే.. మన ఎమ్మాన్యువల్ కంటే ఆయన భార్యగారి మొదటి భర్త తాలూకూ మొదటి సంతానం రెండేళ్లు పెద్ద! బ్రిజ్జెట్టి రెండో సంతానమైన కూతురు ఎమ్మాన్యువల్ కి క్లాస్ మేట్!   టీచర్ ని లవ్ చేయటం, పెళ్లి చేసుకోవటం, ఆమె పాతికేళ్లు పెద్దది కావటం, అంతకు ముందే ఆమెకి ముగ్గురు పిల్లలుండటం, వారిలో ఒకరు రెండో భర్తకంటే పెద్ద వారు కావటం… ఇవన్నీ వింటుంటే.. మైండ్ బ్లాంక్ అవుతోంది కదా? ఇలాంటి పెళ్లి, కుటుంబం, నేపథ్యం వుంటే మన దేశంలో ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడేవాడే! కాని, రొమాన్స్ అంటే పడి చచ్చిపోయే ఫ్రెంచ్ జనాలు ఆరితేరిన ఈ స్టూడెంట్ లవ్వర్ నే ఏరికోరి ఎంచుకున్నారు! ఎమ్మాన్యువల్ సక్సెస్ లో ఎంతో కొంత ఈ టీచర్,స్టూడెంట్ రొమాన్స్ పాత్ర కూడా వుందనేది కాదనలేని సత్యం!

కొందరు నేతలు నోరు తెరిస్తే… రాజకీయ దుర్వాసనే!

  భారత్ క్రికెట్ టీమ్ ఏ దేశ జట్టుతో ఓడిపోతే మీరు ఎక్కువ బాధపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా పాకిస్తానే! పాక్ పై ఇండియా గెలిస్తే సంతోషం, ఓడితే దుఃఖం… ఇదీ సామాన్యుల పరిస్థితి. కాని, మన దేశ రాజకీయ నేతలు కొందరికి అలాంటి భావోద్వేగాలు ఏమీ వున్నట్టు లేదు. ఎంత సేపూ తమ రాజకీయ వ్యాఖ్యలు, లాభాలే తప్ప వారికి కొంచెమైనా జాతీయ భావం వుందా అనిపిస్తుంటుంది! క్రికెట్లో ఓడటం కాదు…. ఏకంగా పాకిస్తాన్ మన సైనికుల్నే చంపేస్తుంటే కూడా కొందరి బుద్ధి మారటం లేదు. తాజాగా అఖిలేష్ తన కామెంట్స్ తో  జవాన్ల త్యాగలని వెక్కింరిచారు…   ఆ మధ్య యూపీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ఖూన్ కీ దలాల్ అంటూ మోదీని విమర్శించాడు. ఆయన ఉద్దేశ్యం సైనికుల రక్తాన్ని ప్రధాని తన స్వార్థానికి వాడుకుంటున్నారని! అలా కామెంట్ చేసి రాహుల్ ఆశించింది ఏంటి? యూపీలో రాజకీయ విజయం! ఇప్పుడు అలాంటి మాటలే మాట్లాడాడు అఖిలేష్! ఉత్తర్ ప్రదేశ్ సీఎం నుంచి మాజీ సీఎం అయిన యువనేతకి ఫ్రస్ట్రేషన్ ఇంకా తగ్గినట్టు లేదు. అసలు గుజరాత్ నుంచి ఎవరన్నా సైనికులు దేశం కోసం అమరులయ్యారా… అంటూ ప్రశ్నించాడు! దీన్ని మనం ఏమనాలి?   మోదీ, అమిత్ షా గుజరాతీలు. వారంటే అఖిలేష్ కి పడదు. అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో అయితే మోదీ, షా ఇద్దర్నీ గుజరాత్ గాడిదలన్నాడు అఖిలేష్! అయినా, దాన్ని మనం రాజకీయ దాడిగా చూడవచ్చు. కాని, మోదీపైన ద్వేషాన్ని గుజరాత్ పై చూపిస్తే ఎలా? పైగా జవాన్ల బలిదానాల్ని ముడిపెడుతూ … గుజరాత్ నుంచి ఏ ఒక్క జవాను దేశం కోసం మరణించలేదని అనటం … ఎలాంటి లాజిక్? అఖిలేష్ కే తెలియాలి!   కాశ్మీర్ లో వరుసగా జరుగుతోన్న పాక్ ఆకృత్యాల నేపథ్యంలో కొన్ని గంటల క్రితమే ఒక యువ ఆర్మీ అధికారిని కోల్పోయింది దేశం. ఫయాజ్ అనే కాశ్మీరీ సైనికుడు ఉగ్రవాదుల చేతిలో బలైపోయాడు. ఆయన మరణానికి కారణమైన పాక్ ని ఒక్క మాట కూడా అనని అఖిలేష్ గుజరాత్ గురించి మాత్రం మాట్లాడుతుండటం దారుణమైన విషయం. పోనీ… అఖిలేష్ చెప్పినట్టు నిజంగానే గుజరాత్ నుంచి అమరులు లేనేలేరా? అది పచ్చి అబద్ధం! ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ గుజరాత్ సైనికులు ముగ్గురు కాశ్మీర్ సంరక్షణలో భాగంగానే అమరులయ్యారు! అయినా, కోడి గుడ్డు మీద ఈకలు పీకే పనిలో వున్నారు చాలా మంది నేతలు!   ఒక్క అఖిలేష్ కాదు… అఖిలేష్ వయస్సు కంటే రెట్టింపు సంవత్సరాల అనుభవం వున్న దిగ్విజయ్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా లంటి వారు కూడా అమర సైనికుల త్యాగాలతో ఆటలాడుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు కావాలని ముస్లిమ్ యువతని ఉగ్రవాద కేసుల్లో ఇరికిస్తున్నారని డిగ్గీ అంటే… ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ లో అమరులైన సైనికుల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడతారు? సుక్మాలో మావోల చేతిలో చనిపోయిన వారి గురించి ఎందుకు మాట్లాడరు… అంటూ లాజిక్ లు వెదికాడు! దేశం కోసం బలిదానం చేసే సైనికుల రక్తానికి కూడా మతం, ప్రాంతం అంటగట్టే ఇలాంటి నాయకుల్ని ఎవ్వరూ బాగు చేయలేకపోతున్నారు! వీళ్ల మాటల వల్ల అధికారం కోల్పోయి , జనం చేత తిరస్కరింపబడ్డా బుద్ది మాత్రం మారటం లేదు! చట్ట పరమైన కేసులు ఎలాగూ వుండవు కాబట్టి అడ్డూ అదుపు కూడా వుండటం లేదు!

టీటీడీఈవో వివాదం… జనసేన, సెల్ఫ్ గోల్ తో సెల్ఫ్ డిఫన్స్ లో పడిందా?

  టీటీడీ ఈవో వివాదం ఇంచుమించూ చల్లారినట్టే! కానీ, ఈ మొత్తం వ్యవహారంలో డిఫెన్స్ లో పడ్డది మాత్రం జనసేనలాగే కనిపిస్తోంది! తాజాగా ఆ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఎప్పుడూ పవన్ తప్ప మరో నేత పేరు వినిపించని జనసేనలో.. ఈసారి ఉపాధ్యక్షుడుగా మహేంద్ర రెడ్డి పేరున ఓ వివరణ బయటకొచ్చింది. దాని సారాంశం ప్రకారం… జనసేన ఉద్దేశం ఐఏఎస్ లను తక్కువ చేసి మాట్లాడటం కాదనీ ఆయన అన్నారు. ఉత్తరాదిలోని ఆలయాలకు దక్షిణాది వారు ఈవోలుగా వుండనప్పుడు దక్షిణంలో మాత్రం ఉత్తరాది వారు ఎందుకని మాత్రమే పవన్ ప్రశ్నించారని అన్నారు! అయితే, ఇలా ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి రావటం జనసేనకు కాస్త ఇబ్బందనే చెప్పుకోవాలి!   చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఉత్తరాది ఐఏఎస్ ను చంద్రబాబు టీటీడీ ఈవోగా నియమించారు. అయితే, ఆయన ఏపీ క్యాడర్ అధికారే కాబట్టి టెక్నికల్ గా అందులో తప్పు లేదు. కాని, అది సంప్రదాయం మాత్రం కాదు. ఈ విషయాన్ని హైలైట్ చేయాల్సిన పవర్ స్టార్ ఉత్తర, దక్షిణ పదాలు వాడి తప్పుడు సంకేతాలు పంపినట్లు అయింది. నిజానికి పవన్ కంటే ముందు అభ్యంతరం చెప్పిన స్వామీ స్వరూపానందేంద్ర అనిల్ సింఘాల్ తెలుగు వారు కాదని మాత్రమే అన్నారు. దానికి నార్త్, సౌత్ నినాదం జోడించిన పవన్ కళ్యాణ్ పెద్ద చర్చకు కారకుడయ్యారు. కాని, అదే సమయంలో అఖిల భారత ఐఏఎస్ ల సంఘం ఖండనకు కూడా ఆయన కారణమయ్యారు! దేశంలోని అన్ని చోట్లా పని చేసే సివిల్ సర్వెంట్స్ కి కులం, మతం, ప్రాంతం అంకట్టవద్దని ఐఏఎస్ లు అంటున్నారు. కేవలం ఐఏఎస్ లే కాదు మిగతా చాలా వర్గాల నుంచీ కూడా టీటీడీ ఈవో నియమకంపై గొడవ అనవసరం అన్న అభిప్రాయం వెల్లడైంది. ఇక మోహన్ బాబు లాంటి వారు అనీల్ కుమార్ సింఘాల్ కి తమ మద్దతు కూడా ప్రకటించారు! ఇలాంటి పరిణామాలతో, జనసేన, దేశ సమగ్రత విషయంలో తమకు ఎవరు సాటిరారని చెప్పుకోవాల్సి వచ్చింది!   పవన్ కామెంట్స్ కు బదులుగా ఐఏఎస్ లు స్పందించటం, పవన్ తో పొసగదని పేరున్న మోహన్ బాబు తన అభిప్రాయం వెలిబుచ్చటం, అశోక్ గజపతి రాజు కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనటం… అన్నీ చూస్తుంటే… కదపాల్సిన వారు తెర వెనుక వుంటూ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది! ముందు ముందు జనసేన అధినేత ఏ మాట మాట్లాడినా ప్రతి వ్యూహం అమలయ్యేలా కనిపిస్తోంది. చూడాలి మరి…పవర్ స్టార్ తన పవర్ ఫుల్ పంథా కొనసాగిస్తారా? లేక ఆచితూచి కామెంట్స్ చేస్తారా?

జడ్జ్ గారు జంప్! అరెస్ట్ చేసే పనిలో మూడు రాష్ట్రాల పోలీసులు!

జ్యోతిష్యం నిజమో కాదోగాని… గుడ్ టైం, బ్యాడ్ టైం మాత్రం నిజమే! మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లైఫ్ లో బ్యాడ్ పీరియడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కష్ట కాలమే ఆ జడ్జ్ గారికొచ్చింది! తన కెరీర్లో ఎందరికో జైలు శిక్షలు వేసిన ఆయన మరో నెల రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. పాపం… సరిగ్గా క్లైమాక్స్ దశలో ఆయనకు శని మహాదశ మొదలైనట్టుంది! రకరకాల మలుపుల మధ్య జడ్జిగారికే జైలు శిక్ష పడింది! అయితే, ఆర్నెళ్లే కదా వెళ్లి వచ్చేద్దాం అనుకోలేదు పెద్దాయన. మూడు రాష్ట్రాల పోలీసులకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ అదృశ్యమైపోయాడు! ఇప్పుడిక ఎప్పుడూ దొంగల్ని వేటాడే ఖాకీలకి గౌరవనీయులైన న్యాయమూర్తిగార్ని దొరకబుచ్చుకోవటం పెద్ద సవాలే అయి కూర్చుంది!   జస్టిస్ కర్ణన్ కేసు ఇప్పుడు దేశంలో పెద్దగా చర్చగా మారింది. ఆయన సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా చాలా మంది జడ్జీలను అవినీతిపరులంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు, తాను దళితుడ్ని కాబట్టి కుల వివక్ష చూపిస్తున్నారని కూడా ఆరోపించాడు. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాల్లో సుప్రీమ్ కు, కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి అయిన కర్ణన్ కు తీవ్రమైన యుద్ధం జరిగింది. ఎప్పుడూ అనూహ్యంగా ప్రవర్తించే జస్టిస్ కర్ణన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికే ఐదేళ్లు కఠిన కారాగారా శిక్ష విధించాడు. దానికి బదులుగా సుప్రీమ్ కూడా జస్టిస్ కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్ష వేసింది! కాని, మొండి పట్టుదలకి బాగా ఫేమస్ అయిన కర్ణన్ కోర్టు వేసిన శిక్షను గంభీరంగా అంగీకరించలేదు! వున్నట్టుండీ ప్రభుత్వ అతిథి గృహం నుంచీ మాయమైపోయాడు! పోలీసులు అవాక్కైపోయారు!   సుప్రీమ్ కోర్టు ఒక పదవిలో వున్న జడ్జీకి శిక్ష వేసి సంచలనం రేపితే… స్వయంగా జడ్జీ అయి వుండి పోలీసులకి చిక్కకుండా అదృశ్యమై కర్ణన్ కలకలం రేపుతున్నాడు. ఆయన కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి కాగా సుప్రీమ్ తీర్పు సమయంలో చెన్నైలో వున్నాడు. అక్కడ్నుంచి కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసేందకు వచ్చేటప్పటికి కనిపించకుండాపోయాడు. కోల్ కతా పోలీసు బృందం తమిళ పోలీసుల్ని వెంటబెట్టుకుని వచ్చి నెల్లూరులో సోదాలు జరిపింది. ఇందుకు ఏపీ పోలీసులు కూడా సహకరించారు! మొత్తానికి మూడు రాష్ట్రాల పోలీసులు వేట కొనసాగించిన సార్ వారు ఎక్కడ దొరకలేదు!   జస్టిస్ కర్ణన్ కేసులో కొసమెరుపు ఏంటంటే… తమిళనాడులోని ఆయన స్వగ్రామంలో ఊరి జనం తమ జడ్జీగారికి జైలు శిక్ష రద్దు చేయాలని ధర్నా చేశారట! ఏది ఏమైనా మరో నెల రోజుల్లో రిటైర్ అవ్వనున్న సీనియర్ న్యాయమూర్తి సుప్రీమ్ తీర్పును గౌరవిస్తూ అరెస్ట్ అయిపోయి వుంటే ఎంతో బావుండేది అంటున్నారు విశ్లేషకులు. ఎన్నో తీర్పులిచ్చిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు అమలు విషయంలో పోలీసులకి సహకరించాల్సింది!

బుగ్గ కార్లో తిరిగే పర్మిషన్ బ్రిటీష్ వారు ఇచ్చారట! మోదీ చెప్పినా పట్టించుకోడట!

ఎర్ర బుగ్గ కార్ మీద పెట్టుకుని తిరగటం అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు! అదో స్టేటస్ సింబల్. అయితే, అది నిజంగానే గొప్ప స్థాయికి సంకేతం కావచ్చు కాని ప్రజాస్వామ్యంలో అంతిమ స్థానం ఎవరిది? ప్రజలది. ఇక్కడ జనమే మహారాజులు. ఎన్నికలప్పుడు వాళ్లు ఓట్లు వేసి అందలం ఎక్కిస్తేనే ఎవరైనా పదవులు చేపట్టేది. పదవులు చేపడితేనే ఎర్రబుగ్గ కార్లు సిద్ధంగా వుండేది! మరి అటువంటి కోట్లాది జనానికి నాయకులు, వీఐపీలు తమ బుగ్గ కార్లతో ఇబ్బంది కలిగించటం సబబా? రోడ్ల మీద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ లకు కారణం అవ్వటమే కాకుండా… తమకి తాము చక్రవర్తుల్లాగా, దైవాంశ సంభూతుల్లాగా బుగ్గ కార్లలోని శాల్తీలు ఫీలవటం సమంజసమేనా? కానే కాదు!   కార్లపై ఎర్ర బుగ్గలు పెట్టుకోటాన్ని ఎందరో ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ మధ్యే మోదీ సర్కార్ లాల్ బత్తి సంస్కృతిని నిషేధించింది. ప్రధాని సహా ఎవ్వరూ బుగ్గ కార్ల గోలతో రోడ్లపై తిరగొద్దని తీర్మానించింది. దాని ఫలితంగానే కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా బుగ్గలు మాయం అవుతున్నాయి. చాలా మంది నేతలు తమ కార్లపై అలంకారాలు, అహంకారాలు తొలంగిచేస్తున్నారు! అయితే, ఈ తతంగం అంతటికీ తాను అతీతం అంటున్నారు నురూర్ రెహ్మాన్ బర్కతి! ఎవరీయనా అంటే… కోల్ కతాలోని టిప్పు సుల్తాన్ మసీద్ కు ప్రధాన ఇమామ్!   స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చెప్పినా తాను బుగ్గను తొలంగించనని తేల్చి చెప్పేశాడు బర్కతి. అంతే కాదు, ఓ విచిత్రమైన వాదన కూడా మీడియా ముందుకు తెచ్చాడు. తనకు ఎర్ర బుగ్గ పెట్టుకునే అనుమతి బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిందన్నాడు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ చెబితే తాను తీసేయనని ప్రకటించాడు! అసలు ఈ బ్రిటీష్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు! అయితే, బర్కతి గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఈ ఎర్ర బుగ్గ అంశం విషయంలో ఆయన మాటలు విని ఆశ్చర్యపోవటం లేదు. ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది! ఇమామ్ గా తనకున్న లాల్ బత్తి సౌకర్యాన్ని వదిలేది లేదని చెప్పిన ఆయన అదే మీటింగ్ లో బీజేపి, ఆరెస్సెస్ కోసం ఎవరైనా ముస్లిమ్ లు పని చేస్తే చితగ్గొడతామని అన్నాడు. వాళ్లని ఇస్లామ్ నుంచి వెలి వేస్తామని కూడా హెచ్చరించాడు. ఇక ఎవరైనా మసీదుల ముందు జై శ్రీరామ్ అంటే వారు హిజ్రాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు!   గతంలో ఈ ఎర్ర బుగ్గ ఇమామ్ మోదీని టార్గెట్ చేస్తూ ఫత్వా జారీ చేసి కలకలం రేపాడు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని తల , గడ్డం కొరిగి, ఆయన మీద నల్ల ఇంకు పోసిన వారికి 25లక్షలు ఇస్తానని అన్నాడు! బెంగాల్ కు చెందిన ఇమామ్ బర్కతి సహజంగానే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు. అందుకే, ఆయన బీజేపీ, ఆరెస్సెస్, మోదీలపై అగ్గి మీద గుగ్గిలం అవుతుంటాడని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్!

2019లో… టీడీపీ, బీజేపికి ‘పవర్’ ఫుల్ పోరు తప్పదా?

2014 ఎన్నికలు సమైక్యాంధ్రలో జరిగాయి. కాని, అప్పటికే విభజన బిల్లు పాసైపోయింది కాబట్టి పోరు ఏపీ, తెలంగాణలకు వేరు వేరుగానే జరిగింది. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ టీ కాంగ్రెస్ అయితే… ఏపీలో బాబు వర్సెస్ జగన్ గా నడిచింది. కాని, 2019 ఎన్నికలు ఎలా వుండబోతున్నాయి? ఖచ్చితంగా 2014లో అంత సుస్పష్టంగా మత్రం వుండబోవటం లేదు. అందుకు కారణం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరే!   గత ఎన్నికల్లో పోటీ చేయని పవన్ సైకిల్ కి, కమలానికి మద్దతు పలికాడు. కారణాలు ఏమైనా ఆయన సపోర్ట్ కూడా కలిసి వచ్చిన ఎన్డీఏ కూటమి ఏపీని కైవసం చేసుకుంది. కాని, మెల్లమెల్లగా జనంలోకి వచ్చిన జనసేనాని బీజేపి మీద స్వరం పెంచుతూ వచ్చాడు. ప్రత్యేక హోదా నుంచి ఉత్తర , దక్షిణ విభేదాల దాకా పవన్ పంథా చాలా మారిపోయింది. ఇక తాజాగా ఆయన హిట్ లిస్ట్ లో టీడీపీ కూడా చేరినట్టే కనిపిస్తోంది. అప్పుడప్పుడూ ఆయన టీడీపీని టార్గెట్ చేసినా ఇంత వరకూ బీజేపిని విమర్శించినంత ఘాటుగా, నేరుగా దుయ్యబట్టలేదు. కాని, తాజాగా టీటీడీ ఈవో నియామకంపై చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ మరీ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఉత్తరాది ఐపీఎస్ ను సీఎం ఎలా ఎన్నుకున్నారని ప్రశ్నించాడు!   పవన్ , టీడీపీల మధ్య పెరుగుతోన్న అంతరానికి మరో తాజా ఉదాహరణ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు! ఆయన అసలు పవన్ ఎవరో తనకు తెలియదని బాంబు పేల్చారు. ఆయన సినిమా వాడట కదా… నేను సినిమా చూసి చాలా ఏళ్లైపోయింది… అన్నారు. నిజంగా రాజుగారికి పవన్ తెలియదా? అలా భావిస్తే మనమే వెర్రివాళ్లం అవుతాం. కాకపోతే గతంలో పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర విమానాయాన శాఖా మంత్రి అలా అని వుంటారు. ఇంతకు ముందు జనసేనాని ఆయన్ని కేంద్ర మంత్రి పదవి వదిలేసి రమ్మని సవాల్ విసిరాడు. ఎందుకు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పదవి కోసం ప్రత్యేక హోదా విషయంలో కాంప్రమైజ్ అవుతారని సూటిగా కొశన్ చేశాడు!   పవన్ బీజేపిని, అప్పుడప్పుడూ టీడీపీని టార్గెట్ చేస్తున్నా రెండు పార్టీల నాయకులు పెద్దగా ప్రతి విమర్శలు చేస్తున్నట్టు మనకు కనిపించదు. పవన్ లాంటి మాటలే జగన్ మాట్లాడితే ముప్పేట దాడి జరిగిపోయేది ఈపాటికి. కాని, జనంలో, మరీ ముఖ్యంగా యూత్ లో భీభత్సమైన క్రేజ్ వున్న పవర్ స్టార్ తో అనవసర విభేదాలు వద్దన్నట్టు ప్రవర్తిస్తున్నాయి కమలం, సైకిల్. కాని, పవన్ పంథా ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఫైట్ ఇంట్రస్టింగ్ మారిపోవచ్చు. ఒకవైపు టీడీపీ, బీజేపి, మరో వైపు జగన్, ఇంకో వైపు జనసేనతో పవన్ మోహరించవచ్చు. ఇక అప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలతో అట్టుడికిపోవటం ఖాయం! అలాగే, పవన్ ఎంత కీలకంగా మారితే ఎన్నికల ఫలితాలు కూడా అంతే అనూహ్యంగా వుండే ఛాన్స్ వుంది! 

ట్యాంపరైంది ఈవీఎంలా? కేజ్రీవాలా ఇమేజా?

అరవింద్ కేజ్రీవాల్… ఉరఫ్ ఏకే… ఒకప్పుడు ఈ పేరు ఏకే 47లాగా పెద్ద పెద్ద నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది! అన్నా హజారే పక్కన అవినీతి వ్యతిరేక కాగడాలా మెరిసిన ఈ తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చి కూడా సత్తా చాటాడు. దిల్లీని కైవసం చేసుకున్నాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు సీఎం అయ్యాడు. కాని, ఇప్పుడు ఏకే 47 అన్ని దిక్కుల్నుంచీ ఎదురవుతోన్న దాడులకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ట్రిగ్గర్ తాను నొక్కటం కాదు.. ఎవరు ఎప్పుడు ఏ ట్రిగ్గర్ తనపై గురి పెట్టి నొక్కుతారో అర్థం కాక కొంత అయోమయంలో కూడా పడిపోయాడు…   అరవింద్ కేజ్రీవాల్ 67సీట్లతో దిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకున్నాడు. కాని, అక్కడితో ఆగక ఆయన అనుక్షణం ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాల్ని ఒక పట్టు పడదామని ప్లాన్ చేశాడు. అందుకే, డీమానిటైజేషన్ లాంటివి వచ్చినప్పుడు దేశంలోని ఏ సీఎం చేయనంత హంగామా చేశాడు. కాని, ఇక్కడ కేజ్రీవాల్ అనుభవ రాహిత్యం బయటపడింది. కేవలం ఎన్డీఏ సీఎంలే కాదు ఇతర కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రాంతీయ పార్టీల సీఎంలు కూడా ప్రధానితో ప్రతీదానికీ విభేదించరు. అదే పనిగా విమర్శించరు. పీఎం స్థానంలో ఎవరు వున్నా తమ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటూ బండి నెట్టుకొస్తారు. కాని, ఏకే ఏకంగా పీఎం అవ్వాలన్నా తాపత్రయంలో మోదీని అటాక్ చేస్తూ చేస్తూ స్వంత సుడిగుండంలో చిక్కుకున్నాడు!   ప్రజలు తన చేతిలో పెట్టిన దిల్లీ రాష్ట్రాన్ని ఏనాడూ సీరియస్ గా పరిపాలించని కేజ్రీవాల్ మొన్న జరిగిన ఎంసీడీ ఎలక్షన్స్ లో జనం అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాడు. అయినా, ఆయన తన మైండ్ సెట్ మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ ఆప్ ఓటమి ఈవీఎంల వల్ల మాత్రమే జరిగిందంటూ జనాన్ని నమ్మబలికిస్తున్నాడు. దిల్లీ అసెంబ్లీలో ఈవీఎంల ట్యాంపరింగ్ చిటికెలో పనంటూ తన ఎమ్మెల్యే చేత మ్యాజిక్ షో చేయించాడు. అసలు ఇలా ట్రయల్ షో చేసినంత మాత్రాన ప్రూవ్ అయ్యేది ఏంటి? ఎలక్ట్రానికి మిషన్ అనేది ఏదైనా ట్యాంపర్ చేయటం సాధ్యమే. అది అందరూ ఒప్పుకుంటారు. కాని, అసెంబ్లీలోకి తమ స్వంత ఈవీఎంలు ఆప్ తీసుకొచ్చి వాట్ని ట్యాంపర్ చేసినంత మాత్రాన భారత ఎలక్షన్ కమీషన్ ఈవీఎంలు ట్యాంపరైనట్టా? అదెలా సాధ్యం?   ఈవీఎంల గురించి తాను దిల్లీలో గెలిచినప్పుడు, బీహార్లో నీతీష్, లాలు విజయం సాధించినప్పుడూ మాట్లాడని అరవింద్ ఇప్పుడు మాట్లాడటమే విచిత్రం. అంతకంటే విడ్డూరం ఏంటంటే… ఒకవైపు తన స్వంత మినిస్టరే తనపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే ముందు దాని గురించి తేల్చకుండా ఈవీఎంలలోని దోషాలను నిరూపించటం ఓవర్ స్మార్ట్ తనం కాక మరేం అవుతుంది? ఇలా దృష్టి మరల్చే పనుల ద్వారా నెగ్గుకు రావచ్చు అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఆప్ కంటే రెండాకులు ఎక్కువే చేయగలవు! కాని, దిల్లీ జనం కేజ్రీవాల్ ను నమ్మింది ఆయన సంప్రదాయ పార్టీల కంటే భిన్నంగా ఏదో నిజాయితీగా చేస్తాడని! అలాంటి పరిణామాలు ఇంతవరకూ ఏ మాత్రం జరగలేదు!   ఎన్నికల్లో బ్యాడ్ ఫర్పామెన్స్, దిల్లీ పాలనలో దారుణమైన నిర్లక్ష్యం మాత్రమే కాదు… అరవింద్ తన పార్టీని కూడా సరిగ్గా నడుపుతున్నట్టు, నడపగలిగేట్టు కనిపించటం లేదు. దేశంలోని అనేక పార్టీలతో పోల్చితే అత్యంత చిన్న పార్టీ అయినా ఆప్ లో గ్రూపులకు మాత్రం కొదవలేదు. దానికి గుర్తే నిన్నగాక మొన్న తిరుగుబాటు చేసిన కుమార్ విశ్వాస్ వర్గం! అంతకు ముందు పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్! ఇలా కేజ్రీవాల్ పార్టీకి, ప్రభుత్వానికి రెంటికీ ఎసరు తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. చూడాలి మరి… మోదీ, అమిత్ షా లాంటి ఉద్ధండులు వున్న జాతీయ పార్టీ, అధికార పక్షమూ అయిన బీజేపి ఒక వైపు, కేజ్రీవాల్ అన్నీ తానై మోసుకొస్తున్న ఆప్ ఒకవైపు… అంతిమ విజయం ఎవరిదో!

ట్రెండ్ ఫాలో అవ్వని పవర్ స్టార్… ఉత్తరం,దక్షిణంతో ట్రెండ్ క్రియేట్ చేస్తాడా?

  పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఆయన రొటీన్ కి భిన్నంగా వెళతారు. తనకు నచ్చింది చేస్తారు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్లు ఎదురైనా సేఫ్ గేమ్ ఆడటం ఆయన డిక్షనరీలో కనిపించదు! అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలు కాటమరాయుడు దాకా ఇదే తంతు! తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చినా, కొమురం పులి లాంటి డిజాస్టర్ వచ్చినా పవన్ రూటు మారదు! ఎవరూ ఊహించని సినిమాలు చేయటమే పవర్ స్టార్ పంథా! కాకపోతే, ఇదే పద్ధతి పాలిటిక్స్ లో వర్కవుట్ అవుతుందా? రొటీన్ కి భిన్నమైన అంశం నెత్తికెత్తుకుని జనంలోకి వెళితే… జనసేనాని మద్దతు పొందగలరా? రానున్న ఎన్నికలే తేల్చాలి…   అప్పుడెప్పుడో తమిళ కురు వృద్ధుడు కరుణానిధి మంచి యవ్వనంలో వుండగా ఉత్తర, దక్షిణ భారతదేశాల గొడవ భీభత్సంగా వుండేది. హిందీ అంటే చాలు హింసాత్మకమైపోయే వారు తమిళ తంబీలు! కాని, కాలక్రమంలో కరుణానిధి కూడా జన జీవన స్రవంతిలో కలవక తప్పలేదు! దక్షిణాది వాడైన ఆదిశంకరులు ఉత్తరాదికి వెళ్లారు. ఉత్తరాదిలో అవతరించిన శ్రీరాముడు శ్రీలంకదాకా దక్షిణాదినంతా పావనం చేశాడు. ఇటువంటి చరిత్ర, నేపథ్యం, సంస్కృతి వున్న దేశంలో ఉత్తర, దక్షిణ పిడకల వేట ఎక్కువ కాలం నడిచేది కాదు! కాని, అదే నెత్తికెత్తుకుంటున్నాడు పవన్….   పవన్ కళ్యాణ్ యాంటీ నార్త్ ట్వీట్లు, నినాదాల పరంపర ప్రత్యేక హోదాతో మొదలైంది. ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ కేంద్రం ఇవ్వలేదు. అది ఖచ్చితంగా తప్పే. కాని, అందుకు సరిపడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు బీజేపీ, టీడీపీ పెద్దలు. దానితో పవర్ స్టార్ సాటిస్ ఫై అయిపోవాలా? అక్కర్లేదు. ప్రత్యేక హోదా వచ్చేదాకా పోరాడాల్సిందే! తెలంగాణ కోసం పదేళ్ల యూపీఏ ప్రభుత్వంతో కేసీఆర్ అలాగే పోరాడారు కూడా. కాని, కేంద్రాన్ని ఒప్పించాల్సిన జనసేన అధ్యక్షుడు అంతకంతకూ ధిక్కార స్వరంతో ఫోకస్ మిస్ అవుతున్నాడని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు!   గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో పదే పదే ఉత్తరాది, దక్షిణాది కామెంట్లు చేస్తోన్న పవన్ కళ్యాణ్ బీజేపీ నేత తరూణ్ విజయ్ పైన కూడా తీవ్రంగా ఫైరయ్యారు. ఇక తాజాగా టీటీడీ ఈవో ఎంపికపై కూడా ఆయన నార్త్, సౌత్ కోణంలో మాట్లాడారు. అమర్ నాథ్, కాశీ, మథురాల్లో దక్షిణాది వారు వుంటారా? మరి ఇక్కడ ఉత్తరాది వారెందుకు అన్నారు! చంద్రబాబు నిర్ణయంపై కూడా ఒకరకంగా నిరసన తెలిపారు! కాని, సామాన్య జనం ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? టీటీడీలో ఉత్తరాది అధికారి వుండటం అంత దారుణమైన పరిణామా? కాకపోవచ్చంటున్నారు రాజకీయ అనలిస్టులు. ఎందుకంటే, తిరుమల తెలుగు వారి ఆధీనంలో వుండొచ్చేమో కాని దేశం నలుమూలల నుంచీ అక్కడికి లక్షలాది మంది వస్తారు. సహజంగానే వేంకటేశ్వరుడ్ని బాలాజీగా భావించే ఉత్తరాది హిందువులు కూడా అందులో వుంటారు. ఇక ఆలిండియా సర్వీస్ అయిన ఐఏఎస్ కేటగిరిలోని వారు ఎక్కడైనా పని చేయవచ్చు. ఇది రాజ్యాంగబద్దమే. కాబట్టి పవన్ ఒక ఐఏఎస్ నియామకంపై విమర్శలు చేయటం సరికాదంటున్నారు అబర్వర్స్.   ఎన్నికలు అంతకంతకూ దగ్గరకొచ్చేస్తోన్న వేళ పవన్ కళ్యాణ్ తన ఉత్తరాది, దక్షిణాది విమర్శల విషయంలో క్లారిటి తెచ్చుకుంటే మంచిది. ఇప్పటికిప్పుడు చర్చకి కారణమయ్యే ట్వీట్ల కన్నా దీర్ఘ కాలంలో జనసేన పార్టీకి మేలు చేసే పోరాటాలే మేలు. చూడాలి మరి… తన కెరీర్ ని ఎవ్వరి సాయం లేకుండా తీర్చిదిద్దుకున్న పవర్ స్టార్ పాలిటిక్స్ లో కూడా సలహాలు, సూచనల కన్నా తన ఇష్టాయిష్టాలు, బలమైన భావాలకే పెద్ద పీట వేస్తారేమో!

రెవెన్యూలో సగం ఉద్యోగులకే... మరి బంగారు తెలంగాణ ఎలా సాధ్యం?

  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు ఉద్యోగుల జీతాలు పెంచుకుంటూ పోతున్న కేసీఆర్‌... రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. బంగారు తెలంగాణ అంటూనే భవిష్యత్‌‌ను అంధకారంలోకి తీసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ అండగా నిలిచారన్న కృతజతతో ఇష్టమొచ్చినట్లు జీతాలు పెంచేస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఇరకాటంలో పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు టీఆర్ఎస్‌ పార్టీకి ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. కేసీఆర్‌కి అండగా నిలిచారు. ఆందోళనలు, ధర్నాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌... ఉద్యోగులను సంతోషపర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగులు నిరాశకు గురి చేయకుండా భారీగా జీతాలు పెంచడం మొదలుపెట్టారు.   2015 మార్చిలో 43 శాతం ఫిట్‌ మెంట్‌ ఇచ్చి....3 లక్షల మంది ఉద్యోగులు, లక్షన్నర మంది పెన్షనర్లను ఆనందంలో ముంచెత్తారు. అంతేకాదు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను 2014 జూన్‌ నుంచి అమలు చేశారు. కేసీఆర్‌ నిర్ణయంతో ప్రభుత్వంపై ఒకేసారి 6వేల 5వందల కోట్ల రూపాయల భారం పడింది. దీనికి తోడు ఏరియర్స్‌ రూపంలో మరో 3వేల 5వందల కోట్ల రూపాయల అదనపు బండ పడింది. తర్వాత 57వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. కేసీఆర్‌ నిర్ణయంతో అదనంగా ప్రభుత్వంపై ఏడాదికి 8వందల కోట్ల రూపాయలు భారం పడింది. అంతేకాదు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ కింద ఉద్యోగులకు 570 కోట్ల రూపాయలు, డీఏ కింద 5వందల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదే సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లకు జీతాలను పెంచారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి మరో 450 కోట్ల రూపాయల భారం పడుతోంది. ఉద్యోగుల జీతాలే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాలను 2016లో పెంచారు.   ఇలా వరుసగా జీతాలు పెంచడంతో.... తెలంగాణ సర్కార్‌కు వచ్చే రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉద్యోగాల జీతాలు 18 వేల 4వందల కోట్ల రూపాయలుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్‌ కాస్తా 25వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం జీతాల భారం 30వేల కోట్ల రూపాయలకు చేరింది. వరుసగా జీతాలు పెంచుతుండటంతో... సర్కారుకు వచ్చే రెవెన్యూలో సగభాగం జీతాలకే వెచ్చించాల్సి వస్తోంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదని, ముందుముందు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

లాలూతో తెగదెంపులు? బీహార్‌లో కొత్త సమీకరణాలు.!

  ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణం కేసుల్లో లాలూపై విచారణ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత ధర్మాసనం.... లాలూపై అభియోగాలను కొట్టివేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టింది. దాణా కుంభకోణంలో లాలూ విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది.   లాలూ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 1996లో దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పశుగ్రాసం పేరుతో 900 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ లాలూపై 4 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో దోషిగా తేలడంతో 2013 అక్టోబర్‌లో కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే అదే ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, మిగతా 3 కేసుల్లో లాలూపై దాఖలైన అభియోగాలను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సీబీఐ సవాల్‌ చేయడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. మిగతా మూడు కేసులతోపాటు, క్రిమినల్‌ కేసును కూడా పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది.   దాణా స్కామ్‌లో లాలూపై మళ్లీ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో బీహార్‌లో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. అవినీతిపరుడైన లాలూతో తెగదెంపులు చేసుకుని.... బీజేపీ మద్దతు తీసుకోవాలంటూ నితీష్‌ కుమార్‌కి బీహార్‌ బీజేపీ చీఫ్‌ సుశీల్‌కుమార్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. మొన్న షాబుద్దీన్‌-లాలూ ఆడియో టేప్‌ బయటికి రావడం, ఇప్పుడు దాణా కేసుల్లో విచారణ జరగనుండటంతో బీహార్‌లో రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

విభజన వాదం వినిపించిన పవన్... కౌంటరిచ్చిన టీడీపీ..!

  టీటీడీ ఈవో నియామక వివాదం మరింత ముదురుతోంది. తెలుగు చదవడం, మాట్లాడటం రాదు, అలాంటి అధికారిని టీటీడీ ఈవోగా ప్రభుత్వం ఎలా నియమించిందని ప్రశ్నించిన శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద...ఇది ఆగమానికి సంబంధించి సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవోగా వ్యవహరించిన సాంబశివరావును బదిలీ చేయడాన్ని కూడా తప్పుబట్టారు. పైగా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సైతం సవాలు చేస్తామని స్వరూపానంద చెప్పారు.   స్వామీజీ విమర్శల వేడి చల్లారక ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాది అధికారిని టీటీడీ ఈవోగా నియమించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాది ఐఏఎస్‌ అధికారులకు తాను వ్యతిరేకం కాదన్న పవన్...అమర్‌నాథ్‌, వారణాసి, మధుర లాంటి ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్‌ ప్రశ్నించారు.   అయితే పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య తప్పు పట్టారు. ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడం మంచి పద్ధతి కాదన్నారు. మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడటం సరికాదని అన్నారు. దక్షిణాది అధికారులకే టీటీడీ ఈవో పదవని ఏ చట్టంలోనూ రాసిలేదని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్‌ చేశారు కదా అని ఏది బడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. మొత్తానికి టీటీడీ ఈవో విషయంలో ప్రభుత్వ నిర్ణయం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది.

టీఆర్‌ఎ‌స్‌కు ఎదురుగాలి? పుంజుకుంటున్న కాంగ్రెస్‌!

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎ‌స్‌కు ఎదురుగాలి వీస్తోందా? ప్రజల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కి మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతోందా? తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం కాంగ్రెస్‌దేనా? అవునంటోంది ఓ వాట్సప్‌ సర్వే. నమ్మడానికి కొంత సందేహం కలిగినా.... ఓ నియోజకవర్గంలో నిర్వహించిన వాట్సప్‌ సర్వేలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. లేటెస్ట్‌ టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ జరిపిన ఈ వాట్సప్ సర్వేలో ప్రస్తుత టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కంటే... కాంగ్రెస్‌ లీడర్‌కే ఎక్కువ ఓట్లు రావడం సంచలనంగా మారింది.   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న పోరాటం సత్ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ వాట్సప్ పోల్‌ నిర్వహించింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా మధు, కాంగ్రెస్ తరపున దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో పాటు మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఈ పోల్‌లో టీఆర్ఎస్  అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా ఓట్లు వేశారు. మొత్తం 611 ఓట్లు నమోదు కాగా.... 345 శ్రీధర్ బాబుకు.... పుట్టా మధుకు 258 ఓట్లు వచ్చాయి. తొలుత పుట్టా మధు ఆధిక్యం కనబరచినా... చివరికి ఓటింగ్‌ శ్రీధర్ బాబు కు అనుకూలంగా మారింది. ఇదే ఇప్పుడు టీకాంగ్రెస్‌ నేతల్లో జోష్‌ పెంచుతోంది.   టీఆర్ఎస్‌ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌ కుటుంబంపైనా తెలంగాణ ప్రజల్లో మెల్లగా వ్యతిరేకత పెరుగుతోందని... 2019 నాటికి అది మరింత ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్‌ మాయ మాటలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. అందుకోసం సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని డిసైడ్‌ అయ్యింది. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి... పార్టీ పరిస్థితిపైనా, అభ్యర్ధిపైనా ఓ అంచనాకి రానుంది. అందులో భాగంగానే మంథనిలో వాట్సప్‌ గ్రూపుల్లో శాంపిల్‌ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే శాంపిల్ సర్వేలో పాజిటివ్ రిజల్ట్‌ రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో 2019 విజయంపై నమ్మకం పెరిగింది. ఒక్క మంథనిలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.