సన్ రైజర్స్ దూకుడుకి కళ్ళెం వేసిన రాయల్ ఛాలెంజర్స్
posted on Apr 10, 2013 7:03AM
మొదటి రెండు మ్యాచ్ విజయాలతో దూకుడుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్రేక్ వేసింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కి దిగిన సన్ రైజర్స్ తడబడుతూ తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 62 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన దశలో బ్యాంటింగ్ కి దిగిన కెమరూన్ వైట్, ఫెరీరా వీరవిహారం చేశారు. వైట్ 34 బంతుల్లో 52 పరుగులు 3 ఫోర్లు, 3 సిక్సర్లు చేసి వినయ్ కుమార్ బౌలింగ్ లో డివిలియర్స్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. పెరీరా 24 బంతుల్లో 40 పరుగులు, 1ఫోర్, 4 సిక్సర్లు బాది ఆర్పీసింగ్ వేసిన అద్భుతమైన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిర్ణీత ఇరవై ఓవర్లలో సన్ రైజర్స్ 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో అక్షిత్ 12 పరుగులు, పార్థివ్ పటేల్ 20 పరుగులు, సంగక్కర 23 పరుగులు, ఆశిష్ 3 పరుగులు, విహారి 4 పరుగులు నాటౌట్, సమంత్రే 2 పరుగులు నాటౌట్. రాయల చాలెంజర్స్ బౌలర్ ఆర్పీ సింగ్ కు మూడు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ మొదటి నుండి దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. వెస్ట్ ఇండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ గేల్ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. కేవలం 13 పరుగులకే వెనుదిరిగాడు. రాయల ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవైపు వికెట్లు పడుతున్నా మనోనిబ్బరంగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చాడు. కోహ్లీ 47 బంతుల్లో 93 పరుగులు 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు కొట్టి నాటౌట్ గా నిలిచాడు. రాయల చాలెంజర్స్ బ్యాట్స్ మెన్ స్కోర్లు మయాంక్ 29పరుగులు, మొదటి మ్యాచ్ ఆడుతున్న డివిలియర్స్ 15 పరుగులు, హేన్రిక్స్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాయల ఛాలెంజర్స్ 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది.