అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఈఐఎల్ ఫౌండేషన్

 

అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్దితో పాటు, ఎం ఎన్ జె కాన్సర్ ఆసుపత్రి  అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణనిస్తున్నదని,  అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము  నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  నిమ్స్ ఆసుపత్రిలో  క్యాన్సర్ బ్లాక్ ను ఎలా అయితే అభివృద్ధి చేసామో అలానే ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.  

ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని  ఆ అవసరాలను తీరుస్తామన్నారు. ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో   బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని  బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఎమ్ ఎన్ జె కాన్సర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు,   , మూసాపేటలోని సాయి  సేవా సంఘ్ లో  విద్యను అభ్యసించే వారికి  బ్లాంకెట్స్ ను సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు.  నగరంలోని సాయి సేవా సంఘ్   విద్యా మందిర్ లో   ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ  పై చదువుల తరువాత  తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. 

 ఈ సంస్థ కొన్ని వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోందని, వాటికి అదనంగా తమ సంస్థ తరపున అదనపు  కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  చిన్న పిల్లలతో గడపడం వల్ల వచ్చే సంతోషం వేరే కార్యక్రమాల వల్ల తనకు రాదన్నారు. అందుకే తాను చిన్న పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.  తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు. తానూ చిన్నగా ఉన్నపుడు కొన్ని అంశాలను ఆమె ద్వారా  స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు. 

చిన్నపుడు తీసుకునే సరైన నిర్ణయాలు అందరి జీవితాలను ఒక మలుపు తిప్పుతాయని, అందువల్లే ప్రతి ఒక్కరు చిన్న వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.   ప్రస్తుతం ప్రతి ఒక్కరు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందుల నుంచి బైట పడేసేందుకు తమ  ఫౌండేషన్ల తరఫున సాయం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, దీన్ని విస్తరిస్తామని తెలిపారు  

చలికాలంలో  అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు.  ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి  బ్లాంకెట్స్,   పండ్లు పంపిణీ చేశారు. తాము అక్షయ పాత్ర ద్వారా క్యాన్సర్ రోగులకు కొని సంవత్సరాల నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత పరుస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ్ ప్రతినిధులు, ఎం ఎన్  జె క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu