English | Telugu
ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది: మంచు మనోజ్
Updated : Sep 14, 2021
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచారానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారి హత్యాచారానికి గురవ్వడం అందరినీ కలచి వేసింది. ఈ దారుణానికి పాల్పడిన మృగాన్ని చంపేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఆ దుండగుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఆ చిన్నారి కుటుంబసభ్యులను సినీ నటుడు మంచు మనోజ్ పరామర్శించారు.
చిన్నారి మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన తల్లిదండ్రులను ఈరోజు(మంగళవారం) మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారిపై ఇలాంటి దారుణానికి పాల్పడటం క్రూరమైన చర్య అని అన్నారు. ఇలాంటి క్రూరమైన సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని అన్నారు. మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలని.. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాలని చెప్పారు.
ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు చెపుతున్నారని.. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని మనోజ్ అన్నారు. చత్తీస్ గఢ్ లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. అసలు ఇలాంటి రాక్షసులకు 24 గంటల్లో ఉరిశిక్ష విధించాలని అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని మనోజ్ హామీ ఇచ్చారు.