పేర్ని నాని రాజకీయం.. వైసీపీ ఒత్తిడి వల్లేనా?
Publish Date:Feb 23, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని బలవంతపు బ్రాహ్మణార్థం రాజకీయాలు చేస్తున్నారా? అంటే పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం ఔననే అంటున్నారు. ఎందుకంటే.. 2024 ఎన్నికలకు ముందే పేర్ని నాని తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటంచేశారు. ఆ ఎన్నికలలో తాను పోటీ నుంచి తప్పుకుని.. తన కుమారుడు పేర్ని కిట్టును బందర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అప్పట్లోనే తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానని విస్పష్టంగా చెప్పారు. అయితే ఆ ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. బందర్ నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో పేర్ని నాని రాజకీయ రిటైర్మెంట్ నుంచి వెనక్కు రావాల్సి వచ్చింది. ఎందుకంటే.. వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది. ఈ విషయాన్ని పేర్ని నాని స్వయంగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు. తాను రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది తాను స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం కాదని కుండబద్దలు కొట్టారు. తాను బలవంతంగా రాజకీయాలలో కొనసాగుతున్నానని చెప్పారు. తాను కుటుంబంతో గడుపుదామన్న భావనతో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించానని చెప్పిన పేర్ని నాని.. నా దురదృష్టం కొద్దీ మళ్లీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీని నా సేవలు చాలా అవసరమనీ, అందుకే రాజకీయాలలో కొనసాగుతున్నాననీ చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ అధినాయకత్వం బలవంతం మీదే నాని క్రియాశీల రాజకీయాలలో ఇంకా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-forcef-nani-in-politics-45-214512.html




