ప్రజాప్రతినిథుల విందు వెనుక లోకేష్ ప్లానేంటి?
Publish Date:Feb 27, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు, అలాగే రాష్ట్రంలో రానున్న రోజులలో రాజకీయపరిస్థితులు ఎలా మారబోతున్నాయి. క్వాంటం, ఏఐ అంటూ సాంకేతికతపై చంద్రబాబు సర్కార్ చూపుతున్న ప్రాధాన్యత తదితర విషయాలపై ‘వాస్తవ వేదిక’తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ చర్చించారు. అత్యంత విశ్లేషణాత్మకంగా సాగిన ఈ చర్చలో నారా లోకేష్ ఆత్మీయ విందుపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ డిన్నర్ డిప్లమసీని తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారన్నారు. నారా లోకేష్ గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్లతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఆత్మీయ విందును ఒక దౌత్య మార్గంగా లోకేష్ ఎంపిక చేసుకున్నారన్నారు. అంతే కాకుండా ముందుముందు ఆయన సీఎం కావడానికి ఈ ఆత్మీయ విందు కార్యక్రమం పీఆర్ ఎక్సర్ సైజ్ గా డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించారు. గతంలో నారా లోకేష్ తనకంటూ ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ సీనియర్లను దూరం చేసుకున్నారనీ, ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు. అందుకు డిన్నర్ డిప్లమసీని ఎంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈ కార్యక్రమం భవిష్యత్ లో లోకేష్ సీఎం కావడానికి దోహదపడుతుందన్నారు. ఈ దశలో కంఠంనేని రవిశంకర్ లోకేష్ సీఎంగా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడతారా అని ప్రశ్నించారు. దీనికి డోలేంద్ర ప్రసాద్.. లోకేష్ సీఎం కావాలంటే కావలసింది పవన్ కల్యాణ్ సమ్మతి కాదనీ, ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరమని అంటూ.. పవన్ కల్యాణ్ ను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. పైగా ఈ ప్రతిపాదన ఢిల్లీ నుంచే వచ్చిందన్న సమాచారం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోపవన్ కల్యాణ్ సమ్మతి లేకుండా లోకేష్ సీఎం అవ్వడం కష్టసాధ్యమనీ, అందుకే ఆయనకు కేంద్ర మంత్రిపదవి అంటూ మోడీ ద్వారా నరుక్కువస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే బిల్ గేట్స్ తాజా పర్యటన ఉపయోగపడుతుంది తప్ప మరోటి కాదన్నారు. గతంలో బిల్ గేట్స్ ఏపీ పర్యటన మైక్రోసాఫ్ అధినేతగా ఉన్నప్పుడు జరిగిందనీ, అయితే ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగంలో లేరని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు డిల్ గేట్స్ తన ఛారిటీ ద్వారా దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించారనీ, అందువల్ల ఇప్పపటి ఆయన పర్యటన, విద్య, ఆరోగ్యం, పాలనలో టెక్నాలజీకి సహకారం అందే అవకాశం అయితే ఉందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు ఘనంగా, గొప్పగా చెప్పుకుంటున్న క్వాంటం వల్ల రాష్ట్రానికి సాంకేతిక గుర్తింపు లభిస్తుంది తప్ప సామాన్య ప్రజలపై, ఐటీ ఉద్యోగాలపై ఇది ఇప్పటికిప్పుడు చూపే ప్రభావం చాలా చాలా పరిమితమన్నారు. ఇక తక్షణ ప్రయోజనం కూడా దాదాపు శూన్యమేనని డోలేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ కింది లింక్ ద్వారా వీక్షించండి
http://www.teluguone.com/news/content/what-is-the-plan-behind-lokesh-dinner-diplomacy-39-214728.html





