Top Stories

అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక ప్రముఖ దినపత్రిలో గత కొన్ని రోజులుగా క్రైమ్ వార్తలు రాస్తున్న మెట్ల కుమార్ గత నెల 23న తన బైక్, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచీ కనిపించకుండా పోయి మెట్ల కుమార్ గురువారం (జులై 8) ఈస్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో శవంగా కనిపించాడు. మెట్ల కుమార్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి వయస్సు 45 సంవత్సరాలు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ కు తరలించారు.  మెట్ల కుమార్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి Publish Date: Jul 9, 2025 10:21PM

కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం : సీఎం రేవంత్

  గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ఇందుకు శిక్షించాల్సి వస్తే… ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కెసీఆర్ చేసిన పనికి వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిన పరిస్థితిని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీ అనుభవం సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడితే పరిగణలోకి తీసుకుంటాం అవసరమైతే ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మా మంత్రులకు పంపిస్తా కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా. దయచేసి నన్ను పబ్బులు, క్లబ్బుల్లో చర్చకు పిలవొద్దు అన్నారు. ఎవరు పెరిగిన నేపథ్యం వారిని అలా మాట్లాడిస్తుంది. అని పేర్కొన్నారు.
కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం : సీఎం రేవంత్ Publish Date: Jul 9, 2025 9:41PM

యాపిల్‌ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్‌ ఖాన్‌కి బాధ్యతలు

  ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. విలియమ్స్‌ సీవోవో బాధ్యతలను యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సబిప్‌ ఖాన్‌‌కు  ఈ నెల చివర్లో అప్పగించనున్నారు. ఈ క్రమంలో డిజైనింగ్‌ టీమ్‌  బాధ్యతలను నేరుగా టిమ్‌కుక్‌ స్వీకరించనున్నారు.  సబిప్‌ ఖాన్‌ మాలాలు భారత్‌లో ఉన్నాయి. ఆయన యూపీ మొరాదాబాద్‌ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్‌ గ్రేడ్‌ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్‌కు  వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికా కు వెళ్లారు.  1995లో ఆయన యాపిల్‌ ప్రొక్యూటర్‌మెంట్‌ గ్రూప్‌లో పనిచేశారు.
యాపిల్‌ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్‌ ఖాన్‌కి బాధ్యతలు Publish Date: Jul 9, 2025 9:18PM

ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు

  గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.  ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి.   ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.  
ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు Publish Date: Jul 9, 2025 9:07PM

వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు

  గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ. 1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది.  గత జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి. కాగా బుధవారం హుండీ, మ్రొక్కుబడుల లెక్కింపు చేపట్టగా  113 రోజుల కాలపరిమితికి గాను స్వామి వారికి భక్తుల నుండి కానుకుల రూపంలో  46 లక్షల 76 వేల, 204 రూపాయల నగదు, 19 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 319 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి.
వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు Publish Date: Jul 9, 2025 8:51PM

అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ

  గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయ వద్దకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూడగా హుండీ కూడా పగలగొట్టి అందులో ఉన్న సొమ్మును దొంగిలించినట్లు గమనించడం జరిగిందనీ అన్నారు.   ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేయగా ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ ,గుమస్తా వచ్చి చోరీ జరిగినప్పుడు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. శివాలయంలో గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని, సుమారు 15 నుండి 21వేల వరకు సొమ్ము పోయి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ Publish Date: Jul 9, 2025 8:43PM

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

  తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ అవసరాల మేరకు కేంద్ర మంత్రి నడ్డా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కాకుండా, అన్ని జిల్లాలకు యూరియా పంపిణీ చేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు.  సీఎం రేవంత్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న నడ్డా బుధవారం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇటీవల రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి జహీరాబాద్‌ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ, వరంగల్‌ ఎయిర్‌ఫోర్ట్ ఆర్థిక సాయం, హైదరాబాద్‌-విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై చర్చించారు.
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ Publish Date: Jul 9, 2025 7:15PM

హె‌చ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్

  హైదరాబాద్ క్రికెట్  అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. జగన్మోహన్ రావు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని బెదిరించారని నిర్ధారణ కావడంతో ఇవాళ  ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20 శాతం టికెట్లు  ఉచితంగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో.. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన  తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది
హె‌చ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్ Publish Date: Jul 9, 2025 6:43PM

రైతన్నలకు బాబు సర్కార్ తీపి కబురు.. ధ్యానం పాత బకాయిలకు మోక్షం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్‌లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. ఆ క్రమంలో మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ జులై 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో ఈ ధాన్యం బకాయిల సొమ్ము జమ కానుందని తెలుస్తుంది.  ఇదే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.672కోట్లు విడుదలకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 32 వేల మంది రైతులకు ఈ నిధులు మంజూరు ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.  
రైతన్నలకు బాబు సర్కార్ తీపి కబురు.. ధ్యానం పాత బకాయిలకు మోక్షం Publish Date: Jul 9, 2025 5:20PM

అమరావతిలో తొలి అడుగు.. వచ్చే డిసెంబరు నాటికి ఎంఎల్ఏ క్వార్టర్లు సిద్దం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా  అభివృద్ధి చేస్తున్నారు. ఈ సముదాయాలలో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలూ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే సౌర విద్యుత్, గ్రౌండ్ వాటర్ రీచార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ వంటి మెరుగైన వసతులు కల్పిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం (జులై 9)న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల సముదాయాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ క్వార్టర్ల నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వసతి గృహ సముదాయాన్ని మొత్తం 12 టవర్లలో   288 క్వార్టర్లు నిర్మిస్తున్నారు. ఇవి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.  వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని సభాపతి తెలిపారు. అదే విధంగా 35 మంది మంత్రులూ, న్యాయమూర్తుల కోసం కూడా అమరావతిలో క్వార్టర్స్ నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.  స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ నివాస సముదాయాలకు కూడా మంత్రుల క్వార్టర్స్ తో  పాటు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని స్పీకర్ ఈ సందర్భంగా సూచించారు.అలాగే..  బయటి రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అమరావతికి వచ్చినప్పుడు వారికి తాత్కాలిక వసతులు కల్పించేలా కూడా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పోతే సీఎం అధికార నివాసం, రాజ్ భవన్ లు కృష్ణానది ఒడ్డున నిర్మితమౌతాయి.   అదలా ఉంటే.. ఆగస్టు రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తెలుగుదేశం కూటమి ఏడాదిపాలనపై ప్రత్యేక చర్చ సహా వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. 
అమరావతిలో తొలి అడుగు.. వచ్చే డిసెంబరు నాటికి ఎంఎల్ఏ క్వార్టర్లు సిద్దం! Publish Date: Jul 9, 2025 5:06PM

అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్

  పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు. ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్‌ లోపల, బయట, చుట్టుపక్కల పారిశుధ్యం తనిఖీ చేయాలనుకున్న జిల్లా కలెక్టర్, ఆకస్మికంగా క్యాంటీన్‌కు  వెళ్ళారు. భోజనంకు వచ్చిన వారితో  పాటు ఆహారం తింటూ అన్నా కాంటీన్ లో ఆహార నాణ్యత తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్పందనను కోరారు. అన్నా క్యాంటీన్ నాణ్యత, నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి పరిచారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం రోజుకు దాదాపు రూ.90 ఖర్చు చేసి, వారికి రూ.15 కనీస ఖర్చుతో అందిస్తున్నదన్నారు. ప్రజలు అన్నా కాంటీన్ లో ఆహారాన్ని తీసుకోవాలని,  ఆకలితో ఉండకూడదని కోరారు.  క్యాంటీన్‌లో ఏవైనా లోపాలు ఉంటే  తెలియజేయాలని, వాటిని వెంటనే సరిచేస్తామని అన్నారు.
అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్ Publish Date: Jul 9, 2025 5:05PM

ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతిలో చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి    సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది.  ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం సిద్ధమవుతోందట. బనక చర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని చెబుతున్నారు.  
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు Publish Date: Jul 9, 2025 4:55PM

జ‌గ‌న్ పార్టీకి జ‌డ గండం?

మొన్న‌టి విశ్వ‌వ‌సు నామ సంవ‌త్స‌ర ఉగాది పంచాంగం చ‌దువుతుండ‌గా ఆ పండితుడు చెప్పిందేంటంటే జ‌గ‌న్ కి స్త్రీ మూల‌క స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని. ఆ స‌రికే ఆయ‌న త‌న త‌ల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గ‌ట్రా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ్. ఇదే అతి పెద్ద గండం అనుకుంటే ఆయ‌న ఇంటా  బ‌య‌టా కూడా స్త్రీ  మూల‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్న‌ట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొన్న‌టికి మొన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ కార‌ణంగా  భువ‌నేశ్వ‌రి మాత‌ను అన‌రాని మాట‌ల‌ని.. ఆపై అది పార్టీకి అతి  పెద్ద చేటు తెచ్చిన అంశంగా త‌యారైంది. క‌ట్ చేస్తే నేడు ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనే ఈ కోవూరు మాజీ ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న  ప్ర‌శాంతిరెడ్డిని కూడా స‌రిగ్గా ఇలాంటి మాట‌లే అని పార్టీకి మ‌మూలు చెడ్డ పేరు తేలేదు. బేసిగ్గా జ‌గ‌న్ త‌న ప‌థ‌కాల‌న్నిటిలోనూ మ‌హిళ‌లే ప్ర‌ధానంగా ఉండాల‌ని భావించే ర‌కం. ఎందుకంటే మ‌గాళ్ల మూడు, ఓటు ఏ క్ష‌ణం ఎలా ట‌ర్న్ అవుతుందో తెలీదు. అదే మ‌హిళ‌లు అలాక్కాదు. వారి ఓటు- రూటూ అంతా స్ట్రయిట్ గా ఉంటాయ‌ని ఆయన నమ్మకం. అందుకే త‌న ఇంటి నుంచి త‌ల్లి, చెల్లి దూర‌మైనా స‌రే, రాష్ట్రంలో ఇంటింటా ఉన్న మ‌హిళల‌నే తన  త‌ల్లి , చెల్లిగా భావించారాయ‌న‌.  స‌రిగ్గా అదే  స‌మ‌యంలో క‌న్న త‌ల్లి, తోడ‌బుట్టిన చెల్లితో పాటు.. త‌న‌కు సోద‌రి వ‌ర‌స అయ్యే వైయ‌స్ సునీత నుంచి కూడా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కుంటున్నారు జ‌గ‌న్. అంతే కాదు.. ఇటీవ‌ల మాజీ మంత్రి, వైసీపీ మ‌హిళా నేత విడద‌ల ర‌జ‌నీ సైతం జ‌గ‌న్ అంటే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌బ‌రుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌పై ఇన్ని కేసులు న‌మోద‌వుతుంటే పార్టీ నుంచి క‌నీస మ‌ద్ధ‌తు లేద‌ని ర‌జ‌నీ వాపోతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆమె జ‌గ‌న‌న్న‌ను తెగ తిట్టుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి రోజా లోలోన ఎన్ని రాజ‌కీయ‌పు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారో ఆ వెంక‌న్నకే ఎరుక అంటున్నారు. న‌గ‌రి వైసీపీలోకి గాలి సోద‌రుడ్ని సాద‌రంగా ఆహ్వాస్తుండటంతో.. పైకి న‌వ్వుల మేక‌ప్పు వేసుకున్నా.. లోలోన జ‌గ‌న‌న్న‌ను తుక్కు తుక్కుగా తిట్టుకుంటున్నార‌ట  స‌ద‌రు మ‌హిళా నేత రోజా సెల్వ‌మ‌ణి.   దీంతో జ‌గ‌న్ కి ఎటు చూసినా  జ‌డ గండం త‌ప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ లీడ‌ర్ల‌లో దాదాపు సగానికి సగం మంది మ‌హిళ‌లంటే ఎంత మాత్రం గౌర‌వం లేని బాప‌తు.  గంజాయి, మ‌ద్య సేవ‌నంలో ఆరి తేరిన నిష్ణాతులు కావ‌డం వ‌ల్ల‌.. వారికీ సెన్సిబిలిటీ తెలీక పోవ‌డం వ‌ల్ల‌.. మ‌హిళ‌ల‌పై అకార‌ణంగా  నోరు పారేసుకోవ‌డంతో.. జ‌గ‌న్ ప‌ని ఇక్క‌డ త‌థిగిణతోం అయిపోతోందట‌. మొన్న ఎన్నిక‌ల ముందు వంశీ చేసిన మ‌హిళా వ్య‌తిరేక‌ ప్రేలాప‌న‌లు ఎంత చేటు తెచ్చాయో.. తెలిసి కూడా ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనే ఈ నేత మ‌రోమారు మ‌హిళ‌పై చేసిన  కామెంట్లు ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టీని మ‌రో ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యేలా చేస్తున్నాయంటున్నారు. ఇప్ప‌టికే ఒక మ‌హిళ‌ను అన్న పాపానికి 11 కి ప‌రిమిత‌మైంది జ‌గ‌న్ పార్టీ. వ‌చ్చే రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఆ ప‌క్క‌నున్న ఒక‌టి కూడా మాయ‌మ‌వుతుందేమో అన్న టాక్  స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది.
జ‌గ‌న్ పార్టీకి జ‌డ గండం? Publish Date: Jul 9, 2025 4:40PM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

  కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు.  బొజ్జయ్య (55), నారాయణమ్మ (65) ఆస్పుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. కల్లు కాంపౌండ్లలో కల్లు తాగిన వారిలో 15 మంది అస్వస్థతకు గురియ్యారు. హెచ్‌ఎంటీ హిల్స్‌ లోని కల్లు కాంపౌండ్‌ లో కల్లు తాగిన జేఎన్టీయూ అడ్డగుట్టకు చెందిన యోబు, మియాపూర్‌ నందిగడ్డ తండాకు చెందిన దేవదాస్‌, గూగుల్‌ ఫ్లాట్స్‌ 9th ఫేస్‌కు చెందిన పోచవ్వ, జేఎన్టీయూకు చెందిన చాకలి లక్ష్మి, షంషీగూడ కు చెందిన గోవిందమ్మ, పెంటీశ్‌, శాతవాహన నగర్‌ చెందిన యాదగిరి, నరసింహ, మాధవి, మొనప్ప, ఇంద్ర హిల్స్‌ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి నలుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అస్వస్థకు గురైన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌ గౌడ్‌, బి. శ్రీనివాస్‌ గౌడ్, టి. శ్రీనివాస్‌ గౌడ్‌, టి.కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. 
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య Publish Date: Jul 9, 2025 4:27PM

వైసీపీ మెయిల్స్ కుట్రలపై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా  అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. బుధవారం (జులై 9) అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ.. పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈ మెయిళ్లు పెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు.  వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరులతో ఈ మెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని సీఎం మండిపడ్డారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం.. పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిళ్లు పెట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పలువురు మంత్రులు కోరారు. దీనికి స్పందించిన సీఎం.. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసేలా ఈ మెయిళ్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తానన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తు చేశారు.  
వైసీపీ మెయిల్స్ కుట్రలపై చంద్రబాబు ఫైర్ Publish Date: Jul 9, 2025 4:16PM

వేమిరెడ్డి సతీమణికి నారా భువనేశ్వరి సంఘీభావం

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భువనేశ్వరి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో నారా భువనేశ్వరి స్పందించారు. మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతిరెడ్డికి తాను పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు నారా భువనేశ్వరి. ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న భువనేశ్వరి, మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు వారి విలువను తగ్గించలేవన్నారు. మహిళల స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవన్నారు. మన సంస్కృతి, విలువలు ఆడవారిపై గౌరవాన్ని నిలబెట్టాయనీ,  దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ఖండిస్తూ ప్రతి స్త్రీ గౌరవానికి గట్టిగా మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.
వేమిరెడ్డి సతీమణికి నారా భువనేశ్వరి సంఘీభావం Publish Date: Jul 9, 2025 4:03PM

అడుగడుగునా ఉల్లంఘన... పోలీసులపై ఆగ్రహం

    మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగడుగునా ఉల్లంఘన చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి పోలీసులు అనుమతిస్తే వైసీపీ భారీగా జనసమీకరణ చేసింది. ఉదయం 11 నుంచి మధ్యా 1.40 వరకు సైతం మార్కెట్ యార్డు కు చేరుకోలేదు. పోలీసుల భారీ భద్రతా కల్పించిన అనుమతి ఇచ్చిన 500 మంది కంటే 5వేల వరకు జనసమీకరణ చేశారు. రోడ్డు షో వద్దని పోలీసులు వారించినా వినకుండా వైఎస్ జగన్ పర్యటన రోడ్డు షో గా మారింది. నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై మామిడి కాయలు పోసి ట్రాక్టర్లతో తొక్కించిన నానా హడావిడి చేశారు. వైఎస్ జగన్ వాహనం వెంట వచ్చిన నాయకులు వల్ల స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 
అడుగడుగునా ఉల్లంఘన... పోలీసులపై ఆగ్రహం Publish Date: Jul 9, 2025 4:00PM

జర్నలిస్ట్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి

  వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ మీడియా  ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు. సుమారు పది మంది చుట్టు ముట్టి అతడి చొక్కా చించేసి మరీ విచక్షణారహితంగా కొట్టారని శివకుమార్ తెలిపారు. ఉదయం నుంచీ తీసిన ప్రోగ్రాం ఫోటోలు ఉండే మెమరీ కార్డు లాక్కున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైగ చేయడంతో దాడులకు తెగబడ్డారు. చిత్తూరు వైసీపీ ఇంచార్జి విజయానంద రెడ్డి చూస్తుండగానే ఈ దాడి జరిగింది. మెమరీ కార్డు.. విజయానంద రెడ్డి అనుచరుడు చక్రి తీసుకున్నారని . తనపై వైసీపీ గూండాలే దాడికి పాల్పడినట్టు శివకుమార్ తెలిపారు. తన కెమెరా చిప్ లాక్కుని ఫోటోలు డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్ట్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి Publish Date: Jul 9, 2025 3:49PM

క‘ర్ణాటకం’మళ్ళీ మొదటికి!?

కర్ణాటకం మరోమారు తెరపై కొచ్చింది. నిజానికి.. కర్ణాటకలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే సీరియల్  తెర పైకి వచ్చింది. అయితే..  కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్  ల మధ్య సంధి కుదిర్చింది. ఇద్దరు చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి  పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిర్చి  అప్పటికి ఆ సమస్యను పరిష్కరించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా,డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయినా.. కారణాలు ఏవైనా ఈ రెండు సంవత్సరాలలో ఇద్దరి  మధ్య సంబంధాలు అంత సజావుగా లేవనే విషయంలో ఎలాంటి దాపరికం లేదు.   అదలా ఉంటే..  ఫిఫ్టీఫిఫ్టీ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ప్రకారం సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవలసిన సమయం ఆసన్నం అవుతున్న నేపధ్యంలో గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పుఅంశం  రాష్టంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రముఖంగా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనే వార్తలు కూడా ప్రముఖంగా వినిపించాయి. చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా..  ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని  చెప్పడం ద్వారా సీఎం మార్పు తప్పక పోవచ్చన్న సంకేతాలు ఇచ్చారు.  అయితే..  అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని ఇష్యూని సెటిల్ చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాను రంగంలోకి దించింది. ఆయన మూడు నాలుగు రోజులు  బెంగుళూరులో కూర్చుని, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. సంప్రదింపులు జరిపారు. చివరకు  అధిష్టానం అనుమతి, ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని, ఐదేళ్ళు సిద్దరామయ్య ఒక్కరే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారనీ.. అదే అధిష్టానం నిర్ణయమనీ ప్రకటించారు. నిజానికి..  ఇది ఒక విధంగా డీకే శివకుమార్ వర్గం ఆశించని, ఆ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడని నిర్ణయం.   డీకే వర్గమే కాదు.. జరుగతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేశకులు కూడా ముఖ్యమంత్రి మార్పు ఎంతో దూరంలో లేదు, త్వరలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అవసరం లేదని మీడియా సాక్షిగా ప్రకటించారు. అందుకే అధిష్టానం నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయినా..  డీకే శివకుమార్ మాత్రం ఏం చేస్తాం, అధిష్టానం చెపితే వినాలి  అన్న ధోరణిలో సిద్దరామయ్య ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని  స్వయంగా ప్రకటించారు.  అక్కడితో కర్ణాటకం కథ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పరిస్థితి మళ్ళీమొదటికి వచ్చిందని అంటున్నారు. నిజానికి..  ఇప్పటికీ  ముఖ్యమంత్రి సిద్దరామయ్య  ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నారు. కానీ, తాజా పరిణామాల నేపధ్యంలో  ఆయనకు  పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిన్న మొన్నటి  వరకు ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి అని చెప్పిన  డీకే శివకుమార్  ముఖ్యమంత్రి  పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అంటూ సీఎం కావాలనే తమ మనసులోని ఆశను మరో మారు బహిరంగంగా బయట పెట్టారు. దీంతో మరోమారు ముఖ్యమంత్రి మార్పు అంశం పతాక శీర్షికలకు ఎక్కింది.   ఈ నేపధ్యంలోనే.. తాజాగా డీకే శివకుమార్  అనుకూల వర్గానికి చెందిన ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్..  ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని మరో మారు తెరపైకి తెచ్చారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు డీకే శివకుమార్ కే ఉందని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నారు. డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు ఇదే కోరుకుంటున్నారని యోగేశ్వర్‌ అన్నారు. అయితే..  నిర్ణయం మాత్రం అధిష్ఠానం చేతిలో ఉందన్నారు. డీకేకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరో నేత చెప్పుకొచ్చారు. దీంతో సుర్జేవాల్ దౌత్యంతో పరిష్కారం అయిన ముఖ్యమంత్రి వివాదం.. మళ్లీ మొదటికి వచ్చింది.  నిజానికి.. ఇప్పుడు కూడా  ఈ వివాదం కూడా టీ-కప్పులో తుపానులా సమసి పోతుందని అనుకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు నేతలను   గురువారం( జూలై 10) ఢిల్లీ రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదో జరగబోతోందన్న ఉత్కంఠకు తెరతీసింది.  
క‘ర్ణాటకం’మళ్ళీ మొదటికి!? Publish Date: Jul 9, 2025 3:41PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

  వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.  ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశముంది. ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సంఘటనతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తనపై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ అండగా నిలిచిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.  
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు Publish Date: Jul 9, 2025 3:10PM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ సీజ్

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది. కాగా తాజాగా ఈ కేసులో ఉన్న ఎస్ఐబీ ప్రభాకరరావు ఫోన్ ను, ల్యాప్ టాప్ ను సీజ్ చేసింది. ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ లో ఉన్న డేటా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు కీలకమని సిట్ భావిస్తోంది. ప్రభాకరరావు ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపారు. వాటి రిపోర్టులు వచ్చిన తరువాత  సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు పెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న సిట్.. వాటి ఆధారంగా  2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు సిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ప్రభాకరరావుకు నోటీసులు పంపింది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన తరువాత ప్రభాకరరావుకు సిట్ మరో సారి నోటీసులు జారీ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. ఇక సిట్ అరెస్టుల పర్వం జోరందు కుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ సీజ్ Publish Date: Jul 9, 2025 2:58PM

పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ.  అదీ ఐపీఎల్‌కున్న క్రేజ్‌, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది ఐపీఎల్. అందుకే దాని వాల్యూ కూడా అలా అలా పెరిగిపోతూ వస్తోంది.  ఏడాది కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 12.9 శాతం పెరిగింది. అంటే 18.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది కంటే ఇది 3.9 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అటూ ఇటూగా  1.56 లక్షల కోట్లు.  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ హౌలిహాన్‌ రిలీజ్ చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం బీసీసీఐ మొత్తం నలుగురు స్పాన్సర్లకు అవకాశం ఇచ్చింది. మైఎలెవన్ సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, సియట్.. ఈ నాలుగు స్పాన్సర్లు 14 వందల 85 కోట్ల మనీని జనరెట్ చేశాయి. ఇది లాస్ట్ ఇయర్ కంటే పాతిక శాతం ఎక్కువ. అదే సమయంలో ఈ టోర్నమెంట్‌ స్పాన్సర్‌షిప్‌గా ఉన్న టాటా గ్రూప్‌.. 2028 వరకు డీల్‌ను పొడిగించింది. ఈ డిల్ విలువ 2 వేల 500 కోట్లు. ఈ కారణాలు ఐపీఎల్‌ బ్రాండ్‌ను మరింత పెంచాయి.  ఐపీఎల్‌ ఓకే.. ఇక ఫ్రాంచైజీల విషయానికి వస్తే.. ఈ సారి టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 17 ఏళ్లపాటు కప్పు గెలవకపోతేనే ఈ టీమ్‌ ఫ్యాన్‌ బేస్, బ్రాండ్‌ వాల్యూ చెక్కు చెదరలేదు. ఈసారి కప్పు గెలవడంతో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. గత ఏడాది 227 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ.. ఈ సారి ఏకంగా 269 మిలియన్ డాలర్లకు చేరింది. ఇండియన్‌ కరెన్సీలో చూస్తే 2 వేల 300 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఎప్పటి నుంచో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటున్నాయి. కానీ ఈ ఏడాది ఆర్సీబీ వీటిని బీట్‌ చేసేసింది. ఇక 2 వేల 21 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, 1963 కోట్లతో మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఉన్నాయి. ఈ ఏడాది బ్రాండ్‌ వాల్యూను అమాంతం పెంచుకున్న ఏకైక టీమ్‌ పంజాబ్‌ కింగ్స్. ఈ ఏడాది తమ ఆటతో అందరి మనసులు దోచుకున్న ఈ టీమ్‌ ఏకంగా తమ బ్రాండ్‌ వాల్యూని 39.6 శాతం పెంచుకుంది. ప్రస్తుతం ఈ టీమ్‌ 12 వందల 9 కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో  ఉన్నా.. ఎదుగుదల విషయంలో మాత్రం టాప్‌ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. 1946 కోట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో.. 1320 కోట్లతో  సన్ రైజర్స్ హైదరాబాద్  ఐదోస్థానంలో.. 1303 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో, 1252 కోట్లతో రాజస్థాన్‌ ఏడో స్థానంలో.. 1217 కోట్లతో  గుజరాత్ టైటాన్స్ 8వస్థానంలో నిలిచాయి.  ఇక 1046 కోట్లతో లక్నో చివరి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్  పెరుగుతూ వస్తుంటే..  టీమ్‌ వాల్యూస్ మాత్రం ఆయా జట్ల పర్ఫామెన్స్‌, ఫ్యాన్‌ బేస్‌ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటున్నాయి. మరి నెక్ట్స్‌ సీజన్‌లో ఏ టీమ్‌ వాల్యూ ఎలా మారుతుందో చూడాలి.
పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ Publish Date: Jul 9, 2025 2:25PM

నీటి ఎద్దడి నివారణకు బోర్ పిట్స్.. కేంద్రం సహకారంతో ఏపీ ముందడుగు

నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం,  వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా వేసవితో సంబంధం లేకుండానే నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొందరు నీటి ట్యాంకర్ల దందా చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అలాగే మినరల్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంటు లను నెలకొల్పి నీటిని తోడేస్తున్నారు. నగరాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో  కురిసిన నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు ఉండాలి. ఇంకుడు గుంతల విధానం తో కొంతవరకూ భూగర్భజలాలను కాపాడవచ్చు. అయితే వర్షంపు నీరు ప్రతి చుక్కా భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందుకు ప్రతి ఇల్లు, ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్ మెంట్ లలో ఖాళీ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయ్యాలి. అయితే అందుకు భిన్నంగా ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం గచ్చు చేయించి నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో నీటి ఎద్దడి డేంజర్ బెల్స్ మోగించే పరిస్థితి ఏర్పడుతోంది.  ఇది అరికట్టాలంటే   ఇంకుడు గుంతలు తో పాటు బోర్ పిట్ల ద్వారా నీరు భూమిలోకి ఇంకేలా  మరింత మెరుగైన విధానానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బోరు బావులను తవ్వి దాని చుట్టూ ఇంకుడు గుంతల తరహాలో పెద్దపెద్ద గోతులు తవ్వి వాన,వృధా నీటిని ఒడిసి పట్టి  బోరు ద్వారా భూమిలోకి పంపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఈ తరహా బోర్ పిట్ లను నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది  .మోడల్ ప్రాజెక్టు గా విజయనగరం, సీమ జిల్లాల్లో  బోర్ పిట్ల నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం కేంద్రం నిధులు సమకూరుస్తుంది.   భవిష్యత్ తరాలకు నీటికొరత రాకుండా వాననీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఇందుకుగాను  భూగర్భ జల శాస్త్ర వేత్త లతో ఏపీ సర్కార్  విస్తృతంగా సమాలోచనలు చేసింది. ఈ విధానం వల్ల 80 శాతం అదనంగా భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంటున్నారు.  
నీటి ఎద్దడి నివారణకు బోర్ పిట్స్.. కేంద్రం సహకారంతో ఏపీ ముందడుగు Publish Date: Jul 9, 2025 2:02PM

32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ.. భక్తజన సంద్రంగా మారిన సింహాద్రి అప్పన్న ఆలయం

ప్రతిష్ఠాత్మక సింహాద్రి అప్పన్న ఆలయంలో బుధ, గురు (జులై 9, 10) జరిగే గిరి ప్రదక్షిణకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడు పదిలక్షల మంది వరకూ హాజరౌతారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు జరిగే ఈ గిప్రదక్షిణకు  దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక అధికార బృందం పర్యవేక్షణ కోసం నియమించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.  32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, వైద్య బృందాలు గిరి  ప్రదక్షిణ మార్గం వద్ద ఏర్పాటు చేశారు.  సింహాద్రి అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతి రాజు స్వామి వారి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి   జెండా ఊపి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు.  
32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ.. భక్తజన సంద్రంగా మారిన సింహాద్రి అప్పన్న ఆలయం Publish Date: Jul 9, 2025 1:13PM

ఓవైసీ కాలేజీ అందుకే కూల్చడం లేదంట.. రంగనాథ్ క్లారిటీ

గ్రేటర్‌లో హైడ్రా కూల్చివేతల పర్వం మొదలైనప్పటి నుంచి పాతబస్తీలోని ఒవైసీ విద్యాసంస్థలపై పెద్ద దుమారమే రేగుతోంది. పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, ఒవైసీకి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ స్పందించారు. ఈ కాలేజీని ఎందుకు కూల్చి వేయడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరూ తమని అడుగుతున్నారన్న ఏవీ రంగానాథ్ అన్నారు. ఈ కాలేజీ ఎఫ్‌టీఎల్‌లో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేశామని చెప్పామని గుర్తుచేశారు. కానీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు.  పేద ముస్లిం మహిళలను వెనుక బాటుతనం నుంచి ఒవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోందని అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కావడంతోనే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు ఏవీ రంగానాథ్. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని ఏవీ రంగానాథ్ తేల్చిచెప్పారు. పాతిక ఎకరాల సరస్సును ఫ్లాట్‌గా మార్చిన ఒవైసీ కుటుంబానికి చెందిన సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చివేశామని గుర్తుచేశారు. మజ్లిస్ నాయకుల నుంచి దాదాపు రూ. 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని వెల్లడించారు. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సామాజిక కారణాలతోనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామని అన్నారు . సామాజిక స్పృహతో ఈ కాలేజీ నడుస్తోందని.. అందుకే కూల్చివేయడానికి కాస్త ఆలోచిస్తున్నామని ఏపీ రంగనాథ్ అంటుండటం మానవతావాదుల ప్రశంసలు అందుకుంటున్నా.. రాజకీయ విమర్శలు మాత్రం తప్పడం లేదు.
ఓవైసీ కాలేజీ అందుకే కూల్చడం లేదంట.. రంగనాథ్ క్లారిటీ Publish Date: Jul 9, 2025 12:34PM

బంగారుపాళ్యంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఆ షరతుల మేరకు మార్కెట్ యార్డులో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఎలాంటి అల్లర్లకు చోటులేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తుగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కావాలనే ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు. అయితే పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా సృష్టించారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి మరీ వైసీపీ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారు  వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బంగారు పాళ్యంలోని హెలిప్యాడ్‌కి జగన్ రెడ్డి చేరుకునే సరికి హెలి‌ప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా ఎగబడ్డాయి. వారిని కంట్రోల్ చేయలేక పోలీస్‌లు చేతులు ఎత్తేస్తున్నారు. వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. హెలి‌ప్యాడ్ వద్ద తొక్కిసలాటతో పరిస్థితి గందరగోళంగా మారింది. వైసీపీ నేతల వైఖరితో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వైసీపీ  మూకలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
బంగారుపాళ్యంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు Publish Date: Jul 9, 2025 12:14PM

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాలకే పరిమితం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు.  అయితే ఈ పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో  ఉచిత ప్రయాణం పథకం అమలు అవుతుందనీ, అయితే ఈ పథకంలో ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలు తమ జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చనీ, అయితే జిల్లా దాటితే మాత్రం టికెట్ తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రం అంతటికీ వర్తింప చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అములులో సాధ్యాసాధ్యలన్నిటినీ అధ్యయనం చేసిన అనంతరం జిల్లాలకు పరిమితం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక పోతే  తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ,  పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి వారి కోసం ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని యోచిస్గున్నది.  గుండెజబ్బులు, కిడ్నీల సమస్య, పెరాలసిస్, తలసేమియా, లెప్రసీ,   వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాలకే పరిమితం Publish Date: Jul 9, 2025 11:15AM

నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ ఉరకలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట మట్టానికి నీరు చేరువ అయ్యింది. దీంతో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నీరు నాగార్జున సాగర్ కు ఉరకలేస్తున్నది. దీంతో  దీనితో నాగార్జునసాగర్ జలాశయానికి 1,05,764 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అధికారులు   9,334 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా..  ప్రస్తుతం 534.50 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 177 టీఎంసీలుగా నమోదైంది. 
నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ ఉరకలు Publish Date: Jul 9, 2025 10:53AM

అందరి టార్గెట్ హండ్రెడ్ సీట్స్.. మూడు పార్టీలది ఒకటే క(గో)ల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే..  2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.  నిజానికి..  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో  ఎందుకో ఏమో కానీ ఎన్ని ‘కలలు’ మొదలయ్యాయి. అదికూడా మరెవరో కాకుండా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే  ఎన్ని’కల’లకు శ్రీకారం చుట్టారు.  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో..  వంద అసెంబ్లీ, 15 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ముఖ్యమంత్రి  హామీ ఇవ్వడంతో..  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ‘వంద’ చర్చ మొదలైంది.  నిజానికి.. ప్రస్తుత రాజకీయాల్లో బొమ్మా– బొరుసూ తారుమారు అయ్యేందుకు మూడున్నర సంవత్స రాలు చాలా చాలా ఎక్కువ సమయం. మూడున్నర సంవత్సరాలు కాదు..  మూడున్నర వారాలలో కూడా రాజకీయం ఉల్టాపల్టా అయ్యే అవకాశం ఉందని  నడుస్తున్న చరిత్రే చెపుతోంది. ఎక్కడిదాకానో ఎందుకు..  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు కూడా విశ్వసించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో  హస్త రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. సో.. రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. గెలుపు ఓటములు ఎలా తారుమారు అవుతాయో  నెలల ముందు  ఉహించడం కూడా  ఒక విధంగా సాహసమే అవుతుంది. కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు  ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి, ఎప్పుడో మూడున్నరేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే కలలు కంటున్నాయి. నిజానికి..  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రాజకీయ ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. సో... మూడున్నర సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఇప్పుడే చెప్పడం సాహసం కాదు..  ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. అయినా..  మూడు ప్రధాన పార్టీలూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తునాయి. చప్పట్లు కొట్టి  చిటికెల పందిళ్ళు వేస్తున్నాయి.  అయితే..  అందరికీ తెలిసిన ఈ రాజకీయ సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా అంటే తెలియక కాదు కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకున్న 100 అసెంబ్లీ , 15 లోక్ సభ సీట్ల  రాగాన్ని  బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ అధ్యక్షడు ఎన్. రామచంద్ర రావు ఎత్తు కున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ వందకు ఐదు తక్కువ 95 సీట్లు ఖాయంగా వస్తాయని కేటీఆర్   అంటే..   బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు  కమలానికి వంద సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు.  అంతే  కాదు..  గమ్మత్తుగా రామచంద్ర రావు, ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనేందుకు..  కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అన్నంత సింపుల్ లాజిక్ చెప్పారు. అవును..  తెలంగాణ ప్రజలు పదేళ్లు టీఆర్ఎస్/బీఆర్ఎస్ సుందర ముదనష్ట పాలన చూశారు.  ఇప్పుడు అదే తరహాలో.. ఇంకా చెప్పాలంటే.. అంతకంటే ఘోరంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి..  తెలంగాణ ప్రజలకు బీజేపీని గెలిపించడం తప్ప మరో గత్యంతం లేదన్న రీతిలో చెప్పుకొచ్చారు.  అయితే ఎవరి కలలు ఎలా ఉన్నా.. వాస్తవాలు మరోలా ఆన్నాయని చరిత్ర చెపుతోంది. రీసెంట్  ఉదంతాలనే ఉదాహరణగా తీసుకున్నా..  2024 ఎన్నికల్లో బీజేపీ  చార్ సౌ పార్ (400 ప్లస్) కలలు కంది. ఫలితం ఏమిటో చెప్పనక్కర లేదు..  దో సౌ చాలీస్’ (240) దగ్గరే ఆగిపోయింది. అలాగే.. ఇంకొంచెం వెనక్కి వెళితే, 2023 తెలంగాణ  శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్  కూడా హండ్రెడ్ ప్లస్ (100ప్లస్) పైనే ఆశలు పెట్టుకుంది. కానీ.. 40 దగ్గరే ఆగి పోయింది.(అందులో  ఓ పది సీట్లు ఇప్పటికే జారి పోయాయి అనుకోండి అది వేరే విషయం). అలాగే..  ఇంకో అడుగు వెనక్కివేస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో, మారుమోగిన, సారూ ..కారూ .. పదహారు  స్లోగన్ గురించి చెప్ప నక్కర లేదు.  సో .. రాజకీయ నాయకుల  పగటి కల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ.. రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలు మాత్రం, రాను రాను రాజు గుర్రం గాడిద  సామెతను గుర్తు చేస్తున్నాయి. రోజురోజుకు గీత దాటుతున్నాయి. రోత పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం అయితే సర్వతా వ్యక్తమవుతోందని అంటున్నారు.
అందరి టార్గెట్ హండ్రెడ్ సీట్స్.. మూడు పార్టీలది ఒకటే క(గో)ల Publish Date: Jul 9, 2025 10:31AM