political-news-img

ప్రధాని మోదీకి..కేతన్ తల్లి భావోద్వేగ లేఖ..!

కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త, రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్యకు గురికావడం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ దారుణమైన ఘటన తర్వాత అతని తల్లి రాఖీ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అత్యంత భావోద్వేగపూరితమైన ఈమెయిల్ లేఖ రాశారు. "నా కొడుకు కేతన్ కేవలం ఒక పోలీస్ కేస్ ఫైల్‌గా మిగిలిపోకూడదు" అని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి త్వరితగతిన న్యాయం జరగాలని, నిందితులకు కఠినమైన శిక్ష పడాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు. తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేదా సానుభూతి కోరడం లేదని, కేవలం న్యాయం మాత్రమే కావాలని ఆ తల్లి స్పష్టం చేశారు. ఈ విషాద ఘటన 2026 జూన్ 18వ తేదీన పూణే జిల్లాలోని చారిత్రక లోహాఘడ్ కోట వద్ద జరిగింది. ప్రారంభంలో కేతన్ అగర్వాల్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించినట్లు ప్రచారం జరిగింది. కానీ, పోలీసుల లోతైన విచారణలో ఇది ప్రమాదం కాదు, అత్యంత పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేలింది. కేతన్‌తో ఈ ఏడాది నవంబర్‌లో రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో పెళ్లి నిశ్చయమైన అతని కాబోయే భార్య సియా గోయల్ (20) తన ప్రియుడు చేతన్ చౌదరి (22)తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. హత్యకు ముందు వీరు పూణేలోని లుల్లానగర్ ప్రాంతంలో నిందితులు క్రైమ్ రిహార్సల్స్ కూడా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం జూలై 16 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు. డిజిటల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ దారుణ హత్య అగర్వాల్ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. కొడుకు మరణించిన బాధను తట్టుకోలేక, కేతన్ తాతయ్య కూడా కేవలం 20 రోజుల వ్యవధిలోనే గుండె పగిలి మరణించారు. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో రెండు తరాల పురుషులు కన్నుమూయడం ఆ కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. ఇంట్లోని ప్రతి మూల, కేతన్ గది, బట్టలు, అతని ఫోటోలు చూస్తూ ప్రతిరోజూ రాత్రి తన కొడుకుతో మాట్లాడుతున్నట్లు రాఖీ అగర్వాల్ లేఖలో కన్నీరుమున్నీరయ్యారు. అంతకుముందు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుడి తల్లిదండ్రులు చేస్తున్న ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. Ketan Agarwal murder case, Rakhi Agarwal letter PM Modi, Siya Goyal Pune, Lohagad Fort murder, Chetan Chaudhary, Pune realtor murder justice, Pune District

Publish Date: Jul 14, 2026 6:17PM

political-news-img

భక్తుల విశ్వాసంతో ఆటలా? అయోధ్య ట్రస్ట్ విరాళాల వ్యవహారంలో రాజకీయ యుద్ధం!

భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కోట్ల మంది హిందువుల శతాబ్దాల నిరీక్షణకు, న్యాయపోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రంలో కానుకలు, నగదు, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వ్యవహారంలో ట్రస్ట్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న సిబ్బంది అరెస్టు కావడం, ప్రధాన నిందితుడికి, ప్రముఖ రాజకీయ నాయకులకు మధ్య ఉన్నట్లు చెబుతున్న ఫోన్ సంభాషణల వివరాలు బయటకు రావడం ఈ కేసును కేవలం ఒక క్రిమినల్ దొంగతనంగా కాకుండా, రాజకీయ, న్యాయపరమైన రంగు పులుముకునేలా చేశాయి. విరాళాల ప్రవాహం, అంతర్గత లొసుగులు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు సాగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం దేశవిదేశాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి నగదు, బంగారం రూపంలో విరాళాలు సమర్పించారు. ఇంత పెద్ద మొత్తంలో వచ్చే కానుకల లెక్కింపు కోసం ప్రత్యేక బృందాలు, నిఘా నేత్రాలు, బ్యాంకింగ్ అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, అంతర్గత సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం గమనార్హం. ట్రస్ట్ కీలక బాధ్యుడికి వాహన చోదకుడిగా పనిచేసిన వ్యక్తి, అతని బంధువులు, అలాగే బ్యాంకు నుండి పదవీ విరమణ పొందిన ఒక మాజీ ఉద్యోగి చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని భక్తుల సొమ్మును పక్కదారి పట్టించినట్లు ఆధారాలు లభించాయి. రాజకీయ ఆరోపణల నుండి ఎస్ఐటీ దర్యాప్తు వరకు ఈ భారీ కుంభకోణంపై మొదట రాజకీయ వేదికల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ విరాళాలలో పెద్ద ఎత్తున నిధులు మాయమయ్యాయని విపక్ష నేతలు బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఉత్తరప్రదేశ్ యంత్రాంగం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ రంగంలోకి దించింది. సీనియర్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం ఆలయ కౌంటింగ్ కేంద్రాలు, సీసీటీవీ దృశ్యాలు, బ్యాంకు లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 40 మందికి పైగా అనుమానితులను, సిబ్బందిని విచారించి ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్, సొమ్ము రికవరీ ఎస్ఐటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో నిందితులపై తీవ్రమైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విశ్వాస ఘాతుకం, మోసం, దొంగతనం మరియు నేరపూరిత కుట్ర వంటి సెక్షన్లను చేర్చుతూ పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిని స్థానిక న్యాయస్థానం ముందజరుపగా, తొలుత తక్కువ కాలపరిమితితో కూడిన కస్టడీ విధించి, ఆపై 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుల నుండి సుమారు 80 లక్షల రూపాయల విలువైన నగదు, ఆభరణాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటు అయోధ్యలోని వారి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆస్తుల పత్రాలు, డిజిటల్ పరికరాలను విశ్లేషణ కోసం సీజ్ చేశారు. కాల్ డేటా రికార్డుల సంచలనం, రాజకీయ రగడ ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడి కాల్ డేటా రికార్డులు (సీడీఆర్) ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత రెండు, మూడు సంవత్సరాలుగా సదరు నిందితుడు ఒక ప్రముఖ విపక్ష పార్టీ అధినేతతో వందల సార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు, ముఖ్యంగా ఈ దొంగతనం వ్యవహారం బయటకు వచ్చిన రోజున కూడా మాట్లాడినట్లు కొన్ని నివేదికలు లీక్ అయ్యాయి. ఈ అంశాన్ని అధికార పక్షం ఆయుధంగా మలుచుకుని విమర్శలు గుప్పిస్తుండగా, విపక్షాలు మాత్రం దీనిని తోసిపుచ్చుతున్నాయి. నిందితుడిని బలిపశువును చేసి అసలు పెద్ద తలకాయలను రక్షించేందుకు ట్రస్ట్ నిర్వాహకులే కుట్ర పన్నారని, ఈ కేసుపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక న్యాయవాదుల బహిష్కరణ మరోవైపు ఈ ఘటనపై స్థానిక న్యాయవ్యవస్థలోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫైజాబాద్/అయోధ్య బార్ అసోసియేషన్ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఆలయ సొమ్మును కాజేసిన ఈ ఎనిమిది మంది నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని, ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా, అంతర్గత నిఘాలో విఫలమైన ట్రస్ట్ ఉన్నతాధికారులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల పరిధి నుండి మార్చి, సీబీఐ లేదా హైకోర్టు పర్యవేక్షణలోని స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. భక్తులలో అసంతృప్తి, వ్యవస్థాగత సంస్కరణల ఆవశ్యకత పవిత్రమైన రామ్ లాలా ఆలయంలోనే ఇటువంటి అక్రమాలు చోటుచేసుకోవడం సామాన్య భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దేవుడికి సమర్పించే కానుకల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు ఆలయ పరిపాలనా వ్యవస్థలో తక్షణ మార్పులు రావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు తమ ఆర్థిక లావాదేవీలలో థర్డ్ పార్టీ ఆడిటింగ్ మరియు ప్రజలకు అందుబాటులో ఉండేలా పారదర్శక విధానాలను అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. రామ్ మందిరం నిధుల దుర్వినియోగం కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దర్యాప్తు సంస్థలు సమర్పించే తుది నివేదికలు, న్యాయస్థానం ఇచ్చే తీర్పుల ఆధారంగానే అసలు నిజాలు అధికారికంగా నిర్ధారణ కావలసి ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఉదంతాన్ని వాడుకోవడం కంటే, వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. పారదర్శకమైన విచారణ ద్వారా మాత్రమే ఈ పవిత్ర క్షేత్రం యొక్క కీర్తి ప్రతిష్టలను కాపాడటం సాధ్యమవుతుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. political battle over the Ayodhya Trusts donation scam, Arrest, Accused Ram Temple theft

Publish Date: Jul 14, 2026 6:09PM

political-news-img

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రాయానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా.!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు హోదా ఇస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం (జులై 14) గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 పరిధిలోని సెక్షన్ 4(1) ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో దేశంలోని కేటగిరీ 1 అధీకృత అంతర్జాతీయ విమానాశ్రయాల జాతీయ రిజిస్ట్రీ జాబితాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు 39వ స్థానం లభించింది. ఈ తాజా హోదాతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు, విదేశీ ప్రయాణికులకు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, వీసా చెకింగ్ వంటి ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు చట్టబద్ధమైన మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నెల 10న న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రతిష్టాత్మక లైసెన్స్ పత్రాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఈ లైసెన్స్ స్పష్టం చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనలు, పర్యవేక్షణలో రాబోయే పాతికేళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని అత్యంత వేగంగా లాంచ్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జీఎంఆర్ గ్రూప్ సుమారు 4 వేల 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, 2వేల 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ విమానాశ్రయం వార్షికంగా దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైనయ్యింది. ఇక్కడి టెర్మినల్ భవనం వైశాల్యం 78,000 చదరపు మీటర్లుగా ఉంది. దీని నిర్మాణ శైలి సముద్రంలో ఎగిరే చేప ఆకారంలో ఉండటం విశేషం. టెర్మినల్ లోపలి వెలుపలి డిజైన్లు ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్ర దాయాలు వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ప్రయాణికులు వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి వీలుగా విశాఖపట్నం బీచ్ రోడ్ మార్గం ద్వారా భోగాపురానికి ప్రత్యేక కనెక్టివిటీ రూట్‌తో పాటు మొత్తం 7 అనుసంధాన రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. జూలై చివరి నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్, జీఎంఆర్ ఉన్నతాధికారులతో ఎయిర్‌పోర్ట్ లాంజ్, రన్‌వే, అప్రోచ్ రోడ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రారంభమైన వారం రోజుల నుంచే ఇక్కడ పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. Immigration Check Post Status to Bhogapuram Airport, Rammohan Naidu, Alluri Sitarama Raju Airport, Bhogapuram Airport Inauguration, GMR Bhogapuram Greenfield Airport

Publish Date: Jul 14, 2026 5:59PM

political-news-img

సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో విషాదం.. రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య..!

ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది... ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు వేగంగా వస్తుండగా నలుగురూ పట్టాలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే వీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మృతుల వివరాలు, కుటుంబ నేపథ్యం, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యులు మరియు స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Publish Date: Jul 14, 2026 4:00PM

political-news-img

కాక్రోచ్ జనతా పార్టీ.. ఆరంభ బుస్సు.. ప్రభావం తుస్సు?!

దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థుల హక్కుల కోసం సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించిన కాక్రోచ్ జంతాపార్టీ ఆరంభం అద్భుతం అయినా ప్రభావం మాత్రం శూన్యంగా మారింది. ఆ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజా క్షేత్రంలో ఎటువంటి ప్రభావం చూపలేదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో దాదాపు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, ఒకేసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కాక్రోచ్ జనతాపార్టీ.. వ్యూహ వైభల్యాలతో ఎంత వేగంగా జనాదరణ పొందిందో, అంతే వేగంగా ప్రజల నిరాసక్తతను చవి చూస్తోంది. కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అభిజీత్ దీప్కే వర్చువల్ ప్రపంచంలో చూపిన ఉధృతి.. ఆయన ప్రసంగాలలో ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆరంభంలో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖుల మద్దతు లభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా జన సమూహాలను నిలిపి ఉంచడంలో.. ఉద్యమ తీవ్రతను కాపాడటంలో నాయకత్వం విఫలమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jul 14, 2026 3:52PM

political-news-img

Jr NTR కార్యాలయం కీలక ప్రకటన..!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ 'RAW NTR (రా-ఎన్టీఆర్)' పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ, అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసి, ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగు తున్న 'ఊరు-వాడ' సేవా కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని, రా-ఎన్టీఆర్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా తమ ఆధ్వర్యంలో జరుగుతోందని, ఎన్టీఆర్ ప్రజాసేవ కోసం రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని చేపడుతున్నారని, రాజకీయ అరంగేట్రంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రారంభమవుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై పలు ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం, రా-ఎన్టీఆర్ అనే సంస్థకు, దాని కార్యకలాపాలకు, నిర్వాహకులకు తమతో ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతి నిధ్యం వహించే అధికారం లేదని, ఆయన పేరుతో ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసే హక్కు కూడా లేదని వెల్లడించింది. అలాగే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా అధికారిక సమాచారం అయినా ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని, అనధికార వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కార్యాలయం ప్రజలకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ఇదే తమ చివరి ప్రకటన అని పేర్కొన్న ఎన్టీఆర్ కార్యాలయం, మీడియా, సోషల్ మీడియా వేదికలు, అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, పుకార్లను విశ్వసించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఈ ప్రకటనతో 'రా-ఎన్టీఆర్' పేరుతో జరుగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా స్పష్టత వచ్చినట్లైంది.

Publish Date: Jul 14, 2026 3:47PM

MOVIE NEWS