యుద్ధ విరామం.. రెండు వారాల పాటు శాంతి
Publish Date:Apr 8, 2026
Advertisement
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. ఇరాన్ పై అమెరికా భీకర దాడులకు పాల్పడతామంటూ విధించిన డెడ్ లైన్ ముగుస్తున్న వేళ.. అగ్రరాజ్యాధినేత వెనక్కు తగ్గారు. రెండు వారాల పాటు ఇరాన్ పై సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్పై చేపట్టాలనుకున్న భారీ సైనిక దాడిని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ఉద్రిక్తతలను తగ్గించి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ విరామమని పేర్కొన్నారు. కాగా ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ల దౌత్యం ఉంది. ఇరాన్కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు. కాగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాల్సి ఉంటుందని ట్రంప్ కండీషన్ పెట్టారు. ఈ కండీషన్ కు ఇరాన్ అంగీకరించింది. తమపై దాడులు ఆగితే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని పేర్కొంది. అలాగే ట్రంప్ మరో అడుగు కూడా వెనక్కు వేశారు. తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను తిరస్కరిస్తూ.. ఇరాన్ పంపిన 10 అంశాల శాంతి ప్రతిపాదనపై చర్చలకు సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో శుక్రవారం (ఏప్రిల్ 10) నుంచి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
http://www.teluguone.com/news/content/two-weeks-of-peace-36-216913.html





