వకులామాత ఆలయంలో అక్షరాభ్యాసాలు!
Publish Date:Mar 13, 2026
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం మరో ఆధ్యాత్మిక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణలోని బాసర, వర్గల్ తీరులోనే తిరుపతి సమీపంలోని వకులమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు అక్షర గోవిందం అనే కార్యక్రమాన్ని ప్రారంచనుంది. ఈ కార్యక్రమం ద్వారా మూడు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి తల్లి అయిన వకులమాత ఆశీస్సులతో పిల్లల విద్య ప్రారంభం కావాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి టీటీడీ రూపకల్పన చేసింది. వకులమాత ఆలయం కొండపై ఉండటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయం చెరువు సమీపంలో ప్రత్యేకంగా ఒక మండపాన్ని నిర్మించనుంది. ఆ మండపంలో అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కాగా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలకు టీటీడీ అక్షర గోవిందం కిట్ అందజేస్తుంది. ఈ కిట్ లో పలక, బలపాల బాక్సు, అక్షింతలు, కుంకుమ, శ్రీ వేంకటేశ్వరస్వామి – సరస్వతి దేవి – గణపతి చిత్రాలు, కంకణం, పటిక బెల్లం ప్రసాదం ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించేందుకు టిటిడి సిద్ధమైంది. అందు కోసం దాదాపు 300 కిట్లను సిద్ధం చేసింది.
http://www.teluguone.com/news/content/ttd-launches-new--programme-36-215399.html





