బెయిల్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఎస్సై
Publish Date:Jun 23, 2026
Advertisement
హైదరాబాద్లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే అదే చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించి చివరకు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వి. నరసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఆ కేసు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానంటూ ఎస్సై నరసింహులు ఫిర్యాదిదారుడి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అంత మొత్తం ఇవ్వలేనని ఫిర్యాదిదారుడు చెప్పడంతో ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి. చివరకు తొలి విడతగా రూ.50 వేల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. అయితే ఎస్సై అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, మంగళవారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్లోనే డబ్బులు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదిదారుడి నుంచి ఎస్సై నరసింహులు రూ.50 వేల లంచం తీసుకుంటుండగానే హైదరాబాద్ సిటీ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఆయనను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఆయన సూచించిన ప్రదేశం నుంచి కలుషితమైన రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుంది. తర్వాత గాంధీనగర్ పోలీస్ స్టేషన్లోని ఎస్సై కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించి సంబంధిత పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. విధి నిర్వహణలో నిజాయితీ పాటించాల్సిన బాధ్యతను విస్మరించి, అక్రమ ప్రయోజనం కోసం లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఎస్సై నరసింహులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 94404 46106 వాట్సాప్ నంబర్ ద్వారా లేదా ఏసీబీ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/acb-raid-hyderabad-36-223944.html





