కేటీఆర్ దూకుడు... సాటెవ్వరు?
Publish Date:Jul 28, 2014
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుడిగా నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, వెనుకడుగు వేయని దృఢ సంకల్పంతో, తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన కేటీఆర్ తండ్రితో కలసి విజయాన్ని హత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్వహణలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా, బాధ్యతగల మంత్రిగా దూసుకువెళ్తున్నారు.. అందర్నీ ఆశ్చర్యపరిచేలా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎలాంటి చురుకైన పనితీరును ప్రదర్శిస్తున్నారో మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా అంతే చురుకైన పనితీరును కనబరుస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేటీఆర్ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. రోజుకు రెండు మూడు సెమినార్లలో కూడా పాల్గొని ఐటీ రంగం అభివృద్ధికి సలహాలు ఇస్తూ, సలహాలు తీసుకుంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యంత సమర్థతతో పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ మంత్రులను పోల్చి చూస్తే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దూకుడుకు సాటిగా నిలిచే మంత్రి ఎవరూ కనిపించకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమవంతు పని తాము చేస్తున్నప్పటికీ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడి మీదే భారం వేస్తున్నారు. అయితే కేటీఆర్ మాత్రం విచక్షణతో కూడిన నిర్ణయాలు తానే తీసుకుంటూ అందరిచేతా శభాష్ అనిపించుకునే పనితీరును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిగా కేటీఆర్ ఇప్పటికే ఎన్నెన్నో సమావేశాలు నిర్వహించి మంచి యాక్టివిటీని కనబరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాత్రం ఇంతవరకు ఐటీ రంగానికి సంబంధించిన ఒక్క సమావేశం కూడా జరిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్తోపాటు కేటీఆర్ మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను నెరవేర్చే దిశగానే కేటీఆర్ ముందుకు వెళ్తున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-minister-ktr-progressive-work-45-36577.html