పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ప్లాన్ బాగుంది...
Publish Date:Jul 28, 2014
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ముఖ్యంగా అన్నదాతలు, పేద ప్రజలు కేసీఆర్ తమ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు తెస్తారని ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశతోనే ఎన్నికలలో కేసీఆర్కి పట్టం కట్టారు. కేసీఆర్కి పేదల కష్టం తెలుసు. తెలంగాణ ప్రజలకు ఏమి కావాలో... దానికోసం తాను ఏం చేయాలో కేసీఆర్కి తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన గురించి బాగా తెలిసినవారు చెబుతూ వుంటారు. అయితే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే హైదరాబాద్లోని అక్రమ కట్టడాల మీద కొరడా ఝుళిపించడం, కొన్ని అక్రమ కట్టడాలను కూలగొట్టించడం రకరకాల అనుమానాలకు, అపోహలకు కారణమైంది. అయితే అక్రమ కట్టడాల విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించడం వెనుక చాలా బలమైన కారణం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఎలాంటి విధ్వంసం జరగకూడదని, హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలని కోరుకునే కేసీఆర్, అక్రమ కట్టడాల విషయంలో కొంచెం దూకుడుగా వ్యవహరించడం వెనుక వున్న ప్రధాన ఉద్దేశం ఎవరి ఆస్తులనో నష్టపరచాలని కాదని, దీని వెనుక పేదల సంక్షేమ కాంక్ష బలంగా వుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చట్టప్రకారం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కట్టిన కట్టడాలు హైదరాబాద్లో లక్షల సంఖ్యలో వున్నాయి. ఇలా అక్రమ కట్టడాలు కట్టినవారందరూ సక్రమంగా రుసుములు చెల్లించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటే ఆ డబ్బుతో హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణని, తెలంగాణలోని పేదల జీవితాలను ఎంతో అభివృద్ధి పరచవచ్చు. అయితే అయ్యా, బాబూ అని బతిమాలితే దారికి వచ్చే వారు ఎవరూ లేరు.. అందుకే అక్రమ కట్టడాల నుంచి రుసుములు ముక్కుపిండి వసూలు చేసే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలు చేసిన వారికి చిన్న ‘జలక్’ ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ‘జలక్’తో హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కట్టిన వారిలో కదలిక వచ్చింది. తాము కట్టిన కట్టడాలు నేలమట్టం కాకుండా వుండాలంటే చట్ట ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు చెల్లించేస్తే మంచిదన్న ఉద్దేశం ఇప్పుడు అందరిలో ఏర్పడింది. రేపో ఎల్లుండో ‘అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తాం’ అని ప్రభుత్వం ఒక్క ప్రకటన ఇస్తే చాలు బతుకుజీవుడా అనుకుంటూ తమ కట్టడాలను రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అందరూ సిద్ధంగా వున్నారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు కట్టినవారందరూ రెగ్యులరైజ్ చేయించుకుంటే ఎంత డబ్బు వసూలు అవుతుందన్న అంచనాలు వేస్తే, ఆ డబ్బు 48 వేల కోట్లు అవుతుందని తేలింది. 48 వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు.. ఈ డబ్బుతో కేసీఆర్ ఎన్నికల సందర్భంగా చేసిన రైతు రుణాల మాఫీ వంటి హామీలను విజయవంతంగా నెరవేర్చడంతోపాటు హైదరాబాద్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి అవకాశం వుంది. ఇలా అక్రమ కట్టడాలు కట్టిన వారిలో కదలిక తేవడం కోసమే కేసీఆర్ కొంచెం కఠినంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఏది ఏమైనా పేదల సంక్షేమం కోసం కేసీఆర్ చాలా మంచి ప్లాన్ వేశారన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. కేసీఆర్ కఠినత్వం వెనుక ఇంత మంచి ఉద్దేశం వుందని తెలుసుకున్న కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనకి హేట్సాఫ్ అంటున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-plan-behind-gurukul-trust-45-36565.html