సింగరాయకొండ రైల్వే స్టేషన్లో విషాదం.. రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య..!
Publish Date:Jul 14, 2026
Advertisement
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది... ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు వేగంగా వస్తుండగా నలుగురూ పట్టాలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే వీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మృతుల వివరాలు, కుటుంబ నేపథ్యం, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యులు మరియు స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/singarayakonda-railway-station-36-225980.html





