నిఘా సంస్థల డైరెక్టర్ జనరల్లను మార్చిన కేంద్రం
Publish Date:Jan 15, 2026
Advertisement
జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్ఐఏ డైరెకర్ట్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ను నియమించింది. ఆయన ఈ పదవిలో 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనున్నారు. హిమాచల్ క్యాడర్కు చెందిన అగర్వాల్ 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎన్ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశం ఈ నియామకాన్ని ఆమోదించింది. ఎన్ఐఏ మాజీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్కు పంపింది. దీంతో ఎన్ఐఏ డీజీగా అగర్వాల్కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అగర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అలానే సంక్లిష్ట దర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ఐఏతోపాటు బీఎస్ఎఫ్, ఐటీబీపీలకు కొత్త డైరెక్టర్ జనరళ్లనూ కేంద్రం నియమించింది. సీనియర్ ఐపీఎస్ శతృజీత్ సింగ్ కపూర్ను కేంద్రం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్ కుమార్ను బీఎస్ఎఫ్ కొత్త చీఫ్గా నియమించింది.
http://www.teluguone.com/news/content/rakesh-agarwal-is-the-new-director-general-of-nia-36-212559.html





