సాగు భూములకు మాత్రమే రైతు భరోసా!
Publish Date:Dec 24, 2025
Advertisement
రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలపై మంగళవారం (డిసెంబర్ 23) నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక నుంచి ఈ పథకం నిధులు కేవలం సాగు రైతులకు మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం విచ్చల విడిగా ఈ పథకం నిధులను సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా ఇచ్చి దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై అలా ఇచ్చే ప్రశక్తే లేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు పేరుతో ఉన్న ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రైతు భరోసాగా మార్చారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో రైతన్నలకు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి మొత్తం ఎనిమిది వేలు చెల్లించింది. ఆ తరువాత ఈ పెట్టుబడి సాయాన్ని ఐదు వేల రూపాయలకు పెంచింది. అయితే, ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసాగా ఈ పథకం పేరు మార్చి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఆరు వేల రూపాయలకు పెంచింది. అయితే ఈ పథకం ద్వారా అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/raithu-bharosa-to-cultivated-lands-only-36-211478.html





