రాష్ట్రపతి రేసులో నాలుగో కృష్ణుడు
Publish Date:Jun 21, 2022
Advertisement
రాష్ట్రపతి ఎన్నికకు ఐదు రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 ఆఖరు రోజు. అంటే నామినేషన్ల దాఖలుకు మరో ఏడెనిమిది రోజులు మాత్రమే సమయముంది. అయినా ఇంతవరకు అధికార ,ప్రతిపక్ష కూటములలో ఏ ఒక్కరూ తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. అధికార బీజేపీ/ ఎన్డీఎ కూటమిలో ఏమి జరుగుతోందో, ఎవరు అభ్యర్దో పక్కాగా తేలక పోయినా, నిర్ణయం అయితే ఇప్పటికే జరిగి ఉంటుందని, ఈరోజు జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో, ‘మమ’ అనిపించి అభ్యర్ధి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార కూటమి ఈరోజు కాకున్నా, నామినేషన్ల గడువు ముగిసేందుకు ఒకటి రెండు రోజుల ముందు తమ అభ్యర్ధిని ప్రకటించినా పెద్దగా. ఫరక్ పడదు. అభ్యర్ధి ఎవరైనా గెలుపుకు అవసరం అయిన సంఖ్యా బలం ఉన్న నేపధ్యంలో, అధికార కూటమి అభ్యర్ధి ఎవరన్న విషయంలో ఏవో కొన్ని పేర్లు వినిపిస్తున్నా, ఎక్కడ పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ, ప్రతిపక్ష శిబిరంలో మాత్రం ‘ఉమ్మడి అభ్యర్హి’ ఎంపిక కసరత్తు జోరుగా, అదో ‘ప్రహసనం’లా సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్ధి నిలబెట్టి, ఐక్యతను చాటుకునేందుకు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే ఎందుకనో కానీ, ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే సరికే, కేసీఆర్ మిడిల్ డ్రాప్ పెట్టేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమై పోయిన ఆయన రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించినంత వరకు, ఆటలో అరటి పండులా ఒంటరై పోయారు. అదలా ఉంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్ధి కోసం, ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు ..ఇలా ఇంతవరకు శరద్ పవార్ , ఫరూక్ అబ్దుల్లా, గోపాల గోపాల గాంధీ ముగ్గురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఆ ముగ్గురూ కూడా నో .. అనేశారు. . తమ వల్ల కాదని చేతులెత్తేశారు. నాలుగో కృష్ణుడుగా, యశ్వంత్ సిన్హా పేరు తాజాగా తెర మీదకు వచ్చింది. జస్ట్ 85 ఇయర్స్ సిన్హా అయినా, ఓడిపోయేందుకు సిద్ధమై ఒకే చేస్తారా? అంటే అనుమానమే అంటున్నారు. అలాగే, ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా అందరికీ ఆమోదయోగ్యం అవుతారా అంటే అదీ అనుమానమే అంటున్నారు. ఈరోజు (జూన్ 21) శరద్ పవార్ నివాసంలో జరిగే 17 పార్టీల కూటమి సమవేశంలో డిఎంకే, వామపక్షాలు వేరు వేరు పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవంక ఈ రోజు జరిగే 17 పార్టీల సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కావడం లేదు. ఒక్క మమతా బెనర్జీనే కాదు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరు కావడం లేదు. తెరాస, బిజు జనతదళ్, ఆప్ పార్టీలు మొదటి సమావేశానికి కూడా హాజరుకాలేదు. సో.. ఈరోజు భేటీలో అయినా ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయంతో ఉమంది అభ్యర్హ్దిని ప్రకటిస్తాయా? ప్రకటించగలవా? అంటే అనుమానమే అంటున్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ కమిటీ వేసింది. అయితే, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏదో మొగ్గుబడిగా ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరిపారు, కానీ, బీజేపీ, ప్రతిపక్షాల అనైక్యతను ఎక్స్పోజ్ చేసేందుకు రాష్ట్రపతి ఎన్నికను అవకాశంగా తీసుకుందని పరిశీలకులు అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్ అయితే ఈ క్రతువుకు సంవత్సరం క్రితమే శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం ఇదే జూన్ నెలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో వరసగా రెండు సార్లు సమావేశ మయ్యారు. ఆ తర్వాత కూడా ప్రశాంత్ కిశోర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి పునాదిగా, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగించారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఆయన ప్రయత్నాలు యాల్ సాగుతూనే ఉన్నాయి అనుకొండి అది వేరే విషయం.
http://www.teluguone.com/news/content/president-25-138085.html





