జగన్ పై జనాగ్రహమే.. ఆ హీరోలను దెబ్బేసిందా?
Publish Date:May 5, 2022
Advertisement
ముగ్గురు హీరోలు..మూడు సినిమాలు.. ముగ్గురూ మామూలు హీరోలు కాదు. అశేష్ అభిమాన గణం వారి సొంతం. ఒకరు మెగా హీరో,మరొకరు సూపర్ స్టార్, ఇంకొకరు పాన్ ఇండియా స్టార్. కరోనా విజృంభణ కారణంగా ఏళ్ల తరబడి వీళ్ల సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ అలా కొనసాగుతుండగానే.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వివాదం తెరమీదకు వచ్చింది. వినోదం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఏపీలో సినిమా టికెట్లను భారీగా తగ్గించేస్తూ జగన్ సర్కార్ నిర్ణయించింది. వెంటనే అమలులోనికి తీసుకువచ్చేసింది. జగన్ ఈ హఠాత్ నిర్ణయం వెనుక రాజకీయ నాయకుడిగా క్రియాశీలంగా ఉండి ఏపీ సర్కార్ ను విమర్శలతో దనుమాడుతున్న పవన్ కల్యాణ్ సినిమాను, విపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ సినిమాను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే జగన్ సర్కార్ టికెట్ల వివాదాన్ని తీసుకువచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని వేటినీ లెక్క చేయకుండా జగన్ తన నిర్ణయంతో మొండిగా నిలబడిపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే సినీ పరిశ్రమ టికెట్ల విషయంలో ఏపీ సర్కార్ తో రాయబారాలు నడిపింది. మొత్తబడినట్లు కనిపించిన జగన్ ఆయన లక్ష్యం అని అందరూ అనుకుంటున్న రెండు సినిమాలూ అంటే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయర్, బాలకృష్ణా హీరోగా నటించిన అఖండ సినిమాలు విడుదలయ్యే వరకూ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ లోగా మెగా హీరో చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబులు జగన్ తో బేటీ అయ్యారు. ఏపీలో సినిమా టికెట్లపై పునరాలోచించాలని కోరారు. అందుకు జగన్ అంగీకరించేశారు. టికెట్ల విషయంలో జగన్ తన నిర్ణయం మార్చుకోవడానికి భీమ్లానాయక్, అఖండ సినిమాలు విడుదలయ్యే వరకూ వేచి చూశారు. ఆ తరువాత టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ తరువాత జగన్ ను కలిసిన ముగ్గురు హీరోలలో ఇద్దరు హీరోల సినిమాలు విడుదలయ్యాయి. అ రెండూ బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఇండస్ట్రీ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, మెగాస్టార్ నటించిన మెగా మూవీ ఆచార్యలు ప్లాప్ అయ్యాయి. ఆ స్థాయి హీరోల సినిమాలు ఇంతటి డిజాస్టర్ కావడం అన్నది సాధారణంగా జరగదు. ఓపెనింగ్స్ లోనే సాధారణంగా బయ్యర్లు, నిర్మాతలూ ఒడ్కెక్కేస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ రెండు సినిమాలూ కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయాయి. ఈ రెండు సినిమాల వైఫల్యానికి సినిమా బాగోగులు కాకుండా మరో కారణం ఉందంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ పై ఉన్న జనాగ్రహమే ఈ హీరోల సినిమాలు ప్లాప్ కావడానికి కారణమైందని అంటున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్, బాలకృష్ణ వెన్నెముక నిటారుగా ఉంచుకుని జగన్ ఉద్దేశ పూర్వకంగా తీసుకువచ్చిన టికెట్ల వివాదాన్ని ఎదుర్కొంటే...చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు మాత్రం అమరావతి వెళ్లి జగన్ ను కలిసి బతిమలాడుకోవడం జనానికే కాదు, ఆ హీరోల ఫ్యాన్స్ కు కూడా రుచించలేదని, అందుకే వారు వారి సినిమాలను చూడటానికి ఇష్టపడలేదనీ అంటున్నారు. మరి కొద్ది రోజులలో మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట విడుదల కావలసి ఉంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ సినీ వర్గాలలో నెలకొని ఉంది.
http://www.teluguone.com/news/content/people-anger-on-jagan-reflected-in-movies-result-25-135469.html





