శవాలపై కాసుల వేట.. వైద్యుడి కక్కూర్తి
Publish Date:May 5, 2022
Advertisement
నెల్లూరు జిల్లాలో శవాలపై కాసుల వేట కొనసాగిస్తున్నాడు ఓ ప్రభుత్వ వైద్యుడు. ఆర్ధిక బాధలతో ఆత్మహత్య చేసుకున్న నిరుపేదలను జలగల్లా పీడిస్తున్నాడు ఆ ప్రబుద్ధుడు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అభాగ్యురాలిని పైసల కోసం పిశాచిలా వేధించాడు డాక్టర్ సందాని బాష. శవాన్ని పోస్టుమార్టం చేయాలంటే 16 వేలు లంచం కావాలని ఫోన్ పే నంబర్.. లంచం వివరాలు తెల్ల కాగితంపై దర్జాగా రాసిచ్చాడు. డబ్బులు కాస్త తగ్గించుకోవాలని బాధితురాలి తరఫు వాళ్లు బ్రతిమాలినా కనికరం చూపలేదా డాక్టర్. తనకు.. తన దగ్గర పనిచేసే కాంపౌండర్లకు డబ్బులు పంపమని ఫోన్ లో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. ఇదంతా నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో జరిగింది. ఈ డాక్టర్ వ్యవహారం బట్టబయలు కావడంతో జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతే కాదు ఆయనపై విచారణ జరిపే కొద్దీ గతంలో చేసిన ఘోరాలు ఒక్కొక్కొటి వెలుగులోకి వస్తుండడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. పది మందికీ ప్రాణం పోసి, దేవుడు కావాల్సిన డాక్టరయ్య డబ్బు పిశాచి కావడంతో జనం తిట్టిపోస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి బతుకుదెరువు కోసం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఓ యజమాని దగ్గర పొలం కాపలా కాసేందుకు వచ్చారు. పూటగడవడమే కష్టంగా ఉన్న ఆ పేదల పట్ల వైద్యుడు ప్రవర్తించిన తీరు పలువురి కంట కన్నీరు తెప్పించింది.
http://www.teluguone.com/news/content/doctor-demand-bribe-for-postmartem-25-135472.html





