కొత్త రాష్ట్రపతికి విపక్షాల లేఖ
Publish Date:Jul 27, 2022
Advertisement
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు విపక్ష సభ్యుల సస్పెన్షన్లతో కొనసాగుతోంది. సమావేశాలు ప్రారంభమ రెండో వారంలోకి ప్రవేశించినా ఇప్పటి వరకూ సభ సజావుగా సాగింది లేదు. నినాదాలు, ఆందోళనలు, సస్పెన్షన్లకే పరిమితమైంది. ప్రతిపక్షాలపై కేంద్రం ఈడీ, సీబీఐలను ప్రయోగించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉభయ సభలలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనీ, అయితే కేంద్రం అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదనీ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో నోరెత్తితే సస్పెండ్ చేస్తున్నారనీ, బయట ఆందోళన చేస్తుంటే అరెస్టు చేస్తున్నారనీ, కేంద్రంపై విమర్శలు చేస్తే ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై విపక్షాల సభ్యులు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ), సీబీఐలను కేంద్రం ఉసిగొల్పు తోందనీ, పాత కేసులను తవ్వుతూ, అక్రమంగా కొత్త కేసులను బనాయిస్తోందని వారా లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై మాత్రమే ఈడీ, సీబీఐలు దాడులు చేస్తోందని వారు పేర్కొన్నారు. తమ ఆరోపణలలోని వాస్తవాలను గుర్తించి తగిన విధంగా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని వారా లేఖలో కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. సోనియాగాంధీని ఈడీ విచారణ పేరుతో రోజుల తరబడి మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగితే.. పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన విపక్షాలు కొత్త రాష్ట్రపతికి రాసిన లేఖలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందంటూ పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం, దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్ష ఎంపీలు, నాయకుల ఇళ్లపై దాడులు ఈడీ దాడులను కూడా ప్రతిపక్ష ఎంపీలు తమ సంయుక్త లేఖలో ప్రస్తా వించారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాల హక్కులను కాపా డాల్సిన బాధ్యత దేశ రాష్ట్రపతిపై ఉందని ఉందని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ప్రతిపక్ష ఎంపీలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని వారు ఎండగట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ విపక్షాల పట్ల ఇంత కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు రాసిన లేఖపై కొత్త రాష్ట్రపతి ఎలా స్పంది స్తారో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/opposition-mps-letter-to-new-president-murmu-25-140699.html





