రాష్ట్రపతి ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
Publish Date:Apr 13, 2026
Advertisement
కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి లోకేశ్ వివరించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్తో పాటు ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోకేశ్, ఎంపీలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనను ఇంటెలిజెంట్, విజనరీ నాయకుడిగా అభివర్ణించారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. అందుకు కృషి చేసిన చంద్రబాబు నాయుడిని అభినందించారు. రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకోగా, సోమవారం ఆమెతో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ, అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపారు.ఇక ఢిల్లీలో ఈ నెల 30 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.
http://www.teluguone.com/news/content/nara-lokesh-36-217239.html





